శివస్వాముల శిబిరాల్లో స్నానానికి రూ.30 వసూలు
స్వాముల ఆగ్రహం.. ధర్నా
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, షవర్ బాత్ల వద్ద నీళ్లు రావడంలేదని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శివస్వాములు ధర్నా చేశారు. శుక్రవారం నీటి సరఫరాలో సమస్య తలెత్తుతుండటంతో స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక శివదీక్ష శిబిరాల సమీపంలో ఏర్పాటు చేసిన స్నానపు గదులు, మరుగుదొడ్ల వినియోగానికి రూ.30 చొప్పున బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
సమాచారం తెలుసుకున్న దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, నీటి సరఫరా ఏఈలు ధర్నా చేస్తున్న శివ స్వాముల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వెనుక శివదీక్ష శిబిరాల వైపు సర్వతోభద్రవనం పక్కన ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, షవర్ బాత్లను పరిశీలించి నీటి సమస్యను పరిష్కరించారు. మరుగుదొడ్ల వినియోగానికి టెండర్ నిబంధనల మేరకు రూ.10 మాత్రమే వసూలు చేయాలని అధికారులు హెచ్చరించారు.
అధికంగా వసూలు చేస్తే టెండర్ను రద్దు చేస్తామన్నారు. కాగా రెండు రోజులు క్రితం వరకు మరుగుదొడ్ల వద్ద ఉచితం అని రాసి ఉందని, ఆ తర్వాత బోర్డును తొలగించేసి డబ్బులు వసూలు చేస్తున్నారని శివ స్వాములు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఇంజనీరింగ్ అధికారులు దేవస్థానం శానిటేషన్ అధికారులను సంప్రదించి మరుగుదొడ్లను, స్నానపు గదులను టెండర్ ప్రాతిపదికన ఇచ్చారా లేక ఉచిత పద్ధతిన ఏర్పాటు చేసినవా నిర్ధారించుకొని ఎలాంటి రుసుము చెల్లించవద్దని శివ స్వాములకు సూచించడం గమనార్హం.


