అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నారీ శక్తి గురించి చర్చలు జరుగుతున్నాయి. వయసు మారుతున్న కొద్దీ మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు ‘ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్’ కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ వయసులో ఏయే పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
20 ఏళ్ల ప్రాయంలో వ్యాక్సినేషన్
జీవితంలో అత్యంత చురుగ్గా ఉండే 20 ఏళ్ల వయసులో మహిళలు తమ ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి. ఈ దశలో ప్రధానంగా గర్భాశయ క్యాన్సర్ నివారణకు పాప్ స్మియర్ పరీక్షతో పాటు, హెచ్ పీవీ (HPV) వ్యాక్సినేషన్ తీసుకోవడం ఉత్తమం. వీటితో పాటు రక్తహీనతను గుర్తించే హిమోగ్లోబిన్ పరీక్ష, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలి. నెలసరిలో ఏవైనా అసాధారణ మార్పులు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించడం తప్పనిసరి.
30 ఏళ్లలో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్
ముప్పై ఏళ్లలో అడుగుపెట్టిన తర్వాత సంతానోత్పత్తి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతో పాటు మెటబాలిక్ సమస్యలపై మహిళలు దృష్టి పెట్టాలి. ప్రతి 3 నుంచి 5 ఏళ్లకోసారి పాప్ స్మియర్ పరీక్షను కొనసాగించాలి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలు, విటమిన్ లోపాలను గుర్తించే పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే, ముందస్తుగా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మేలు.
40 ఏళ్లలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్
నలభై ఏళ్లు దాటిన మహిళల్లో 'పెరీ మెనోపాజ్' (మెనోపాజ్ ముందు దశ) లక్షణాలు మొదలవుతాయి. ఈ వయసులో ప్రతి రెండేళ్లకోసారి మమోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు. రక్తపోటు, థైరాయిడ్, హార్మోన్ల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలి. అవసరమైతే ఎముక సాంద్రతను తెలిపే 'బోన్ డెన్సిటీ' పరీక్షను కూడా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
50 ఏళ్లలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ
యాభై ఏళ్ల వయసులో మెనోపాజ్ కారణంగా ఎముకలు బలహీనపడటం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ దశలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, కార్డియాక్ రిస్క్ అసెస్మెంట్, కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. హాట్ ఫ్లాషెస్, నిద్రలేమి తదితర సమస్యలు తీవ్రంగా ఉంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT)పై వైద్యుల సలహా తీసుకోవాలి.
60 ఏళ్ల పైబడిన తర్వాత..
అరవై ఏళ్లు దాటిన తర్వాత కిడ్నీ (RFT), లివర్ (LFT) ఫంక్షన్ టెస్టులతో పాటు జ్ఞాపకశక్తికి సంబంధించిన 'కాగ్నిటివ్ హెల్త్' పరీక్షలు చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాత అకస్మాత్తుగా రక్తస్రావం కావడం లేదా పొత్తికడుపులో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును కలవాలి.
ముందస్తుగా చేయించుకునే ఇటువంటి ఆరోగ్య పరీక్షలు ప్రాణాంతక వ్యాధులను ప్రారంభంలోనే అడ్డుకునేందుకు సహకరిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరీక్షలు చేయించుకోవడం వల్ల చికిత్స ఖర్చు తగ్గడమే కాకుండా, ఆయుష్షు కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ


