అస్సాంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం? | Congress Deploys DK Shivakumar To Counter BJP Alleged Poaching Ahead Of Assam Results, Read Full Story Inside| Sakshi
Sakshi News home page

అస్సాంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం?

May 3 2026 11:54 AM | Updated on May 3 2026 12:22 PM

Congress Deploys DK Shivakumar to Thwart BJP Poaching

డిస్పూర్‌: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ సమీపిస్తున్న తరుణంలో రాజకీయ రసవత్తర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేస్తూ, అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ వల నుంచి అభ్యర్థులను కాపాడేందుకు ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సహా సీనియర్ నేతలను హుటాహుటిన రంగంలోకి దించింది.

కాంగ్రెస్ క్యాంపులోకి బీజేపీ వల?
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ తమ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు. శనివారం గౌహతిలో జరిగిన ఆరు పార్టీల ప్రతిపక్ష కూటమి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకున్నారని, తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి తాము పూర్తి అప్రమత్తంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీజేపీకి గెలుపుపై నమ్మకం ఉంటే తమ నేతలను ఎందుకు సంప్రదిస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఎగ్జిట్ పోల్స్ అబద్ధం.. 75 సీట్లు మావే!
ఎన్డీఏ కూటమికి 88 నుంచి 100 స్థానాలు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ కేవలం అధికారులపై, ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకేనని విమర్శించారు. ప్రతిపక్ష కూటమి కచ్చితంగా 70 నుంచి 75 స్థానాలు (మొత్తం 126 సీట్లలో) గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజున అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, ఢిల్లీ, గౌహతిలలో ప్రత్యేక లీగల్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ తెలిపారు.

సీఎం రేసులో గౌరవ్ గొగోయ్?
అస్సాం ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తేల్చి చెప్పారు. మరోవైపు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ మాట్లాడుతూ.. కూటమికి 70కి పైగా సీట్లు వస్తాయని, గౌరవ్ గొగోయ్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఎన్డీఏ గ్రాఫ్ పడిపోతోందని అస్సాం జాతీయ పరిషత్ అధ్యక్షుడు లూరిన్‌జ్యోతి గొగోయ్ సైతం వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement