
పుట్టింది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించడానికి అతను తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మాడు. మరోవైపు పోలియోతో వైకల్యం. అయితేనేం కఠిన శ్రమ , దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించాడు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించవచ్చు అని నిరూపించాడు రమేష్ ఘోలాప్. ఇంతకీ ఆయన ఏం సాధించారు. పదండి రమేష్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.
'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్ని అక్షరాలా నిరూపించారు వికలాంగుడైన రమేష్ ఘోలప్. ఒకప్పుడు పొట్ట కూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే.. ప్రస్తుతం ఐఏఎస్గా సేవలందిస్తున్నాడు. కన్న తల్లికీ, పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు.
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సైకిల్ మరమ్మతు దుకాణం నడిపే నిరుపేద గోరఖ్ ఘోలాప్కు జన్మించాడు రమేష్. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. మద్యం కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, చిన్న వయసులోనే నలుగురు సభ్యుల కుటుంబ బాధ్యతను తీసుకోవలసి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. కానీ చదువులో రమేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్టే.
12వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తండ్రి అంత్యక్రియలకు బస్సు ఛార్జీలు చెల్లించడానికి కూడా డబ్బులులేని పరిస్థితి. ఈ తన దయనీయ స్థితి బైట పడాలంటే చదువే మార్గం అని గ్రహించాడు. అతను కష్టపడి పనిచేస్తూనే పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అత్యంత చౌకైన కోర్సు కాబట్టి దానిని అభ్యసించాడు. తరువాత దూరవిద్య ద్వారా ఆర్ట్స్లో డిగ్రీ చదివాడు. తరువాత 2009లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.
తన కల నిజం చేసుకోవాలని ఆలోచన తొలిచేస్తూ ఉండేది.. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. 2010లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. చివరికి తన ఉద్యోగం నుండి 6 నెలల విరామం తీసుకుని IAS కావాలనే కల సాకారం కోసం నడుం బిగించాడు. చివరికి తన కృషికి ఫలితం దక్కింది, 2012లో అతను 287 ర్యాంకుతో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. అదే సంవత్సరం, అతను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై 1వ ర్యాంకు సాధించాడు. 2012, మే 4న ఐఏఎస్ అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టడంతో గ్రామస్తులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
