న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే ‘నీట్ యూజీ 2026’ (NEET UG) పరీక్ష నేడు(ఆదివారం మే 3) జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 నిమిషాల వరకు ఒకే షిఫ్టులో నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు సమయపాలన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం 12 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లు తెరుచుకుంటాయి. అయితే, మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.
పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టాలంటే అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) తప్పనిసరి. దానికి తోడుగా ప్రభుత్వం జారీ చేసిన పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును వెంట తీసుకువెళ్లాలి. స్మార్ట్ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, పేజర్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతించరు. ఒకవేళ పొరపాటున తీసుకువచ్చినా, వాటిని భద్రపరచడానికి కేంద్రాల వద్ద ఎలాంటి సదుపాయం ఉండదు, వాటికి విద్యార్థులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
డ్రెస్ కోడ్: బూట్లు వేసుకుంటే నో ఎంట్రీ
విద్యార్థుల వస్త్రధారణపై స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అబ్బాయిలు సాధారణ ప్యాంట్లు, జీన్స్ ధరించవచ్చు కానీ, బూట్లకు బదులుగా కేవలం స్లిప్పర్స్ (చెప్పులు) మాత్రమే వేసుకోవాలి. అలాగే క్యాప్స్, మఫ్లర్లు తలకు ధరించకూడదు. ఇక అమ్మాయిలు లెగ్గింగ్స్ లేదా సాధారణ ప్యాంట్లు వేసుకోవచ్చు. వీరు కూడా సింపుల్ శాండల్స్ ధరించాలి తప్ప షూస్ వేసుకోకూడదు. ముఖ్యంగా చేతులకు మెహందీ పెట్టుకోకూడదు. అలాగే హ్యాండ్బ్యాగ్లు లేదా పర్సులు లోపలికి తీసుకువెళ్లడానికి వీల్లేదు.


