హెల్త్
నా వయస్సు 22 సంవత్సరాలు. నాకిప్పుడు ఏడోనెల. ఇటీవల పరీక్ష చేయించుకుంటే రక్తపోటు ఎక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు. మందులు కూడా వాడమన్నారు. ఈ సమస్య వల్ల నాకు లేదా నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా? ఈ మందులు గర్భంలో సురక్షితమేనా? – చైత్ర, మంచిర్యాల.
గర్భధారణ సమయంలో మొదటిసారిగా అధిక రక్తపోటు రావడాన్ని ‘ప్రీఎక్లాంప్సియా’ అంటారు. సాధారణంగా రక్తపోటు ‘140/90 ఎమ్ఎమ్హెచ్జీ’ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని అనుమానిస్తారు. కొంతమందిలో దీనితో పాటు మూత్రంలో ప్రొటీన్ కనిపించడం, రక్తపరీక్షల్లో మార్పులు లేదా కాలేయం, మూత్రపిండాల పనితీరులో లోపాలు కూడా ఉండవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి గర్భం దాల్చడం, చాలా చిన్న వయస్సులో లేదా ఎక్కువ వయస్సులో గర్భం ధరించడం లేదా గత గర్భంలో అధిక రక్తపోటు వచ్చినా, కవల పిల్లలు గర్భంలో ఉన్నా, గర్భానికి ముందే రక్తపోటు లేదా మధుమేహం ఉన్నా, అధిక బరువు ఉన్నా లేదా సంతానలేమి చికిత్సల ద్వారా గర్భం దాల్చినా ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య సాధారణంగా 20 వారాల తర్వాత ప్రారంభమవుతుంది. ఎక్కువగా మూడో త్రైమాసికంలో కనిపిస్తుంది. అరుదుగా ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు కూడా రావచ్చు.
చాలామంది గర్భిణీల్లో ఈ సమస్యకు మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణ గర్భధారణ పరీక్షల్లోనే ఇది బయటపడుతుంది. అయితే కొందరిలో అకస్మాత్తుగా బరువు పెరగడం, శరీరం మొత్తం వాపు రావడం, స్కానింగ్లో బిడ్డ ఎదుగుదల తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు. అయితే కొందరిలో తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం లేదా వెలుగులు మెరుస్తున్నట్లు కనిపించడం, వాంతులు, ముఖం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా వాపు రావడం, మూత్రం తగ్గిపోవడం, కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన పరిస్థితుల్లో మూర్ఛలు (సీజర్లు) రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
ప్రీఎక్లాంప్సియా నిర్ధారణ అయితే రక్తపోటును నియంత్రించేందుకు మందులు అవసరం అవుతాయి. సాధారణంగా ‘లాబెటాలోల్’లేదా ‘నైఫెడిపిన్’ వంటి మందులు గర్భధారణలో సురక్షితంగా పరిగణించబడతాయి. వైద్యుడి సూచన మేరకు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. స్వయంగా మందులు ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకూడదు. గర్భధారణ ప్రారంభ దశలో చేసిన ఎన్ టీ స్కాన్, ఇతర రక్తపరీక్షల ఆధారంగా ప్రీఎక్లాంప్సియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తిస్తే, నివారణ కోసం కొంతమందికి తక్కువ మోతాదులో మందును సూచిస్తారు.
ప్రీఎక్లాంప్సియాను నిర్లక్ష్యం చేస్తే తల్లికీ, బిడ్డకీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిలో రక్తపోటు మరింత పెరగడం, మూర్ఛలు రావడం, కాలేయం లేదా మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, ముందస్తు ప్రసవం లేదా అత్యవసర శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. బిడ్డలో ఎదుగుదల తగ్గిపోవడం, గర్భాశయంలో నీటి పరిమాణం తగ్గడం, ముందుగానే పుట్టడం లేదా పుట్టిన తర్వాత కొంతకాలం ప్రత్యేక సంరక్షణ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు.
అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి, రక్తపోటును నియంత్రిస్తూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, బిడ్డ ఎదుగుదలను పర్యవేక్షిస్తే చాలా వరకు ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు. అందుకే గర్భధారణ సమయంలో ప్రతి పరీక్షను సమయానికి చేయించుకోవడం, వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడటం, తలనొప్పి, చూపు మసకబారడం, శరీరం ఎక్కువగా వాపు రావడం లేదా బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం చాలా ముఖ్యం. సరైన సమయంలో గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం, నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉండడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఆందోళన చెందకుండా మీ వైద్యుల సూచనలు తప్పకుండా పాటించండి.
- డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్


