సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో నీట్ యూజీ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదించినట్టు వైద్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2026–27లో నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాల్సిన విద్యార్థులు నీట్ యూజీ రాయాల్సి ఉంటుందని పేర్కొంది.
2025–26లో నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తొలిసారి ఏపీ నర్సింగ్ సెట్ నిర్వహించారు. ఆశించిన స్థాయిలో విద్యార్థులు పరీక్ష రాయలేదు. దీంతో రాష్ట్రంలోని 16 వేల నర్సింగ్ సీట్లలో దాదాపు నాలుగు వేలు భర్తీ కాలేదు. రాష్ట్ర స్థాయి పరీక్షపై ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆసక్తి చూపడంలేదని, అందువల్ల దేశ వ్యాప్తంగా ఆదరణ పొందిన నీట్తో నర్సింగ్ సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు.


