మల్లవరపు జాన్
ఆధునిక తెలుగు పద్యకవిత్వంలో మల్లవరపు జాన్ విశిష్టమైన కవి. ధారాళమైన పద్య రచనా ప్రజ్ఞతో, సామా జిక చైతన్యంతో ఆయన ప్రజారంజకమైన ఖండ కావ్యా లను రచించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ‘దురాచార మెంతేని ఖండింప కలమునాయుధముగా మలుచు కొని’ సాంస్కృతిక సమరం చేశాడు. తెలుగుదేశ చారిత్రక, సాంస్కృతిక వైభవ, ప్రాభవాలను రమణీయంగా తన కవిత్వంలో చిత్రించడమే కాకుండా, తనకాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను ధిక్కరించి, సమానత్వాన్ని ప్రబోధించిన మల్లవరపు జాన్ పద్యకవుల్లో ప్రజాకవి. జాన్ కవిత్వం మాధుర్యగుణ భరితమైనదని, శ్రీనాథుడు చెప్పిన హర చూడాహరిణాంక వక్రతలోని సౌందర్యం ఆయన పద్యాల్లో ఉందని (అతుకుల బ్రతు కులు – పీఠిక) దాశరథి విశ్లేషించాడు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని చీమ కుర్తి గ్రామంలో మల్లవరపు దావీదు – రత్నమ్మ దంపతులకు 1927 జనవరి 22న ఆయన జన్మించాడు. పేదరికం అనే కత్తుల వంతెన మీదనడిచి, కుల, మత వివక్షల నిప్పుల వానలో తడిసి, మొక్క వోని సంకల్పంతో కఠోర శ్రమతో ‘మధుర కవి’గా, దేశికోత్తముడిగా ప్రసిద్ధిగాంచాడు. ‘చెప్పులు కుట్టి జీవనము సేయు కుటుంబము నందు బుట్టి చిన్నప్పటినుండి శారద పదార్చన జేసితి’ అని ఆయన, తన నేపథ్యాన్ని చెప్పుకున్నాడు. విద్యాభ్యాసం అనంతరం ఉపాధ్యాయు డిగా స్థిరపడినా, ఆయనలో జ్ఞానతృష్ణ చల్లార లేదు.
ఒంగోలులోని శఠగోపనాచార్యుని శిష్యరికంలో సంస్కృ తాంధ్ర భాషా సాహిత్యాలను, పంచకావ్యాలను అధ్య యనం చేశాడు. జాషువానంతర తెలుగు కవిత్వంలో ప్రామాణికమైన పద్య కవిగా ప్రఖ్యాతిగాంచిన జాన్ 2006 ఆVýæస్టు 12న కన్నుమూశాడు.
సజ్జనాను రక్తి జాను సూక్తి వామపక్ష, విప్లవ పోరాటాల నుండి అస్తిత్వ ఉద్య మాల వరకు సాగిన సామాజిక, సాహిత్య ఉద్యమాల ప్రభావం జాన్ కవిత్వంలో స్పష్టంగా కనబడుతుంది. 1967లోనే తన స్వీయానుభవాలను అక్షరబద్ధం చేసి, ‘కొండడు’ శీర్షికతో లఘు కావ్యం వెలువరించాడు. క్రైస్తవ కథాంశ నేపథ్యంలో రాసిన ‘సాంసన్–డెలీల’ పద్య నాటకం ఎంతగానో పేరు తెచ్చింది. విశ్వప్రకాశం, కాంతి రేఖలు, భావ విపంచి, చిరస్మరణీయులు, సరసవినోదిని, పుణ్యపురుషుడు వంటి ఖండ కావ్యాలతో తెలుగు సాహి త్యంలో పద్యకవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించు కున్నాడు. ‘సజ్జనానురక్తి జాను సూక్తి’ అనే మకుటంతో సూక్తి శతకం,‘భవ్యగుణవిచార బాలవీర!’ మకుటంతో రాసిన పద్యాల ద్వారా జీవనతాత్త్విక ఎరుకను, మూర్తి మత్వ స్ఫూర్తిని చాటి చెప్పాడు. ఆయన రాసిన చైతన్య గేయాలు, న్యాయం కావాలి, పంచముడు వంటి అముద్రితా లుగానే మిగిలిపోయాయి. అవిద్య, పేద రికం, మద్యపానం, అధిక జనాభా, కుటుంబ నియంత్రణ, అవినీతి, లంచ గొండితనం, దళిత జనోద్ధరణ, కుల నిర్మూలన, దేశభక్తి, విశ్వశాంతి లాంటి అంశాలపట్ల ప్రజల్లో సదావగా హన కల్పించడానికి జాన్ కృషి చేశాడు.
మనుషులకు ‘చితులను పేర్చినది మతమా? రెటమతమా? కపటమతుల రచితమా’ అని మతోన్మాదాన్ని నిరసించాడు. ద్వేషజ్వాలలతో ‘కలుష వ్యాపార పారీణులై త్రోవల్ దప్పి’ మతకల్లోలాలు కల్పించే దురాత్ముల’ను దేశద్రోహులుగా దుయ్యబట్టాడు. చాలామంది పద్య కవుల్లో మృగ్యమైన మహిళాభ్యుదయ చింతన జాన్ పద్యాల్లో కనిపిస్తుంది.
వివిధ విశ్వవిద్యాలయాల్లో జాన్ సాహిత్యంపై పరి శోధనలు జరిగాయి. జాన్ కావ్యాలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ‘అభినవ బాణ’, ‘కవిభూషణ’ వంటి అరుదైన బిరుదులను కూడా ఆయన అందు కున్నాడు. అటువంటి జాన్ శత జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.
– ఆచార్య కోయి కోటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ సిటీ కళాశాల, హైదరాబాద్ (మల్లవరపు జాన్ శతజయంతి సదస్సు నేడు ఒంగోలులో)


