కార్తీక్ ఆర్యన్, శ్రీలీల వెండితెర ప్రేమకథ మళ్లీ షురూ అయింది. ఈ ఇద్దరూ జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పాటలకు మంచి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రానికి ‘తూ మేరీ జిందగీ హై’ టైటిల్ని అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా ముంబైలో మళ్లీ ఈ ప్రేమకథా చిత్రం షూటింగ్ని షురూ చేశారు. శ్రీలీల పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఇక ఎలాంటి వాయిదాలు లేకుండా సినిమాని పూర్తి చేసేలా అనురాగ్ బసు ప్లాన్ చేశారని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారని టాక్. హిందీలో శ్రీలీలకి ఇదే తొలి చిత్రం. సౌత్లో స్టార్గా ఎదిగిన శ్రీలీల ఈ చిత్రంతో హిందీలోనూ దూసుకెళతారనే అంచనాలు ఉన్నాయి.


