పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకనప్పుడు, డిమాండ్ లేనప్పుడు ఆయా పంటలను రోడ్డుమీద కుప్పలు కుప్పలుగా పారబోయడం, తగల బెట్టడం లాంటి బాధాకరమైన దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటపుడు ‘అయ్యో.. రేటు వచ్చేదాకా వీటిని భద్రపరిస్తే ఎంత బాగుండు’ అని అనుకుంటాం. అలా పుట్టిన ఆలోచనే ఆధునిక పద్దతులకు బాటలు వేస్తుంది. అదే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. పదండి వారి విజయ గాథ ఏంటో తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని గగన్బావ్డా తహసీల్లో, తేజస్-రాజేష్ పొవార్ అనే ఇద్దరు అన్నదమ్ముల సక్సెస్ స్టోరీ ఇది. అది జాక్ఫ్రూట్ (పనస) చిప్స్ బిజినెస్తో. సాధారణంగా పనసకాయలు ఒకసారి కాతకొచ్చాయంటే విపరీతమైన దిగుబడి వస్తుంది. కొల్హాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని దాదాపు ప్రతి రైతు తమ పూర్వీకుల నుండి పనస చెట్లు వారసత్వంగా వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే వాటి ద్వారా మంచి జీవనోపాధిని కూడా పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఉత్తిత్తి కూడా చాలా అధికంగా ఉండేది. దీంతో రైతులు వాటిని కోయలేక, మార్కెట్ చేసుకోలేక, మండీకి రవాణా ఖర్చులు కూడా భరించలేక వాటిని అలాగే పారవేసేవారు.
తేజస్, రాజేష్ తల్లిదండ్రులకు జాక్ఫ్రూట్ చెట్లు బాగానే ఉండేవి. ఒక ఏడాది పనసకాయలుబాగా రావడంతో కొల్హాపూర్లో నివసించే బంధువులైన సంగీత, విలాస్ పొవార్ ఇంటికి తీసుకెళ్లారు.మా దగ్గర చాలా కాయలున్నాయి. వృధాగా పార వేస్తున్నామనే విషయాన్ని వారితో షేర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా వాటిని పారవేయడానికి బదులు చిప్స్గా తయారు చేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉందని వారు సూచించారట. అంతే అక్కడినుంచి వారి జీవితం మరో మలుపు తిరిగింది.
15 కిలోల చిప్స్తో మొదలు
దీంతో కుమారులతో కలిసి వారు రంగంలోకి దిగారు. తొలి ప్రయత్నంలో దాదాపు 15 కిలోల చిప్స్ను తయారు చేసి కొల్హాపూర్లో ఇంటింటికీ వెళ్లి విక్రయించారు. డిమాండ్ పెరిగినప్పటికీ, ఇంటింటికీ డెలివరీ అందించడం సాధ్యం కాలేదు. దీంతో ఐటీఐ చదువు అయిన వెంటనే తేజస్ పనస చిప్స్ తయారీపై మరింత దృష్టి సారించాడు. ప్యాకేజింగ్ చేయడానికి కొన్ని ప్రాథమిక యంత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నేరుగా హోల్సేల్ వ్యాపారులు రిటైలర్లకు విక్రయించే పద్దతులను ప్రారంభించారు. ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు మరో పది పన్నెండు మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
జాక్ఫ్రూట్ కోత జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభమైజూలై-ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఏటా 4,000 కిలోల జాక్ఫ్రూట్ను ప్రాసెస్ చేసి 1,000 కిలోల వేఫర్లను ఉత్పత్తి చేస్తారు.మార్కెట్ డిమాండ్ బట్టి కేజీ చిప్స్ను రూ. 900 నుంచి రూ. 10 వేల వరకు విక్రయిస్తారు. ఇక జాక్ఫ్రూట్ పోలీలు కేజీకి రూ. 700 చొప్పున అమ్ముడవుతాయి. అలా ఏడాది కాలంలో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు. అంతేకాదు తమ పని పనసపంట వృధాను అడ్డుకోవడంతోపాటు, రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని, ఉద్యోగ అవకాశాలను సృష్టించింది అంటూరు తేజస్ సంతోషంగా.
పనస చెట్లు 30 అడుగుల నుండి 70 అడుగుల వరకు పెరుగుతాయి. పెద్ద పెద్దకాయలతో దిగుబడి కూడా భారీగా వస్తుంది. దీనికి తోడు భారీ బరువు, కాయలనుంచి వచ్చే జిగట రబ్బరు పాలు కారణంగా వాటిని కోయడం చాలా ఛాలెంజ్ అంటారు తేజస్. అందుకే రైతు లనుంచి కిలోకు రూ. 30 నుంచి రూ. 70 వరకు చెల్లించి కొనుగోలు చేస్తారట. అలాగే పనసకాయలను ప్రత్యేక పద్ధతిలో కోసేలా నిపుణులను ఏర్పాటు చేసుకుంటారు. అనంతరం వాటిని చిప్స్, ఇంకా పండిన పండ్లను ఫనాస్ పో (భక్ష్యాలు) జాక్ఫ్రూట్ గుజ్జు, బెల్లం, గోధుమ పిండితో కలిపి తీపి ఫ్లాట్బ్రెడ్ తయారు చేస్తారు.
చదవండి: మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందన
పనసకాయలో పోషక విలువలు, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు ఇపుడు ఏ పెళ్లిళ్లు, పంక్షన్లలో చూసినా పనస కాయ బిర్యానీ చాలా ఫ్యామస్. జాక్ఫ్రూట్ కబాబ్లు, బిర్యానీలు, ఇతర రెడీ-టు-కుక్ ఉత్పత్తులకు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉంది.
భారతదేశ జాక్ఫ్రూట్ ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ. 1252 కోట్లు. రానున్న ఐదేళ్లలో దాదాపు రూ. 1580 కోట్లకు పెరుగుతుందని చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (CCSNIAM) నివేదిక పేర్కొంది.


