‘దహీ బారా’ తిన్న వృద్ధురాలు మృతి.. గ్రామస్తులంతా ఆస్పత్రిపాలు! | 1 Dead 58 Hospitalised in Odisha Food Poisoning Tragedy | Sakshi
Sakshi News home page

‘దహీ బారా’ తిన్న వృద్ధురాలు మృతి.. గ్రామస్తులంతా ఆస్పత్రిపాలు!

May 3 2026 8:39 AM | Updated on May 3 2026 8:39 AM

1 Dead 58 Hospitalised in Odisha Food Poisoning Tragedy

జాజ్‌పూర్: ఎంతో ఇష్టంగా తిన్న స్ట్రీట్ ఫుడ్ వారి పాలిట శాపంగా మారింది. రుచికరమైన ‘దహీ బారా’ వారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో కలుషితమైన దహీ బారా తిని ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ చేసిన కొద్ది గంటల్లోనే ఊరులోని వారంతా ఆసుపత్రి పాలైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ప్రాణాలు తీసిన ‘దహీ బారా’
జాజ్‌పూర్ జిల్లా దశరథ్‌పూర్ బ్లాక్ పరిధిలోని పటా పూర్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య గ్రామస్తులు రోడ్డు పక్కన ఉన్న ఓ  దుకాణం వద్ద దహీ బారా తిన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయం దాటాక ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒక వృద్ధురాలు మరణించింది.

ఆస్పత్రిలో 58 మంది బాధితులు
మెరుగైన వైద్యం కోసం 52 మంది బాధితులను అంబులెన్సుల్లో జాజ్‌పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. జాజ్‌పూర్ సీడీఎంఓ డాక్టర్ బిజోయ్ కుమార్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 25 మంది పిల్లలు కాగా, 27 మంది పెద్దలు ఉన్నారు. మరో ఆరుగురు తమ గ్రామంలోనే చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రస్తుతం రోగులందరి పరిస్థితి నిలకడగా ఉందని, కొందరికి మాత్రమే స్వల్ప జ్వరం ఉందని వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్‌ వల్లే ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించారు.

రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ
ఈ సామూహిక ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్, జాజ్‌పూర్ ఎంపీ డాక్టర్ రవీంద్ర కుమార్ బెహెరా ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సదుపాయాలను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం జిల్లా అధికారులతో పరిస్థితిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఈ ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. కలుషిత ఆహారం ఎలా తయారైందనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: స్ట్రాంగ్‌రూమ్ పాలిటిక్స్‌తో బెంగాల్ హీట్

Advertisement
 
Advertisement
Advertisement