సాధించాలనే తపన, కష్టపడే మనస్తత్వం ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. దీనికి నిదర్శనమే 'కున్హు మొహమ్మద్'. కేరళ నుంచి కేవలం కట్టుకున్న బట్టలతో దుబాయ్ చేరిన ఈయన, సొంతంగా కంపెనీ స్థాపించి.. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేడు ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈయన గురించి, ఈయన సాధించిన సక్సెస్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కేరళకు చెందిన కున్హు మొహమ్మద్ 22 సంవత్సరాల వయసులో.. ఉన్న ఊరును వదిలి, కట్టుబట్టలతో దుబాయ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖ్వాజా మొయిదీన్ అనే చెక్క పడవపై సముద్రంలో.. కొంతమందితో కలిసి 40 రోజులు ప్రయాణం చేసి, ఒమన్లోని దిబ్బా అల్ బయా సమీపానికి చేరుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూసారు. అయితే దేవుడిపై భారం వేసి ప్రయాణం కొనసాగించారు.

మొదటి జీతం
దిబ్బా అల్ బయా నుంచి ఒమన్ సరిహద్దుకు చేరుకోవడానికి తోటి ప్రయాణికులతో కలిసి గంటల తరబడి నడిచారు. ఆ తరువాత పుచ్చకాయలను తీసుకెళ్తున్న ట్రక్కులో ప్రయాణం చేసి షార్జాకు చేరుకున్నారు. కున్హు మొహమ్మద్ అక్కడే ఒక ప్లంబర్ దగ్గర అసిస్టెంట్గా చేరారు. అయితే అతని చేతులు చెమటలు పట్టడం వల్ల.. పనిముట్లను పట్టుకోలేకపోయారు. దీంతో కున్హు ఆ పనిచేయలేకపోయారు. అయితే అప్పటికే అక్కడ 20 రోజులు పనిచేయడం వల్ల 100 రియాల్ పొందారు. ఇదే అతని మొదటి జీతం.
ఆ తరువాత కున్హు మొహమ్మద్.. ఆవులకు పాలు పితకడం, పాత్రలు శుభ్రం చేయడం, చేపల బుట్టలు తయారు చేయడం వంటి ఇతర ఉద్యోగాలను ప్రయత్నించారు. ఒకసారి.. తాను పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడు, యజమాని కారు మురికిగా ఉండటం చూసి దానిని కడిగి, పాలిష్ చేసి, లోపల బుఖూర్ (ధూపం) వేసాను. తాను చేసిన పనికి యజమాని తన జీతం 100 ఖతార్ దుబాయ్ రియాల్స్ పెంచారు.

రస్ అల్-ఖైమా పాలకుడి పరిచయం
కున్హు మొహమ్మద్ స్నేహితుడు ఒకరు.. అప్పటి యుఎఇ నగరమైన రస్ అల్-ఖైమా పాలకుడు షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి పరిచయం చేసారు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత అతను షేక్ ఇంట్లో డ్రైవర్ అయ్యాడు, అక్కడే అతను నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. యజమాని అతన్ని గౌరవంగా చూసుకున్నారు. యజమాని నుంచే.. నమ్మకం & బాధ్యత విలువను మొహమ్మద్ నేర్చుకున్నారు. అదే ఆ తరువాత వ్యాపారం చేయడానికి మార్గమైంది.
1700 మందికి ఉపాధి
1972లో కున్హు మొహమ్మద్ జలీల్ ట్రేడర్స్ కంపెనీ ప్రారంభించారు. తరువాత దానికి జలీల్ హోల్డింగ్స్ అని పేరు మార్చారు. ఈ కంపెనీ అభివృద్ధికి షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎంతో సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ ఆహార పదార్థాల వ్యాపార సంస్థగా మొదలైన కంపెనీ.. ఆ తరువాత తాజా ఉత్పత్తులు & FMCG పంపిణీని నిర్వహించే కంపెనీకి అవతరించింది. ప్రస్తుతం కున్హు మొహమ్మద్ సారథ్యంలోని కంపెనీలో సుమారు 1,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈయన ఎంత ఎదిగిపోయారు అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: అందుకేనా.. హైవేపై గ్రీన్ కలర్ బోర్డులు!


