సందర్భం
కాండీర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్లో పన్నెండు విభాగాలకు చెందిన 117 మంది మహిళలు చోటు సాధించారు. గ్రామీణ రేడియో ‘కన్ ఖజురా టేసన్’తో
మారుమూల పల్లెలకు తమ ప్రాడక్ట్లను పరిచయం చేసిన హిందుస్థాన్ లివర్ సీయీవో, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియా నాయర్...
డ్రోన్, ఏరోస్పేస్ రంగాలలో మహిళల ఉనికి అంతంత మాత్రంగానే ఉన్న కాలంలో ఆ రంగంలోకి అడుగు పెట్టి సత్తా చాటిన ‘గరుడ ఏరోస్పేస్’ కో–ఫౌండర్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రితికా మోహన్...
ఎనిమిది వేల రూపాయల పెట్టుబడితో ఎంటర్ప్రెన్యూర్గా ప్రయాణం ప్రారంభించి కోట్లకు పడగలెత్తిన రెడీ–టు–వేర్ ఎత్నిక్ ఫ్యాషన్ బ్రాండ్ ‘బిబా’ వ్యవస్థాపకురాలు మీనా బింద్రా గురించి...
మిస్డ్కాల్ ఇస్తే చాలు...
హిందుస్థాన్ యూనీలివర్ (హెచ్యుఎల్)లో చేరిన రోజు నుంచే ఆ దిగ్గజ కంపెనీలో స్టార్గా వెలుగుతున్నారు ప్రియా నాయర్. హెచ్యుఎల్లో చేరిన తరువాత తొలిరోజుల్లో నాయర్ చేసిన పని... కొత్త ప్రాడక్ట్ రిలీజ్ కాదు. ‘కన్ ఖజురా టేసన్’ అనే విచిత్రమైన పేరుగల గ్రామీణ రేడియో నిర్వహణ బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. కనెక్టివిటీ తక్కువగా ఉన్న మారుమూల గ్రామాల్లోని పేదప్రజల కోసం ఈ రేడియోను తీసుకువచ్చారు. శ్రోతలు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు పదిహేను నిమిషాల పాటు మ్యూజిక్, జోక్స్ వినిపిస్తారు. దీంతోపాటు తమ బ్రాండ్కు సంబంధించి విషయాలను కూడా వినిపించే ఈ ప్రోగ్రామ్ సూపర్ హిట్.
ఈ గ్రామీణ రేడియోను నాయర్ ప్రారంభించడానికి కారణం....
ప్రియా నాయర్ తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు సాధారణంగా పట్టణ మార్కెట్లో అమ్మే కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండీషనర్ను ఒక పేదరైతు కొనడాన్ని ఆమె గమనించారు. ప్రీమియర్ ప్రాడక్ట్లను పట్టణ ప్రాంతవాసులు మాత్రమే కాదు పల్లెల్లోని పేదలు కూడా కొంటారనే విషయం ప్రియకు అర్థమైంది.‘ ప్రాడక్ట్ గురించి వింటేనే కదా ప్రజలు వాటిని కొనేది’ అనే ఆలోచనతో తమ ప్రాడక్ట్ల గురించి గ్రామీణ ప్రజలకు తెలియజేయడానికి ‘కన్ ఖజురా టేసన్’ పేరుతో గ్రామీణ రేడియోను ప్రారంభించి, మారుమూల గ్రామాల మనసును గెలుచుకున్నారు నాయర్.
రితిక... తనదైన రీతిలో...
‘ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించడానికి స్ట్రాంగ్ ఐడియాలు, స్మార్ట్ స్కిల్స్ అత్యవసరం’ అంటున్నారు ‘గరుడ ఏరోస్పేస్ కో–ఫౌండర్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రితికా మోహన్. డ్రోన్, ఏరో స్పేస్ రంగాలలో మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. మహిళలు ఈ రంగంలో నిలదొక్కుకోవడమే కాదు నాయకత్వ స్థానాల్లో కూడా రాణించగలరని నిరూపించారు.
రితిక ఏరో స్పేస్ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు డ్రోన్ పరిశ్రమ దాదాపుగా ఉనికిలోనే లేదు.
డ్రోన్ తయారీ సంస్థగా గుర్తింపు ఉన్న ‘గరుడ ఏరోస్పేస్’ పైలట్ శిక్షణ, డ్రోన్–యాజ్–ఎ–సర్వీస్ ఆపరేషన్స్, ఏఐ–సామర్థ్యం గల డేటా వర్క్–ఫ్లో... మొదలైన వాటితో డ్రోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా తన పరిధిని విస్తరించుకుంది. కంపెనీకి సంబంధించి మౌలిక సదుపాయాలను నిర్మించడంలో రితిక కీలక పాత్ర పోషించారు.
అయితే రితిక ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. పురుషాధిక్య పక్షపాతాలతో పాటు ఎన్నో రకాల సవాళ్లు ఆమెకు ఎదురయ్యాయి. అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగిన రితిక ‘స్ట్రాంగ్ ఉమన్’ అనిపించుకున్నారు. సవాలు విసిరే సంక్లిష్టమైన ప్రాజెక్ట్లలోకి ‘గరుడ ఏరోస్పేస్’ అడుగు పెట్టినప్పుడు, కంపెనీకి తగిన కార్యాచరణ ప్రణాళికను అందించడంలో రితిక కీలక పాత్ర పోషించారు.
రెడీ టు వేర్తో తొలి అడుగులు
దిల్లీలో పుట్టి పెరిగిన ఎథ్నిక్ వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ఆ రంగంలో మార్గదర్శకురాలిగా నిలిచారు. రెడీ–టు–వేర్ ఫ్యాషన్ బ్రాండ్ ‘బిబా’ను ప్రారంభించడానికి ముందు ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఇంటికే పరిమితం అయ్యారు మీనాబింద్ర. ఇరవైఏళ్ల వయసులో ఆమెకు వివాహం జరిగింది.‘నేవీ ఆఫీసర్ భార్య’గానే మీనాకు గుర్తింపు ఉండేది.
పిల్లలు పెద్దవాళ్లయ్యాక, ఖాళీగా ఉన్న రోజుల్లో వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాలనుకున్నారు మీనా. అయితే ఆమెకు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేదు. నలభై ఏళ్ల వయసులో తన ఇంటినుంచే సాధారణ కాటన్ ప్రింటెడ్ సూట్లను అమ్మడం మొదలు పెట్టారు. అలా 1988లో ‘బిబా’ మొదలైంది. రెడీమెడ్ చుడీదార్–కుర్తాలకు అవసరమైన వస్త్రాలను సేకరించడం సవాలుగా ఉన్న రోజుల్లో ఈ రంగంలోకి అడుగు పెట్టిన మీనా బింద్రా తనదైన ప్రత్యేకతతో మార్కెట్లో దూసుకుపోయారు.
ఎనిమిది వేల రూపాయలతో ప్రారంభమైన చిన్న బొటిక్ను కొట్లాది రూపాయల విలువైన ‘బిబా అపెరల్స్’ కంపెనీగా మార్చారు. దీని వార్షిక టర్నోవర్ ఆరువందల యాభై కోట్లు!
‘సందేహాలు వద్దు, ప్రయాణంలోనే ఒక్కటొక్కటిగా అన్నీ నేర్చుకుంటాం. మీలో ఎక్కడో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీయండి. తప్పకుండా విజయం సాధిస్తారు’ అంటున్నారు మీనా బింద్ర.


