మణికొండ ఫ్రెండ్స్ కాలనీలో రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం
శుక్రవారం ఉదయం 10 గంటలకు 1,651గా నమోదైన ఏక్యూఐ
సాక్షి, హైదరాబాద్: నగరంలో గాలి కాలుష్యం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) వందలు దాటి వేలల్లో నమోదవుతోంది. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ఏక్యూఐ 50 వరకు ఉంటే సేఫ్, 200 దాటితే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఏక్యూఐ ఏకంగా 1,651గా నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం మణికొండ, ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో నమోదైన వివరాలు హాట్ టాపిక్గా మారాయి. ఈ గాలి పీలి్చతే శ్వాసకోశ వ్యాధులు తథ్యమని వైద్యులు పేర్కొంటున్నారు. ఢిల్లీలో ఏక్యూఐ గరిష్టంగా 500గా ఉంటోంది.
అలాంటిది హైదరాబాద్లో దానికి మూడున్నర రెట్లు పెరగడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. మణికొండలో నిర్మాణ రంగ పనులు జోరుగా సాగుతున్నాయి. కొండప్రాంతాల్లో తవ్వకాలు, మట్టి, గ్రావెల్, నిర్మాణ సామగ్రి తరలింపుతో రహదారులు నిత్యం దుమ్ముతో నిండిపోతున్నాయి. ఈ దారిలో వెళ్లాలంటేనే భయమేస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. కళ్లలో దుమ్మూ ధూళితో నిండిపోతున్నాయి. దుస్తులు, శరీరంపై పిండి పడ్డట్లు దుమ్ము చేరుతోందంటున్నారు. రెడీమిక్స్ కేంద్రాల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


