అనేక ప్రాంతాల్లో రుతుపవనాల ఆలస్యం రెండు వారాల నుంచి ఆరు–ఏడు వారాల వరకు నమోదైంది. రైతులు, కేవీకేల శాస్త్రవేత్తలు పరిస్థితిని బట్టి విత్తే తేదీని మార్చటం, పంటను మార్చటం, రకాన్ని మార్చటం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
భారతీయ వ్యవసాయం తరతరాలుగా ఒక నమ్మకంపై నడిచింది. అదేమిటంటే ‘కాలం వస్తే వాన వస్తుంది, వాన వస్తే విత్తనం పడుతుంది’. ఇప్పుడు ఆ నమ్మకమే మారుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యంగా రావటం, వానల మధ్య విరామం పెరగటం, ఒక్కసారిగా భారీ వర్షాలు కురవటం తరచుగా కనిపిస్తున్నాయి. ఎల్నినో వంటి పరిస్థితులు ఈ అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. అందువల్ల ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ‘ఎంత వర్షం పడుతుంది?’ అన్నది మాత్రమే కాదు. ‘వర్షం మనం ఊహించినట్లు పడకపోతే మన వ్యవసాయం ఎలా స్పందించాలి?’ అన్నదే కీలకం.
ఈ ఏడాది పరిస్థితులు ఒక హెచ్చరికను సూచిస్తున్నాయి. ఈ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 12 మధ్య కాలానికి సంబంధించిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఐఏఆర్ఐ) కరువు అంచనా ప్రకారం దేశంలోని సుమారు 64 శాతం ‘వ్యవసాయ విస్తీర్ణం’ ఏదో ఒక స్థాయి కరువులో ఉంది. అయితే, అందులో ఎక్కువ భాగం ‘స్వల్ప కరువు’ కేటగిరీలోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఆంధ్రప్రదేశ్లో మాత్రం సుమారు 88 శాతం ‘వ్యవసాయ విస్తీర్ణం’లో కరువు నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 21 శాతం మాత్రమే. అంటే రాష్ట్రంలో 88 శాతం పంట నష్టపోయిందని కాదు; ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పే హెచ్చరిక ఇది.
జిల్లాల వారీగా చూస్తే పరిస్థితి మరింత స్పష్టమవుతుంది. బాపట్ల జిల్లాలో 9.9 శాతం, కాకినాడలో 4.6 శాతం, కృష్ణా జిల్లాలో 3.8 శాతం ప్రాంతం తీవ్ర కరువు నెలకొంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం, అనకాపల్లి జిల్లాల్లోనూ ఇటువంటి ప్రాంతాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి.
తెలంగాణ పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. రాష్ట్రం మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే మెరుగ్గా ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొంది. ఖమ్మంలో స్వల్ప విస్తీర్ణం తీవ్ర కరువులో ఉంది. సూర్యాపేట, ములుగు, కుమురం భీమ్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్లో తీవ్రమైన కరువు జాడలు నమోదయ్యాయి. మేడ్చల్–మల్కాజిగిరిలో 10.9 శాతం ప్రాంతం ఒక మోస్తరు కరువు కేటగిరీలో ఉంది. నారాయణపేటలో 30.5 శాతం, మెదక్లో 26.7 శాతం, కామారెడ్డిలో 22.7 శాతం, నిజామాబాద్లో 21.6 శాతం విస్తీర్ణం స్వల్ప కరువులో ఉంది.
2 నుంచి 6–7 వారాల ఆలస్యం
అంటే ఎల్నినోను ఎదుర్కొనే విధానం రెండు రాష్ట్రాల్లో ఒకేలా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్కు విస్తృత స్థాయి ముందస్తు సంసిద్ధత అవసరమైతే, తెలంగాణకు హాట్స్పాట్ ఆధారిత చర్యలు అవసరం. కృషి విజ్ఞాన కేంద్రాల క్షేత్రస్థాయి అనుభవం మరో ముఖ్యమైన విషయం చెబుతోంది. అనేక ప్రాంతాల్లో రుతుపవనాల ఆలస్యం రెండు వారాల నుంచి ఆరు–ఏడు వారాల వరకు నమోదైంది. రైతులు, కేవీకే శాస్త్రవేత్తలు పరిస్థితిని బట్టి విత్తే తేదీని మార్చటం, పంటను మార్చటం, రకాన్ని మార్చటం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
మొదటి మార్పు పంట ఎంపికలో రావాలి. వర్షం ఆలస్యమైతే ముందుగా అనుకున్న పంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ వేయాలనే పట్టుదల ప్రమాదకరం. నేల, మిగిలిన పంటకాలం, అందుబాటులో ఉన్న నీటిని బట్టి కంది, పెసర, మినుము, ఉలవ, చిరుధాన్యాలు, ఆముదం వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
రెండోది స్వల్పకాలిక రకాలు. మూడు నాలుగు వారాలు ఆలస్యంగా విత్తిన రైతు దీర్ఘకాలిక రకాన్ని వేస్తే చివరి దశలో నీటి కొరత ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వరి, కంది, పెసర తదితర పంటల్లో తక్కువ కాలంలో కోతకు వచ్చే రకాలు అత్యంత కీలకం.
మూడోది.. పడిన ప్రతి వాన చుక్కను ΄÷లంలోనే నిలబెట్టుకోవటం. నీటి కుంటలు, వాన నీటిని ఇంకించే గొడ్డు సాళ్లు, ఆచ్ఛాదన, బోదెలు–కాలువలు, అంతరకృషి, సబ్ సాయిలింగ్, డ్రిప్, స్ప్రింక్లర్, రక్షణాత్మక తడులు వంటి చర్యలు రెండు రాష్ట్రాల్లో మంచి ఫలితాలు చూపుతున్నాయి.
పచ్చిరొట్ట ఎరువులు, పంట అవశేషాలను నేలలో కలపటం, సమగ్ర పోషక యాజమాన్యం, అంతర పంటలు, జీవ ఎరువులు, ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ వంటి పద్ధతులు నేలలో తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి.
ఇకపై రైతుకు ‘కరవు రావచ్చు జాగ్రత్త’ అనే సాధారణ సందేశం సరిపోదు. ‘ఈ తేదీలోపు వర్షం వస్తే ఈ పంట; మరో పది రోజులు ఆలస్యమైతే ఈ రకం; ఇంకా ఆలస్యమైతే ఈ ప్రత్యామ్నాయ పంట’ అనే నిర్ణయాత్మక సలహాలు కావాలి.
ఎల్నినోను మనం ఆపలేం. కానీ దాని వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చు. ?వాన మారినప్పుడు పంటను, రకాన్ని, నీటి వినియోగాన్ని, రైతు నిర్ణయాన్ని మార్చగలిగితేనే భవిష్యత్తు వ్యవసాయం నిలబడుతుంది.

డా. షేక్ ఎన్. మీరా
డైరెక్టర్, ఐసీఏఆర్–అటారీ,హైదరాబాద్
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


