భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ మొబైల్ దిగ్గజాలు వన్ ప్లస్, ఒప్పో తమ ప్రముఖ మోడళ్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాల డిమాండ్ కారణంగా మెమొరీ చిప్లు, హార్డ్వేర్ కాంపోనెంట్ల కొరత తీవ్రమైంది. దీంతో పెరిగిన తయారీ వ్యయాన్ని తట్టుకునేందుకు కంపెనీలు ఈ ధరల పెంపును నేరుగా వినియోగదారులపైకి నెట్టేశాయి.
కొత్త ధరల జాబితా ప్రకారం, ఒప్పో సంస్థ తన రేనో 16 సిరీస్పై గరిష్టంగా రూ.5,000 వరకు పెంచింది. రేనో 16 5G వేరియంట్ల ధరలు రూ.66,999, రూ.71,999కి చేరగా, 'రేనో 16c 5G' మోడళ్లపై రూ.4,000 వరకు అదనపు భారం పడింది. అంతేకాకుండా, అందుబాటు ధరల్లో లభించే ఒప్పో A6s 5G, A6x 5G శ్రేణి ఫోన్ల ధరలు కూడా రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెరిగాయి.
మరోవైపు, వన్ ప్లస్ నోర్డ్ సిరీస్ ధరలను రూ.2,000 నుంచి రూ.4,000 వరకు సవరించింది. వన్ ప్లస్ నోర్డ్ CE 6 లైట్ (8GB+256GB) వేరియంట్పై అత్యధికంగా రూ.4,000 పెంపు నమోదు కాగా, దాని ధర రూ.34,999కి చేరింది. అలాగే నోర్డ్ 6 (12GB+256GB వేరియంట్ రూ.52,999), నోర్డ్ CE 6, ఎన్6, ఎన్6ఎక్స్ మోడళ్ల రీటైల్ ధరలు కూడా పెరిగాయి.
పరిశ్రమ నిపుణుల విశ్లేషణ ప్రకారం, గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా సమస్యలు, పెరిగిన కాంపోనెంట్ వ్యయాల కారణంగా కేవలం ఈ రెండు బ్రాండ్లు మాత్రమే కాకుండా ఇతర స్మార్ట్ఫోన్ కంపెనీలు కూడా ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాబోయే పండగ సీజన్ సేల్స్ వరకు స్మార్ట్ఫోన్ ధరల్లో ఉపశమనం లభించడం కష్టమేనని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదీ చదవండి: బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర..


