కథ: నిజమైన నాయకత్వం! | Children's Inspirational True Leadership Story Written By Muddu Hemalatha | Sakshi
Sakshi News home page

కథ: నిజమైన నాయకత్వం!

Jul 12 2026 12:59 PM | Updated on Jul 12 2026 12:59 PM

Children's Inspirational True Leadership Story Written By Muddu Hemalatha

ఫండే

పిల్లల కథ

నగనగా ఒక  అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా శక్తిమంతమైనది, కానీ శక్తికి మించిన గర్వం దాని సొంతం. ప్రతిరోజూ ఉదయాన్నే ఆ సింహం చేసే భయంకరమైన గర్జనలకు అడవిలోని చెట్లు సైతం వణికిపోయేవి. ‘ఈ అడవికి నేనే సర్వాధికారిని, నా మాటే వేదవాక్కు’ అని అది విర్రవీగుతూ, మిగిలిన జంతువులను చులకనగా చూసేది. జంతువులన్నీ దాని నీడ కనిపిస్తేనే ప్రాణభయంతో చెల్లాచెదురైపోయేవి.

ఒక మధ్యాహ్నం మండుతున్న ఎండలో ఒక ఏనుగు చెరువు దగ్గర ప్రశాంతంగా నీళ్లు తాగుతోంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన సింహం, ఏనుగును చూడగానే అహంకారంతో ఊగిపోయింది. ‘ఓయ్‌ నల్ల బండా! నా దారికి అడ్డుగా నిలబడతావా? నేనెవరో తెలుసా? వెంటనే ఇక్కడి నుండి తప్పుకో!’ అని గర్జించింది. ఏనుగు చాలా సంస్కారవంతురాలు కాబట్టి, ఎంతో వినమ్రంగా ‘క్షమించు రాజా, దాహం వేసి ఇప్పుడే వచ్చాను, నీళ్లు తాగి వెళ్ళిపోతాను’ అని బదులిచ్చింది. కానీ సింహం శాంతించలేదు, ‘క్షణంలో నా కంట పడకుండా వెళ్ళిపోకపోతే నీ అంతం చూస్తాను’ అని హెచ్చరించింది. ఏనుగు ఏమీ మాట్లాడకుండా, ఆ గర్విష్టి సింహానికి తలవంచి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది.

మరుసటి రోజు అడవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారుమబ్బులు కమ్మి, భయంకరమైన తుఫాను మొదలైంది. ఉరుములు, మెరుపుల ధాటికి అడవి అంతా అతలాకుతలమైంది. పెనుగాలికి ఒక భారీవృక్షం వేళ్లతో సహా పెకలించుకుపోయి, సరిగ్గా గుహ బయట ఉన్న సింహం మీద పడింది. ఆ బరువుకు సింహం కింద పడిపోయి, కదలలేని స్థితికి చేరుకుంది. ‘ఎవరైనా కాపాడండి! చనిపోతున్నాను!’ అని ఎంత ఆక్రందన చేసినా, దాని గర్వానికి భయపడి ఏ జంతువూ దరిదాపుల్లోకి రాలేదు.

అదే సమయంలో అడవిలో వైద్యం చేసే ఎలుగుబంటి సింహం పడుతున్న యాతనను చూసి చలించిపోయింది. వెంటనే సింహం దగ్గరకు వెళ్లి, ఆ భారీ చెట్టును పక్కకు జరపడానికి తన శక్తినంతా ధారపోసి ప్రయత్నించింది. కానీ ఒక్క ఎలుగుబంటి వల్ల అది సాధ్యం కాలేదు. అప్పుడు ఎలుగుబంటికి ఏనుగు గుర్తుకు వచ్చింది. సింహం చేసిన అవమానాన్ని మరచిపోయి, అడవి రాజు ప్రాణాలు కాపాడమని ఏనుగును వేడుకుంది. ఏనుగు క్షణం కూడా ఆలోచించకుండా అక్కడికి చేరుకుని, తన బలమైన తొండంతో ఆ భారీ వృక్షాన్ని ఒక్క ఊపున పక్కకు విసిరేసింది.

ప్రాణాలు దక్కించుకున్న సింహం కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘గజరాజా! నిన్న నిన్ను అంతగా అవమానించినా, నా ప్రాణాలు ఎందుకు కాపాడావు?’ అని పశ్చాత్తాపంతో అడిగింది. అప్పుడు ఏనుగు చిరునవ్వుతో ‘రాజా! ఇతరులను భయపెట్టడం అధికారం కాదు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన శక్తి’ అని హితవు పలికింది. ఎలుగుబంటి కూడా తోడై ‘ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు’ అని వివరించింది. ఆ మాటలతో సింహం అహంకారం పూర్తిగా నశించిపోయింది.

అయితే, అడవిలో శాంతి నెలకొంటున్న తరుణంలో ఒక కొత్త ముప్పు పొంచి వచ్చింది. కొంతమంది వేటగాళ్లు అత్యాధునిక ఆయుధాలతో అడవిపై దాడి చేయడానికి సరిహద్దుల్లో తిష్ట వేశారు. గతంలో అయితే సింహం ఒంటరిగా వెళ్లి వారితో పోరాడి గాయపడేది, కానీ ఇప్పుడు అది ఏనుగు, ఎలుగుబంటితో కలిసి యుద్ధ తంత్రాన్ని రచించింది. పక్షులు ఆకాశం నుండి వేటగాళ్ల కదలికలను గమనించాయి, కోతులు చెట్లపై నుండి రాళ్లు రువ్వాయి, ఎలుగుబంటి తేనెటీగల గుంపును వారిపైకి ఉసిగొల్పింది. చివరగా సింహం, ఏనుగులు కలిసి చేసిన మెరుపు దాడికి వేటగాళ్లు ప్రాణభయంతో అడవి విడిచి పారిపోయారు.

అడవిలో మునుపెన్నడూ లేని ఐక్యత కనిపించింది. సింహం తన గర్వాన్ని వదిలి, ఏనుగును తన  మంత్రిగా, ఎలుగుబంటిని రాజ్య వైద్యుడిగా నియమించుకుంది. ప్రతి జంతువు సమస్యను స్వయంగా విని పరిష్కరించే నాయకుడిగా సింహం పేరు తెచ్చుకుంది. అడవిలో క్రూరత్వం పోయి అనురాగం పెరిగింది, బలహీనమైన జంతువులకు రక్షణ దొరికింది. శక్తికి వివేకం తోడైతే, అధికారం సేవగా మారితే ఎంతటి మార్పు వస్తుందో తెలుసుకుంది సింహం.
- ముద్దు హేమలత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement