కోహ్లీ లేకపోతే.. టీసీఎస్‌ లేదు | FC Kohli Father of Indian IT pivotal role foundation TCS | Sakshi
Sakshi News home page

కోహ్లీ లేకపోతే.. టీసీఎస్‌ లేదు

Mar 28 2025 12:07 PM | Updated on Mar 28 2025 12:12 PM

FC Kohli Father of Indian IT pivotal role foundation TCS

ప్రపంచంలోనే టాప్‌ ఐటీ కంపెనీల్లో ఒకటి.. 6,00,000 మంది ఉద్యోగులు.. దాదాపు 46 దేశాల్లో కార్యకలాపాలు.. సృజనాత్మక పనితనానికి పెట్టింది పేరు.. ఐటీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా వెలుగొందుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) గురించి తెలియనివారుండరు. టాటా గ్రూప్‌ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రతన్‌ టాటా, జేఆర్‌డీ టాటాలు. టీసీఎస్‌ను స్థాపించడం కూడా వారిలో ఒకరి ఆలోచనే అని చాలామంది అనుకుంటారు. కానీ భారతదేశాన్ని ఐటీ రంగంలో ప్రపంచంలో ముందుంచేలా చేసిన టీసీఎస్‌ స్థాపన ఆలోచన ఒక పాకిస్థానీదని తక్కువ మందికే తెలిసుంటుంది. ఆ విశేషాలు ఏమిటో చూసేద్దాం.

భారత ఐటీ పితామహుడు

మార్చి 2025 నాటికి రూ.12.92 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ కలిగిన ప్రపంచ ఐటీ పరిశ్రమలో టాప్‌ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) పుట్టుకకు ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన ‘భారత ఐటీ పితామహుడు’గా పిలువబడే ఫకీర్ చంద్ కోహ్లీ అనే వ్యక్తి. ఆయన చేసిన కృషి టీసీఎస్‌ను ఇండియాలో ఐటీ పవర్ హౌజ్‌గా మార్చేందుకు కారణమైంది. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భారత్ కేంద్రంగా మారేందుకు తోడ్పడింది.

అప్పటి భారత్‌.. ఇప్పటి పాకిస్థాన్‌లో పుట్టి..

భారత్‌-పాకిస్థాన్‌ విభజనకు ముందు 1924లో (అప్పుడు పాకిస్థాన్‌ భారత్‌లోనే ఉండేది) ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఫకీర్ చంద్ కోహ్లీ జన్మించారు. అతని విద్యాభ్యాసం లాహోర్‌లో జరిగింది. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్‌, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. కెనడాలో క్వీన్స్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి సిస్టమ్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

టీసీఎస్‌ పుట్టిందిలా..

కోహ్లీ 1951లో భారతదేశానికి తిరిగి వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరారు. తాను కంప్యూటర్ ఆధారిత ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను ఆధునీకరించడంలో నిష్ణాతుడు. దాంతో త్వరగా సంస్థలో ఎదిగారు. అతడి వినూత్న విధానాలు అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్డీ టాటా దృష్టిని ఆకర్షించాయి. ఆయన కొత్త వెంచర్‌కు నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కోహ్లీలో చూశారు. ఒకరోజు భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందనే ఆలోచనను జేఆర్డీతో పంచుకుంటూ.. అందుకుగల కారణాలను కోహ్లీ విశ్లేషించారు. దాంతో 1968లో టీసీఎస్ ఆవిర్భవించింది. కోహ్లీ దాని సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కంపెనీకి తొలి సీఈఓగా నియామకం అయ్యారు.

కొత్త శిఖరాలకు టీసీఎస్‌

భారత సాంకేతిక మౌలిక సదుపాయాలు అంతగా లేని సమయంలో సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల్లో దేశం  ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని కోహ్లీ ఊహించారు. ఆయన నాయకత్వంలో టీసీఎస్‌ ఒక మోస్తరు కార్యకలాపాల నుంచి దేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా అభివృద్ధి చెందింది. సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రపంచ వేదికపై దేశాన్ని విశ్వసనీయ సంస్థగా నిలిపింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌ వంటి దిగ్గజ సంస్థలతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కోహ్లీ వ్యూహాత్మక దూరదృష్టి ఎంతో తోడ్పడింది. ఇది టీసీఎస్‌ను కొత్త శిఖరాలకు చేర్చింది. 2003 నాటికి కంపెనీ బిలియన్ డాలర్ల(రూ.8,300 కోట్లు) ఆదాయాన్ని సాధించడంలో సహాయపడింది.

నాస్కామ్‌కు అధ్యక్షుడు, ఛైర్మన్‌గా..

భారతదేశం అభివృద్ధి చెందాలంటే బలమైన ఐటీ ఎకోసిస్టమ్ అవసరమని ఆయన అర్థం చేసుకున్నారు. భారతదేశపు ప్రముఖ ఐటీ అడ్వకసీ సంస్థ(న్యాయ కార్యకలాపాలు నిర్వహణ) నాస్కామ్‌కు 1995-1996 కాలంలో అధ్యక్షుడిగా, ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ ఐటీ విధానాలను రూపొందించడంలో, పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి: ఆర్థిక తారతమ్యాల భారతం!

పద్మభూషణ్‌తో సత్కారం

కోహ్లీ ప్రభావం కార్పొరేట్ విజయాలకే పరిమితం కాలేదు. టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా భావి నాయకులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. 1999లో పదవీ విరమణ చేసిన తరువాత కూడా వయోజన అక్షరాస్యత, ప్రాంతీయ ల్యాంగ్వేజీ కంప్యూటింగ్ వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైలైట్‌ చేశారు. 2002లో భారతదేశపు మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. వినియోగదారుల హక్కుల కార్యకర్త, న్యాయవాది స్వర్ణ్ కోహ్లీని వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు సంతానం. తరతరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చిన ఆయన 2020 నవంబర్ 26న తన 96వ ఏట కన్నుమూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement