నాడు కొడుకు.. నేడు తండ్రి..! | Road Incident Nellimarla | Sakshi
Sakshi News home page

నాడు కొడుకు.. నేడు తండ్రి..!

Feb 14 2026 9:42 AM | Updated on Feb 14 2026 9:55 AM

Road Incident Nellimarla

నెల్లిమర్ల రూరల్‌: ఒక ఇంటిపై విధి ఎంత క్రూరంగా విరుచుకుపడిందన్నది సారిపల్లి గ్రామం కన్నీళ్లతో చెబుతోంది. ఎనిమిది నెలల కిందట కొడుకును రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఆ తండ్రి... ఇంకా ఆ బాధ నుంచి కోలుకోకముందే అదే తరహా ప్రమాదంలో ప్రా ణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. కాశీయాత్ర నుంచి తిరిగి వస్తూ నాడు కొడుకు, నేడు తండ్రి... అనే మాట గ్రామస్తుల హృదయాలను కలిచివేస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన నడిపేన శ్రీనివాసరావు(58) వృత్తి రీత్యా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగి స్తున్నాడు. మండలంలోని కొండవెలగాడ, చంద్రంపేట, సారిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 40 మంది భక్తులతో ఈ నెల 8న కాశీయాత్రకు వెళ్లిన బస్సుకు ఆయనే డ్రైవర్‌. తిరుగు ప్రయాణంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ జిల్లా బాహానాగ్‌ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. 

ఆ దాటికి బస్సు ముందు భాగంలోని అద్దాలు పగిలి సుమారు 20 అడుగులు ఎత్తు నుంచి బ్రిడ్జి కిందకు పడిపోయాడు. దీంతో తల, కంటి భాగంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా, కొండవెలగాడ గ్రామానికి చెందిన ఎ.సూర్యనారాయణ అనే వ్యక్తి కాలు విరిగిపోయింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ శ్రీనివాసరావు మృతిపై కుండాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

పగబట్టిన ప్రమాదాలు..  
మృతుడు శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరీష్‌ భోగాపురం పోలీస్‌ స్టేషన్‌ లో హోంగార్డుగా డ్రైవర్‌ వృత్తి చేస్తున్నాడు. చిన్న కుమారుడు పురుషోత్తం కూడా తండ్రివలే డ్రైవర్‌ వృత్తి చేస్తూ భక్తులను సుదూర ప్రాంతాల్లో తీర్ధ యాత్రలకు తీసుకువెళ్లేవాడు. సుమారు ఎనిమిది నెలల కిందట భక్తులను కాశీ యాత్రకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

కుమారుడిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోకముందే తండ్రి కూడా ఇదే విధంగా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మరో రెండు రోజుల్లో యాత్ర ముగించుకుని వస్తాడనే లోపే పెనువిషాదం జరగడంతో స్వగ్రామమైన సారిపల్లిలో విషాదం అలుముకుంది. ఓ వైపు గుండె సంబంధిత సమస్య, మరోవైపు కొద్ది నెలల వ్యవధిలోనే కుమారుడు, భర్త మృతితో నడిపేన కాసులమ్మ కన్నీరు మున్నీరుగా విలపించడం.. అక్కడి వారిని కంటతడి తెప్పించింది.  

    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement