ఆర్థిక తారతమ్యాల భారతం! | economic inequality problematic india upcoming future | Sakshi
Sakshi News home page

ఆర్థిక తారతమ్యాల భారతం!

Mar 28 2025 10:18 AM | Updated on Mar 28 2025 10:32 AM

economic inequality problematic india upcoming future

భారత్‌తోపాటు అనేక దేశాల్లో ఆర్థిక అసమానతలు అధికం అవుతున్నాయి. ఏటా కుబేరుల సంపద కోట్ల రూపాయలు పెరుగుతుంది.. పేదవారు మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. దేశంలో సరిపోను డబ్బులేక చాలామంది ఆకలి చావులు చస్తుంటే.. ఇంకొందరు రాజభోగాలు అనుభవిస్తున్నారు. అయితే ఇలా భోగాలు పొందుతున్నవారి సంఖ్య మాత్రం చాలా తక్కువే. కానీ వారు విధానాలను శాసించే స్థాయికి చేరుతున్నారు. భారత్‌లో కేవలం 284 మంది చేతిలో మొత్తం దేశ జీడీపీలో మూడొంతుల డబ్బు మూలుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన హురున్‌ రిచ్‌ లిస్ట్‌లోని వివరాల ప్రకారం.. 284 మంది కుబేరులకు భారత్‌ నిలయంగా ఉంది. వీరి మొత్తం సంపద విలువ గతేడాది 10 శాతం పెరిగి రూ.98 లక్షల కోట్లకు చేరింది. భారత దేశ మొత్తం జీడీపీలో (దాదాపు రూ.350 లక్షల కోట్ల) ఇది మూడోవంతు కావడం విశేషం.

అత్యంత ధనవంతులపై పన్నులు

కొద్ది మంది చేతిలోనే ఇలా అపార సంపద పోగైతే భవిష్యత్తులో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తారతమ్యాలు మరింత పెరిగితే సామాజిక అశాంతి నెలకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంతరాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత ధనవంతులపై పన్నులు(సూపర్‌రిచ్‌ ట్యాక్స్‌) విధించాలంటున్నారు. కుబేరులకు వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను విధించాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు.. ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.

దురదృష్టవశాత్తు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలను పరోక్షంగా నడిపించేది ధనవంతులే. దాంతో చట్ట సభల్లో వారి సంపదను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయడానికి ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. కానీ ఆర్థిక అసమానతల వల్ల భవిష్యత్తులో రాబోయే సామాజిక అశాంతిని దృష్టిలో ఉంచుకుని పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది.

అంతరాన్ని పూడ్చడం ఎలా..

భారతదేశ ఆర్థిక అసమతుల్యతను పరిష్కరించడానికి సాహసోపేతమైన చర్యలు అవసరం. సంపద సృష్టి ఒక్కటే సరిపోదనే విషయాన్ని హురున్ రిచ్ లిస్ట్ గుర్తుచేస్తుంది. దానికి అనుగుణంగా సంపదను సమర్థమైన మార్గాల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆక్స్‌ఫామ్‌, వరల్డ్ ఇన్‌ఇక్వాలిటీ ల్యాబ్‌ ప్రతిపాదించిన విధంగా బిలియనీర్లపై సంపద పన్నును అమలు చేయడం వల్ల ఆరోగ్యం, విద్య, పోషకాహార కార్యక్రమాలకు నిధులను సమకూర్చవచ్చు. కేవలం 167 సంపన్న కుటుంబాలపై అదనంగా 2 శాతం పన్ను విధించడం వల్ల జాతీయ ఖజానాలో 0.5 శాతం రాబడి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేయడం, శ్రమ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం వల్ల పేదలకు ఉద్యోగాలు లభిస్తాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉచిత ఆరోగ్య సంరక్షణ, సార్వత్రిక విద్య వంటి ప్రజా సేవలపై పెరిగిన వ్యయం పేదలకు గుదిబండలా మారుతుంది. దీన్ని తగ్గించేలా విధానాలు రూపొందించాలరని చెబుతున్నారు.

ఇదీ చదవండి: 29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్‌లు ఓపెన్‌

ఏం చేయాలంటే..

భారతదేశం 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తుంది. అయితే ఇలా కుబేరుల సంఖ్య పెంచుకుంటూ, వారి సంపదను లెక్కల్లో చూపుతూ ఈ గణత సాధించడంలో అర్థం లేదు. సామాజిక శైలి, సమగ్ర జీవన ప్రమాణాల్లో మార్పు వస్తూ సంపద సృష్టించగలితేనే మేలు జరుగుతుంది. ఈమేరకు విధానాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రయత్నాలు చేయకపోతే కొందరి చేతిల్లోనే సంపద చేరి దేశంలో సామాజిక అశాంతి పెరిగే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement