చరిత్ర పుటల్లో మరుగున పడిన ధీరవనితల గాధలు
1927 డిసెంబర్ 19. గోరఖ్పూర్ జైలులో ఒక తల్లి తన 30 ఏళ్ల కొడుకును చివరిసారి కలిసింది. బ్రిటిష్ ప్రభుత్వం అతణ్ణి ఆ రోజు ఉరి తీయబోతోంది. కాని ఆ తల్లి కళ్లలో నీళ్లు లేవు. గొంతులో వణుకు లేదు. బదులుగా గర్వం ఉంది. ఆమె పేరు మూల్మతి దేవి. ‘సర్ఫరోషీ కి తమన్నా’ అని దేశాన్ని ఊపిన రాంప్రసాద్ బిస్మిల్ను కన్నతల్లి. ఆగస్టు 15 నాడు మనం జెండా ఎగురవేస్తున్నప్పుడు ఇలాంటి తల్లుల త్యాగాలను గుర్తు చేసుకోవాలి.
జైలులో ఉన్న ఆ కొడుకు తల్లిని చూడగానే ఉద్వేగంతో కన్నీరు కార్చాడు. ఆ రోజే తనకు ఆఖరు అని అతనికి తెలుసు. తల్లికీ తెలుసు. కాని ఆ తల్లి చలించలేదు. కొడుకును చూసి ఏడ్వలేదు. ‘ఎందుకురా ఏడుస్తావు? నిన్ను ఏడిపించడం రాకనే కదా బ్రిటిష్ ప్రభుత్వం నిన్ను చూసి భయపడింది’ అంది. ‘నేను నిన్ను మళ్లీ చూడలేనని ఏడుస్తున్నాననమ్మా... భయంతో కాదు’ అన్నాడు కొడుకు.
అప్పటిదాకా తాను జైలులో రాసిన ఆత్మకథను ఆమెకు ఇచ్చాడు. ఆమె దానిని టిఫిన్ డబ్బాలో దాచి రహస్యంగా బయటకు తెచ్చింది. ఆ తర్వాత ఆ ఆత్మకథ ‘కాకోరీ కే షహీద్’ పేరుతో పుస్తకమై లక్షలమందికి స్పూర్తినిచ్చింది. ఆ రోజు జైలు గోడలు కూడా సిగ్గుపడేంత ధైర్యం చూపిన ఆ తల్లిపేరు మూల్మతి దేవి.
ఆమె కన్న వీరపుత్రుడు, దేశభక్తుడే రాంప్రసాద్ బిస్మిల్.
ధిక్కారం ఆమె ధోరణి
ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్లో 11 ఏళ్ల వయసులో అత్తగారింట్లో మూల్మతి అడుగు పెట్టే సమయానికి ఆమెకు చదువు లేదు. లోకం తెలియదు. కాని భర్త సహకారంతో ఆమె చదువుకుంది. ఆడపిల్లలు పుడితే చంపేసే ఆ ఇంటిలో అత్తగారిని, బంధుగణాన్ని ఎదిరించి ఐదుమంది ఆడపిల్లలను కన్నది. పెద్ద కొడుకు రాంప్రసాద్ బిస్మిల్ అల్లరి చిల్లరగా తిరుగుతుంటే ‘నువ్వు చేయాల్సింది ఇలా బతకడం కాదు. దేశం కోసం బతకాలి’ అని నూరిపోసింది. ‘మా అమ్మ లేకపోతే నేను నాశనం అయి ఉండేవాణ్ణి’ అని రాంప్రసాద్ బిస్మిల్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. బిస్మిల్ విప్లవవాద సాహిత్యం రాస్తుంటే మూల్మతి తన పొదుపు డబ్బును కొడుకు చేతిలో పెట్టి ‘దేశం మేలుకోవాలి నాన్నా. నువ్వు రాయి, నేనున్నా’ అని ప్రోత్సహించింది. దేశభక్తుల వెతుకులాటలో బ్రిటిష్వారు ఇళ్లను గాలిస్తుంటే ‘నా కొడుకు దొంగ కాదు, దేశాన్ని కాపాడే సిపాయి’ అని ఊర్లో గర్వంగా చెప్పుకునేది.
కాకోరి ట్రైన్ యాక్షన్
రాంప్రసాద్ బిస్మిల్ ‘హిందూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్’ స్థాపించి బ్రిటిష్ వారిపై ఆయుధాలతో తిరగబడాలని ఆయుధాలకు కావాల్సిన డబ్బుకోసం 1925 లో లక్నో సమీపంలోని కాకోరి స్టేషన్ వద్ద రైలును కొల్లగొట్టి ఎనిమిది వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నాడు. అది ప్రజల సొమ్మే. సుంకాల పేరుతో బ్రిటిష్ దోచిన సొమ్ము. అది కబ్జా చేయడం నేరం కాదని బిస్మిల్ అనుకున్నాడు. కాని బ్రిటిష్వారు ఈ దాన్ని తమకు పరువు తక్కువగా భావించారు. భారీ వేట కొనసాగించి రాంప్రసాద్ బిస్మిల్ను, అతనితో పాటు రైలు యాక్షన్లో పాల్గొన్న అష్ఫఖుల్లా ఖాన్, మరికొంతమందిని అరెస్టు చేశారు. రాంప్రసాద్ తోపాటు మొత్తం నలుగురికి ఈ కేసులో ఉరిశిక్ష పడింది. 1927లో ఉరిశిక్ష అమలు చేస్తే రెండేళ్లు రాం ప్రసాద్ గోరఖ్పూర్ జైలులో గడిపాడు. ఉరిశిక్షకు ముందు తల్లిని కలిశాడు. ఉరిశిక్షలో ఉరితాడును ముద్దాడుతూ రాంప్రసాద్ చివరి మాట...‘బ్రిటిష్ సామ్రాజ్యం నాశనం కావాలి’. ఆ శక్తి, స్థయిర్యం మూల్మతిది.
ఒక కొడుకు పోయినా...
బిస్మిల్ను ఉరితీస్తే దేశం మొత్తం దుఃఖంలో మునిగింది. కానీ మూల్మతి దేవి కొద్దిరోజులకే ఒక బహిరంగ సభకు వెళ్లి వేలాది మంది ముందు మైక్ పట్టుకుని ‘నా పెద్ద కొడుకు దేశం కోసం ప్రాణం ఇచ్చాడు. నా చిన్న కొడుకును కూడా ఇప్పుడే అర్పిస్తున్నాను. అవసరమైతే నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఇస్తాను’ అంది. కడుపు కోత మానకముందే రెండో కొడుకును అదే త్యాగానికి సిద్ధం చేసింది. ఆ తర్వాత ఆమె మీద బ్రిటిష్ వారి పరోక్ష నిర్బంధం కొనసాగింది. రూపాయి రూపాయికి ఆమె అల్లాడాల్సి వచ్చింది. ఎన్ని కష్టాలు పడినా ధైర్యంగా ఎదుర్కొంది. షాజహాన్ పూర్లో స్త్రీలకు దేశభక్తి గేయాలు నేర్పేది. చరఖా తిప్పమని, ఖాదీ కట్టమని చెప్పేది. దేశం కోసమే బతుకుతూ చివరి ఊపిరి వదిలింది.
వారి త్యాగమే....
ఆగస్టు 15న మనం రంగురంగుల బెలూన్లు ఎగురవేస్తాం. తీపి పంచుకుంటాం. కానీ ఈ స్వేచ్ఛ వెనుక మూల్మతి లాంటి తల్లులు ఉన్నారు. వాళ్లు కొడుకులను కనలేదు. అమరవీరులను కన్నారు. ఈరోజు మనం స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నాం అంటే అందుకు కారణం సరిహద్దులోని సైనికుడు మాత్రమే కాదు... ఇంట్లో కూర్చుని కొడుకును యుద్ధానికి పంపిన తల్లి కూడా. సెల్యూట్ టు మూల్మతి దేవి. అమ్మా నీ పాదాలకు వందనాలు.


