
ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎవరైనా నెలనెలా బంగారు గుడ్డు పెట్టే బాతులానే చూస్తారు. పైగా కావ్యా ధొబాలే–దత్ఖిలే జీతం నెలకు 76 వేలు. ముంబైలోని ప్రతిష్ఠాత్మక సయాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు తను! చిన్న వయసులోనే అంత పెద్ద ఆసుపత్రి, అంత పెద్ద జీతం అంటే మున్ముందు సర్వీసుతో పాటు పెరిగే జీతం లక్షల్లోనే కదా ఉంటుంది! అయితే కావ్య ఈ లెక్కలేమీ వేసుకోలేదు. ఆసుపత్రి ఉద్యోగానికి రాజీనామా చేసి, వ్యవసాయ క్షేత్రం వైపు మళ్లారు!
కావ్య లక్ష్యం ఏమిటి? ఏం లేదు, మనుషుల ఆరోగ్యం కాపాడటం మాత్రమే. సయాన్ ఆసుపత్రిలో ఆ పనే కదా ఆమె చేస్తున్నారు! కానీ అంతకుమించి, అసలు మనుషులకు ఆసుపత్రి అవసరమే కలుగకుండా చేసే పనిని ఆమె ఎంచుకున్నారు. ఎలాగంటే – వర్మి కంపోస్ట్తో పండించే పంటల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలుసుకున్న కావ్య ఏకంగా వర్మి కంపోస్ట్ ఉత్పత్తినే ప్రారంభించారు! అంతేకాదు, రసాయన రహిత పంటల గురించి అవగాహన కల్పించటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 200 మంది ఔత్సాహిక వర్మి కంపోస్ట్ వ్యవస్థాపకులకు శిక్షణ ఇచ్చారు. అంటే – కావ్య తన లాంటి కావ్యల్ని వందలాదిగా తయారు చేశారు.
కారణం లేదు.. ప్రేరణ ఉంది
ఎవరైనా ఉద్యోగం మానటానికి, ఉద్యోగం మారటానికి ఒక కారణం ఉంటుంది. కానీ కావ్య ఉద్యోగం వదలి వ్యవసాయంలోకి రావటం వెనుక ఒక ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ వెనుక.. ఇతరులకు సహాయం చేయాలని చిన్నప్పట్నుంచీ ఆమెతో పాటు ఎదుగుతూ వస్తున్న తపన ఉంది. ఆ తపనే ఆమెను మొదట నర్సింగ్ కోర్సు వైపు మళ్లించింది. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీలో డిప్లొమా చేశాక, ముంబైలోని ‘లోకమాన్య తిలక్ మునిసిపల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్’లో (ఇదే సయాన్ హాస్పిటల్) నర్సుగా చేరారు కావ్య. తర్వాత టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండేళ్లు పని చేశారు. 2017లో నర్సింగ్లో బీఎస్సీ పూర్తి చేశాక ఏడాది పాటు ఒక ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ పాఠాలు చెప్పారు. ఆ తర్వాత తిరిగి సయాన్ ఆసుపత్రిలో ఉద్యోగిగా చేరి స్టాఫ్ నర్స్ అయ్యారు. అలా చేరటమే ఆమె కెరీర్ను వ్యవసాయం వైపు మలుపు తిప్పింది.
అన్ని మరణాలను చూశాక..!
2019 నుంచి 2022 వరకు సయాన్ లో నర్సుగా ఉన్నారు కావ్య. అది కరోనా వ్యాపించిన పాడు కాలం. నర్సుగా ఆమె కొన్ని నెలల పాటు అనేక మంది తన కళ్ల ముందే కరోనాతో మరణించటాన్ని దగ్గరగా చూశారు. దాంతో ఆమె జీవిత దృక్పథమే మారిపోయింది. ‘‘నేను కూడా అదే సమయంలో కరోనా వైరస్ బారిన పడ్డాను. దాదాపుగా మరణశయ్యపై ఉన్నాను. కానీ నా రోగ నిరోధక శక్తి నన్ను రక్షించింది. మనం పండిస్తున్న, మనం తింటున్న రసాయనాలతో కూడిన ఆహారం వల్ల మన శరీరాలు బలహీనమౌతున్నాయని నాకు అర్థమైంది. అప్పుడే నేనొక నిర్ణయానికి వచ్చాను. రసాయనాల జాడలు లేని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను’’ అంటారు కావ్య.
ఉద్యోగం వదలి వర్మి కంపోస్ట్లోకి
అయితే అందుకోసం ఉద్యోగం మానేయాలన్న కావ్య నిర్ణయాన్ని ఆసుపత్రిలో, ఇంట్లో, బంధువుల్లో ఎవరూ హర్షించలేదు. ఆమె భర్త రాజేశ్ దత్ఖిలే ఒక్కరే ఆమె వైపు నిలబడ్డారు. అలా 2022లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై నుంచి భర్త స్వగ్రామమైన పుణె దగ్గరి జున్నార్కు మారిపోయారు కావ్య. అక్కడే ఆమె వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేయటం మొదలు పెట్టారు. దాని కన్నా ముందు వర్మి కంపోస్ట్ను ఎలా తయారు చేయాలో కొన్ని నెలల పాటు వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకున్నారు. అలా ఆసుపత్రి బెడ్ల మధ్య నుంచి వర్మి కంపోస్ట్ ‘బెడ్’ల మధ్యకు వచ్చారామె.
కిలో వానపాములే పెట్టుబడి
‘‘నా ప్రారంభ పెట్టుబడి సున్నా. 2022 ఆగస్టులో ఒక రైతు నుంచి కిలో వాన పాములను తీసుకుని చిన్న ‘బెడ్’తో (ఎత్తు మడి) పనిలోకి దిగాను. ఆవు పేడలో వాన పాములను జోడించాను. వాటికి ఆహారంగా ఇతర పశువుల పేడ, రాలిన చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, ఇతర సేంద్రియ పదార్థాలను ఉపయోగించాను. 2022 అక్టోబర్ నాటికి తొలి విడత వర్మి కంపోస్ట్ సిద్ధమైపోయింది’’ అని ఎంతో ఎగ్జయింట్గా చెబుతారు కావ్య. తర్వాత ‘బెడ్’ల సంఖ్య పెరిగింది, వర్మి కంపోస్ట్ ఉత్పత్తీ పెరిగింది. చివరికి అదొక వ్యాపారంగానూ మారింది.
ఈ ఆర్థిక సంవత్సరానికి కావ్య టర్నోవర్ ఎంతో తెలుసా? 24 లక్షల రూపాయలు! టర్కీ, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు ‘కృషి కావ్య బ్రాండ్’ పేరుతో కావ్య వర్మి కంపోస్ట్ ఎగుమతి అవుతోంది. కావ్య దగ్గర శిక్షణ తీసుకున్న రెండు వందల మందీ మహారాష్ట్ర వ్యాప్తంగా వర్మి కంపోస్ట్ను తయారు చేస్తూ ఆరోగ్యవంతమైన ప్రకృతి వ్యవసాయానికి తోడ్పతున్నారు. తామూ ఉపాధి పొందుతున్నారు.
∙సాక్షి, స్పెషల్ డెస్క్