సందర్భం
భారతదేశ ఆక్వా రాజధానిగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ దేశీయ మంచినీటి చేపల పెంపకంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చేపల పెంపకంలో పెట్టుబడి వ్యయం తక్కువే అయినప్పటికీ, నాణ్యమైన చేప పిల్లలే సాగు లాభా లను నిర్ణయిస్తాయి. కృత్రిమ ప్రేరిత ప్రజనన(ఇండ్యూస్డ్ బ్రీడింగ్) సాంకేతికత, చైనీస్ సర్క్యులర్ హేచరీల ప్రవేశంతో చేప పిల్లల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.
నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ సంస్థలు, పరి శోధనా సంస్థలు, ప్రైవేట్ పారిశ్రామికవేత్తల సమష్టి కృషితో గోదావరి, కృష్ణా, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో వందలాది హేచరీలు, నర్సరీలు ఏర్పడటంతో చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా విస్తరించింది. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో విస్తరించి ఉన్న బ్రూడ్స్టాక్ ఫారాలు, హేచరీలు, నర్సరీల నెట్వర్క్ ద్వారా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిషా వంటి అనేక రాష్ట్రాలకు నాణ్యమైన చేప పిల్లలు సరఫరా అవుతున్నాయి. చేపల పెంపకం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి పెద్ద పీట వేస్తోంది.
ఏపీ చేపల పెంపక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో జన్యు నాణ్యత క్షీణించటం ముఖ్యమైనది. అవే తల్లి చేపలను పదే పదే విత్తనోత్పత్తికి వాడటం వల్ల ఇన్–బ్రీడింగ్ జరిగి చేప పిల్లల ఎదుగుదల మందగిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షాలు హేచరీల ఉత్పాదకతను దెబ్బతీస్తున్నాయి. బ్యాక్టీరియా, పరాన్నజీవులు, శిలీంధ్రాల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. జాతుల వైవిధ్యీకరణ కొరవడటం మరో పెద్ద సవాలు. మార్కెట్లో ఫంగాసియస్, గిఫ్ట్ తిలాపియా, కొర్రమీను వంటి కొత్త జాతులకు డిమాండ్ పెరుగుతున్నా, ఇప్పటికీ మేజర్ కార్ప్ చేపలదే పైచేయిగా ఉంది.
జన్యుపరంగా మెరుగైన మంచినీటి చేపల రకాలను జన్యుపరంగా అభివృద్ధి చేయ డానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక చేపల జన్యు మిషన్ను ఏర్పాటు చేయాలి. హేచరీల గుర్తింపు, నాణ్యత హామీ కోసం చేపల విత్తన ధ్రువీకరణ సంస్థ వంటి ప్రత్యేక అథా రిటీని నెలకొల్పాలి. క్యూఆర్ కోడ్ ద్వారా చేప పిల్లల సరఫరా గొలుసును, రవాణాను ట్రాక్ చేయాలి. సౌరవిద్యుత్తో నడిచే హేచరీలు, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ (ఆర్ఏఎస్) వంటి మౌలిక వసతుల్లో పర్యావరణ అనుకూల ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహించాలి.
చేపల సాగు విస్తీర్ణాన్ని పెంచటం కంటే నాణ్యతను మెరుగుపరచటంపైనే భవి ష్యత్తు పోటీతత్వం ఆధారపడి ఉంటుంది. వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా.. డిజిటల్ ట్రేసబిలిటీ, జీవ భద్రతా ప్రమాణాలతో దేశంలోనే ధ్రువీకరించబడిన చేప పిల్లల ఉత్పత్తికి జాతీయ కేంద్రంగా ఏపీ ఎదగాలి. అప్పుడే రాష్ట్రం భారతదేశ ‘బ్లూ ఎకానమీ’కి వెన్నెముకగా నిలిచి ‘ఫిష్ సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతుంది.
- డా. పి. రామమోహనరావు, వ్యాసకర్త విశ్రాంత మత్స్యశాఖ ఉప సంచాలకులు, కాకినాడ (జూలై 10న జాతీయ చేపల రైతుల దినోత్సవం)


