ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. దిగ్గజ పారిశ్రామికవేత్తల ముందు నిలబడి నా కంపెనీ విలువ రూ.300 కోట్లు అని చెప్పడం ఒక సాధారణ యువకుడికి పెద్ద సాహసమే!. డిగ్రీలు పూర్తిచేసి 30 ఏళ్ల వయసులో ఉద్యోగాలు చేస్తూ.. బరువు బాధ్యతలు మోసేవాళ్లే సమాజంలో ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఎలాంటి డిగ్రీ లేకుండానే.. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం స్థాపించండం అంటే మాటలా?, అయినా అలాంటిదే నిజం చేసి చూపించారు 'శుభం గుప్తా'. ఇంతకీ ఈయనెవరు, ఈయన స్టార్ట్ చేసిన బిజినెస్ ఏది? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
2011లో ముంబైలో ఏళ్ల యువకుడిగా 12వ తరగతి పూర్తి చేసిన శుభం గుప్తా.. అందరిలా డిగ్రీ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తండ్రి బట్టల వ్యాపారం దివాళా తీసింది. కష్టాలను ఎదుర్కోవడానికి.. జీవితంలో ఎదగడానికి కంకణం కట్టుకున్న శుభం, చిన్న చిన్న పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ.. బిజినెస్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు.
యువతలో స్టైలిష్, కూల్ టీ-షర్టులపై పెరుగుతున్న ఆసక్తిని గమనించిన శుభం గుప్తా.. కొంత డబ్బుతో అక్కడ స్థానికంగా ఉన్న మార్కెట్లలో టీ-షర్ట్స్ కొనుగోలు చేసి, విక్రయించడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారం గురించి బాగా తెలుసుకోవడానికి.. నేరుగా కస్టమర్లతో మాట్లాడి వారి అభిరుచులను అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత ఆన్లైన్ ఆర్డర్లను పంపించడం మొదలుపెట్టాడు.
ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!
2014లో శుభం గుప్తా చేస్తున్న వ్యాపారానికి 'బాంకర్స్ కార్నర్' (Bonkers Corner) అనే పేరు పెట్టాడు. దీనిద్వారా యువత అభిరుచికి తగిన బ్రాండెడ్ స్ట్రీట్ స్టైల్ దేశీ టచ్తో దుస్తులు విక్రయించాడు. పెద్ద మార్కెటింగ్, పెద్ద బడ్జెట్ లేకపోయినా.. కొత్త కొత్త డిజైన్స్ పరిచయం చేసి బ్రాండ్ అంచెలంచెలుగా ఎదిగింది. కాగా ఈయన కంపెనీ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.


