breaking news
physically challeneged
-
నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్గా
పుట్టింది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించడానికి అతను తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మాడు. మరోవైపు పోలియోతో వైకల్యం. అయితేనేం కఠిన శ్రమ , దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించాడు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించవచ్చు అని నిరూపించాడు రమేష్ ఘోలాప్. ఇంతకీ ఆయన ఏం సాధించారు. పదండి రమేష్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్ని అక్షరాలా నిరూపించారు వికలాంగుడైన రమేష్ ఘోలప్. ఒకప్పుడు పొట్ట కూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే.. ప్రస్తుతం ఐఏఎస్గా సేవలందిస్తున్నాడు. కన్న తల్లికీ, పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సైకిల్ మరమ్మతు దుకాణం నడిపే నిరుపేద గోరఖ్ ఘోలాప్కు జన్మించాడు రమేష్. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. మద్యం కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, చిన్న వయసులోనే నలుగురు సభ్యుల కుటుంబ బాధ్యతను తీసుకోవలసి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. కానీ చదువులో రమేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్టే. 12వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తండ్రి అంత్యక్రియలకు బస్సు ఛార్జీలు చెల్లించడానికి కూడా డబ్బులులేని పరిస్థితి. ఈ తన దయనీయ స్థితి బైట పడాలంటే చదువే మార్గం అని గ్రహించాడు. అతను కష్టపడి పనిచేస్తూనే పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అత్యంత చౌకైన కోర్సు కాబట్టి దానిని అభ్యసించాడు. తరువాత దూరవిద్య ద్వారా ఆర్ట్స్లో డిగ్రీ చదివాడు. తరువాత 2009లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.తన కల నిజం చేసుకోవాలని ఆలోచన తొలిచేస్తూ ఉండేది.. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. 2010లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. చివరికి తన ఉద్యోగం నుండి 6 నెలల విరామం తీసుకుని IAS కావాలనే కల సాకారం కోసం నడుం బిగించాడు. చివరికి తన కృషికి ఫలితం దక్కింది, 2012లో అతను 287 ర్యాంకుతో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. అదే సంవత్సరం, అతను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై 1వ ర్యాంకు సాధించాడు. 2012, మే 4న ఐఏఎస్ అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టడంతో గ్రామస్తులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. -
రుణం గగనం
ఆదిలాబాద్ రూరల్, న్యూస్లైన్ : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు వికలాంగులకు అందడం లేదు. ప్రభుత్వం మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. జిల్లా కేంద్రంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్న ఫలితం లేకుండా పోతోంది. 2001 జనాభా లెక్కల ప్రకారం అంధులు 13,644 మంది, చెవిటి, మూగ 5,336, శారీరక వికలాంగులు 10,615, మానసిక వికలాంగులు 4,127 మంది ఉన్నారు. జిల్లాలో 33,722 మంది వికలాంగులు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 10 వేలకుపైగా వికలాంగులు పెరిగి ఉంటారని అధికారుల అంచనా. ఇదిలా ఉండగా, ఒక వికలాంగుడు వివాహం చేసుకుంటే రూ.50 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని 2011 జూలై 22న ప్రభుత్వ ఒక జీవోను విడుదల చేసింది. ఇప్పటివరకు 142 మంది వికలాంగులు, సకలాంగులను, సకాలంగులు, వికలాంగులను వివాహం చేసుకుని ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 19 మందికి రూ.50 వేల చొప్పున దశలవారీగా అందజేశారు. మిగతా 123 మంది ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతోనే అందించలేదని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు వికలాంగులక చేరడం లేదు. రుణాల మంజూరు కోసం నెలల తరబడి బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. వికలాంగులు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు గల వారు పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం వారికి రూ.30 వేల సబ్సిడీ అందజేస్తుంది. వీరు కిరాణ దుకాణం, టెంట్హౌస్, బట్టల దుకాణం, లేడీస్ ఎంపోరియం తదితర పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రయోజనం లేకుండా పోతోంది. బ్యాంకర్లు గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో రుణ సౌకర్యాలు అందిస్తామని హామీలిస్తూనే మరో బ్యాంకులకు వెళ్తే ఇప్పుడు అప్పుడు అంటూ తిప్పుకుంటున్నారని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తూనే, మరో పక్క వికలాంగుల దరి చేరనివ్వడం లేదు. ఐదేళ్లుగా నెరవేరని లక్ష్యం 2010-11 సంవత్సరానికి సంబంధించి 179 మందికి రూ.11.04 లక్షలు లక్ష్యం కాగా, ఇందులో 133 మందికి రూ.6.44 లక్షలు అందజేశారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 123 మందికి రూ.12.30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా లక్ష్యాన్ని పూర్తి చేశారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి 100 మందికి రూ.50 లక్షలు లక్ష్యం కాగా, 15 మందికి రూ.2.70 లక్షలు అందజేశారు. 2013-14 సంవత్సరానికిగాను 100 మందికి రూ.50 లక్షలు లక్ష్యంకాగా, ఇప్పటి వరకు 16 మందికి రూ.8 లక్షలు అందజేశారు.