సామాన్యుల సంగతేమో గానీ సెలబ్రిటీల జీవితాల్లో పెళ్లి, విడాకులు అనేది ఎప్పటికప్పుడు వినిపిస్తున్నట్లే ఉంటాయి. హిందీ ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత అయిన రాజా చౌదరి కూడా రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో తన కూతురి కంటే చిన్న వయసున్న అమ్మాయితో డేటింగ్ చేశాడు. కానీ చివరకు ఆమెతోనూ విడిపోవాల్సి వచ్చింది. ఆ సందర్భాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. ఇంతకీ అసలేమైందంటే?
(ఇదీ చదవండి: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి.. ఎప్పుడు ఎక్కడంటే?)
భోజ్పురి సినిమాలు, హిందీ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న రాజా చౌదరి.. బాలీవుడ్లో పలు చిత్రాల్లో చిన్న, సహాయక పాత్రల్లో చేశాడు. 'బిగ్ బాస్ 2'లో ఫస్ట్ రన్నరప్గానూ నిలిచాడు. తన తోటి నటి శ్వేతా తివారిని 1998లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు పాలక్ అనే కూతురు కూడా పుట్టింది. కొన్నేళ్లకే వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడంతో 2007లో ఇద్దరూ విడిపోయారు. ఆ టైంలోనే రాజాపై శ్వేతా తివారి గృహహింస కేసు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన ఐదేళ్లకు అంటే 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
నాలుగేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజా చౌదరి.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2015లో శిల్పి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు, కొంతకాలం ఆమెతో డేటింగ్ చేసినట్లు చెప్పాడు. కానీ తమ మధ్య వయసు వ్యత్యాసం కారణంగా శిల్పి తన ఆలోచన మార్చుకోవడంతో విడిపోయామని వెల్లడించాడు. తన కూతురు పాలక్ కంటే తాను చిన్నదాన్నిఅని శిల్పి తరచూ ప్రస్తావించేదని తెలిపాడు.
ఇక శిల్పితో విడిపోయిన కొన్నాళ్లకు రాజా చౌదరి జీవితంలోకి శ్వేతా సూద్ వచ్చింది. కార్పొరేట్ రంగంలో హెచ్ఆర్గా పనిచేసే శ్వేతని 2015లో వివాహం చేసుకోగా.. తర్వాత ఈమె నుంచి కూడా విడిపోయాడు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనే తన రెండో భార్య శ్వేతా సూద్, భరణం కోసం డిమాండ్ చేసిందని రాజా వెల్లడించాడు. రీసెంట్ టైంలో మళ్లీ ఇంటర్వ్యూలు ఇస్తూ తన మాజీ భార్య శ్వేతా తివారి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజా చౌదరి వార్తల్లో నిలుస్తున్నాడు.
(ఇదీ చదవండి: రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో: హీరో యష్)


