
ఇండస్ట్రీపై మక్కువతో 2002లో అడుగులు
‘105 మినిట్స్’ చిత్రానికి ఐకానిక్ అవార్డు
పలువురు అగ్రహీరోల యాడ్ ఫిలింస్కి సినిమాటోగ్రఫీ
డైరెక్టర్ విజన్ ఒకటైతే.. సినిమాటోగ్రాఫర్ విజన్ మరోలా ఉంటుంది. సినిమాకు కళను తెచ్చే సినిమాటోగ్రఫీ చేయడం కష్టతరమైన పని.. కానీ నచ్చిన మెచ్చిన పనిలో తన కష్టాన్ని చూపిన కిషోర్ బొయిదాపు(Kishore Boyidapu) ఇంటర్నేషనల్ ఐకానిక్ సినిమాటోగ్రాఫర్ అవార్డు అందుకున్నాడు. ఇటీవలే నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ‘105 మినిట్స్’ చిత్రానికి అవార్డు లభించింది. తన కుంటుంబ సినిమా నేపథ్యాన్ని, సినిమాటోగ్రఫీ విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. – బంజారాహిల్స్
బోరబండలోని గాయత్రినగర్కు చెందిన కిషోర్ స్వస్థలం విజయవాడ. ఆయన కుటుంబానిది సినిమా నేపథ్యం. తన ఇద్దరు బాబాయిర్లు ఒకరు ప్రముఖ పీఆర్ఓ దివంగత బీఏ రాజు, మరో బాబాయి కెమెరామెన్ రామ్కుమార్, తన అన్నల్లో ఒకరు కెమెరామెన్ రవి, మరో అన్న అనిల్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. కుటుంబం మొత్తం సినిమా నేపథ్యం అవడంతో సినిమాలపై మక్కువతో 2002లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రవిప్రసాద్ యూనిట్లో మొదట కెమెరా అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించాడు. మెచ్చిన, నచ్చిన పనిలో కష్టాన్ని నమ్మిన కిషోర్ త్వరగానే స్లమ్డాగ్ మిలీనియర్, మిషన్ ఇంపాజిబుల్–4, లెటర్స్, సూటబుల్ బాయ్స్ వంటి హాలీవుడ్ ప్రాజెక్టులకు సెకండ్ యూనిట్ కెమెరామెన్గా ప్రతిభను కనబరిచాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనిల్ మోహతా ప్రియ శిష్యుడిగా సీక్రెట్ సూపర్స్టార్, ఏ దిల్హై ముష్కిల్, బియాండ్ ది క్లౌడ్స్, హిందీ జెర్సీ వంటి అగ్రచిత్రాలతో పాటు అగ్రహీరోల యాడ్ ఫిల్మ్స్కి సినిమాటో గ్రాఫర్గా సత్తాచాటాడు.

కెమెరామెన్గా..
బోయ్ మీట్స్ గరల్స్ చిత్రంతో కెమెరామెన్గా మారిన్ కిషోర్ ‘కిరాక్, వశం, కర్త–కర్మ–క్రియ, 105 మినిట్స్, మైనేమ్ ఈజ్ శృతి’తో పాటు పలు నూతన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు. 105 మినిట్స్ చిత్రానికి ఐకానిక్ అవార్డు అందుకున్నాడు. ముంబై నుండి నగరానికి షిఫ్ట్ అయిన కిషోర్ తన ఫోకస్ అంతా తెలుగు చిత్రాలపైనే అని పేర్కొన్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాటోగ్రాఫర్గా రాణించడమే లక్ష్యమని తెలిపాడు.