స్వయంకృత అపరాధం మనిషి జీవితంలో జరిగే అనేక మార్పులకు హేతువు. ఒక మనిషి పతనం కావడానికి ఇదే మూలమవుతుంది. ఆ పతనం నాలుగు దశల్లో కొనసాగుతుంది.
నైతిక పతనం..
మనిషి ప్రవర్తన కృతజ్ఞతాహీనంగా మారుతుంది. సాయం చేసినవారికి ద్రోహం తలపెట్టడం, తిన్న ఇంటి వాసాలు లెక్కించడం జరుగుతుంది.
విలువల పతనం..
దురాశ, దురలవాట్లు ఎక్కువవుతాయి. ఎలానైనా తాము కోరు కున్నది పొందడానికి అడ్డదారులు వెతుకుతారు.
సామాజిక పతనం..
మనిషి సామాజిక ప్రాణి అనే విషయం మర్చిపోవడం జరుగుతుంది. తన గురించి ఈ లోకం ఏమి అనుకుంటుందనే భయం ఉండదు. వావి వరసలు చూడరు. స్వార్థం తలకెక్కుతుంది. తను చేసిందే సరైనది అనే భావనతో దుశ్చర్యలకు పాల్పడుతుంటారు.
ఆర్థిక పతనం..
తనువెల్లా అహంతో నిండిన మనుషులకు ఆర్థిక పతనమే ఆఖరి దశ. ఆర్థిక పతనం మొదలైన తర్వాత క్రమంగా పశ్చాత్తాప లక్షణాలు అంకురిస్తాయి. అందులో అతి కొద్ది మంది మాత్రమే చేసిన తప్పులను సరిదిద్దుకుని కొత్త జీవితాలను మొదలెడతారు. ఎక్కువ శాతం మంది అహం మత్తు నుండి బయటపడకుండా జీవితాలనే బలి చేసుకుంటారు.
అందుకే మనుషులు ముందుగా నైతికంగా పతనం చెందకూడదు. విచక్షణా జ్ఞానం కోల్పోకూడదు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకుని అడుగులు వేయాలి. కష్టపడకుండా వచ్చేది ఎప్పటికైనా మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు అనే సత్యాన్ని విస్మరించకూడదు.
– దుర్గమ్ భైతి


