ఐఎఫ్ఆర్, మిలాన్లో పాల్గొనేందుకు వస్తున్న వార్షిప్లు
మాల్దీవులు, వియత్నాం, సీషెల్స్, ఫిలిప్పీన్స్ నౌకాదళాలకు ఘన స్వాగతం
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), మిలాన్, ఐవోఎన్ఎస్ చీఫ్ ఆఫ్ నేవీస్ కాంక్లేవ్కు విశాఖ నగరం సిద్ధమవుతోంది. యుద్ధ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఒక్కో దేశానికి చెందిన నౌకాదళాధికారులు, యుద్ధ నౌకలు, సెయిలర్స్ విశాఖ నేవల్ బేస్కు చేరుకుంటున్నారు.
తూర్పు నౌకాదళాధికారులు, నావికులు విదేశీ ప్రతినిధులు, నౌకలకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఈనెల 15 నుంచి ఐఎఫ్ఆర్–2026 ప్రారంభం కానుంది. ఇప్పటికే మాల్దీవులు, వియత్నాం, సీషెల్స్, ఫిలిప్పీన్స్ నౌకాదళాలు విశాఖ చేరుకున్నాయి.
మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బందితో పాటు సీజీఎస్ హరావీ, సీషెల్స్కు చెందిన ఎస్సీజీఎస్ జొరాస్టర్ కోస్ట్గార్డ్ షిప్, వియత్నాంకు చెందిన వార్షిప్లకు తూర్పు నౌకాదళం ఆతిథ్యమందించింది. శుక్రవారం రాత్రి మరికొన్ని దేశాలకు చెందిన నౌకలు వచ్చాయి. శనివారం సాయంత్రానికి వివిధ దేశాలకు చెందిన 23 యుద్ధ నౌకలు విశాఖకు రానున్నాయని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.


