
పేదరికంలో పుట్టిన ఓ బాలుడు ముక్కపచ్చలారని వయసులో ఉదయాన్నే లేచి పాలు పోసి గడియారం తొమ్మిది కొట్టిందటే ఠంచనుగా బ్యాగ్ భుజాన వేసుకొని స్కూల్ వెళ్లి చదుకునేవాడు. తాను ఉంటున్న ప్రాంతంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా దాదాపు రోజూ 7-8 కిలోమీటర్ల దూరం నడిచేవాడు. పండగల తోటి స్నేహితులు సరదాగా గుడుపుతుంటే తాను మాత్రం బాణసంచా విక్రయిస్తూ కుటుంబ పోషణలో భాగమయ్యేవాడు. విధి తన కష్టాలను గుర్తించింది. ఓ అవకాశం కల్పించింది. దాంతో ప్రస్తుతం తాను దాదాపు రూ.10,790 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
రిజ్వాన్ సాజన్ ముంబయిలోని ఘట్కోపర్లో పేద కుటుంబంలో జన్మించారు. ఓ స్టీల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తన తండ్రి నెలకు రూ.7,000 సంపాదించేవాడు. రిజ్వాన్ తండ్రికి నలుగురు సంతానం. కుటుంబ పోషణకు ఆయన సంపాదన ఏమాత్రమూ సరిపోయేది కాదు. ఎలాగోలా నెట్టుకొచ్చేవారు. ఉన్నట్టుండి కుటుంబ పెద్ద, రిజ్వాన్ తండ్రి అకాల మరణం చెందారు. ఆ సమయంలో రిజ్వాన్కు ఏమి పాలుపోలేదు. కుంటుంబ భారం అంతా తనపై పడింది. ఏదోఒక పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. తాను ఉంటున్న ప్రాంతంలో పాలు పోయడం ప్రారంభించాడు. నిత్యం 7 నుంచి 8 కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణించేవాడు. స్కూల్ ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మానేశాడు. పండగ రోజుల్లో వీధుల్లో బాణసంచా విక్రయించేవాడు.
మేనమామ సాయం
1981లో తన మేనమామ సాయంతో రిజ్వాన్ పని కోసం కువైట్ వెళ్లారు. అక్కడ ఒక సాధారణ భవన నిర్మాణ సామగ్రి దుకాణంలో ట్రయినీ సేల్స్ మ్యాన్గా చేరారు. నెలకు అప్పటి లెక్కల ప్రకారం..రూ.18,000 వచ్చేవి. క్రమంగా ఉద్యోగంలో ఎదుగుతూ ఒక దశాబ్దంలో సేల్స్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 1990లో గల్ఫ్ యుద్ధం కారణంగా కువైట్ నుంచి రావాల్సిన పరిస్థితి ఎదురైంది.
దుబాయ్లో..
కువైట్ నుంచి దుబాయ్ వచ్చిన రిజ్వాన్ ఒక బ్రోకరేజ్ సంస్థలో చేరారు. నిర్మాణ సామగ్రిలో నిరుపయోగం అవుతున్న కొన్ని వస్తువులకు సంబంధించిన అంశాలను గుర్తించారు. 1993లో కొంత పెట్టుబడితో సొంతంగా డాన్యూబ్ పేరుగో రియిల్ఎస్టేట్ వెంచర్ను స్థాపించారు. క్రమంగా ఎదిగి దాన్ని 1.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,790 కోట్లు) వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ఈ కంపెనీ కింది రంగాల్లో సేవలందిస్తోంది.
బిల్డింగ్ మెటీరియల్స్
రియల్ ఎస్టేట్, లగ్జరీ టవర్స్
హోమ్ అలంకరణ
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
ఇదీ చదవండి: వడ్డీరేట్లు సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
దాతృత్వ కార్యక్రమాలు
రిజ్వాన్ సాజన్ దాతృత్వ కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. డాన్యూబ్ వెల్ఫేర్ సెంటర్ ద్వారా ఉచిత న్యాయ సహాయం, మెంటల్ కౌన్సెలింగ్, ఆర్థిక అక్షరాస్యత వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. భారత్, యూఏఈల్లోని నిరుపేద పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తున్నారు. పాఠశాలల మౌలికసదుపాయాలకు నిధులు సమకూరుస్తున్నారు. అల్పాదాయ కుటుంబాలకు ముఖ్యంగా క్రిటికల్ ఇల్నెస్ ఉన్న పిల్లలకు వైద్య చికిత్సలకు సాయం చేస్తున్నారు.