దిగుబడులపై తీవ్ర ప్రభావం
ఐఐటీ బాంబే పరిశోధనలో వెల్లడి
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, దేశంలోని మూడోవంతు భూభాగం తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఐఐటీ బాంబే ‘ఎకోహైడ్రాలజీ గ్రూప్’ చేపట్టిన ‘ఆల్ ఇండియా అగ్రికల్చరల్ డ్రాట్ ఫోర్కాస్ట్స్’ అధ్యయనంలో తాజా సమాచారం ప్రకారం వర్షాలు భారీగా పడుతున్న చోట్ల కూడా నేలలో తేమ నిలవటం లేదు.
వేగంగా ఆరిపోతున్న తేమ
ఉపరితల మట్టిలోని పై 5 సెం.మీ లోతులో తేమ వర్షం పడిన వెంటనే పెరిగినప్పటికీ.. ఎండలు, ఆవిరి కావటం వల్ల అంతే వేగంగా ఆరిపోతోంది. సాధారణంగా పంటల వేర్ల వ్యవస్థ విస్తరించే 100 సెం.మీ (రూట్–జోన్) లోతులో తేమ స్థిరంగా ఉంటుంది. కానీ, తాజా పరిస్థితుల్లో 100 సెం.మీ లోతులోనూ తీవ్ర స్థాయిలో తేమ హెచ్చుతగ్గులు, లోటు ఏర్పడుతోందని ఐఐటీ బాంబే పరిశోధకుల బృందం గుర్తించింది. వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వేగంగా కొట్టుకుపోతుండటం, సుదీర్ఘ ΄÷డి వాతావరణం కారణంగా వేర్ల ప్రాంతంలో తేమ వేగంగా అడుగంటుతోంది.
రాబోయే వారాల్లో..?
∙ఆగస్టు నెలాఖరు వరకు (ఆగస్టు 17–23, 24–30 వారాల్లో) మన దేశంలో తీవ్రమైన కరవు పరిస్థితులు కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
∙దక్షిణాదిలో 40% భూభాగం కరవు నీడలో ఉంది.
∙దేశంలోనే అత్యధికంగా కరవు బారిన పడిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 72.4 శాతం విస్తీర్ణంతో మూడో స్థానంలో ఉంది. వారాల తరబడి నేలలో తేమ కోలుకోలేని స్థాయికి పడిపోయింది.
∙తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో వర్షాభావ/తేమ కొరత పరిస్థితులు నెలకొన్నాయి. చెదురుమదురు వర్షాలు పంటల వేర్లకు తగినంత తేమను అందించలేకపోతున్నాయి.
ఖరీఫ్, రబీ దిగుబడులకు గండం
ఖరీఫ్లో కీలక దశలో ఉన్న వరి, పత్తి, పప్పుధాన్యాలు, నూనెగింజల దిగుబడులపై ఈ తేమ కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. రైతులు పంటలను కాపాడుకోవటానికి భూగర్భ జలాలపై ఆధారపడితే, రాబోయే రబీ సీజన్ కు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముంది. పంటల ఎంపిక, సాగు ప్రణాళికలపై ఇప్పటినుంచే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎల్నినోను మనం ఆపలేం. కానీ దాని వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చు. వాన మారినప్పుడు పంటను, రకాన్ని, నీటి వినియోగాన్ని, రైతు నిర్ణయాన్ని మార్చగలిగితేనే భవిష్యత్తు వ్యవసాయం నిలబడుతుంది.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


