మంగోలియా అస్తిత్వానికి, అక్కడి ప్రజల జీవన విధానానికి అద్దం పట్టే జాతీయ ఉత్సవం ‘నాదమ్’. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఈ వేడుకను ప్రతి సంవత్సరం జూలై 11 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకొంటారు. మంగోలియన్ల సంచార నాగరికతతో విడదీయరాని బంధం ఉన్న ఈ వేడుక, 2010లో సాంస్కృతిక వారసత్వ పండుగగా యునెస్కో గుర్తింపు పొందింది.

మంగోలియా అనగానే మనకు గుర్రాల గుంపులు, అంతులేని పచ్చని మైదానాలు, చెంఘిజ్ ఖాన్ పరాక్రమం గుర్తొస్తాయి. నేటి ఆధునిక యుగంలోనూ ఆ ప్రాచీన సంచార సంస్కృతిని, వీరత్వాన్ని సజీవంగా ఉంచుతూ ఏటా జూలై నెలలో అత్యంత వైభవంగా ‘నాదమ్’ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. స్థానికంగా దీనిని ‘ఎరీన్ గుర్వన్ నాదమ్’ కూడా అని పిలుస్తారు.

నాదమ్ పండుగలో నిర్వహించే గుర్రపు పందాలు, కుస్తీ, విలువిద్య అనే మూడు సాంప్రదాయ క్రీడలు వారి జీవన పరిస్థితులకు ప్రత్యక్ష రూపాలు. ఇవి కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, పూర్వకాలంలో సైనికులను యుద్ధానికి సిద్ధం చేసే శిక్షణలో భాగంగా ఉండేవి. వీటిని తరతరాలుగా కుటుంబ సభ్యులే పిల్లలకు నేర్పిస్తారు. అయితే, ఇటీవలి కాలంలో కుస్తీ, విలువిద్యల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఇక్కడి ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. గెలుపొందిన విజేతలకు ప్రత్యేక బిరుదులు ఇవ్వడమే కాకుండా, పోటీదారులను కొనియాడుతూ ప్రత్యేక ప్రశంసా గీతాలు, కవితలను అంకితం చేయడం ఇక్కడి ఆచారం.

నాదమ్ కేవలం ఆటల పోటీ మాత్రమే కాదు.. అదొక సాంస్కృతిక సంబరం!
పండుగ రోజుల్లో మంగోలియన్లు అందరూ ‘దీల్’ అని పిలిచే తమ సాంప్రదాయ, రంగురంగుల పట్టు దుస్తులను ధరించి ఎంతో ముచ్చటగా తయారవుతారు. ఉత్సవాల సమయంలో ‘ఖుషూర్’ అనే ప్రత్యేకమైన వంటకంతో పాటు, గుర్రం పాలను పులియబెట్టి తయారుచేసే ‘ఐరాగ్’ అనే సాంప్రదాయ పానీయాన్ని అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. ఈ వేడుకలో మంగోలియన్ల ప్రత్యేక సంగీత వాద్య పరికరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్లో జరిగే జాతీయ ఉత్సవాలతో పాటు, గ్రామీణ ప్రాంతాలలో స్థానిక స్థాయిలో జరిగే నాదమ్ వేడుకలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న విలువలనూ, ప్రకృతితో ముడిపడిన సంచార జీవనాన్నీ నేటికీ గౌరవిస్తూ, సమాజాన్ని ఏకం చేసే శక్తి నాదమ్. అందుకే ఇది కేవలం ఒక పండుగగా మిగిలిపోకుండా, ప్రపంచ సాంస్కృతిక సంపదగా వెలుగొందుతోంది.
- రమా జంబుల


