ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు వికలాంగులకు అందడం లేదు. ప్రభుత్వం మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. జిల్లా కేంద్రంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్న ఫలితం లేకుండా పోతోంది. 2001 జనాభా లెక్కల ప్రకారం అంధులు 13,644 మంది, చెవిటి, మూగ 5,336, శారీరక వికలాంగులు 10,615, మానసిక వికలాంగులు 4,127 మంది ఉన్నారు. జిల్లాలో 33,722 మంది వికలాంగులు ఉన్నట్లు రికార్
ఆదిలాబాద్ రూరల్, న్యూస్లైన్ : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు వికలాంగులకు అందడం లేదు. ప్రభుత్వం మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. జిల్లా కేంద్రంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్న ఫలితం లేకుండా పోతోంది. 2001 జనాభా లెక్కల ప్రకారం అంధులు 13,644 మంది, చెవిటి, మూగ 5,336, శారీరక వికలాంగులు 10,615, మానసిక వికలాంగులు 4,127 మంది ఉన్నారు. జిల్లాలో 33,722 మంది వికలాంగులు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 10 వేలకుపైగా వికలాంగులు పెరిగి ఉంటారని అధికారుల అంచనా. ఇదిలా ఉండగా, ఒక వికలాంగుడు వివాహం చేసుకుంటే రూ.50 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని 2011 జూలై 22న ప్రభుత్వ ఒక జీవోను విడుదల చేసింది. ఇప్పటివరకు 142 మంది వికలాంగులు, సకలాంగులను, సకాలంగులు, వికలాంగులను వివాహం చేసుకుని ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 19 మందికి రూ.50 వేల చొప్పున దశలవారీగా అందజేశారు. మిగతా 123 మంది ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతోనే అందించలేదని అధికారులు పేర్కొంటున్నారు.
బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు వికలాంగులక చేరడం లేదు. రుణాల మంజూరు కోసం నెలల తరబడి బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. వికలాంగులు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు గల వారు పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం వారికి రూ.30 వేల సబ్సిడీ అందజేస్తుంది. వీరు కిరాణ దుకాణం, టెంట్హౌస్, బట్టల దుకాణం, లేడీస్ ఎంపోరియం తదితర పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రయోజనం లేకుండా పోతోంది. బ్యాంకర్లు గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో రుణ సౌకర్యాలు అందిస్తామని హామీలిస్తూనే మరో బ్యాంకులకు వెళ్తే ఇప్పుడు అప్పుడు అంటూ తిప్పుకుంటున్నారని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తూనే, మరో పక్క వికలాంగుల దరి చేరనివ్వడం లేదు.
ఐదేళ్లుగా నెరవేరని లక్ష్యం
2010-11 సంవత్సరానికి సంబంధించి 179 మందికి రూ.11.04 లక్షలు లక్ష్యం కాగా, ఇందులో 133 మందికి రూ.6.44 లక్షలు అందజేశారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 123 మందికి రూ.12.30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా లక్ష్యాన్ని పూర్తి చేశారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి 100 మందికి రూ.50 లక్షలు లక్ష్యం కాగా, 15 మందికి రూ.2.70 లక్షలు అందజేశారు. 2013-14 సంవత్సరానికిగాను 100 మందికి రూ.50 లక్షలు లక్ష్యంకాగా, ఇప్పటి వరకు 16 మందికి రూ.8 లక్షలు అందజేశారు.