హైదరాబాద్: ఫిన్లాండ్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన వనస్థలిపురం వైదేహినగర్ కాలనీకి చెందిన మర్ణత– ముత్యంరెడ్డి దంపతుల పెద్ద కుమారుడు మణిదీప్రెడ్డి ఏమైనట్టో తేలడంలేదు. లాతి పట్టణంలోని ఎల్యూటీ యానివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుతున్న మణిదీప్ మే 4న తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడాడు.
మరునాడు ఫోన్ చేసినా స్పందించలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అతడి స్నేహితులు, తెలిసినవారిని వాకబు చేసినా, కాలేజీలో విచారించినా ఫలితం లేకపోయింది. మణిదీప్ అదృశ్యమైనట్లు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 9న క్రూనువు ఒరెన్ రంటా సముద్రతీరంలో లభించిన మృతదేహం మణిదీప్రెడ్డిదిగా ఫిన్లాండ్ ఫెడరల్ బ్యూరో అధికారులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి నేరం జరిగినట్లు అనుమానాలు లేవని వెల్లడించారు.
కాగా, మణిదీప్రెడ్డి గుర్తింపు కార్డులు పంపించి మృతదేహం తమ కుమారిడిదే అనడం సరికాదని ముత్యంరెడ్డి అన్నారు. రెండునెలలుగా సముద్రంలో శవం ఉంటే చేపలు తినవా, కార్డులు పంపించినప్పుడు శవం ఫొటో ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. తమ కుమారుడి ఆచూకీ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశామని, ఈ నెల 16న విచారణ జరగనున్న నేపథ్యంలో కేసును మూసివేసేందుకు నమ్మించే ప్రయత్నాన్ని అక్కడి అధికారులు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో మణిదీప్ ఏమయ్యాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


