సాక్షి, విజయవాడ: రావణ్ పై ఉపా కేసు పెట్టడం అత్యంత హేయమైన చర్యని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. రావణ్ తరపున వాదనలు వినిపించేందుకు కోర్టుకు వచ్చానని పీపీ రాకపోవడంతో కేసును కోర్టు మంగళవారానికి వాయిదా వేసిందని తెలిపారు. శుక్రవారం రావణ్ కేసు అంశమై ఆయన మీడియాతో మాట్లాడారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.."రావణ్ను పోలీసులు 10 రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ వేశారు. అక్రమ కేసులు బనాయించారు కాబట్టి అతనికి అండగా నిలుస్తున్నాం. రావణ్ కు వైసీపీ ఎటువంటి సంబంధం లేదు.రావణ్ పై ఉపా యాక్ట్ అంటే రాజహింస కాదా. పోలీసులు రావణ్ ఇంటికి వెళ్లి బియ్యం డబ్బాలు కూడా సోదాలు చేయడమేంటి. ఈ ప్రభుత్వం ఎవరినో మెప్పించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది.అని ప్రశ్నించారు.
తాను సామాన్య లాయర్ ని కాబట్టి సామాన్యుల తరుపున వాదించడానికి వచ్చానని కోర్టు వాయిదా ప్రకారం మంగళవారం వచ్చి రావణ్ తరపున వాదిస్తానని పేర్కొన్నారు. కాగా ప్రశ్న రావణ్పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రావణ్పై ఇప్పటికే ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు . ఇక, తాజాగా రావణ్ నిర్వహిస్తున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు లేఖ రాశారు.
రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద కంటెంట్ ప్రసారం చేస్తూ ప్రతి నెల సుమారు రూ.1.50 లక్షల ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఆదాయం వివరాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.వివాదాస్పద వీడియోలను తొలగించాలని, ఛానల్ను నిలిపివేయాలని పోలీసులు మెటా సంస్థను కోరారు.
దీనిపై స్పందించిన మెటా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తామని, అయితే మొత్తం ఛానల్ను పూర్తిగా నిలిపివేయడం తమ పరిధిలో లేదని పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.


