breaking news
Life style
-
అడుగు పడితే, లైట్ పడుతుంది!
రోజూ చేసే చిన్న చిన్న పనులే ఎక్కువ సమయాన్ని తినేస్తుంటాయి! అలాంటి పనులను చిటికెలో పూర్తి చేసి, కాస్త స్మార్ట్గా మార్చే గాడ్జెట్లు ఇప్పుడు మార్కెట్లో బోలెడున్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైనవే ఇవి!సోలార్ వాల్ లైట్దొంగలను భయపెట్టి, బయటపెట్టే లైట్స్ ఇవి. రాత్రి అందరూ నిద్రలో ఉంటారు... కానీ ఈ లైట్ మాత్రం డ్యూటీలో ఉంటుంది! ఎవరైనా ఇంటి గుమ్మం దగ్గరకు రాగానే ‘ఇదిగో దొంగ.. దొంగ!’ అన్నట్లు టక్కున వెలిగిపోతుంది. మోషన్ సెన్సర్తో పనిచేసే ఈ సోలార్ వాల్ లైట్ దొంగలకు చిన్న షాక్ ఇవ్వడమే కాదు... ఇంటి చుట్టూ ఏ కదలిక జరిగినా వెంటనే వెలుతురు వెదజల్లుతుంది. పగలంతా సూర్యరశ్మితో చార్జ్ అవుతుంది కాబట్టి కరెంట్ బిల్లు పెరుగుతుందేమోనని ఆందోళన అక్కర్లేదు. వర్షం వచ్చినా, ఎండ మండినా వాటర్ప్రూఫ్ బాడీతో చక్కగా పనిచేస్తుంది. గుమ్మం, బాల్కనీ, తోట, మెట్లు– ఎక్కడ పెట్టినా వెచ్చని పసుపు వెలుతురుతో ఇంటికి అందాన్ని, భద్రతను ఒకేసారి అందిస్తుంది. ధర కేవలం రూ. 300 మాత్రమే!లెక్కలతో పాటు... లెటర్స్ కూడా!కాలిక్యులేటర్లో లెక్కలు వేసి... మళ్లీ పక్కన కాగితం కోసం వెతుకుతుంటారా? ఇక ఆ పని లేదు! ఈ టూ ఇన్ వన్ కాలిక్యులేటర్ ఒకేసారి లెక్కలూ వేస్తుంది, పక్కనే నోట్స్ కూడా రాస్తుంది. ఎంత ఖర్చయ్యింది? ఎంత బ్యాలెన్స్? వెంటనే రాసేసి, పని అయిపోయాక ఒక్క బటన్ తో చెరిపేయొచ్చు. కాగితాలు చింపాల్సిన పని లేదు, చిన్న చిట్టీలు పోగొట్టుకునే టెన్షన్ లేదు. మడతపెట్టే డిజైన్ తో జేబులోనో, బ్యాగులోనో హాయిగా సరిపోతుంది. స్టూడెంట్స్, టీచర్లు, ఆఫీస్ ఉద్యోగులు, లెక్కలతో పని ఉన్నవాళ్లందరికీ ఇది చిన్న సైజ్లో ఉండే పెద్ద హెల్పర్. కాలిక్యులేటర్ ఒకటి కొంటే, నోట్ప్యాడ్ కొనాల్సిన అవసరమే లేదు. ధర సుమారు రూ.600.కత్తెరకు కన్ను!కత్తిరిస్తుంటే... సరైనా కొలత ఒక వైపు, కత్తెర మరోవైపు వెళ్లిపోతున్నాయా? ఇక ఆ టెన్షన్ కు కట్! ఈ లేజర్ కత్తెర ముందే ఎర్రటి లేజర్ గీతను చూపిస్తూ ‘ఇదే దారి... ఇటే కట్ చెయ్!’ అని గైడ్ చేస్తుంది. కాబట్టి వంకర టింకరలు లేకుండా సూటిగా కత్తిరించొచ్చు. బట్టలు, గిఫ్ట్ పేపర్లు, కార్డ్బోర్డులు, క్రాఫ్ట్ పనులు... ఏది కత్తిరించినా ఫినిషింగ్ మాత్రం ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్లు పదునుగా ఉండటంతో ఎక్కువ శ్రమ కూడా ఉండదు. చేతికి నొప్పి కలగకుండా సౌకర్యవంతమైన పట్టుతో డిజైన్ చేశారు. ఇంట్లో చిన్న చిన్న క్రాఫ్ట్ పనులు చేసే వాళ్ల నుంచి టైలర్లు, బొటిక్ యజమానుల వరకు అందరికీ ఇది సూపర్ హెల్పర్. ఇకపై ముందు గీత గీసే పని లేకుండా, లేజర్ చూపించిన దారిలో కట్ చేయడమే! ధర కేవలం రూ. 350 మాత్రమే! -
శ్వేతమాధవుడు: పూర్వం కృతయుగంలో శ్వేతుడు..
పూర్వం కృతయుగంలో శ్వేతుడు అనే రాజు సమస్త భూమండలాన్నీ పరిపాలించేవాడు. అతడి పరిపాలనలో ప్రజలు సర్వసుభిక్షంగా జీవించేవారు. అతడి రాజ్యంలో మనుషులకు పదివేల ఏళ్ల పరమాయువు ఉండేది. అకాల మరణాలు ఉండేవి కాదు. రోజులిలా సాగుతుండగా, ఒకసారి అనుకోని విపత్తు సంభవించింది.శ్వేతుడి రాజ్యంలో కపాలగౌతముడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. అతడికి కొడుకు పుట్టాడు. ఆ బాలుడు ఇంకా నోట్లో దంతాలు రాకముందే అకాల మృత్యువు చెందాడు. దుఃఖితుడైన కపాలగౌతముడు తన పుత్రుని మృతదేహంతో రాజాస్థానానికి వచ్చాడు.పసిబాలుడి మృతదేహాన్ని చూసిన శ్వేతుడు చలించిపోయాడు. ‘ఈ బాలుడిని పునర్జీవితుడిని చేయలేకపోతే నేనే అగ్నిప్రవేశం చేస్తాను’ అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు.అప్పటికప్పుడు పరమశివుడి కోసం శ్వేతుడు తపస్సు ప్రారంభించాడు. నీలపద్మాలతో పరమశివుడిని అర్చిస్తూ, ప్రార్థించాడు. శ్వేతుడి భక్తికి సంతసించిన పరమశివుడు పార్వతీ సమేతంగా అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! నీ భక్తికి సంతుష్టి చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అన్నాడు.శ్వేతుడు పార్వతీ పరమేశ్వరులకు భక్తిగా నమస్కరించి, ‘పరమేశ్వరా! అభం శుభం తెలియని ఈ పసిబాలుడు అకాలమరణం చెందాడు. ఇతడిని పునర్జీవితుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞ మేరకు ఈ బాలుడిని తిరిగి బతికించు. నా రాజ్యంలో అకాల మరణాలు లేకుండా అనుగ్రహించు’ అని కోరాడు. పరమశివుడు ‘తథాస్తు’ అని పలికాడు. మరుక్షణమే యమకింకరులు ఆ బాలుడి ప్రాణాలను తీసుకువచ్చారు. నిద్రలోంచి మేల్కొన్నవాడిలా ఆ బాలుడు పునర్జీవితుడయ్యాడు. పుత్రుడు పునర్జీవితుడు కావడంతో కపాలగౌతముడు పరమానందం పొందాడు.శ్వేతుడు ఎలాంటి చీకుచింతలు లేకుండా పదివేల ఏళ్లు రాజ్యపాలన చేశాడు. లౌకిక ధర్మాలన్నీ నెరవేర్చాక ఐహిక సుఖాలపై విరక్తి చెందాడు. పురుషోత్తమ క్షేత్రంలో శేషజీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు. పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుని, జగన్నాథుడి సన్నిధానానికి సమీపంలో శ్వేతపర్వతంపై సువిశాలమైన ప్రాసాదాన్ని నిర్మింపజేశాడు. ఆ ప్రాసాద మధ్యభాగంలో మాధవమూర్తిని ప్రతిష్ఠించాడు. మాధవ ప్రతిష్ఠాపన సందర్భంగా వేలాది విప్రులకు, సాధువులకు, తపస్వులకు భూరి దానాలు చేశాడు.శ్వేతుడు అక్కడే నివాసం ఏర్పరచుకుని, ఒక తటాకం ఒడ్డున తపోనిష్ఠతో ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ, మాధవుడిని ఆరాధించసాగాడు. కొన్నాళ్లకు పూర్తిగా నిరాహారుడై శ్రీమహావిష్ణువును ధ్యానించసాగాడు. ధ్యాన స్థితిలో శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు. శ్వేతుడి భక్తికి శ్రీమహావిష్ణువు పరవశుడయ్యాడు. సకల దేవతా పరివారం వెంట రాగా, శ్రీమహాలక్ష్మీ సమేతంగా శ్వేతుడి ఎదుట సాక్షాత్కరించాడు. ‘వత్సా! నీ భక్తికి పరమానందం చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అని పలికాడు.‘భక్తవత్సలా! పుండరీకాక్షా! జగన్నాథా! పాహిమాం... పాహిమాం... నన్ను నీ భక్తులలో ఒకరిగా పరిగణించి, వైకుంఠవాస యోగ్యత కల్పించు. అంతకు మించి నాకంటూ నేను కోరేదేమీ లేదు’ అన్నాడు శ్వేతుడు.‘రాజా! నువ్వు మరికొన్నాళ్లు రాజ్యభోగాలను అనుభవించిన తర్వాత నా లోకానికి చేరుకోగలవు. నీ తపోమహిమతో ఈ ప్రదేశం పునీతమైంది. నీకు సన్నిహితంగా నేను ఇక్కడే సమస్త దేవతా పరివారంతో కలసి శ్వేతమాధవుడిగా కొలువుంటాను. ఈ తటాకం శ్వేతమాధవ తీర్థంగా ప్రసిద్ధి పొందుతుంది. శ్వేతమాధవ తీర్థంలోని జలబిందువులు కుశాగ్ర పరిమాణంలో తాకినా భక్తులను పునీతులను చేస్తాయి.’ అని శ్రీమహావిష్ణువు వరమిచ్చాడు. శ్వేతుడికి ఇచ్చిన వరం ప్రకారం అక్కడే శ్వేతమాధవుడిగా వెలిశాడు.కొంతకాలం రాజ్యపాలన సాగించిన తర్వాత శ్వేతుడు ఒకనాడు అనాయాసంగా కాలధర్మం చెందాడు. వైకుంఠం నుంచి విష్ణుభక్తులు వచ్చి, అతడిని తమతో పాటు దివ్యవిమానంలో వైకుంఠంలోని విష్ణు సన్నిధానానికి తీసుకుపోయారు.పురావిశేషం..ఇది వేదవ్యాసుడి గుహ. కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు వినాయకుడి సాయంతో ఇదేచోట మహాభారత రచన చేశాడని భక్తుల నమ్మకం. ఇది బదరీనాథ్ క్షేత్రానికి చేరువలోని మాణా గ్రామంలో ఉంది. ఈ గ్రామాన్ని భారతదేశంలోని చిట్టచివరి గ్రామంగా చెబుతారు. సముద్ర మట్టానికి 10,600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహను సందర్శించడం అంత తేలికకాదు. ఇక్కడ గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
శత్రుత్వం వద్దు..
పైడి పర్వతం పక్కన ఉన్న కందర్ప రాజ్యం రాజు వివేక వర్మ సుపరిపాలన సాగిస్తూ, ప్రజలకు ఎంతో మేలుచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్నాడు. పైడి పర్వతంలో పుట్టిన ధారావళి నది కందర్ప రాజ్యంలోని పొలాలను సస్యశ్యామలం చేస్తూ రాజ్యాన్ని పచ్చగా ఉంచుతోంది.ఆ సుభిక్షం వలన మంత్రి సుహస్తుడి ప్రణాళికల వలన పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. ధారావళి నది కందర్ప రాజ్యం నుంచి పక్కనే ఉన్న ప్లవంగ రాజ్యంలోనూ ప్రవహిస్తూ ఆ రాజ్యంలోని పొలాలను కూడా సస్యశ్యామలం చేస్తోంది.ప్లవంగ రాజ్యాన్ని విజయ వర్మ పాలిస్తున్నాడు. ఆయన కూడా ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్లవంగ రాజ్యంలోనే ఉన్న రసోపర్వతంలో అనేక రసాయన రాళ్ళు ఉన్నాయి. వాటితో మనుషులకు, జంతువులకు ఉపయోగపడే ఎన్నో మందులు ప్లవంగ రాజ్యంలో శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. ఆ రాళ్ళను కందర్ప రాజ్య శాస్త్రవేత్తలు కూడా ఉపయోగిస్తున్నారు.విజయవర్మ ప్రధానమంత్రి దురోత్తుడికి కొంత వక్రబుద్ధి ఉంది. ఒకరోజు ఆయన రాజు గారితో, ‘మహారాజా ఆ రసోపర్వతం వలన మనరాజ్యం సుభిక్షంగా ఉంది కాని, మనం కందర్పరాజ్యం నుండి వచ్చే ధారావళి నది నీటిని ప్రజల అవసరాలకు ఉపయోగిస్తూ మన రాజ్యంలోని పొలాలు పండించుకుంటున్నాం. భవిష్యత్తులో వారు ధారావళి నది మీద ఆనకట్టలు కడితే మనకు నీటి కొరత రావచ్చు. అందువలన మనం కందర్ప రాజ్యాన్ని ఆక్రమిస్తే అటు నీటి లభ్యత, ఇటు మనరాజ్యం పరిశ్రమలతో ఒకే రాజ్యంగా శోభిల్లుతుంది’ అని మంత్రి తన దురాలోచనను రాజు విజయవర్మకు చెప్పాడు.మంత్రి చెప్పిన దానిమీద రాజు విజయవర్మ ఒకింత ఆలోచించి మూడు నెలలలో కందర్ప రాజ్యం మీద దండయాత్ర చేయాలని నిశ్చయించి, కందర్ప రాజ్యం రాజుగారు వివేకవర్మకి దూతద్వారా ఒక సందేశం ఈ విధంగా పంపాడు:‘మీరాజ్యాన్ని మాకు శాంతియుతంగా అప్పగించండి లేకపోతే ఉభయ రాజ్యాలకు యుద్ధం తప్పదు, రక్తపాతం తప్పదు’ఇట్లు,విజయవర్మ,ప్లవంగ రాజ్య రాజుఆ సందేశం చూసి వివేక వర్మ ఆశ్చర్య పోయాడు. ఇన్నేళ్లు శాంతియుతంగా ఉన్న ప్లవంగ రాజుకు ఈ బుద్ధి ఎలా పుట్టిందో వివేక వర్మకు అర్థం కాలేదు. వెంటనే మంత్రి సుహస్తుడిని ఈ విషయం మీద సలహా అడిగాడు.‘మహారాజా ఈ బుద్ధి విజయ వర్మకు పుట్టినది కాదు. ఎవరో ఆయన మెదడులో విషబీజం నాటారు. నేనే వెళ్ళి విజయవర్మతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పాడు సుహస్తుడు.రెండో రోజే సుహస్తుడు ప్లవంగ రాజ్యానికి వెళ్ళి రాజు విజయవర్మను కలిసి ఈ విధంగా చెప్పాడు: ‘మహారాజా ఇన్ని సంవత్సరాలు మన రెండు రాజ్యాలు పాడి పంటలతో సుఖశాంతులతో ఉన్నాయి. ఇటువంటి సమయంలో మన మధ్య యద్ధాలు రక్తపాతాలు ఎందుకు? దానివలన ఇరు దేశాల ప్రజల జీవితాలు దెబ్బతింటాయి. మా వలన మీకు మీ రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా రాజు వివేకవర్మ సంగతి మీకుతెలుసు కదా! ఎవరికీ హాని చేయడు. ఎవరికైనా అవసరం ఉంటే సహాయమందించే మంచి మనస్తత్వం కల మంచి మనిషి. ఆలోచించండి మహరాజా!’ వివరించాడు సుహస్తుడు.సుహస్తుడి మాటలతో విజయవర్మను ఆలోచనలో పడ్డాడు.తన రాజగురువుతో మాట్లాడాక యుద్ధాన్ని ఉపసంహరించుకున్నట్లు రాజు వివేక వర్మకు సందేశం పంపించాడు. తరువాత తన మంత్రి దురోత్తుడితో, ‘మంత్రిగా తమరు అన్ని పరిస్థితులూ గమనించి లాభనష్టాలు బేరీజు వేసి నాకు సలహాలు ఇవ్వాలి. మీరు ఆలోచించకుండా సలహాలు ఇవ్వకండి’ అని మందలించాడు.విజయ వర్మ సందేశం చూసి వివేకవర్మ ఆనందించాడు. విజయవర్మను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పి, మంచి బహుమతులు ఇచ్చాడు. వివేకవర్మ మంచి మనసుకు విజయవర్మ సంతోషించాడు. వివేకవర్మ తన మంత్రి సుహస్తుడు సమస్యను సామరస్యంగా పరిష్కరించినందుకు ఆయనకు కూడా మంచి బహుమతులు ఇచ్చాడు. ఆవిధంగా ఇరు రాజ్యాల ప్రజలు సంతోషాలను ప్రకటించారు.హితవచనం..అనిన్ద్యమపి నిన్దన్తి స్తువన్యస్తుత్యముచ్చకైఃస్వాపతేయకృతే మర్త్యాః కిం కిం నామ న కుర్వతే- మనుషులు డబ్బు కోసం చెయ్యరాని పనులన్నీ చేస్తారు. నిందిచరాని వాళ్లను నిందిస్తారు. పొగడతగని వాళ్లను పొగుడుతారు.- కంచనపల్లి వేంకట కృష్ణారావు -
పెస్కటేరియన్ డైట్తో స్థూలకాయం దూరం!
ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి. అందువల్ల పెస్కటేరియన్ డైట్ అనుసరించడం వల్ల స్థూలకాయం తగ్గడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.పెస్కటేరియన్ డైట్ అంటే...?శాకాహారంలో చేపలు, రొయ్యలు సంబంధిత సీఫుడ్లను చేర్చుకోవడాన్ని పెస్కటేరియన్ డైట్ అంటారు. శాకాహారంలోని పోషకాలతో పాటు చేపలలో ఉండే నాణ్యమైన ప్రోటీన్లు, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి లభించడం ఈ డైట్ ప్రత్యేకత.ఈ డైట్ పాటించడం వల్ల...స్థూలకాయం నియంత్రణలో ఉంటుంది.ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించి, రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.మధుమేహం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.శరీరంలో అంతర్గత వాపులు, మంటలను తగ్గించి కణాల జీవక్రియను వేగవంతం చేస్తుంది.మాంసాహారులతో పోలిస్తే, పెస్కటేరియన్ విధానాన్ని పాటించేవారిలో అకాల మరణ ముప్పు దాదాపు 18% తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వృద్ధులకు, స్థూలకాయంతో బాధపడేవారికి ఇది ఉపయోగంగా ఉంటుంది. -
డ్రాగన్ ఫ్రూట్తో... సీజనల్ వ్యాధులకు చెక్!
చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ పోషకాల గని. క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ఫ్రూట్ని ముఖ్యంగా వర్షాకాలంలో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు...డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, వర్షాకాలంలో వచ్చే రకరకాల సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి రక్షించి, ఊపిరితిత్తుల్లో కఫం పేరుకు పోకుండా కాపాడుతుంది.ఈ పండులో సహజసిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో సాధారణంగా ఇబ్బంది పెట్టే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.వర్షాకాలంలో చాలామందిని వేధించే గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు ఈ పండు చక్కని పరిష్కారం. ఇందులో ఉండే పీచుపదార్థం ప్రేగుల కదలికలను క్రమబద్ధం చేసి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.ఈ పండులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులు, అస్తమా, అలర్జీల వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.వాతావరణంలో పెరిగే తేమ, కాలుష్యం వల్ల చర్మం జీవం కోల్పోకుండా ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉంచుతాయి. -
అవును ఇది నిజమే.. వీటితో ఒత్తిడి అవుట్!
ఒత్తిడి నుంచి బయటపడటానికో, లేదంటే తగ్గించుకోవడానికో చాలామంది స్ట్రెస్ బాల్ కానీ, స్పిన్నర్ కానీ వాడుతుంటారు. ఇదే స్థానంలో జ్యువెలరీ చేరితే. అందానికి అందం.. ఒత్తిడి అవుట్. మానసిక ఆందోళన బయటకు కనిపించకుండా తగ్గించుకోవడానికి నేటి యువత ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. అదే యాంటీ–యాంగ్జైటీ జ్యువెల్లరీ. దీనినే ఫిడ్జెట్ జ్యువెలరీగా కూడా పిలుస్తారు.స్పిన్నర్ల ఆధునిక, స్టైలిష్ రూపమే ఈ ఫిడ్జెట్ జ్యువెల్లరీ! రింగులు, చైన్లు, బ్రాస్లెట్ల రూపంలో లభించే ఈ ఆభరణాలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందించే సాధనాలుగానూ ఉపయోగపడుతుండటంతో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సాధారణ నగలకు భిన్నంగా, వీటిలో చిన్న΄ాటి కదలికలు ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ ప్రత్యేకతే స్ట్రెస్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.స్పిన్నర్ రింగ్స్: ఉంగరానికి పైన ఉండే సన్నని బ్యాండ్ లేదా పూసలు వేలితో తిప్పేలా ఉంటాయి. తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు వేళ్లతో వాటిని తిప్పడం వల్ల మనస్సు క్షణాల్లో వేరే వైపు మళ్లుతుంది.బ్రీథింగ్ పెండెంట్లు: లాకెట్ లాంటి చిన్న ప్లాటినం లేదా స్టీల్ గొట్టాల డిజైన్తో వీటిని రూ΄÷ందిస్తారు. ఒత్తిడి పెరిగినప్పుడు సాధారణంగా ఊపిరి తీసుకుని, ఈ గొట్టం ద్వారా నెమ్మదిగా వదలడం వల్ల శరీరం వెంటనే ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.అరోమాథెరపీ జ్యువెల్లరీ: నూనెలను పీల్చుకునే లావా స్టోన్స్ కలిగిన ఈ నగలు, సువాసనల ద్వారా మనసును ఆహ్లాదపరుస్తాయి. ఒకప్పుడు కేవలం అలంకారానికే పరిమితమైన ఆభరణాలు, నేడు మానసిక ఆరోగ్యానికి సైతం తోడ్పడుతుండటం విశేషం. ఇవి ప్లాస్టిక్ బొమ్మల వలే కాకుండా గోల్డ్, సిల్వర్, స్టెయిన్ లెస్ స్టీల్లో అత్యంత మినిమలిస్టిక్ డిజైన్లలో వస్తుండటంతో ఫ్యాషన్ ప్రేమికులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. -
ఇక్కడ.. ఎంత చిన్న వయసులో ప్రారంభించామన్నదే ముఖ్యం!
పొదుపు.. అనేది చిన్నమాటే అయినా జీవితంలో దీని విలువ వెలకట్టలేనిది. జీవితంలో ప్రతిదశలోనూ ఆర్థిక భద్రతనిస్తూ.. భవిష్యత్తుకి భరోసా కల్పిస్తుంది. అయితే ఇందుకోసం ముందుగానే ప్రణాళికను రూపొందించుకోవడం ముఖ్యం. అంతకన్నా ఖర్చులపై నియంత్రణ చాలా ముఖ్యం. అందుకోసం నిపుణులు సూచిస్తున్న కొన్ని ఆర్థిక సూత్రాలు..ఉద్యోగం వచ్చిన తొలినాళ్ల నుంచే పొదుపు చేయడం మంచిది. దీని వల్ల చక్రవడ్డీ రూపంలో అద్భుతమైన ప్రయోజనం పొందవచ్చు. ఇక్కడ ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామన్నదాని కంటే, ఎంత చిన్న వయసులో ప్రారంభించామన్నదే ముఖ్యం. 20 ఏళ్ల వయసులో చిన్న మొత్తంతో మొదలుపెట్టిన ఇన్వెస్ట్మెంట్, 40 ఏళ్ల వయసులో రెట్టింపు మొత్తంతో ప్రారంభించిన పెట్టుబడి కంటే దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అనేది ఎప్పటి నుంచో ఉన్న ముచ్చట. ఆ మాట ఇక్కడ చక్కగా సరిపోతుంది. అందుకే ఎక్కువ లాభాలొచ్చే మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే కంటే ముందుగా మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మించుకోవాలి. అనుకోకుండా ఉద్యోగం పోయినా, ఆకస్మిక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్లను ముందస్తుగా విక్రయించాల్సిన అవసరం రాకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా 40, 50 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున, హెల్త్ ఇన్సూ రెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి.భవిష్యత్తులో మనం ఇల్లు లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు క్రెడిట్ రిపోర్ట్ మన ఆర్థిక పాస్పోర్ట్లా పనిచేస్తుంది. క్రెడిట్ స్కోర్ పేలవంగా ఉంటే బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవచ్చు, లేదా ఎక్కువ వడ్డీ వసూలు చేయవచ్చు. దీనివల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.ఆర్థిక ప్రణాళిక అనేది ఇతరులతో పోల్చుకుని చూసేది కాదు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం, అవసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, ప్రస్తుత వయసును బట్టి, సంపాదనను బట్టి సొంతంగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అపుడే భవిష్యత్తులో మరింత ఆర్థిక స్వేచ్ఛను సాధిస్తారు. -
Sana Saeed: నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను..
బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ఖాన్తో ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాలో నటించిన సనా సయిద్ ‘నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తెలియజేసింది. ‘బులీమియా అంటే ఏమిటి?’ అనే ఆసక్తిని ఎంతోమందిలో రేకెత్తించింది....చాలా చిన్న వయసు నుంచే తనకు బులీమియా ఉన్నట్లు తెలియజేసింది సనా సయిద్. ‘నాకు బులీమియా అనే ఈటింగ్ డిజార్డర్ ఉన్నట్లు చాలా సంవత్సరాల వరకు తెలియదు. బులీమియా అనే మాట ఎప్పుడూ వినలేదు. అయితే ఒకానొక రోజు బులీమియా గురించి ఒక పుస్తకం చదివినప్పుడు నాకు ఏంజరుగుతుందో మొదటిసారి అర్థమైంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నవ్వుకుంటారేమో అనే భయం వల్ల చాలా కాలం పాటు నా సమస్య గురించి ఎవరికీ చెప్పుకోలేదు’ అంటుంది సనా సయిద్.సాధారణ బరువుతోనే కనిపించడం వల్ల బులీమియాను గుర్తించడం అతి పెద్ద సవాలు. జన్యుపరమైన కారణాలతో పాటు మానసిక ఒత్తిడిలాంటి సమస్యలు...మొదలైనవి బులీమియాకు కారణం అవుతాయి. బులీమియా ఉన్న వ్యక్తులు డిప్రెషన్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.కొన్ని లక్షణాలు...భోజనం చేసిన వెంటనే టాయిలెట్కు వెళ్లడం.తమ శరీర బరువు, ఆకారంపై ఎప్పుడూ ఆందోళనతో ఉండడం.పదే పదే కఠినమైన ఆహార నియమాలను పాటించి ఆపై అతిగా తినడం.తిన్న తరువాత బరువు పెరగకుండా నిరోధించడానికి స్వయంగా వాంతులు చేసుకోవడం.మార్గం ఉంది...సనా సయిద్ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నేను బులీమియా సమస్యతో బాధ పడ్డాను అని బహిరంగంగా చెప్పుకోవడానికి కారణం... ఇలాంటి సమస్యతో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు సతమతమవుతుంటారు. తమకు పేరు కూడా తెలియని సమస్యతో బాధ పడుతూ ఉండవచ్చు. దానికి ఒక పేరు ఉందనే విషయం వారు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఒంటరి వారు కాదు. సమస్య నుంచి బయటపడే మార్గం ఉంది. సమస్య నుంచి నేను పూర్తిగా బయటపడ్డాను. మీరు ఇబ్బంది పడుతుంటే దయచేసి వైద్యులను సంప్రదించండి.నాకు ఈటింగ్ డిజార్డర్ ఉందని అంగీకరంచడం అత్యంత కష్టం కావచ్చు. కానీ తప్పదు. సమస్యను దాచివేస్తే, భయపడితే ఆ సమస్యతో మనం పోరాడలేము’ అంటుంది సనా సయిద్.బులీమియా అంటే...తక్కువ సమయంలో అసాధారణంగా, అధిక మొత్తంలో ఆహారం పదే పదే తీసుకునే రుగ్మతను బులీమియా నెర్వోసా అంటారు. బులీమియా ఉండే వ్యక్తులు తీవ్రమైన సిగ్గు, అపరాధ భావంతో ఉంటారు. ఎవరికీ చెప్పుకోకుండా అత్యంత గోప్యంగా ఉంచబడే మానసిక ఆరోగ్య సమస్యలలో బులీమియా ఒకటి. -
వేగంగా తింటున్నారా? ఇది మీ కోసమే..
ఉదయం హడావుడి.. ఆఫీసుకు వెళ్లే తొందర.. సమయం సరిపోకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ కొందరి భోజనం చేసే స్టైల్ మాత్రం అందరికీ కనిపిస్తుంది. పక్కన కూర్చున్న వారు ఇంకా మొదటి ముద్దలో ఉండగానే.. వీరు మాత్రం ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఒక్కో ముద్దను వేగంగా తీసుకుంటూ.. మధ్యలో పెద్దగా విరామం లేకుండా భోజనం ముగించేస్తారు. “త్వరగా తినడం ఒక అలవాటే కదా.. ఇందులో ఏముంది?” అనుకుంటాం. కానీ..మనం తినే వేగం కూడా మన ఆలోచనా విధానం, జీవనశైలి, కొన్ని ప్రవర్తనా లక్షణాలకు చిన్న సంకేతం కావచ్చట. సైకాలజిస్టులు చెబుతున్న విషయం ఆసక్తికరంగా ఉంది మరి. ఆ విషయాలు పరిశీలిస్తే.. వేగంగా తినే అలవాటు వెనుక కేవలం తొందర మాత్రమే కాకుండా.. సమయాన్ని చూసే విధానం, పనులను పూర్తి చేసే తీరు, రోజువారీ జీవితంలో ఉండే వేగం వంటి అంశాలు కూడా దాగి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వ్యక్తిత్వాన్ని పూర్తిగా అంచనా వేసే పరీక్ష కాదని.. కేవలం కొన్ని ప్రవర్తనా ధోరణులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే చిన్న సంకేతంగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.లక్ష్యాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుందా?.. వేగంగా తినే వ్యక్తుల్లో.. కొంతమంది లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టే స్వభావం కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీరికి సమయం చాలా విలువైనదిగా అనిపిస్తుంది. చేయాల్సిన పనుల జాబితాను త్వరగా పూర్తి చేసి.. తర్వాతి లక్ష్యానికి వెళ్లాలనే ఆలోచన ఎక్కువగా ఉండొచ్చు. అందుకే భోజనం కూడా ఆస్వాదించే సమయం కంటే.. పూర్తి చేయాల్సిన మరో పనిలా మారిపోయే అవకాశం ఉంటుంది.వేచి ఉండటం నచ్చదా?.. వేచి ఉండటాన్ని ఇష్టపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యూలో నిలబడటం, ఆలస్యంగా జరిగే పనులు, నెమ్మదిగా సాగే చర్చలు వారికి అసహనాన్ని కలిగించవచ్చు. వారి జీవనశైలి కూడా వేగంగానే సాగుతూ ఉంటుంది. ఒక పని పూర్తయిన వెంటనే మరో పని మొదలుపెట్టాలనే ఆలోచన వారిలో కనిపించవచ్చు. అయితే ప్రతి వేగంగా తినేవారు అసహన స్వభావం కలిగిన వారే అని చెప్పలేం. సమయాభావం, పని ఒత్తిడి వంటి కారణాలు కూడా దీనికి కారణం కావచ్చు.ఎప్పుడూ తర్వాతి పని గురించే ఆలోచనా?.. కొంతమంది భోజనం చేస్తున్నప్పటికీ వారి మనసు అక్కడ ఉండదు. ఫోన్లో మెసేజ్లు చూడటం.. ఆఫీస్ పనుల గురించి ఆలోచించడం.. తర్వాత చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకోవడం వంటి అలవాట్లు ఉండొచ్చు. సైకాలజిస్టుల ప్రకారం ఇది ‘టాస్క్-ఫోకస్డ్ మైండ్సెట్’ కావొచ్చు. అంటే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం కంటే.. తర్వాతి పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టే స్వభావం.👉..అయితే.. వేగంగా తినడం వల్ల శరీరం ఇచ్చే ముఖ్యమైన సంకేతాలను మనం పట్టించుకోకపోవచ్చు. ముఖ్యంగా “ఇక చాలు” అనే తృప్తి సంకేతం మెదడుకు చేరడానికి కొంత సమయం పడుతుంది. కానీ వేగంగా తినేవారిలో భోజనం అప్పటికే పూర్తవుతుంది. దీంతో అవసరానికి మించి తినే అవకాశం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే నెమ్మదిగా తినడం వల్ల ఆకలి, తృప్తి స్థాయిని మెరుగ్గా అర్థం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.👉ఈ అలవాటు ఉన్నవారు బిజీ షెడ్యూల్స్కు త్వరగా అలవాటు పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, ఒత్తిడితో కూడిన పనులు, వేగంగా మారే పరిస్థితుల్లో వీరు సౌకర్యంగా పనిచేయగలరని నిపుణులు భావిస్తున్నారు. అయితే కొందరు కేవలం పరిస్థితుల వల్లే వేగంగా తింటారు. ఉదాహరణకు.. తక్కువ లంచ్ బ్రేక్, కుటుంబ బాధ్యతలు, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు కూడా కారణం కావచ్చు.👉భోజనం చేసే సమయంలో ఆహారం రుచి, వాసన, ఆకలి, తృప్తిని గమనిస్తూ తినడాన్ని ‘మైండ్ఫుల్ ఈటింగ్’ అంటారు. వేగంగా తినే వారిలో ఈ అలవాటు తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నెమ్మదిగా తినడం వల్ల ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు.. శరీరం ఇచ్చే సంకేతాలను కూడా మెరుగ్గా గమనించవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. తినే వేగం ఆధారంగా ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేం. చిన్ననాటి అలవాట్లు, కుటుంబ వాతావరణం, సంస్కృతి, పని ఒత్తిడి, జీవన పరిస్థితులు.. ఇలా ఎన్నో అంశాలు మన తినే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వేగంగా తింటున్నారని మీరు తప్పనిసరిగా ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారని కాదు. కానీ మీ రోజువారీ అలవాట్లను గమనించడానికి ఇది ఒక చిన్న సంకేతం కావచ్చు. మరి మీరు ఏ రకం? ప్లేట్ అందరికంటే ముందే ఖాళీ చేసేవారా.. లేక నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినేవారా?. -
సొంత ఇల్లు, కారు లేకపోయినా జీవితాన్ని ఇలా హాయిగా గడపొచ్చు..
సొంత ఇల్లు, కారు కొనడం, సంపద కూడబెట్టడం.. విజయానికి గుర్తులుగా భావించే ప్రపంచంలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన జీవితం గురించి నిజాయితీగా షేర్ చేసుకున్న విషయాలు ఆన్లైన్లో ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. తన దగ్గర లేని వాటిపై దృష్టి పెట్టకుండా, గత ఏడాదితో పోల్చితే తన జీవితంలో వచ్చిన మెరుగుదల గురించి చెప్పాడు. అతని ఆలోచనా విధానం ఎంతో కొత్తగా అనిపించిందని చాలామంది అభిప్రాయపడ్డారు.ఈ పోస్టును ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆశిష్ జైన్ చేశారు. క్యాప్షన్లో ఆయన ఇలా రాశారు. "నేను 35 ఏళ్ల వ్యక్తిని. నా సొంత ఇల్లు లేదు. కారు లేదు. అంతగా బ్యాంకు బ్యాలెన్స్ లేదు. షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెద్ద పెట్టుబడులు లేవు. గొప్ప ఉద్యోగం కూడా లేదు. కానీ మంచి అద్దె ఇంట్లో ఉంటున్నా. ఉబెర్లో ప్రయాణించే స్తోమత ఉంది. ఒక్క రూపాయి అప్పు లేదు. గత ఏడాదితో పోల్చితే నా శరీరం మరింత ఆరోగ్యంగా ఉంది. మానసికంగానూ గత ఏడాదికంటే మెరుగ్గా ఉన్నా.ఏడాది తర్వాత ప్రాధాన్యం లేని విషయాల గురించి ఇక ఒత్తిడి పడటం మానేశా. ఇల్లు, కారు కొనాలనే ఒత్తిడిని నాపై పెట్టుకోవడం లేదు. భవిష్యత్తు గురించి తక్కువగా ఆలోచిస్తున్నాను. శారీరక, మానసిక ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను. పొగతాగడం మానేశాను, జంక్ ఫుడ్ తినడం కూడా తగ్గించాను. పర్లేదు.. జీవితంలో ప్రతి విషయానికీ వెంటనే సమాధానం దొరకాల్సిన అవసరం లేదు. పర్లేదు.. వచ్చిన ప్రతి రోజును అలాగే జీవించండి. మీపైనే దృష్టి పెట్టండి" అని ఆశిష్ జైన్ పేర్కొన్నాడు.నెటిజన్ల స్పందన"అప్పు లేదు. రేపటి గురించి ఒత్తిడి లేదు. ధూమపానం మానేశారు. ఇతరులతో పోల్చుకోవడం కూడా ఆపేశారు. నాకు తెలిసిన చాలా మంది 35 ఏళ్ల వారి కంటే ఇది ఎంతో బలమైన జీవన పరిస్థితి. అభినందనలు ఆశిష్" అని ఒకరు కామెంట్ చేశారు.మరో వ్యక్తి స్పందిస్తూ.. "ఆశిష్, నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. కృతజ్ఞతతో జీవించడం, ఇతరుల జీవనశైలితో పోల్చుకోకుండా, మీతో మీరే పోటీ పడటం.. ఇదే అత్యంత ఆచరణీయ జీవన విధానం" అని పేర్కొన్నారు."35 ఏళ్ల వయసులో అప్పులు లేకపోవడం, ఆరోగ్యమైన శరీరం, ప్రశాంతమైన మనసు.. ఇదే నిజమైన విజయం. ఈ విషయాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మన చేతిలో ఉన్న వాటిపైనే ప్రతి రోజు దృష్టి పెట్టడం.. పూర్తి చేయాల్సిన జాబితా వెంట పరుగెత్తడం కంటే ఎంతో గొప్పది. ఇలాగే ముందుకు సాగండి" అని మరొకరు కామెంట్ చేశారు.I am a 35 year old who doesn’t own a house, doesn’t own a car, doesn’t have a big bank balance, doesn’t have a huge portfolio of stocks or mutual funds, doesn’t have a great job, but live in a decent rented home, can afford traveling by uber, have zero debt, a better body than it…— Ashish Jain (@In_Sane_Saint) July 19, 2026 -
సిటీ లైఫ్తో పరేషాన్!
భారత్లో టైఫాయిడ్, మలేరియా వంటి అంటువ్యాధులు తగ్గుముఖం పట్టినప్పటికీ, జీవనశైలికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు మాత్రం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (జాతీయ గణాంక కార్యాలయం) నిర్వహించిన తాజా ఆరోగ్య సర్వేలో వెల్లడయిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.హైపర్టెన్షన్, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి సమస్యలు గత పదేళ్లలో దేశంలో విపరీతంగా పెరిగినట్లు ఎన్ఎస్వో సర్వేలో స్పష్టమయ్యింది. ప్రస్తుతం దేశ జనాభాలో దాదాపు సగం మంది గుండె సంబంధిత సమస్యలు, మెటబాలిక్ లోపాలతో బాధపడుతున్నారు. పదేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 31 శాతంగా మాత్రమే ఉండేది.గణాంకాల ప్రకారం.. 2017–18 నాటి సర్వేలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు 16.7 శాతం మాత్రమే ఉండగా.. నేడు అది 25.6 శాతానికి పెరిగిపోయింది. అలాగే థైరాయిడ్, మధుమేహం వంటి జీవనశైలి సమస్యలు గతంలో 15 శాతం మాత్రమే ఉండగా నేడు 24.2 శాతం పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారిలో ఈ నాన్ కమ్యూనికేబుల్ జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2017–18లో 32 శాతంగా ఉన్న ఇన్ఫెక్షన్ల రేటు, 2025 నాటికి 15 శాతానికి పడిపోయింది.మహిళల్లో పెరుగుతోన్న అనారోగ్యం..దేశవ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. భారతీయుల్లో మొత్తం అనారోగ్య స్థాయిలు గత సర్వేతో పోల్చినపుడు విపరీతంగా పెరిగాయి. గత సర్వేలో 7.5 శాతం మాత్రమే ఉండగా ప్రస్తుతం 13.1 శాతానికి పెరిగింది. ఇందులో పురుషుల శాతం 11.8 శాతం ఉండగా, మహిళల శాతం 14.4 శాతంగా ఉంది. అంటే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. అలాగే వయసు పైబడిన వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారిలో అనారోగ్య రేటు 27.7% నుండి 43.9%కి పెరిగింది. అలాగే వైద్య ఖర్చులు కూడా తీవ్రంగా పెరిగినట్లు ఎన్ఎస్ఓ అధ్యయనాలు తెలిపాయి. -
వెన్నుకు దన్నుగా... శలభాసనం!
శలభం అంటే మిడత. ఈ ఆసనంలో శరీర ఆకారం మిడతలా కనిపిస్తుంది కాబట్టి దీనిని శలభాసనం అంటారు. శలభాసనం అనేది పొట్టపై పడుకుని చేసే యోగాసనం. ఇది వెన్నెముకను బలపరచి, శరీరానికి స్థిరత్వాన్ని, శక్తిని అందించడంలో సహాయపడుతుంది.చేసే విధానం...- మ్యాట్పై బోర్లా (పొట్టపై) పడుకోవాలి.- రెండు కాళ్లను నిటారుగా ఉంచి, చేతులను తొడల కింద ఉంచాలి.- గడ్డాన్ని లేదా నుదుటిని నేలపై ఆనించాలి.- శ్వాసను లోపలికి తీసుకుంటూ రెండు కాళ్లను మోకాళ్లు వంచకుండా పైకి ఎత్తాలి.- తొడలు, నడుము కండరాలను బిగించి 10–30 సెకన్లు అదే స్థితిలో ఉంచాలి.- శ్వాసను వదులుతూ నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి.- 3–5 సార్లు పునరావృతం చేయాలి.జాగ్రత్తలు...- గర్భిణులు ఈ ఆసనం వేయకూడదు.- ఇటీవల కాలంలో పొట్ట లేదా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నవారు చేయకూడదు.- తీవ్రమైన నడుము నొప్పి, స్లిప్ డిస్క్, హెర్నియా ఉన్నవారు వైద్యుడు లేదా యోగా నిపుణుల సలహాతో మాత్రమే చేయాలి.- అధిక రక్తపోటు లేదా తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి.- కాళ్లను ఒక్కసారిగా పైకి ఎత్తకుండా, నెమ్మదిగా శ్వాసతో సమన్వయం చేసుకుంటూ చేయాలి.- నొప్పి అనిపిస్తే వెంటనే ఆసనం ఆపాలి.ప్రయోజనాలు... - వెన్నెముకను బలంగా, ఫ్లెక్సిబుల్గా చేస్తుంది.- నడుము కండరాలు, తొడలు బలపడతాయి.- పొట్ట అవయవాలకు మసాజ్ లభించి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.- వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది (సరైన మార్గదర్శకత్వంలో చేస్తే).- శరీర భంగిమ మెరుగుపడుతుంది.- రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.- అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది.- కోర్ కండరాలను బలపరుస్తుంది.- మానసిక ఏకాగ్రతను పెంచుతుంది.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
నైంటీ.. అయితే ఏంటి?
ఫిట్నెస్ అనేది కేవలం యువకులకు, బాడీబిల్డర్లకు మాత్రమే సొంతం కాదని నిరూపిస్తున్నాడు ఓ 90 ఏళ్ల వృద్ధుడు. ముసలితనం వచ్చిందని ఇంట్లోనే కూర్చోకుండా, జిమ్కు వెళ్తూ ఆయన చేస్తున్న కఠినమైన వర్కవుట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముంబైకి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆకాష్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వృద్ధుడికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఈవిధంగా రాసుకొచ్చారు.‘జిమ్ అనేది కేవలం సిక్స్ ప్యాక్ కోసమో, కండలు పెంచి అందంగా కనిపించడం కోసమో మాత్రమే కాదు. అంతకు మించి.. వయసు పైబడిన వారు తమ దైనందిన పనులను ఎవరి సహాయం లేకుండా చేసుకోగలగడానికి, శరీర బ్యాలెన్స్ మెరుగుపరుచుకోవడానికి, కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం.’ మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలను కూడా శారీరక శ్రమ వైపు ప్రోత్సహించేలా ఉన్న ఈ వీడియో ఎంతో స్ఫూర్తిదాయకం. -
ట్రెండ్ మారుతోంది! పెళ్లంటే ఒకప్పుడు...
పెళ్లంటే ఒకప్పుడు బంధు మిత్రుల కోలాహలం మధ్య సొంత ఊరిలో ఇంటి ముందర పచ్చని పందిరిలో ఘనంగా జరుపుకునే వేడుక. కానీ నేడు వివాహ వేడుకల శైలి వేగంగా మారిపోతోంది. గతంలో కేవలం సంపన్నులకే పరిమితమైన డెస్టినేషన్ వెడ్డింగ్ సంస్కృతి.. ఇప్పుడు మధ్యతరగతి వర్గాల్లోనూ ఒక ముఖ్యమైన ట్రెండ్గా మారింది. ప్రస్తుతం దేశంలో జరిగే మొత్తం వివాహాల్లో దాదాపు 25 శాతం డెస్టినేషన్ వెడ్డింగ్స్ కావడం విశేషం.వివాహ వేడుకలు క్రమక్రమంగా సరిహద్దులు దాటుతున్నాయి. విలాసవంతమైన రిసార్టులు, అందమైన బీచ్లు, చారిత్రక కోటల వేదికగా జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు నేటి తరం యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. ప్రముఖ వెడ్డింగ్ ప్లానింగ్ ప్లాట్ఫామ్ వెడ్మీగుడ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రతి నాలుగు వివాహాలలో ఒకటి డెస్టినేషన్ వివాహం కావడం.. వివాహాల్లో మార్పులు జరుగుతున్న తీరును కళ్లకు కడుతోంది.పర్యాటకానికే ప్రాధాన్యంగతంలో వేలాది మంది అతిథులను పిలిచేవారు. కానీ ఈ డెస్టినేషన్ మ్యారెజ్లో అతిథుల సంఖ్య పరిమితం. వచ్చిన వారికి ఒక గొప్ప పర్యాటక అనుభూతిని అందించేలా వేడుకలను ప్లాన్ చేసేందుకే యువ జంటలు మొగ్గు చూపుతున్నారు. గతంలో సగటున ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే సాగే ఈ వేడుకలు, ఇప్పుడు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా సాగుతున్నాయి.తగ్గేదే లేదు!అయితే ఈ తరహా వివాహాల కోసం ఖర్చు చేసేందుకు కూడా జంటలు ఏమాత్రం వెనుకాడటం లేదు. దేశంలో జరిగే డెస్టినేషన్ వివాహాలలో పెళ్లిళ్ల సగటు బడ్జెట్ సుమారుగా రూ. 58 లక్షలు ఉంటుంది. అదే విదేశాలలో జరిగే వివాహాల సగటు బడ్జెట్ రూ. 1.5 కోట్లు దాటుతోంది. అయినప్పటికీ యువత డెస్టినేషన్ వివాహాల వైపే మొగ్గుచూపుతోంది.హాట్స్పాట్గా శ్రీలంకవిదేశీ గమ్యస్థానాలలో థాయిలాండ్ ముందంజలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం శ్రీలంక భారతీయ జంటలకు ఫేవరెట్ వెడ్డింగ్ డెస్టినేష¯Œ గా అవతరించింది. శ్రీలంక భారతదేశానికి చాలా దగ్గరగా ఉండటం ఒక కారణమైతే భారతీయులకు వీసా లేకుండా ప్రవేశం, అద్భుతమైన బీచ్లు, లగ్జరీ హోటళ్లు, తక్కువ ఖర్చుతో కూడిన ΄్యాకేజీలు అందుబాటులో ఉండటం మరొక అంశం. శ్రీలంకతో పాటు బాలీ, వియత్నాం, మలేషియా వంటి దేశాలు కూడా రేసులో దూసుకుపోతున్నాయి.మన దగ్గర టాప్ డెస్టినేషన్స్ ఇవే..డెస్టినేషన్ వెడ్డింగ్స్లో సుమారు 90 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయి. వీటిలో ఉత్తరాది హిల్ స్టేషన్లు, రాజస్థాన్ రాజభవనాలు ముందంజలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఉన్న డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, సిమ్లా, జిమ్ కార్బెట్ పర్వతప్రాంతాలు, అలాగే ఉదయ్పూర్, జైపూర్, జైసల్మేర్, జోధ్పూర్, గోవా వంటిప్రాంతాల్లోని రాజభవనాలు, బీచ్లు డెస్టినేషన్ వెడ్డింగ్లకి వేదికలుగా మారుతున్నాయి. అంటే ప్రస్తుత తరం పెళ్లిని ఒక బాధ్యతగా కాకుండా, జీవితంలో గుర్తుండిపోయే ఒక అద్భుతమైన ప్రయాణంగా మలుచుకుంటోంది.ప్రస్తుతం భారతదేశంలో దాదాపు రూ. 6.5 లక్షల కోట్ల మార్కెట్ ఉన్న వివాహ పరిశ్రమలో.. కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్స్ విభాగమే సుమారు రూ. 2.5 లక్షల కోట్ల విలువైన మార్కెట్గా ఎదగడం డెస్టినేషన్ ట్రెండ్కు అద్దం పడుతోంది.ప్రస్తుతం 25 శాతంగా ఉన్న డెస్టినేషన్ వెడ్డింగ్స్ వాటా, 2028 నాటికి 30 నుంచి 32 శాతానికి పెరగనుందని అంచనా.కోటి రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించే ధనిక జంటలలో దాదాపు 60 శాతం మంది స్వదేశీ వేదికల కంటే విదేశీ గమ్యస్థానాలకే ఓటు వేస్తున్నారు.2025లో భారతీయ జంటలు శ్రీలంకను ఎంచుకునే రేటు 25 శాతం పెరగగా, రాబోయే రోజుల్లో ఇది ఏటా 20–25 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.ప్రస్తుతం 38 శాతం మంది జంటలు పెళ్లికి ముందే ప్రత్యేకంగా ప్రీ–వెడ్డింగ్ ట్రిప్స్కి వెళ్తున్నారు. అంతేకాకుండా, కేవలం హనీమూన్ కోసమే సగటున రూ. 3.41 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. -
మనలో కూడా దాగున్న ఈ జబ్బు ఇంత ప్రమాదమా!?
సోమరితనం, బద్ధకం, నిర్లక్ష్యం... ఏదైతేనేం? చేయాల్సిన పనులు ఆపేయడానికి..? రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ ‘వాయిదా’ల అటకెక్కించడానికి..? నిజానికి ఇలాంటి బద్ధకస్తుల జాబితాలో మన చుట్టూ ఉన్నవాళ్లే కాదు మనం కూడా కొన్నికొన్ని సార్లు చేరిపోతుంటాం. ఎందుకంటే వాయిదా వేయడం కొందరికి అలవాటు.. మరికొందరికి అదోరకం కంఫర్ట్. నేటి యువతలో ఎక్కువగా కనిపించే లక్షణం సోమరితనం. కాని జపాన్ ప్రజలు మాత్రం వారి పిల్లలకి సోమరితనాన్ని ఒక బూచిలా చూపిస్తారు. కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా సోమరితనాన్ని మెల్లమెల్లగా దూరం చేస్తారు. జపాన్లో సోమరితనాన్ని దూరం చేసే అత్యంత ప్రాచుర్యం పొందిన ఏడు జీవన సూత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..1.కైజెన్పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఏదైనా చిన్న లక్ష్యంతో ప్రారంభించండి. క్రమక్రమంగా లక్ష్యాలను పెద్దగా మార్చుకుంటే మీ బ్రెయిన్కి మీరే గురువుతారు.2. ఇకిగైఏం చేయాలన్న దాని మీద స్పష్టత లోపించినప్పుడే పనులు సక్రమంగా సాగవు. అందుకే ‘ఏం చేయాలి?’ అని కాకుండా ‘ఎందుకు చేయాలి?’ అని ఎవరికి వారే ప్రశ్నించుకోగలిగినప్పుడు పని మీద గురి కుదురుతుంది.3. హరా హచి బుఏదైనా మితంగా తినడం మంచిది. బిర్యాని అంటే ఇష్టమని పొట్ట పగిలేలా తినకుండా 80 శాతం ఆకలి తీరినంత వరకే తినాలన్నది జపాన్ సంప్రదాయం. ఇలా చేయడం వల్ల శరీరం తేలికగా ఉండడమే కాకుండా మెదడు కూడా చురుకుగా మారుతుందని జపాన్ ప్రజలు భావిస్తారు.4. సెయిరి – సెయితోనుమీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి. ప్రతి వస్తువు క్రమ బద్ధంగా, వీలైనంత వరకు కాస్త నిశబ్ధంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేస్తున్న పని మీద ఏకాగ్రత పెరుగుతుంది.5. కింట్సుగికొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు. తప్పులు దొర్లవచ్చు. భయపడకండి. ధైర్యంతో ఎదుర్కోండి. తప్పులను ఒప్పుకోండి. లోపాలను అంగీకరించండి...అలా చేసినప్పుడే నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది.6. వాబి సాబిప్రతి క్షణం విలువైనదే.. మొదలు పెట్టేవరకు ఏదీ పూర్తి కాదు. ఇంకా సమయం కావాలని ఆలోచించక ఉన్న వనరులతో పని మొదలుపెట్టండి. విశ్వాశమే విజయానికి తొలిమెట్టు.7. యాంకర్డ్ ఫోకస్ప్రతిసారి గంటల తరబడి కుర్చుని పని చేయడం కంటే ప్రతి పనిని మొదలు పెట్టే ముందు గట్టిగా శ్వాస తీసుకోండి. తర్వాత నచ్చిన మ్యూజిక్ కొన్ని నిమిషాల పాటు వినండి. ఆ తర్వాత పనిని మొదలు పెట్టండి. ప్రతి 25 నిమిషాలకొకసారి లేచి ఓ ఐదు నిమిషాల పాటు విరామం తీసుకోండి. దీని వల్ల శరీరంలో ఉత్సాహంతో పాటు పనిలో ఉత్పాదకత పెరుగుతుంది. -
అమ్మను కొంచెం యంగ్గా...
చాలామంది తల్లిదండ్రులలో నాన్న యంగ్గా కనిపిస్తే... అమ్మేమో కొంచెం వయసు పైబడ్డట్లుగా కనిపించడం సహజం. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా?అమ్మానాన్నల వయసు దాదాపు ఒకటే. చె΄్పాలంటే సహజంగానే అమ్మకంటే నాన్నే వయసులో బాగా పెద్ద అయినా, చాలామందిలో నాన్నే యంగ్గా.. యాక్టివ్గా ఉంటే అమ్మలేమో కొంచెం పెద్దగా కనిపిస్తుంటారు. అందుకు వారి జీన్స్ ఒక్కటే కారణం కాదు. మహిళలలో ముందుగా వచ్చే మెనోపాజ్ కారణంగా శరీరంలో వృద్ధాప్య ప్రక్రియ కొంచెం వేగంగా జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతలు, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఈ వయస్సులో ఈ మార్పులు త్వరగా కనిపించొచ్చు. 40 ఏళ్ల వరకు మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఇది తగ్గిపోవడం వల్ల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది.ఈ మార్పుల వల్ల మెదడు పనితీరు మందగించడం, ఎముకలు బలహీనపడటం, పొట్టలో కొవ్వు పెరగడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ హార్మోన్ల మార్పులు మాత్రమే కాదు.. నిద్రలేమి, ఆహారంలో పోషకాల లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి లాంటి కారణాలు కూడా స్త్రీ శరీరాన్ని త్వరగా బలహీన పరిచే కారకాలు.అన్నింటికన్నా ముఖ్యంగా... చాలా మంది మహిళలు సరైన ఆహారం తీసుకోకపోవడం, గర్భధారణ సమయంలో పోషకాలు తగ్గిపోవడం లాంటి కారణాలతో హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కొంటారు. దాని ఫలితంగానే తొందరగా వయసు మీదపడ్డట్లు కనిపిస్తారు. చర్మ ఆరోగ్యం, ఎముకల బలం కోసం విటమిన్ ఇ,సి,డి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 లాంటి పోషకాలు తీసుకోవడం చాలా అవసరం.ఉదాహరణకి పొద్దుతిరుగుడు గింజలు, బాదం, కీర దోస, క్యాప్సికమ్, బ్రోకలీ, నారింజ, టమాటా లాంటి ఆహారాల్లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు, పనీర్, కేఫిర్, మజ్జిగ, ఇడ్లీ లాంటివి ఆరోగ్యకరమైన పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం అరుగుదల వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే యాంటీ బయాటిక్స్ వల్ల నాశనం అయిన మంచి బ్యాక్టీరియాను తిరిగి పెంచడానికి ఇది సహాయపడుతుంది.ఈ వయసులో అధిక రక్తపోటు ఎక్కువగా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. టేబుల్ ఉప్పు తక్కువగా తీసుకోవడం, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి, మిరియాలు, కొత్తిమీర లాంటి సహజమైన మసాలాపదార్థాలు ఉపయోగించడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. వారానికి కనీసం మూడు రోజుల పాటు బలం పెంచే వ్యాయామాలు చేయడం, యోగా, నడక లాంటి వ్యాయామాలు చేయడం వయసును నియంత్రించడంలో సహాయపడతాయి. అదే సమయంలో 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవడం, మానసిక ఆరోగ్యం కోసం కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ సూచనలు పాటిస్తే అమ్మ కూడా నాన్న లాగే ఆరోగ్యంగా, యంగ్గా ఉటుంది.అమ్మ యాక్టివ్గా ఉండాలంటే..?వయసు పైబడ్డట్టు కనిపించే మాటెలా ఉన్నా... ఈ వయసులో వారు యాక్టివ్గా ఉండాలంటే మాత్రం వారి బరువుకు తగ్గట్టు రోజుకు 5 నుంచి 10 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవాలి. ఇది ఎముకలు, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా మూత్రపిండాల సమస్యలు తగ్గించడానికి దోహదం చేస్తుంది. -
ప్రకృతి గుండె చప్పుడు విందాం
మన్హా.. పదేళ్ల పసిపాప. ఆమెకు అడవి అంటే కేవలం చెట్లు కాదు, అది ఆమె ప్రాణ స్నేహితురాలు. తన చిన్నారి చేతులతో అల్లిన వెదురు బుట్టలో సేకరించిన విత్తనాలను తీసుకుని ఆమె అరణ్యంలోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ ఆమె రాకను గమనించిన పక్షులు, ఒకదానికొకటి వార్తను పంచుకుంటూ ఆమె చుట్టూ వందలాదిగా చేరేవి. అవి ఆమె భుజాల మీద, తల మీద వాలుతూ ఒక అపురూపమైన ఆత్మీయతను పంచేవి. మన్హా విత్తనాలను నేలపై చల్లుతుంటే, అవి ముత్యాలను ఏరుకున్నట్లు గింజలను ఏరుకుంటూ చేసే ఆ ‘కిలకిలలు’ ఆమె ప్రపంచానికి సంగీతం.కానీ ఆ రోజు, ఆమె అడుగుల చప్పుడు తప్ప అడవిలో మరే శబ్దమూ లేదు. ఆకాశం నీలి రంగును కోల్పోయి, ఏదో తెల్లని పొగమంచులాంటి దుమ్ముతో నిండిపోయింది. ఆమె పరుగు పరుగున తన అభిమాన రావి చెట్టు దగ్గరకు వెళ్లింది. వందలాది ఏళ్ల చరిత్ర కలిగిన ఆ వృక్షం, ఇప్పుడు ఒక అస్థిపంజరంలా కనిపిస్తోంది. దాని ఆకులన్నీ రాలిపోయి, ఆ కొమ్మలు ఆకాశం వైపు చూస్తూ, ‘నన్ను కాపాడండి’ అని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. ‘నా స్నేహితులు ఏమయ్యారు? ఆ చిన్న పిచ్చుకమ్మ ఏది? నీలి రంగు రెక్కల పిట్ట ఏమైంది?’ అని మన్హా ఆ చెట్టును తాకుతూ వెక్కి వెక్కి ఏడ్చింది.అక్కడే ఒక బండరాయిపై కూర్చున్న వృద్ధ కాపరి, తన చిరిగిన కంబళిని సరిచేసుకుంటూ కన్నీరు నిండిన కళ్లతో అన్నాడు.. ‘అమ్మాయి.. అవి ఇక రావు. ఈ గాలిలో విషం ఉంది. మనం చేస్తున్న గనుల తవ్వకాలు, ఆ యంత్రాల కర్కశపు శబ్దాలు, పర్వతాలను పగులగొడుతున్న బాంబుల మోతలు.. ఆ సున్నితమైన జీవాలు భరించ లేకపోయాయి. చెట్టుప్రాణం పోయింది, పిట్ట రెక్క విరిగిపోయింది. మనిషి తన కడుపు నింపుకోవడానికి ఈ అడవి తల్లి కడుపును కోసేస్తున్నాడు’.మన్హాకు ఆ మాటలు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె చేతిలోని విత్తనాలు నేలపై జారిపోయాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడే అడవి, ఇప్పుడు ఒక ఎండిన ఎడారిలా ఆమె కళ్ల ముందు కనిపిస్తోంది.ఈ చిత్రం కేవలం ఒక ఊరుకో, ఒక అడవికో పరిమితం కాదు. భూమికి ఒక వైపున, మంచు ఖండాలు కన్నీరులా కరిగి సముద్రంలో కలిసిపోతున్నాయి. బంగారం, బొగ్గు, చమురు.. ఇవి మనిషికి సంపద కావచ్చు, కానీ ప్రకృతికి అవిప్రాణాధారాలు. మనిషి తన స్వార్థంతో ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుంటే, భూమి ఇప్పుడు అల్లాడిపోతోంది. ఊపిరి అందని నగరాలు, పంటల్లేని పొలాలు, అకాల వరదలు, అంతుచిక్కని వ్యాధులు.. ఇవన్నీ భూమి తల్లి పెడుతున్న కేకలు! కానీ.. ఈ విషాదంలోనూ ఒక చిన్న ఆశ మిగిలి ఉంది.మరుసటి రోజు కూడా మన్హా నిరాశ చెందలేదు. తన కళ్లను తుడుచుకుని, మళ్లీ బుట్ట నిండా విత్తనాలు నింపుకుని అడవికి వెళ్ళింది. పక్షులు లేవని ఆమెకు తెలుసు, కానీ అవి వస్తాయన్న నమ్మకం ఆమెది. అకస్మాత్తుగా, ఎండిపోయిన ఒక కొమ్మ చివర నుండి ఒక సన్నని గొంతు వినిపించింది. అది ఆమెకు బాగా తెలిసిన ఆ చిన్న పిచ్చుక! అది నీరసంగా ఉన్నా, మన్హా వైపు చూస్తూ రెక్కలు ఆడిస్తోంది.ఆ ఒక్క పక్షి మన్హాకు ఒక గొప్ప సత్యాన్ని బోధించింది: ‘నువ్వు ఒక్క అడుగు ముందుకేసి ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టు, నేను మళ్లీప్రాణం పోసుకుంటాను.‘ మన్హా నాటుతున్న ఆ చిన్న విత్తనం రేపు ఒక మహావృక్షం కావాలి. మనందరిలోనూ ఆ మన్హా మేల్కొనాలి. లేదంటే, ప్రకృతి లేని ప్రపంచంలో మనిషి కూడా ఒక శిలాజంలా మిగిలి పోవాల్సి వస్తుంది.– ముహమ్మద్ ముజాహిద్ -
వారాహి గుప్త నవరాత్రులంటే ఏమిటి?
నేటి ఆధునిక సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబ కలహాలు, అనారోగ్యం. వాటితోపాటు న్యాయపరమైన, ఆర్థిక పరమైన ఇబ్బందులు, శత్రు బాధలు సర్వసాధారణం అయిపోయాయి. ఇటువంటి సమస్యలు వారాహి దేవి ఆరాధనతో తొలగిపోతాయని, ముఖ్యంగా వారాహి దేవిని ఆరాధిస్తే శత్రు బాధలు తొలగిపోతాయని, మన ససమ్యలన్నింటికీ అమ్మ అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందనీ నమ్మకం. శక్తి దేవతల ఆరాధనకు ప్రసిద్ధి చెందిన విశిష్టమైన కాలం ఆషాఢ నవరాత్రులు. ఈ ఏడాది వారాహి గుప్త నవరాత్రులు బుధవారంప్రారంభం అయ్యాయి. ఈ నవరాత్రుల్లో ఆచరించాల్సిన విధివిధానాలేమిటో తెలుసుకుందాం.తెలుగు పంచాంగం ప్రకారం వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి, నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది జూలై 15, బుధవారం ప్రారంభమయ్యాయి. 23, గురువారం వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ పవిత్ర దినాలలో శ్రీ వారాహి అమ్మని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మ అనుగ్రహంతో కష్టాలనుంచి, చిక్కుల నుంచి బయట పడవచ్చునని శక్తి ఉపాసకులు చెబుతారు.గుప్త నవరాత్రులంటే ఏమిటి? ’గుప్త’ అంటే రహస్యం. ఈ నవరాత్రులలో అమ్మవారిని రహస్యంగా, నిష్టతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే వారాహి నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రులని కూడా అంటారు.వారాహి దేవి ఎవరు?లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని అభివర్ణిస్తారు. సప్త మాతృకలలో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు అత్యంత శక్తిమంతమైన రూపం. ఈమె పరమేశ్వరుడి అనుగ్రహంతో అంధకాసుర సంహారం కోసం అవతరించినట్లు దేవీ పురాణం చెబుతోంది.పూజా విధానంవారాహి గుప్త నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. ప్రతిరోజు సూర్యాస్తమయం తరువాత రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య వారాహి దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని దేవి పురాణం చెబుతోంది. సూర్యాస్తమయం తరువాత శుచిగా స్నానం ఆచరించి అమ్మవారి రూపాన్ని ప్రతిష్టించి మనసులో సంకల్పం చెప్పుకుని 9 రోజుల దీక్ష తీసుకోవాలి. వారాహి అమ్మ వారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్టించాలి.నైవేద్యాలు... దాన ధర్మాలుప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేయాలి. అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనస్సుతో వారాహి మూల మంత్రాలు జపించాలి. వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి. చివర్లో ధూప దీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతారు.పూజాఫలం ఏమిటి? భక్తిశ్రద్ధలతో వారాహి గుప్త నవరాత్రుల వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు, వారాహి దేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనుల్లో అభివద్ధి కలిగి, సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయ కేతనం ఎగుర వేయాలంటే వారాహి దేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు చెబుతున్నారు.రూపం ఉగ్రం... మానసం శాంతంవారాహి దేవి ఉగ్రంగా కనబడినప్పటికి తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ఈ ఆషాఢంలో వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, దృష్టి దోషాలు తొలగిపోతాయని, శత్రు పీడలు ఉండవని భక్తుల విశ్వాసం.క్షేత్ర పాలికగా వారాహీ దేవిసాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్ర పాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో అమ్మవారు నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే ఆరు చేతులు శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవియే క్షేత్రపాలిక. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవీ ఉపాసకులు అంటారు.ఈ వారాహి నవరాత్రులలో మనం కూడా వారాహి దేవిని 9 రోజులపాటు పూజించి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు పొందుదాం.– ఎం. శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం -
అనుగ్రహం అవసరం!
సురాసురులు కలిసి కష్టించి, ఎన్నెన్నో మహత్తరమైన అవరోధాలనూ, విఘ్నాలనూ అధిగమించి, ఎట్టకేలకు అమృతం సాధించారు. ధన్వంతరి అందించిన అమృత కలశాన్ని తటాలున అందుకొని, అసురులు అన్యాయంగా స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికప్పుడు శ్రీహరి మోహినీ అవతారాన్ని ఎత్తి, వాళ్ళను కామ మోహితులను చేశాడు. ఆ మోహంతో వాళ్ళు అందరికీ అమృతం పంచే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె దాన్ని ఎలా పంచినా, తాము అడ్డుపడమని ఒప్పందం చేసుకొన్నారు.మోహిని అమృతాన్ని మొదట దేవతల పంక్తికి పంచటం పూర్తయేసరికి, పాత్ర ఖాళీ అయిపోయింది. ఆమె అంతర్ధానమై పోయింది. రాక్షసులకు ఏమీ మిగలలేదు. రాహువు అనే రాక్షసుడు మాత్రం, మారువేషంలో దేవతల పంక్తిలో చేరి, అమృతం పుచ్చుకొన్నాడు. సూర్యచంద్రులు ఇది గమనించి చెప్పగానే, సుదర్శన చక్రం రివ్వున వచ్చి, పుచ్చుకొన్న అమృతం నాలుక దాటకుండానే, రాహువు తలను నరికి వేసింది. అమృత ప్రభావం వల్ల అతడి తల సజీవంగా మిగిలిపోయింది. అమృత స్పర్శ లేని మొండెం పతనమై నశించింది. (అప్పటి నుంచి ‘రాహువు తల’ అనేది ప్రత్యేకంగా లేదు. రాహువు అంటేనే రాహువు తల. కాబట్టి ‘రాహు మస్తకం’ అని చెప్పనక్కర్లేదు. చెప్తే అది, ‘సీతా ఫలం పండు’, ‘పేపరు కాగితం’ అన్నట్టు పునరుక్తి అవుతుంది!)దేవాసురులు ఒకే పరిస్థితులలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, ఒకే సాధన సామగ్రితో, ఒకే విధమైన శ్రమను, ఒకే సంకల్పంతో చేశారు. కానీ వాళ్ళకు లభించిన ఫలంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏవం సురాసుర గణాః సమ దేశ, కాల,/ హేతు–అర్థ, కర్మ, మతయః–అపి, ఫలే వికల్పాః. ఎలాంటి తేడాలు? తత్ర అమృతం సురగణాః ఫలం–అంజనా–ఆపుః, నదైత్యాః – అక్కడ సురగణాలు అమృతం అనే ఫలాన్ని సులభంగా పొందారు, దైత్యులు పొందలేదు. కారణమేమిటి? పాద పంకజ రజ–ఆశ్రయాత్– శ్రీహరి పదకమలాల ధూళిని (దేవతలు) ఆశ్ర యించి, సేవించటం వల్ల. హరి విముఖులు కనక అసురుల శ్రమ నిష్ఫలమైంది. శ్రమకు దైవానుగ్రహం తోడయి తేనే ఫల ప్రాప్తి ఉంటుంది, అంటుంది భాగవతం.– ఎం.మారుతి శాస్త్రి -
ఇంతకాలం ఇవి లేకుండా ఎలా మేనేజ్ చేశాం?
ఇంటి పనులు ఎప్పుడూ తగ్గవు... కానీ వాటి కష్టం మాత్రం తగ్గించొచ్చు! చిన్నగా కనిపించే ఇవీ అవసరమైనప్పుడు పెద్ద సహాయం చేస్తుంది. ఇంట్లో ఒక్కసారి చోటు దక్కితే చాలు... ‘ఇంతకాలం ఇవి లేకుండా ఎలా మేనేజ్ చేశాం?’ అనిపించే స్మార్ట్ గ్యాడ్జెట్లు ఇవే!మ్యాజిక్ బ్యాగ్!షాపింగ్కు వెళ్లినప్పుడు వాన పడితే... ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో సరుకులు! వాటిని తడవకుండా కాపాడేలోపే గొడుగే పక్కన పెట్టాల్సిన పరిస్థితి. అలాంటి టైమ్లో ఈ రోల్–అప్ షాపింగ్ బ్యాగ్. చూడటానికి చిన్న క్యాప్సూల్లా కనిపించే ఈ బ్యాగ్ను విప్పగానే పెద్ద షాపింగ్ బ్యాగ్గా మారిపోతుంది. పని అయిపోయాక మళ్లీ చుట్టి చిన్న కేసులో పెట్టేస్తే చాలు. దీనికి ఉన్న క్లిప్తో హ్యాండ్బ్యాగ్, పర్స్కి తగిలించుకుని ఎప్పుడూ వెంట తీసుకెళ్లొచ్చు. వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో తయారైన ఈ బ్యాగ్లో కూరగాయలు, పండ్లు, మందులు, రోజువారీ సరుకులు... ఇలా చాలానే తడవకుండా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా వానాకాలంలో ‘అయ్యో... బ్యాగ్ తీసుకురాలేదే!’ అనే టెన్షన్కు ఫుల్స్టాప్ పెడుతుంది. ధర కేవలం రూ. 260 మాత్రమే!చిట్టి వాషింగ్ మెషీన్!చిన్న బట్టల కోసం పెద్ద వాషింగ్ మెషీన్ను ఆన్ చేయడం కాస్త ఓవర్ అనిపిస్తుందా? ముఖ్యంగా చిన్నారుల బట్టలు, లోదుస్తులు, సాక్స్ లాంటి వాటిని విడిగా ఉతకాల్సి వచ్చినప్పుడు ఈ మినీ పోర్టబుల్ వాషింగ్ మెషీన్ మీ పనిని చాలా ఈజీ చేస్తుంది. చూడటానికి చిన్నగా ఉన్నా, పనిలో మాత్రం పెద్ద మెషీన్కే పోటీ ఇస్తుంది. బలమైన వాటర్ సర్క్యులేషన్తో దుమ్ము, చెమట, రోజువారీ మరకలను సమర్థంగా శుభ్రం చేస్తుంది. సున్నితమైన వస్త్రాలకు ఎలాంటి హాని కలగకుండా ఉతకడం దీని ప్రత్యేకత. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ మినీ వాషింగ్ మెషీన్ను ఇంట్లోనే కాదు... ట్రావెల్, బిజినెస్ ట్రిప్స్, క్యాంపింగ్లకు కూడా వెంట తీసుకెళ్లొచ్చు. ఎల్ఈడీ డిజిటల్ డిస్ప్లేతో బ్యాటరీ స్థాయి, వాషింగ్ మోడ్లను సులభంగా చూసుకోవచ్చు. ధర రూ. 1,600 మాత్రమే!క్షణాల్లో బట్టలు ఆరుతాయి!వానాకాలంలో బట్టలు ఉతికేయడం ఈజీ... కానీ వాటిని ఆరేయడమే అసలు తలనొప్పి! ఒక్కోసారి కుర్చీలు, తలుపులు, కిటికీలు కూడా డ్రైయింగ్ స్టాండ్లా మారిపోతుంటాయి. అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే వచ్చింది ఈ 360 డిగ్రీల రొటేటింగ్ డ్రైయింగ్ స్టాండ్. ఈ ఒక్క స్టాండ్లోనే షర్ట్లు, ప్యాంట్లు, చీరలు, టవల్స్, సాక్స్, చిన్నారుల దుస్తులు.. ఇలా ఒకేసారి చాలా బట్టలను ఆరేయొచ్చు. 360 డిగ్రీలు తిరిగే డిజైన్ ఉండటంతో స్టాండ్ను కదపాల్సిన అవసరం లేదు. ఒకే చోట నిలబడి అన్ని వైపులా ఉన్న బట్టలను సులభంగా అందుకోవచ్చు. గాలి అన్ని వైపుల నుంచి తగలడంతో బట్టలు త్వరగా ఆరిపోతాయి. బట్టలు తీసేసిన తర్వాత ఈ స్టాండ్ను మడిచి మూలన పెట్టేస్తే చాలు. పెద్దగా స్థలం కూడా ఆక్రమించదు. బాల్కనీ, బాత్రూమ్, టెర్రస్, యుటిలిటీ ఏరియా... ఎక్కడైనా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ధర రూ. 2,500. -
ఇకపై జీన్స్కి బ్రేక్! ఇదే న్యూ ట్రెండ్!!
‘అల్మరాలో పది ప్యాంట్లు ఉన్నా... చేతికి వచ్చేది మాత్రం అదే జీన్స్!’ చాలామంది అబ్బాయిల కథ ఇదే. ఆఫీస్ అయినా... డేట్ అయినా... పార్టీ అయినా... ‘జీన్స్ వేసుకుంటే సేఫ్!’ అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి... అదే కంఫర్ట్తో, ఇంకా క్లాసీగా కనిపించే మరో ఆప్షన్ ఉంటే? అవే ఇవీ!డ్రాస్ట్రింగ్ ట్రౌజర్స్ఎలాస్టిక్ వెయిస్ట్, డ్రాస్ట్రింగ్తో వచ్చే ఈ ట్రౌజర్స్ కంఫర్ట్లో నెంబర్ వన్ . జాగర్స్లా హాయిగా, లుక్లో క్లాస్ ఉంటాయి.వైడ్ లెగ్ ట్రౌజర్స్ఈ మధ్య ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న స్టయిల్ ఇదే. కాస్త లూజ్గా, రిలాక్స్డ్గా ఉంటాయి. ఓవర్సైజ్ టీ–షర్ట్ లేదా క్యాజువల్ షర్ట్తో వేసుకుంటే ట్రెండీ లుక్ గ్యారంటీ.స్టయిలింగ్ సపోర్ట్ ముఖ్యం!ట్రౌజర్స్ వేసుకుంటే సరిపోదు, వాటిని ఎలా స్టయిల్ చేస్తారన్నదే అసలు మ్యాజిక్! ఫైవ్ పాకెట్ ట్రౌజర్స్తో సాదా టీ–షర్ట్, స్నీకర్స్తోనూ, ప్లీటెడ్ ట్రౌజర్స్కు టక్–ఇన్ షర్ట్, లోఫర్స్ అయితే రిచ్ లుక్ గ్యారంటీ. లినెన్ ట్రౌజర్స్ను హాఫ్ స్లీవ్ షర్ట్తో మ్యాచ్ చేస్తే సమ్మర్లో కూల్గా కనిపిస్తారు. డ్రాస్ట్రింగ్ ట్రౌజర్స్కు ఓవర్సైజ్ టీ–షర్ట్ట్ పెయిర్ చేస్తే ట్రెండీ లుక్ మీ సొంతం. ప్రతిరోజూ అదే జీన్స్ వేసుకుని ‘నా దగ్గర ఇంకో ప్యాంట్ లేదా?‘ అని అల్మారానే అడిగే పరిస్థితి వద్దు. ఒక్కో సందర్భానికి ఒక్కో ట్రౌజర్ ఎంచుకుని, దానికి తగ్గ టాప్, షూస్ను మ్యాచ్ చేస్తే... అప్పుడు మీ స్టయిల్తో పాటు మీ ఫోటోలు కూడా అప్గ్రేడ్ అవుతాయి.ఫైవ్ పాకెట్ ట్రౌజర్స్!: జీన్స్కు దగ్గరి బంధువుల్లా కనిపిస్తాయి. పాకెట్లు, ఫిట్ అన్నీ జీన్స్లాగే ఉంటాయి. కానీ లుక్ మాత్రం మరింత షార్ప్. ఆఫీస్ నుంచి పార్టీ వరకు ఎక్కడైనా సెట్.చినో ట్రౌజర్స్: ‘తక్కువ హంగామా... ఎక్కువ క్లాస్!’ అనాలంటే ఇవే. టీ–షర్ట్తో వేసుకున్నా బాగుంటాయి... షర్ట్తో వేసుకున్నా సూపర్. ప్రతి అబ్బాయి వార్డ్రోబ్లో ఉండాల్సిన ప్యాంట్ ఇదే.ప్లీటెడ్ ట్రౌజర్స్: ఒకప్పుడు నాన్నల ఫ్యాషన్ ... ఇప్పుడు ట్రెండ్ సెట్టర్స్ ఫేవరెట్! ముందు ఉండే ప్లీట్స్ వల్ల లుక్కు చిన్న రాచరిక టచ్ వస్తుంది. కంఫర్ట్ కూడా అదిరిపోతుంది.లినెన్ ట్రౌజర్స్: ఎండాకాలానికి అసలు హీరో ఇవే! తేలికగా ఉంటాయి, గాలి బాగా ఆడుతుంది. బీచ్ వెకేషన్ , బ్రంచ్ డేట్, సమ్మర్ పార్టీ... ఎక్కడైనా కూల్గా కనిపిస్తారు.- కొండి దీపిక -
సజీవ సాంస్కృతిక 'నాదమ్'
మంగోలియా అస్తిత్వానికి, అక్కడి ప్రజల జీవన విధానానికి అద్దం పట్టే జాతీయ ఉత్సవం ‘నాదమ్’. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఈ వేడుకను ప్రతి సంవత్సరం జూలై 11 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకొంటారు. మంగోలియన్ల సంచార నాగరికతతో విడదీయరాని బంధం ఉన్న ఈ వేడుక, 2010లో సాంస్కృతిక వారసత్వ పండుగగా యునెస్కో గుర్తింపు పొందింది. మంగోలియా అనగానే మనకు గుర్రాల గుంపులు, అంతులేని పచ్చని మైదానాలు, చెంఘిజ్ ఖాన్ పరాక్రమం గుర్తొస్తాయి. నేటి ఆధునిక యుగంలోనూ ఆ ప్రాచీన సంచార సంస్కృతిని, వీరత్వాన్ని సజీవంగా ఉంచుతూ ఏటా జూలై నెలలో అత్యంత వైభవంగా ‘నాదమ్’ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. స్థానికంగా దీనిని ‘ఎరీన్ గుర్వన్ నాదమ్’ కూడా అని పిలుస్తారు.నాదమ్ పండుగలో నిర్వహించే గుర్రపు పందాలు, కుస్తీ, విలువిద్య అనే మూడు సాంప్రదాయ క్రీడలు వారి జీవన పరిస్థితులకు ప్రత్యక్ష రూపాలు. ఇవి కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, పూర్వకాలంలో సైనికులను యుద్ధానికి సిద్ధం చేసే శిక్షణలో భాగంగా ఉండేవి. వీటిని తరతరాలుగా కుటుంబ సభ్యులే పిల్లలకు నేర్పిస్తారు. అయితే, ఇటీవలి కాలంలో కుస్తీ, విలువిద్యల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఇక్కడి ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. గెలుపొందిన విజేతలకు ప్రత్యేక బిరుదులు ఇవ్వడమే కాకుండా, పోటీదారులను కొనియాడుతూ ప్రత్యేక ప్రశంసా గీతాలు, కవితలను అంకితం చేయడం ఇక్కడి ఆచారం.నాదమ్ కేవలం ఆటల పోటీ మాత్రమే కాదు.. అదొక సాంస్కృతిక సంబరం!పండుగ రోజుల్లో మంగోలియన్లు అందరూ ‘దీల్’ అని పిలిచే తమ సాంప్రదాయ, రంగురంగుల పట్టు దుస్తులను ధరించి ఎంతో ముచ్చటగా తయారవుతారు. ఉత్సవాల సమయంలో ‘ఖుషూర్’ అనే ప్రత్యేకమైన వంటకంతో పాటు, గుర్రం పాలను పులియబెట్టి తయారుచేసే ‘ఐరాగ్’ అనే సాంప్రదాయ పానీయాన్ని అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. ఈ వేడుకలో మంగోలియన్ల ప్రత్యేక సంగీత వాద్య పరికరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్లో జరిగే జాతీయ ఉత్సవాలతో పాటు, గ్రామీణ ప్రాంతాలలో స్థానిక స్థాయిలో జరిగే నాదమ్ వేడుకలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న విలువలనూ, ప్రకృతితో ముడిపడిన సంచార జీవనాన్నీ నేటికీ గౌరవిస్తూ, సమాజాన్ని ఏకం చేసే శక్తి నాదమ్. అందుకే ఇది కేవలం ఒక పండుగగా మిగిలిపోకుండా, ప్రపంచ సాంస్కృతిక సంపదగా వెలుగొందుతోంది.- రమా జంబుల -
భవిష్యత్ కలలా.. పిల్లలా? మరో ఏడాది ఆగుదామా?
ఆనందంగా జరుపుకోవడానికి వారి పుట్టినరోజులు లేవు, గుమ్మం ముందు వేచి ఉండే బుజ్జిబుజ్జి చెప్పులు లేవు, అల్మారాలో నీట్గా సర్దిన స్కూల్ యూనిఫార్మ్లూ లేవు. కాలక్రమేణా వాయిదా పడుతూ, మెల్లగా కరిగిపోతున్న కలలు మాత్రమే ఉన్నాయి. రికార్డుల్లో రాయని గుండెల్లో గూడు కట్టుకున్న నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఒకప్పుడు తమను ‘అమ్మా’, ‘నాన్నా‘ అని పిలిచే ఒక చిన్నారిని ఊహించుకుని, ఇపుడు భవిష్యత్తులో ఆ రోజు అసలు వస్తుందో లేదో తెలియక సతమతమవుతున్న లక్షలాది మంది యువతీ యువకుల అంతరంగిక వ్యథ ఇది. ఎక్కడా నమోదు చేయలేని వేదన ఇది.ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. దశాబ్దాలుగా ఈ చర్చ కేవలం అంకెల చుట్టూనే తిరుగుతోంది. ఎంతమంది జన్మిస్తున్నారు? ఏ దేశ జనాభా వేగంగా పెరుగుతోంది? అందరికీ సరిపడా ఆహారం, నీరు, వనరులు ఉన్నాయా? అంటూ. ఇవి ముఖ్యమైన ప్రశ్నలే కావచ్చు, కానీ అంకెలకు వాటి వెనుక ఉన్న మనుషులను, వారి వ్య«థలను దాచేసే వింత అలవాటు ఒకటి ఉంది. అదే నేడు ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలనే యువత కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయనే చేదు వాస్తవాన్ని ముందుకు తీసుకురాలేకపోతోంది.పడిపోతున్న జననాల రేటుఒకప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ‘అధిక జనాభా’ అని మనమంతా నమ్మాం. కానీ నేటి వాస్తవం చాలా భిన్నంగా ఉంది. ప్రపంచంలోని అనేకప్రాంతాలలో మునుపెన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోతోంది. అయితే పడిపోతున్న జననాల రేటు అనేది గ్రాఫ్లో కేవలం ఒక లైన్ మాత్రమే కాదు. ఇద్దరు పిల్లలను పెంచాలని కలలుగని, చివరికి ఆర్థిక పరిస్థితులు సహకరించక ఒక్కరిని కూడా వద్దనుకున్న ఎన్నో యువ జంటల నిర్ణయం అది. పెరుగుతున్న జనాభా కేవలం ఒక గణాంకం కాదు. ప్రతి బిడ్డకు వైద్యం, విద్య, రక్షణ, ఆశ లభించాలనే రిమైండర్ అది. అదే నేడు యువతను వెనకడుగు వేసేలా చేస్తోంది.మరో ఏడాది ఆగుదాం!జనాభా తగ్గడంపై యువతను బ్లేమ్ చేయడం చాలా సులభం. ‘వారు కెరీర్ వెంటపడుతున్నారు’, ‘బాధ్యత వద్దు అనుకుంటున్నారు‘ అని చాలామంది అంటుంటారు. కానీ అందులో నిజం లేదు. ఇంటి అద్దెలు పెరిగాయి, నిత్యావసరాలు భారమయ్యాయి, ఎడ్యుకేషన్ లోన్లు, చైల్డ్ కేర్ ఖర్చులు ఆకాశాన్నంటాయి. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వస్తే జీవితకాల ΄÷దుపు కరిగిపోతోంది. ఒకరికి ప్రసూతి సెలవు తీసుకుంటే కెరీర్ ఎక్కడ ఆగిపోతుందో అన్న భయం, మరొకరికి ఉద్యోగ భద్రత లేదన్న ఆందోళన. ఇన్ని ఆలోచనలతో ‘మరో ఏడాది ఆగుదాం’ అనుకుంటూ వాయిదా వేసిన ఆ జంట అలా ఐదేళ్ల పాటు వాయిదాల బాటలోనే నడుస్తుంది. చివరిగా ‘పిల్లలను ఎప్పుడు కందాం?’ అనే స్థితి నుంచి, ‘అసలు మనం పిల్లలను కనగలమా?’ అనే ప్రశ్నగా మారిపోతోంది. ఈ నిశ్శబ్ద కన్నీటి సంభాషణలు ఏ ప్రభుత్వ నివేదికల్లోనూ నమోదు కావు. ఏ జనాభా చార్ట్ కూడా ఆ సమయంలో కార్చిన కన్నీళ్లను చూపించదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఇళ్లల్లో ఈ నిశ్శబ్ద చర్చలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇది స్వార్థం కాదు, భవిష్యత్తుపై ఉన్న అభద్రతాభావం.ఉమ్మడి బాధ్యత కావాలి!ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కానీ ఇంట్లో మాత్రం ఆనాటి మూసధోరణులు అలాగే ఉండిపోయాయి. బిడ్డ పుట్టగానే మహిళే తన కెరీర్ను ఆపాలి లేదా పని గంటలు తగ్గించుకోవాలి. అటు ఉద్యోగం, ఇటు నిద్రలేని రాత్రులు, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ అన్నీ తానై చూసుకోవాలి. స్త్రీల సామర్థ్యాన్ని వారిపై అదనపు భారం వేయడానికి సాకుగా తీసుకోకూడదు. పిల్లల పెంపకం అనేది ఉమ్మడి బాధ్యత కావాలి. స్త్రీలు మాత్రమే ఈ భారాలన్నింటినీ మోయాలి అనేది కూడా జనాభా తగ్గడంలో ఒక కారణంగా మారుతోందని నిపుణుల మాట.అవసరాల ఖరీదు ఎక్కువైతే..ఎంతో ప్రగతి సాధించాం. శాటిలైట్లు లాంచ్ చేశాం, ఏఐ సృష్టించాం. కానీ ‘మనం ఒక బిడ్డను పెంచగలమా?’ అనే సాధారణ ప్రశ్నకు నేటి యువత సమాధానం చెప్పలేకపోతున్నారు. సురక్షితమైన ఉద్యోగం, సరసమైన వైద్యం, నమ్మకమైన చైల్డ్ కేర్ అనేవి విలాసాలు కావు, అవి ఒక ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులు. నిజమైన జనాభా సంక్షోభం జనాభా పెరగడం లేదా తగ్గడం గురించి కాదు. అది నిశ్శబ్దంగా మారుతున్న ప్రపంచం గురించి. లక్షలాది మంది యువత తల్లిదండ్రులు కావాలనే కలలను ఆపలేదు.. కానీ ఈ ప్రపంచం తమ పిల్లల కోసం సిద్ధంగా లేదని నమ్మడం ప్రారంభించారు. అంటే ప్రేమ లేకపోవడం వల్ల కాదు, అవసరాల ఖరీదు ఎక్కువైపోవడం వల్ల. ఏ సమాజానికైనా తన యువతను ఇలాంటి హృదయ విదారకమైన పరిస్థితిలోకి నెట్టడం ఒక ఓటమి. అందుకే పిల్లల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.వరల్డ్ పాపులేషన్ డే 2026 సందర్భంగా మన ముందున్న ప్రశ్న ఒక్కటే. తల్లిదండ్రులు కావాలని కలలు కనేవారికి, వారు ఆహ్వానించాలనుకునే పిల్లల కోసం మనం ఎలాంటి ప్రపంచాన్ని అందిస్తున్నాం? దీనికి మనం ఇచ్చే సమాధానమే మన భవిష్యత్ను, మన మానవత్వాన్ని నిర్ణయిస్తుంది.వరల్డ్ పాపులేషన్ డే 2026 జనాభాని శాతాల్లో, గ్రాఫ్లలో కాకుండా మనుషుల కోణంలో చూడమని కోరుతోంది. ఎందుకంటే, జనాభా అనేది కేవలం భూమిపై ఎంతమంది ఉన్నారనేది కాదు. మనుషులకు తమ కలల జీవితాన్ని నిర్మించుకునే స్వేచ్ఛ, భద్రత, నమ్మకం ఉన్నాయా లేదా అనేదే ముఖ్యమని చెబుతోంది.– రమ జంబుల -
చదువులోనే కాదు.. జీవితాన్ని కూడా పరీక్షించాలి!
చదువులోనే పరీక్షలు కాదు. జీవితాన్ని కూడా పరీక్షించాలి. గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అంటాడు పరీక్షింపబడని జీవితం వ్యర్థ జీవితమని. దీన్ని సమర్థించే సందర్భం కఠోపనిషత్తులో నచికేతుని సత్యాన్వేషణ ప్రయత్నంలో చూస్తాం. నచికేతుడు తన తండ్రి చేస్తున్న యజ్ఞయాగాదులలో ముసలి, నిరుపయోగ ఆవులను దానంగా ఇవ్వడం ఆశ్చర్యమనిపిస్తుంది. తన మదిలో ఇవే ప్రశ్నలు ‘‘ఇది సరియైనదేనా? నిజాయితీ లేని చర్యలకు విలువుంటుందా?’’ అని.తన మదిలో రగులుతున్న ప్రశ్నలకు సమాధానం తన తండ్రి నుంచి రాబట్టాలనుకుని తండ్రి నడుగుతాడు ‘‘తండ్రీ నువ్వు నన్ను ఎవరికి అర్పిస్తావు?’’ అని. పదే పదే అడుగుతున్న ఈ ప్రశ్నకి తండ్రి కోపోద్రిక్తుడై ‘‘నిన్ను యమునికి (మృత్యువుకి)సమర్పిస్తాను’’ అంటాడు. దాంతో నచికేతుడు యముని దగ్గరకు వెళ్ళి సంపద, ఆధిపత్యం, అమరత్వం కోరకుండా ‘‘మరణానంతరం ఏమవుతుంది? అసలు నిజమైన సత్యం ఏదీ...’’ అని అడుగుతాడు.యముడు నచికేతుని సంపదలు, రాజ్యం, భోగభాగ్యాలు కోరుకోమంటాడు. కానీ నచికేతుడు ఈ సంపదలు, సౌఖ్యాలు తాత్కాలికాలని...కాబట్టి ఎప్పటికీ చావులేని సత్యమే కావాలని పట్టుబడతాడు. అపుడు యముడు సంతసించి మోక్షసాధనమైన ఆత్మజ్ఞానం బోధిస్తాడు. ఇందులో గమనించాల్సింది సాధారణంగా మనుషులు అలవాట్లను, ఆచారాలను, కోరికలను ప్రశ్నించకుండా అనుసరిస్తారు. కానీ నచికేతుడు జీవితాన్ని ప్రశ్నించుకొని, పరీక్షించుకొని తప్పొప్పులు, శాశ్వత–అశాశ్వతాలు, అసలు జీవిత లక్ష్యం ఏమిటి? ఈ శరీర పతనానంతరం నేను ఎవరిని... లాంటి ప్రశ్నలతో పయనించడం వలన సత్యాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందగలిగాడు. సుఖభోగాలతో వెంటాడే జీవితం అసంపూర్ణం, స్వ పరిశీలన, అనుభవం మాత్రమే అర్థవంత జీవితానికి మూలం. ఇదే ఈ కథ మనకిచ్చే సందేశం. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
యద్భావం తద్భవతి: మనసులో మంచి భావనలు ఉంటే అంతా..
‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’ ప్రాపంచిక బంధాలలో చిక్కుకోవడానికిగానీ, వాటినుండి విడుదల పొందడానికి కానీ; మన సు ఖానికిగానీ, దుఃఖానికి కానీ; అభ్యున్నతికిగానీ, పతనానికి కానీ – ఇలా దేనికైనా మన మనసు, అందులో ఎగిసిపడే ఆలోచనలే కారణాలని చెబుతూ శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరోజు తమ శిష్యులకు మనిషి మనసులోని కోరికలు, ఆశలు అతనిని ఎలా పతనం చేస్తాయో వివరించడానికి ఈ కథను చెప్పారు.ఒక వర్తకుడు వ్యా΄ార నిమిత్తం తన గ్రామం నుండి పట్టణానికి నడిచి వెడుతున్నాడు. ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పటిలాగా రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు కాబట్టి తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం దాకా నడిచేసరికి బాగా అలసిపోయాడు. మరొక నాలుగైదు గంటలు నడిస్తే కానీ గమ్యం చేరలేడు. కనుక ఎక్కడైనా తగిన చోటు దొరికితే కాసేపు ఆగి బడలిక తీర్చుకొందామనుకొన్నాడు. అతని అదృష్టం కొద్దీ ఒక పెద్ద చెట్టు, దాని చుట్టూ అరుగు కనిపించాయి. పరమానందంగా ఆ చెట్టు నీడన ఆ అరుగుపై కాళ్ళు చాచి పడుకొన్నాడు.చల్లగా వీస్తున్న గాలి అతని మార్గాయాసాన్ని కాస్త ఉపశమింపజేసింది. అప్పుడతనికి తన దాహం తెలిసింది. ‘తాగడానికి నీరు లభిస్తే ఎంత బాగుంటుందో’ అనుకొన్నాడు. వెంటనే అతని పక్కన ఒక ΄ాత్రలో చల్లని నీరు ప్రత్యక్షమైంది. ఆశ్చర్యపోతూ అమృత తుల్యంగా ఉన్న ఆ నీటిని తాగి దాహం తీర్చుకొన్నాడు. దాహం తీరగానే అతని మనసు భోజనం పైకి మళ్ళింది. ‘బాగా ఆకలి వేస్తోంది. తినడానికి మంచి భోజనం లభిస్తే బాగుండు’ అని అనుకుంటూండగానే అతని ఎదుట పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించబడిన విందు భోజనం అరిటాకులో సిద్ధంగా కన్పించింది.ఎంతో సంబరంగా కడుపునిండా భోంచేశాడు. కాసేపు కునుకు తీస్తేగానీ భుక్తాయాసం తీరి నడక ముందుకు సాగదు. ఈ అరుగు పైన మెత్తటి పరుపు, తలగడ అమరితే బాగుండు అని మనసులో అనుకొన్నాడో లేదో తక్షణం అతని ఎదుట హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. దానిపై పడుకొని ‘ఇప్పుడెవరైనా నా కాళ్ళు పడితే బ్రహ్మాండంగా నిద్ర పోవచ్చు’ అని అనుకొన్న మరుక్షణం ఇద్దరు అపురూపమైన అందగత్తెలు అతని కాళ్ళు పట్టడం మొదలు పెట్టారు. తాను ఏ చెట్టు నీడన కూర్చున్నాడో అది కల్పవృక్షమనీ, అతడు మనసులో ఏది కోరుకొన్నా దానిని వెంటనే ప్రసాదిస్తుందనీ అతనికి తెలియదు.ఇప్పుడు అతనికి ఒక అనుమానం మొదలైంది. ‘ఈ అడవిలో నేను గనుక గాఢంగా నిద్రపోతే, ఒంటరిగా, నిరాయుధుడుగా ఉన్న నన్ను ఏ పెద్దపులో వచ్చి చూసిందంటే నా గతి ఏమౌతుందో’ అనుకొంటూండగానే ఎక్కణ్ణుంచో గాండ్రుమంటూ ఒక పెద్దపులి వచ్చి, అతనిపై భీకరంగా దాడిచేసి చంపేసింది. అంతటితో ఆతని కోరికలన్నీ అంతమైపోయాయి. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు మన మనసులో మంచి భావనలు ఉంటే మనకు మంచే జరుగుతుంది. లేకపోతే మన గతి అథోగతే అన్నది శ్రీ రామకృష్ణులు ఈ కథ ద్వారా మనకు అందించిన సందేశం.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రినిర్వహణ : డి.వి.ఆర్ -
ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి..
మనం మాట్లాడే మాటల శబ్దాలు మనపైన, ప్రకృతిపైన ప్రభావం చూపుతాయి. అవే శబ్దాలు వేద మంత్రాలకు సంబంధించినవైతే మరింత గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి. అశుద్ధమైన మాటలు వినడం, చెడు దృశ్యాలు చూడటం వంటివి మనసుపై చెడు ప్రభావం చూపుతాయి. ప్రియమైన మాటలు మాట్లాడితే సకల ప్రాణులూ ఆనందిస్తాయి. ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి. వినయ పూర్వక సత్య వచనాలు పలకడం ద్వారానే బంధువులు, స్నేహితులు దగ్గర అవుతారు. అలా మాట్లాడ గలిగే వారు సంఘంలో రాణిస్తారు.తైత్తిరీయారణ్యకం ‘మనో వాక్కాయ కర్మాణి శుధ్యన్తామ్’ అని చెప్పింది. అంటే మనస్సు, మాట, పనులను (త్రికరణములు) పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇతరుల మనసులు గాయపరుస్తూ, బాధించేలా మాట్లాడకూడదు. అలా చేయడం కూడా హింసే అన్నారు గాంధీజీ. మాట్లాడగలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి. ‘మధుర భాషణమున మర్యాదప్రాప్తించు’ అన్నారు పెద్దలు. మంచి మాట ఆభరణమే కాదు, దివ్యశక్తి కూడా! దానిని మనం మితంగా, జాగ్రత్తగా వినియోగించాలి. రఘువంశపు రాజులందరూ ‘సత్యాయ మిత భాషిణాం’ అని కాళిదాస మహాకవి అన్నారు. అంటే సత్య సంరక్షణార్థం ఆ రాజులు మిత భాషిత్వాన్ని పాటించారని అర్థం.మనిషికి నాలుక ముందు పుట్టి తర్వాత దంతాలు ఏర్పడుతాయి. కానీ నాలుక కంటే వెనుక పుట్టిన దంతాలే ముందుగా ఎందుకు ఊడిపోతాయి అనే ప్రశ్నకు శ్రీ రామకృష్ణ పరమహంస చక్కని వివరణ ఇచ్చారు. ‘దంతాలు కఠినంగా ఉంటాయి. వాటికి వినయంతో కూడిన మెత్తదనం లేదు. నాలుక మృదువుగా అణకువతో ఉండి త్వరగా బయటకు కనపడదు. అందుకే రెండు పలు వరుసల మధ్య అది సురక్షితంగా ఉంటుంది’ అన్నారాయన. వినయంతో మిత భాషులైనవారు సురక్షితంగా ఉంటారు. కఠినాత్ములు, పరుష వాక్కు గల వారు త్వరగా రాలిపోతారని అర్థం చేసుకోవాలి.మన మాటల వలన జనించే శబ్దం చాలా శక్తిమంతమైనది. అవి వినేవారి మనస్సు పైన, దేహం పైనా అపరిమిత ప్రభావాన్ని చూపుతుంది. దుఃఖిస్తున్న వారి పట్ల దయతో సాంత్వన వచనాలు పలికితే వారి శోకం ఉపశమిస్తుంది. ఎవరి పట్లనైనా పరుష పదాలతో కఠినంగా మాట్లాడితే అవతలి వారు కోపోద్రిక్తులై పరిస్థితి విషమిస్తుంది. అందువల్ల వీలైనంత మేరకు మధురంగా... హితంగా.. మితంగా మాట్లాడటమే మంచిదని పెద్దలు చెప్పారు.మాట్లాడ గలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి.– డాక్టర్ పాణ్యం వసుంధరనిర్వహణ డి.వి.ఆర్ -
సంశయాత్ములు
జ్ఞానం, శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడని భగవద్గీత చెబుతుంది. సంశయాలతో సతమతమయ్యేవారు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. అదేపనిగా అనేక సందేహాలతో మనసు నింపుకున్నవారు మనోదౌర్బల్యం కలిగి కర్తవ్య హీనులవుతారు.భయం, నిరాశ, నిష్క్రి యత్వం, ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జీవితానందం సన్నగిల్లుతుంది. ఇటువంటి వారు ఎప్పుడూ ఏదో అపజయం, ఉపద్రవం జరగబోతోందేమోనన్న చెడు భావనలతో భయపడిపోతుంటారు. రేపు ఏం జరుగుతుందోనని నేటి ఆనంద క్షణాలను అనుభవించలేరు.ఏ పనైనా పూర్తి చేయలేమేమోననే సందేహంతోనే వీరు మొదలుపెడతారు. విద్యార్థులుగానీ, ఉద్యోగా ర్థులుగానీ తమ మీద తమకు స్థిర నమ్మకం లేకపోతే గెలుపు సాధించలేరు. ఏదైనా చేయగలము అనే విశ్వాసం ఉంటే సగం విజయం సాధించినట్లే! యుద్ధానికి వెళుతున్న సైన్యం విజయం తమదే అనే నమ్మకంతో వెళితే విజయం వరిస్తుంది.భగవద్గీత మానవులకు జీవన సమరంలో ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసి ఆనందంగా జీవించటానికి మార్గం చూపిస్తుంది. హృదయ దౌర్బల్యం ప్రతివారికీ ఏదో ఒక సందర్భంలో కలుగక మానదు. శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయుడు, అర్జునుడు ఏదో ఒక సందర్భంలో హృదయ దౌర్బల్యం అనుభవించినవారే. కానీ, దానినుండి బైట పడి ఘనులైన విధం మనకు పాఠం లాంటిది. – డా. చెంగల్వ రామలక్ష్మి -
Beauty Tips: ఈ మాస్క్తో ముడతలు దూరం
వయసు పెరిగే కొద్దీ చర్మంలో మార్పులు రావడం సహజం. మార్కెట్లో దొరికే చాలా రకాల ఎల్ఈడీ ఫేస్ మాస్క్లు కేవలం ముఖంపై వచ్చే ముడతలు, చారలు, మచ్చలను మాత్రమే తగ్గిస్తాయి. కానీ, సోలావేవ్ నెక్ – చెస్ట్ రెజువనేటింగ్ మాస్క్ ముఖం కింద ఉండే నెక్, చెస్ట్ చర్మ సంరక్షణలోనూ తోడ్పడుతుంది.ముఖం లాగే మెడ, ఛాతీ భాగాలపై కూడా వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల చర్మం సాగడం, ముడతలను తగ్గించుకోవాలనుకునే వారి కోసం సోలావేవ్ సంస్థ రూపొందించిన ఈ రెజువనేటింగ్ పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ‘మైక్రోకరెంట్’, ‘రెడ్ లైట్ థెరపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది. ఈ మాస్క్ మెడ, ఛాతీ భాగాలపై ఉండే సన్నని ముడతలను సున్నితంగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా మారుస్తుంది. రోజుకు పది నిమిషాలు దీనిని ఉపయోగిస్తే చాలు. దీనిని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బెల్ట్తో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది.బొగ్గుపొడితో దంతాలు ధగధగకొన్ని సందర్భాల్లో కాఫీ, టీ లు ఎక్కువగా తాగడం, ఎనామిల్ పొర బలహీనపడటం వల్ల దంతాలు పచ్చగా మారిపోతుంటాయి. ఇందుకోసం డెంటిస్టుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేకుండా, సహజంగా దొరికే వస్తువులతోనే దంతాలను మెరిపించుకోవచ్చు.దంతాలను సహజంగా క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దంతాలపై పేరుకుపోయిన మరకలను సున్నితంగా తొలగిస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలపై ఉండే రంగు మారిన పొరలను తొలగిస్తుంది. అయితే దీనిని చాలా జాగ్రత్తగా, తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి. చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, బొగ్గుపొడి పళ్లపై ఉండే టాక్సి¯Œ ్స, రంగు మరకలను తన వైపుకు లాక్కునే ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని కూడా తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.సాంబ్రాణితో సహజ మెరుపు!తలస్నానం చేసిన వెంటనే నేడు జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు. కానీ పూర్వం ఎంతటి పొడవాటి జుట్టునయినా ఆరబెట్టుకోవడానికి తలకు ‘ధూపం’ వేసుకునేవారు.ఇది నేటి తరానికి కేవలం సువాసన కోసం చేసే ప్రక్రియగా అనిపించినప్పటికీ ఇందులో ఎన్నో ఆయుర్వేద, ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. సాంబ్రాణిని వేయడం వల్ల, ఆ వెచ్చని పొగ జుట్టులోని తేమను వేగంగా పీల్చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి తలనొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీ–మైక్రోబియల్, యాంటీ–ఫంగల్ గుణాలు తలలో చుండ్రు చేరకుండా రక్షిస్తాయి. -
పనిని ఈజీగా మార్చేసే ఇంట్రెస్టింగ్ కిచెన్ గ్యాడ్జెట్స్
రోజూవారీ వంటలు వండటం ఒక ఎత్తయితే, వాటిని వేడి వేడిగా వడ్డించడం, పిల్లలు అడిగిన స్నాక్స్ అప్పటికప్పుడు చేయడం గృహిణులకు పెద్ద టాస్క్. ఇలా కాకండా, వంట పనిని స్మార్ట్గా, ఈజీగా మార్చేసే ఇంట్రెస్టింగ్ కిచెన్ గ్యాడ్జెట్స్ ఇవే...ఇంట్లోనే ఐస్క్రీమ్ రోల్స్!‘ఐస్క్రీమ్ కావాలి!’ అని పిల్లలు అడిగిన వెంటనే.. హెల్దీ హోమ్ మేడ్ ఐస్క్రీమ్ కోసం షాప్కు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం నిమిషాల్లో ఐస్క్రీమ్ రోల్స్ చేసి ఇచ్చేయడానికి వచ్చేసింది ఈ ఇన్ స్టంట్ ఐస్క్రీమ్ మేకర్. ఇది మీ కిచెన్ ను చిన్న ఐస్క్రీమ్ పార్లర్గా మార్చేస్తుంది. ఈ కోల్డ్ ప్లేట్ను కొన్ని గంటల ముందు ఫ్రీజర్లో ఉంచి. బయటకు తీసిన తర్వాత దానిపై ఐస్క్రీమ్ మిశ్రమాన్ని పోయాలి. ఇక క్షణాల్లో గడ్డకట్టిన మిశ్రమాన్ని స్క్రాపర్లతో రోల్స్గా మార్చేస్తే చాలు! చల్లచల్లని ఐస్క్రీమ్ రోల్స్ రెడీ! ఇలా రోల్స్తో పాటు గెలాటో, సార్బెట్ వంటి ఫ్రోజెన్ డెజర్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని వాడటానికి కరెంట్ అవసరం లేదు. ఎలాంటి క్లిష్టమైన యంత్ర భాగాలు లేవు. ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారైన ఈ ట్రేను శుభ్రం చేయడం కూడా చాలా సులభం. ధర రూ.3,000 మాత్రమే!దోసెల ప్రేమికులకు గుడ్ న్యూస్!గ్యాస్ స్టవ్ ముందు గంటల తరబడి నిలబడి దోసెలు వేయడం మరచిపోండి! ఇప్పుడు ప్లగ్ పెడితే చాలు, నిమిషాల్లో వేడి వేడి దోసెలు మీ ప్లేట్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే, ఈ ఎలక్ట్రిక్ గ్రిడిల్ క్రేప్ మేకర్తో దోసెలు, పాన్ కేక్లు, ఆమ్లెట్లు, క్రేప్లను ఎలాంటి గ్యాస్ అవసరం లేకుండా ఎక్కడైనా సులభంగా తయారుచేసుకోవచ్చు. నాన్–స్టిక్ కోటింగ్ ఉండటంతో తక్కువ నూనెతోనే వంట పూర్తవుతుంది. ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వల్ల ప్రతి దోసె సమంగా కాలి, రుచిగా ఉంటుంది. తేలికైన బరువుతో ఉండటంతో హాస్టల్ గదుల్లో, చిన్న ఇళ్లలో, ఆఫీసుల్లో ఎక్కడైనా ఈజీగా ఉపయోగించు కోవచ్చు. ధర కేవలం రూ.1,400 మాత్రమే!టేబుల్పైనే వేడి వేడి విందు!అతిథులు ఒక్కోసారి వచ్చి కూర్చుంటే, కిచెన్ కి వెళ్లి మళ్లీ మళ్లీ వేడి చేయడం కాని పని. అలాగని, వారు వచ్చే ముందు వేడివేడిగా వండటమూ కష్టమే. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వచ్చేసింది ఎలక్ట్రిక్ ఫుడ్ వార్మింగ్ ట్రే మ్యాట్. దీనిపై ఒకేసారి 3 నుంచి 4 పెద్ద గిన్నెలను సులభంగా ఉంచుకోవచ్చు. అలా ఒకేసారి అన్నం, కూరలు, సూప్లు, స్నాక్స్... ఏవైనా సరే గంటల తరబడి సరైన ఉష్ణోగ్రతలో వేడిగా ఉంచుతుంది. పైగా ఇందులో ఉన్న స్మార్ట్ టచ్ కంట్రోల్ ప్యానెల్ ద్వారా వేడిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆహారం ఓవర్–కుక్ అవ్వకుండా, ఎండిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. దీని సర్ఫేస్ నాన్–స్టిక్ మెటీరియల్తో రావడం వల్ల ఏదైనా ఒలికినా, ఒక చిన్న గుడ్డతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ చుట్టూ తిరిగే పని లేకుండా చేసే ఈ సూపర్ గాడ్జెట్ అసలు ధర రూ. 5,000. -
Fashion: పోగు పెట్టుకో... పోజు కొట్టుకో!
ఒకప్పటి రాజుల ఫొటోలు చూస్తే, ఒంటినిండా నగలతో మెరిసిపోతూ కనిపించేవారు. మధ్యలో ఏమైందో ఏమో మగవాళ్లు జ్యూలరీకి కాస్త దూరమయ్యారు. అయితే, ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్ ప్రపంచం పెద్ద యూటర్న్ తీసుకుంది. రాజుల కుండలాలు కాస్త కూల్ ఇయర్రింగ్స్గా మారి కుర్రాళ్ల స్టయిల్కు కొత్త మెరుపు తెస్తున్నాయి. మగాళ్లను మళ్లీ మహారాజుల్లా మెరిపిస్తున్న ఈ ఇయర్రింగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం!స్టడ్స్సింపుల్గా ఉండాలనుకునే వారికి ఇవి బెస్ట్. చిన్న రాయి లేదా మెటల్ డిజైన్ తో నల్లటి చుక్కలా ఉండే స్టడ్స్ ఎలాంటి దుస్తులతోనైనా సెట్ అయిపోతాయి. సైలెంట్గా స్టయిల్ మెయింటైన్ చేయాలంటే స్టడ్స్ పెట్టుకోవాల్సిందే!రింగ్స్కొంచెం రఫ్ అండ్ టఫ్ లుక్ కావాలంటే ఇవి పర్ఫెక్ట్. స్పోర్ట్స్ బైక్ మీద కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్తుంటే... ఆ రింగ్ గాలికి ఊగుతూ మెరుస్తుంటే.. అబ్బా, ఆ కిక్కే వేరు! చిన్న రింగ్స్ నుంచి పెద్ద రింగ్స్ వరకు ఎన్నో డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.డాంగ్లర్స్ ఇవి పెట్టుకుంటే స్టయిల్ మీటర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. చెవికి కిందకి వేలాడే ఇవి సాధారణ లుక్ను క్షణాల్లో ట్రెండీగా మార్చేస్తాయి. ముఖ్యంగా క్రాస్ డిజైన్లు, ఫంకీ పెండెంట్లు ఉన్న డాంగ్లర్స్ పూల్ పార్టీలు, బీచ్ వెకేషన్లు, వీకెండ్ ట్రిప్స్లకు, ఇవి పెట్టుకున్న వెంటనే తెలియకుండా అందంగా కనిపిస్తారు.మ్యాగ్నెటిక్ పోగులు ‘ఫ్యాషన్ కావాలి. కాని, సూదితో చెవి కుట్టించుకునే ధైర్యం లేదు’ అనుకునే సుకుమారుల కోసం దేవుడు సృష్టించిన, భయస్తుల బ్రహ్మాస్త్రాలు ఇవి. అంటించుకుంటే అతుక్కుంటాయి, తీసేస్తే వచ్చేస్తాయి.పోగు పెట్టుకుంటే... స్టార్ అయిపోరు!సినిమా హీరోలు, క్రీడాకారులు చెవికి పోగు పెట్టుకున్నారని చాలామంది సేమ్ స్టయిల్ ఫాలో అవుతుంటారు. అయితే, చెవి పోగు పెట్టుకున్న వెంటనే బ్యాక్గ్రౌండ్లో హీరో ఇంట్రో మ్యూజిక్ మొదలవుతుందని మాత్రం అనుకోవద్దు! అసలు మ్యాజిక్ పోగులో కాదు... దాన్ని ఎలా క్యారీ చేస్తారన్న దాంట్లో ఉంది. మీ ముఖాకారం, హెయిర్ స్టయిల్, దుస్తులకు సరిపోయే డిజైన్ ను ఎంచుకుంటేనే లుక్ అదిరిపోతుంది.స్కిన్ టోన్ కు తగ్గట్టు బ్లాక్, సిల్వర్ లేదా గోల్డ్ కలర్ను ఎంచుకోండి. కనిపించిన ప్రతీ డిజైన్ను ఒకేసారి ట్రై చేస్తే క్రిస్మస్ ట్రీలా తయారవుతారు. అలాగే మరీ బరువైన పోగులు పెట్టుకుని చెవులకు జిమ్ వర్కౌట్ ఇవ్వొద్దు. అలాగే రోజుకో పోగు, గంటకో స్టయిల్ మార్చేస్తే కన్ఫ్యూజన్ మీకే. మీ ఫేస్కు ఏది బాగా సెట్ అవుతుందో అదే ఫిక్స్ చేసుకోండి. తర్వాత అద్దం ముందు నిలబడి ఒక్కసారి చూసుకోండి... మీరే మీకు ఫ్యాన్ అయిపోతారు! - కొండి దీపిక -
పండ్లు ఫ్రిడ్జ్లో పెడుతున్నారా?
పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలని.. మార్కెట్ నుంచి తీసుకురాగానే ఫ్రిజ్లో పెట్టేస్తుంటాం. కానీ అలా చేయడం వల్ల కొన్ని రకాల ఫ్రూట్స్ రుచి మారడమే కాకుండా, వాటిలోని పోషక విలువలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అలా ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడనివి...అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితేనే అవి సహజంగా మగ్గుతాయి. వీటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల పండ్ల తొక్కలు త్వరగా నల్లగా మారిపోతాయి. పండు లోపల గట్టిగా, చప్పగా తయారవుతుంది.పుచ్చకాయలను ఫ్రిజ్లో ఉంచితే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గణనీయంగా తగ్గిపోతాయి. అయితే, పండును ముక్కలుగా కోసిన తర్వాత మాత్రం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిజ్లో దాచుకోవచ్చు.ఆవకాడోలు పూర్తిగా పక్వానికి రావడానికి వేడి వాతావరణం అవసరం. వీటిని పచ్చిగా ఉన్నప్పుడే ఫ్రిజ్లో పెడితే, అవి పక్వానికి రాకుండా గట్టిగానే ఉండిపోతాయి.మామిడిపండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఫ్రిజ్లో పెట్టకూడదు. చల్లదనం వల్ల ఇవి మగ్గే ప్రక్రియ నెమ్మదించడమే కాకుండా, వీటి తీపిదనం తగ్గిపోతుంది.బొప్పాయి పండును ఫ్రిజ్లో పెట్టడం వల్ల రుచి మారిపోతుంది. ఫ్రిజ్ ఉష్ణోగ్రత బొప్పాయి త్వరగా కుళ్ళిపోయేలా లేదా లోపల గట్టిగా ఉండేలా చేస్తుంది.నేరేడు, రేగు, సపోటా వంటి పండ్లను ఫ్రిజ్లో పెట్టడం వల్ల అవి జ్యూసీగా మారకుండా లోపల ఎండిపోయినట్లు డ్రైగా తయారవుతాయి. -
ఏఐ ఫిట్నెస్ యాప్స్ని నమ్మొచ్చా?
సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ ఫిట్నెస్ రంగంలోకి కూడా దూసుకొచ్చింది. మనం వ్యాయామం చేసే విధానాన్ని, లైఫ్స్టైల్ను ఇది పూర్తిగా మార్చేస్తోంది. ప్రతి ఒక్కరి శరీర తత్వానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ వర్కవుట్ ప్లాన్స్ ఇవ్వడం, న్యూట్రిషన్ నియమాలను సూచించడం, రోజువారీ పురోగతిని ట్రాక్ చేస్తూ రియల్–టైమ్ సమాచారాన్ని అందించడం వంటి ఎన్నో ఫీచర్ల తో ఏఐ యాప్స్ సరికొత్త ట్రెండ్ను సృష్టి్టస్తున్నాయి. అయితే ఈ ఏఐ ఫిట్నెస్ యాప్స్తో లాభాలెన్నో.. నష్టాలు కూడా అదేవిధంగా ఉంటాయంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.ఏఐ యాప్స్ డేటాను విశ్లేషించడంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, ఒక హ్యూమన్ కోచ్ స్థానాన్ని భర్తీ చేయలేవు. ఉదాహరణకు, ఎవరైనా డెడ్లిఫ్ట్ వ్యాయామం చేస్తున్నప్పుడు.. పొడవాటి కాళ్లు ఉన్న వ్యక్తి చేసే విధానం, పొట్టిగా ఉండే వ్యక్తి చేసే విధానం వేరువేరుగా ఉంటాయి. ఒక మంచి ఫిట్నెస్ కోచ్ మాత్రమే ఈ శారీరక వ్యత్యాసాలను గమనించి సరైన గైడెన్స్ ఇవ్వగలరు. కానీ ఏఐ యాప్స్ ఈ తేడాలను గుర్తించలేక, కరెక్ట్గా చేస్తున్నా తప్పు అని చెప్పే ప్రమాదం ఉంది.అంతేకాకుండా, గతంలో ఏవైనా గాయాలు అయ్యాయా? బాడీలో ఎక్కడైనా నొప్పి ఉందా? లేదా అలసట కారణంగా తప్పుగా చేస్తున్నారా? అనే మానవీయ కోణాలను ఏఐ అర్థం చేసుకోలేదు. ఇవి కేవలం మీ ఫిట్నెస్ను మెరుగుపరచడానికి మాత్రమే, ఏదైనా అనారోగ్యం లేదా గాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే.ఫోన్ లో సులభంగా ఫిట్నెస్ ప్లాన్ కావాలనుకునే వారికి, క్రీడాకారులకు ఏఐ యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామాన్ని మరింత సరదాగా మార్చుకోవడానికి ఇవి చక్కటి సాధనాలు. అయినప్పటికీ, ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ కోచ్ పర్యవేక్షణలో వీటిని వాడుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఏఐ ఫిట్నెస్ యాప్స్ చాలా అద్భుతమైనవే.. కానీ అవి ఎప్పటికీ ఒక నిజమైన కోచ్కి ప్రత్యామ్నాయం కాలేవు. -
అందరిలా కాదు.. నీలా నువ్వుండు చాలు!
మనకు లేనిదానిపైనే మన చూపంతా.. యువతలో బాగా ప్రబలుతున్న ఈ మానసిక నిర్లిప్తత ఇప్పుడు బడికెళ్లే పిల్లల్లోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం పెద్దలకే కాదు.. చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ కన్నవాళ్లను కలవరపెడుతోంది. ‘అందరూ ఏదేదో చేస్తున్నారు.. ఎక్కడికంటే అక్కడికెళుతున్నారు వారిలా నేనెందుకు లేను.. వారిలా నేనెందుకు ఏ పనీ చేయలేకపోతున్నాను.. ’ఈ భావననే ‘ఫెమో’ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) అంటారు. ఎప్పుడూ ఎదుటివారిలా తానెందుకు ఉండలేకపోతున్నానని బాధపడడం, ఎప్పుడూ తనని తాను నిందించుకుంటూ ఉండడం, కోపం వచ్చినా.. దానిని ఎవరి మీద చూపించాలో తెలియక అవస్థలు పడడం... ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే ఏం చేయాలో వెంటనే ఈ సూచనలు పాటించడం మంచిది.ఎవరిలో ఫెమో ఉంది?1. తరచూ ఫోన్లో తన వయసువాళ్ల వీడియోలు, రీల్స్ చూడడం, తనెందుకు చేయలేకపోతున్నానని బాధపడడం2. తమకు లేని ప్రతిభ కోసం లేదా తమ దగ్గర లేని వస్తువుల కోసం పట్టుబట్టడం.3. ప్రతి విషయానికీ ఇతరులతో పోల్చుకోవడం. ఆత్మన్యూనతాభావానికి లోనవ్వడం.4. చిన్న పొరపాటు జరిగినా తమని తాము నిందించుకోవడం.5. ఏ పని చేయాలన్నా ఆసక్తి కనబరచక పోవడం, ఒంటరిగా ఫీలవ్వడం.ఏం చేయాలి?1. ఫెమో సమస్య కి విరుగుడు జెమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్). పిల్లల ప్రవర్తన చూసి తల్లిదండ్రులు వారిని మందలించడం కంటే ప్రతిరోజు వారితో కాస్త సమయం గడపాలి. వారి సమస్యల్ని వినాలి. 2. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజ జీవితం కాదని వారికి అర్థమయ్యేలా చె΄్పాలి.3. స్క్రీన్ టైమ్కు పరిమితులు విధించి, ఆటలు, పుస్తక పఠనం, సంగీతం, కుటుంబంతో కలిసి గడిపే సమయాన్ని ్రపోత్సహించాలి. 4. ఎవరినో చూసి వారిలా ఉండాలని కోరుకోవడం కన్నా నువ్వు నీలా ఉంటేనే మంచిదని తెలిసేలా చేయాలి.5. నచ్చిన పని చేసినప్పుడు వచ్చే అనుభూతే నిజమైన ఆనందమని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. -
సీతాకోకచిలుకలా... ప్రయోజనాలను ఇచ్చే బద్ధకోణాసనం!
డెస్క్ ఉద్యోగాల్లో ఒత్తిడిని తగ్గించి, శరీరానికి మంచి ప్రయోజనాలను అందించడంలో అధిక ప్రయోజనాలను ఇచ్చే యోగాసనాల్లో బద్ధకోణాసనం ఒకటి. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మోకాళ్లు కదలికలు ఉంటాయి కాబట్టి దీనిని ఈ పేరుతో పిలుస్తారు. కాళ్లు, తుంటి, వెన్ను భాగాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.ఉదయం లేదా సాయంత్రం రోజూ కొన్ని నిమిషాలు ఈ బటర్ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. కంప్యూటర్లలో పని చేసే వారు, వెన్ను నొప్పి, మెడ, తుంటి నొప్పితో ఇబ్బంది పడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.చేసే విధానం (20 నుంచి 30 సార్లు)నేలపై యోగా మ్యాట్పై కూర్చోవాలి.రెండు పాదాలను ఒకదానికొకటి తాకించి, చేతులతో పాదాలను పట్టుకోవాలి.వెన్నెముకను నిటారుగా ఉంచాలి.శ్వాసను గమనిస్తూ మోకాళ్లను సీతాకోకచిలుక రెక్కల్లా మెల్లగా పైకి–కిందికి మెల్లగా కదిలించాలి ∙సాధారణ శ్వాసతో 20 నుంచి 30 సార్లు చేయాలి.ప్రయోజనాలు...పెల్విక్ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.వెన్ను నొప్పి, నడుము బిగుతు తగ్గించడంలో సహాయపడుతుంది.ఎక్కువసేపు కూర్చునే వారికి ఉపశమనం కలిగిస్తుంది.మహిళల్లో పెల్విక్ ఆరోగ్యానికి, గర్భధారణ సమయంలో (నిపుణుల పర్యవేక్షణలో) ఉపయోగకరంగా ఉంటుంది.శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.లోయర్ బ్యాక్ కండరాలకు బలం చేకూరుతుంది.ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.వెన్ను, మెడ, తుంటి నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలు...మోకాలి లేదా హిప్కు తీవ్రమైన గాయం ఉంటే చేయకూడదు. ∙మోకాళ్లను బలవంతంగా నేలకు నొక్కకూడదు. ∙వెన్ను వంచకుండా నిటారుగా ఉంచాలి.నొప్పి అనిపిస్తే వెంటనే ఆపాలి.గర్భిణులు తప్పనిసరిగా శిక్షణ పొందిన యోగా గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.-అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
ఈ ఫ్యాబ్రిక్స్ చాలా ప్రశాంతం బాస్!
ఇంటి అలంకరణ అంటే రంగులు మార్చడం, ఖరీదైన వస్తువులను అమర్చడమే అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఇలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లేనని చెబుతున్నారు ఇంటీరియర్ రంగానికి చెందిన నిపుణులు. మనం నివసించే స్థలం కేవలం అందంగా కనిపించడమే కాదు.. మన మనస్సుకు ప్రశాంతతను, సేదతీరే సౌకర్యాన్ని అందించాలని చెబుతున్నారు. ఇంట్లో వాడే వివిధ రకాల దుస్తులు, వాటి టెక్స్చర్ సైతం మన దైనందిన జీవితాన్ని, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయంటున్నారు. అందుకోసం కొన్ని సలహాలు సూచిస్తున్నారు.ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అనేది కేవలం కంటికి కనిపించే ఒక డిజైన్ మాత్రమే కాదు, అది మన మానసిక భావాలతో ముడిపడి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెత్తటి వెల్వెట్ కుర్చీలో కూర్చున్నప్పుడు కలిగే హాయి, అలాగే కిటికీల మందపాటి తెరలను తాకినప్పుడు కలిగే అనుభూతి మన మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బాహ్య పరిసరాల స్పర్శ వల్ల మెదడులో సానుకూల భావాలు రేకెత్తుతాయని నిపుణులు వివరిస్తున్నారు. కొన్ని రకాల మెత్తని బట్టలు మనకు రక్షణను, భద్రతా భావాన్ని ఇస్తే.. మరికొన్ని దృఢమైన మెటీరియల్స్ మనస్సుకు స్థిరత్వాన్ని ఇస్తాయి.వెల్వెట్, ఫాక్స్ ఫర్: ఇవి గదికి విలాసవంతమైన లుక్ను ఇవ్వడమే కాకుండా, శీతాకాలంలో వెచ్చదనాన్ని, హాయిని అందిస్తాయి. వీటిని బెడ్ హెడ్బోర్డులు, యాక్సెంట్ కుర్చీలు, కుషన్ల కోసం ఎక్కువగా వాడుతుంటారు. లినెన్, కాటన్, ఉన్ని: ఇవి గదిలో ఎల్లప్పుడూ తాజాదనాన్ని నింపుతాయి. మానసిక ప్రశాంతతకు, ప్రశాంతమైన నిద్రకు ఇవి ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా బెడ్ షీట్లు, కర్టెన్లు, రోమన్ బ్లైండ్స్కు ఇవి అనువైనవి.లెదర్, జ్యూట్, హెవీ వీవ్స్: జ్యూట్, లెదర్ వంటి మెటీరియల్స్ ఇంట్లో ఒక క్రమబద్ధతను, పటిష్టతను ప్రతిబింబిస్తాయి. ఇవి స్థిరత్వానికి చిహ్నంగా నిలుస్తాయి. వీటిని తివాచీలు, ఫ్లోర్ కుషన్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఫెల్ట్, క్విల్టెడ్, వెయిటెడ్ ఫ్యాబ్రిక్స్: ఇవి ఇంటి లోపలి ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, బయటి శబ్దాలు లోపలికి రాకుండా అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి. ఆఫీస్ వర్క్ స్పేస్ లేదా ప్రశాంతతను కోరుకునే ప్రత్యేక గదులకు ఇవి ఉత్తమమైనవి. కాబట్టి, కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా.. మన మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి మేలు చేసే టెక్స్టైల్స్ను ఎంచుకోవాలి. అపుడు ఇంట్లోనే సరికొత్త రీఛార్జింగ్ అనుభూతిని పొందవచ్చు. -
చినుకుల్లో చింత లేకుండా!
వర్షాకాలం వచ్చేసింది. అడపాదడపా చినుకులు పడుతున్నాయి. వర్షాలు పడటం అందరికీ ఆనందాన్నిచ్చే విషయమే అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఇదే వర్షాకాలం అనేక రోగాలకు కేరాఫ్ అడ్రస్గా కూడా మారుతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ సీజన్ లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కలరా, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులు వేగంగా విజృంభిస్తాయి. అందుకే, ఈ కాలంలో మన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ, చిన్నచిన్న చిట్కాలు పాటించడం ఎంతో అవసరం.నీటితోనే ప్రమాదం ఎక్కువ..వర్షాకాలంలో కలుషిత నీటి వల్లనే ఎక్కువ శాతం వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా డయేరియా, టైఫాయిడ్ వంటివి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి నీటిని తాగకూడదు. ఇంట్లో కూడా కాచి చల్లార్చిన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే వాటర్ ఫిల్టర్లను క్రమంతప్పకుండా క్లీన్ చేసుకోవాలి.దోమల నివారణ..వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ్రపాణాంతక జ్వరాలు వస్తాయి. అందువల్ల ఇంటి పరిసరాలలో, పూల కుండీలలో, పాత టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పడుకునేటప్పుడు దోమతెరలు వాడాలి. బయటకు వెళ్లేటప్పుడు శరీరం పూర్తిగా కప్పబడేలా దుస్తులను ధరించడం మంచిది.పర్సనల్ హైజీన్వర్షాకాలంలో ఇది చాలా ముఖ్యం. బయట నుంచి రాగానే చేతులు, కాళ్ళను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వర్షంలో తడిస్తే వెంటనే స్నానం చేసి, శరీరాన్ని ΄÷డిగా తుడుచుకోవాలి. ఎక్కువసేపు తడి బట్టలతో ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లల గోళ్లను క్రమంతప్పకుండా కత్తిరించాలి, ఎందుకంటే గోళ్ల ద్వారా బ్యాక్టీరియా ΄÷ట్టలోకి వెళ్లే అవకాశం ఉంది.మన వెంటే!వర్షాకాలంలో వర్షం ఎప్పుడు కురుస్తుందో, ఎప్పుడు ఆగుతుందో ఊహించడం చాలా కష్టం. అందువల్ల ఎల్లప్పుడూ గొడుగు, రెయిన్కోట్ వంటి వాటిని వెంట ఉంచుకోవాలి. మన వద్ద ఉండే మొబైల్, ల్యాప్ టాప్ వంటివి తడవకుండా ఒక మంచి ΄్లాస్టిక్ కవర్ను దగ్గర ఉంచుకోవడం మంచిది. అలాగే వర్షాకాలంలో జీన్స్ వంటివి ధరించడం కూడా అంత మంచిది కాదు. వర్షాకాలాన్ని ఆస్వాదించాలంటే ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. చిన్న అజాగ్రత్త కూడా పెద్ద ఆరోగ్య సమస్యకు కారణమవుతుంది. అందువల్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.నో జంక్ఫుడ్, నో స్ట్రీట్ ఫుడ్ఈ సీజన్ లో వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వృద్ధి చెందుతాయి. రోడ్ల పక్కన తెరిచి ఉంచే చాట్, పానీపూరి, కట్ చేసిన పండ్లను అస్సలు తినకూడదు. అలాగే జంక్ఫుడ్కి కూడా దూరంగా ఉండాలి. ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలను కూడా ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచాలి. ఎప్పటికప్పుడు వేడివేడిగా ఉండే తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. రాత్రి మిగిలిపోయిన పదార్థాలను, ఫ్రిజ్లో నిల్వ ఉంచినవి తినకపోవడమే బెటర్.ఇమ్యూనిటీతో సేఫ్!ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటి రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలను రోజూవారీ ఆహారంలో చేర్చుకోవాలి. రోజుకు ఒకసారైనా వేడి వేడి సూప్ లేదా హెర్బల్ టీ తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. విటమిన్–సి పుష్కలంగా ఉండే నిమ్మ, నారింజ వంటి పండ్లను ఆహారంలో తప్పనిసరి చేసుకోవాలి. -
ఫిగ్మాలో కొత్త ఫీచర్లు..
కొలాబరేటివ్ వెబ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ ‘ఫిగ్మా’ ఎన్నో కొత్త ఫీచర్లను ప్రకటించింది. కోడింగ్, యానిమేషన్, ఏఐ–ఎఫెక్ట్స్, వర్క్ఫ్లో ఆటోమేషన్ను నేరుగా డిజైన్ ప్లాట్ఫామ్లలోకి తీసుకువచ్చే టూల్స్ను పరిచయం చేసింది. ఫిగ్మా ప్రకటించిన ఆసక్తికరమైన ఫీచర్లలో ‘కోడ్ లేయర్స్’ ఒకటి.కోలాబరేటివ్ కాన్వాస్లో డిజైన్ ఎలిమెంట్స్ను ఇంటరాక్టివ్ కోడ్–బేస్డ్ కంపోనెంట్స్గా కన్వర్ట్ చేయడానికి యూజర్లకు ఉపకరించే ఫీచర్ ఇది. డిజైనర్లు, డెవలపర్లు,ప్రాడక్ట్ టీమ్లకు ఉపయోగపడేలా ఈ ఫీచర్ని డిజైన్ చేశారు. ‘ఫిగ్మా మోషన్’ పేరుతో కొత్త యానిమేషన్ సిస్టమ్ను కూడా పరిచయం చేశారు.షేడర్ ఫీల్స్, ఎఫెక్ట్స్లతో తన ఏఐ టూల్ కిట్ను కూడా విస్తరిస్తోంది ఫిగ్మా. టెక్ట్స్ప్రాంప్ట్స్, రిఫరెన్స్ ఇమేజ్లతో యూజర్లు విజువల్ ఎఫెక్ట్స్ను సృష్టించవచ్చు. నేచురల్ లాంగ్వేజ్ప్రాంప్ట్స్ ఉపయోగించడం ద్వారా కస్టమ్స్ టూల్స్ను క్రియేట్ చేసే ‘జెనరేటివ్ ప్లగిన్స్’ ఫీచర్ను కూడా ప్రకటించింది ఫిగ్మా. -
సహజ యోగంతోనే సహజ సౌందర్యం..
సంప్రదాయ కళలు, సంప్రదాయ ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు – ఇవి మన దేశంలో వేల కొద్దీ సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. మనం వాటిని ఉపయోగించాలి. కానీ మనం పాశ్చాత్య దేశాలచే ఎంతగా ప్రభావితులమయ్యామంటే, మన సంస్కృతిని మర్చిపోయి, బయటి విషయాలను అనుసరిస్తున్నాము. దీని కారణంగా మనలో మనం ఆత్మ’ అని పిలిచే అతి ముఖ్యమైన విషయం అజ్ఞానంతో కప్పబడుతుంది. మన దేశంలో ఆత్మను అలంకరించే వేలకొద్దీ విషయాలు ఉన్నాయి, అవి ఆత్మను అణచివేయవు.మన కళ్ళు చాలా త్వరగా బాహ్యమైన విషయాలపై పడతాయి. కారణం మనం మనుషులం కాబట్టి, మన ధ్యాస బయట ఉంటుంది. కానీ మనల్ని మనం చూడటానికి ప్రయత్నించినప్పుడు, మనం నవ్వుతూ మన లోపల ఎంత అందంగా ఉందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అని ఆలోచిస్తాము! దానిని వదిలి మన ధ్యాస బయట ఎందుకు తిరుగుతుంది? ఎందుకంటే ఇప్పటివరకు మనం ఆ స్థితిని సాధించలేదు, మనకు అది ఇంకా తెలియదు, అందుకే మనం అలా చేస్తున్నాము. అందుకే మనల్ని మనం ప్రేమించుకోలేక పోతున్నాము, మన ఆత్మను పాడుచేసే వాటిని మనం ఇష్టపడతాము, ఆ విషయం మనం గ్రహించలేము. మన జీవితంలో అలాంటివి చాలా ఉన్నాయి.సహజ యోగ ధ్యాన సాధన ద్వారా మానవుల లోపల కుండలినీ శక్తి జాగృతి చెందినప్పుడు, వారు భగవంతుని ఆశీస్సుల వలన ఆత్మ స్వరూపులుగా మారుతారు. ఆత్మికమైన శుభ లక్షణాలను పొందుతారు. ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఆత్మకు ఉండే సహజ శుభ లక్షణాలైన అమాయకత్వం, పవిత్రత, మాతృ ప్రేమ, సంతృప్తి, సృజనాత్మకత, ధైర్యం, అందరితో కలిసిపోయే స్వభావం, క్షమా గుణం వంటివి మన నిత్య జీవితంలో ఆచరించడం వలన మనం ఆత్మ సౌందర్యాన్ని పొందగలం.మీ లోపల ఉన్న ’ఆత్మ’ అనే వజ్రాన్ని బయటకు తీయండి. మీరే ఆ వజ్రం అని తెలుసుకోండి. ఆ వజ్రం మెరుపు మీరే. మీ లోపల ఉన్న ఆ వజ్రం పైకి వచ్చినప్పుడు, ప్రజలు కూడా చూసి ఆశ్చర్యపోతారు, ఆ ఆత్మ సౌందర్యాన్ని పొందడానికి ప్రయత్నించండి. స్త్రీలకు శాశ్వతమైన విలువను కలిగి ఉండే ఏదో ఒకటి ఉంది, దానిని వారు అభివృద్ధి చేసుకోవాలి. గొప్ప విషయం ఏమిటంటే స్త్రీ అందరినీ ప్రేమించగలదు, కానీ ఆమె స్వార్థపూరితంగా మారినప్పుడు, ఆమె ప్రేమలో అందం ఉండదు.పురుషులలో ఆజ్ఞాపించే స్ఫూర్తి వారి మాటల ద్వారా, వారి చైతన్యం ద్వారా, వారి వ్యక్తిగత విజయాల ద్వారా వస్తుంది; అయితే స్త్రీలకు ఈ లక్షణాలు వారి ప్రేమపూర్వక శక్తి ద్వారా, వారి సహనం ద్వారా, వారి దయగల ప్రవర్తన, క్షమ, కరుణ ద్వారా వస్తాయని గ్రహించి, వాటిని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించాలి.విత్తనాలు స్వయంగా దేనినీ సృష్టించలేవు. పువ్వులు, పండ్లు, ఇతర వరాలను అందించేది భూమాత. అదేవిధంగా, బిడ్డను సృష్టించేది స్త్రీ, శిశువును పోషించేది, చివరికి రేపటి ΄ûరుడిని పెంచుతుంది. కాబట్టి మహిళలు మొత్తం మానవాళి నివసించే భవనంగా భూమి తల్లిని పరిగణించాలి. – డా.ప్రతాని రాకేశ్, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా) -
స్నేహమాధుర్యం..
స్నేహం గూర్చి ఎంతో గొప్పగా చెప్తారు.. సృష్టిలో తియ్యనిదని కొందరంటే, కొందరు మధురమైనదని అన్నారు. స్నేహబంధం విడదీయరాని బంధం అన్నారు...పురాణాల్లో రామ సుగ్రీవుల మైత్రి, కృష్ణుడు కుచేలుల మైత్రి, కృష్ణార్జునల మైత్రి చెప్పుకోదగ్గవి... స్వభావరీత్యా దుష్టులైన దుర్యోధనుడు, కర్ణుల మైత్రి అయినా మంచి ఉదాహరణ కాదు. ఇలాంటి వారి విషయంలో శతకనీతి మనకు ఎంతో మంచి మార్గం చూపిస్తుంది...సజ్జన సాంగత్యం గొప్పదంటాడు భర్తృహరి... ఏనుగు లక్ష్మణ కవి తాను చేసిన అనువాదంలో... ‘సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్పుగౌరవమొసంగు, జనులకు గలుష మడచుగీర్తి బ్రకటించు, చిత్తస్ఫూర్తిజేయుసాధుసంగంబు సకలార్థ సాధనంబు’సజ్జన సహవాసం వలన ఉపయోగాలు చెప్తున్నాడు కవి. సమస్త ప్రయోజనాలు సాధించబడతాయి. అంటే కాదు సకలార్ధ సాధకం అని సెలవిచ్చాడు. ఇదే బాణీని అందరూ కొనసాగించారని అనిపిస్తుంది.. వేమన ‘నీచగుణములెల్ల నిర్మూలమై పోవు, కొదువ లేదు సుజన గోష్టి వలన’ అని సుజన గోష్టి వలన నీచ గుణాలు తొలగిపోతాయంటాడు.‘కాని వానితోడగలసి మెలంగినహాని వచ్చు నెంతవానికైనకాకి గూడి హంస గష్టంబు పొందదా’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు, వేమన. దుష్టుని స్నేహం గూర్చి వివరిస్తాడు, సుమతీ శతకంలో.‘ఉపమింప మొదట తియ్యనకపటం బెడనెడను జెఱకుకైవడినే పోనెపములు వెదకును గడపటగపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ‘ చెడు స్నేహానికి మంచి ఉదాహరణ చె΄్పారు ఇక్కడ.. చెడ్డవారితో స్నేహం మొదట్లో చెఱకు గడ తీపిలా ఉంటుంది. మధ్యలో రుచి తగ్గుతుంది, చివరికి పూర్తిగా చప్పగా ఉండి, ఏమి లేదనిపిస్తుంది. అటువంటి వాడికి తప్పులే కనిపిస్తాయి.‘ఎప్పుడు తప్పులు వెదకెడునప్పురుషుని గొల్వగూడడది’ అని అంటాడు సుమతీ శతకంలో.‘కాదు సుమీ దుస్సంగతి’ అని హెచ్చరిక చేస్తాడు ఇదే శతకంలో.మరో పద్యంలో ‘కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు’ అని అన్నారు..‘కొంచెపునరు సంగతిచేనంచితముగ గీడు వచ్చునది’ అంటూ ఒక ఉపమానం చెప్తాడు.. నల్లి కుడితే మంచానికి దెబ్బలు తగులుతాయి..‘పాలను గలసిన జలమునుపాలవిధంబునె యుండు బరికింపంగాబాల చవి జెఱచు గావునబాలసుడగువాని పొందు వలదుర సుమతీ‘ పాలు కలిసిన నీళ్లు పాల లాగే ఉంటాయి, అలాగే దుర్జనుడు సజ్జనుడు ఉంటే సజ్జనుడు లాగా ఉంటాడు... అందుకు సజ్జనుడే జాగ్రత్త వహించాలి..‘లేమి కలిమి రెండు సమముగ జూచేడి పురుషుడే మిత్రుడెన్ని పొగడారయా’ అని వేమన అంటే ‘మంచి గుణము లేని వానితో మైత్రి చేసి తుది సుఖము బడయుదురా భాస్కరా’ అంటారు భాస్కర శతకంలో.చివరగా భర్తృహరి భాషలో ‘త్యజేత్ ధనం రక్షణార్థం, ధనం త్యజేత్ ఆపది ఆత్మర్థం పృథివీం త్యజేత్, మిత్రార్థే త్యజేత్ ఆత్మనఃకాపాడుకోవడానికి సంపద, ధనం, రాజ్యం అని వదులుకోవచ్చు,కాని మిత్రుడి కోసం నువ్వు నిన్నే వదులుకోవాలి.. అంత గొప్పది స్నేహం. – డా. కందాళ సత్య నారాయణ మూర్తి -
పాదయాత్రే జైత్రయాత్రగా...
జైత్రయాత్ర అనగా గెలుపు కోసం చేసే యాత్ర. యేసు తన జీవితకాల చివరి మూడున్నర సంవత్సరాల పాదయాత్రను జైత్రయాత్రగా చూడవచ్చు. నిజానికి యేసు పాదయాత్రే జైత్రయాత్ర. రెండూ ఒక్కటే. పాదయాత్ర సాధారణ రీతిలో జరుగకపోగా అసాధారణ రీతి లో జైత్రయాత్రగా మార్చబడి గొప్ప సంచలనాలకు కేంద్రం అయ్యింది. ఇక్కడ మాత్రం పాదయాత్రకు జైత్రయాత్ర పర్యాయపదం కాక అంతకు మించినది కావడం విశేషం. ఆనాటి యేసు జైత్రయాత్ర ఇచ్చే ప్రేరణ ఇంతా అంతా కాదు.జైత్ర అంటే జయించేది అని అర్థం. అది విజయానికి సంబంధించినది అని చెప్పవచ్చు. విజయ శీలుడు, విజయశీలమైనది అనే అర్థాలు కూడా ఉన్నాయి. యాత్ర అంటే క్షేత్రస్థాయి పర్యటన. శత్రువులపై దండెత్తి విజయం సాధించడానికి వెళ్ళే యాత్రే జైత్రయాత్ర. ఆత్మ సంబంధంగా చూస్తే, దైవవాక్కుల ఖడ్గంతో దూసుకెళుతూ శత్రువైన సాతానుపై యేసు దండెత్తిన విధానం కనువిందే కాక చరిత్రలో అదొక గొప్ప వాగ్యుద్ధం. యావత్ ప్రపంచానికి దీన్ని మించిన స్ఫూర్తి మరొకటి లేదు. ఒకరు ఏదైనా ఒక రంగంలో వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగే ప్రయాణాన్ని కూడా జైత్రయాత్ర అంటారు.కుష్ఠురోగియైన సీమోను ఇల్లు, ఆ ఇంటి పరిసరాలు గొప్ప సువాసనతో నిండేలా ఒక స్త్రీ అత్యంత విలువగల బహు ఖరీదైన అచ్చ జటామాంసి అత్తరు తీసికొనివచ్చి యేసు తలమీద అదిపోసి తనదైన ప్రేమను ఉన్నతంగా వ్యక్తం చేసింది. మరియొక స్త్రీ అత్తరు బుడ్డితో యేడ్చుచు వచ్చి కన్నీటితో యేసు పాదాలను తడిపి కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదాలకు పూసింది. గొప్ప జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ యేసు అసాధారణ బోధలకు బహుగా ఆశ్చర్యపోతూ, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పింది. ‘మేము ఎవరి దగ్గరకు వెళతాం? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు’ అంటూ పేతురు యేసును గట్టిగా పట్టుకున్నాడు. ఇదంతా పరిశీలనగా చూస్తే యేసుకు జైజైలు పలుకుటే.ప్రవచనం ప్రకారంగా కట్టబడియున్న ఒక గాడిద పిల్లను శిష్యులు విడిపించి తెచ్చిన వెంటనే యేసు గాడిదపిల్ల మీద కూర్చోగానే హోసన్నా నినాదాలు హోరెత్తాయి. ఖర్జూర మట్టలతో ఆయనకు స్వాగతం పలికారు. దారి ΄÷డుగున తమ బట్టలు, ఒలీవకొమ్మలతో పాటు వివిధ చెట్లకొమ్మలు తెచ్చిపరుస్తూ తమ సంతోషానందాలు వ్యక్తం చేసారు. దావీదు కుమారునికి జయం. ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక! సర్వోన్నత స్థలములలో జయము అంటూ బహు జనసముహం మహా శబ్దంతో కేకలు వేశారు. మిన్నంటిన జయజయధ్వనులతో బేత్పగే, బేతనియ గ్రామాలు మార్మోగాయి.యెరూషలేము పట్టణపు యూదులే కాకుండా, పస్కా పండుగ చేయుటకు వివిధ దేశాల నుండి ముందుగానే వచ్చిన యూదులు కూడా మెస్సీయాను ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన్ను జేజేలతో కీర్తించారు. ఎలుగెత్తి చేస్తోన్న ఈ గొప్ప శబ్దాన్ని చూసి ఓర్వలేని వినలేని వినుటకు మనస్సులేని పరిసయ్యులు అభ్యంతరాలు చె΄్పారు. బోధకుడా, నీ శిష్యులను గద్దించు అంటూ యేసుకే ఫిర్యాదు చేశారు. వీరు ఊరకుండి మౌనంగా నిశ్శబ్దంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని యేసు పరిసయ్యులను హెచ్చరించాడు.ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అను కొండగ్రామాల మీదుగా యేసు విజయయాత్ర ్రపారంభమై కిద్రోను లోయను దాటి దేవుని ఆలయం ఉన్న పవిత్ర నగరం యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించేవరకు సాగింది. ఈయన ఎవరో అనుకుంటూ యెరూషలేము పట్టణమంతా ఒకసారిగా కలవరానికి గురైంది. యేసు జైత్రయాత్రలకు ముచ్చటపడిపోతూ ఇలా ఆరోజున ఆయనకు ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జైకొట్టినవారే. నాట్యమాడే అంతరంగాలతో క్రీస్తుకు జేజేలు పలికినవారు నాడు ఎందరెందరో. – జేతమ్ -
కోరికల తరంగాలు..
నదిలో ఇసుకలాంటివి కోరికలు. ఎంత తవ్వినా నదిలో ఇసుక తరిగిపోదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొత్తగా ఇసుక మేటలు వేస్తూనే ఉంటుంది. అలాగే మనసులో కోరికలు తీరేవి తీరుతూంటే కొత్తవి పొటమరిస్తూంటాయి. అందుకనే మనసు కోరికల పుట్ట అని అన్నారు.ఈ కోరికలన్నీ తీరిన తర్వాత పరమార్థం విషయంలో ఆలోచిస్తాననే వాళ్ళున్నారు. అది జరిగే పనేనా? ‘తరంగ ప్రశమా దూర్ధ్వం స్నాస్యామీతి విమూఢతా’ సముద్రంలో తరంగాలన్నీ తగ్గి పోయిన తర్వాత స్నానం చేస్తాను అని అనటం మూఢత్వం కాక మరేమిటి?ఒక గురువుగారు తన శిష్యుణ్ణి సంసార తాపత్రయం నుంచి బయటపడేద్దామనే సత్సంకల్పంతో ఉపదేశం చేద్దామని పిలిచాడు. సంసారి అయిన ఆయన శిష్యుడు, గురువుకు దయకలిగి తనను ఉద్ధరించాలనుకొని ఉపదేశం చేస్తానన్నాడని సంతోషించటానికి బదులుగా ఈ బరువు ఇప్పటి నుంచీ ఎందుకు అను కున్నాడు. ‘అయ్యా! వచ్చే సంవత్సరం మా అమ్మాయి పెళ్ళి చేస్తాను. ఇప్పటినుంచి ఆ పెళ్ళి పనుల్లో సతమతమవు తున్నాను. మీరు ఉపదేశం చేసే మంత్రం అనుష్ఠానం చేసేందుకు సమయం దొరకదు కనుక పెళ్ళయిన తర్వాత ఉపదేశం తీసుకుంటాను. దయ జూపండి’ అన్నాడు. ‘సరే!’ అన్నారు గురువుగారు. ఇలాగే అప్పుడు ఇప్పడు అంటూ ఎన్నో సాకులు చెబుతూ చాలా సంవత్సరాలు గడిపాడు. ఎనభై సంవత్సరాల వయస్సు మీద పడింది.ఒకసారి గురువు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆయనతోపాటు ఈ 80 ఏళ్ళ శిష్యుడు కూడా బయలు దేరాడు. ఆ రోజు కార్తీక పూర్ణిమ. ఇద్దరూ సముద్రానికి వెళ్ళారు. ముందు ఈ సంసారి శిష్యుడు సముద్ర స్నానం చేశాడు. గురువుగారు మాత్రం గట్టునే ఉన్నారు. ‘అయ్యా! ఎందుకు ఆలస్యం. మీరు కూడా స్నానం చేయండి వెళదాం’ అన్నాడు. ‘అలాగేనోయ్! ఈ తరంగాలు తగ్గిపోయిన తర్వాత చేయవచ్చులే అని ఆగాను’ అన్నారు గురువు.‘అయ్యా! మీరన్నది ఎప్పటికైనా జరిగేపనేనా? సముద్రంతో పాటే తరంగాలు పుట్టాయి గదా! అవెప్పుడు తగ్గుతాయి?’ అన్నాడు. ‘ఏమోయీ! నీ సంసార తాపత్రయాలు కూడా తరంగాల్లాగానే ఒకదాని వెనుక మరొకటి వస్తూన్నాయి. మరి నీవు నా ఉపదేశం ఎప్పుడు తీసుకుంటావు నాయనా?’ అని సూటిగా అడిగేసరికి తన తప్పు తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడు ఆ సంసారి శిష్యుడు. - శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
అందమైన జుట్టు కోసం.. తలకట్టు.. దీర్ఘమూ..!
చిన్నప్పుడు అక్షరాలు దిద్దే టైమ్లో తలకట్టూ, దీర్ఘం చదువుకుంటాం. స్టైల్గా అక్షరంపైన స్టైల్గా, ఠీవిగా ఉండే దాన్ని తలకట్టు అంటాం కదా. అలా తలపైనా అందంగా, స్టైల్గా ఉండేజుట్టునీ తలకట్టు అంటాం. అమ్మాయిల అందం ఇనుమడించాలంటే ఆ తలకట్టు పొడవుగా, సు‘దీర్ఘం’గా ఉండాలి. చదువుకుంటూ అక్షరాలు దిద్దినప్పుడు ఉండే ఆ తలకట్టూ, దీర్ఘాలే యుక్తవయసు దాటాక కూడా కొనసాగాలనేది టీనేజ్ నుంచీ యువతీయువకులందరి కోరిక.ఇక అమ్మాయిలూ మహిళలూ కోరుకునేది మంచి పొడవాటి జడ. ఒకవేళ ఈ రోజుల్లో జడ ఎవరూ వేసుకోవడం లేదనుకున్నా... జలపాతంలా జారిపోయే మృదువైన పొడవైన జుట్టు. మంచి అందమైన, పొడవైన జుట్టుకోసం అమ్మాయిలూ, హీరో లాంటి లూక్ కోసం అబ్బాయిలూ... ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతుంటారో లేక్కేలేదు. మాటల్లో ‘ఆఫ్టరాల్ వెంట్రుక...’ అంటూ వ్యవహరించే ఈ జుట్టు కోసం కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుందంటే అతిశయోక్తే కాదు. ఆ జుట్టు ఎందుకు, ఎలా పెరుగుతుంటుంది, ఎందుకు రాలుతుంది అలా రాలకూడదంటే ఏం చేయాలి లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల సమాహారమే ఈ కథనం.జుట్టు, రోమాలు, తలకట్టు, వెంట్రుకలు, అందమైన భాషలో కురులు అంటూ పిలిచే ఆ నల్లటి, సన్నటి, పొడవైన తీగలాంటి జుట్టు నిర్మాణం నిజానికి చాలా సంక్లిష్టం. చూడ్డానికి సింపుల్గా కనిపించే ఆ జుట్టు కథ ఏమిటో, ఎలా పుడుతుందో, దానికి వచ్చే రకరకాల సమస్యలేమిటన్న అనేక అంశాలను విపులంగా తెలుసుకుందాం.జుట్టు ఎలా పెరుగుతుందంటే... ప్రతిరోజూ వెంట్రుక 0.3 మి.మీ. నుంచి 0.4 మి.మీ. వరకు పెరుగుతుంది. అంటే ఏడాదికి దాదాపు ఆరు అంగుళాలు పెరుగుతుంది. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి.కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలోనే ఉంటుంది. నిజానికి వెంట్రుక పెరుగుదలలో ఇదో సంధి దశ. ఈ దశలో వెంట్రుక 2 – 3 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండటం వల్ల దానిలో పెరుగుదల ఏమాత్రం ఉండదు.టిలోజెన్ : మన మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. ఈ దశ మాడుపై ఉన్న వెంట్రుకలలో సాధారణంగా 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక కనుబొమలు, కనురెప్పలు, బాహుమూలాల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ మరింత దీర్ఘకాలం ఉంటుంది. ఈ దశలోనే వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ దశలో ఉన్నప్పుడు పీకితే వెంట్రుక కింద దాని గసగసాల్లా ఉండే గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది.అనాజెన్ : వెంట్రుక పెరుగుదల తాలూకు దశలన్నింటిలోనూ అనాజెన్ చురుకైన దశ. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. ఈ పెరుగుదల ఇలా రెండు నుంచి ఆరేళ్లు కొనసాగుతుంది. కొందరిలో ఆ వ్యవధి తర్వాత వెంట్రుక అదే వేగంతో పెరగదు. కొంత పొడవు పెరిగి ఆగిపోతుంది. అయితే తల మీద ఉన్న వెంట్రుకలు రెండు నుంచి ఆరేళ్లు పెరుగుతాయి. బాహుమూలాల్లో, కాళ్లపైనా, కనుబొమలు, కనురెప్పపై ఉండే వెంట్రుకల్లో ఈ వ్యవధి 30–45 రోజులు మాత్రమే ఉంటి, ఆ తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. ఈ కారణం వల్లనే ఈ ప్రాంతాల్లోని వెంట్రుకలు మాడుపై ఉండే వెంట్రుకలంతగా పెరగవు.వెంట్రుకల తీరుతెన్నులు : కొందరిలో వెంట్రుకలు స్ట్రెయిట్గా పెరుగుతాయి. ఇలా పెరిగే వారి జుట్టు సాఫీ (స్ట్రెయిట్)గా ఉంటుంది. అదే కొందరిలో జుట్టు పెరుగుతున్న కొద్దీ వెంట్రుక ఒంపు తిరుగుతుంటుంది. ఇలా జరిగేవారికి రింగులు రింగులుగా ఉండే ఉంగరాల జుట్టు వస్తుంది. వెంట్రుకను అడ్డుగా కోసినప్పుడు ఆ అడ్డుకోత గుండ్రంగా ఉంటే అది సాఫీగా (స్ట్రెయిట్)గా పెరుగుతుంది. అదే ఒకవేళ ఆ అడ్డుకోత దీర్ఘవృత్తంలా ఉంటే అది రింగులుగా పెరుగుతుంది. సాఫీగా (స్ట్రెయిట్గా) ఉండే జుట్టుకు... అడుగున ఉండే సబేషియస్ గ్రంథి నుంచి పోషకాలు సాఫీగా అందుతాయి. దాంతో ఇవి మరింత జీవంతో ఉంటాయి. ఇలా కనిపించడం కోసమే చాలామంది జుట్టును తిన్నగా ఉండేలా (హెయిర్ స్రెయిటెనింగ్) చేయించుకుంటుంటారు. అదే ఉంగరాల్లా తిరిగే జుట్టు వారిలో పోషకాలు చివరివరకూ చేరడానికి కాస్త అడ్డంకులు ఉండటంతో పొడవు జుట్టు ఉన్నవారి కంటే ఉంగరాల జుట్టు కాస్తంత మెరుపు తక్కువగా ఉంటుంది.జుట్టు రాలడానికి కారణాలు శారీరక ఒత్తిడి : రోజూ తీవ్రమైన శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటి అంశాలు జుట్టులో భౌతికంగా మార్పులు తెచ్చి వాటిని రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్ వైపునకు ప్రయాణం కొనసాగి, టిలోజెన్ దశ దీర్ఘకాలం కొనసాగుతుంది. దాంతో తలపై జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చిగా కాకుండా ఎండిపోయినట్లుగా ఉండటాన్ని గమనించవచ్చు.పరిష్కారం ఇలా : ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.గర్భధారణ తర్వాత : చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలిపోయి మాడుపై జుట్టు బాగా పలచబారిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. ఈ దశలో మహిళల శారీరక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. ఆ సమయంలో జుట్టుకు అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లు కడుపులోని బిడ్డకు అందడంతో ఇలా పోషకాలు జట్టుకు అందకుండాపోతాయి. పరిష్కారం ఇలా : తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్లు జుట్టుకు అందే విధంగా చూడటం వల్ల దీన్ని అరికట్టవచ్చు.ప్రోటీన్ లోపాలతో : ప్రోటీన్లోపం కారణంగా జుట్టు రాలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఇలాంటివారు తమ ఆహారంలో తగినంతగా ప్రోటీన్ తీసుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రోటీన్లే అమైనో ఆసిడ్స్గా మారి జుట్టు పెరుగుదలకూ, రిపేర్లకూ ఉపయోగపడతాయి.పరిష్కారం ఇలా : ఈ కారణంతో జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారమైన చేపలు, గుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శాకాహారులైతే ప్రోటీన్ మోతాదులు ఎక్కువగా ఉండే... గ్రీన్పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి.విటమిన్–ఏ మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల : ఆహారంలో విటమిన్–ఏ మోతాదులు మరీ ఎక్కువైతే కూడా జుట్టు రాలుతుంది. విటమిన్–ఏ మనకు ప్రతిరోజూ 5000 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) అవసరం. ప్రతిరోజూ విటమిన్–ఏ ను 10,000 ఐయూ కంటే ఎక్కువగా తీసుకునేవారు దాన్ని అదేపనిగా చాలాకాలం పాటు తీసుకుంటూ ఉంటే జుట్టు రాలే అవకాశాలు ఎక్కువ.పరిష్కారం ఇలా : విటమిన్–ఏ టాబ్లెట్లు తీసుకునేవారు కేవలం డాక్టర్ల సలహా మేరకు మాత్రమే, వారు నిర్ణయించిన మోతాదులోనే తీసుకోవాలి. హార్మోన్ లోపాల (హార్మోనల్ ఇంబ్యాలెన్స్) వల్ల : సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిళల్లో ఎక్కువ. స్త్రీలలో కూడా పురుష హార్మోన్ అయిన టెస్టో స్టెరాన్ కొద్ది మోతాదులో స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా స్రవిస్తుంది. ఇది జుట్టు రాలిపోడానికి ఒక కారణమవుతుంది. హైపోథైరాయిడిజమ్ కండిషన్ కూడా జుట్టు రాలడానికి మరో కారణం.పరిష్కారం ఇలా : పీసీఓఎస్తో బాధపడే మహిళలు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా... అలాగే హైపోథైరాయిడిజమ్తో బాధపడేవారు థైరాక్సిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం జుట్టు రాలడం తగ్గవచ్చు.కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ల వల్ల : తమ సొంత వ్యాధి నిరోధకశక్తే తమకు దేహంపై ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్గా చెబుతారు. ఉదాహరణకు...పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల... మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్లుగా కనిపిస్తుంటాయి.లైకెన్ ΄్లానస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది. ∙లూపస్ అనే మరో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం ఇలా : ఆటోఇమ్యూన్ కారణాల వల్ల జుట్టు రాలిపోవడాన్ని నివారించడానికి డ్యాప్సోన్ అనే మందులు కొంతవరకు పనిచేస్తాయి.ఏయే మందులతో జుట్టు రాలవచ్చు...మొటిమలకు వాడే మందులు (ఆక్నే మెడిసిన్స్),కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు,యాంటీ డిప్రెసెంట్స్నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు,రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్ (బ్లడ్ థిన్నర్స్),యాంటీకొలెస్ట్రాల్ మందులు ∙ఇమ్యునోసప్రెసెంట్స్,కీమోథెరపీ మందులు.మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు,హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్,ఇంటర్ఫెరాన్స్,వేగంగా మారిపోయే మూడ్స్ను నియంత్రించడానికి వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు,నొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ మందులు,స్టెరాయిడ్స్, ∙థైరాయిడ్ మందులు.పరిష్కారం ఇలా...మందులు వాడటం మానేయగానే సాధారణంగా జుట్టు మళ్లీ రావచ్చు.జుట్టు రాలడం మరీ ఎక్కువగా ఉంటే కొన్ని మందులు వాడటం ద్వారా.జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ద్వారాకీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్లోకి అంతగా ప్రవేశించదు. ఇలా చల్లబరిచే ప్రక్రియ హెయిర్ ఫాలికిల్ను కాస్త నెమ్మదించేలా చేసి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.స్కారింగ్ అలొపేషియా : ఈ సమస్య కారణంగా దాదాపు మూడు శాతం మందిలో జుట్టు రాలిపోతుంటుంది. ఇలా రాలిపోయే జుట్టు మళ్లీ రాదు. ఎందుకంటే ఇందులో ఫాలికిల్ శాశ్వతంగా దెబ్బతింటుంది. ఆ స్థానంలో స్కార్ కణజాలం భర్తీ అవుతుంది. అందుకే ఈ కారణంగా జుట్టు రాలిపోతే అది మళ్లీ మొలవదు. ఇలా జుట్టు రానప్పుడు అది ప్యాచ్లు ప్యాచ్లుగా ఉండి, ఆ ప్యాచులు క్రమంగా పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిన చోట కనిపించే ప్యాచ్లలో దురద, మంట, నొప్పి కూడా ఉండవచ్చు. డిసెక్టింగ్ సెల్యులైటిస్, ఇసినోఫిలిక్ పస్ట్యూల్ ఫాలిక్యులైటిస్, ఫాలిక్యులార్ డీజనరేషన్ సిండ్రోమ్, లైకెన్ ΄్లానో పైలారిస్, సూడోపెలేడ్ ఆఫ్ బ్రాక్ అనే కండిషన్లు... స్కారింగ్ అలొపేషియాకు కారణమవుతాయి.జుట్టును రాల్చే ఇన్ఫెక్షన్లు...రింగ్వార్మ్ : ఇది ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ కండిషన్ను టీనియా కాపిటిస్ అంటారు. ఇది ఫంగస్ కారణంగా మాడుపై వస్తుంది. మొదట చిన్న మొటిమలా వచ్చి క్రమంగా పరిమాణం పెరుగుతూ పోతుంది. విస్తరించిన చోట పొలుసుల్లా వచ్చి... ఆ ప్రదేశంలో తాత్కాలికంగా జుట్టు మొలవదు.చికిత్స: టెర్బినఫిన్, ఫ్లుకోనజోల్, గ్రీషియోఫల్విన్, ఇట్రాకొనజోల్ వంటి యాంటీఫంగల్ మందులతో చికిత్స చేయవచ్చు.ఫాలిక్యులైటిస్ : ఇది జుట్టు ఫాలికిల్ (అంకురాల్లో) ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి) వచ్చే కండిషన్. ఇది వచ్చినవారిలో వెంట్రుక మొదల్లో ఎర్రటి పొక్కులు వచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఇది స్టెఫలోకాకస్, సూడోమొనాస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది.చికిత్స : యాంటీబయాటిక్ మందులతో దీన్ని తగ్గించవచ్చు.పీడ్రా : ఇది వెంట్రుకకు వచ్చే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్.డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ : ఇది కనురెప్పల వెంట్రుకలను ప్రభావితం చేసే కండిషన్. ఈ జబ్బుకు దారితీసే సూక్ష్మజీవి కనురెప్పలను మెరిసేలా చేసే నూనెను ఎక్కువగా స్రవించేలా చేయడం వల్ల ఈ రుగ్మత వస్తుంది.సెబోరిక్ డర్మటైటిస్ : వాస్తవానికి ఇది ఇన్ఫెక్షన్ కాని కండిషన్. ఈ కండిషన్లో చర్మం పగుళ్లు ఫంగల్ ఇన్ఫెక్షన్తో పాటు కలిసి వస్తాయి. ఈ పరిస్థితిని సల్ఫర్, సెలీనియమ్ సల్ఫైడ్, జింక్ పైరోథియాన్ (జడ్పీటీఓ), తార్, శాల్సిలిక్ ఆసిడ్ లేదా ఆయిల్ ఆఫ్ లేడ్, కార్టికోస్టెరాయిడ్ లోషన్లతో చికిత్స చేసి, నియంత్రణలోకి తెస్తారు.వెంట్రుక తీగ (షాఫ్ట్)కు వచ్చే లోపాలు...వెంట్రుకలో మనకు పైకి కనిపించే తీగ వంటి భాగాన్ని షాఫ్ట్ అంటారు. ఈ లోపాలకు ప్రధాన కారణం జన్యుపరమైనవి. వాటిలో కొన్ని...లూజ్ అనాజెన్ సిండ్రోమ్ : దీన్నే లూజ్ హెయిర్ సిండ్రోమ్ అంటారు. దీని పేరే దీని వల్ల కలిగే లోపాన్ని సూచిస్తుంది. అంటే అనాజెన్ దశలో వెంట్రుక వదులుగా అయి చిన్నగా లాగినా ఊడి వచ్చేస్తుంది. ముఖ్యంగా యుక్తవయస్కులైన బాలికల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఇలా ఊడిన జుట్టు ఒకపట్టాన తేలిగ్గా మొలవదు. అందుకే మాడుపై జుట్టు పలచబారే అవకాశం ఉంది.పరిష్కారం : సాధారణంగా ఇలా ఊడిన జుట్టు దానంతట అదే రావాల్సిందే. చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదు.ట్రాక్షన్ అలొపేషియా: చాలామంది తల్లులు జడవేసే సమయంలో తమ పిల్లలకు జుట్టును బాగా లాగి టైట్గా జడవేస్తుంటారు. ఇలా చాలాకాలం పాటు జుట్టును చాలా బలంగా లాగుతుండటం వల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుంది.ట్రైకో టిల్లోమేనియా : ట్రైకో టిల్లోమేనియా అనే కండిషన్లో కొందరు తమ జుట్టును తామే బలంగా పీకేసుకుంటుంటారు. బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్నట్టుగానే ఈ సమస్య ఉన్నవారు తమ జుట్టు తామే పీకేసుకుంటుంటారు. వీళ్లు తమ కనురెప్పల వెంట్రుకలు, కనుబొమల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు.ట్రైకోఫేజియా : ఇది కూడా తమ జుట్టు తాము లాక్కోవడం లాంటిదే. అయితే ఈ రుగ్మత ఉన్నవారు అలా లాగిన జుట్టును తినేస్తుంటారు. ఇది చాలా తీవ్రమైన జబ్బు. ఇలాంటి వారికి తక్షణమే చికిత్స (ఎమర్జెన్సీ ట్రీట్మెంట్) ఇవ్వడం అవసరం. చివరగా... జుట్టు రాలుతున్నప్పుడు వెంట్రుకలకు ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని... ఆ మేరకు చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల వైద్యపరంగా తగిన విద్యార్హతలు లేనివారు జుట్టుకు చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతినడం లేదా రాలిపోవడం జరగవచ్చు. అందుకే తమ జుట్టు సమస్యలకు తగిన విద్యార్హతలు ఉన్న నిపుణలను సంప్రదించడం అన్న జాగ్రత్త తీసుకోవడం మంచిది.తొలి రోమం పుట్టేదిలా... బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం తాలూకు 22వ వారంలోనే వెంట్రుక మూలాలు చిన్నారి తాలూకు దేహమ్మీద ఆవిర్భవిస్తాయి. వాటిని ఫాలికిల్స్ అంటారు. అంటే పుట్టుకకు ముందే బిడ్డ శరీరంపై 50 లక్షల ఫాలికిల్స్ ఉంటాయి. వీటిల్లో పదిలక్షలు తల (మాడు) మీద ఉంటాయి. పుట్టుకకు ముందు ఈ ఫాలికిల్స్ (వెంట్రుక మూలాలు) ఎన్ని ఉంటాయో జీవితాంతం అన్నే ఉంటాయి. అంతేతప్ప వీటి సంఖ్య జీవితకాలంలో ఎప్పుడూ పెరగదు. పైగా వ్యక్తులు పెరుగుతున్నకొద్దీ వీటి సంఖ్య తగ్గుతూ పోతుంది.వెంట్రుక నిర్మాణం ఇలా... వెంట్రుకను ప్రధానంగా రెండు భాగాలుగా చెప్పవచ్చు. అదే మాడు మీది చర్మం లోపల ఉండే ‘అంకురం’ (బల్బ్) భాగం. ఇక మనకు బయటకు కనిపించే భాగాన్ని ‘వెంట్రుక’ (షాఫ్ట్) అంటారు. ఇలా వెంట్రుకలో బల్బ్ అలాగే షాఫ్ట్ అని రెండు భాగాలుంటాయి.బల్బ్ అని పిలిచే ఈఅంకురంలో అనేక పొరలు ఉంటాయి. అంకురం లోపల ఒక మోలక(్రపొజెక్షన్)లా ఉండే భాగాన్ని పాపిల్లా అంటారు. దీనికి రక్తసరఫరా ఉంటుంది. వెంట్రుకలో జీవంతో ఉండే భాగం ఇదే. ఈ బల్బ్లో ఎప్పుడూ కణవిభజన జరుగుతూ ఉంటుంది. ఇంత వేగంగా శరీరంలోని మరేప్రాంతంలోనూ కణవిభజన జరగదు. ప్రతి 23 నుంచి 72 గంటలకొకసారి కణాల విభజన జరుగుతూ ఉండటం వల్ల వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి అంకురం పక్కనే ఒక గ్రంథి ఉంటుంది. దాన్ని ‘సబేషియస్ గ్రంథి’ అంటారు. ఇది నూనెలాంటి ద్రవాన్ని స్రవిస్తుంటుంది. ఇది జుట్టుకు స్వాభావికమైన (నేచురల్) కండిషనర్లా పనిచేస్తుంటుంది. చిన్నపిల్లలు తమ టీనేజీలోకి రాగానే ఈ గ్రంథి నుంచి స్రావం ఎక్కువై జుట్టులో మెరుపును పెంచి, ఆ వయసులో కౌమార బాలబాలికలు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.మందుల వల్ల...రకరకాల ఆరోగ్య సమస్యలకు కొన్ని రకాల మందులు వాడుతున్న కొందరిలో వాటి దుష్ప్రభావం వల్ల జుట్టు రాలడం సాధారణంగా జరుగుతుంటుంది. కొందరిలోనైతే ఇది అవాంఛిత రోమాల పెరుగుదలకూ దారితీస్తుంది. ఈ మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశల్లో జోక్యం చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల/జీవిత చక్రాల (సైకిల్)లో మార్పు వస్తుంది. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి అవి జుట్టు రాలేలా చేస్తాయి.టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా రుగ్మతకు మందులు వాడటం మొదలుపెట్టాక 2 నుంచి 4 నెలల్లో మందు ప్రభావంతో వెంట్రుక ఫాలికిల్ విశ్రాంతి దశలోకి వెళ్తుంది. ఫలితంగా జుట్టు రాలాక మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది.అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో జుట్టు రాలడం విషయంలో... వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. ఈ ఫలితం మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలడం సంభవిస్తుంది. ఈ మందుల వల్ల కేవలం తలపైన ఉండే జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి.జుట్టు... దానిపై రసాయనాల ప్రభావం... జుట్టుకు రంగువేయడం, స్ట్రెయిటెన్ చేసుకోవడం, బ్లీచింగ్ వంటి ప్రక్రియల్లో వెంట్రుకలు... రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంటాయి. ఫలితంగా వాటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఒక్కోసారి వెంట్రుకలు మళ్లీ రిపేర్ చేయలేని విధంగా దెబ్బతినవచ్చు. మనకు కనిపించే వెంట్రుక పై పొర అయిన క్యూటికిల్ పూర్తిగా దెబ్బతినవచ్చు. ఇలా వెంట్రుక పైపొర అయిన క్యూటికిల్ దెబ్బతింటే లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటకు కనిపిస్తుంది. ఇది పైపొరలా నునుపుగా కాకుండా కాస్త గరుకుగా ఉంటుంది. ఈ కార్టెక్స్ భాగం బయటపడిన జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇక నీళ్లలో, వాతావరణంలో, షాంపూల్లో, హెయిర్స్ప్రేలలో ఉండే రసాయనాలు క్యూటికిల్నే కాకుండా కార్టెక్స్నూ దెబ్బతీయవచ్చు. అప్పుడు వెంట్రుక తేలిగ్గా విరిగిపోతూ ఉంటుంది.వెంట్రుకను దెబ్బతీసే భౌతిక పద్ధతులు : విపరీతంగా దువ్వడం, చాలా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం, వెనక్కు దువ్వడం, బలమైన వేడిగాలి తగిలేలా డ్రైయర్ను ఉపయోగించడం వంటి ప్రక్రియలు సైతం వెంట్రుకలను దెబ్బతీస్తాయి. ఇలా భౌతికపద్ధతుల ద్వారా దెబ్బతిన్న వెంట్రుక సాఫీగా లేకుండా ఒకచోట ఉబ్బు మరోచోట పలచబారినట్లుగా ఉంటుంది. ఇలా కనిపించే వెంట్రుకలను ‘బబుల్డ్ హెయిర్’ అంటారు. ఇలాంటి వెంట్రుకలు బలహీనంగా, తేలిగ్గా విరిగిపోయేలా ఉంటాయి.పుట్టుకతోనే జుట్టు రాలిపోయే కండిషన్లు... హైపోట్రైకోసిస్ : జుట్టు సమస్యల్లో ఇదో రకం. అలొపేషియాలో మొదట జుట్టు ఉన్న చోట రాలిపోయి, మళ్లీ మొలవడంలో ఇబ్బందులు ఏర్పడితే... ఈ ‘హైపోట్రైకోసిస్’ అనే సమస్యలో అసలు జుట్టు పెరగాల్సిన చోట... మొదట్నుంచి కూడా వెంట్రుకలే మొలవవు. దాంతో పుట్టుకతోనే జుట్టు మొలవకపోవడంతో పాటు... జీవితకాలంలో అసలెప్పుడూ వారిలో జుట్టు మొలవదు. ఇందుకు కారణాలు ప్రధానంగా జన్యుపరమైనవి. ఇక పిండదశలో వచ్చే లోపాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఈ సమస్యతో పాటు కనిపించే గ్రాహమ్ లిటిల్ సిండ్రోమ్, ఒఫ్యూజీ సిండ్రోమ్, మేవిక్ క్లేవ్ సిండ్రోమ్ వంటివి కూడా ఇందుకు కారణమవుతాయి.కంజెనిటల్ అలొపేషియా : ఈ కండిషన్ కారణంగా పుట్టుకతోనే బట్టతల వస్తుంది.ట్రైయాంగ్యులార్ అలొపేషియా : ఈ కండిషన్లో కణతల వద్ద జుట్టు రాలిపోతుంది. కంజెనిటల్ ఏట్రికియా : పిల్లల్లో కనిపించే ఈ కండిషన్లో మొదట వారికి ఒత్తైన జుట్టు ఉండి, అది రాలిపోయి మళ్లీ మొలవదు.- డా. విజయ గౌరి బండారు, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్.నిర్వహణ : యాసీన్ -
వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా?
వర్షాకాలంలో ట్రావెల్ చేయడం అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం ప్లానింగ్ కూడా అవసరం. చిన్న ప్రిపరేషన్ ఉంటే జర్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కాబట్టి టెన్షన్ పడకుండా సింపుల్ ప్రికాషన్స్ ఫాలో అయితే ట్రిప్ స్మూత్గా ఎంజాయ్ చేయవచ్చు.వాతావరణం చెక్ చేయండి: ట్రావెల్ స్టార్ట్ చేసే ముందు వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయడం మంచిది. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల గురించి ముందుగా తెలిస్తే తగిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. లోకల్ అప్డేట్స్ కూడా తెలుసుకుంటే అనవసరమైన అత్యవసర ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.ప్యాకింగ్ ఇలా!లైట్వెయిట్ రెయిన్ కోట్ లేదా కాంపాక్ట్ అంబ్రెల్లాను బ్యాగులో తప్పనిసరిగా ఉంచుకోవాలి. వాటర్ప్రూఫ్ బ్యాక్ప్యాక్ కవర్ వినియోగిస్తే గ్యాడ్జెట్స్, బట్టలు సేఫ్గా ఉంటాయి. మొబైల్, డాక్యుమెంట్స్, వాలెట్ లాంటివి వాటర్ప్రూఫ్ పౌచ్లో క్యారీ చేస్తే బెస్ట్.ఫుట్వేర్: ఫుట్వేర్ సెలెక్ట్ చేసేటప్పుడు వాటర్ప్రూఫ్ శాండిల్స్ లేదా క్విక్ డ్రైయింగ్ షూస్ చాలా బెటర్ ఆప్షన్. స్లిప్పరీ రోడ్స్లో కంఫర్టబుల్ గ్రిప్ ఉన్న ఫుట్వేర్ జర్నీని సులభతరం చేస్తుంది. ఎక్స్ట్రా సాక్స్ క్యారీ చేస్తే తడిసిన వెంటనే మార్చుకోవచ్చు.స్నాక్స్.. హెల్తీ స్నాక్స్, వాటర్ బాటిల్, చిన్న టవల్, పవర్ బ్యాంక్, ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి ట్రావెల్ ఎసెన్షియల్స్గా బ్యాగులో రెడీగా ఉంటే చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైనా చార్జింగ్ చేసే అవకాశం దొరక్కపోయినా పవర్ బ్యాంక్తో చార్జింగ్ పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది. మెడిసిన్స్ రెగ్యులర్గా వాడితే వాటిని సెపరేట్ పౌచ్లో ఉంచడం బెటర్.రోడ్ ట్రిప్స్లో డ్రైవింగ్ స్లోగా చేయడం, సరైన దూరం పాటించడం చాలా అవసరం. నీటితో నిండిపోయిన రోడ్డుపై అనవసరమైన రిస్క్ తీసుకోకపోవడం బెటర్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తే కొంచెం ఎక్స్ట్రా ట్రావెల్ టైమ్ ప్లాన్ చేసుకుంటే రష్ అవాయిడ్ చేయవచ్చు.మాన్ సూన్ ట్రావెల్లో డెస్టినేషన్ కన్నా జర్నీ చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్, గ్రీన్ ల్యాండ్స్కేప్స్, చల్లని వెదర్ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చేస్తాయి. కొంచెం సిద్ధం అయి వెళ్తే ఆ ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా పూర్తి చేసుకుని ఇంటికి మెమొరీస్తో తిరిగి వచ్చేయవచ్చు. వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!వర్షాకాలంలో ట్రావెల్ చేయడం అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం ప్లానింగ్ కూడా అవసరం. చిన్న ప్రిపరేషన్ ఉంటే జర్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కాబట్టి టెన్షన్ పడకుండా సింపుల్ ప్రికాషన్స్ ఫాలో అయితే ట్రిప్ స్మూత్గా ఎంజాయ్ చేయవచ్చు. -
తీపి రికార్డు! ‘ఇంత తేనె ఎలా తిన్నాడు?'
తేనె అంటే చాలామందికి ఇష్టం. కానీ, జర్మనీకి చెందిన ఆండ్రే ఆర్టోల్ఫ్ మాత్రం పిచ్చి! ఎంతంటే, ఒక నిమిషంలో ఏకంగా కిలోకు పైగా తేనె తినేసేంత.అవును, ప్రపంచ రికార్డు కోసం బకెట్ నిండా తేనె ముందు పెట్టుకుని కేవలం 60 సెకన్లలోనే 1,273 గ్రాముల తేనెను గుటకలేసేశాడు. అంటే దాదాపు ఒక పెద్ద తేనె సీసా మొత్తాన్ని నిమిషంలో ఖాళీ చేశాడు. నీళ్లు తాగినట్టు తేనె తాగడం అంత ఈజీ కాదు. అది చిక్కగా ఉండటంతో గొంతులోకి వెళ్లడమే పెద్ద టాస్క్.అయినా ఆండ్రే మాత్రం స్పూన్ తర్వాత స్పూన్ వేగంగా తింటూ కొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వైరల్ అవుతోన్న అతని వీడియో చూస్తే ‘ఇంత తేనె ఎలా తిన్నాడు?‘ అనిపించక మానదు. అయితే ఇది ఒక్కరోజులో వచ్చిన విజయం కాదు. విచిత్రమైన తినే చాలెంజ్లలో ఇప్పటికే అనుభవం ఉన్న ఆండ్రే, తన వేగం, పట్టుదలతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాడు. -
సానుకూల శక్తికి విపరీత కరణి ఆసనం..
విపరీత కరణి ఆసనం ఒక సరళమైన కానీ అత్యంత ప్రభావవంత మైన ఆసనం. రోజుకు కేవలం 10–15 నిమిషాలు ఈ ఆసనం సాధన చేస్తే శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత, జీవితానికి సానుకూల శక్తి లభిస్తాయి. విపరీత కరణి అనే సంస్కృత పదంలో ‘విపరీత’ అంటే తలకిందులైన లేదా వ్యతిరేకమైన, ‘కరణి’ అంటే చర్య లేదా స్థితి. ఈ ఆసనంలో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి, కాళ్లను గోడకు ఆనించి పైకి ఎత్తుతారు. ఇది శరీరానికి, మనసుకు ప్రశాంతతను అందించే యోగాసనం.ప్రయోజనాలు...ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ ను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.కాళ్లలో నిలిచిన రక్తం గుండె వైపు సులభంగా ప్రవహించడానికి సహాయపడుతుంది.ఎక్కువసేపు నిలబడే వారు, నడిచే వారికి కాళ్ల నొప్పి, వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.నిద్రలేమి సమస్యలను తగ్గించి ప్రశాంతమైన నిద్రకు తోడ్పడుతుంది.పెల్విక్ ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడటానికి సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతకు పరోక్షంగా ఉపయోగపడవచ్చు.పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను ఉత్తేజపరిచి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.అలసటను తగ్గించి శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నియంత్రించడానికి సహాయపడుతుంది.జాగ్రత్తలు....తీవ్రమైన మెడ, వెన్నెముక గాయాలు ఉన్నవారు, అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.ఆసనం చేస్తూ ఎటువంటి ఒత్తిడి లేదా నొప్పి కలిగితే వెంటనే ఆపాలి.భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 2–3 గంటల విరామం ఉండాలి.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
90 డేస్ టీ చాలెంజ్! ఏం‘టీ’ నిజమా?
రోజూ ఉదయం నిద్రలేవగానే గుర్తొచ్చేది తాజా టీ. ఆఫీసు టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఇంకేవో గందరగోళాలు.. ఇలా హడావిడిగా సాగే జీవితంలో ఎన్ని అగచాట్లున్నా చక్కని, చిక్కని ఓ టీ కప్పు సిప్పు చేస్తే తప్ప వాటన్నింటికీ పరిష్కారం దొరకదు. మనదేశంలో టీతోనే రోజు మొదలెట్టేవారు కోట్లలో ఉంటారు. భాషాభేదం లేకుండా, నార్త్, సౌత్ అనకుండా అందరినీ మమేకం చేసి అదో రకం మైకంలో ముంచేసే టీ నిజంగా ఓ రకం డ్రగ్.. అయితే ఇలాంటి టీని ఓ తొంభై రోజులు తాగడం మానేస్తే ఏమవుతుంది?మొదటివారంలో..టీలో ఉండే కెఫీన్కు శరీరం అలవాటు పడుతుంది. అందుకే ఉన్నట్టుంటి టీ తాగడం మానేస్తే మొదటివారం రోజులు చికాకు, దేనిమీద ఏకాగ్రత లేకపోవడం, తలనొప్పి, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరానికి అలవాటైన కెఫీన్ ఒక్కసారిగా దూరమైతే వచ్చే ప్రతి స్పందన ఇది.2–4 వారాల్లో...టీ తాగడం తగ్గించాక తర్వాత చాలామందిలో రాత్రి పూట తొందరగా నిద్రపట్టడం, మధ్యలో మెలకువలు తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు. అలాగే ఉదయం కూడా తాజాగా నిద్రలేవడం ఉషారుగా ఉండడం జరుగుతుంది. ఈ మార్పులు రాత్రిళ్లు టీ తాగే అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.ఆందోళనకి దూరంటీలోని కెఫీన్ శరీరంలో గుండె వేగాన్ని పెంచుతుంది. సాధారణంగా టీ గ్యాప్ వస్తే కొందరిలో ఆందోళన కనిపించడం, చేతులు వణుకుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఈ లక్షణాలు ఇంకా అధికం. గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీతో కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు టీ మానేస్తే సగానికి సగం సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చక్కెర వినియోగం కూడా తగ్గడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.ఏం‘టీ’ నిజమా?ప్రపంచవ్యాప్తంగా నీరు తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ.టీ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.ప్రపంచంలో ప్రతి రోజూ మూడు బిలియన్ల కప్పులకు పైనే టీని తాగేస్తున్నారు.బ్రిటీషర్లు భారత్కి టీ పరిచయం చేస్తే భారతీయులు అందులో పాలు, పంచదార కలిపి కొత్త రూపాన్నిచ్చారు. ఆ తర్వాత ఏలకులు, లవంగాలు, అల్లం కలిపి మసాల టీగా రూపాంతరం చెందింది.ఎంతోప్రాచుర్యం పొందిన టీ పుట్టిన ప్రదేశం మాత్రం చైనానే. క్రీస్తు పూర్వం 2737లో అప్పటి ప్రజలు తొలిసారిగా టీ రుచి చూశారు.వైట్ టీ తెలుసా?బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ గురించి విన్నాం. మనలో చాలామంది వాటిని రుచి చూశాం కాని వైట్ టీ ఏంటి? అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడి. అత్యంత స్వచ్ఛమైన సహజమైన టీ రకాలలో ఈ వైట్ టీ ఒకటి. ఈ టీ పొడి కోసం కేమెలియా సినెన్సిస్ అనే మొక్కకు వచ్చే లేత మొగ్గలను, చిన్న ఆకులను మాత్రమే కోస్తారు. దీని డికాషన్ ముదురు రంగులో కాకుండా చాలా తేలికపాటి పసుపు లేదా వెండి రంగులో ఉంటుంది. రుచి కూడా కాస్త తియ్యగా పూల వాసనతో ఉంటుంది. కేవలం వసంత కాలంలో మాత్రమే దొరికే ఈ టీ ఆకులను చాలా జాగ్రత్తగా కోసి ప్రాసెస్ చేస్తారు. రకాన్ని బట్టి దీని రేటు కిలోకి ఐదు వేల నుంచి నాణ్యతను బట్టి లక్షల రూపాయల వరకు ఉంటుంది. -
మీ పాప టీనేజ్లోకి అడుగు పెట్టిందా? ఈ సూచనలు మీకోసమే!
చిన్నారులు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న కౌమార దశ లేదా టీనేజ్ ఎంతో కీలకం. ఆ సమయంలో వారు చేసుకునే అలవాట్లు, జీవనశైలి సూత్రాలే వాళ్ల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. అందువల్ల తల్లిదండ్రులు కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం!సరిగ్గా చెప్పాలంటే, టీనేజ్లోనే భావోద్వేగాల పరిణతి వస్తుందట. ప్రతిదీ ఈ దశలోనే నేర్చుకుంటారట. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు అయినదానికీ కానిదానికీ పిల్లలను విమర్శిస్తూ, కఠినంగా వ్యవహరిస్తే కుటుంబంతోనూ, తోటి పిల్లలతోనూ వాళ్లు ఎమోషనల్గా దూరమవుతారని, తమ సమస్యలను చెప్పడానికి భయపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వారి తప్పు సరిచేసే ముందు వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దేనని చెబుతున్నారు. టీనేజీ పిల్లలను కుటుంబ సభ్యులను, టీచర్లు మరింతగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.శుభ్రతా ముఖ్యమే... ఇక పీరియడ్స్ మొదలయ్యాక మరో కొత్త సవాలు ఎదురైవుతాయి. ముఖ్యంగా, పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే, క్రమం తప్పకుండా స్నానం, దుస్తులు, లోదుస్తులు మార్చుకోవడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు.తగ్గ ఆహారం... ఎదిగే వయసులో అమ్మాయిలకు పోషకాహారం తప్పనిసరంటున్నారు నిపుణులు. ఎంత బిజీగా ఉన్నా సరే, మంచి ఆహారం అందించడం మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నారు. అధి కప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, లో–ఫ్యాట్, లో–కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం ఇవ్వాలి.క్లాస్, చదువుల్లో పడి స్కూల్లో నీళ్లు తాగడం మర్చిపోతారు కాబట్టి, మీ పాప రోజుకి కనీసం 12 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, చక్కెర లేని పండ్ల రసాలూ మంచివేని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో కాఫీ, టీ, కార్బొనేటెడ్ డ్రింక్లు, కృత్రిమ తీపి కలిగిన పానీయాలకూ దూరంగా ఉంచాలని తెలియజేస్తున్నారు.ప్రశాంతంగా: ఓ వైపు శరీరంలో మార్పులు, మరోవైపు చదువు ఇవన్నీ పిల్లల్లో ఒత్తిడి కలిగిస్తాయి కాబట్టి రోజుకి ఒక గంటైనా వాళ్లు ప్రశాంతంగా కూర్చొనేలా సమయమివ్వడం వల్ల తమ గురించి తాము ఆలోచించుకునేందుకు సాయపడుతుంది. డ్రాయింగ్, పెయింటింగ్, కథల పుస్తకాలు, క్రియేటివ్ క్రాఫ్ట్వర్క్ వంటివి చేసేలాగాప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. అప్పుడే మానసికంగా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు.అంతేకాకుండా, టీనేజ్ పిల్లలకు వారి పరిధి మేరకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు. గుడ్టచ్, బ్యాడ్టచ్ లాంటి వాటి గురించి తెలియజేయాలని చెబుతున్నారు. అప్పుడే వాళ్లు చైల్డ్ అబ్యూజింగ్ లాంటివి ఎదుర్కోకుండా ఉంటారని సూచిస్తున్నారు.హార్మోన్లలో మార్పులు...టీనేజ్లో అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే మరో సమస్య మొటిమలు ఒకటి. ఇవే వారిలో ఆత్మన్యూనతకూ దారితీస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇందుకు కారణం హార్మోనుల్లో మార్పులే అని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూనే వాటి గురించి జాగ్రత్తలూ చెప్పాలంటున్నారు. వాటిని గిల్లడం, వత్తడం లాంటివి చేయనీయకూడదు.అర్థం అయేలా చెప్పాలి...రుతుక్రమం... శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో చాలా మార్పులే వస్తాయి. కాబట్టి, వాటి గురించి పీరియడ్స్ మొదలవక ముందే పిల్లలకు అర్థమయ్యేలా వారి మనసు నొప్పించకుండా సున్నితంగా చెప్పాలనీ, అప్పుడే, మనసులో ఉన్న భయాలూ, అపోహలూ తొలగిపోయి, తమలో వస్తోన్న మార్పులను అర్థం చేసుకుంటారని చెబుతున్నారు.వ్యాయామంతో...సిగ్గు, బిడియం లాంటి వాటి వల్ల టీనేజ్ అమ్మాయిలు ఆటలకు దూరం అవుతున్నారనీ, కాబట్టి, ఆ ఫీలింగ్స్ను పోగొట్టి వాళ్లు బయటకు వచ్చేలా ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. స్విమ్మింగ్, బాస్కెట్బాల్, వాకింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒకదాన్లో భాగమయ్యేలా చూడాలి. వ్యాయామం అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు జీవనశైలి వ్యాధులు రాకుండా ఉంటాయి. -
కు.ని. పనీ.. స్త్రీలదే!
కుటుంబ నిర్వహణ భారమే కాదు.. కుటుంబ నియంత్రణ భారం కూడా మహిళలే మోయాల్సి వస్తోందని తాజా గణాంకాలు రుజువు చేస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, భారతదేశంలో ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలు 36.5 శాతం మంది ఉండగా, వాసెక్టమీ పద్ధతిని ఎంచుకుంటున్న పురుషులు కేవలం 0.5 శాతం మాత్రమే. శాస్త్రీయత లేని అపోహలు, లోతుగా పాతుకుపోయిన పురుషాధిక్య ధోరణులు కుటుంబ నియంత్రణ వ్యవస్థలో లింగ అసమానతలకు కారణంగా నిలుస్తున్నాయి. మహిళలనే బాధితులుగా నిలుపుతున్నాయి.దేశంలో కుటుంబ నియంత్రణ సేవల వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, ఆ బాధ్యత భారం మాత్రం ఇంకా మహిళల పైనే సాగుతోంది. అందుకు సాక్ష్యమే ఈ నివేదికలు. మహిళలకు సంబంధించిన ట్యూబెక్టమీ ఆపరేషన్ చాలా క్లిష్టమైనదయినప్పటికీ, దేశంలో 36.5% మంది మహిళలు దీనిని చేయించుకుంటున్నారు. కానీ ఎంతో సులువైన, సురక్షితమైన వాసెక్టమీ చేయించుకునే పురుషుల శాతం కేవలం 0.5% మాత్రమే ఉంది. అంటే కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.శాస్త్రీయత లేని అపోహలు...కుటుంబ నియంత్రణ భారమంతా మహిళలపైనే పడటానికి పురుషుల్లో ఉన్న అవగాహనా లోపం, లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే సామాజిక, మానసిక భయాలే ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. లైంగిక విజ్ఞానం పెరిగినప్పటికీ ఇప్పటికీ చాలా మంది పురుషులు వాసెక్టమీని లైంగిక సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే ప్రక్రియగానే భావిస్తున్నారు. వాసెక్టమీ అనేది కేవలం శుక్రకణాలను తీసుకెళ్లే నాళాలను మూసివేసే ఒక చిన్న ప్రక్రియ మాత్రమే. దీనివల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి గానీ, వారి శృంగార సామర్థ్యానికి గానీ, శారీరక శ్రమ చేసే శక్తికి గానీ ఎలాంటి నష్టం వాటిల్లదు. ఈ ఆపరేషన్ చేయించుకుంటే శరీరం బలహీనపడిపోతుందని భావించడం వల్ల, ముఖ్యంగా రోజువారీ కూలీలు, కష్టపడి పనిచేసే కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఈ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు.మహిళలకే పరిమితం...దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న కుటుంబ నియంత్రణ ప్రచారాలు, ఆరోగ్య పథకాలు కూడా ఈ బాధ్యతను మహిళల పైనే నెట్టేలా రూపుదిద్దుకున్నాయి. ప్రభుత్వ కుటుంబ నియంత్రణ ప్రచారాలన్నీ కూడా ఎక్కువగా మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణులు, తల్లుల చుట్టూనే తిరుగుతున్నాయి. అలాగే మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రసవాల కోసం నిరంతరం ఆసుపత్రులను సందర్శిస్తుంటారు. ఆ సందర్భాల్లో వైద్యులకు, గర్భిణులకు మధ్య శాశ్వత కుటుంబ నియంత్రణపై జరిగే చర్చలు సైతం కుటుంబ నియంత్రణ అనేది కేవలం మహిళల బాధ్యత అనే భావనను బలపరిచాయి.కమ్యూనికేషన్ గ్యాప్...గతంలో దేశంలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల తాలూకు చేదు జ్ఞాపకాలు, భయాలు ఇప్పటికీ పురుషుల్లో ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లోపం కూడా ఇందుకు ఒక కారణం. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న కుటుంబాలలో భార్యాభర్తల మధ్య కుటుంబ నియంత్రణపై సరైన చర్చలు జరగడం లేదు. ఈ కమ్యూనికేషన్ లోపం కారణంగా, మహిళలు తమ భర్తలకు తెలియకుండా రహస్యంగా గర్భనిరోధక మాత్రలు, కాపర్–టి వంటి పద్ధతులను వాడుతున్నారు. గతంలో 15% గా ఉన్న ఈ రహస్య వినియోగం ఇప్పుడు 27% కి పెరగడం గమనార్హం.మార్పు దిశగా...కుటుంబ నియంత్రణ అనేది ఇద్దరు భాగస్వాములకు సమాన బాధ్యత అయినప్పటికీ, ఈ భారాన్ని మహిళలే మోయాల్సి రావడం వల్ల వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. సమాజంలో ఉన్న ఈ భారీ లింగ వ్యత్యాసాన్ని తొలగించాలంటే కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోవని, పురుషుల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వైద్యులు కుటుంబ నియంత్రణపై దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించాలి. వాసెక్టమీ సురక్షితమైనదనే అవగాహన కల్పించాలి. ఇప్పటికే వాసెక్టమీ చేయించుకుని ఆరోగ్యంగా ఉన్న పురుషులను, పురుష ఆరోగ్య కార్యకర్తలను బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చి, ఇతరులలో ఉన్న సామాజిక భయాలను పోగొట్టాలి. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ అనేది కేవలం మహిళలకు సంబంధించిన విషయమనే భావనని సమాజం నుంచి తొలగించినపుడు మార్పు సాధ్యమవుతుంది. -
థానా రామయ్య... నువ్వు చాలా గ్రేటయ్యా!
నీళ్లు కూడా వ్యాపారంగా మారిన ఈరోజుల్లో డెబ్బై ఏడేళ్ల థానా రామ్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. రాజస్థాన్కు చెందిన థానా రామ్ గత రెండు దశాబ్దాలుగా బాటసారులకు ఉచిత నీరు అందిస్తున్నాడు. బార్మర్లోని రద్దీ రహదారి వెంబడి రోడ్డు దాటుతున్న ప్రజలకు చల్లటి తాగు నీరు బాటిళ్లను అందిస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది.బార్మర్–బటాడు మార్గంలో బస్సు ప్రయాణీకులు, ట్యాక్సీ డ్రైవర్లు, బాటసారుల కోసం ప్రతిరోజూ ఖాళీ బాటిల్స్లో చల్లటి తాగునీరు నింపుతూ కనిపిస్తాడు థానా రామ్. వేసవిలో ఉష్ణోగ్రతలు రోజూ 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ చేరుకునే ఈ ప్రాంతంలో థానా రామ్ చేసే సహాయం ఎంతోమందికి ఉపశమనాన్ని ఇస్తోంది. ఈ పని కోసం ఆయన విరాళాల సేకరించడం లేదు. తాను చేస్తున్న పనికి ప్రచారం రావాలని కూడా అనుకోలేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో చాలామందికి థానా రామ్ గురించి తెలిసింది. -
పరమ తండ్రి ప్రేమ
ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచనలు చేయక తప్పదు. విలువైన మూలాల వలన మూల΄ాఠములవలన ఇట్టి క్షేత్రస్థాయి వనరుల వలన సువాసనసారం ఎది ఉన్నా అది నేరుగా బయటపడి జీవితాలకు వంటబడుతుంది. పరిశోధనాత్మక ఆత్మ సంబంధ అభ్యాస జీవితానికి అన్వయించుకునేలా క్రీస్తు సందేశాలు ఎప్పుడూ ఘనంగానే ఉండుట అనేది గమనార్హం.‘నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను’ అంటాడు అద్వితీయ సత్యదేవుడు. ఆయన మనస్సు ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తువారి ఉన్నతమైన బోధ ఏమంటే ‘ఈ భూమి మీద ఎవరికిని తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందు ఉన్నాడు’. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అనేది వేరే అంశం. ధర్మశాస్త్రాన్ని మరింత లోతుగా పరిశోధించినా, యేసు అసాధారణ బోధల ప్రకారంగా చూసినా కూడా ఒకరు ఆత్మ సంబంధంగా తండ్రి హోదాను అనుభవించడం దేవునికి కోపం తెప్పించే విషయమే కాక, ఇదొక గొప్పదైన విశేషం కూడానూ.గ్రంథప్రకారంగా దేవుని మహిమను దొంగిలించడం ఘోరతప్పిదమే అని చెప్పక తప్పదు. మేము మీకు ఆత్మీయ తల్లిదండ్రులం అంటూ సువార్తికులు, బోధకులు, సంఘ పెద్దలు పిలిపించుకోవడం లేఖన విరుద్ధం. మీరంతా సహోదరులు అనునదే క్రీస్తు బోధ. మనమంతా క్రీస్తునందున్నా సహోదరీ సహోదరులం. దేవుని పిల్లలం అనేదే లేఖన సంబంధ సర్వసత్యం. ఎప్పుడూ యేసును రబ్బునీ అని పిలుచుకొనే మగ్దలేనే మరియకే సమాధి దగ్గర మొట్టమొదటగా యేసు పునరుత్థానుడిగా దర్శనమిస్తూ చెప్పిన మాట ఆశ్చర్యకరమే. ‘నా సహోదరులవద్దకు వెళ్ళి – నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కి΄ోవుచున్నానని వారితో చెప్పుమనెను’. యేసుక్రీస్తు వారి తండ్రి, సర్వమానవాళి తండ్రి ఒక్కరే. ఆయనే యెహోవా అనబడే తండ్రియైన దేవుడు.హెబ్రీగ్రంథ లేఖికుని వివరణలో ‘నీవు నాకు ఇచ్చిన పిల్లలు’ అని ఒకచోట క్రీస్తు అన్నట్టుగా వ్రాయబడింది గానీ తండ్రి అని ఆయన పిలిపించుకొన్న దాఖలాలు ఎక్కడనూ లేవు. క్రీస్తు అపొస్తలులు కూడా ‘అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే’ అన్నది చాలా సూటిగా సుస్పష్టంగా ఉన్నతంగా వివరిస్తూ దేవున్ని ఎంతగానో హెచ్చిస్తూ గొప్ప చేసారు. సంఘ సహకారం తీసికొని సంఘసమక్షంలో సంఘంతో కలిసి గ్రంథాన్ని పఠిస్తే యేసు తన తండ్రియైన దేవునికి ఎంతగా విధేయుడై లోబడ్డాడో అనేది తేటగా అర్థమవుతుంది.ఒక తండ్రికి ఎంతటి కఠినాత్ముడైనా, అవిధేయుడైనా కుమారుడు ఉన్నప్పటికీ అతనికి యేసు విధేయతా జీవిత విధానం గూర్చి బోధిస్తే మొదట ఆలోచనలోపడి ఇక మార్పు తప్పని పరిస్థితే అతనికి ఎదురవుతుంది. కుమారునిగా యేసు జీవితం అంతటి ఉన్నతమైనది. పరమందున్న తండ్రియైన ఆ దేవదేవునికి, ఇంట్లో ఉన్న నాన్నకు లోబడి జీవించడం మనకెప్పుడూ గౌరవం తెచ్చే సత్క్రియే అనుటలో ఎలాంటి సందేహం లేదు. – జేతమ్ -
అంతా ఆచార్యుడి నిర్ణయమే..!
‘నాకు రాజ్యమూవద్దు, రాజ్యాధికారమూ వద్దు. నన్ను పట్టాభిషిక్తుని చేయనక్కర లేదు. నేను ఆచార్యుని చేతిలో కీలుబొమ్మలా వున్నాను. నాకు ఒక స్వేచ్ఛలేదు, సుఖం లేదు, స్వంత నిర్ణయం తీసుకోలేను. చివరకు నా వివాహం కూడా ఆచార్యుడి నిర్ణయమే. అందులోనూ ఆయన రాజకీయ కోణం చూస్తున్నారు .’’ అన్నాడు చంద్రగుప్తుడు వార్తాహరునితో. ఆ వార్త ఆచార్య విష్ణుగుప్తుని చేరింది. ఆచార్యులు చంద్రగుప్తుని వద్దకు వచ్చి ‘‘నేను విన్నది నిజమేనా?’’ అని అడిగారు.‘‘అవును’’ చంద్రగుప్తుని సమాధానం .‘‘ఎందుకు ?’’ ఆచార్యుని ప్రశ్న .‘‘నాకు స్వేచ్ఛ లేదు, సుఖంలేదు, ఏం, చక్రవర్తి సుఖాన్ని కోరకూడదా? నేను మీ చేతిలో జీతం తీసుకుంటున్న పెద్దనౌకరు లా వున్నాను.’’ అన్నాడు.‘‘అవును రాజు, రాజ్యంలో ప్రజాసేవచేసే పెద్దనౌకరే. చక్రవర్తికి సుఖం ఉండదు. ఉండకూడదు. ప్రజాసుఖమే చక్రవర్తి సుఖం. ప్రజాహితమే రాజుకి హితం.నేను నీకు రాజ్యాన్ని అప్పగిస్తానన్నాను గాని, సుఖాన్ని కాదు. దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితోబాధపడుతున్నా చక్రవర్తికి సుఖమెలావుంటుంది? సుఖానికి మూలం అర్థం. అర్థ, కామాలు ధర్మం మీద ఆధార పడి వుంటాయి. సంపాదన సక్రమ మార్గంలో వుండాలి. అక్రమ మార్గమైతే అర్థం, అనర్థమౌతుంది. రాజ్య సంక్షేమం, ప్రజల సుఖంకోసం అర్థం ఎంత అవసరమో, అది ఎందుకు ధర్మబద్ధం కావాలో వివరించారు ఆచార్య చాణక్యులు.చంద్రగుప్తుని చివరి రోజుల్లో దేశంలో కరువు తాండవించింది. ప్రజలు ఆకలికి అలమటించారు. అప్పుడు చంద్రగుప్తుడు కూడా ఆహారం తీసుకోలేదు. ప్రజాహితమే తమ హితంగా భావించిన ఆ ఇద్దరూ ధన్యులే. – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
శ్రీవారి జ్యేష్ఠాభిషేకానికి వేళాయెరా!
తిరుమలేశుడు ఉత్సవాల వేల్పు. నిత్యపూజలతోపాటు విశేష పూజలెన్నో జరుగుతుంటాయి. అలాంటి వాటిలో జ్యేష్ఠాభిషేకం ఒకటి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం రోజున ముగిసేలా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ‘అభిధ్యేయక అభిషేకం’ అని కూడా పిలుస్తారు.ఏడాది పొడవునా జరిగే వివిధ ఉత్సవాలు, ఊరేగింపుల వల్ల శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, వాటి కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఈ 26 నుంచి 28 వరకు జ్యేష్ఠాభిషేకం జరగనున్న సందర్భంగా ఆ విశేషాలు.ఏడాది పొడవునా స్వామివారి ఉత్సవమూర్తులకు ఉండే బంగారు కవచాన్ని ఈ ఉత్సవం మొదటి రోజున తొలగిస్తారు. కవచాలు లేని స్వామివారి నిజరూపాన్ని చూసే అరుదైన అవకాశం కేవలం ఈ సమయంలోనే భక్తులకు దక్కుతుంది.స్నపన తిరుమంజనం: మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి ద్రవ్యాలతో వైభవంగా ‘స్నపన తిరుమంజనం’ (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. అభిషేకం పూర్తయిన తర్వాత ప్రతి రోజూ స్వామివారికి వేర్వేరు కవచాలను సమర్పిస్తారు. శతాబ్దాల నాటి శ్రీ మలయప్ప స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ప్రతి ఏటా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ‘అభిధ్యేయక అభిషేకం‘ నిర్వహిస్తారు. – ఫొటోలు: కేతారి మోహన కృష్ణ, సాక్షి, తిరుపతిఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలుమూడు రోజుల ముఖ్య కార్యక్రమాలు (జూన్ 26 – 28)మొదటి రోజు (జూన్ 26, శుక్రవారం): స్వామివారికి ఏడాది పొడవునా ఉండే బంగారు కవచాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పిస్తారు. తిరుమంజనం అనంతరం స్వామివారికి వజ్రకవచం అలంకరించి మాడ వీధుల్లో ఊరేగిస్తారు.రెండవ రోజు (జూన్ 27, శనివారం): ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన తర్వాత అత్యంత శోభాయమానంగా ముత్యాలకవచం సమర్పిస్తారు.మూడవ రోజు (జూన్ 28, ఆదివారం): చివరి రోజు తిరుమంజన కార్యక్రమాలు పూర్తి చేసి, స్వామివారికి బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని తిరిగి వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు తీయరు. -
ట్రావెలర్స్ వద్ద ఉండాల్సిన 3 గ్యాడ్జెట్స్ ఇవే..
ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో అంతే వేగంగా ప్రయాణికులు స్మార్ట్ అవుతున్నారు. నిత్యం కొత్త కొత్త పరికరాలు, సాంకేతికను వాడుతున్నారు. మీరు కూడా స్మార్ట్ ట్రావెలర్ అవ్వాలంటే ఈ 5 పరికరాల గురించి తెలుసుకోండి.1. ట్రాకిబుల్ పాస్పోర్ట్ వ్యాలెట్విదేశాల్లో ఉన్నప్పుడు పాస్పోర్ట్ను గుండెకాయలా చూసుకోవాలి. ఒక వేళ అది మిస్ అయితే సగం ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీకు ట్రాకిబుల్ పాస్పోర్ట్ వ్యాలెట్ ఉపయోగపడుతుంది. పాస్పోర్ట్ భద్రంగా ఉండాలి అంటే ఈ పాస్పోర్ట్ ట్రాకర్ మీకు ఉపయోగపడుతుంది.ఇందులో ఉన్న బ్లూటూత్ ట్రాకింగ్ టెక్నాలజీ వల్ల మీ పాస్పోర్ట్ ఉన్న వ్యాలెట్ మిస్ అయినా మీ ఫోన్ వాడి దాని లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. ఈ వ్యాలెట్లో క్రెడిట్, డెబిట్ కార్డులు, బోర్డింగ్ పాస్, ఇతర డాక్యుమెంట్స్ దాచుకునే సదుపాయం కూడా ఉంటుంది.2. హ్యాండ్ ఫ్రీ ఫోన్ హోల్డర్ ఈ డిజైజ్ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ పాపులర్ అవుతోంది. దీనికి కారణం మీరు ఏదైనా కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు హోటల్స్లో, వాహనాల్లో దీనిని సులభంగా వాడుకోవచ్చు. ఫోనును చేతితో పట్టుకోకుండా డెస్కుకు, సీటుకు ఒక క్లిప్పులా పెట్టేసి వీడియోలు, ఫోటోలు, మ్యాప్స్ చూడవచ్చు. కార్లు, బైకు, విమానం బస్సులో కూడా వీటిని వినియోగించవచ్చు. ఆన్ లైన్లో మీకు వందల రకాలు మొబైల్ హోల్డర్స్ లభిస్తాయి.3. సోలార్ పవర్ బ్యాంక్ఈ రోజుల్లో మన ఫోన్ తో పాటు ఇతర పరికరాలను చార్జ్ చేసి పెట్టడం అనేది చిన్న ఛాలెంజ్ లాంటిదే. మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు మరీ ఈ ఛాలెంజ్ కాస్త కష్టంగా మారిపోతుంది. దీని కోసం మీరు మల్టి కేబుల్ సోలార్ పవర్ బ్యాంక్ వినియోగించవచ్చు. ఇది ఇకో ఫ్రెండ్లీ అయిన చార్జింగ్ విధానం.ఈ ఆర్టికల్లో ప్రస్తావించిన గ్యాడ్జెట్స్ వినియోగించి మీరు ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగింవచ్చు. ఇవే కాకుండా మీకు తెలిసిన, మీరు వాడుతున్న స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు. -
ఆన్ చేస్తే టీవీ.. ఆఫ్ చేస్తే ఆర్ట్ గ్యాలరీ.. అద్భుతం!
కొన్ని గాడ్జెట్స్ను చూస్తే ఆశ్చర్యం, కొన్ని చూస్తే ఆనందం, మరికొన్ని చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది! అలాంటి స్టయిల్, సౌకర్యం, సాంకేతికత కలయికగా వచ్చిన ఈ గాడ్జెట్స్ మీకోసం..హాల్లో టీవీ పెట్టాలా? లేక ఖరీదైన పెయింటింగ్ తగిలించాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే రెండింటి పనీ చేసే ఈ ‘ఆర్ట్లై¯Œ టీవీ’ మీ కోసం! ఇది ఆన్ చే స్తే టీవీలా, ఆఫ్ చేస్తే గోడపై వేలాడే కళాఖండంలా పనిచేస్తుంది. మ్యాట్ 4కే క్యూఎల్ఈడీ డిస్ప్లేతో వచ్చే ఈ టీవీని చూడనప్పుడు ఇందులో అందుబాటులో ఉన్న రెండు వేలకుపైగా కళాఖండాలను ప్రదర్శించుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల చిత్రాల నుంచి ఆధునిక కళాఖండాల వరకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి. అంతేకాదు, మీ గది అలంకరణకు సరిపోయే చిత్రాలను కృత్రిమ మేధస్సే సూచిస్తుంది. కుటుంబ ఫొటోలను కూడా ఇందులో ప్రదర్శించుకోవచ్చు. ‘లాస్ట్ ట్రిప్ ఫొటోలు చూపించు’ అని చెప్పగానే వాటిని తెరపై చూపించే సౌకర్యం కూడా ఉంది. గోడపై నిజమైన ఫొటో ఫ్రేమ్లా కనిపించే ఈ స్మార్ట్ టీవీ ధర సుమారు రూ. 77 వేల నుంచి ప్రారంభమవుతుంది.బ్యాగ్లో మడత కుర్చీ..!ఎక్కడికైనా వెళ్లినా కూర్చోవడానికి చోటు దొరకక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ మినీ ఫోల్డింగ్ క్యాంపింగ్ స్టూల్! చూడటానికి చిన్నగా ఉన్నా, అవసరమైనప్పుడు వెంటనే ఓ కుర్చీగా మారిపోతుంది.కేవలం కొన్ని సెకన్లలో దీనిని పూర్తిగా తెరిచి వాడుకోవచ్చు, పని అయిపోయాక మడిచి బ్యాగ్లో వేసుకోవచ్చు. బలమైన కార్బ¯Œ స్టీల్ ఫ్రేమ్, వాటర్ప్రూఫ్ ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్తో తయారైన ఈ స్టూల్ 150 కిలోల వరకు బరువు తట్టుకోగలదు. క్యాంపింగ్, ఫిషింగ్, పిక్నిక్లు, బీచ్ ట్రిప్స్, ట్రెక్కింగ్ లేదా గార్డెన్లో కూర్చోవడానికి ఇది బెస్ట్ ఆప్ష¯Œ . పైగా ప్రత్యేక క్యారీ బ్యాగ్ కూడా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ధర కేవలం రూ. 530 మాత్రమే! -
కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!
ఎక్కువ కష్టపడకుండానే స్టయిల్గా కనిపించాలంటే, కొరియన్ ఫ్యాషన్ ను ఫాలో అవ్వాల్సిందే! ముఖ్యంగా కొరియన్ డ్రామాల ప్రభావంతో ఇప్పుడు ట్రెండ్ మొత్తం కంఫర్ట్ అండ్ క్లాస్ కలిసిన రిలాక్స్డ్ ఫిట్ ప్యాంట్స్వైపు మళ్లింది. అందుకే, ఈ కొరియన్ ప్యాంట్స్ గైడ్ మీ కోసం!ప్లీటెడ్ ప్యాంట్స్కి క్లాస్ వేరుప్లీటెడ్ డిజైన్స్ ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఫుల్ డిమాండ్లో ఉన్నాయి. ముందు భాగంలో చిన్న కుచ్చులు ఉండే ప్లీటెడ్ ప్యాంట్స్కు, ఒక ప్లెయిన్ షర్ట్ లేదా పోలో టీషర్ట్తో జత చేస్తే చాలు... ‘ఈయనకి ఫ్యాషన్ గురించి తెలుసు’ అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.యాంకిల్ లెంగ్త్ కిక్చీలమండ దగ్గర ముగిసే కొరియన్ ప్యాంట్స్ చాలా స్టయిల్గా కనిపిస్తాయి. ముఖ్యంగా వైట్ స్నీకర్స్తో వేసుకుంటే లుక్ మరింత షార్ప్గా మారుతుంది.న్యూట్రల్ కలర్స్నే హీరోలుబీజ్, క్రీమ్, గ్రే, ఆలివ్, బ్లాక్, నేవీ... ఇవే కొరియన్ ఫ్యాషన్ లో ఎక్కువగా కనిపించే కలర్స్. వీటిని మ్యాచ్ చేయడం కూడా చాలా ఈజీ. అందుకే స్టయిల్ చేయడంలో టెన్షన్ తక్కువ.ఓవర్సైజ్డ్ టీషర్ట్తో బెస్ట్ ఫ్రెండ్స్కొరియన్ ప్యాంట్స్కి ఓవర్సైజ్డ్ టీషర్ట్తో వేసుకుంటే కొరియన్ స్ట్రీట్ స్టార్లా, షర్ట్ను టక్ చేసి బెల్ట్ జోడిస్తే డ్రామా హీరోలా కనిపించడం మాత్రం గ్యారంటీ!అసలు స్పెషాలిటీ ఏంటంటే?కొరియన్ ప్యాంట్స్ అంటే కాళ్లకు ఫ్రీడమ్, లుక్కి క్లాస్! ఇవి మరీ స్కిన్నీగా అతుక్కుపోవు, అలాగని గాలికి బెలూన్లా ఊగిపోవు. నడుము దగ్గర నీట్గా ఫిట్ అవుతూ, కిందికి వెళ్లేకొద్దీ రిలాక్స్డ్గా ఫ్లో అవుతాయి. నడుస్తుంటే గాలి కూడా హ్యాపీగా ఆడుతుంది, స్టయిల్ కూడా తగ్గదు. అలా కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!ఈ 3 రూల్స్ గుర్తుంచుకోండి!కింద వేసుకునే ప్యాంటు లూజ్గా ఉన్నప్పుడు, పైన వేసుకునే షర్ట్ లేదా టీ–షర్ట్ను ఇన్–షర్ట్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ బాడీ షేప్ కరెక్ట్గా ఎలివేట్ అవుతుంది. లేదంటే మీరు బట్టల మూటలా కనిపిస్తారు.కొరియన్ లుక్ సీక్రెట్ సింప్లిసిటీ. ఎక్కువ ప్రింట్స్, ఎక్కువ కలర్స్ కంటే క్లీన్ అండ్ మినిమల్ లుక్కే ప్రాధాన్యం ఇవ్వండి..ఈ ప్యాంట్స్ సాఫ్ట్ అండ్ ఫ్లోయీగా ఉంటేనే బాగుంటాయి. అందుకే కాటన్ బ్లెండ్స్, రేయాన్ లేదా లైట్–వెయిట్ సూటింగ్ ఫ్యాబ్రిక్స్ను ఎంచుకోండి. -
కప్ప బావ.. మ్యూజిక్ బ్యాండ్!
టపటప వాన మొదలవగానే చింతచెట్టు కింద కప్ప బావ గొంతు సవరించుకున్నాడు. ‘బెక బెక బేక్’ అని పాట అందుకున్నాడు. ఆ శబ్దానికి నిద్రపోతున్న చీమల దండు ఉలిక్కిపడి బయటకొచ్చింది.‘ఏంటి బావా ఈ గోల? అసలుకే మా పుట్టలోకి నీళ్లు ఎక్కడ వస్తాయోనని భయపడి చస్తుంటేను’ అని విసుక్కున్నాయి.కప్ప బావ సిగ్గుపడ్డాడు. ‘సారీ చీమ పిల్లలూ. వాన వస్తే నాకు పాడాలనిపిస్తుంది’ అన్నాడు.అప్పుడే నత్త గారు నెమ్మదిగా వచ్చారు. ‘బావా, నీ పాట బాగుంది కానీ ఒక్కడివే పాడితే ఎలా? మనమంతా కలిసి పాడుదాం’ అన్నారు.వాన జోరందుకుంది. కప్ప బావ ‘బెక బెక’ డ్రమ్స్ వాయించాడు. నత్తగారి షెల్ మీద టపటపా పడ్డ వాన చినుకులు రిథమ్ ఇచ్చాయి. చీమలు క్యూ కట్టి ‘టిక్ టిక్’ అని చప్పట్లు కొట్టాయి. మిణుగురు పురుగులు లైటింగ్ ఇచ్చాయి. ఆ మ్యూజిక్ విని ఊరి పిల్లలంతా కిటికీల్లోంచి తొంగి చూశారు.‘అరే, వానలో బ్యాండ్’ అని చప్పట్లు కొట్టారు. కాసేపటికి వాన తగ్గింది. చీమల పుట్ట సేఫ్. అందరూ హ్యాపీ. కప్ప బావ అన్నాడు, ‘చూశారా, ఒక్కడి గోల అందరికీ విసుగు. అందరూ కలిస్తేనే అది పండగ.’ఆ రోజు నుంచి చింతకుంట పల్లెలో వాన పడిందంటే చాలు కప్ప బావ బ్యాండ్ మొదలయ్యేది. పిల్లలంతా కిటికీ దగ్గర కూర్చుని వింటూ కబుర్లు చెప్పుకునేవారు.నీతి: కలిసి చేస్తే ఏ పనైనా పండగే, కష్టమైనా ఇష్టమవుతుంది. -
ఖర్చు లేకుండా.. ప్రశాంతతను చేకూర్చే సహజ ఔషధం ఇదే..!
ఎలాంటి ఖర్చు లేకుండా మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే ఒక అద్భుతమైన సహజ ఔషధం మ్యూజిక్. కేవలం వినోద సాధనంగానే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా సంగీతం ఒక దివ్యౌషధంగా పనిచేస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.శాస్త్రీయ సంగీతం మనస్సుకు ఎనలేని ప్రశాంతతను, నిశ్చలతను ఇస్తే, రాప్ సంగీతం జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే పక్షుల కిలకిలరావాలు, వాన జల్లుల చప్పుడు, సముద్రపు అలల ధ్వనులు గుండె వేగాన్ని నియంత్రించి, ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తాయి.అందువల్ల మనకు నచ్చిన సంగీతాన్ని వినడం వల్ల మన మెదడులోని రసాయన ప్రక్రియల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గించి, మూడ్ను మెరుగుపరుస్తుంది. ప్రతికూల ఆలోచనల నుంచి మనస్సును పక్కకు మళ్లించడానికి ఇది ఒక సులువైన మార్గం.ఆఫీసులో ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సంగీతం వినే ఉద్యోగుల్లో కేవలం నెల రోజుల్లోనే ఒత్తిడి స్థాయిలు భారీగా తగ్గినట్లు పరిశోధనల్లో గుర్తించారు.అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఉత్సాహభరితమైన పాటలు వింటూ ఇల్లు లేదా డెస్క్ శుభ్రం చేసుకోవడం వల్ల అలసట తెలియదు. అలాగే, చదువుకునేటప్పుడు లేదా ఆఫీస్ పనులు చేసేటప్పుడు లిరిక్స్ లేని కేవలం ఇ¯Œ స్ట్రుమెంటల్ సంగీతాన్ని బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ప్రశాంతత కోసం హెడ్ఫోన్స్ తగిలించుకుని మీకు నచ్చిన సంగీత ప్రపంచంలోకి వెళ్ళిపోవడమే ఒత్తిడికి సరైన పరిష్కారం! -
నరకలోకంలో... భూలోక ఎంట్రెన్స్ టెస్ట్ (బీ.ఈ.టీ)!
నరకలోకవాసులకు బీ.ఈ.టీ (భూలోక ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహించారు. జూనియర్, సీనియర్లు అనే తేడా లేకుండా అందరూ ఈ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో పాసైతే... భూలోకంలో కొంతకాలం పాటు సకల సౌకర్యాలు అనుభవించే అపురూప అవకాశం వస్తుంది. అందుకే... ఈ పరీక్ష అంటే అంత క్రేజ్! ఆ పరీక్షలో వచ్చిన రెండు కీలక ప్రశ్నలు...∙∙ ‘డియర్ నరకవాసీ, ఈ క్రింది ప్రశ్నకు జవాబు వ్రాయుడి. మార్కులు: 10’అనగనగా ఒక అప్పారావు. ఇతడు ఒకరోజు ఊరి చివర చెరువు దగ్గర విషాదంగా కూర్చున్నాడు.దారిన పోయే దానయ్య...‘ఏమిటిరా అప్పీ....ఏడుస్తూ కూసున్నవు?’ అని అడిగాడు.‘ఈరోజు మా ఆవిడ బర్త్డే’ అన్నాడు అప్పారావు.‘మీ ఆవిడకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలిగానీ, ఇలా ఏడుస్తూ కూర్చుంటారా?’ అన్నాడు దానయ్య.‘ఇచ్చాను కదా!’ కోపంగా అన్నాడు అప్పారావు.‘ఏమిచ్చావు?’ అడిగాడు దానయ్య.‘చైన్ ఇచ్చాను. ఇచ్చానో లేదో చీపురు కట్ట అందుకొని ఇంట్లో నుంచి తరిమి కొట్టింది’ ఆవేదనగా అన్నాడు అప్పారావు.ప్రశ్న:∙ ‘బర్త్డే కానుకగా భార్యకు చైన్ కొనివ్వడం తప్పు కాదు కదా! మరెందుకు అప్పారావు భార్యకు అంత కోపం వచ్చింది?’∙∙ రెండో ప్రశ్న: మార్కులు: 15’అలా అయితే నాకు నరకమైనా స్వర్గమే’ అన్నాడు దేవడోస్.అతడు అలా అనడానికి కారణం ఏమిటో క్లుప్తంగా వివరించండి.∙∙ భూలోక ఎంట్రెన్స్ పరీక్షలో దబ్బనూరు అబ్బయ్యకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పై రెండు ప్రశ్నలకు అతడు రాసిన జవాబులు...∙మొదటి ప్రశ్నకు జవాబు:భార్య బర్త్డేకు అప్పారావు ఇచ్చింది గోల్డ్ చైన్ కాదు. కనీసం రోల్డ్ గోల్డ్ చైన్ కూడా కాదు. అతడు ఇచ్చింది సైకిల్ చైన్! అందుకే ఆమె అంత కోపం వచ్చింది.∙రెండో ప్రశ్నకు జవాబు:దేవడోస్ ప్రతిరోజులాగే లిక్కర్ షాప్ నుంచి ఫుల్బాటిల్ తీసుకొని ఇంటికి వెళుతున్నాడు. అతడికి దారిలో ఒక పెద్దాయన ఎదురుపడి...‘ఏమయ్యా... రోజూ పీపాలకు పీపాలు తాగుతున్నావు. తాగిన వారు నరకానికి పోతారనే విషయం తెలియదా నీకు?’ అన్నాడు.‘నా సంగతి సరే, మందు అమ్మే పీపారావు నరకానికి వెళతాడా?’ అని అడిగాడు దేవ్డోస్.‘యస్’ అన్నాడు పెద్దాయన,‘బార్ ముందు చికెన్ కబాబులు, గుట్కా, సిగరెట్ ΄్యాకెట్లు అమ్మే శీనయ్య వెళతాడా?’ అని అడిగాడు దేవడోస్.‘యస్’ అన్నాడు డోస్.‘రోజూ నాకు మందు పార్టీలో కంపెనీ ఇచ్చే రమేష్, వెంకటేషం, రాజు కూడా వెళతారా?’ అని అడిగాడు దేవడోస్.‘యస్’ అన్నాడు పెద్దాయన.‘నేను నరకానికి వెళితే ఏం! నాకు ఇష్టమైన ఇంతమంది వ్యక్తులు నాతో ఉన్నప్పుడు అది నరకమైనా నాకు స్వర్గమే!’ అని బాటిల్ మూత తీశాడు దేవడోస్. – యాకుబ్ పాషా -
నా సరస్వతిరేఖ మా నాన్న!
మా నాన్న గోరటి నర్సింహ చిన్న రైతు. చెరువు శికం భూమి ఎకరా, భూదాన ఉద్యమం వల్ల వచ్చిన భూమి ఎకరా, పొత్తుల మాన్యం అర ఎకరా... ఆయన ఆస్తి. ఆ రెండున్నర ఎకరాల్లో సేద్యం చేసేవాడు. ఆ తర్వాత ఎప్పుడో కోమట్ల సలహాతో మరో మూడెకరాలు కొని ఐదున్నర ఎకరాల రైతు అయ్యాడు. మా నాన్న భూమమ్మకు కష్టం చేస్తూ బతికాడు. మా ఊర్లో బావులు తవ్వినప్పుడు తేమ కనపడితే అది నీటి జల కాదు మా నాన్న ఓడ్చిన చెమట అనుకునేవాణ్ణి. జొన్నలు, పల్లికాయలు... లేదంటే కుసుమ పంటలు అవి వేసి బతికాడు మా నాన్న. 1971లో పెద్ద కరువు వచ్చి ఊళ్లో పెద్ద పెద్ద ఇళ్లలోనే బియ్యపు గింజలు ఉండేవి కావు. కాని మా ఇంట్లో ఉండేవి. అంత పొదుపుగా బతికారు మా అమ్మ, నాన్న.మా నాన్న యక్షగాన కళాకారుడు. నాటకాలు వేసేవాడు. బడి చదువు లేకపోయినా నాలుగు అక్షరమ్ముక్కలు నేర్చుకున్నాడు. శతక పద్యాలు చెప్పేవాడు. పోతన భాగవతం పలికేవాడు. హరిశ్చంద్రుడి వేషం వేశాడో లేదోగాని హరిశ్చంద్రుడి కంటే నైతికవర్తనుడు. ఆయన నోటిగుండా అబద్ధం పలికినట్టు నేను చూడలేదు. ఉందంటే ఉంది. లేదంటే లేదు. మా నాన్నను ఊళ్లో బహు చక్కని మనిషి అనేవారు. మట్టిలో నుంచి బయల్పడ్డ రంగనాథస్వామి విగ్రహంలా ఉండేది ఆయన రూపం. మితభాషి. ఆయన ఉన్నచోట ఉత్సాహం, ఆనందం ఉండేవి. సందర్భానుసారం హాస్యం పండేది.మా నాన్నకు అంబేద్కర్ తెలియదుగాని చదువు వల్ల బతుకు మారుతుందని తెలుసుకున్నాడు. పిల్లల్ని చదివించాలని పట్టుబడ్డాడు. మేమంతా స్కూలుకు పోతుంటే ఊళ్లో పెద్దలు ‘నువ్వెందుకు ఒక్కడివే కష్టపడతావు. చదువుకొని కొలువుచేసేదుందా. పిల్లల్ని చేతి కిందకు తీసుకో’ అనేవారు. కాని మా నాన్న చదివియ్యాల్సిందే అనుకున్నాడు. నాకు చదువు మీద ధ్యాస లేదు. మా ఊరు (నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గౌరారం గ్రామం)లో తల్లిదండ్రులతో, బంధువుల మధ్య, పశువులు కాచుకుంటూ హాయిగా ఉండాలని ఉండేది. మా ఊళ్లో మూడో క్లాసు దాకానే స్కూలు ఉంటే దుందుభికి అవతలి వైపు రఘుపతిపేట్కు వెళ్లి హాస్టల్లో చేరాలంటే ఏదో విదేశానికి వెళ్లినట్టు ఉండేది. అక్కడకు వెళ్లి హాస్టల్లో చేరి, అర్ధరాత్రిళ్లు దెయ్యాలుంటాయనే నెపం పెట్టి ఏడుస్తుంటే మా నాన్న సాయంత్రం మాఊరి నుంచి రఘుపతిపేట్లోని మా హాస్టల్కు వచ్చి నాకు తోడు పడుకుని మళ్లీ ఉదయాన్నే ఊరికి వెళ్లేవాడు. మమ్మల్ని ఏనాడూ కొట్టింది తిట్టింది లేదు. చలం బిడ్డల శిక్షణ చదవకనే పిల్లల్ని ఎలా పెంచాడో తెలుసుకున్నవాడు. తాను, అమ్మ ముతకబియ్యం తిని మేం హాస్టల్ నుంచి వచ్చినప్పుడు సన్నబియ్యం వండి పెట్టేవారు.నా చిన్నప్పుడు మా ఊరికి ఒక కాశీ బ్రాహ్మణుడు వచ్చి అందరికీ చేయి చూసి ఫలానా ఫలానా అని చెప్పి మా నాన్న చేయి చూశాడు. మా నాన్నతో ‘నీ కొడుకు వెయ్యి రూపాయిల జీతగాడవుతాడు’ అని చెప్పాడు. ఊళ్లో అందరూ పరాచికాలాడారు ఆ మాటకు అయ్యేదా చచ్చేదా అని. మా నాన్న మాత్రం మౌనంగా ఉన్నాడు. ఆయన చదివిస్తే ఎం.ఏ. వరకూ చదివాక నాకు ఉద్యోగం వచ్చింది. జోస్యంలో చెప్పినట్టు వేల జీతం వచ్చింది. మా నాన్న నా ఉద్యోగం చూశాడు. ఎదుగుదల చూశాడు. ఆయన వల్ల నాకు అబ్బిన పద్యం, పాట, గాత్రంతో నేను ఉనికిలోకి రావడం చూశాడు. నేను 49వ ఏట ఉండగా నన్ను విడిచి వెళ్లాడు.ఇప్పటికీ ఆయన ముద్ద ముద్దకూ గుర్తుకు వస్తాడు. ఆనందంలో, దుఃఖంలో, ఆలోచనలో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాతో మాట్లాడుతున్నట్టే ఉంటాడు. నీడ వలే కాపాడుతూనే ఉన్నాడు. ఆయన నాకు దివ్యరూపం. ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మార్గం చూపుతూనే ఉన్నాడు. మా నాన్న చదువు చెప్పించి నా జీవితాన్ని తీర్చిదిద్దినవాడు. ఆయనే నా చేతిలోని సిసలైన సరస్వతిరేఖ. – గోరటి వెంకన్న కవి, వాగ్గేయకారుడు -
సమ్యక్ దృష్టి.. మిధ్యా దృష్టి!
బుద్ధుడు ఒకసారి మగధ రాజధాని రాజగృహలో ఉన్నాడు. వేణు వనంలో ఉడుతలకు మేత వేస్తున్నాడు. వాటిలో కొన్ని బుద్ధుని మీదకు ఎక్కాయి. ఇంకొన్ని మేత మేస్తున్నాయి. కొమ్మ మీద ఉన్న ఉడుతలు రెండు చకచకా వచ్చి బుద్ధుని ముందు నిలబడ్డాయి. అప్పుడు జయసేనుడు, భూమిజుడు ఇద్దరూ అక్కడికి వచ్చారు. వారూ ఉడుతలకు ఆహారం పెట్టారు. అప్పుడు జయసేనుడు ‘‘భగవాన్! సమ్యక్ దృష్టి, మిధ్యా దృష్టి గురించి చెప్పండి’’ అన్నాడు.‘‘భిక్షువులారా! నూనె కావలసిన వాడు నూనె కోసం వెతుకుతున్నాడు. వాడు నూనె తొట్టిలో ఇసుక పోసినాడు. ఎంతసేపటికీ నూనె రాదు. అది మిధ్యా దృష్టి’’ ‘‘భగవాన్! ఔను. నూనె కావలసిన వాడు ఇసుక పోస్తే నూనె ఎలా వస్తుంది?’’ అన్నాడు భూమిజుడు. ‘‘అలాగే.. పాలు కావలసిన వాడు పాల కోసం వెతుకుతూ ఆవు కొమ్మును పితుకుతాడు. వాడూ పాలను పొందలేడు. అవే మిధ్యా కర్మలు’’‘‘ఒకడు వెన్నను కావాలనుకుంటాడు. బానలో నీటిని పోసి కవ్వాన్ని వేసి తిప్పుతాడు. వాడికీ వెన్న లభించదు. ఇదే మిధ్యా ప్రయత్నం’’‘‘భగవాన్! చాలా చక్కగా చెప్పారు’’ అన్నాడు జయసేనుడు. ‘‘అలాగే వేరొకడు... అగ్నిని కావాలని వెతుకుతూ ఉంటాడు. చేవగల పచ్చికట్టెను మధిస్తాడు. అప్పుడూ కూడా మంటను పొందలేడు. ఇదే మిధ్యా సంకల్పం’’ ‘‘కాని ఒకడు పాలు కావాలనుకుని చంటి దూడను పితుకుతాడు. ఆవు రొమ్మును పితకడు. ఇదే మిధ్యా వాక్కు’’ ‘‘ఇంకొకడు... పెరుగును పోసి కవ్వంతో తిప్పుతాడు. వాడు వెన్నను పొందుతాడు. ఇదే సమ్యక్ దృష్టి... అలాగే మిగిలినవన్నీ... అన్నాడు బుద్ధుడు. ‘‘భగవాన్! నూనెను కావలసినవాడు ఆవనూనెతో, పాలు కావలసినవాడు ఆవు పొదుగుతో, వెన్న కావలసిన వాడు బానలోని వెన్నతో... ఇలా పొందాలి.’’అన్నాడు భూమిజుడు.‘‘అవును.’’ అన్నాడు బుద్ధుడు. ఈ నాలుగు ఉపమానాలు చెప్పాడు. ఇద్దరూ ప్రసన్నలయ్యారు. చెట్టు మీద ఉన్న ఒక ఉడుత కిందకు దిగలేదు. అటూ ఇటూ ఆలోచిస్తుంది. కొంచెం కిందకు కొంచెం పైకీ పోతుంది. వారిద్దరూ పిలిచారు. అది అలాగే చూస్తోంది. బుద్ధుడు చూశాడు. ఉడతను కిందికి రమ్మన్నాడు. అది కిందకు వచ్చింది.‘‘ఇదిగో తిను... నీ మేత...’’ అంటూ మేత వేశాడు. అది నెమ్మదిగా వచ్చి బుద్ధుడి దగ్గర వాలింది. దాన్ని తీసుకుని దాని వీపుని నిమిరాడు. అది కొమ్మపైన వాలినట్టుగా ఆయన పాదాల మీద వాలిపోయింది. – డా. బొర్రా గోవర్ధన్ -
ఈ ఆపిల్ తోటలు ఎక్కడ?
ఇండియాలో అత్యంత అందమైన ఆపిల్ తోటలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఇండియాలో ఆపిల్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలిచే ప్రదేశం హిమాచల్ ప్రదేశ్లోని కోట్గఢ్. అందమైన హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ఈ హిల్ టౌన్, మన దేశంలో కమర్షియల్ ఆపిల్ కల్టివేషన్ కి పుట్టినిల్లుగా ప్రసిద్ధి పొందింది.1916 సంవత్సరంలో అమెరికన్ మిషనరీ శామ్యూల్ ఇవాన్స్ స్టోక్స్ అమెరికా నుంచి హై క్వాలిటీ ఆపిల్ శాప్లింగ్లను కోట్గఢ్కి తీసుకుని వచ్చి నాటారు. ముఖ్యంగా రెడ్ డిలీషియస్ వెరైటీ ఇక్కడి క్లైమేట్కి చాలా బాగా అడాప్ట్ అయింది. అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ అంతటా ఆపిల్ కల్టివేషన్ వేగంగా అభివద్ధి చెందింది. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ ఇండియాలో అత్యధిక ఆపిల్స్ ్ర΄÷డ్యూస్ చేసే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.కోట్గఢ్ చుట్టూ పచ్చని ఆపిల్ తోటలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లని వాతావరణం, తాజా గాలి టూరిస్టులను ఆకర్షిస్తాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఆపిల్ హార్వెస్టింగ్ సీజన్ ఉంటుంది. ఈ సమయంలో తోటలు అన్నీ కూడా ఎర్ర, ఆకుపచ్చ రంగు ఆపిల్స్తో నిండిపోయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కొన్ని తోటల్లో ప్రయాణికులు ఆపిల్స్ను కోసుకుని తినే అవకాశం కూడా లభిస్తుంది. ఆపిల్ ఫార్మింగ్ అనేది ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారం. ఫ్రెష్ ఆపిల్స్తో పాటు ఆపిల్ జ్యూస్, జామ్, సైడర్, డ్రైడ్ ఆపిల్స్లాంటి ఉత్పత్తులు కూడా ఇక్కడి ఎకానమీకి బలాన్ని అందిస్తాయి. నేచర్ లవర్స్ కోసం కోట్గఢ్ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. అందమైన మౌంటైన్ రోడ్స్, ప్రశాంతమైన గ్రామాలు, ఆపిల్ తోటలు, చల్లని వాతావరణం ఇవన్నీ కలిసి ఒక అందమైన, అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.ఆపిల్ తోటల్లో నడవాలి అనుకుంటే, ఫ్రెష్ ఆపిల్స్ డైరెక్ట్గా చెట్టు నుంచి కోసి తినాలి అనుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కోట్గఢ్ని తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రదేశాన్ని ఆపిల్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. -
వర్షం రాసే దక్షిణ భారత ప్రయాణ గీతం..
కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం. కొన్ని ప్రయాణాలకు మాత్రం వర్షమే మనల్ని పిలుస్తుంది. చినుకులు పడిన వెంటనే పచ్చని పర్వతాలు, మేఘాలలో దాగిపోయిన లోయలు, జలజలా పారుతున్న జలపాతాలు కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి.దక్షిణ భారతంలో వర్షాకాలం అంటే కేవలం సీజన్ కాదు. అది ప్రకృతి తన అందాన్ని మరోసారి కొత్తగా అలంకరించే సమయం. కేరళ బ్యాక్ వాటర్స్ నుండి కర్ణాటకలోని ఘాట్స్ వరకు, తమిళనాడు హిల్ స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని లోయల వరకు ప్రతీ చోట వర్షం ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది.దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాకాలంలో పచ్చని స్వర్గాన్ని తలపిస్తాయి. వెస్ట్రన్ ఘాట్స్ మొత్తం మేఘాలతో కవర్ అవుతుంది. ఈ సమయంలో ఈ ప్రాంతం మొత్తం ఒక పెయింటింగ్లాగ కనిపిస్తుంది. రోడ్డు పక్కనే వెలిసిన కాఫీ తోటలు, టీ ఎస్టేట్స్, శాండిల్వుడ్ సువాసనలు, వర్షంతో తడిసిన అడవులుం ప్రతీ దశ్యం ఒక సినిమా ఫ్రేమ్లా ఉంటుంది. ఉదయం సమయంలో మేఘాలు కొండల్ని ముద్దాడుతుంటే, మధ్యాహ్నం చినుకుల మధ్య సూరీడు అందంగా ప్రకాశిస్తాడు. సాయంత్రం అయితే కురిసే వర్షం ఆ తరువాత వీచే చల్లని గాలి మనసుని కూడా ఫ్రెష్గా మార్చేస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి మాన్ సూన్ జర్నీ మొదలైతే ట్రెయిన్ విండో పక్కన కూర్చొని వెళ్లడంలోనే ఒక ప్రత్యేక ఆనందం ఉంటుంది. సిటీ బిల్డింగ్స్ మెల్లిగా కనుమరుగై, పంటపొలాలు, నదులు, అడవులు మొదలవుతాయి. రోడ్ జర్నీలో ఘాట్ రోడ్డులు, మేఘాల మధ్య ట్రావెల్ చేస్తూ ప్రతీ టర్న్లో కొత్త సీన్ ను ఎంజాయ్ చేయవచ్చు.ఫ్లైట్ జర్నీ అయినా కూడా మేఘాల పైన వెళ్తున్న అనుభవం వేరే ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుండి హిల్ స్టేషన్స్ వైపు వెళ్తుంటే వెదర్ మెల్లిగా మారడం గమనించవచ్చు.విజయవాడ నుంచి ప్రయాణం మొదలు పెట్టే వారికి కూడా రైల్ అండ్ రోడ్డు మార్గంలో ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.ప్రతీ కిలో మీటర్లో వాతావరణం మారిపోతుంది. గాలి చల్లబడుతుంది. పచ్చని దశ్యాలు చూసి మనసు పరవశించి పోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు ప్రయాణాల్ని మెమోరెబుల్ చేస్తాయి.యాత్రా, బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ లేదా విజయవాడ నుండి 5 రోజుల మాన్ సూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, ఎంచుకునే ప్రయాణ శైలిని బట్టి బడ్జెట్ మారుతుంది. ఒక సాధారణ బడ్జెట్ రేంజ్ ట్రిప్ కోసం వ్యక్తికి సుమారు రూ. 18,000 నుండి రూ. 25,000 వరకు ఖర్చు అవుతుంది.అదే కొంచెం సౌకర్యవంతంగా ఉండే స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ అయితే రూ. 30,000 నుండి రూ. 45,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీమియం రిసార్టులు, ప్రైవేట్ వాహనాలతో లగ్జరీగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనిషికి రూ. 60,000 నుండి రూ. 90,000 వరకు బడ్జెట్ అవసరమవుతుంది.ఇక బస విషయానికి వస్తే, బడ్జెట్ హోటల్స్లో ఒక రాత్రికి రూ. 1,500 నుండి రూ. 3,000 మధ్య ఛార్జీలు ఉంటాయి. మధ్యస్థంగా ఉండే స్టాండర్డ్ రిసార్టులు అయితే రూ. 4,000 నుండి రూ. 8,000 వరకు, విలాసవంతమైన ప్రీమియం స్టేలు రాత్రికి రూ. 10,000 పైనే ఉంటాయి.ఇక ఆహార ఖర్చుల కోసం మీ లైఫ్స్టైల్ను బట్టి రోజుకు సుమారు రూ. 600 నుండి రూ. 1,500 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. n విజయవాడ నుంచి ట్రావెల్ చేసే వాళ్లకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కొంచెం మారవచ్చు కానీ ఓవరాల్ బడ్జెట్ దగ్గరగానే ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో ప్లాంటేషన్ స్టేలు, హెరిటేజ్ కాటేజీలు, హౌజ్ బోర్డు ఎక్స్పీరియన్సులు, లోకల్ సైట్ సీయింగ్ ΄్యాకేజీలు కూడా లభిస్తాయి. ఈ అనుభవాలు వర్షాకాలం జర్నీని మరింత మెమోరెబుల్గా మార్చేస్తాయి.ఏం చూడాలి?వర్షాకాలంలో జలపాతాలు ఫుల్ ఫ్లోలో ఉంటాయి. లోయలు మొత్తం తెల్లని పొగ మంచు కప్పేసుకుంటాయి. టీ తోటల్లో వర్కర్స్ మెల్లిగా పని చేసుకుంటూ కనిపించే దశ్యం స్థానికుల జీవితాన్ని దగ్గరగా చూపిస్తుంది.అడవి మార్గాల్లో ట్రావెల్ చేస్తుంటే చిన్న చిన్న జలపాతాలు రోడ్డు పక్కనే పరిగెడుతూ ఉంటాయి. సరస్సులపై పడుతున్న చినుకులు, అవి సష్టించే చిన్న చిన్న వలయాల సోయగం కళ్లతో చూడాల్సిందే.ఉదయం సూర్యోదయం కోసం వేచి చూస్తున్న మేఘాలు చాలా అందంగా ఉంటాయి. సాయంత్రం సమయంలో మేఘాలు మెల్లిగా క్లియర్ అయ్యాక కనపించే పచ్చదనం పైసా వసూల్ సీన్ లా అనిపిస్తుంది.ఈ ప్రయాణంలో జలపాతాల దగ్గర కొన్ని నిమిషాలు గడపడం, ప్లాంటేషన్ వాక్స్ ఎంజాయ్ చేయడం, లోకల్ మార్కెట్లో తిరగడం, బోటింగ్ను ఆస్వాదించడం, సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద సైలెంట్గా నిలబడటం అనే ఈ ఐదు అనుభవాలు సహజంగానే ఈ సీజన్ ని మరింత మధురంగా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?వర్షాకాలంలో స్టే అంటే కేవలం రూమ్ మాత్రమే కాదు. మార్నింగ్ బాల్కనీలో కాఫీ కప్ పెట్టుకుని మేఘాలను చూస్తూ గడిపే నిమిషాలు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అవుతాయి.వుడెన్ కాటేజీలు, ప్లాంటేషన్ రిసార్టులు, లోయవైపు ఉన్న హోమ్ స్టేలు, లేక్ సైడ్ ప్రాపర్టీలుం ఇవన్నీ ప్రకతి మధ్య కలిసిపోయిన అనుభవాన్ని ఇస్తాయి.రాత్రి సమయంలో వర్షం చినుకుల శబ్దం అనేది వినసొంపైన శబ్దంగా అనిపిస్తుంది.ప్రతీ ఉదయం విండో తెరిస్తే చల్లని తాజా గాలి, తడిసిన మొక్కల సువాసనలు, దూరంలో కనిపించే ఫాగ్ ఇవన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.మున్నార్..వర్షాకాలంలో మున్నార్ టీ గార్డెన్స్ మధ్య నడుస్తుంటే ప్రతీ క్షణం మేజికల్గా అనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు కొండల మధ్య తిరగడాన్ని చూస్తుంటే సమయం కూడా నెమ్మదిగా నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది.కూర్గ్..కూర్గ్ కాఫీ ఎస్టేట్స్లో వర్షం పడిన తరువాత వచ్చే కాఫీ వాసన చాలా రోజులు గుర్తుండిపోతుంది. చిన్న జలపాతం, గ్రీన్ వ్యాలీస్, తొలి మంచుతో కలిసిన రోడ్డు మార్గాల్లో వెళ్తుంటే సైలెంట్ మెలోడీలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది.వయనాడ్..వయనాడ్ అడవుల మధ్య ట్రావెల్ చేస్తుంటే ప్రకృతి మాత్రమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బాంబూ ఫారెస్ట్, జలపాతాలు, లేక్స్ అన్నీ మాన్ సూన్ లో మరింత లైవ్లీగా మారుతాయి.చిక్మగళూరు..చిక్మగళూరు కొండల్లో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తే మేఘాల మధ్య నుండి వెలుగు బయటికి వస్తున్న దశ్యాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు.అరకు వ్యాలీ..ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీ కూడా ఈ సీజన్ లో మరింత అందంగా మారిపోతుంది. కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా పరిసరాలు అన్ని చినుకులతో కలిసి ఒక ఫ్రెష్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.ఏం తినాలి?కేరళలో అప్పం అండ్ వెజిటెబుల్ స్టూని వర్షం పడుతున్నప్పుడు తినడం అనేది ఎప్పుడూ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. అలాగే తాజా మసాలాలతో తయారు చేసిన కూరలు లోకల్ ఫ్లేవర్ను పరిచయం చేస్తాయి.కూర్గ్లో ఫిల్టర్ కాఫీ ప్రతీ సిప్పులో కాఫీ ఎస్టేట్ అరోమా ఉంటుంది. చిక్మగళూరు కాఫీ కూడా ట్రావెల్ మెమోరీస్లో స్పెషల్ ప్లేస్ను పొందుతుంది.తమిళనాడు హిల్ స్టేషన్ లో హాట్ హాట్ ఇడ్లీలు, దోశ, పొంగల్ చల్లని వాతావరణంలో ఒకరకమైన కంఫర్ట్ను ఇస్తాయి.అరకులో బాంబూ చికెన్, ట్రైబల్ వంటకాలు, ఫ్రెష్ కాఫీ కాంబినేషన్ అనేవి లోకల్ కల్చర్ని రుచుల ద్వారా తెలుసుకునే అవకాశంగానే భావించవచ్చు.ఆసక్తికరమైన విషయాలు..మాన్ సూన్ బెస్ట్ టైమ్: జూన్ నుండి సెప్టెంబర్ వరకు సౌత్ ఇండియాలో ప్రకతి దర్శనం అత్యంత అందమైన అనుభూతిగా మిగులుతుంది. ఫేమస్ప్రాంతాలు: పశ్చిమ కనుములు అనేవి యునెస్కో జీవ వైవిధ్యప్రాంతంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. స్లో ట్రావెల్, నేచర్ వాక్, ఫోటోగ్రఫీతో పాటు ప్రశాంతమైన హాలిడేస్ కోసం వర్షాకాలం చాలా అనువైన కాలం అని చెప్పవచ్చు. అయితే ట్రిప్ స్టార్ట్ చేసే ముందు మీరు వెళ్లే దారి, డెస్టినేషన్ లో పరిస్థితి గురించి తెలుసుకోవడం మరవద్దు.గమనిక: ట్రావెల్, బడ్జెట్ వివరాలు అనేవి మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా అప్డేట్స్ స్వయంగా వెరిఫై చేసుకోగలరు. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
మా బాబుకి రెండేళ్లు! ఎంత పిలిచినా.. చూడటం లేదు..
మా బాబుకు రెండేళ్లు. పేరు పిలిచినా చాలాసార్లు తిరిగి చూడడం లేదు. సరిగ్గా ఆడుకోవడం లేదు. మాటలు కూడా సరిగా రావడం లేదు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇవన్నీ ఆటిజం లక్షణాలా? నాకు చాలా ఆందోళనగా ఉంది. – రాము, ఒంగోలు.ముందుగా మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆటిజం అనేది తల్లిదండ్రుల తప్పు వల్ల వచ్చే సమస్య కాదు. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ‘ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ఫలితం’ అనేది మాత్రం చాలా నిజం. సాధారణంగా ఆటిజం లక్షణాలు 9 నుంచి 12 నెలల వయస్సు నుంచే కొద్దికొద్దిగా కనిపించడం ప్రారంభమవుతుంది.అయితే చాలామంది పిల్లల్లో 18 నుంచి 24 నెలల మధ్య స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉండే మొదటి వెయ్యి రోజులు మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైన సమయం. ఈ దశలోనే ముందస్తు చికిత్స లేదా థెరపీ ప్రారంభిస్తే పిల్లల్లో భాష, సామాజిక నైపుణ్యాలు, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కొన్ని ప్రారంభ సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. చిన్నపిల్లలలో ఆటిజం లేదా అభివృద్ధి ఆలస్యాలను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడే తొమ్మిది సింపుల్ స్క్రీనింగ్ ప్రశ్నలు ఉన్నాయి. అవే ఇవీ.. 1. పేరు పిలిచినప్పుడు తిరిగి చూస్తాడా?2. కంటి చూపు బాగా కలుపుతాడా?3. నవ్వు లేదా ముఖభావాలకు స్పందిస్తాడా?4. కావాల్సిన వస్తువును చూపించి అడుగుతాడా?5. చేతితో బైబై లేదా ఇతర సంకేతాలు చేస్తాడా?6. ఇతర పిల్లలతో లేదా పెద్దలతో కలవాలనే ఆసక్తి ఉందా?7. మాటలు లేదా శబ్దాల అభివృద్ధి వయస్సుకు తగ్గట్టుగా ఉందా?8. ఒకే పని లేదా అలవాటు పదేపదే చేస్తూ ఉంటాడా?9. నేర్చుకున్న మాటలు లేదా సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయాయా?ఈ ప్రశ్నల్లో ఏదైనా ఆందోళన కలిగిస్తే ‘ఇంకొంచెం పెద్దవాడైతే సర్దుకుంటాడు’ అని ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా అభివృద్ధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.ఆటిజంను పూర్తిగా నివారించే కచ్చితమైన పద్ధతి లేదు. ఎందుకంటే దీనికి ఒకే ఒక్క కారణం ఉండదు. అయితే పిల్లల మెదడు ఆరోగ్యకర అభివృద్ధికి కొన్ని విషయాలు చాలా ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, అయోడిన్ వంటి పోషకాలు సరిపడా తీసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే పిల్లలకు టీకాలు సమయానికి వేయించాలి. టీకాలు ఆటిజం కలిగిస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. చిన్నపిల్లల్లో స్క్రీన్ టైమ్ కూడా తగ్గించాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం, కథలు చెప్పడం, పాటలు పాడటం, ఆటలు ఆడించడం వల్ల మెదడు అభివృద్ధికి చాలా మంచిది. ఆటిజంను ముందుగానే గుర్తించడం అంటే పిల్లలకు ఒక ‘లేబుల్’ వేయడం కాదు, వాళ్ల భవిష్యత్తుకు సరైన సహాయం అందించడానికి అవకాశం కల్పించడం. తల్లిదండ్రుల గమనికే పిల్లల మొదటి రక్షణ. - డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
పచ్చగా కళకళ.. పక్షుల కిలకిల!
ఢిల్లీ మహా నగరమంటే పొద్దెక్కక ముందే రోడ్డెక్కిన వాహనాలు, నాన్స్టాప్గా మోగే హారన్ మోతలు, గందరగోళాలు, గజిబిజీ బతుకులు.. కాని అదే నగరంలో మరోప్రదేశంలో తెల్లవారకముందే వినిపించే పక్షుల కిలకిలారావాలు, సూర్యకాంతి వెలుగులో జిలుగులు విరజిమ్మే సీతాకోక చిలుకలు, ఆకాశానికి నిచ్చెనేసినట్టు ఎగబాకే మొక్కలు... ఇదంతా ఓ ఇంటిపైన ... దీని వెనుక ఉంది ఓ కుర్రాడి తపన.ఢిల్లీ వాసి అమన్ శర్మకి 19 ఏళ్లు. బాల్యం నుంచి అతని అమ్మానాన్నలు తరచూ పక్షుల సంరక్షణా కేంద్రాలకు తీసుకెళ్లేవారు. లాక్డౌన్ టైంలో మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అమన్కి అప్పుడొచ్చిన ఐడియానే ‘అర్బన్ జంగిల్.’ తన ఇంటిపైన ఉన్న 1500 చదరపు అడుగులను చిన్నసైజు అడవిలా మార్చాలనుకున్నాడు. ఒక్కొక్క పూలకుంyీ ని ఏర్పాటు చేస్తూ వాటిని సంరక్షిస్తూ వచ్చాడు. అలా తన ఇంటి మేడమీద 500 మొక్కలను పెంచాడు. ఒకప్పుడు అలారం పెట్టుకుని లేచే అమన్కి ఇప్పుడు రోజూ పక్షుల కిలకిలారావాలతోనే మెలకువ వస్తుంది. మేడమీదకెళ్లగానే సీతాకోక చిలుకలు స్వాగతం పలుకుతాయి. వాటిని తరుముకుంటూ వచ్చి జామపళ్లను తింటూ చిలుకలు తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి.దాదాపు వందకు పైగా రకాల చెట్లు పెరుగుతున్న ఈ అర్బన్ జంగిల్లో 25 నుంచి 30 రకాల పక్షిజాతులు రోజూ వస్తుంటాయి. ఢిల్లీ పరిసరప్రాంతాలలో ఇలాంటి పక్షిజాతులు కూడా ఉన్నాయా అంటూ... చూసిన వారంతా విస్తు΄ోతున్నారు. పక్షులను, కీటకాలను ఆకర్షించడానికి నిమ్మ, కరివేపాకు, మిల్క్వీడ్, జామ, దానిమ్మ, స΄ోట వంటి చెట్లను నాటితే సీతాకోక చిలుకలు, తేనెటీగలు, చిలుకలతోపాటు ఇతర పక్షులను ఆకర్షించవచ్చని అమన్ పేర్కొన్నాడు.అమన్ 14 ఏళ్ల వయసులోనే పిల్లల కోసం పిల్లలు మాత్రమే నడిపే ‘కుకు అబౌట్ నేచర్ క్లబ్’ అనే క్లబ్నుప్రారంభించాడు. ఈ క్లబ్ద్వారా పిల్లల్ని ఢిల్లీ పరివాహకప్రాంతాల్లోని నేచర్ పార్క్లకు తీసుకెళ్లేవాడు. అచిరకాలంలోనే ప్రకృతి ప్రేమికులు అనేకమంది అమన్తో జతకట్టారు. అలా మొదలైన ఈ చిన్నపిల్లల క్లబ్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బర్డ్ కమ్యూనిటీ క్లబ్గా తయారైంది.పర్యావరణ పరిరక్షణలో అమన్ చూపిన చొరవకు ఐక్యరాజ్యసమితి (యుఎన్జీఏ) నోబుల్ పీస్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక వేదికల నుంచి పిలుపు వచ్చింది. అంతేకాదు నగరాల్లోని వన్య్రపాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ బ్రాండ్ నికాన్ నియమించిన అంబాసిడర్లలో అత్యంత పిన్న వయస్కుడిగా అమన్ గుర్తింపుపొందాడు. -
వృక్షాసనం.. ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం!
వృక్షాసనం అంటే ‘చెట్టు భంగిమ‘ అని అర్థం. ‘వృక్షాసనం మనకు చెట్టు వంటి స్థిరత్వం, సమతుల్యత, ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం. ‘వృక్షాసనం అనేది ఒక కాలి మీద నిలబడి, శరీర సమతుల్యతను కాపాడుకునే యోగాసనం. చెట్టు మాదిరిగా స్థిరంగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన 4–6 గంటల వ్యవధి తర్వాత ఈ ఆసనం వేయడం అత్యంత శ్రేయస్కరం.వృక్షాసనం చేసే విధానం..యోగా మ్యాట్పై నిలబడి, రెండు కాళ్లను దగ్గరగా ఉంచండి. ఇప్పుడు కుడి కాలిపై నిలబడి, శరీర బరువును బ్యాలెన్స్ చేయండి.ఎడమ మోకాలిని వంచి, ఎడమ పాదాన్ని కుడి కాలి తొడ లోపలి భాగానికి (తొడమూలానికి వీలైనంత దగ్గరగా) గట్టిగా ఆన్చండి. రెండు చేతులను నెమ్మది గా పైకి లేపి, నమస్కార ముద్రలో అరచేతులను కలపాలి.ముందు భాగంలో ఏదైనా ఒక వస్తువుపై దృష్టిని కేంద్రీకరిస్తూ, శ్వాసను సాధారణంగా తీసుకుంటూ 10–20 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి.ఇదే పద్ధతిని కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచి మరోవైపు రిపీట్ చేయాలి..ప్రయోజనాలు..విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది, మనో నిబ్బరం, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.కాళ్లు, చీలమండలు, వెన్నెముక దృఢంగా మారతాయి.నాడీ వ్యవస్థకు ప్రశాంతత చేకూరుతుంది.నడుము నొప్పి, సయాటికా నరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.శరీరం బ్యాలెన్స్, స్టెబిలిటీ పెరుగుతాయి.జాగ్రత్తలు..తీవ్రమైన మైగ్రేన్, అధిక లేదా తక్కువ రక్తపోటు సమస్యలు ఉంటే ఈ ఆసనం వేయకూడదు.నిద్రలేమి సమస్య ఉన్నవారు దీనిని నిపుణుల సమక్షంలోనే చేయాలి.మోకాళ్లు, తుంటి లేదా మెడకు సంబంధించిన సర్జరీలు అయినవారు ఈ ఆసనాన్ని వేయరాదు.మొదటిసారి చేసేవారు బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటానికి గోడ సపోర్ట్ తీసుకోవచ్చు లేదా కుర్చీని పట్టుకుని చేయవచ్చు.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
ఆలోచిస్తూ బుర్ర ఎందుకు గీరుకుంటారో తెలుసా?
‘వినీష్... మన రాష్ట్రపతి పేరేంటి?’ అని టీచర్ అడిగితే వాడు లేచి బుర్ర గీరుకుంటాడు. శ్రేష్ఠ ఎగ్జామ్ రాస్తూ ఆన్సర్ గుర్తుకు రాక తల గీరుకుంటుంది.ఎందుకు అలా తల గీరుకుంటారు?మన చర్మం కింద లక్షల కొద్దీ నరాలు ఉంటాయి. తల గీరినప్పుడు ఆ నరాలు మెదడుకు మెసేజ్ పంపిస్తాయి. ఆ సిగ్నల్తో మెదడులో నిద్రపోతున్న భాగాలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఆలోచన వేగం పుంజుకుంటుంది. దీన్నే సైంటిస్టులు ‘సోమాటోసెన్సరీ యాక్టివేషన్’ అంటారు. తల గీరడం వల్ల అక్కడి చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది.రక్తంతో పాటు ఆక్సిజన్ కూడా మెదడుకు ఎక్కువగా అందుతుంది. ఆక్సిజన్ అందిన మెదడు చురుకుగా పనిచేస్తుంది. అందుకే ఒక్కసారిగా సమాధానం గుర్తొస్తుంది. మన మెదడు ఒక పెద్ద లైబ్రరీ లాంటిది. సమాధానం దొరకకపోతే మెదడు పుస్తకాలు అన్నీ వెతుకుతుంది. ఆ సమయంలో బుర్ర గీరడం వల్ల మెదడుకు ఎక్స్ట్రా ఎనర్జీ అందినట్టు అవుతుంది. అందుకే సరైన జ్ఞాపకం టక్కున దొరుకుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే బుర్ర గోకడం అనేది అలసిపోయిన మెదడుకు మనం ఇచ్చే మసాజ్ లాంటిది. -
కొన్ని సందర్భాల్లో.. మౌనమే సమాధానం!
మాట వెండి అయితే, మౌనం బంగారం లాంటిది అని ఒక ఆంగ్ల సామెత. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. దీనివల్ల మన చుట్టూ ఉన్న సంబంధాలు బాగుంటాయి. అయితే అన్ని సమయాల్లోనూ మౌనంగా ఉండకూడదు. ఎప్పుడెప్పుడు మౌనంగా ఉంటే మంచిదో తెలుసుకుందాం!మాటలు మంత్రంలా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఆ మాటలే మంటల్ని సృష్టిస్తాయి. అలాంటప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది. మౌనం అనేది చాలా సందర్బాల్లో రిలేషన్స్లో గొడవలు లేకుండా చేస్తుంది. మన విలువని కూడా కా΄ాడుతుంది. అదెప్పుడో చూద్దాం..ముఖ్య విషయాలు చెబుతున్నప్పుడు..ఇంటికి సంబంధించినవి కావచ్చు, ఆఫీస్కి సంబంధించిన విషయాలు కావొచ్చు.. ఇలా దేనికి సంబంధించి విషయాలైనా ఎదుటివారు చెప్పినప్పుడు అవి వినడం తప్ప మధ్యలో కల్పించుకోకూడదు. విషయం పూర్తయ్యాకే మాట్లాడాలి. అప్పటివరకూ మౌనంగా ఉండడమే ఉత్తమం.ముందే పరిష్కారం దొరికినప్పుడు..మీకంటే ముందే ఎవరైనా విషయం గురించి చెప్పి ఇంకా మీరు చెప్పడానికి ఏం లేనప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉండడం మంచిది. ఇతరులు చెప్పిన విషయాన్ని యాక్సెప్ట్ చేయండి. కానీ, అదే విషయాన్ని మీరు మొదట్నుంచీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు.విషయం తెలియనప్పుడు..మాట్లాడేటప్పుడు ఆ సందర్భం, ఆ సమస్య గురించి కచ్చితంగా పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. అలా ఏం తెలియకుండా మాట్లాడొద్దు. దీనికంటే ఆ సమయంలో మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే, ఇలాంటప్పుడు మీ మాటలు ఎవరు పట్టించుకోరు. మీరు నలుగురిలో నవ్వుల΄ాలయే అవకాశం ఉంది.రుజువు చేసుకోలేనప్పుడు...మీరు మాట్లాడే విషయాల గురించి సాక్ష్యాలు కచ్చితంగా ఉండాలి. అంతేకానీ, ఏవో ఊహించి మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల వేరే వ్యక్తులపై మానసిక, శారీరక ప్రభావం చూపే అవకాశం ఉంది.అవతలివారిని బాధపెట్టే సందర్భంలో...మన మాటల వల్ల మనకి కానీ, ఎదుటివారికి కానీ ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయేమో ఆలోచించి మాట్లాడాలి. ఎదుటివారిని నొప్పించే సందర్భాలు ఉంటే అలాంటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది.మనసు బాగోలేనప్పుడు...అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ఒక్కోసారి అలవోకగా మాట్లాడే మనం మరికొన్నిసార్లు స్పష్టంగా మాట్లాడలేం. దీనికి కారణం మన మనసు బాలేకపోవడం, అలసిపోయి ఉండడం, ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆ సమయంలో మీరు కోపంగా, ఆత్రంగా మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మాట్లాడే ముందు కొన్ని క్షణాలు ఆలోచించడం మంచిది. -
నో గాసిప్స్ ప్లీజ్! ఎవరైనా గాసిప్ ప్రారంభించగానే.. ఇలా చేయండి!
మనం జీవితంలో రెండు విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటిలో చాడీలు చెప్పడం ఒకటైతే నిందలు వేయడం రెండోది. ఎదుటి వ్యక్తి గురించి చాడీలు చెప్పినా, నిందలు వేసినా.. మనం దిగజారిపోయినట్టే! కనుక మనం మాటను ఆచితూచి ఉపయోగించాలి లేదంటే చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే! మన స్నేహితులతోనో, బంధువులతోనో, సన్నిహితులతోనో మాట్లాడేటప్పుడు మన దగ్గర లేని వ్యక్తి గురించి ఏది పడితే అది మాట్లాడటం మంచిది కాదు. ఇలాంటి ధోరణి హత్యతో, అత్యాచారంతో సమానమని, ఇతరుల గురించి విపరీతంగా అసూయపడే వారే ఇలాంటి ఇచ్చకాల మాటలకు పాల్పడుతుంటారని రామాయణం, మహాభారతంతో సహా పురాణాలన్నీ నొక్కి చె΄్పాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలూ ఈ ధోరణిని తీవ్రంగా ఖండించాయి. ఎటువంటి ఆధారం లేకుండా ఇతరుల దోషాలను, లోపాలను, తప్పిదాలను వేలెత్తి చూపిస్తూ మాట్లాడడాన్ని మహాపాపంగా బైబిల్ పరిగణించింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూప్రోత్సహించవద్దని, చేరదీయవద్దని గట్టిగా హెచ్చరించింది. ఇలా ఇచ్చకాలు మాట్లాడడాన్నే ఆంగ్లంలో గాసిప్స్ అని వ్యవహరిస్తారు. గాసిప్ మాట్లాడటం అంటే ఉత్తి పుణ్యానికి ఇతరుల మీద బురద చల్లడం, ఇతరుల ప్రతిష్టను, గౌరవ మర్యాదలను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం. ఇది సమాజానికి, వ్యక్తిగత జీవితానికి కూడా శ్రేయస్కరం కాదని మహాభారతంలో విదురుడు చె΄్పాడు. ఇతరుల గురించి పొరపాటున తప్పుగా మాట్లాడినప్పుడు వెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఒక్కటే దీనికి పరిహారమని బైబిల్ స్పష్టం చేసింది. ఇతరుల పరోక్షంలో వారి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి నరకాలకు వెళతాడని, హీనమైన జన్మ ఎత్తుతాడని మహాభారతం పేర్కొంది.కనుక పనికి రాని ఇచ్చకాలు ఎప్పటికీ ప్రమాదమే. అది సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. చెత్త ఆలోచనలు , చెత్త కబుర్లు మాట్లాడడం వల్ల అవి మనలోనిప్రాణశక్తిని హరించి వేయడమే కాకుండా మన జీవితంలో విలువైన సమయం వధా కావడానికి దోహదపడతాయి.పుకార్ల వల్ల చోటుచేసుకునే పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా,ప్రాణాంతకంగా ఉంటాయి. గాసిప్లో మునిగి తేలే వ్యక్తి ఎటువంటి దారుణానికైనా ఒడిగడతాడు. గాసిప్స్కు పాల్పడే వ్యక్తి తాను మానసికంగా చెడిపోవడమే కాకుండా, ఇతరులను కూడా మానసికంగా చెడగొడతాడు.అంతేకాదు అతను వ్యాప్తి చేసే పుకార్ల వల్ల సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ‘గాసిప్స్ వల్ల నిజం మరుగున పడిపోతుంది. అదొక కార్చిచ్చు లాంటిది. అది తన చుట్టూరా ఉన్న సమాజాన్ని దహించి వేస్తుంది. అది విషంతో సమానం.మనసులో ద్వేషాన్ని నింపుకున్న వాడే గాసిప్స్ను వ్యాప్తి చేస్తాడు. ఇటువంటి పనికిమాలిన కబుర్లు చెప్పడం ఎంత టైమ్ వేస్టో, వాటిని వినడం,ప్రోత్సహించడం కూడా అంతకన్నా ఎక్కువ టైమ్ వేస్ట్, ఇటువంటి వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. స్నేహితులు కానీ, బంధువులు కానీ ఇటువంటి గాలికబుర్లు చెప్పడంప్రారంభించగానే వాటిని తిరస్కరించడమో లేక వారిని ఆపు చేయడమో చేయాలి. లేదంటే అది కొన్ని సున్నితమైన గుండెల్ని బద్దలు చేయవచ్చు. మనసుల్ని, మనుషుల్ని కుప్పకూల్చవచ్చు. చివరకు మన వ్యక్తిత్వాన్నే సర్వనాశనం చేస్తుంది. నిస్సహాయుల్ని దారుణంగా దెబ్బతీస్తుంది’’ ఇటువంటి వ్యక్తుల్నిప్రోత్సహించే వారిని, చేరదీసే వారిని సైతం ఆ నీలినీడలు వెంటాడుతూనే ఉంటాయి.కేవలం మన పట్ల మనం మాట్లాడుకునే మాటలే ఎంతో ప్రభావం చూపిస్తే.. మరి మనం ఇతరుల జీవితాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను వారు లేనప్పుడు వారి గురించి మాట్లాడటం ఎంతటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించాలి.ఎవరైనా గాసిప్ ప్రారంభించగానే ఆ వ్యక్తి అంత హితమైన వ్యక్తి కాదని వెంటనే గ్రహించాలి. మనసు నిండా కుళ్లుతోనూ, అసహనంతోనూ, అంతకుమించిన అసూయతోను అలాంటి గాలిమాటలు చెబుతున్నాడని అర్థం చేసుకుని అటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వకపోవడం మంచిది. ఏది ఏమైనా, గాసిప్ మాట్లాడే వ్యక్తి తనను తాను దుర్మార్గుడిగా పరిచయం చేసుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. -
Beauty Tips: మార్కెట్లో దొరికే.. కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఇవే మేలు!
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం పొడిబారిపోవడం, కాంతి విహీనంగా మారడం సహజం. అయితే మార్కెట్లో దొరికే కెమికల్ప్రొడక్ట్స్ కంటే, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వాటితోనే చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి ఓట్మీల్, హనీ స్క్రబ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక అద్భుతమైన ఎక్స్ఫోలియేటర్. ఓట్స్ను పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి స్క్రబ్ లాగా అప్లై చేయాలి. ఇది చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేయడమే కాకుండా, తేనెలోని గుణాలు చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతాయి.ముఖానికి తక్షణ మెరుపును ఇవ్వడానికి పసుపు, కాఫీతో పాటు తేనె కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా, చర్మానికి మంచి తాజాదనాన్ని ఇచ్చి ఆరోగ్యకరమైన లుక్ను అందిస్తుంది.చాలామంది అరటిపండు తొక్కను పారేస్తుంటారు. కానీ, అరటిపండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై మెల్లగా రుద్దడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది ముఖానికి ఇన్స్టంట్గా ఒక సహజసిద్ధమైన మెరుపును ఇస్తుంది. -
ఫిట్నెస్... ఫర్ స్ట్రెస్!
గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్నెస్ ద్వారా ప్రభావం చూపిన అతి కొద్దిమంది వ్యక్తులలో మిళింద్ సోమన్ ఒకరు. చాలామందికి రిటైర్ మెంట్ తీసుకునే 60 ఏళ్ల వయసులో ఆయన యువతరానికి గొప్ప స్ఫూర్తిని ఇస్తూనే ఉండడం విశేషం.‘యూరప్ నుంచి ఆఫ్రికా దాకా 15 కి.మీ దూరం సముద్రంలో ఈత కొట్టాను. అదో అందమైన అనుభవం’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు మిళింద్ సోమన్. బాడీ ఫిట్నెస్తో దేశంలో తరచు చర్చనీయాంశం గా మారే ఏకైక సెలబ్రిటీ మిళింద్. తెరపై నటుడిగా ఆయన సినిమా ప్రేక్షకులకు మాత్రమే పరిచితులు కావచ్చు.. ఫిట్నెస్ ఐకాన్గా మాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి.సూపర్ మోడల్ టూ సూపర్ రన్నర్...ఆయన ప్రయాణం 1990లలో సూపర్ మోడల్గా నిలవడంతో మొదలైంది. ఆ తర్వాత జుర్మ్ , ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోవైపు దాదాపు పాతికేళ్లుగా రన్నింగ్ ట్రాక్ మీద సాటిలేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సుదూరప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అనూహ్యమైనప్రాంతాల్లో పరుగులు తీయడం ద్వారా ఫిట్నెస్కు సరికొత్త అర్థాన్ని చె΄్పాడు. చెప్పులు లేకుండా పరుగెత్తడంలో కూడా ఆయన పాపులర్.పింక్థాన్.. మహిళలకు ఇన్స్పిరేషన్ప్రస్తుతం దాదాపు ప్రతినగరంలో సర్వసాధారణంగా మారిన మారథాన్లు, ఫిట్నెస్ ఈవెంట్స్కు ఆయన దాదాపు దశాబ్దమున్నర క్రితమే రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి లేదని గమనించాక... మహిళల కోసం ప్రత్యేకించి ఒక ఈవెంట్ను రూపకల్పన చేయాలన్న ఆలోచనతో గత 2012లో, సోమన్, ఆయన భార్య అంకితా కోన్వర్లు కలిసి ప్రారంభించిన పింక్థాన్ ఈవెంట్ ప్రస్తుతం మన దేశంలోనే అతిపెద్ద మహిళల రన్నింగ్ ఈవెంట్ గా అవతరించింది.హిట్... ఫిట్... ఫీట్స్ ఎన్నో...50 ఏళ్ల వయసులో గత 2015లో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో జరిగిన ఐర¯Œ మ్యాన్ ట్రయాథ్లాన్ ఛాలెంజ్లో పాల్గొన్నాడు. 3.86 కిలోమీటర్ల ఈత, 180.25 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42.2 కిలోమీటర్ల పరుగును కలిపి... 15 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశాడు.2017లో ఫ్లోరిడాలో 3రోజుల పాటు జరిగిన, 517 కిలోమీటర్ల ట్రయాథ్లా¯Œ లో భాగంగా 10 కిలోమీటర్ల ఈత, 421 కిలోమీటర్ల సైకిల్, 84.4 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశాడు.సిక్స్ ΄్యాక్ కాదు... స్ట్రెస్ బ్యాక్ ముఖ్యంకండలు తిరిగిన శరీరం కన్నా తన దృష్టిలో ఫిట్నెస్ అంటే ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యమేనంటాడు సోమన్. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన అభి్రపాయం. ఎంతో డబ్బు వెచ్చించి జిమ్లకు వెళ్లడానికి బదులు పుష్–అప్స్ పుల్–అప్స్ వంటి సహజమైన బాడీ వెయిట్ వ్యాయామాలపై దృష్టి పెట్టాలని, స్వల్పకాలిక శిక్షణ కంటే రోజువారీ కదలికకుప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నాడు. సమతుల్యమైన, ΄ోషకాహారం కోసం ఇంటి భోజనానికేప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నాడు.30 రోజుల్లో 1500 కి.మీ. పరుగు తీయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.59 ఏళ్ల వయసులో ఐదు రోజుల్లో పూణే నుంచి వసాయి వరకు 240 కి.మీ. పరుగెత్తాడు. – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
పూజా సక్సేనా: జ్ఞాపకాల దారుల్లో...!
నగరాల్లోని వీధుల్లో నడవడం అనేది కళాత్మక ప్రయాణం కూడా! షాపులపై రంగు రంగుల అందమైన బోర్డులు కనిపిస్తాయి. రంగు వెలిసిన బోర్డులు కూడా కొత్త అందంతో వెలిగిపోతుంటాయి. ఈ అందాలకు పుస్తక రూపం ఇచ్చింది పూజా సక్సేనా.దిల్లీ, బెంగళూరు, కోల్కతాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల్లోని మూడు వందల సైన్బోర్డ్లపై ఫొటోబుక్ తీసుకువచ్చింది పూజ.దిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుతున్న రోజుల నుంచి పూజకు సైన్బోర్డ్లపై ఉన్న అందమైన అక్షరాలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను డిజైన్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టేలా చేసింది. యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్లో టైప్ఫేస్ డిజైన్ను స్టడీ చేసింది.ఈ ఫొటోబుక్లో దిల్లీకి ప్రత్యేక స్థానం ఉంది. మండీ హౌజ్లోని శ్రీరామ్ సెంటర్ నుండి పహర్గంజ్లోని ఇంపీరియల్ సినిమా థియేటర్ వరకు సైన్బోర్డ్లపై ఎన్నో భాషలలో అందమైన, అద్భుతమైన అక్షర శైలులు!దురదృష్టమేమిటంటే... దిల్లీలో కనువిందు చేసే అలనాటి సైన్బోర్డ్లు క్రమంగా మాయమవుతున్నాయి.సైన్బోర్ట్ల కోసం వీధులు చుట్టి రావడమే కాదు పాత ఆర్కైవ్స్ నుంచి ఫొటోలను సేకరించడం ప్రారంభించింది పూజ. ఆ ఫొటోలలో అలనాటి అందమైన సైన్బోర్ట్లు ఎన్నో కనిపిస్తాయి.ఫ్యూచర్ డాక్యుమెంటేషన్లో భాగంగా భువనేశ్వర్, సౌత్ గోవా, కోయంబత్తూరు, మీరట్... లాంటి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటోంది పూజా సక్సెనా. -
పిల్లల డ్రీమ్ హౌజ్..!
పిల్లలతో ఊహాశక్తి, బాధ్యత, అలంకరణ పట్ల అభిరుచిని పెంచేది వారి డ్రీమ్ హౌస్. అందులో గోడలు, ఫర్నిచర్, వాతావరణం.. ప్రతిదీ పరిచయం చేయవచ్చు. పిల్లల్లో వచ్చే సృజనాత్మక ఆలోచనలకు మీరే ఆశ్చర్యపోతారు.వెల్కమ్ చెప్పే డోర్..మన ఇంటి తలుపు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఆహ్వానించేలా ఉండాలి. దాంతోపాటు మెయిన్ డోర్ ఎలా ఉండాలో చూపమనండి.లివింగ్ – డైనింగ్..కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని ఆనందించే ప్రదేశం, అందరూ కలిసి భోజనం చేసే చోటు ఎలా ఉంటే వారికి నచ్చుతుందో చెప్పమనవచ్చు. గది గోడల రంగు, లైటింగ్, వాల్ పేపర్స్ .. ఇలా ప్రతిదీ క్రియేటివ్గా వారి మైండ్లో నుంచి వచ్చినదై ఉండాలి. రంగులు మన మూడ్ను ఏ విధంగా మార్చుతాయి... ఎక్కువ వస్తువులు కాకుండా ఇంటిని నీటుగా ఎలా సర్దుకోవడం, ప్రతి వస్తువు ఉపయోగం.. ఇలా ప్రతిదీ పాఠమే అవుతుంది.‘పిల్లలను ఇంటి బొమ్మ డ్రా చేయమని సాధారణంగా అడుగుతుంటాం. వాళ్లు ఒక ఇంటి రూపాన్ని డ్రాయింగ్ చేసి చూపుతారు. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా వారి డ్రీమ్ హౌజ్.. దానితో పాటు కిచెన్, బెడ్రూమ్, లివింగ్, స్టడీ రూమ్, రంగులు, ఆర్కిటెక్చర్, అలంకరణ, ఇండోర్– ఔట్డోర్ మొక్కలు... ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎలా ఉండాలో చెప్పమనవచ్చు. డ్రా చేసి చూపమనవచ్చు. ఇల్లు.. పిల్లల్లో ఎన్నో క్రియేటివ్ ఐడియాలకు రూపకల్పన ఇస్తుంది. వారి క్రియేటివ్ ఐడియాలను మాకు పంపించండి. మెయిల్ ఐడి : sakshisummerkids@gmail.com- గీతాభాస్కర్, నటి, ఆర్ట్ టీచర్బెడ్రూమ్ – చదువుకునే ప్లేస్పిల్లల గది ఆలోచనల పుట్టకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ల చెప్పిన విధానం, డ్రాయింగ్లో చూపిన విధానం.. వారికి పదే పదే గుర్తుకు వస్తుంది. దీని వల్ల గదులను శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు అవుతుంది. కాంతి ఎక్కువగా, ప్రశాంతంగా ఉండాలి. ప్రతిరోజూ ఒకే దగ్గర, ఒకే సమయంలో చదువుకోవడం అలవాటుగా మార్చుకుంటే ఏకాగ్రత క్రమశిక్షణ అలవడతాయి. రీడింగ్ ప్లేస్ను ఎలా ఉంచుకోవాలో బాధ్యత పెరుగుతుంది.మొక్కలు – అలంకరణ..ఇండోర్ ΄్లాంట్స్ అమర్చితే ఇల్లు జీవకళతో ఆకట్టుకుంటుంది. ప్రకృతిపట్ల ప్రేమ పెరుగుతుంది. ఇంటి లోపల పెంచే మొక్కలు ఎన్ని రకాలు, వాటికి గాలి, వెలుతురు, నీరు .. ఎంతవరకు అవసరమో తెలుసుకుంటారు. మన జీవనానికి ఉపయోగపడే వాటి గురించి కొత్తగా ఆలోచించగలుగుతారు.‘నీ గది ఎలా ఉండాలని అనుకుంటావు? ఏ రంగు అయితే బాగుంటుంది?’, ‘‘పుస్తకాలను ఎలా సెట్ చేద్దాం?,’ ‘చిన్నమొక్కలు ఎక్కడ పెడతావు..’ ఇలా అడిగితే వాళ్లు తమ చిన్న చేతులతోనే చేసి చూపుతారు. ప్రేమ, పరిశుభ్రత, ప్రశాంతత ఉన్న ఇల్లు నిజమైన డ్రీమ్ హౌస్ అంటూ ఒక వ్యాసం రాసి చూపమనవచ్చు.నిర్వహణ : నిర్మలా రెడ్డి -
ఏ దేవుడిని ఎప్పుడు ధ్యానించాలి?
ఎన్నో దేవతా స్తోత్రాలున్నాయి. ప్రతిదీ నిత్యం పారాయణ చేయాలని చె΄్తారు. కానీ రోజూ అన్ని పారాయణ చేయడం సాధ్యం కావడం లేదు. మరి వాటిని నిత్యపారాయణ చేయకపోవడం పాపం కదా? పైగా ఇన్నిన్ని స్తోత్రాలు ఎందుకు? – ఆర్. కౌసల్య, చిలకమర్రి, నల్గొండ జిల్లాజ: అన్ని స్తోత్రాలు పారాయణ చేయడం నిత్యమూ సాధ్యం కాదు. అలాగని అవి ఎందుకు? అని ప్రశ్నించరాదు. బజారులో బోలెడన్ని కూరగాయలుంటాయి. అన్నీ రోజూ తినలేం. అలాగని ఇన్నిన్ని ఎందుకు? అంటామా?ఎవరి అవకాశాన్ని, అభీష్టాన్నీ బట్టి నిత్యం సాధ్యమైన వాటినే అనుష్ఠించవచ్చు. రోజూ విందుభోజనం చేయలేం కదా! ఏ పండగకో పబ్బానికో విందునారగించినట్లు తీరిక దొరికిన వేళ సావకాశంగా స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు. ఏదేమైనా – ఆనందంగా భక్తిగా వాటిని పఠించాలే తప్ప, తప్పనిసరి కృత్యంగా మొక్కుబడి వ్యవహారంగా తలచరాదు.నిత్యం మన అవకాశాన్ని బట్టి ఆహారం తిన్నట్లే, స్తోత్రమో, జపమో పరిమితమైన అనుష్ఠానం అవసరం. ఆయా దేవతలకి నిర్దేశించిన వారాలలో, తిథులలో, పర్వదినాలలో ఆయా స్తోత్రాలను నిదానంగా పఠించుకోవచ్చు. ఔషధశాలలో మందుల వలె వివిధ ప్రయోజనాలకోసం, వివిధ స్తోత్రాలుంటాయి. కొన్ని ఆరోగ్యం కోసం, కొన్ని దారిద్య్ర నివారణ కోసం...ఇలా! వాటిని ఆయా లక్ష్యాల సిద్ధికోసం వినియోగించుకోవచ్చు.ఏ దేవుడిని ఎప్పుడు ధ్యానించాలి? – గుంటుక శకుంతల, హైదరాబాద్ఉదయం వేళ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు గనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్యజీవితం సాఫీగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో శివుని స్మరించాలి. అలాచేస్తే మన నిత్యజీవితంలో సమతుల్యత లభిస్తుంది.హర శబ్దానికి హరించువాడని అర్ధం ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాల్ని అన్నింటినీ హరింపచేస్తాడు. ‘‘ప్రదోషే హరిం న పశ్యాత్ నృసింహం రాఘవం వినా’’ విష్ణువు నృసింహావతారం ఎత్తింది సాయం సంధ్యా సమయంలోనే గనుక నృసింహునకు మినహాయింపు. ఇక రాముని విషయానికొస్తే ‘రమయతీతి రామః’’ – ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాముని ఎల్లవేళలా స్మరించవలసిందే.పక్షానికి ఒకసారి సంభవించే మహాప్రదోష కాలంలో శివదర్శనం, శివనామ జపం మనకు అమిత ప్రయోజనకరం. -
మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్పర్ట్ రేంజ్కి..!
జీవితం ఎలాంటిదంటే... ‘ఏమీ లేదు’ అని నిరాశతో అనుకుంటే... ఏమీ ఉండదు! ‘చాలా ఉంది’ అని ఆశాభావంతో అనుకుంటే... చాలా ఉంటుంది!! పగవాడికి కూడా ఇలాంటి పేదరికం వద్దు అనుకునే కటిక పేదరికంలో పుట్టిన షహీనా అత్తర్వాలా ఎప్పుడూ ఆశాభావంతో ఉండేది. ఆ ఆశాభావమే ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. మురికివాడ నుంచి ప్రసిద్ధ కంపెనీలలో ఏఐ ఎక్స్పర్ట్గా పనిచేసే స్థాయికి తీసుకెళ్లింది. పేదింటి అమ్మాయిల చదువు కోసం వివిధ రూపాల్లో తన వంతుగా కృషి చేస్తోంది.ఉత్తర్ప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించింది షహీనా అత్తర్వాలా. ఆమె కుటుంబం బతుకుదెరువు కోసం ముంబైకి వచ్చింది. షహీనా తండ్రి చదువుకోలేదు. చిన్నాచితకా పనులు చేస్తూ బతుకుబండిని నడిపేవాడు. షహీన కుటుంబం ముంబైలోని దర్గా గల్లీ మురికి వాడలోని ఒక గుడిసెలో నివసించేది. దురదృష్టవశాత్తు ఆ గుడిసె కొన్నిరోజులకు అగ్ని ప్రమాదానికి గురైంది. సామాన్లు, ఉన్న కాస్తో కూస్తో డబ్బూ బూడిదయ్యాయి. ఆ తరువాత షన కుటుంబం ఒకచోటు నుంచి మరోచోటుకు మారుతూ ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బతికేది.ఒక కల అలా మొదలైంది...పేదరికం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కుమార్తె చదువు విషయంలో తండ్రి నిర్లక్ష్యం వహించేవాడు కాదు. షహీనాను సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చేర్పించాడు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకుంది. తన ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది మహిళలు నిస్సహాయంగా పురుషులపై ఆధారపడడాన్ని షన గమనించేది. ఆమె దృష్టిలో వారు బతుకుతున్నారు. అంతే! వారిలా తాను ఇతరులపై ఆధారపడకుండా స్వంత కాళ్లపై నిలబడాలంటే బాగా చదువుకోవాలనుకుంది.అప్పు చేసి కంప్యూటర్ కోర్స్లో...సెయింట్ జోసెఫ్లో నీడిల్ వర్క్ లేదా కంప్యూటర్ ఆప్షన్ ఉండేది. షహీనాకు కంప్యూటర్లపై ఆసక్తి. అయితే తగిన మార్కులు లేకపోవడంతో ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ఆ నిరాశలో... ‘ఇంటర్మీడియెట్ తరువాత కంప్యూటర్ కోర్స్లో చేరవచ్చా?’ అని ఎవరినో అడిగితే... ‘చేరవచ్చు’ అన్నారు. ‘అప్పటి వరకు ఓపిక పట్టాలి. తప్పదు’ అని తనకు తాను చెప్పుకుంది.షహీనాను కంప్యూటర్ కోర్సులో చేర్పించడానికి తండ్రి అప్పు చేశాడు. కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసిన తరువాత ఆ ఇన్స్టిట్యూట్లోనే ఇన్స్ట్రక్టర్గా పనిచేసింది షన. ఆ తరువాత... బుక్మై షో, షాదీ.కామ్, విగ్జో, జూమ్కార్లలో పనిచేసింది. 2020 సంవత్సరం షన ఉద్యోగ జీవితంలో కీలక మలుపు. ఆ సంవత్సరం మైక్రోసాఫ్ట్ డిజైన్ టీమ్లో చేరింది. డిజైన్ మేనేజర్ స్థాయికి చేరింది. డిజైన్ మేనేజర్గా ఎమర్జింగ్ మార్కెట్ టీమ్ కోసం డిజైన్ అండ్ రీసెర్చ్కు నాయకత్వం వహించింది. కొంత కాలం తరువాత ‘సేల్స్ఫోర్స్’లో ప్రిన్సిపల్ డిజైనర్గా చేరింది. సేల్స్ క్లౌడ్ కోసం జెన్–ఏఐప్రాజెక్ట్లకు నాయకత్వం వహించింది. అలా పని చేస్తూనే కామర్స్లో డిగ్రీ చేసింది. ఆ తరువాత లా చేసింది.మురికివాడ వదిలి...2021లో ముంబైలో తాను ఉంటున్న మురికివాడను వదిలి సొంత అపార్ట్మెంట్లోకి మారింది షన. నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ ఇండియా’లో తాను చాలాకాలం పాటు నివసించిన దర్గా గల్లీ మురికి వాడను చూసింది. ఆ సిరీస్లో చూపించిన ఇళ్లలో ఒకటి తనదేనని సోషల్ మీడియాలో ΄ోస్ట్ చేసింది. తాము అక్కడ నివసించే రోజుల్లో పబ్లిక్ టాయిలెట్లు అత్యంత మురికిగా ఉండేవని, ఆ అపరిశుభ్రమైన టాయిలెట్లకు వెళ్లకుండా ఉండేందుకు చెత్తకుప్పలను బహిరంగ మలవిసర్జన కోసం ఉపయోగించేవారని, ఈ మురికివాడ నుంచి సౌకర్యవంతమైన జీవితంలోకి రావడానికి తన కఠిన శ్రమ, పట్టుదల కారణం అయ్యా యంటూ తన ΄ోస్ట్లో తెలియజేసింది. తన గెలుపు పాఠమే... వారికి పాఠం‘కష్టపడ్డాను. జీవితంలో పైకి వచ్చాను. ఇక చాలు’ అనుకోలేదు షన. పేద పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వారికి నా వంతుగా ఏదైనా చేయాలనుకుంది. నిరుపేద బాలికలకు చదువుప్రాముఖ్యతను తెలియజేస్తోంది. తన గెలుపు పాఠాన్నే వారికి పాఠంలా చెబుతోంది. సాంకేతిక విషయాలపై వారికి శిక్షణ ఇస్తోంది. బాలికల విద్యకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక బాలిక చదువు కోసం క్రౌడ్ఫండింగ్ ద్వారా సహాయం చేసింది. ఆమె సహాయం చేసిన బాలిక ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్సెస్ చదువుతోంది.ఇప్పటికీ భయంగా, బాధగా ఉంటుంది!ముంబై మురికివాడలో మేము నివసించిన పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ భయంగా, బాధగా ఉంటుంది. అది అత్యంత కఠినమైన జీవితం. లింగ వివక్ష నుంచి లైంగిక వేధింపుల వరకు ఎన్నో చూశాను. ఈ నేపథ్యంలో నేను ఒక కొత్తజీవితం కోసం కల కన్నాను. ఆ కలను నిజం చేసుకోవడానికి కష్టపడ్డాను. అడుగడుగునా తల్లిదండ్రులు నాకు అండగా నిలవడం నా అదృష్టం. – షహీనా అత్తర్వాలా -
అలా చేస్తే భూమితల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది!
భూమి సూర్యుడి చుట్టూ, తన చుట్టూ తనే తిరుగుతూ ఉంటుంది. ఎంత తిరిగినా మనల్ని పడిపోకుండా నిలబెడుతుంది. మనం జీవించడానికి గాలి, నీళ్లు, వెలుగు ఫ్రీగా ఇస్తుంది. మన జీవనానికి ఎంతో మేలు చేస్తున్న నేల తల్లిని రోజూ ఉదయం నిద్ర లేవగానే తాకి, కళ్లకు అద్దుకుంటే మనలో ఎంతో ప్రేమ, బాధ్యత కలుగుతాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడో అగ్నిపర్వతాలు పేలుతుంటాయి. సునామీలు వస్తుంటాయి. కానీ, ఇక్కడ మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచుతుంది.నిర్లక్ష్యం తగదుభూమి మనకు రోజులో 24 గంటల సమయం ఇచ్చింది. సగం వెలుతురు, సగం చీకటి. వెలుగులో పని చేసుకోవాలి, చీకటిలో విశ్రాంతి తీసుకోవాలి. ఎంతో జీవరాశికన్నా మనకు మంచి ఆలోచనలు ఇచ్చింది. తినడానికి, ఉండటానికి ఎంతో మంచిని ఇచ్చిన భూదేవిని మనం ఎంత బాగా చూసుకోవాలి. కానీ, మనలో చాలా మంది ఏం చేస్తారు, భూమి మీద ఉమ్మివేస్తారు, కాళ్లతో తన్నుతుంటారు, చెత్త పడేస్తుంటారు.. చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. మనకు భూమి మీద ఉండే అవకాశాన్ని, హాయిగా తిరిగేలా సంతోషాన్ని ఇస్తున్న భూమిని శుభ్రంగా ఉంచుతూ, మనం కూడా మంచి చేస్తూ ఉంటే భూమితల్లి సంతోషిస్తూ, మనల్ని ఆశీర్వదిస్తుంది.సరిపడే కాంబినేషన్మన చుట్టూ ఎంత నీటుగా పెట్టుకుంటామో అంత మంచిని తిరిగి ఇస్తుంది భూమితల్లి. చెట్లు మనకు ఆక్సిజన్ని ఇస్తాయి, మనం వాటికి కార్బన్డై ఆక్సైడ్ను ఇస్తాం. ఉత్తర దక్షిణ ధ్రువాలు ఎప్పుడూ కలవవు. అలాగే అందరూ భిన్నంగా ప్రవర్తిస్తారు. కానీ, ఒకదాని నుంచి ఒకటి సాయం పొందుతూ కలిసి మెలిసి ఉంటాయి. ఇచ్చి పుచ్చుకోవడం అనే కాంబినేషన్ మన చుట్టూతా ఉంది. ఒక చెట్టు పువ్వు, కాయ, పండు ఇస్తుంది. మనం కూడా మన చుట్టూ ఉండేవారికి మనలోని మంచి పువ్వులను, ఫలాలను ఇవ్వాలి.ఆనందమే బహుమతిసూర్యోదయం వేళలలో పక్షుల కిలకిలారావాలు వినిపిస్తాయి. మొక్కలు రంగు రంగుల అందమైన పువ్వులను ఇస్తాయి. చెట్లు నీడను ఇస్తాయి. వర్షం పడితే నేల నుంచి మంచి వాసన వస్తుంది. ఇవన్నీ భూమాత మనకు ఇస్తున్న చిన్న చిన్న బహుమతులు. మన అమ్మ మనల్ని ప్రేమగా చూసుకుంటుంది కదా, అలాగే భూమాత కూడా ఎలాంటి ఫలితం ఆశించకుండా మనందరినీ చూసుకుంటోంది. చిన్నవాళ్లమా, పెద్దవాళ్లమా అని కూడా చూడదు. ప్రతి జీవికీ ఈ భూమ్మీద చోటు ఇచ్చింది. పక్షులకు గూళ్లు, జంతువులకు అడవులు, మనుషులకు ఇళ్లు.. అన్నీ భూమాత ఒడిలోనే ఉన్నాయి. ఇన్ని ఇస్తున్న భూమాతకు మనం తిరిగి ఏం ఇస్తున్నాం ∙మొక్కలను నాటి, సంరక్షించాలి. చెట్లను కాపాడుకోవాలి ∙ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి ∙నీటి వృథాను అరికట్టాలి. భూమితల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనమూ బాగుంటాం అనే ఆలోచనను చేయాలి. ఎంతో నేర్చుకునే అవకాశం ఇస్తున్న భూమిని మనం ఎలా చూసుకోవాలో మీ ఆలోచనల ద్వారా చూపండి. ధన్యవాదాలు చెబుతూ బాధ్యతగా నడుచుకుంటే ఎన్నో ఆనందాలను మనం అందుకోవచ్చు. ఈ విధంగా చెబితే పిల్లలు మరింతగా భూమితో కనెక్ట్ అవుతారు. ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు.. అనేవి తమ సృజనతో పెద్దలకే పాఠాలు చెబుతారు.నిర్వహణ: నిర్మలారెడ్డిసినీ దర్శకుడు, నటుడు తరుణ్భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ (Dhaassyam Geetha Bhascker) ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ‘ఫైవ్ ఎలిమెంట్స్’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన.. ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్ ఐడి sakshisummerkids@gmail.com -
పండ్లు ఎప్పుడు తినాలి?.. భోజనం తరువాత? ముందా?
పండ్లు, కాయగూరలు నిత్యం తినడం ఆరోగ్యానికి మంచిదని వింటూనే ఉంటాం. మనలో చాలామంది ఆరోగ్య సంరక్షణ కోసం తింటూ ఉంటారు కూడా. అయితే సాధారణంగా భోజనం తరువాత పండ్లు తింటూంటాం మనం. ఇది ఆరోగ్యానికి మేలు చేయదంటోంది తాజా అధ్యయనాలు. ఇలా ఎందుకు? ఎప్పుడు తినాలి? అన్నది బెంగళూరులోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ మాటల్లో...చీకటిపడగానే నిద్ర... కడుపు ఖాళీ అవుతూండగానే ఆకలి అన్నది ప్రకృతి ద్వారా మనకు సహజసిద్ధంగా అందిన లక్షణాలు.. ఇలా కాకుండా.. పగలు నిద్రపోయినా.. ఇష్టానుసారం తిన్నా అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది. ఇది పండ్ల విషయంలోనూ వర్తిస్తుంది. భోజనం తరువాత లేదా భోజనంతో కలిపి తినడం వల్ల పండ్లు ఆరోగ్యాన్ని ఇవ్వవు. ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పండ్లలో మనకు ఉపయోగపడే ఎంజైమ్లు.. బొప్పాయిలోని పపెయిన్, అనాసలోని బ్రోమలీన్ వంటివి ఖాళీ కడుపులోనే బాగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థలో ఇతర ఆహార పదార్థాలు ఏవి ఉన్నా.. ఈ ఎంజైమ్లు శరీరానికి ఒంటబట్టడం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం తరువాత పండ్లు తింటే.. ఈ ఎంజైమ్లు వెనుకబడిపోతాయి. తేలికగా జీర్ణమయ్యే చక్కెరలు మాత్రమే శరీరానికి ముందుగా అందుతాయి. అందుకే కడుపారా భోంచేసిన తరువాత రక్తంలోని చక్కెర స్థాయులు హఠాత్తుగా పెరిగిపోవడం. ఈ క్రమంలో ప్రొటీన్లు, కొవ్వుల తరువాత మాత్రమే ఎంజైమ్లు జీర్ణమవుతాయి. ఫలితంగా ఇవి చిన్న పేవుల్లోకి చేరే ముందే (పోషకాలన్నీ శరీరానిక అందేది ఇక్కడి నుంచే) పులిసిపోయి పనికి రాకుండా పోతాయి.తరుణోపాయం...భోజనం తరువాత పండ్లు తీసుకోవడం సరికాదన్నది స్పష్టం. మరి ఎప్పుడు తీసుకోవాలి? ఉదయాన్నే పరగడుపున మంచిది అంటోంది యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం. ఇలా చేస్తే... రక్తంలో చెక్కర మోతాదు కూడా ఎక్కువగా పెరగలేదని ఈ అధ్యయనం తెలిపింది. అలాగే ఒక పండును ఉదయం తిన్నప్పుడు రక్తంలో విటమిన్ సి, కరొటనాయిడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నాయని, అదే పండు సాయంకాలం తిన్నప్పుడు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈ అధ్యయనం తెలిపింది.ఇంకోలా చెప్పాలంటే నిద్రకు సమయం ఉన్నట్టే పండ్లు తినేందుకు మంచి సమయం ఒకటి ఉందన్నమాట. ఉదయం పూట తిన్నప్పుడు పండ్లలోని ఫ్రక్టోస్ (ఒకరకమైన చక్కెర) మెరుగ్గా జీర్ణమవుతుంది. దీనికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు గ్లైకోజెన్ గురించి అర్థం చేసుకోవాలి. కాలేయంలో ఉంటుంది ఈ పదార్థం. రాత్రిపూట బాగా తగ్గిపోతుంది. శరీరానికి అవసరం కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకోవాలి. ఉదయం పూట తినే పండ్లతో లభించే ఫ్రక్టోస్ను నేరుగా గ్లైకోజెన్గా మార్చేస్తుంది కాలేయం. కావాల్సినంత గ్లైకోజెన్ ఉంటే మాత్రం కాలేయం ఫ్రక్టోస్ను కొవ్వుగా మార్చేస్తుంది. అదన్నమాట విషయం. కాబట్టి ఇకపై పరగడుపునే కాసిన్న పండ్లు మీ పొట్టలోకి పడేశారనుకోండి... చక్కటి ఆరోగ్యం మీ సొంతమయ్యే అవకాశం ఎక్కువవుతుంది.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, గెలుస్తూ ఉండటం అనుకుంటారు. కానీ నిజమైన పర్సనాలిటీ గ్రోత్.. మీరు కింద పడ్డప్పుడు ఎంత వేగంగా లేచి నిలబడతారో, అందులోనే ఉంది. సైకాలజీలో దీనినే 'Resilience' అంటారు.1. Resilience అంటే ఏమిటి?మనిషి జీవితంలో ఎప్పుడూ 'హ్యాపీగా' ఉండలేడు. ఓటములు, అవమానాలు, గాయాలు అనేవి రాక మానవు. కానీ, అక్కడే ఆగిపోకుండా, మనల్ని మరింత పవర్ఫుల్గా మలిచే శక్తి Resilience (పునరుద్ధరణ శక్తి).జీవితం అనేది ఒక సముద్రంలాంటిది, అలలు (సమస్యలు) వస్తూనే ఉంటాయి. రెసిలియన్స్ అంటే అలలను ఆపడం కాదు, ఆ అలల మీద సర్ఫింగ్ చేయడం నేర్చుకోవడం. ఇది ఒక టాలెంట్ కాదు, ఇది మనం ప్రాక్టీస్ చేసి పెంచుకోవాల్సిన ఒక 'మజిల్' (Muscle).* Fixed Mindset: "నేను ఓడిపోయాను, నా వల్ల కాదు" అని అనుకోవడం.* Growth Mindset (Resilience): "నేను ఓడిపోయాను, కానీ ఇది ఒక లెసన్. దీన్నుండి నేను ఏం నేర్చుకున్నాను?" అని అనుకోవడం.2. The 3 Pillars of Resilienceఒక వ్యక్తి కింద పడ్డా తిరిగి లేవాలంటే, అతని మైండ్సెట్లో ఈ మూడు ఉండాలి.* Acceptance: "ప్రస్తుతం నా జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితి ఉంది" అని ఆ వాస్తవాన్ని భయపడకుండా అంగీకరించడం.* Purpose: మీరు ఎందుకు బ్రతకాలి? మీ లక్ష్యం ఏంటి? మీకంటూ ఒక 'ఎందుకు' (Why) బలంగా ఉంటే, మీరు 'ఎలాంటి' (How) పరిస్థితినైనా దాటగలరు.* Adaptability: పాత పద్ధతులు పని చేయనప్పుడు, మూర్ఖంగా వాటినే పట్టుకోకుండా, కొత్త మార్గాలను వెతకడం.3. మోటివేషన్ మాయ vs నిజమైన దృఢత్వంమోటివేషన్ "ఎప్పుడూ గెలుస్తూనే ఉండు" అని చెప్తుంది. ఇది ఒక అబద్ధం, ఎందుకంటే గెలవకపోతే వారు కుంగిపోతారు.రెసిలియన్స్ "ఓడిపోవడం సహజం, కానీ ఆ ఓటమికి నీ జీవితాన్ని అప్పగించకు" అని చెప్తుంది. రెసిలియన్స్ ఉన్న వ్యక్తికి ఓటమి ఒక 'ఎండ్' కాదు, ఒక 'ఎపిసోడ్' మాత్రమే.4. రెసిలియెంట్ మైండ్సెట్ బిల్డింగ్Genius Matrix మోడల్ ఉపయోగించి, మీరు కూడా ఒక 'అజేయమైన వ్యక్తి'గా ఎలా మారాలి?Step 1: భయం బంధనాలను బ్రేక్ చేయండిఓడిపోతే ఏమవుతుందో అన్న భయం, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం.. వీటిని 'Break' చేయండి. ఓటమిని అవమానంగా కాకుండా, ఒక 'డేటా పాయింట్' (Data Point) లా చూడండి. మీరు ఎంత ఎక్కువ ప్రయోగాలు చేస్తే, అంత ఎక్కువ డేటా మీకు దొరుకుతుంది.Step 2: పోరాట పటిమ (Build)మీ రెసిలియెన్స్ను ఒక మజిల్ లాగా బిల్డ్ చేయండి. చిన్న చిన్న సవాళ్లను తీసుకోవడం ద్వారా మీ మెదడును ట్రైన్ చేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు "ఎందుకు నాకు ఇలా జరిగింది?" అని కాకుండా, "దీన్ని నేను ఎలా అధిగమించగలను?" అని అడగండి. మీ మైండ్ని 'Solutions' వైపు 'Build' చేయండి.Step 3: స్టాయిక్ మాస్టరీ ( Beyond)పరిస్థితులు మీ కంట్రోల్లో లేనప్పుడు, మీరు వాటికి ఇచ్చే 'రియాక్షన్' మీ కంట్రోల్లో ఉంటుంది. తుఫానులో కూడా ప్రశాంతంగా ఉండటమే 'Beyond' స్టేజ్. దీంతో మీరు అజేయంగా మారుతారు.5. మీ రెసిలియన్స్ స్కోర్ ఎంత?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.* మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతి పెద్ద ఓటమి ఏంటి?* ఆ ఓటమి మీకు నేర్పిన ఒకే ఒక్క ముఖ్యమైన పాఠం ఏంటి?* ఇప్పుడు ఆ ఓటమిని మీరు గర్వంగా (ఒక అనుభవంగా) చెప్పుకోగలరా?కింద పడటం ఒక కళ!బ్రో, కింద పడటం వల్ల కాదు, పడి అక్కడే ఉండిపోవడం వల్ల మీ వ్యక్తిత్వం దెబ్బతింటుంది. కింద పడి, దుమ్ము దులుపుకుని, నవ్వుతూ లేచి నిలబడటమే ఒక కళ (Art of Resilience). మీరు ఎంత బలంగా దెబ్బ తింటే, అంత బలంగా తిరిగి రాగలరు. ఇదే మీ Real Personality కి అసలైన కొలమానం."The greatest glory in living lies not in never falling, but in rising every time we fall." -Nelson Mandela-సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
వృద్దాప్యంలో యవ్వనం.. జపాన్ బామ్మల సరికొత్త రికార్డు
ప్రపంచంలోనే అత్యధికంగా దీర్ఘాయువు కలిగిన వారు ఉన్న దేశంగా జపాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. 2025 సెప్టెంబర్ నాటి గణాంకాల ప్రకారం జపాన్లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో లక్షకు (99,763 మంది) చేరుకుంది. ఈ వృద్ధుల జనాభాలో ఏకంగా 88 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. జపాన్ ప్రజల దీర్ఘాయువు రహస్యం.. వారి సంప్రదాయ ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమనే కాకుండా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.ఆహారం కంటే అలవాట్లే కీలకంఢిల్లీలోని సిటీ ఇమేజింగ్ అండ్ క్లినికల్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆకార్ కపూర్ అభిప్రాయం ప్రకారం, జపాన్ ప్రజల దీర్ఘాయువుకు కేవలం వారు తీసుకునే ఆహారం మాత్రమే కారణం కాదు. క్రమశిక్షణ, నిరంతరం యాక్టివ్ ఉండటం, సామాజిక అనుబంధాలతో కూడిన జీవన విధానం మొదలైనవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ‘మితంగా తినడం’ అంటే పొట్ట నిండక ముందే భోజనాన్ని ముగించడం (హరా హచి బు) వంటి పద్ధతులు శారీరక మెటబాలిక్ ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారానికి, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటం వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది.మహిళల దీర్ఘాయువు వెనుక..జపాన్ శతవృద్ధులలో 88 శాతం మహిళలే ఉండటానికి జీవశాస్త్రపరమైన, ప్రవర్తనాపరమైన పలు కారణాలు ఉన్నాయి. మహిళల్లో ఉండే 'ఈస్ట్రోజెన్' హార్మోన్ గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ కల్పిస్తుందని, కణాల వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తుందని డాక్టర్ కపూర్ వివరించారు. దీనితో పాటు మహిళలు తమ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా వారు కుంగుబాటు (Depression) వంటి సమస్యలకు దూరంగా ఉంటూ, యవ్వనవంతులుగా జీవిస్తున్నారని పరిశోధనల్లో వెల్లడయ్యింది.నివారణే శరణ్యంజపాన్ ప్రజల దీర్ఘాయువు వెనుక ఆ దేశ పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. ఆ దేశంలో వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, వ్యాధి రాకుండా చూసుకోవడానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ప్రభుత్వం అందించే సార్వత్రిక ఆరోగ్య కవరేజీతో సామాన్యులకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. రోజువారీ నడక, ఇంటి పనులు, హాబీలలో నిమగ్నం కావడం, బలమైన సామాజిక బంధాలు జపాన్ ప్రజల ఆయుష్షును పెంచుతున్నాయి.ఇది కూడా చదవండి: కేరళ అవియల్ తింటారా? లడక్ తుక్పా సిప్ చేస్తారా? -
స్టేటస్ ఏం చెబుతోందంటే..!
ఇటీవలి కాలంలో చాలామందికి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం ఒక అలవాటుగా మారిందనేకన్నా వ్యసనంగా మారిందనడం కరెక్టేమో! ప్రతి చిన్న విషయాన్నీ వెంటనే స్టేటస్లో పెట్టేస్తున్నారు. ఒకోసారి అవి చాలా సిల్లీగా అనిపిస్తాయి. అయితే అలా చీటికి మాటికీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం కూడా మామూలు విషయం కాదనీ, దీని వెనక కొన్ని మానసిక కారణాలుంటాయనీ సైకాలజిస్టులు చెబుతున్నారు. సోషల్ మీడియా పెరిగిన తర్వాత మనుషుల జీవితం పబ్లిక్గా మారింది. సంతోషం వచ్చినా, బాధ కలిగినా దాన్ని లోపలే ఉంచుకోలేరు. వెంటనే దానిని స్టేటస్గా పెట్టుకోవడమో ఫేస్బుక్లో పెట్టడమో చేస్తున్నారు. తమ భావోద్వేగాలన్నింటినీ ఇతరులు పంచుకుంటున్నారు అన్న భావనే వారికి ఊరట ఇస్తోంది. ఈ అలవాటు క్రమంగా అవసరంగా మారుతోంది.‘ఉనికి’ పాట్లుస్టేటస్కు వ్యూస్ వస్తున్నాయా, రిప్లై వచ్చిందా అన్నదే కొందరికి ముఖ్యంగా మారింది. ఇది ఒక విధమైన మానసిక ధోరణిగా నిపుణులు చెబుతున్నారు. వారి స్టేటస్ను చూసి ఎవరైనా స్పందిస్తే ‘నన్ను గమనిస్తున్నారు’ అన్న భావన వారికి సంతోషాన్నిస్తుంది.సమస్యేం కాదు కానీ... అప్పుడప్పుడు స్టేటస్ పెట్టడం సమస్య కాదు. కానీ ప్రతి భావాన్ని స్టేటస్ ద్వారానే చె΄్పాలి అన్న స్థితి వస్తే జాగ్రత్త అవసరం. నిజమైన సంభాషణ తగ్గి, వర్చువల్ స్పందనపై ఆధారపడటం మొదలైతే అది మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. సంతోషం, బాధ రెండింటికీ స్క్రీన్ మాత్రమే పరిష్కారం కాదు. కష్టసుఖాలలో తమకు తమకు తోడుగా ఉండే నిజమైన మనుషులే అసలైన పరిష్కారం అని గుర్తించాలి.అసలు ఉద్దేశ్యం అదీ...చాలా స్టేటస్లకు అసలు ఉద్దేశం అందరికీ చెప్పడం కాదు. తాము కోరుకునే ఒక ప్రత్యేక వ్యక్తి చూడాలి లేదా అర్థం చేసుకోవాలి అన్న కోరికే ప్రధాన కారణం. వారికి నేరుగా మెసేజ్ చేయలేక తమ ఫీలింగ్స్ను స్టేటస్ రూపంలో చెప్పే ప్రయత్నం ఇది. ఇది ‘ఇండైరెక్ట్ కమ్యూనికేషన్’ గా సైకాలజిస్టులు చెబుతున్నారు. -
వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?
చాలామంది కాఫీ తాగడం అనేదాన్ని ఒక అనారోగ్యకరమైన అలవాటుగానే భావిస్తారు. అయితే కాఫీ సేవనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాల్లో ఎక్కువ భాగం పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ల వల్లనే లభిస్తాయని, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని రిజిస్టర్డ్ డైటీషియన్, ఫుడ్ ట్రైనర్స్ వ్యవస్థాపకురాలు లారెన్ స్లేటస్ అంటున్నారు.ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవని, హిస్పానిక్ ఫుడ్ కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకురాలు సిల్వియా క్లింగర్ సైతం చెబుతున్నారు. శరీరంలోని అనేక విభిన్న అవయవాలకు మద్దతు ఇస్తుంది. కాఫీ అందించే ప్రధాన ప్రయోజనాలు.. ఓ ఆంగ్ల మీడియా వేదికగా వీరు చెబుతున్న ప్రకారం...–కాఫీ (Coffee) స్వల్పకాలిక ఏకాగ్రతకు సహాయపడటం తో పాటు దీర్ఘకాలంలో ఇది న్యూరోప్రొటెక్టివ్గా కూడా ఉంటుంది. చురుకుదనం, జ్ఞాపకశక్తి సహా మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు,డిప్రెషన్, పార్కిన్సన్స్ అల్జీమర్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. – కాఫీ తీసుకోవడం గుండె జబ్బులతో పాటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సమస్యల కారణంతో మరణించే ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.– కాలేయ వ్యాధి, ముఖ్యంగా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటివి నివారిస్తుంది. అలాగే కాలేయం, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.–కాఫీ తాగేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.కాఫీ మితంగా.. ప్రయోజనాలు అమితంగా...ఈ ప్రయోజనాలు లభించాలంటే మితమైన కాఫీ తీసుకోవడం అవసరం. అంటే షుమారుగా రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదు. అయితే ఈ పరిమాణం అనేది వ్యక్తుల్ని బట్టి వారి శారీరక స్థాయిలను బట్టి మారవచ్చు.– ఆరోగ్య ప్రయోజనాలను పెంచడానికి మూడు లేదా నాలుగు కప్పులు లేదా దాదాపు 300 నుంచి 400 మిల్లీగ్రాముల కాఫీ వరకూ ఓకే. దీని వల్ల హాని కంటే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఎక్కువ.– చాలా మంది విశ్వసించినట్టుగా కాఫీ డీహైడ్రేట్ చేయదు. కెఫీన్ తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉండి ఎక్కువగా మూత్ర విసర్జనకు కారణమవుతుంది. అయితే కాఫీలోని నీటి శాతం ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తుంది.–‘చక్కెర, ప్రాసెస్ చేసిన నూనెలు తీపి పదార్థాలు లాగా కాకుండా కాఫీ, దానికదే సహజమైనది, కల్తీ లేనిది, అందువల్లే పలు ప్రయోజనాలను కలిగి ఉంది. అదనపు కొవ్వు, కేలరీలు చక్కెరను జోడించడం కాఫీని అధిక కేలరీల పానీయంగా మారుస్తాయి. తద్వారా బరువు, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది.ఓట్ మిల్క్, సోయా మిల్క్, లాక్టోస్ లేని పాలు అయితే ఓకే. దాల్చిన చెక్క, వనిల్లా లేదా బాదం సారం, తియ్యని కోకో పౌడర్, స్టెవియా, మాంక్ఫ్రూట్ తక్కువ మొత్తంలో తేనె లేదా మాపుల్ సిరప్ వంటి సహజ పదార్ధాలను మేళవించవచ్చు. తక్కువ ఆమ్లత్వం, తియ్యని రుచిని కలిగి ఉండే కోల్డ్ బ్రూ కాఫీని ప్రయత్నించవచ్చు. బ్లాక్ కాఫీని తాగడం దుర్లభంగా భావించే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.కాఫీ తాగడానికి సరైన సమయం..?నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి, ఉదయం పూట కాఫీ తాగడం ఉత్తమం. ‘కాఫీకి ఎక్కువ అర్ధ–జీవితకాలం ఉంటుంది, అంటే‘ఇది చాలా మంది అనుకున్నదానికంటే ఎక్కువ కాలం మన శరీర వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత కాఫీని నిలిపివేయాలి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు సమయం సహజ కార్టిసాల్ కదలికలకు అంతరాయం కలిగించకుండా శక్తిని పెంచడానికి అనువైనది.చదవండి: కమిట్మెంట్ అంటే అది!వ్యాయామం (Exercise) చేసే ముందు కూడా కాఫీ తాగొచ్చు. ఎందుకంటే ఇది పనితీరు ఓర్పును మెరుగుపరచడంలో సహకరిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదు. ఇది కడుపులోని పొరలకు ఇబ్బంది కలిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఉబ్బరానికి దారితీస్తుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను కూడా పెంచుతుంది, ఈ సమస్యలను నివారించడానికి కాఫీ తాగే ముందు గుడ్లు, అవకాడో టోస్ట్, తృణధాన్యాలు వంటి అల్పాహారం తినాలి. అలాగే భోజనానికి ముందు కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఇది శరీరం ఇనుమును గ్రహించనీయకుండా ఆటంకం కలిగిస్తుంది.(గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం) -
స్కూళ్లలో ‘షుగర్ బోర్డులు’.. ఎందుకో తెలుసా?
సీబీఎస్ఈ బోర్డు మే 14న విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొన్నట్లు ఇతర రాష్ట్రాలతో పాటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళన్నిటిలో ‘షుగర్ బోర్డులు’ పెడుతున్నారు. పంచదార అధిక మోతాదులో ఉన్న జంక్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లలలో ఊబకాయం, మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరి గిన రీత్యా ఈ చర్య తీసుకున్నారు. ఇప్పటివరకు కొవ్వు ఆహారాల వల్లే జీవనశైలి (Life Style) వ్యాధులు వస్తున్నాయనీ, కొవ్వులు తగ్గించడమే సమస్యకు పరిష్కారమనీ తప్పుడు ప్రచారం తీవ్ర స్థాయిలో ఉంది. నిజానికి చక్కెర వాడకం అధికం కావడం వల్లే పిల్లలు రకరకాల రుగ్మతలకు గురవుతున్నారు. రోజువారీగా పిల్లలు తీసుకుంటున్న కేలరీలలో పంచదార (Sugar) నుండి వచ్చే కేలరీలు 5 శాతానికి మించకూడదు. మన పిల్లల ఆహారంలో 13 నుండి 15 శాతం (3 రెట్లు) కేలరీలు పంచదార నుండే వస్తున్నట్లు గుర్తించారు.2010లో ఢిల్లీ హైకోర్టులో ‘ఉదయ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసి జంక్ ఫుడ్స్ను నిషేధించ మనడంతో ఈ చర్చ ప్రారంభమయ్యింది. 2015లో కోర్టు ఇందుకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను రూపొందించమని వివిధ కేంద్ర పభుత్వ సంస్థలను ఆదేశించింది. 2013లోనే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి జంక్ ఫుడ్స్ అమ్మకాలను స్కూళ్ళలో నిషేధించమని అదే కోర్టు కోరింది. 2019లో తమిళనాడు ప్రభుత్వం జంక్ఫుడ్స్ను, కూల్డ్రింక్స్ను స్కూళ్ళలో నిషేధించింది. పంచదార దట్టించిన ఆహారాలు పిల్లలలో ఊబకాయం, మధుమేహాలనే గాక దంత క్షీణత, గుండె జబ్బులు, బీపీ, మతి మరుపు, మెదడు (Brain) పనితనం దెబ్బతినడం, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్లు అనేక పరిశోధనల్లో నిర్ధారణ అయింది.ప్రభుత్వాలు ప్రమాదకరమైన ఈ ఆహారాల తయారీని కట్టడి చేయాలి/నిషేధించాలి. పోషకాహార అంశాల్ని స్కూల్ సిలబస్లో భాగం చేయాలి. ఆహారం వండే వర్కుషాపులు కనీసం వారానికొకటి పిల్లలచే చేయించాలి. మన శరీరాలకు బయో క్లాక్ వుంది. హార్మోన్లు విడుదలయ్యే క్రమానికి అనుగుణంగా ఆహార వేళలు, నిద్ర వేళలు (Sleeping Hours) ఉండాల్సిన అవసరాన్ని చెప్పడమే గాదు, అమలుపరచాలి. ప్రతిరోజూ ఆటలకు, వ్యాయామానికి తగిన సమయం స్కూల్ టైమ్ టేబుల్లో కేటాయించాలి.చదవండి: మీ తియ్యని ప్రేమ తగ్గించండి!ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న వైద్యులుగా, పిల్లల సమగ్ర అభివృద్ధి పట్ల శ్రద్ధ ఉన్న వారిగా మేం ఈ విజ్ఞాపనను ముందు పెడుతున్నాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆరోగ్యకర పిల్లలతో కూడిన దేశ నిర్మాణం కోరే వారంతా మాతో గొంతు కలపాలని కోరుతున్నాం. – వైద్యులు, పిల్లల ప్రేమికులు -
బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. తెలిస్తే అసలు వదిలిపెట్టలేరు..
మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం.ఈ సంవత్సరం పోషకాహార మాసం యొక్క ఇతివృత్తం, “ఆహారం మనల్ని కలుపుతుంది,” బంధాలను నిర్మించడంలో ఆహారం యొక్క పాత్రను నొక్కి చెబుతుంది. బాదం, పండ్లు, తృణధాన్యాలు వంటి పోషకాలు-నిండిన ఆహారాలతో రోజును ప్రారంభించడం శక్తి శ్రేయస్సు రెండింటినీ పెంపొందిస్తుంది. జింక్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఇతో సహా 15 ముఖ్యమైన పోషకాలతో సుసంపన్నమైన కాలిఫోర్నియా బాదం, ఉదయం వేళ శక్తిని నింపడానికి మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఒక సులభమైన మార్గం.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR-NIN) కూడా భారతీయుల కోసం ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇది మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తినవలసిన నట్స్లో బాదంను ఒకటిగా గుర్తించింది. ప్రతిరోజూ బాదం తినడం బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడవచ్చు.ఫిట్నెస్ పట్ల తన అంకితభావానికి ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్, ఇలా అన్నారు, “నేను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడానికి ప్రాధాన్యత ఇస్తాను నా కుటుంబంలో కూడా దానిని ప్రోత్సహిస్తాను. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన రోజువారీ పోషణ పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం, కాబట్టి మేము ఏమి తీసుకుంటున్నామో నేను స్పృహతో గమనిస్తాను. గంటల తరబడి నాకు శక్తిని, సంతృప్తిని ఇచ్చే కాలిఫోర్నియా బాదం వంటి తేలికైన ఇంకా పోషకమైన వాటితో నా రోజును ప్రారంభించడానికి ఇష్టపడతాను. నేను ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా, చిరుతిండి కోసం ఒక చిన్న డబ్బాలో కాలిఫోర్నియా బాదంను తీసుకువెళ్తాను. అవి ఆకలిని నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా, నా రోజువారీ పోషక అవసరాలకు కూడా దోహదం చేస్తాయి. ఈ జాతీయ పోషకాహార మాసంలో, ప్రతిఒక్కరూ బాదం వంటి పోషకమైన ఆహారాలతో తమ రోజును ప్రారంభించాలని, మీ ప్రియమైనవారి ఆహారంలో కూడా వాటిని చేర్చాలని నేను ప్రోత్సహిస్తున్నాను”.జాతీయ పోషకాహార మాసంపై వ్యాఖ్యానిస్తూ, మాక్స్ హెల్త్కేర్, ఢిల్లీ, రీజనల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్, రితికా సమద్దార్, ఇలా అన్నారు, “ప్రజలు తమ ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకుని, స్పృహతో కూడిన ఆహార ఎంపికలు చేసుకోవాలని నేను కోరుతున్నాను. జంక్ ఫుడ్ వినియోగం పెరగడంతో, అన్ని వయసుల వారిలో ఆరోగ్య సమస్యలు కూడా పెరిగాయి. అందువల్ల మీ రోజువారీ ఆహారంలో బాదం వంటి పోషకమైన ఆహారాలను చేర్చుకోవడం చాలా అవసరం, ఎందుకంటే అవి బరువు, కొలెస్ట్రాల్, మరియు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి, తద్వారా మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. విటమిన్ B2, విటమిన్ E, మెగ్నీషియం, మరియు ఫాస్పరస్తో సమృద్ధిగా ఉండటం వల్ల, బాదం రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది”.న్యూట్రిషన్ మరియు వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి ఇలా అన్నారు, “మన జీవనశైలి మరియు ఆహార ఎంపికలు మధుమేహం, అధిక రక్తపోటు, మరియు ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఒక సులభమైన ఇంకా తరచుగా నిర్లక్ష్యం చేయబడిన అడుగు, మనం మన రోజును ఎలా ప్రారంభిస్తామనేది, ఎందుకంటే అది మన శక్తి మరియు ఏకాగ్రతకు పునాది వేస్తుంది. 15 ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్న బాదం వంటి పోషక-సమృద్ధి ఆహారాలను జోడించడం నిజమైన మార్పును తీసుకురాగలదు. ICMR–NIN క్రమం తప్పకుండా నట్స్ తినాలని సిఫార్సు చేస్తుంది, ఎందుకంటే ఇది గుండె మరియు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది మరియు మధుమేహం, ప్రీడయాబెటిస్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. బాదంతో రోజును ప్రారంభించడం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడమే కాకుండా, శరీరం యొక్క రోజువారీ పోషక అవసరాలను తీర్చడంలో కూడా సహాయపడుతుంది”.ఆయుర్వేద నిపుణురాలు మధుమిత కృష్ణన్ ఇలా అన్నారు, “ఆయుర్వేదం ప్రకారం, ధ్యానం రోజును ప్రారంభించడానికి ఒక ముఖ్యమైన మార్గం, కానీ ఆహారం కూడా అంతే ముఖ్యం, ఎందుకంటే అది మన శరీరం, చర్మం, మొత్తం ఆరోగ్యంపై ప్రతిబింబిస్తుంది. బాదం ఒక సాత్విక ఆహారంగా పరిగణించబడుతుంది, ఇది విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది, ఇవి చర్మాన్ని లోపలి నుండి పోషించడంలో సహాయపడతాయి. సిద్ధ వైద్యం కూడా, మధుమేహం వంటి దీర్ఘకాలిక, జీవనశైలి-సంబంధిత పరిస్థితుల నుండి వచ్చే బలహీనతను పరిష్కరించడంలో బాదం పాత్రను గుర్తిస్తుంది”.జాతీయ పోషకాహార మాసం ప్రతి ముద్దా ముఖ్యమేనని గుర్తు చేస్తుంది. ఈ సంవత్సరం, మొత్తం శ్రేయస్సులో పోషణ యొక్క కీలక పాత్రను గుర్తించడానికి కట్టుబడి ఉందాం. స్పృహతో కూడిన ఆహార ఎంపికలు చేసుకోవడం.. మన రోజువారీ ఆహారంలో బాదం వంటి పోషకమైన ఎంపికలను చేర్చుకోవడం ద్వారా, మనం శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండగలము. జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోగలము. -
జీవితం సాఫీగా సాగాలంటే ఎంత డబ్బు కావాలి?
ప్రతి మనిషికి సాధారణంగా జీవితం సాఫీగా సాగాలంటే ఎంత మొత్తంలో డబ్బు అవసరం అవుతుందోననే ప్రశ్న ఉంటుంది. ఒకవేళ పెళ్లి అయితే తన ఫ్యామిలీ ఆర్థికంగా భద్రంగా ఉంటుందా ఉండదా.. అనే సందేహంతో తన వద్ద ఎంత డబ్బు ఉంటే సరిపోతుందనే లెక్కలు వేసుకుంటారు. ప్రస్తుత లైఫ్స్టైల్, ఖర్చులు, ఇతర సౌకర్యాలకు కోటి రూపాయలు ఉంటే సరిపోతుందా.. లేదా రెండు కోట్లు కావాలా.. ఐదు కోట్లు కావాలా..? అనే ప్రశ్నలు వస్తుంటాయి. మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది కదా. ఒక్కొక్కరి అవసరాలు వారివారి జీవన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఎంతైనా సరిపోకపోవచ్చు..సాధారణంగా చాలామంది తమ లైప్ సెటిల్ కావాలంటే ఎంత మొత్తం డబ్బుకావాలో చెప్పమంటే రాండమ్గా తోచిన నంబర్లు చెప్పేస్తుంటారు. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. కొంతమందికి కోటి రూపాయలు ఉంటే వారి ఖర్చులు, అవసరాలు.. అన్నింటికీ సరిపోవచ్చు. ఇంకొందరికి రూ.10 కోట్లు ఉన్నా సరిపోకపోవచ్చు. ఎంత డబ్బు కావాలనేది కుటుంబ సభ్యులు, వారి అభిరుచులు, ఖర్చు నేపథ్యం, భవిష్యత్తు ప్రణాళికలను బట్టి ఆధారపడుతుంది.ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా..ఆధునిక సమాజంలో ఎంత డబ్బు సంపాదించిన మరింత ఆర్జించాలనే భావన వస్తుంది. కష్టపడి పని చేసి కొంత ఆదాయం సంపాదిస్తే, మరింత ఆదాయం కావాలనిపిస్తుంది. ఈ అంతులేని కోరిక వల్ల ఆందోళన, అసంతృప్తి ఎదురవుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అలా అని సంపాదన లేకుండా ఉండాలని వారు చెప్పడం లేదు. ఇలాంటి కోరికల వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం రాదు. కోరుకున్న జీవితాన్ని గడపడానికి వాస్తవంగా ఏమి అవసరమో తెలుసుకోవడం కీలకం. మీ నియమాలకు, ఖర్చులకు, భవిష్యత్తు ప్రణాళికలు, అత్యవసరాలకు, ఆరోగ్య సంరక్షణకు సరిపోయే డబ్బు సంపాదిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. కొంతమందికి సౌకర్యవంతమైన ఇల్లు, స్థిరమైన ఉద్యోగం, కుటుంబంతో వారాంతాల్లో ట్రిప్కు వెళ్లడం సౌకర్యంగా ఉంటుంది. ఇంకొందరికి ముందస్తు పదవీ విరమణ, ప్రయాణాలు చేయడం లేదా ఆర్థిక ఒత్తిడి లేకుండా సృజనాత్మక అభిరుచులను కొనసాగించాలనుకుంటారు.ముందుగా చేయాల్సింది..మొత్తంగా ఎంత డబ్బు సంపాదించాలనే దానిపై కాకుండా భవిష్యత్తులో ఎలాంటి జీవితం గడపాలనుకుంటున్నారు? అనే దానిపై స్పష్టత వస్తే ఎంత సంపాదించాలో తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు మీ సౌకర్యం, ఆరోగ్యం, సంతోషం కోసం రాజీపడని అంశాలు ఏమిటని గుర్తించాలి. ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి ఏవి దోహదం చేస్తాయో తెలుసుకోవాలి. కష్టపడే వయసులో సంపాదించే మొత్తాన్ని దుబారా ఖర్చు చేయకుండా, పొదుపు చేసి భవిష్యత్తులో జీవితం సాఫీగా సాగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అందుకు మెరుగైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
పల్లె జీవనం అంత వీజీ కాదమ్మా
జిమ్కు వెళ్లడం .. పెద్ద పెద్ద బరువులు ఎత్తడం.. పుషప్స్ తీయడం.. డంబుల్స్ లేపడం.. ఇవన్నీ కష్టమే కావచ్చు.. కానీ పల్లె జీవనం ఇంకా కష్టం.. రోజూ నీళ్ళబిందెలు మోయాలి. పాడి పశువులకు గడ్డి కోసి తీసుకురావాలి.. ధాన్యం బస్తాలు.. నెత్తిన పెట్టుకుని మోయాలి.. ఇంటి పని .. వ్యవసాయపనులు చేయాలి.. ఇదంతా అంత వీజీ కాదు.. జిమ్ములో కోచ్ సారధ్యంలో ఆయన సలహాల మేరకు బరువులు ఎత్తాలి .. కానీ గ్రామీణులు ఎలాంటి శిక్షణ.. నిపుణుల పర్యవేక్షణ లేకుండానే పెద్దపెద్ద బరువులు ఎత్తుతూ జీవనాన్ని భారంగా సాగిస్తుంటారు. వారి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్ ఒక మహిళకు పాదాభివందనం చేసారు.. పల్లె ప్రజల జీవన విధానం ఎంత కష్టమో తెలుసుకుని ఓ మహిళను అభినందించారు. వాస్తవానికి "పల్లెకు పోదాం" అనే ఒక రియాలిటీ షోలో భాగంగా 11 మంది బాలీవుడ్ మహిళా సెలబ్రిటీలు ఒక కుగ్రామంలో రెండు నెలలు ఉండాలి.. ఎలాంటి ఆధునిక సౌకర్యాలు లేకుండా కేవలం కనీస ప్రాథమిక సౌకర్యాల నడుమ రెండు నెలలు ఉండాలి. అందులో భాగంగా వారు గ్రామీణులతో మమేకమై వారు ఎలా జీవిస్తున్నారు.. వారి కష్ట నష్టాలూ ఏమిటి.. వారు జీవనం కోసం ఎలాంటి అవస్థలు.. ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడమే కాకుండా ఈ సెలబ్రిటీలు కూడా వాటిలో పూర్తిగా పాలుపంచుకోవాలి. ఈ కార్యక్రమానికి రణ్ విజయ్ సింఘా హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఈ కార్యక్రమం జీ టీవీలో ప్రసారం అవుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా జాకీష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్ కూడా మధ్యప్రదేశ్ లోని భములీయ గ్రామానికి వెళ్లారు. పల్లెవాసులతో కలగలిసి వ్యవసాయం.. పశుపోషణ ఇంకా పలురకాల పనుల్లో ఈ సెలబ్రిటీలు పాలుపంచుకోవడమే కాకుండా అక్కడ ఏదో ఒక పని చేయడం ద్వారా జీవన భృతిని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అయితే కృష్ణ ష్రాఫ్ మాత్రం తనకోసం సెలూన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పల్లెలో నడుస్తూ ఒక గ్రామీణ మహిళా నెత్తిన గడ్డిమోపు తీసుకువెళ్లడాన్ని చూసారు..Jackie Shroff’s daughterFunny as hell😂pic.twitter.com/YkwTCbcfe9— Kreately.in (@KreatelyMedia) August 24, 2025 తాను కూడా గడ్డిమోపును మోస్తానని చెబుతూ దాన్ని తన నెత్తిన పెట్టాలని కోరారు.. ఆ మహిళ ఆ మోపును కృష్ణ ష్రాఫ్ నెత్తిన పెడుతుంది. అయినా ఆ గడ్డిమోపు కృష్ణ ష్రాఫ్ నెత్తిన నిలవడం లేదు.. జారిపోతుంది.. రెండుసార్లు మళ్ళీ పెట్టినా అది జారిపోతూనే ఉంటుంది.. వెంటనే ఆ గడ్డిమోపును ఆ మహిళా అందుకుని తలపై పెట్టుకుని వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.. ఆ క్షణంలో కృష్ణ ష్రాఫ్ ఆ మహిళకు ఎదురెళ్లి.. ఆమె కష్టానికి, గడ్డి మోపు జారిపోకుండా ఉండేలా మోసుకెళ్తున్న తీరుకు అబ్బురపడుతూ ఆమెకు అభివందనం చేస్తుంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐంది... నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతూ కృష్ణ ను, ఆమె సంస్కారాన్ని అభినందిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న -
ట్రావెల్ థెరపీ.. ఒంటికి ఆరోగ్యం.. మనసుకు ఉత్సాహం..
ఒంట్లో బాలేనపుడు.. మనసుకు ముసురు పట్టినపుడు డాక్టర్లు రకరకాల చికిత్స విధానాలు చెబుతుంటారు.. వాటర్ థెరపీ.. ఫిజియోథెరఫీ. .. ఆయిల్ పుల్లింగ్ .. మడ్ బాత్.. ఇవన్నీ ఒకలాంటి థెరఫీలే.. ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా.. ప్రాణాయామం.. ఇలా రకరాలకు ఉంటాయి మరి.. ఎవరివీలును బట్టి వాళ్ళు ఆయా చికిత్సా విధానాలు పాటిస్తారు.. ఇయన్నీ ఒకెత్తు..ఒక్కోసారి.. మనసుకు ముసురుపడుతుంది.. ఎదురుగా ఏముందో కనిపించదు.. ఏం జరుగుతుందో వినిపించదు.. ఒక్కోసారి జీవితం చాన్నాళ్లుగా మూత విప్పని పచ్చడి బాటిల్ మాదిరి నిల్వ వాసన వస్తుంది.. కరకరలాడాల్సిన బిస్కెట్లు మెత్తబడినట్లు ఫీల్. .. జీవితం అంటే ఉద్యోగం.. వ్యాపారం.. తిండి.. నిద్ర.. అంతే ఉంటుంది.. ఎందుకు బతుకుతున్నామో తెలియదు.. అసలిది ఒక బతుకేనా అనే సందేహం.. జీవితం అనే బండి మనం నడుపుతున్నట్లు వెళ్తుందా.. ఆటో మోడ్ లో పెట్టేస్తే అది తనకు నచ్చినట్లు వెళ్తుందా అనే సందేహం కూడా వస్తుంది. అలాంటపుడు పైన చెప్పిన అన్ని థెరఫీలకన్నా ఈ ట్రావెల్ థెరపీ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది. దీనికి ఏ డాక్టర్ అక్కర్లేదు.. మనమే ప్రాక్టీస్ చేయొచ్చు.. లేదా తోడుగా ఎవరైనా ఉంటే మంచిదే.. ఇదెలా ప్రాక్టీస్ చేయాలి... అన్ని రకాల చికిత్సా విధానాల మాదిరిగానే ఈ ట్రావెల్ థెరపీ కూడా ప్రత్యేకంగా మనసుకు ప్రత్యేకం. .. ముసురుపట్టిన మనసుకు దుమ్ము వదిలిస్తుంది... మసకబారిన కళ్ళకు స్పష్టత ఇస్తుంది.. శరీరానికి ఉత్సాహాన్ని.. కిక్కును ఇస్తుంది.. ఇది సాధన చేయడం కూడా సులువే... పెద్దగా ఏం లేదు.. ముందుగా ఏదో ఒక ఊరు.. ఒక లోకేష్ సెలెక్ట్ చేసుకుని ట్రైన్/ బస్సు/ ఫ్లయిట్ టిక్కెట్లు తీసుకుని ఒక జబ్బ సంచిలో రెండు మూడు జతల బట్టలు.. గట్రా గట్రా కుక్కుకుని వెళ్లిపోవడమే. ట్రైన్ వేగంగా ముందుకు దూసుకువెళ్తుంటే మన సమస్యలు.. చికాకులు అదే వేగంతో వెనక్కి వెళ్లిపోతున్నా ఫీలింగ్. .. కో ప్యాసింజర్లను ..వారి నడవడిక.. తీరు .. చూస్తుంటే ఏదో కొత్త విషయం చూస్తున్న భావన... సరికొత్త ప్రదేశాలు చూస్తుంటే ఏదో నేర్చుకుంటున్న ఫీల్.. చిన్నపుడు జాగ్రఫీలో విన్న పేరున్న ఊరికి వెళ్తే అబ్బా నేనూ ఒక సాహసికుడినే అన్న కించిత్ గర్వం.. సోషల్ పుస్తకంలో చదివిన నదిలో మునకేస్తే వయసు హఠాత్తుగా పాతికేళ్ళు తగ్గిపోవడం తథ్యం.హిస్టరీ మాష్టర్ చెప్పిన చారిత్రక కట్టడాన్ని నేరుగా చూస్తే దాన్ని మనమే కట్టినంత సంబరం... లోకంలో మన ఊరే కాదు.. చాలా ఊళ్ళున్నాయి.. మన చుట్టూరా ఉన్న జనాలే కాదు చాలా మంది ఉన్నారు.. ఈ విషయం నేను కొత్తగా కనిపెట్టాను అనే భావన.. పఠనం.. పయనం .. ఈ రెండూ మనసుకు ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తాయి.. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ రెండూ మానొద్దు.. డబ్బుల్లేవని చికిత్స మానేయలేం.. డబ్బుల్లేవని ఆస్పత్రికి వెళ్లడం ఆపలేం.. సెలవుల్లేవని చికిత్సను ఆపలేం.. అలాగే డబ్బుల్లేవని ప్రయాణాలు కూడా మానొద్దు.. అప్పుచేసైనా ఆస్పత్రికి ఎలా వెళ్తామో ప్రయాణానికి కూడా వెళ్లాల్సి.. నేను బిజీ అనే భ్రమల్లోంచి రావాలి. .. సెలవుల్లేవు .. నేను బిజీ అనే ఆలోచనలలైన్లను డిలీట్ చేయాలి.. మిత్రులను కలవడం.. వారితో కబుర్లు..ముచ్చట్లు.. ఇవన్నీ మనసుకు ఔషధాలే .. కాదనలేని సత్యంసైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మరి అన్ని వైద్యవిధానాలకు ఉన్నట్లే ఈ ట్రావెల్ థెరఫీకి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.. కాకుంటే అవి మన శరీరం నుంచి కాకుండా మన సైడ్ ఉన్న బంధుమిత్రుల నుంచి వస్తాయి.. వీడికి ఇల్లు సంసారం తిన్నగా ఉండదు.. పైగా చేతిలో అప్పులున్నాయి కానీ షికార్లకు లోటుండదురా ... అబ్బా వీడికి మూణ్నెళ్లకు ఒక టూర్ ఉండాల్సిందే... వీడికి తడి తక్కువ.. తమాషా ఎక్కువ.. మమ్మల్ని తీసుకెళ్లచ్చుగా .. ఏదైనా నీలాగా బతకడం కష్టం మామా.. ఇలా రకరకాల కామెంట్ల రూపంలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి .. అలాగని మన పయనం ఆగొద్దు.. ఎవరికీ సమాధానం చెప్పొద్దు.. మెడిసిన్ కూడా అంతేగా... సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదాని మందులు మానేయలేం.. అలాగే మనసుకు థెరఫీ కావాలంటే ప్రయాణాలు చేయాలి.. కాస్త డబ్బుల పరిస్థితి చూసుకుని తరచూ చిన్నదో పెద్దదో టూర్ వేస్తుండాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. కొప్పెర గాంధీ ట్రావెల్ థెరఫిస్ట్ -
అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
‘మొహమాటం వద్దు.. ఏదైనా నన్ను అడిగేయ్!’
కృత్రిమ మేధస్సు.. మనిషి జీవితంలో అంతర్లీనంగా మారిపోవడానికి ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే అనేక రంగాల్లో ఇది మనిషి అవసరాలను తీరుస్తోంది. అతిత్వరలో ఆపద్భాందువు అవతారమెత్తబోతోంది. మైక్రోసాఫ్ట్వారి కొత్త ఫీచర్ కోపైలట్ విజన్ అందుకు ఒక ఉదాహరణ మాత్రమే!.కోపైలట్.. మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన జనరేటెడ్ ఏఐ చాట్బోట్. చాట్బోట్ రూపంలో యూజర్లకు సమాచారాన్ని చేరవేస్తుండడం తెలిసిందే. ఏఐ సాయంతో పనిభారాన్ని తగ్గించడంతో పాటు ఆ పనిని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. అంతేకాదు.. తక్కువ టైంలో నాణ్యమైన కంటెంట్ను అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే దీనికి నెక్ట్స్ లెవల్గా కోపైలట్ విజన్ రాబోతోంది.👉ఎడ్జ్ బ్రౌజర్లో ఓ మూలన నీట్గా ‘కోపైలట్ విజన్’ ఏఐ ఫీచర్ను కనిపించనుంది. ఈ టూల్ సాయంతో ఇంటర్నెట్లో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి.. ఎలాంటి సాయమైనా కోరవచ్చు. ఉదాహరణకు.. మీరు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఎక్కడ బస చేయాలనే దానిపై మీకు కచ్చితమైన సమాచారం లేదు. ఆ గందరగోళంలో మీరు మీ డివైజ్లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కోపైలట్ విజన్ను సంప్రదించొచ్చు.👉మీకు ఎంత బడ్జెట్లో రూం కావాలి.. ఎలాంటి సౌకర్యాలు ఉండాలి.. ఇలాంటి వివరాలను చెబితే చాలూ!. కో పైలట్ విజన్ తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం జల్లెడ పడుతుంది. దానిని మీకు చెబుతూ పోతుంది. తద్వారా మీకు కావాల్సిన పక్కా సమాచారం చేరవేస్తుందన్నమాట. ఇది ఇక్కడితోనే ఆగిపోదు..👉రియల్ టైంలో వెబ్ కంటెంట్తో ఇంటెరాక్ట్ అయ్యేందుకు కూడా ఈ టూల్ ఉపయోగపడుతుంది. మీరు అడిగే ప్రశ్న రాతలు, ఫొటోలు, వీడియోల రూపకంలో కూడా ఉండొచ్చు. ఉదాహరణకు.. మీ స్మార్ట్ టీవీలోగానీ లేదంటే ల్యాప్ట్యాప్గానీ ఏదైనా సినిమా చూస్తుంటే అందులో నటీనటుల వివరాలను కూడా కోపైలట్ విజన్ను అడగొచ్చు. అప్పుడు అది తన దగ్గర ఉన్న సమాచారం సమీక్షించుకుని.. పూర్తి వివరాలు మీకు తెలియజేస్తుంది.👉అలాగే సందర్భోచితంగా సాయం కూడా అందిస్తుంది. అంటే షాపింగ్ చేసే టైంలో మీకు కావాల్సిన వివరాల ఆధారంగా ప్రొడక్టును మీకు చెబుతూ చూపిస్తుంది. అంతెందుకు.. సెలవు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెబితే.. ఆరోజు మీ వెసులుబాటును బట్టి ఎలా ఎక్కడ, గడపొచ్చో కూడా మీకు సలహా ఇస్తుందది. అంటే.. బ్రౌజింగ్ చేసే టైంలో ఇది మరో జత కండ్ల మాదిరి పని చేస్తుందన్నమాట.👉ఈ ఫీచర్ను యాక్టివేట్లో ఉంచి ఉపయోగించుకోవాలి. ప్రైవసీ విషయంలో గ్యారంటీ ఇస్తోంది మైక్రోసాఫ్ట్. ఒకసారి సెషన్ ముగిశాక.. మనం అడిగిన సమాచారం.. దానికి కోపైలట్ ఇచ్చిన వివరాలు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ను అమెరికాలో కోపైలట్ ల్యాబ్స్ ప్రోగ్రాం కింద కోపైలట్ సబ్స్క్రయిబర్స్కు అందజేస్తోంది. ఎడ్జ్బ్రౌజర్లో ఉన్న ఈ టూల్ను.. త్వరలో మిగతా విస్తరించే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉంది. అప్పుడు యూజర్ల నుంచి ఫీడ్బ్యాక్ ద్వారా లోటుపాట్లను సరిదిద్దుకుని మరింత మెరుగైన సేవలు అందిస్తుందట. ఎందెందు వెతికినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాడ కనిపిస్తున్న కాలంలో మైక్రోసాఫ్ట్ అడుగు గేమ్ఛేంజర్ అనే చెప్పొచ్చు. ఈ ప్రయత్నంతో.. మిగతా కంపెనీలు పోటీగా కోపైలట్ విజన్ తరహా జనరేటెడ్ ఏఐ సేవలను అందించే అవకాశం లేకపోలేదు. -
అల్లు అర్జున్, ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు
ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్దకోతులు మంచివే కానీ పిల్ల కోతులు నాలుగు మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్ళే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు, చేపలు నివసిస్తున్నాయి. చేపలు, తాబేళ్లు నీటి మీద తేలియాడగానే కోతులు చెట్ల పైనుంచి పండ్లు, కాయలు, ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి.‘కోతి నేస్తాలూ! మేము మీకు ఏ విధంగానూ అడ్డురావడం లేదు. మరి మీరెందుకు మమ్మల్ని నీటి పైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు?’ అని ఒకరోజు ఒక చేప ప్రశ్నించింది. ‘మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లల్లో పడుతున్నాయి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఓ పిల్లకోతి.‘చేప నేస్తాలూ! పిల్లకోతులు కావాలని అలా గిరాటు వేస్తున్నాయి. మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అంది ఓ తాబేలు.రోజురోజుకు కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం! తాబేళ్లు, చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వలన ఫెళ్లున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లల్లో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి..’ అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు, తాబేళ్లు బయటకు వచ్చాయి. ‘అయ్యో! పిల్ల కోతులు నీళ్లల్లో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడుదాం’ అంది ఒక తాబేలు.‘పిల్లకోతులూ! ఇలా మా వీపు మీద కూర్చోండి’ అంటూ నాలుగు పెద్ద తాబేళ్లు వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. ‘మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం’ అన్నాయి పిల్ల కోతులు. ‘అలాగే!’ అన్నాయి తాబేళ్లు.అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతణ్ణి చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమరచి ఉన్న చేపలు, తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి.‘ఈ రోజు నా అదృష్టం పండింది. చాలా చేపలు, తాబేళ్లు కూడా దొరికాయి’ అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు. ‘అయ్యో! మన నేస్తాలను ఇతను తీసుకెళ్లిపోతున్నాడు’ అని పిల్ల కోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుక్కుని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారుపడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట, వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను, తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్ల కోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం ఎప్పుడూ ఇలాగే ఒకరికి ఒకరం స్నేహంగా ఉండాలి’ అనుకున్నాయి అన్నీ! మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు సహాయపడతాడు. – కైకాల వెంకట సుమలత -
కాకి హంసల కథ! పూర్వం ఒకానొక ద్వీపాన్ని..
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవీ బలంలో తనకు సాటిరావని ప్రగల్భాలు పలుకుతుండేది.ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రతీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, ‘నువ్వు వాటి కంటే ఎత్తుగా ఎగరగలవా?’ అని అడిగారు. ‘చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే గాని, బలంలో నాకు సాటిరాలేవు. అదెంత పని, అవలీలగా వాటి కంటే ఎత్తుగా ఎగరగలను’ అంది కాకి.‘సరే, వాటితో పందేనికి వెళ్లు’ ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి, హంసల దగ్గరకు డాంబికంగా వెళ్లింది. తనతో పందేనికి రమ్మని పిలిచింది. కాకి తమను పందేనికి పిలవడంతో హంసలు పకపక నవ్వాయి. ‘మేం రాజహంసలం. మానససరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్రతీరానికి వచ్చాం. మేం మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?’ అని హేళన చేశాయి.కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది.‘నేను నూటొక్క గతులలో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా వంద యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం’ కవ్వించింది కాకి.‘మేము నీలా రకరకాల గతులలో ఎగరలేం. నిటారుగా ఎంతదూరమైనా ఎగరగలం. అయినా, నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది’ అన్నాయి హంసలు.ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, ‘కాకితో పందేనికి నేను సిద్ధం’ అని పలికింది.పందెం ప్రారంభమైంది.కాకి, హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి.హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే, కాకి వేగంగా హంసను దాటిపోయి, మళ్లీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పొడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది. కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా, చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలాదూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగసి, పడమటి దిశగా ఎగరసాగింది. కాకి ఎగరలేక బలాన్నంతా కూడదీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా, కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టయినా లేదు. సముద్రంలో పడిపోయి, చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది. కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, ‘నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు. ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?’ అని అడిగింది.కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది. ‘ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు’ అని దీనాలాపాలు చేసింది. కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకిలాగింది. ఎగురుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చింది.‘ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు’ అని బుద్ధిచెప్పింది హంస. ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు.‘కర్ణా! నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకుపోతే చేటు తప్పదు! బుద్ధితెచ్చుకుని మసలుకో’ అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. – సాంఖ్యాయన -
రెక్కలు..
చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టిరంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునే సరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్లీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడి గంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు.చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళుతున్నవాళ్లు ఆగి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళుతున్నారు. ఉదయం తొమ్మిది అయి ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది.రాఘవ అదేమీ పట్టనట్టుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడి వైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళితే కుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ‘ఆగరా’ అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది ‘పోనీ వెధవనీ’ అని.వెధవా తను? టెన్త్లో ఎన్ని మార్కులొచ్చాయి. ఇంటర్లో ఎన్ని మార్కులొచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ ‘నువ్వే టాప్. క్యాంపస్ సెలక్షన్లో నీకు ఉద్యోగం వస్తుంది’ అనంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అందిగాని అది బోగస్దని తేలింది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు. చిన్న ఊరు. చిన్న ఉద్యోగం.చేతికందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధ ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. ‘దేశంలో అందరికీ ఉద్యోగాలొస్తుంటే నీకెందుకు రావడం లేదురా. ముప్పొద్దులా తింటూ ఫోను చూసుకుంటూ వుంటే ఎవడిస్తాడు’ అన్నాడు. బాధ కలిగింది. థూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్కు ఫోన్ చేశాడు. ‘మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో. ప్రాజెక్ట్లో దూరడం చాలా కష్టంగా ఉంది’ అన్నారు. ఏ ఆశా మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్లి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి? దూకాలి. దూకాలంటే మాటలా?ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత. గుడ్డ పరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలు అంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక. పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతోంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన రెండు రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు ‘హాయ్’ అని పలకరిస్తే అది దాని రెండు రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత ‘చిలకమ్మా.. గుడి ఎటువైపుంది’ అనగానే కుడి రెక్కతో గుడి వైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి ఎక్కడుందో చెప్పు’ అనగానే తన ఎడమ రెక్కతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి, గుడి అంటే నీకు ఇష్టమా తల్లీ?’ అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది.తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజంపైన ఉన్న చిలకమ్మ కింద పడింది. ‘అయ్యో’ అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని రెండు కాళ్లలో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూచుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతిలోకి తీసుకుని దాని వీపు మీద నిమురుతూ మరల తన భుజం పైకి ఎక్కించుకుని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు.రాఘవ కళ్లల్లోని బాధను చూసి ‘మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాళ్లు పడిపోయాయి. కాళ్లు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలకమ్మ బాధ పడదు. సందడి చేయడం ఏ మాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మూగరు. జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు’ అన్నాడు తాత.ఆ మాటలకు చిలకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటు ఇటు రాస్తూ ముద్దాడింది. దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి? తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి, వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.నిజంగా అలా చేస్తే వాళ్లు ఏమైపోతారు? వాళ్లు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్లకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రులని తనే చంపుకున్నట్టు కదా... ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా?ఇంత ముసలివాడైన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే... యువకుడైన తనకీ నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ ‘చెరువులో దూకడానికి వచ్చావు గదా బాబూ’ అన్నాడు.రాఘవ ఉలిక్కి పడ్డాడు.‘నీకెలా తెలుసు?’ అన్నాడు.‘ఉదయమే చూశాను బాబూ నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్లు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబూ. నేను ముసలాణ్ణయినా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా.. వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు‘ అన్నాడు.రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు.‘ఈ జామకాయ తిను బాబూ’ అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ కాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ ‘అయ్యో.. నా దగ్గర పైసా కూడా లేదు తాతా’ అనగానే ‘మరేం పర్వాలేదు బాబూ’ అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు.‘కాయ చాలా రుచిగా ఉంది తాతా’‘ఊరవతల తోటలోవి బాబూ. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్లు. చేసుకోవాలని లేదు. ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకొని టౌన్కు తీసుకెళ్లి అమ్మితే ఇక్కడ పది రూపాయలకు అక్కడ యాభై వస్తాయి. నేనా చేయలేను’ అన్నాడు తాత.రాఘవకు ్రౖడైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. ‘తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాతా. తర్వాతి కథ నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్లోనే. నువ్వు తోడుండు చాలు’ అన్నాడు రాఘవ.‘ఏంటి బాబూ నువ్వనేది’‘అవును తాతా’ అన్నాడు రాఘవ.తాత కూడా చిరునవ్వు నవ్వాడు.‘ఏం చిలకమ్మా’ అన్నాడు.అది కిచకిచమని అంగీకారం తెలిపింది.ముగ్గురూ లేచి అక్కడ నుంచి కదిలారు. గుడి గంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలకమ్మ ముందుకు సాగిపోయారు. – నేదూరి భాను సాయి శ్రేయ -
Masaba Gupta: మసాబా.. మసాబా..
మసాబా గుప్తా.. ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక వైబ్రెంట్ వేవ్! ఆమె రాకముందు మన ఫ్యాషన్లో బిగ్ అండ్ బోల్డ్ ప్రింట్స్ అంతగాలేవు! ఇప్పుడవి చాలామంది సెలబ్రిటీస్కి మోస్ట్వాంటెడ్ క్యాజువల్స్గా మారి, వాళ్ల స్టయిలింగ్ వార్డ్రోబ్స్కి చేరిపోతున్నాయి. క్రెడిట్ గోస్ టు ‘హౌస్ ఆఫ్ మసాబా!’ కుడోస్ టు క్రియేటర్ మసాబా గుప్తా!నా స్కిన్ కలర్, నా జుట్టు తీరుతో చాలా అవమానాలు ఎదుర్కొన్నా! అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఏ రంగంలో అయినా ప్రతికూలతలు ఉంటాయి. వాటిని మనకు అనుకూలంగా మలచుకోగలగడమే సక్సెస్! అంటుంది మసాబా గుప్తా.మసాబా గుప్తా ఎవరో సినీ,క్రికెట్ ప్రియులు చాలామందికి తెలిసే ఉంటుంది. నటి నీనా గుప్తా, క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ కూతురు. చిన్నప్పుడెప్పుడూ ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలకనలేదు ఆమె. తండ్రిలా ఆటల మీదే ఆసక్తి చూపింది. టెన్నిస్ ప్లేయర్ కావాలని కష్టపడింది. తనకు పదహారేళ్లు వచ్చేటప్పటికి ఆ ఆసక్తి, ప్రయత్నం మ్యూజిక్, డాన్స్ మీదకు మళ్లాయి. లండన్లో ఆ రెండిటిలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఒంటరిగా ఉండలేక వాటిని మధ్యలోనే వదిలేసి ముంబై చేరుకుంది.వచ్చాక, యాక్టింగ్ ఫీల్డ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించింది. అది గమనించిన నీనా గుప్తా, ‘ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసే సంప్రదాయ సౌందర్య ప్రమాణాలు వేరు. నువ్వు అందులో సెట్ కావు. సో.. ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేయ్’ అంటూ బిడ్డను వెనక్కి లాగింది. ఏమాత్రం నిరుత్సాహపడక, తన క్రియేటివిటీని తన కాలేజ్ ఈవెంట్స్లో ప్రదర్శించసాగింది మసాబా. ఆ సమయంలోనే ఆమెలోని ఈస్తటిక్ సెన్స్, ఫ్యాషన్ స్పృహను కనిపెట్టిన ఫ్యాషన్ డిజైనర్, ఆథర్.. వెండెల్ రోడ్రిక్స్ ఆమెను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ప్రోత్సహించాడు. దాంతో మసాబా.. ముంబై, ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ(శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాక్రసే మహిళా విశ్వవిద్యాలయ్)లో అపరెల్ మాన్యుఫాక్చర్ అండ్ డిజైన్ను అభ్యసించింది.తను పూర్తిస్థాయిలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే టైమ్కి.. పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్ల జాడ అంతగా కనపడలేదు ఆమెకు. దాంతో ఆ రెండిటినే తన యూఎస్పీగా మార్చుకుని ‘హౌస్ ఆఫ్ మసాబా’ లేబుల్ని ఆవిష్కరించింది. ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనం. లేత రంగులు, ప్లెయిన్, చిన్న చిన్న డిజైన్స్నే ఎంచుకుంటున్న సెలబ్రిటీలకు మసాబా ప్రింట్స్æ వైబ్రెంట్గా తోచాయి. ఆ లేబుల్కి మారారు. ఆ అవుట్ఫిట్స్లో సెలబ్రిటీల అపియరెన్స్ రేడియెంట్గా కనిపించసాగింది.ప్రత్యేక స్టయిల్గా గుర్తింపురాసాగింది. అంతే ‘హౌస్ ఆఫ్ మసాబా’ బాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది. ఇంట్లో వేసుకోవడానికి మొదలు బీచ్లో వ్యాహ్యాళి, ప్రయాణాలు, సినిమాలు, పార్టీలు, ఫంక్షన్లు, అవార్డ్ ఈవెంట్స్ దాకా దేనికైనా మసాబా డిజైనర్ వేర్ కావాల్సిందే అని కోరుకునే స్థాయికి చేరుకుంది ఆ డిమాండ్! ఆ లిస్ట్లో సోనమ్ కపూర్, ప్రియంకా చోప్రా, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, విద్యా బాలన్, సొనాక్షీ సిన్హా, మీరా రాజ్పుత్ కపూర్, మౌనీ రాయ్, కరణ్ జోహార్ లాంటి మహామహులంతా ఉన్నారు. ‘హౌస్ ఆఫ్ మసాబా’ వెడ్డింగ్, రిసార్ట్ వేర్లోనూ సిగ్నేచర్ డిజైనింగ్ను మొదలుపెట్టింది. అంతేకాదు స్విమ్ వేర్, మెన్స్ వేర్, ఫ్యాషన్ జ్యూల్రీలోనూ తన నైపుణ్యాన్ని చూపిస్తోంది.ఇవి చదవండి: Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ! -
పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’
‘దేవరపాలెం.. దేవరపాలెం..’ అంటూ కండక్టర్ కనకరాజు రాబోయే స్టాపులో దిగబోయే ప్రయాణికులను అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచాడు. కనకరాజు అరుపులకు కొంతమంది సీట్లలోంచి లేచి, హడావిడిగా తమ సామాన్లను తీసుకుంటున్నారు. ‘రావాలి.. రావాలి..’ అంటూ కనకరాజు వారిని మరింత వేగిరపెట్టాడు. కొంతమంది దిగిపోయాక, కొంతమంది ఎక్కారు. కనకరాజు టికెట్స్ కొట్టే కట్టర్తో ఎదురుగా ఉన్న ఇనుప రాడ్ మీద ‘రైట్.. రైట్..’ అంటూ గట్టిగా కొట్టాడు. అతను ఇచ్చిన శబ్దసందేశానికి బస్సు పొగలు చిమ్ముకుంటూ బయల్దేరింది.ఆ బస్టాపుకి కొద్దిదూరంలో వున్న ఒకావిడ మర్రిచెట్టు కింద కూర్చుని, బస్సులోంచి దిగుతున్న ప్రయాణికులను ఆత్రంగా చూడటం కనకరాజు కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చే ఆ బస్ కోసమే ఆమె రెండు పూటలా వస్తోంది. ఆమెకు సుమారుగా నలభై ఐదేళ్లుంటాయి. ఆమె కళ్ళు తీక్షణంగా మెరుస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే ఆమె క్రమం తప్పని దినచర్య!‘ఆమె ఎవరు? రోజూ ఎవరి కోసం ఎదురుచూస్తోంది?’ అనే ప్రశ్నలు ఆమెని చూసినప్పుడల్లా కనకరాజు మదిని తొలిచేస్తున్నాయి. కనకరాజు తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఓ పెద్దాయనకు టికెట్ కొడుతూ ‘బాబాయ్, ఎవరావిడ?’ తన మనసుని కుదిపేస్తున్న ప్రశ్నని అతని ముందు పెట్టాడు.‘ఆవిడో పిచ్చి మాలోకమయ్యా..!’ అతను ముక్తసరిగా బదులిచ్చాడు. కనకరాజు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కనకరాజు నిస్సత్తువగా హాల్లోని సోఫాలో వాలిపోయాడు. భర్త రాకను గమనించిన అతని భార్య సరోజ వంటగదిలోంచి వస్తూ ‘టీ పెట్టమంటారా?’ అని అనునయంగా అడిగింది.‘వద్దు సరోజా.. అలేఖ్యకి ఇప్పుడెలా వుంది? నిద్రపోతోందా?’ దుఃఖాన్ని గుండె లోతుల్లోనే దిగమింగుకుని నెమ్మదిగా అడిగాడు కనకరాజు.‘జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడంలేదు. ఏమి తిన్నా వాంతులు చేసుకుంటోంది. ఇప్పుడే పడుకుంది’ చెప్పింది సరోజ బాధని పంటితో బిగబట్టుకుని.కనకరాజుని ఈ మధ్యకాలంలో బాగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య తన ఎనిమిదేళ్ల కూతురి అనారోగ్యం! అతని కూతురు సంవత్సర కాలంగా అంతుచిక్కని కొత్త తరహా న్యుమోనియాతో నరకాన్నే చూస్తోంది. ఏడాదిగా స్కూలుకి కూడా పోవడంలేదు. తెలిసిన వాళ్లు చెప్పిన స్పెషలిస్టులందరికీ చూపించాడు. డాక్టర్లు సూచించిన అన్నిరకాల టెస్టులు చేయించాడు, చేయిస్తూనే వున్నాడు. ఫలితం మాత్రం శూన్యం!కనకరాజుకి ఎప్పటిలాగే ఆరోజు కూడా దేవరపాలెం బస్టాపు దగ్గర రెండు దఫాలూ అదే దృశ్యం ఎదురైంది. ఈసారి ఎవరినీ అడగకూడదని, తనే స్వయంగా ఆమెని కలిసి, విషయమేంటో ఆరా తీయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. తన సెలవు రోజున దేవరపాలెం వెళ్లాడు. బస్టాపు దగ్గర్లోని ఓ బడ్డీ కొట్టులో ఒక వాటర్ బాటిల్ కొంటూ, మర్రిచెట్టు కింద కూర్చున్న ఆవిడను చూపిస్తూ ‘ఎవరండీ ఆవిడ? రోజూ అక్కడ కూర్చుని, ఎవరి కోసం ఎదురు చూస్తుంది?’ అడిగాడు కాస్త చొరవతీసుకుని.‘ఆవిడా? ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయిన కొడుకు తిరిగొస్తాడని.. అవిడో పిచ్చిది సార్!’ క్లుప్తంగా బదులిచ్చాడతడు.‘ఈ మాత్రం చాలు. ఆమెని చేరుకోవడానికి’ అనుకుంటూ, ఆ పక్కనే వున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి బస్సు రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి. బస్సు వచ్చేటప్పుడు ఆమె కళ్లల్లో అదే వెలుగు. బస్సు వెళ్లిపోయిన మరుక్షణమే నిరాశగా ఇంటిదారి పట్టింది. కనకరాజు దూరం నుంచే ఆమెను అనుసరించసాగాడు. ఆమె వెళ్తూవెళ్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయింది. అదే.. తన నివాసం కాబోలు అనుకున్నాడు. అది ఓ సెంటు స్థలంలో కట్టిన చిన్న పాత పెంకుటిల్లు.కనకరాజు ధైర్యాన్ని కూడగట్టుకుని, మరో ఆలోచన చేయకుండా గబగబా ఆమె దగ్గరకు వెళ్లి ‘అమ్మా..! నా పేరు కనకరాజు. మీ బిడ్డకోసం ఎదురు చూస్తున్నారని విన్నాను. నేను డ్యూటీ మీద చాలాచోట్లకు తిరుగుతుంటాను. మీ అబ్బాయి గురించి వివరాలు చెప్తే, నా శాయశక్తులా వెతికిపెడతాను’ నిజాయితీగా తన మనసులోని మాటని ఆమె ముందు పెట్టాడు. ఆమె కనకరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఎవరు బాబూ మీరు? మీరు చెబుతున్నది నిజమేనా? నా బిడ్డ నిజంగా నా చెంతకొస్తాడా?’ ఆత్రంగా అడిగింది.‘అవునన్నట్లు’ తలూపాడు కనకరాజు. ఆమె మొహం ఒక్కసారిగా కాంతివంతమైంది.‘బాబూ.. నా కొడుకు పారిపోయి పదిహేనేళ్లు గడిసిపోనాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ యివ్వని భరోసాని యిత్తున్నావు. అందరూ నన్ను ‘పిచ్చిది’ అనేటోళ్లే గానీ, ఎవరూ యిలా చెప్పలేదు బాబూ..’ తన పట్టరాని సంతోషాన్ని, కన్నీళ్ల రూపేణా వ్యక్తపరచింది.ఆమె భావోద్వేగానికి కనకరాజు ఎంతోగానో చలించిపోయాడు. అతని కంట్లో కూడా నీళ్లూరాయి.‘మీ పేరెంటమ్మా..’ అడిగాడు. ‘ఎర్రయ్యమ్మ..’ చెప్పింది.మిగతా వివరాలూ అడిగాడు కనకరాజు. తన కొడుకు పేరు రాజు అని చెప్పింది ఆమె. పదేళ్లప్పుడు మాస్టారు కొట్టారని పుస్తకాల సంచిని అక్కడే విసిరికొట్టి, ఇంటికొచ్చేశాడట. కొడుక్కి బుద్ధి రావాలని రెండు దెబ్బలు వేసిందట ఎర్రయ్యమ్మ. అంతే..కోపంతో రాజు ఊరొదిలి పారిపోయాడు. అది మొదలు ఎర్రయ్యమ్మ పిచ్చిదానిలా చుట్టుపక్కల ఊళ్లే కాదు, సిటీలోని వీథులు, రోడ్లనూ గాలించిందట. తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ కొడుకు జాడ మాత్రం తెలియలేదు. అదో తీరని వెతగా మారిపోయింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ లోకం దృష్టిలో పిచ్చిదైపోయింది. ప్రభుత్వం అందిస్తోన్న ఫించనుతోపాటు రెండు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తను వుంటున్నది అద్దె ఇల్లే! అయితే ఒకప్పుడు అది తనదేనట. తాగుబోతు భర్త తన వ్యసనాల కోసం ఆ ఇంటిని అమ్మేశాడట. అయితే పెళ్లయిన మూడేళ్లకే చనిపోయాడట అతను. త్వరలోనే తన కొడుకు తనని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడని ఈమధ్యనే ఓ సాధువు ఆమెకు జోస్యం చెప్పాడట.ఆమె నోట ఆ వివరాలన్నీ విన్న కనకరాజు ‘ఎర్రయ్యమ్మా, అప్పుడెప్పుడో పారిపోయిన నీ కొడుకు ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఎలా గుర్తుపడతావు?’ అనుమానంగా అడిగాడు. అంతే.. ఆమె గబగబా ఇంట్లోకెళ్లి, పోస్టుకార్డు సైజులో వున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి తెచ్చి, ‘మా రాజుగాడి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ వుంది.. చూశావా బాబూ..?’ అంటూ ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోన్న పుట్టుమచ్చని చూపించింది.కనకరాజు ఆ ఫొటోని అడుగుదామనుకునేలోపే ఎర్రయ్యమ్మే ‘ఈ ఫొటో నీ దగ్గర ఉంచు బాబూ.. మా వాడిని గుర్తుపట్టడానికి.. ఇంకా ఇలాంటి ఫొటోలు నాలుగైదు నా దగ్గరున్నాయిలే’ అంటూ ఆ ఫొటోని కనకరాజు చేతిలో పెట్టింది.ఆ ఫొటోని భద్రంగా జేబులో పెట్టుకుంటూ, చిన్న కాగితం మీద తన మొబైల్ నెంబరు రాసి ఆమెకిచ్చాడు కనకరాజు. అలా ఎర్రయ్యమ్మకు అంతులేని విశ్వాసాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని నూరిపోసి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు.తర్వాత కొన్ని రోజులకే డిపోవారు కనకరాజు డ్యూటీ రూటు మార్చేయడంతో అతనికి ఎర్రయ్యమ్మను చూసే వీలు చిక్కలేదు. కూతురిని తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడం వల్ల కూడా అతనికి ఎర్రయ్యమ్మను కలిసే తీరిక దొరకలేదు. అలా రెండునెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎర్రయ్యమ్మే అతనికి ఫోన్ చేసింది తన కొడుకు ఇంటికి వచ్చేశాడంటూ! ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు కనకరాజు. డ్యూటీకి సెలవు పెట్టి, ఉన్నపళంగా దేవరపాలెం బయలుదేరాడు.కనకరాజుని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎర్రయ్యమ్మ.‘అయ్యా! మీరు చెప్పినట్టుగానే నా బిడ్డ నాకు దక్కాడు.. మీరు నా పాలిట భగమంతుడే! తమరు కలకాలం చల్లగా ఉండాలయ్యా..’ అంటూ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.‘నీ కొడుకు ఎక్కడమ్మా..?’అంటూ ఆత్రంగా అడిగాడు కనకరాజు.‘వంట సరుకులు కొనుక్కొత్తానని వెళ్లాడు బాబూ, వచ్చేత్తాడు..’ ఎర్రయ్యమ్మ అంటుండగానే ఓ పాతికేళ్ల యువకుడు రెండు చేతులతో రెండు సంచులను మోసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.అతను ఎర్రయ్యమ్మలాగే సన్నగా, పొడవుగా వున్నాడు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఏదో తేజస్సు ఆ కుర్రాడి ముఖంలో! ఎర్రయ్యమ్మ ‘రాజూ, నేను చెప్పానే, గొప్ప మనసున్న మారాజు అని.. ఈ బాబే’ అంటూ కొడుక్కి కనకరాజుని పరిచయం చేసింది.ఆ అబ్బాయి తన రెండు చేతులెత్తి కనకరాజుకి దండం పెట్టాడు. ఎర్రయ్యమ్మ, కొడుక్కి ఏదో చెప్తున్నట్టుగా సైగచేసింది. ఆ యువకుడు చెక్క బెంచీపై కూర్చున్న కనకరాజు కాళ్లకి నమస్కరించాడు.అనుకోని ఆ పరిణామానికి కనకరాజు బిత్తరపోతూ, ఆ కుర్రాడిని పైకి లేపుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. భోంచేసి వెళ్లాలని ఎర్రయ్యమ్మ పట్టుపట్టింది. భోంచేసి, వాళ్లిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకుని బస్సులో కూర్చున్న కనకరాజు మనసుకి ఎంతో ఊరటగా ఉంది. కానీ.. ఎక్కడో ఏదో తెలియని వెలితి!ఆ వెలితికి సాక్షీభూతంగా నిలిచిన ఓ సంఘటన కళ్ల ముందు కదుల్తూ అతన్ని రెండు వారాల వెనక్కు తీసుకువెళ్లింది.రాజు ఫొటోతో ఎర్రయమ్మ ఇల్లు దాటిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ కుర్రాడు కనిపించినా ఆ ఫొటోతో పోల్చి చూసుకోవడం కనకరాజు దినచర్యలో భాగమైపోయింది. అలా ఎర్రయ్యమ్మ వేదన గురించే ఆలోచిస్తోన్న కనకరాజుకి ఒకరోజు.. బస్సులో ఓ పాతికేళ్ల యువకుడు బేల ముఖంతో చిన్నగా శోకిస్తూ కనిపించాడు. అది చివరి ట్రిప్ కావడంతో బస్సంతా ఖాళీగావుంది. అతన్ని గమనించిన కనకరాజు, అతని పక్కనే కూర్చుని ‘ఏమైంది బాబూ.. అంతగా కుమిలిపోతున్నావు?’ అంటూ అనునయంగా అడిగాడు. ఆ అనునయానికి కదిలిపోయిన ఆ కుర్రాడు నెమ్మదిగా గొంతు విప్పాడు.‘నా పేరు డేవిడ్ రాజు. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మను చూడాలని, ఆమెతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ! మా అమ్మ గురించి నా శక్తి మేర చాలా సమాచారం సేకరించాను. అమ్మ నాకు తిండిపెట్టలేని దీనావస్థలో నన్ను మిషనరీ ట్రస్ట్లో వదిలేసిందట. ఏడాది పాటు అమ్మ ఆచూకీ కోసం చాలాచోట్లకి తిరిగాను. చాలామందిని కలిశాను. చిట్టచివరికి తన అడ్రస్ పట్టుకోగలిగాను. కానీ, నాలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సార్! తను ఓ నెల కిందటే ఎవరూలేని అనాథలా చనిపోయింది. నన్ను నిజంగానే అనాథని చేస్తూ..’ అంటూ బొటబొటా కన్నీళ్లుకార్చాడు.తను చదివిన ‘లా ఆఫ్ అట్రాక్షన్’ ప్రత్యక్షంగా ఎదురుకావడంతో మాటల్లో చెప్పలేని వింతానుభూతికి లోనయ్యాడు కనకరాజు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది జరిగితీరుతుంది!’ అని ఆ పుస్తకంలో చదివినట్టు జ్ఞాపకం. కుర్రాడి కళ్ల కిందుగా జారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ ‘నీకు అమ్మ ప్రేమ దక్కేటట్టు చేసే బాధ్యత నాది!’ అంటూ తిరుగులేని హామీనిచ్చాడు.ఆ కుర్రాడు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కుతూహలంగా కనకరాజు వైపు చూశాడు. ‘అయితే, నీ కుడి చెంప మీద చిన్న పుట్టుమచ్చ ఒక్కటే లోటు’ అన్నాడు కనకరాజు ఏదో ఆలోచిస్తూ!ఆరోజు ఆలా రెండు హృదయాల వేదనలను ‘ఒక సంతోష సాఫల్యం’గా రూపకల్పన చేశాడు కనకరాజు.ఎర్రయ్యమ్మ, రాజును కలిసిన కనకరాజు తన ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమైంది. మెయిన్ గేటు తీసి, లోనికి అడుగుపెడుతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అతని కూతురు ‘నాన్నా..’ అంటూ కిలకిలా నవ్వుతూ తనకేసి పరుగుతీస్తోంది లేడిపిల్లలా. పట్టరాని భావోద్వేగంతో కూతుర్ని చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. ఎదురుగా వస్తోన్న అతని భార్య, తల్లి ముఖాల్లో వెల్లివిరిసిన వసంతకాలపు వెలుగులు!ఆశ్చర్యంగా భార్య వైపు చూశాడు. ‘ఉదయాన్నే మీరు అలా వెళ్లారో లేదో.. ఎప్పుడూ తిననని మొండికేసే పిల్ల ‘ఆకలీ.. ఆకలీ..’ అంటూ ఒకటే గొడవ. జ్వరం ఉందేమోనని చూశాను. ఏదో మంత్రం వేసినట్టుగా పూర్తిగా మాయం! అప్పటికప్పుడు టిఫిన్ చేసి, వేడివేడిగా తినిపించాను. తిన్నప్పటి నుంచి ఒకటే అల్లరి! ఇల్లంతా ఉరుకులు, పరుగులు! ఉదయం నుంచి పది నిమిషాలకొకసారి ఏదో ఒకటి అడిగి తింటూనే ఉంది. ఒక్క వాంతి కూడా కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉందండీ..’అంటూ ఆమె సంబరంగా జరిగినదంతా చెప్పుకుపోయింది. ‘సాటి మనిషికి సాయం చేసే నీ తత్త్వమేరా నీ బిడ్డకు ఆయుష్షు పోసుంటుంది..!’ అంది కనకరాజు తల్లి, కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తల్లి మాటలకు చిన్నగా నవ్వేస్తూ, కూతురిని మురిపెంగా చూసుకుంటూ ఇంట్లోకి నడిచాడు కనకరాజు.ఎర్రయ్యమ్మని రాజు ఎలా చూసుకుంటున్నాడో తెలుసుకోవాలన్పించి, ఒకరోజు దేవరపాలెం వెళ్లాడు కనకరాజు. సాదరంగా ఆహ్వానించింది ఎర్రయ్యమ్మ. రాజు ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద సిటీకి వెళ్లాడని చెప్పింది. సాఫ్ట్వేర్ అయిన రాజు.. వారానికి ఒకటీ, రెండ్రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తుంటాడు. మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎర్రయ్యమ్మ కట్టూబొట్టూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీదకి బంగారం కూడా చేరింది. కొడుకు కోరిక మేరకు పాచిపనులకు స్వస్తి చెప్పింది.ఎర్రయ్యమ్మ చెప్పిన మరో విషయం రాజు మీద కనకరాజుకి తిరుగులేని నమ్మకాన్ని కలిగించింది. తన భర్త ద్వారా పోగొట్టుకున్న, ఒకప్పటి తన సొంతిల్లు అదే ఇప్పుడు అద్దెకున్న ఆ ఇల్లు, దాన్ని ఆనుకొని వున్న మరికొంత ఖాళీస్థలాన్నీ కొని, ఎర్రయ్యమ్మ పేరిట కాగితాలు రాయించాడని చెప్పింది. విన్న కనకరాజు తన ప్రయత్నం సంపూర్తిగా సఫలీకృతమైంది అనుకున్నాడు. మనసు నిండింది.‘ప్రతి జీవితానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలంటారు. నా జీవితానికిది చాలు!’ అనుకుంటూ బయల్దేరడానికి సమాయత్తమయ్యాడు కనకరాజు.కుర్చీలోంచి లేచిన కనకరాజు కాళ్లకి ఎర్రయ్యమ్మ నమస్కరించబోయింది. ఆ హఠాత్పరిణామానికి అతను బిత్తరపోయి దూరం జరుగుతూ ‘ఎర్రయ్యమ్మా, నేను నీ తమ్ముడు లాంటివాడిని. నువ్వు నా కాళ్లకు నమస్కరించడం ఏంటీ?’ అన్నాడు ఇబ్బందిపడుతూ.‘సాటిమనిషి కోసం ఆలోచించే తీరికలేని ఈ కాలంలో.. అనామకురాలైన ఈ ఎర్రయ్యమ్మ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకెరుకే బాబూ..! పారిపోయిన నా కొడుక్కి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. కానీ, వాడి ఛాతీ మీదున్న పాపిడి బిళ్లంత మరొక పుట్టుమచ్చ గురించి చెప్పలేదు! అది నీకు తెలియదు కదా బాబూ..’ అంటోన్న ఆమెకు బదులేం ఇవ్వాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనకరాజు.‘నా బాధ చూడలేక, నా కొడుకు రూపంలో ఈ అబ్బాయిని, నువ్వే పంపించావని నాకు ఎరుకే బాబూ! రాజు నా కడుపున కాయకపోయినా అంతకన్నా ఎక్కువే! ఇలాంటి మారాజు బిడ్డని నాకు చూపించినందుకు నీకు ఈ ఎర్రయ్యమ్మ జనమ జనమలకు రుణపడి ఉంటాది బాబూ..! నా కొడుకు మొన్ననే నీ గురించి ఓ మాట చెప్పినాడు.. ‘కండక్టర్’ అంటే నడిపించేవాడని అర్థమట! నువ్వు, నిజంగా మా బతుకులను నడిపించిన దేవుడివయ్యా..’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది.‘ఎర్రయ్యమ్మా.. నీ రాజును నీ దరికి చేర్చే క్రమంలో నిన్ను ఒక అబద్ధంతో మభ్యపెడుతున్నానని ఎంతో అపరాధభావానికి గురయ్యాను. ఆ వెలితిని కాస్త దూరం చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అన్నాడు కనకరాజు. తేలికపడిన మనసుతో తన ఇంటి దారి పట్టాడు. – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది!
లతిక సుథాన్ ఇల్లు కలువల కొలను. కమలాల సరస్సు. ఇంటి చుట్టూ నీరు, నీటిలో తేలుతూ పూలు. ఒకటి కాదు, రెండు కాదు. వంద రకాల కమలాలు, ఎనభై రకాల కలువలు వికసించిన సుమనిలయం ఆమె ఇల్లు. వాటిలో ఒకటి అత్యంత అరుదైన వెయ్యి రేకుల కమలం. ఇవన్నీ ఆమెకు చక్కటి ఆదాయ వనరుగా కూడా మారాయి. నెలకు నలభై వేల రాబడినిస్తున్నాయి. లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును తెచ్చాయి. విశ్రాంత జీవితాన్ని ఇంత సుగంధ భరితం చేసుకున్న లతిక ఒక స్కూల్ టీచర్. ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమైన ఉన్నన్ని రోజులూ తనకిష్టమైన మొక్కల పెంపకం అభిరుచిని పక్కన పెట్టాల్సి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత ఆమె తన హాబీకి మొగ్గ తొడిగింది. మొక్కలకు దూరంగా ఇరవై ఏళ్లు..లతిక సుథాన్ది కేరళ రాష్ట్రం, త్రిశూర్. ‘చిన్నప్పుడు మొక్కలతోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. కమలం విచ్చుకోవడాన్ని ఆసక్తిగా చూసేదాన్ని. ఒక్కో రెక్క విచ్చుకుంటూ ఉంటే అబ్బురంగా అనిపించేది. చదువు, పెళ్లి, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగంతో ఇరవై ఏళ్లపాటు మొక్కలకు దూరమయ్యాను. ఉద్యోగం నుంచి 2018లో రిటైరయ్యాను. అప్పటి నుంచి ఇక మొక్కల మధ్య సీతాకోక చిలుకనయ్యాను. ప్రపంచంలో ఉన్న కలువలు, కమలాల జాతుల మీద ఒక అధ్యయనమే చేశాను. దేశంలోని వివిధ ్రపాంతాల నుంచి మొక్కలు తెచ్చి పెంచాను. అలాగే థాయ్లాండ్, వియత్నాం, జపాన్ దేశాల నుంచి కూడా తెప్పించుకున్నాను. పెంపకంలో మెళకువలు నేర్చుకోవడానికి అనేక వర్క్షాపులకు హాజరయ్యాను. వ్యవసాయాభివృద్ధి శాఖ నిర్వహించే సదస్సులకు వెళ్లి నిపుణుల సూచనలను తెలుసుకున్నాను’ అన్నారు లతిక.మొక్కల పాఠాలు..కమలాలు, కలువల్లో అరుదైన జాతులను సేకరించడం, వాటి పెంపకం గురించి మెళకువలు తెలుసుకోవడంతో ఆ మొక్కల పెంపకం గురించి ఉపన్యసించగలిగినంత పట్టు సాధించారు లతిక. పిల్లలకు పాఠాలు చెప్పిన ఆమె అనుభవం ఇప్పుడు మొక్కల పాఠాలు చెప్పిస్తోంది. ఈ పూల గురించి ఒక్క సందేహం వ్యక్తం చేస్తే చాలు... అనర్గళంగా వివరిస్తుంది. కమలాలు, కలువల మొక్కలు, గింజల కోసం హాస్పిటల్, హోటల్, రిసార్టుల నుంచి భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తుంటాయి. హాబీగా మొదలైన కమలాల పెంపకం మంచి లాభాలనిస్తూ ఆమెకు స్థానికంగా లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును కూడా ఇచ్చింది.ఇవి చదవండి: iSmart హోమ్స్ -
నిద్రలేమిని దూరం చేసే కళ్లజోడు.. ఎప్పుడైనా వాడారా..!?
ఈ కళ్లజోడును రోజూ ధరించినట్లయితే, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ప్రతిరోజూ సరైన వేళకు చక్కగా నిద్రపడుతుంది. ఆస్ట్రేలియన్ కంపెనీ ‘రీటైమ్’ ఈ హైటెక్ లైట్థెరపీ కళ్లజోడును తాజాగా ‘రీటైమర్–3’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడలాయిడ్లోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లియోన్ ల్యాక్ ‘రీటైమ్’ కంపెనీ కోసం ప్రత్యేకంగా ఈ కళ్లజోడును రూపొందించారు.ఈ కళ్లజోడును ధరిస్తే, దీని నుంచి నిర్ణీత తరంగదైర్ఘ్యంలో నీలి–ఆకుపచ్చ రంగులోని కాంతి కళ్ల మీద పడుతుంది. ఈ కాంతి కళ్ల అలసటను పోగొడుతుంది. దీని నుంచి వెలువడే కాంతి శరీర గడియారానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఫలితంగా, వేళకు చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఈ కళ్లజోడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఆరుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 179 డాలర్లు (రూ.15,021) మాత్రమే!ఎక్కడైనా వాడుకోగల పోర్టబుల్ ఏసీ..ఇది పోర్టబుల్ ఏసీ. దీనిని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇళ్లల్లోనే కాదు, పిక్నిక్లకు, ఫారెస్ట్ క్యాంపులకు వెళ్లేటప్పుడు తాత్కాలికంగా వేసుకున్న టెంట్లలో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. చైనాకు చెందిన ‘హావోరాన్’, ‘యిఫీలింగ్ డిజైన్ ల్యాబ్’లకు ఇంజినీర్లు ‘యూయీ’ పేరుతో ఈ పోర్టబుల్ ఏసీకి రూపకల్పన చేశారు. ఒకదానికి మరొకటి అనుసంధానమై రెండు భాగాలుగా ఉండే ఈ ఏసీని సూట్కేసులా ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు.ఏసీ భాగాన్ని టెంట్ లోపల లేదా గది లోపల పెట్టుకుని, ఏసీ అడుగున ఉన్న భాగాన్ని టెంట్ లేదా గది వెలుపల పెట్టుకుని, ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గది లేదా టెంట్ లోపల ఉన్న వేడిని బయటకు పంపి క్షణాల్లోనే చల్లబరుస్తుంది. అంతేకాదు, ఇది పనిచేసే పరిసరాల్లోకి దోమలు, ఇతర కీటకాలు చేరలేవు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే మిల్లీరోబోలు..డచ్ వైద్యశాస్త్రవేత్తలు రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే ఈ మిల్లీరోబోలను ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఇవి నేరుగా రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయి, సూచించిన దిశలో ముందుకు సాగుతూ, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన చోట ఏర్పడిన అవరోధాలను సునాయాసంగా తొలగించి, సజావుగా రక్తప్రసరణ జరిగేలా చేస్తాయి. నెదర్లండ్స్లోని ట్వంటీ యూనివర్సిటీ, రాడ్బోడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ మిల్లీరోబోలను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించారు.అయస్కాంతం ద్వారా వీటి కదలికలకు దిశా నిర్దేశం చేయడానికి వీలవుతుంది. ఈ మిల్లీరోబోల పనితీరుపై ఇంకా లాబొరేటరీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చినట్లయితే, గుండెజబ్బులు, పక్షవాతంతో బాధపడే చాలామంది రోగులకు చికిత్స చేసే పద్ధతి మరింత సులభతరమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం!
అందాలొలికే ఈ బొమ్మలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వీటిని పూర్తిగా పువ్వులు, ఆకులు, రెమ్మలతోనే రూపొందించినట్లు తెలుసుకుంటే, ‘సుందరం.. ‘సుమ’నోహరం’ అని ప్రశంసించక మానరు. కెనడాలో స్థిరపడిన జపానీస్ కళాకారుడు రాకు ఇనోయుయి రూపొందించిన ఈ ‘సుమ’నోహర కళాఖండాలు కొంతకాలంగా ‘ఆన్లైన్’లో హల్చల్ చేస్తున్నాయి. పూలు, ఆకులు, రెమ్మలను ఉపయోగించి, రాకు సృష్టిస్తున్న కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి.కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉంటున్న రాకు ఈ పూల కళను 2017లో సరదా కాలక్షేపంగా మొదలుపెట్టాడు. తన ఇంటి పెరట్లో మొక్కల నుంచి రాలిపడిన గులాబీలు, ఇతర పూల రేకులు, వాటి ఆకులు వృథాగా పోతుండటంతో, వాటిని ఎలాగైనా సద్వినియోగం చేయాలని ఆలోచించాడు. తొలి ప్రయత్నంగా పూలరేకులు, కత్తిరించిన రెమ్మల ముక్కలను ఉపయోగించి కీచురాయి బొమ్మను తయారు చేశాడు. కీచురాయి బొమ్మ ఫొటోలను సోషల్ మీడియాలో పెడితే, విపరీతంగా స్పందన వచ్చింది. ఇక అప్పటి నుంచి రాకు వెనుదిరిగి చూసుకోలేదు. నిరంతర సాధనతో తన కళకు తానే మెరుగులు దిద్దుకుంటూ, పూల రేకులు, ఆకులు, రెమ్మలతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందే స్థాయికి ఎదిగాడు.పూర్తిగా సహజమైన పూలు, పూల రేకులు, ఆకులు, పూలమొక్కల గింజలు, రెమ్మలు, కొమ్మలు మాత్రమే ఉపయోగించి, కార్టూన్ క్యారెక్టర్లు, చిలుకలు, కొంగలు, గుడ్లగూబలు వంటి పక్షులు, పులులు, సింహాలు, జింకలు వంటి జంతువులు, సీతాకోక చిలుకల వంటి కీటకాల బొమ్మలను జీవకళ ఉట్టిపడేలా తయారు చేయడంలో రాకు తన ఏడేళ్ల ప్రస్థానంలో అపార నైపుణ్యం సాధించాడు.ఈ కళాఖండాలను రూపొందించడానికి గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ఒక్కోసారి రోజుల తరబడి ఓపికతో పని చేయాల్సి ఉంటుందని రాకు చెబుతున్నాడు. ఆన్లైన్లో రాకు పేరుప్రఖ్యాతులు పెరగడంతో ప్రముఖ కంపెనీలు ఆర్డర్లు ఇచ్చి మరీ అతడి చేత తమ కంపెనీల లోగోలను ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుంటున్నాయి. ఈ పూల కళాఖండాలు ఎక్కువకాలం ఉండవు. త్వరగానే వాడిపోయి, వన్నె కోల్పోతాయి. అందుకే రాకు వీటి సౌందర్యాన్ని తన ఫొటోల ద్వారా శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు. వృక్షశాస్త్రవేత్త అయిన రాకుకు చిన్నప్పటి నుంచి కళాభిరుచి కూడా ఉండటంతో అతడు ఈ కళలో అద్భుతంగా రాణిస్తున్నాడు. -
Annu Patel: అన్నూస్ క్రియేషన్!
అన్నూ పటేల్.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్పెషల్ స్టయిల్ ఆమెది! ఆ స్పెషాలిటీకి బాలీవుడ్ ఫిదా అయింది! అటు ఫ్యాషన్లో.. ఇటు స్టార్స్ స్టయిలింగ్లో సీనియర్స్తో ఇన్స్పైర్ అవుతూ, తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్న ఆమె గురించి నాలుగు మాటలు ..అన్నూ పటేల్ స్వస్థలం గుజరాత్లోని వడోదర. ఫ్యాషన్గా ఉండటం, రకరకాల కలర్ కాంబినేషన్స్లో బట్టలు కుట్టించుకోవడమంటే ఆమెకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. కనుకే, ఫిజియోథెరపీలో చేరిన కొన్నాళ్లకే అది తన కప్ ఆఫ్ టీ కాదన్న విషయాన్ని గ్రహించింది. ఫ్యాషన్ మీదే మనసు పారేసుకుంది. ఆలస్యం చేయక, వడోదరలోని ఐఎన్ఐఎఫ్డీ (ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్)లో చేరింది. గ్రాడ్యుయేషన్ ఫస్టియర్లోనే ఆమె ఫ్యాషన్ ఐడియాస్కి ముచ్చటపడిన ఇన్స్టిట్యూట్ ఆమెకు ‘ద మోస్ట్ ఇన్నోవేటివ్ కలెక్షన్’ అవార్డ్నిచ్చింది. సెకండియర్లో ఉన్నప్పుడు ‘అన్నూస్ క్రియేషన్’ లేబుల్ను స్టార్ట్ చేసింది.ఆ చిన్న పట్టణంలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది కానీ.. డిజైనర్ వేర్కి డిమాండ్ ఎక్కడ? అందుకే మొదట్లో తను డిజైన్ చేసిన దుస్తులను ఇంటింటికీ వెళ్లి అమ్మి, డిజైనర్ వేర్ పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి మోజు కలిగేలా చేసింది. ఆ ప్రయత్నం.. ఆమె చదువైపోయేలోపు ఫ్యాషన్ మార్కెట్లో ‘అన్నూ క్రియేషన్’కి స్పేస్ని క్రియేట్ చేసింది. దాన్ని స్థిరపరచు కోవాలంటే తన లేబుల్కు ఒక స్పెషాలిటీ ఉండాలని ఆలోచించింది అన్నూ. ఈ దేశంలో పెళ్లికిచ్చే ప్రాధాన్యం స్ఫురణకు వచ్చింది.బ్రైడల్ వేర్ డిజైన్లో తన ప్రత్యేకతను చాటుకుంటే తన మార్కెట్ ఎక్కడికీ పోదని తెలుసుకుంది. తన ఐడియాను అర్థం చేసుకునే టీమ్ని ఎంచుకుని డిజైనింగ్ మొదలుపెట్టింది. తొలుత సామాన్యులకే బ్రైడల్ వేర్ ఇచ్చింది. అవి అసామాన్యుల మనసునూ దోచాయి. దాంతో అన్నూ క్రియేషన్ సెలబ్రిటీల స్థాయికి చేరింది. బ్రైడల్ వేర్ చేస్తున్నప్పుడే అన్నూకి ఫ్యాషన్ మార్కెట్లో ఎత్నిక్ వేర్కీ స్పేస్ కనపడింది. ముందు తనకు, తన టీమ్కి క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్ చేసి, వాటిని ధరించి.. ఫొటో షూట్ చేయించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయసాగింది. అవీ సెలబ్రిటీల దృష్టిలో పడి అన్నూ బ్రాండ్కి క్యూ కట్టసాగారు.ఆ డిమాండ్ను చూసి ‘ఎఫ్ అండ్ ఎఫ్ (ఫ్రిల్ అండ్ ఫ్లేర్)’ పేరుతో క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్ను స్టార్ట్ చేసింది. ‘ఎఫ్ అండ్ ఎఫ్’ అంటే కుర్తీలు, ఇండో– వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి పర్ఫెక్ట్ బ్రాండ్ అనే ఫేమ్ని సంపాదించింది. తనే కొత్త అవుట్ఫిట్ని డిజైన్ చేసినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అన్నూ అలవాటు. అలా ఆమె డిజైన్స్ అన్నిటినీ ఫాలో అయిన కొందరు బాలీవుడ్ సెలబ్స్.. తమకు స్టయిలింగ్ చేయమని ఆమెను కోరారు. తొలుత అప్రోచ్ అయింది మలైకా అరోరా! ఆ తర్వాత కృతి ఖర్బందా, సోఫీ చౌధరీ, తారా సుతారియా, మౌనీ రాయ్, జాన్వీ కపూర్, హెజల్ కీచ్ వంటి వాళ్లంతా అన్నూ పటేల్ స్టయిలింగ్ క్లయింట్ల లిస్ట్లో చేరిపోయారు. ‘సామాన్యులకు డిజైన్ చేస్తున్నా, సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నా.. ఆయా స్థాయిల్లో అంతే ఎఫర్ట్స్ పెడతాను, అంతే కమిట్మెంట్తో ఉంటాను. నా డిజైనర్ వేర్ని.. నా స్టయిలింగ్ని కోరుకుంటున్న వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం. అది నాకు కోటి అవార్డులతో సమానం!’ అంటుంది అన్నూ పటేల్.ఇవి చదవండి: Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా! -
Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా!
సనమ్ సయీద్.. బ్రిటిష్ పాకిస్తానీ మోడల్, నటి, గాయని కూడా! ఉర్దూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రసిద్ధురాలు. మన దగ్గరా ఆమెకు ఘనమైన అభిమానగణం ఉంది. జీ5, హమ్ చానళ్ల వీక్షకులకు ఆమె సుపరిచితం.సనమ్ పుట్టింది లండన్లో. తన ఆరేళ్ల వయసులో ఆమె కుటుంబం పాకిస్తాన్లోని కరాచీకి వెళ్లి, స్థిరపడింది. ప్రాథమిక విద్యాభ్యాసం కరాచీలో, ఉన్నత విద్యాభ్యాసం లాహోర్లో గడిచింది. ఫిల్మ్ అండ్ థియేటర్ స్టడీస్లో డిగ్రీ చేసింది.ఆమె తన పదహారవయేట నుంచి మోడలింగ్ మొదలుపెట్టింది. పదిహేడేళ్లప్పుడు ఎమ్టీవీ (పాకిస్తాన్)లో వీజేగా కనిపించింది.‘షికాగో’ అనే నాటకంతో రంగస్థల ప్రవేశం చేసింది. అందులోని ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాంతో ఆమెకు టీవీ సీరియల్స్లోనూ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ‘దామ్’ అనే సీరియల్తో బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటు నాటకాలు, అటు సీరియళ్లతో బిజీగా ఉన్న సమయంలో కోక్ స్టూడియో పాకిస్తాన్లో తన గళాన్ని వినిపించి.. తనలోని గాన ప్రతిభనూ చాటుకుంది.సనమ్ మల్టీటాలెంట్ ఆమెను వెండితెరకూ పరిచయం చేసింది ‘బచానా’ అనే ఉర్దూ సినిమాతో! ‘మాహ్ ఎ మీర్’, ‘దొబారా ఫిర్ సే’, ‘ఇశ్రత్ మేడ్ ఇన్ చైనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి.సనమ్ను మనకు ఇంట్రడ్యూస్ చేసి.. ఇక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టిన సీరియల్ ‘జిందగీ గుల్జార్ హై’. ఇది హమ్ టీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ ఆమెకు ఇండియన్ ఫ్యాన్ బేస్ను ఏర్పరచింది.ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమెకున్న ఫేమ్ను చూసి ఓటీటీ కూడా ఆమెకు ప్లేస్ ఇచ్చింది.. ‘కాతిల్ హసీనాఓం కే నామ్’తో! ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది.మోడలింగ్, థియేటర్, టీవీ, సినిమా, ఓటీటీ, సింగింగ్.. ఇలా అడుగిడిన ప్రతి రంగంలో ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు దక్కాయి. అందులో ఒకటి ‘ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్’.'ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉండటం అనిర్వచనీయమైన ఆనందం. ఇండియన్స్ పరాయివాళ్లన్న భావన నాకెన్నడూ లేదు. ఎప్పుడో.. ఎక్కడో తప్పిపోయి.. వేరువేరు ఇళ్లల్లో పెరిగిన తోబుట్టువుల్లా తోస్తారు. ఇప్పుడు నా సీరియల్స్, సిరీస్తో వాళ్లను కలుసుకుంటున్నట్టనిపిస్తోంది.'ఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి!
అవంతి రాజ్యాన్నేలే ఆనందవర్మకి ఒక్కడే కొడుకు. అతని విద్యాభ్యాసం పూర్తయ్యింది. వివాహం చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆనందవర్మ. ఆ మాట రాణితో అంటే, ఆమె ‘అవును.. పెళ్ళి అంగరంగవైభవంగా చేయాలి. ఎందుకంటే మనకు ఒక్కగానొక్క కొడుకాయే!’ అంది. అదే విషయాన్ని రాజు మంత్రితో చెబితే, ఆయనా రాణి అన్నట్లే అన్నాడు. బంధుగణమూ, రాజోద్యోగులూ ‘అవును ఆకాశమంత పందిరేసి, భూదేవంత అరుగేసి చేయాలి’ అన్నారు.రాజుగారు అందరిమాట మన్నించి కుంతల రాకుమారితో యువరాజు వివాహం కనీవినీ ఎరుగనంత వైభవంగా చేశాడు. ఆ వేడుకలు చూసిన రాజ్యంలోని ప్రజలంతా ‘ఇలాంటి పెళ్ళి ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగబోదు’ అంటూ పొగడటం ప్రారంభించారు. రాజుగారి ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆనందం అట్టేకాలం నిలవలేదు. ఒకరోజు చావు కబురు చల్లగా చెప్పాడు మంత్రి.. ఖజానా ఖాళీ అయిందని! ‘పరిష్కారం ఏమిటీ?’ అని రాజుగారు అడిగితే, ‘కొత్త పన్నులు వేసి ధనం రాబట్టడమే’ అన్నాడు మంత్రి. కొత్త పన్నులు విధించాడు రాజు. కొత్తగా పన్నులు వేసినపుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రాజుగారికి అలవాటు. అలా రాజు, మంత్రి ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరారు.పొద్దుపోయేసరికి రుద్రవరం అనే గ్రామం చేరారు. రాత్రికి అక్కడే సేదదీరి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభిద్దామనుకుని, గుడి వద్ద సందడిగా ఉంటే అక్కడికెళ్లారు. గ్రామాధికారి కూతురి పెళ్ళి జరుగుతున్నది. పట్టుమని వంద మంది అతిథులు కూడా లేరు. ‘అంత పెద్ద పదవిలో ఉండి ఇంత నిరాడంబరంగా పెళ్ళి చేస్తున్నాడేమిటీ?’ అని ఆశ్చర్యపోయి రాజుగారు గ్రామస్థుల్ని విచారించాడు. ‘ముందుగా మన రాజుగారిలాగే ఆడంబరాలకు పోయి గ్రామాధికారి తన కుమార్తె వివాహం ఘనంగా చేయాలనుకున్నాడు. ఖర్చులు లెక్కేస్తే లక్షవరహాలు దాటేటట్టు అనిపించింది. ఆయనకది ఇష్టంలేకపోయింది.పెళ్ళి నిరాడంబరంగా జరిపి, ఆ లక్షవరహాలతో ఊర్లో వైద్యశాల నిర్మిస్తే తరతరాలు సేవలందిస్తుందని ఆలోచించాడు. ఇదే విధంగా రాజుగారు కూడా ఆలోచించి ఉంటే అనవసర వ్యయం తగ్గివుండేది. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేసుంటే తరతరాలు రాజుగారి పేరు చెప్పుకునేవారు. ఆ విధంగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవారు. మాకు ఈ కొత్త పన్నుల బాధ తప్పేది’ అన్నారు నిష్ఠూరంగా. రాజుగారికి ఎవరో చెంప ఛెళ్ళుమనిపించినట్లయింది.ఆయన తిరిగి మంత్రితో రాజధాని చేరి, చర్చలు జరిపి కొత్త పన్నులను రద్దు చేశాడు. అంతఃపుర ఖర్చులు తగ్గించాడు. వేట, వినోద కార్యక్రమాల ఖర్చులూ తగ్గించాడు. పాలనలో అనవసర వ్యయాలను తగ్గించాడు. ఆ తర్వాత ఖజానా సులువుగానే నిండింది. అప్పటినుంచి ఆనందవర్మ ఏ కార్యక్రమాన్నయినా ఒకటికి పదివిధాలుగా ఆలోచించి చేయసాగాడు. ఆడంబరాలకు పోక పొదుపు పాటించసాగాడు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా మంచిపేరు సంపాదించుకున్నాడు. – డా. గంగిశెట్టి శివకుమార్ఇవి చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'? -
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
అంపశయ్య మీదనున్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు ‘పితామహా! లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ, పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు. ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా, పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లను గుర్తించడం ఎలా?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ‘ధర్మనందనా! నువ్వు అడిగిన సందేహానికి నేను పులి–నక్క కథ చెబుతాను’ అంటూ కథను మొదలుపెట్టాడు.‘పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. బతికినన్నాళ్లు క్రూరకర్మలు చేయడం వల్ల నక్కగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ఈ జన్మలో మంచిగా బతుకుదామని తలచి, అహింసావ్రతం చేస్తూ ఆకులు అలములు తినసాగాడు. ఇది చూసి అడవిలోని తోటి నక్కలు ‘ఇదేమి వ్రతం? మనం నక్కలం. ఆకులు అలములు తినడమేంటి? నువ్వు నక్కల్లో తప్పపుట్టావు. నీకు వేటాడటం ఇష్టం లేకుంటే చెప్పు, మేము వేటాడిన దాంట్లోనే కొంత మాంసం నీకు తెచ్చి ఇస్తాం’ అన్నాయి.పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క ‘తప్పపుట్టడం కాదు, తప్పనిసరిగా నక్కగా పుట్టాను. నాకు ఆకులు అలములు చాలు. నేను జపం చేసుకునే వేళైంది. మీరు వెళ్లండి’ అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది. నక్క అహింసావ్రతం చేçస్తున్న సంగతి అడవికి నాయకుడైన పులికి తెలిసింది. ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు.‘అయ్యా! నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది. నువ్వు నాతో వచ్చేయి. నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ, నన్ను మంచిదారిలో నడిపించు’ అని వినయంగా ప్రాధేయపడ్డాడు. ‘రాజా! చూడబోతే నువ్వు గుణవంతుడిలా ఉన్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు. నీతో రాలేను’ అని బదులిచ్చింది నక్క.‘నాతో రాకపోయినా, నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచీచెడ్డా చెబుతూ ఉండు’ కోరాడు పులిరాజు.‘పులిరాజా! నువ్వూ నేనూ స్నేహంగా ఉంటే, నీతోటి వాళ్లు అసూయ పడతారు. మనిద్దరికీ విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు తప్పదు. అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు’ బదులిచ్చింది నక్క.‘లేదు మహాత్మా! నీమీద ఎవరేం చెప్పినా వినను. అలాగని మాట ఇస్తున్నాను, సరేనా!’ అన్నాడు పులిరాజు. నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది.పులిరాజుకు నక్క మంత్రిగా రావడం మిగిలిన భృత్యులకు నచ్చలేదు. నక్క ఉండటం వల్ల తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి. చివరకు ఎలాగైనా నక్క పీడ విరగడ చేసుకోవాలని కుట్ర పన్నాయి. ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి, నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి.గుహలో మాంసం లేకపోయేసరికి పులిరాజు భృత్యులందరినీ పిలిచి వెదకమని నాలుగు దిక్కులకూ పంపాడు. వెదుకులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు. నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కుపుటాలను తాకింది. లోపలకు వెళ్లి చూస్తే, తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ కనిపించింది.‘ఎంత మోసం!’ పళ్లు పటపట కొరికాడు పులిరాజు.ఈలోగా మిగిలిన భృత్యులంతా అక్కడకు చేరి, ‘మహారాజా! మీరు స్వయంగా గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే, నక్క ఏమిటి? అహింసావ్రతమేమిటి? మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే గాని, దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు’ అన్నాయి.‘వెళ్లండి. ఈ ముసలినక్కను బంధించి, వధించండి’ ఆజ్ఞాపించాడు పులిరాజు.ఇంతలో పులిరాజు తల్లి అక్కడకు వచ్చింది. ‘ఆగు! వివేకం లేకుండా ఏం చేస్తున్నావు? భృత్యులు చెప్పేదంతా తలకెక్కించుకునేవాడు రాజుగా ఉండతగడు. అధికులను చూసి హీనులు అసూయపడతారు. ఇలాంటివాళ్ల వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే, తమ ఆటలు సాగవని దుష్టులైన భృత్యులు నాటకాలాడతారు. అలాంటివాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండాలి’ అని హితబోధ చేసింది.పులిరాజు తన భృత్యుల మోసాన్ని గ్రహించాడు. వెంటనే నక్కను పిలిచి, ‘మహాత్మా! నావల్ల పొరపాటు జరిగిపోయింది. మన్నించు. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను’ అని వేడుకున్నాడు.‘పులిరాజా! తెలిసిగాని, తెలియకగాని ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం. ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా, ఇక నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు’ అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. నిరాహారదీక్షతో శరీరం విడిచి, సద్గతి పొందింది.రాజు ఎన్నడూ చెప్పుడు మాటలకు లోబడకూడదు. మంచిచెడులను గుర్తెరిగి, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకుని మసలుకోవాలి’ అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు. – సాంఖ్యాయనఇవి చదవండి: రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా! -
ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..!
సాక్షి, సిటీబ్యూరో: జిమ్కు వెళ్లడం అనేది శారీరక వ్యాయామం, ఆరోగ్యం కోసం అనేది అందరికీ తెలిసిన విషయం. నాణేనికి మరో వైపు ఆదాయ మార్గం ఉంది. శరీర సౌష్టవం కలిగిన వారికి పార్ట్టైం, ఫుల్ టైం ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నగరంలో వందలాది కుటుంబాలు ఈ రకంగా ఉపాధి పొందుతున్నాయి. కండలు తిరిగిన యువత బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనడం, ఉన్నత శ్రేణి కుటుంబాలకు బాడీగార్డులుగా, ఈవెంట్స్, ప్రముఖ వ్యాపార సంస్థలకు బౌన్సర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరికి ఉపాధితో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.నిత్యం జిమ్ చేస్తూ ఆరోగ్యంగా, బలంగా ఉన్న వారికి మార్కెట్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న వారికి పార్ట్ టైం, ఫుల్ టైం రెండు రకాల ఉద్యోగాలూ లభిస్తున్నాయి. భాగ్యనగరంలో రాజకీయ నాయకులు తమ రక్షణ కోసం ప్రైవేటుగా బాడీగార్డులను నియమించుకుంటున్నారు. ఏవైనా జన సమీకరణ కార్యక్రమాలు ఉన్నపుడు బౌన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఉన్నత శ్రేణి కుటుంబాలు, సినిమా, ఇతర సెలబ్రిటీలు బయటకు రావాలన్నా, ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా బౌన్సర్లను పెట్టడం అలవాటుగా మారిపోయింది. కొన్ని వర్గాలకు బౌన్సర్లను పెట్టుకోవడం స్టేటస్గానూ భావిస్తున్నారు. దీంతో నగరంలో బౌన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది.ఈవెంట్స్ను బట్టి..ఒక్కో ఈవెంట్కు అక్కడ పరిస్థితులను బట్టి 8 గంటలు, 12 గంటలు, 24 గంటలు ఇలా సమయాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. బౌన్సర్లకు 8 గంటలకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. 12 గంటలు, ఆపై సమయాన్ని బట్టి లెక్కలు ఉంటాయి. మరోవైపు పబ్లు, పేరొందిన రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్, ప్రముఖ దుకాణాల్లోనూ నెలవారీ వేతనాలకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. బాడీగార్డు, బౌన్సర్లకు నెలకు కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ చెల్లిస్తున్నారు.17 ఏళ్ల వయసు నుంచి..నాకు 17 ఏళ్ల వయసు నుంచి జిమ్కు వెళ్లడం ప్రారంభించాను. ఇపుడు 30 ఏళ్లు. తొలి రోజుల్లో ఆరోగ్యం, శరీర సౌష్టవం కోసం వెళ్లాను. అందరిలోనూ మనం ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించాను. శరీరం ఆకర్షణీయమైన ఆకృతిలో తయారయ్యింది. తదుపరి రోజుల్లో బౌన్సర్గా అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్ల తరువాత సొంతంగా బిజినెస్ ప్రారంభించాను. ప్రస్తుతం పార్ట్ టైం బౌన్సర్గా పనిచేస్తున్నాను. ఈవెంట్స్ ఉన్నపుడు వెళుతున్నా. 8 గంటలకు కనీసం రూ.1500 ఆపైన వస్తాయి. 12 గంటలు అయితే రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. ఈ ఆదాయం ఆర్థిక వెసులుబాటు కలి్పస్తుంది. – అమోల్, బౌన్సర్, బంజారాహిల్స్పర్సనల్ బాడీగార్డుగా..గత పదేళ్ల నుంచి జిమ్కు వెళుతున్నాను. డైట్ పాటిస్తాను. ఆరోగ్యంగా, శారీరకంగా ఫిట్గా ఉంటాను. నాకు తెలిసిన వారి రిఫరెన్స్ ద్వారా పర్సనల్ బాడీగార్డుగా చేరాను. నమ్మకంగా పనిచేసుకుంటున్నాను. మంచి వేతనం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతృప్తికరమైన జీవితం సాగిస్తున్నాను. – ఆదిల్, జూబ్లీహిల్స్ఇవి చదవండి: Pooja Bedi: ప్రతి విషాదం.. నన్ను దృఢం చేసింది! -
పందొమ్మిదేళ్లకు.. ‘ఫ్యామిలీ ట్రీ’ట్!
జపాన్లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్లో ఒక విద్యార్థి రిన్. ఇరవై ఏళ్ల రిన్ని ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా కాలేజీ వాళ్లు ‘ఫ్యామిలీ ట్రీ’ తయారుచేయమన్నారు. తల్లి తప్ప మరెవరూ లేకపోవడంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రిన్. తల్లి సచియే తకహతాను అడిగాడు. తల్లి–తండ్రి విడిపోయే సమయంలో రిన్ వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే. వారు విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ‘ఆధారాల కోసం వెతికే క్రమంలో కొన్ని పాత ఫ్యామిలీ ఫొటోలు, తండ్రి సుఖ్పాల్ పేరు, అమృతసర్ అడ్రస్ దొరికాయి. గూగుల్ మ్యాప్లో లొకేషన్ కోసం వెతికి, టికెట్ బుక్ చేసుకొని ఆగస్టు 15న పంజాబ్లోని అమృత్సర్కి చేరుకున్నాడు.అయితే విధి అతన్ని మరింతగా పరీక్ష పెట్టింది. సుఖ్పాల్ అక్కడి నుండి ఎప్పుడో వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడని తెలిసింది. తండ్రి ప్రస్తుతం ఉంటున్న అడ్రెస్ ఎవరూ చెప్పలేకపోయారు. ‘నా దగ్గర మా నాన్న పాత ఫొటోలు ఉండటంతో స్థానిక ప్రజలను అడిగి కనుక్కోవడానికి ప్రయత్నించాను. చాలా మందిని అడిగాక అదృష్టం కొద్దీ ఒక వ్యక్తి నా తండ్రి ఫొటో గుర్తించి, అతని కొత్త చిరునామా నాకు ఇచ్చే ఏర్పాటు చేశాడు. అలా 19 ఏళ్ల తర్వాత మా నాన్నను మళ్లీ కలవగలిగాను’ అని తండ్రిని కలుసుకున్న ఉద్విగ్న క్షణాలను పంచుకుంటున్నాడు రిన్.‘ఇలా జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ, జరిగింది. నా ప్రస్తుత భార్య గుర్విందర్జిత్ కౌర్, నా ఏకైక కుమార్తె అవ్లీన్ కూడా రిన్ను కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతించినందుకు సంతోషంగా ఉన్నాను. నా మాజీ భార్య సచియేతో ఫోన్లో మాట్లాడాను. రిన్ క్షేమం గురించి చె΄్పాన’ని సుఖ్పాల్ కొడుకును కలుసుకున్న మధుర క్షణాలను పంచుకుంటున్నాడు.రక్షాబంధన్ రోజే...రిన్ తండ్రి కుటుంబాన్ని కలవడం, పండగప్రాముఖ్యతను గురించి తెలుసుకొని, ఆ రోజు సవతి సోదరి అవ్లీన్ చేత రాఖీ కట్టించుకోవడం.. వంటివి రిన్ను థ్రిల్ అయ్యేలా చేశాయి. ‘మా సోదర–సోదరీ బంధం చాలా బలమైనది’ అని ఆనందంగా చెబుతాడు రిన్.కొడుకును అమృత్సర్కి తీసుకెళ్లి..ఇన్నేళ్లకు వచ్చిన కొడుకును వెంటబెట్టుకొని సుఖ్పాల్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించుకున్నాడు. అటారీ వాఘా సరిహద్దులో జరిగిన జెండా వేడుకను వీక్షించారు. సుఖ్పాల్ తన గతాన్ని వివరిస్తూ ‘2000 సంవత్సరం మొదట్లో థాయ్లాండ్ విమానాశ్రయంలో భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా సచియేను చూశాను. విమానంలో మా సీట్లు పక్కపక్కనే ఉన్నాయి. అలా మా మొదటి సంభాషణ జరిగింది. ఆమె వరుసగా ఎర్రకోట, తాజ్మహల్లను సందర్శించడానికి న్యూఢిల్లీ, ఆగ్రాకు వెళుతోంది.గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పి, అమృత్సర్కి తన పర్యటనను పొడిగించమని సచియేని నేనే అడిగాను. ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పి అమృత్సర్కి నాతో పాటు వచ్చింది. మా కుటుంబంతో కలిసి 15 రోజులకు పైగా ఉంది. ఇక్కడ ఉన్న సమయంలో స్థానిక పర్యాటక ప్రదేశాలతో పాటు ఎర్రకోట, తాజ్మహల్ను సందర్శించాం. సచియే జపాన్కు వెళ్లాక కూడా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు తనకు 19 ఏళ్లు, నాకు 20 ఏళ్లు. 2002లో సచియేను వివాహం చేసుకుని, జపాన్ పర్యటనకు వెళ్లాను. ఏడాది తర్వాత రిన్ జన్మించాడు. నేను జపనీస్ నేర్చుకున్నాను. అక్కడ చెఫ్గా పని చేశాను.కొన్ని రోజుల తర్వాత మేం కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేకపోయాం. దీంతో నేను భారతదేశానికి తిరిగి వచ్చేశాను. ఆమె రిన్తో కలిసి నన్ను చూడటానికి భారతదేశం వచ్చింది. మరోసారి తనతో కలిసి జపాన్కు వెళ్లాను. కానీ, కలిసి ఉండలేకపోయాం. 2004లో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత మూడేళ్ళు జపాన్లోనే ఉన్నా కానీ, వారిని కలవలేదు. 2007లో స్వదేశానికి తిరిగి వచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మేమంతా రిన్తో టచ్లో ఉంటాం’ అని గత స్మృతులను, ప్రస్తుత ఆనందాన్ని ఏకకాలంలో పొందుతూ ఆనందంగా చెబుతున్నాడు సుఖ్పాల్. -
Rakshitha: కాళ్లే కళ్లయ్యి..
కళ్లు మూసుకొని నాలుగడుగులు వేయలేము. కళ్లు కనపడకుండా పరిగెత్తగలమా? ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్లో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఒలింపిక్స్లో మన క్రీడాకారులు తేలేని బంగారు పతకం మన దివ్యాంగ క్రీడాకారులు తెస్తారని ఆశ. కర్ణాటకకు చెందిన అంధ అథ్లెట్ రక్షిత రాజు 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న తొలి భారతీయ పారా అథ్లెట్గా చరిత్ర సృష్టించనుంది. పతకం తెస్తే అది మరో చరిత్ర. రక్షిత రాజు పరిచయం.అక్టోబర్ 26, 2023.రక్షిత రాజుకు ఆనందబాష్పాలు చిప్పిల్లుతున్నాయి. కన్నీరు కూడా ఉబుకుతోంది. ఆమె హాంగ్జావు (చైనా) పారా ఆసియా గేమ్స్లో 1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. చాలా పెద్ద విజయం ఇది. ఈ విషయాన్ని ఆమె తన అమ్మమ్మతో పంచుకోవాలనుకుంటోంది. కాని పంచుకోలేక΄ోతోంది. కారణం? అమ్మమ్మకు వినపడదు. చెవుడు. మాట్లాడలేదు. మూగ. కాని ఆ అమ్మమ్మే రక్షితను పెంచి పెద్ద చేసింది. ఆమె వెనుక కొండలా నిలుచుంది. ఆ ఘట్టం బహుశా ఏ సినిమా కథకూ తక్కువ కాదు. నిజజీవితాలు కల్పన కంటే కూడా చాలా అనూహ్యంగా ఉంటాయి.ఊరు వదిలేసింది..కర్నాటకలోని చిక్బళ్లాపూర్లోని చిన్న పల్లెకు చెందిన రక్షిత రాజు పుట్టుకతోనే అంధురాలు. ఆమెకు నాలుగు సంవత్సరాలు ఉండగా తల్లిదండ్రులు మరణించారు. దాంతో ఊరంతా రక్షితను, ఆమె చిన్నారి తమ్ముణ్ణి నిరాకరించారు. చూసేవాళ్లు ఎవరూ లేరు. అప్పుడు రక్షిత అమ్మమ్మ వచ్చి పిల్లలను దగ్గరకు తీసుకుంది. ఆమె స్వయంగా చెవుడు, మూగ లోపాలతో బాధ పడుతున్నా మనవళ్ల కోసం గట్టిగా నిలుచుంది. మనవరాలిని చిక్బళ్లాపూర్లో అంధుల కోసం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ స్కూల్లో చదివించింది. అక్కడి హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు అమ్మమ్మ వచ్చి పలుకరిస్తే ధైర్యం తెచ్చుకునేది. అంధత్వం వల్ల భవిష్యత్తు ఏమీ అర్థం అయ్యేది కాదు. దిగులుగా ఉండేది.వెలుతురు తెచ్చిన పరుగు..ఆశా కిరణ్ స్కూల్లో మంజన్న అనే పీఈటీ సారు రక్షిత బాగా పరిగెత్తగలదని గమనించి ఆమెను ఆటల్లో పెట్టాడు. స్కూల్లో ఉన్న ట్రాక్ మీద పరిగెట్టడం ్రపాక్టీసు చేయించాడు. జైపూర్లో పారా గేమ్స్ జరిగితే తీసుకెళ్లి వాటిలో పాల్గొనేలా చేశాడు. అక్కడే రాహుల్ అనే కర్ణాటక అథ్లెట్ దృష్టి రక్షిత మీద పడింది. ఈమెను నేను ట్రెయిన్ చేస్తాను అని చెప్పి ఆమె బాధ్యత తీసుకున్నాడు. అప్పటివరకూ సింథెటిక్ ట్రాక్ అంటేనే ఏమిటో రక్షితకు తెలియదు. రాహుల్ మెల్లమెల్లగా ఆమెకు తర్ఫీదు ఇచ్చి అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెట్గా తీర్చిదిద్దాడు.గైడ్ రన్నర్ సాయంతో..అంధ అథ్లెట్లు ట్రాక్ మీద మరో రన్నర్ చేతిని తమ చేతితో ముడేసుకుని పరిగెడతారు. ఇలా తోడు పరిగెత్తేవారిని ‘గైడ్ రన్నర్‘అంటారు. అంతర్జాతీయ ΄ోటీల్లో రాహులే స్వయంగా ఆమెకు గైడ్ రన్నర్గా వ్యవహరిస్తున్నాడు. హాంగ్జావులో 1500 మీటర్లను రక్షిత 5 నిమిషాల 21 సెకన్లలో ముగించింది. ‘చైనా, కిర్గిజ్స్తాన్ నుంచి గట్టి ΄ోటీదారులు వచ్చినా నేను గెలిచాను. పారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్లో స్వర్ణం సాధించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’ అంటుంది రక్షిత.అదే సవాలు..అంధులు పరిగెత్తడం పెద్ద సవాలు. వారు గైడ్ రన్నర్ సాయంతోనే పరిగెత్తాలి. ‘మాతోపాటు ఎవరైనా పరిగెత్తొచ్చు అనుకుంటారు. కాని గైడ్ రన్నర్లకు, మాకు సమన్వయం ఉండాలి. మమ్మల్ని పరిగెత్తిస్తూ వారూ పరిగెత్తాలి. ఎంతోమంది ప్రతిభావంతులైన అంధ రన్నర్లు ఉన్నా గైడ్ రన్నర్లు దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. ఒకప్పుడు నా కళ్ల ఎదుట అంతా చీకటే ఉండేది. ఇప్పుడు పరుగు నాకు ఒక వెలుతురునిచ్చింది. పారిస్లో స్వర్ణం సాధించి తిరిగి వస్తాను’ అంటోంది రక్షిత. -
స్వీయ క్రమశిక్షణ..
మనం అభివృద్ధి చేయగల అత్యంత ముఖ్యమైన జీవన నైపుణ్యాలలో స్వీయ–క్రమశిక్షణ ఒకటి. ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నపుడు ఆ మార్గంలో ఎలాంటి ప్రలోభాలు, ఆకర్షణలు ఎదురైనా వాటికి ఏ మాత్రం ప్రభావితం కాకుండా మనస్సుని నియంత్రించుకుని.. చేస్తూన్న పనిపైనే సంపూర్ణమైన దృష్టిని కేంద్రీకరించడమే‘ స్వీయ క్రమశిక్షణ‘. స్వీయ–క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది. నమ్మకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది సమయపాలన కూడా నేర్పుతుంది. అలాగే, తనను తాను మలచుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి ఇంధనంగా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. పరధ్యానాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని దూరం చేస్తూ, కష్టతరమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా... ధైర్యంగా ఎలా ఉండవచ్చో అవగతం చేస్తుంది.వివిధ కార్యకలాపాలకు ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలో, ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. స్వీయ–క్రమశిక్షణ కలిగిన వారు తమ లక్ష్యాలపై దృష్టిసారిస్తే, పరీక్షలలో బాగా రాణించడానికి, వారి అభ్యాస లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇతర జీవిత నైపుణ్యాల మాదిరిగానే, స్వీయ–క్రమశిక్షణలో ్రపావీణ్యం సంపాదించడానికి చాలా సంవత్సరాల అభ్యాసం అవసరం. అయితే ఇది బాహ్యంగా ఎవరో మనల్ని అదుపు చేస్తుంటే అలవరచుకునేదిలా కాకుండా మనకు మనమే పరి చేసుకునేలా ఉండాలి. గాంధీజీ, అబ్దుల్ కలామ్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహాం లింకన్, హెన్రీఫోర్డ్, ఆండ్రో కార్నెగీ, వాల్ట్ డిస్నీ, బరాక్ ఒబామా వంటి మహనీయులంతా తమ తమ జీవితాలలో పాటించిన ‘ స్వీయ క్రమశిక్షణ వల్లే ఉన్నత శిఖరాలకు చేరుకుని, జననీరాజనాలందుకున్నారు.కనుక స్వీయ క్రమశిక్షణను సరైన వయస్సులో నేర్పించి అలవాటు చేసినట్లయితే అది జీవితాంతం మన వ్యక్తిగత అభివృద్ధికి, విజయ సాధనకు సహాయపడుతుంది. స్వీయ క్రమశిక్షణను అలవరచుకోవడానికి ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపించుకుని సాధన చేస్తే స్వీయ క్రమశిక్షణ మన సొంతమై, అనేక విజయాలను సంపాదించి పెడుతుంది. ఇది మన భవిష్యత్ గమ్యాన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు, మన జీవితానికి ఓ అర్ధాన్ని, పరమార్థాన్ని అందించి పెడుతుంది. కనుక ఏ మనిషైతే స్వీయ క్రమశిక్షణను అలవరచుకుంటాడో, అలాంటి వారు జీవితంలో అత్యంత సులువుగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించుకోదు."స్వీయ క్రమశిక్షణ అనేది ఓ గొప్ప వ్యక్తిత్వపు లక్షణం. ఇది నిరంతరం చేయాల్సిన తపస్సు లాంటిది. ఒకానొక విద్యార్థి తన జీవితంలో పాటించే స్వీయ క్రమశిక్షణ ఆ విద్యార్థి పూర్తి జీవితానికి బంగారు బాట అవుతుంది." – దాసరి దుర్గా ప్రసాద్ -
Fashion: మనుసుకు నచ్చిన రంగులు.. కలర్ – కంఫర్ట్!
‘మనసుకు నచ్చిన రంగులు ఉండాలి. ట్రెండ్కు తగినట్టు ఉండాలి. స్పెషల్ లుక్ అనిపించాలి. అన్నింటికి మించి సౌకర్యంగా ఉండాలి’అంటూ ఎంచుకునే డ్రెస్సింగ్ విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉంటున్న నిఖితారెడ్డి తన వార్డ్రోబ్ ముచ్చట్లను ఈ విధంగా పంచుకున్నారు.ఐదేళ్ల లోపు పిల్లలకు ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ఆన్లైన్లో చాలా డిజైన్స్ వస్తున్నాయి. నా శారీ కలర్ లేదా పార్టీ థీమ్ కలర్ని బట్టి వాటిని ఎంపిక చేసుకుంటాను. పాప వేసుకున్న పింక్ కలర్ లెహంగా, దుపట్టా అలా ప్లాన్ చేసిందే. పట్టు డ్రెస్సులు మాత్రం మెటీరియల్ తీసుకొని, స్టిచింగ్ చేయిస్తాను.కలర్ కాంబినేషన్స్..నా ఫేవరెట్ కలర్స్ ఆరెంజ్, పింక్. దీంతో నా వార్డ్రోబ్లో ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు ఎక్కువ చేరుతుంటాయి. అయితే, ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. చుడీదార్ ఎంపిక చేసుకున్నా ఒక చిన్న ఆరెంజ్ ఎలిమెంట్ అయినా ఉండాలి. ఇదే కాంబినేషన్లో బేబీ షవర్ సమయంలో మా ఫ్యామిలీ షూట్కి పట్టుచీర, కుర్తా పైజామా సెట్ ఆరెంజ్ కాంబినేషన్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాం.సెలబ్రిటీ స్టయిల్..ఆరెంజ్ శారీ స్టైల్లో నటి అదితీరావు హైదరీ ఫొటో సోషల్ మీడియా లో చూశాను. నాకు బాగా నచ్చింది. ఆ విధంగా ఉండాలని ఆరెంజ్ శారీ, బ్లౌజ్ మెటీరియల్ అన్నీ సొంతంగా ఎంపిక చేసుకుని, డిజైన్ చేయించుకున్నాను. ముత్యాలు, పచ్చలు, కుందన్స్ కాంబినేషన్ జ్యువెలరీని దానికి సెట్ చేశాను.మిక్స్ అండ్ మ్యాచ్..పెళ్లి సమయంలో తీసుకున్న చీరలు, అమ్మవాళ్లు కానుకగా ఇచ్చినవి.. ప్రత్యేక సందర్భాలలో వేసుకోవడానికి బ్లౌజ్ డిజైన్స్ ద్వారా మార్పులు చేస్తుంటాను. కానీ, చాలా వరకు ఏ డ్రెస్ సెట్ ఎలా ఉంటే అలాగే వేసుకోవాలనుకుంటాను. పెద్దగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయను.థీమ్ పార్టీలు..ముందుగా కంఫర్ట్గా ఉండే డ్రెస్సులకే ్రపాధాన్యత ఇస్తాను. ఇప్పుడు మదర్ డాటర్ కాంబినేషన్ సెట్స్ వస్తున్నాయి. వాటిని ప్లాన్ చేస్తాను. అలాగే, పాపకు నాకు బర్త్ డే గిఫ్ట్స్ డ్రెస్సులు వస్తుంటాయి. వాటిని చిన్న మార్పులతో థీమ్డ్ పార్టీలకు ప్లాన్ చేస్తాను.ఎంబ్రాయిడరీ.. క్వాలిటీ ఫస్ట్..ఫ్లోరల్ ప్రింట్స్ స్టోర్స్లోనూ ఆన్లైన్లోనూ మార్కెట్లో ఎంపిక చేసుకుంటాను. కానీ, ఎంబ్రాయిడరీ అయితే కొన్ని ప్రత్యేకమైన చోట్లనే బాగుంటాయి. డిజైన్ పరంగానూ, క్వాలిటీ పరంగానూ బాగున్నవి అయితేనే ఎంబ్రాయిడరీ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను.ఫ్లోరల్స్..దగ్గరి బంధువుల పెళ్లిలో ప్రతిదీ వేడుకగా ఉండాల్సిందే. ముఖ్యంగా సంగీత్, హల్దీ, రిసెప్షన్.. వంటి వేడుకలకు వైవిధ్యంగా ఉండాలి. హల్దీ ఫంక్షన్ కోసం రెడీ అవ్వడానికి ఫ్లోరల్ డిజైన్స్, ఫ్లోరల్ జ్యువెలరీ బాగుంటుంది. ఇందుకు ఆన్లైన్ మార్కెట్లోనూ మంచి మంచి మోడల్స్ లభిస్తున్నాయి. ఫ్లోరల్ డిజైన్స్ అలా ఎంపిక చేసుకుని తీసుకున్నవే. మా కజిన్ హల్దీ ఫంక్షన్కి డ్రెస్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వెస్ట్రన్ స్టయిల్..బ్లాక్ థీమ్డ్ డ్రెస్ను న్యూ ఇయర్ సందర్భంగా, కజిన్స్తో బర్త్డేస్కు వెళ్లాలంటే మోడర్న్గా ఉండేవి ప్లాన్ చేసుకుంటాను.ప్రయాణాలకు ఒక స్టయిల్..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎగ్జిబిషన్స్ స్టాల్స్ పెడుతుంటారు. వాటిలో లాంగ్ ఆరెంజ్ ఫ్రాక్ ఎంపిక చేసుకున్నాను. ఇలాంటివి టూర్స్కి వెళ్లినప్పుడు వేసుకుంటాను. వాటిల్లో ఫొటోస్ కూడా బ్రైట్గా వస్తాయి. అలాగే, లాంగ్ ఫ్రాక్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉండేలా చూసుకుంటాను. -
ది వార్ విత్ ఇన్! అడుగడుగునా అంతులేని ధైర్యం!
మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘వరల్డ్ క్రాఫ్ట్: ది వార్ విత్ఇన్’ ఈ నెల 26న విడుదల కానుంది. ‘వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్’కు ఎక్స్΄ాన్షన్ ప్యాక్గా వస్తున్న గేమ్ ఇది. 2004లో వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్’లో ప్లేయర్ ‘క్యారెక్టర్ అవతార్’ను క్రియేట్ చేసి థర్ట్ లేదా ఫస్ట్–పర్సన్ వ్యూ నుంచి ఓపెన్ గేమ్ వరల్డ్ను ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది.ఇక ‘ది వార్ విత్ఇన్’ విషయానికి వస్తే... ఈ గేమ్లో ఖాజ్ అల్గార్ అనేది ప్రైమరీ సెట్టింగ్. ది ఇజెల్ ఆప్ డోర్న్, ది రింగింగ్ డీప్స్, హాలోఫాల్, అజి–కహెట్ అనే నాలుగు జోన్లుగా విభజించబడి ఉంటుంది.ఈ గేమ్లో ‘డైనమిక్ ఫ్లైయింగ్’ అనే ఫీచర్ ఉంది. న్యూ గేమ్స్ను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.సిరీస్: వార్క్రాఫ్ట్;ప్లాట్ఫామ్: విండోస్, మ్యాక్వోఎస్;మోడ్: మల్టీప్లేయర్జానర్: ఎంఎంఆర్పీజీ (మాస్వ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్) -
కథ చెబుతాం.. ఊ కొడతారా..!
‘అనగనగా ఓ మహారాజు ఉన్నాడు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురూ వేటకువెళ్లి ఏడు చేపలు తెచ్చారు...’ ఇలా పిల్లలకు పాత కథలు మాత్రమే తప్ప కొత్త కథలు, కొత్తగా చెప్పడం రాని ఆధునిక తల్లిదండ్రులు.. కథలు నేర్పే స్టోరీ టెల్లర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. వీరు మాత్రమే కాదు పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ల నుంచి కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు చెప్పే కౌన్సిలర్స్ వరకూ అందరూ కథా కళ..లో నైపుణ్యం కోసం క్యూ కడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రధానంగా నగరంలో ఈ కళకు డిమాండ్ తీసుకురావడంతో తల్లిదండ్రులే మహారాజు పోషకులుగా కనిపిస్తున్నారు. పిల్లలకు కథలు చెప్పడం మానసిక వికాసానికి మార్గమని సైకాలజిస్ట్లు సూచిస్తుండడం ఈ పోకడకు ఆజ్యం పోస్తోంది. పిల్లలకు కథలు చెప్పడం కేవలం వినోదం కాదని, ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇది తప్పనిసరి అని చెబుతున్నారు స్టోరీ టెల్లర్ దీపాకిరణ్. కథలు చెప్పడం వల్ల పెద్దలు, పిల్లల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని అన్నారామె.ప్రయోజనాలెన్నో...సంభాషించడానికి మాత్రమే కాదు నేర్చుకోవడానికీ.. ఆలోచనల్లో పరిణితికీ భాష అవసరం. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్నారుల్లో భాషా పరిజ్ఞానం సంతరించుకోవడం ఆలస్యం కావడం సహజంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్నారులను ఆకట్టుకునేలా కథలు చెప్పడం నేర్చుకున్న పెద్దలు ఆ నైపుణ్యాన్ని పిల్లలకు అందిస్తారు. కథల ద్వారా సంస్కృతి గురించి నేర్పవచ్చు. అలాగే ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు అంటున్నారు నిపుణులు.మనవడికి కథలు చెబుతున్నా...కొన్ని రోజుల క్రితం నా పదేళ్ల మనవడు అమ్మమ్మా కథ చెప్పమని నన్ను అడగడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్ కాలంలో కూడా పెద్దల నోటి ద్వారా కథలు వినడానికి పిల్లలు ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది. స్టోరీ టెల్లింగ్ వర్క్షాప్కి అటెండ్ అయ్యి కొత్త కొత్త కథలు, ఆకట్టుకునేలా చెప్పగలడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మనవడు/మనవరాళ్లతో అనుబంధం మరింత బలోపేతం చేసింది. – భారతి రామినేనిమెళకువలు నేర్చుకుంటే మేలెంతో..స్టోరీ టెల్లింగ్ సెషన్స్కి హాజరవడం వల్ల కథకు సంగీతాన్ని జత చేయడం, ముఖ కవళికలు, గొంతు పలికే తీరులో మార్పుచేర్పులు చూపడం.. వంటివి నేర్చుకుని నా మూడేళ్ల కొడుకుకి మంచి కథలు చెప్పగలుగుతున్నా. తనతో అనుబంధాన్ని మరింతగా ఆనందిస్తున్నా. – దాసన్నకళ అబ్బింది.. కథ వచ్చింది.. కథలు చెప్పడమే కదా ఎంత సేపు అనుకుంటాం కానీ.. ఈ ఆర్ట్ను నేర్చుకుంటే.. జీవితంలో ప్రతీ సందర్భాన్ని ఒక కథగా మలిచే సామర్థ్యం వస్తుంది. సంగీతాన్ని కలుపుతూ మా అబ్బాయికి కథ చెప్పడం, కథలోని క్యారెక్టర్స్ ఆవాహన చేసుకుని చెప్పడం వంటివి తనకి బాగా కనెక్ట్ అవుతోంది. తన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి బాగా ఉపకరిస్తోంది. విశేషం ఏమిటంటే తనే కథలు అల్లేసి నాకు చెబుతున్నాడు. – సుధారాణిప్రొఫెషనల్ లైఫ్లో ప్రజెంటేషన్స్కూ..ఓ ఐటీ కంపెనీలో పనిచేసే నాకు వృత్తి జీవితంలో స్టోరీ టెల్లింగ్ సామర్థ్యం ఉపకరించింది. ముఖ్యంగా పలు అంశాలపై ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి సహకరించాయి. నిజానికి నా సోదరి కూతుర్ని పెంచాల్సిన బాధ్యత వల్ల స్టోరీటెల్లింగ్ నేర్చుకోవాల్సి వచి్చంది. అలా నేర్చుకుని తనకు చెప్పిన కొన్ని కథలు తనని క్లాస్లో టాపర్గా మార్చాయి. మంచి హాబీస్ను అలవర్చాయి. తను ఎప్పుడైనా ఏడుపు ముఖం పెట్టిందంటే నేను అనగనగా అనగానే ముఖ కవళికలు మార్చేసి ఆసక్తిగా చూస్తుంది. కథలు చెప్పడం వల్ల నా కూతురికి కూడా చాలా మానసిక వికాసం వచ్చేలా చేయగలిగాను. చాలా ఇళ్లలో పిల్లల వల్ల ఎదురయ్యే అల్లరి చిల్లరి ఇబ్బందులెప్పుడూ నాకు ఎదురు కాలేదు. దానికి కారణం కథలే అని చెప్పగలను. అందరు పిల్లలూ వీడియోగేమ్స్లో బిజీగా ఉండే సమయంలో మా పిల్లలు నన్ను కథ చెప్పవా అని అడుగుతారు. – వసుధకథలతో అనుబంధాలు బలోపేతం..స్టోరీటెల్లింగ్ అనే కళలో నైపుణ్యం సాధించే విషయంలో టీచర్లతో పాటు అవ్వా, తాతలకు, తల్లిదండ్రులకు బాగా ఆసక్తి పెరిగి మా స్టోరీ సూత్ర సంస్థను సంప్రదిస్తున్నారు. కథలు చెప్పే కళలో నైపుణ్యం సాధించిన వారు ఇలా పిల్లలతో తమ మధ్య అనుబంధం బలపడిందని, అంతిమంగా అది తమ ఆరోగ్యానికి, ఆనందానికి సైతం ఉపకరిస్తోందని చెబుతున్నారు. – దీపాకిరణ్, స్టోరీ టెల్లర్ -
క్యాన్సర్ కాటుకు వర్కవుట్.. ఫిట్ ఫర్ టాట్!
హీనా ఖాన్ ప్రముఖ నటి. హిందీ టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. కెరీర్ కాంతిపుంజంలా వెలుగుతున్న కాలంలో అనారోగ్యం ఆమె మీద దాడి చేసింది. ఆమె తాను బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించేటప్పటికే మూడవ దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే క్యాన్సర్ బారిన పడినందుకు ఏ మాత్రం కుంగిపోవడంలేదు. కీమోథెరపీ చేయించుకుంటూ తన ఆరోగ్యంతోపాటు ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్కెళ్తోంది. వివరాల్లోకి వెళితే...కాళ్లు మొద్దుబారుతున్నాయి..కీమోథెరపీ బాధలు, న్యూరోపతిక్ పెయిన్ను భరిస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టయిల్ను అనుసరిస్తోంది. ‘కీమోథెరపీ దేహాన్ని పిండేస్తుంది. వర్కవుట్స్ చేసేటప్పుడు కాళ్లు పట్టుతప్పుతున్నాయి, ఒక్కసారిగా పడిపోతున్నాను’ అని ఒక పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం లేదామె. మెంటల్, ఫిజికల్ వెల్నెస్ కోసం నొప్పుల బాధలను పళ్లబిగువున భరిస్తూ వ్యాయామం చేస్తోంది. ‘అనారోగ్యంతో కుంగిపోయిన వ్యక్తిలా అభివర్ణించుకోవడం నాకిష్టం లేదు. పడినప్పటికీ తిరిగి లేచి నిలబడాలి. వర్కవుట్ చేసే ప్రతిసారీ ‘గెట్టింగ్ బ్యాక్ అప్... అని నాకు నేను చెప్పుకుంటాను.అలా చెప్పుకోకపోతే మానసిక శక్తి రాదు. మానసిక శక్తి లోపిస్తే వ్యాయామం చేయడానికి దేహం సహకరించదు’ అని తన ఇన్స్టా్రగామ్ ఫాలోవర్స్తో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఒక వీడియోలో జుత్తును తల నుంచి చివరి వరకు నిమిరి అరచేతిలోకి వచ్చిన జుత్తును చూపించింది. గుండు గీసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. మరొక వీడియోలో వర్షంలో గొడుగు వేసుకుని, ప్రోటీన్ షేక్ ఉన్న ఫ్లాస్క్ పట్టుకుని జిమ్ ఆవరణలో ప్రవేశించింది. గొడుగు మూస్తూ హాయ్ అని పలకరించి విక్టరీ సింబల్ చూపించి జిమ్ గదిలోకి వెళ్లడంతో వీడియో పూర్తయింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ విసిరి వీక్షకులకు మనోధైర్యాన్నిచ్చింది.మీ ఆదరణకు కృతజ్ఞతలు..సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అందుతున్న ఆదరణకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ‘మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ చాలెంజ్లో నేను గెలుస్తాను’ అన్నది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్యం వస్తే డీలా పడిపోకూడదు. పోరాడి గెలవాలి అనే సందేశం ఇస్తున్న ఆమె వీడియోలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, క్యాన్సర్కు చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ వ్యక్తుల్లాగే క్వాలిటీ లైఫ్ను లీడ్ చేయడం మనచేతుల్లోనే ఉందని సమాజానికి ధైర్యం చెబుతున్న వారిలో హీనాఖాన్ ఒకరు.ఫిట్నెస్ చాలెంజ్..అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ సూచనల మేరకు... తేలికపాటి వ్యాయామాలు... రిలాక్స్డ్ బైకింగ్ (గంటకు ఐదు మైళ్లకంటే తక్కువ వేగంతో సాఫీగా ఉన్న నేల మీద సైక్లింగ్), స్లో వాకింగ్ (చదునుగా ఉన్న నేల మీద గంటకు మూడు మైళ్లకంటే తక్కువ వేగంతో నడవడం). చిన్న చిన్న ఇంటిపనులు, తాయ్ చాయ్ (దేహాన్ని నిదానంగా కదిలిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం), ప్లేయింగ్ క్యాచ్ (బాల్ను లేదా ఫ్రిస్బీ ప్లేట్ను గురి చూసి విసరడం)తీవ్రమైన వ్యాయామాలు...బైకింగ్... (గంటకు పది మైళ్లకు మించకుండా సైక్లింగ్), బ్రిస్క్ వాక్ (గంటకు మూడు నుంచి నాలుగున్నర మైళ్ల వేగం), ఇంటి పనుల్లో బరువైనవి కూడా, యోగసాధన, టెన్నిస్ వంటి ఆటలు.– అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలు... క్యాన్సర్ పేషెంట్లు వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల వర్కవుట్ షెడ్యూల్ ఉండాలని చెప్తున్నాయి. -
ధర్మయోధుడు: ‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి.. పైగా..
అది కురుదేశం. దాని రాజధాని నగరం స్థూలకోష్ఠికం. ఆ నగరంలో ధనవంతుడైన పండితుని కుమారుడు రాష్ట్రపాలుడు. రాష్ట్రపాలునికి యుక్తవయస్సు దాటింది. అతనికి గృహజీవితం పట్ల అంతగా ఇష్టం ఉండేది కాదు. సన్యసించాలని, జ్ఞానం పొందాలని అనుకునేవాడు. ఒకరోజు బుద్ధుడు తన బౌద్ధసంఘంతో కలసి నగరానికి వచ్చాడు. తన మిత్రునితో కలిసి వెళ్ళి, బుద్ధుని ధర్మోపదేశం విన్నాడు రాష్ట్రపాలుడు. తానూ బౌద్ధ భిక్షువుగా మారాలి అనుకున్నాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి, విషయం చెప్పాడు.‘‘రాష్ట్రపాలా! నీవు కుర్రవాడివి. నీ తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే నీకు భిక్షు దీక్ష ఇస్తాను’’ అన్నాడు బుద్ధుడు. రాష్ట్రపాలుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని అడిగాడు. వారు–‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి. పైగా మా కోట్లాది ధనానికీ నీవే వారసుడివి. నిన్ను వదిలి మేం బతకలేం. కాబట్టి భిక్షువుగా మారడానికి అనుమతించలేం’’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రపాలుడు రెండుమూడు రోజులు వారిని ప్రాధేయపడ్డాడు. చివరికి తన గదిలోకి చేరి, నిరాహార వ్రతం పూనాడు. వారం గడిచింది. రాష్ట్రపాలుడు నీరసించి పడిపోయాడు. తల్లిదండ్రులు భయపడ్డారు. భోరున విలపించారు. అప్పుడు రాష్ట్రపాలుని మిత్రున్ని పిలిపించారు. అతను చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆ మిత్రుడు– తల్లిదండ్రులతో..‘‘మీరు అంగీకరించడమే మంచిది. కనీసం ఎక్కడో ఒకచోట బతికి ఉంటాడు. అయినా కొందరు కొంతకాలమే భిక్షు జీవనం సాగించి, ఇక సాగించలేక తిరిగి ఇంటిదారి పడుతున్నారు. మన వాడూ అదే చేయవచ్చు ’’ అని చెప్పడంతో ఏదో ఒక మూల ఆశతో తల్లిదండ్రులు అనుమతించారు.మహా ఐశ్వర్యాన్ని వదిలి రాష్ట్రపాలుడు భిక్షువుగా మారాడు. కొన్నాళ్ళు గడిచాయి. కొడుకు తిరిగిరాలేదు. దానితో బుద్ధుని పట్ల, భిక్షువుల పట్ల చాలా కోపాన్ని పెంచుకున్నాడు రాష్ట్రపాలుడి తండ్రి. ఒకరోజు కాషాయ బట్టలు కట్టుకుని, బోడిగుండుతో, భిక్షాపాత్ర పట్టుకుని ఒక భిక్షువు వారింటికి వచ్చాడు. పెరట్లో ఉన్న తండ్రికి వళ్ళు మండిపోయింది. ‘‘భిక్షా లేదు, గంజీ లేదు. పో..పో’’ అంటూ తిట్టాడు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భిక్షువు చిరునవ్వుతో అక్కడి నుండి కదిలాడు. అంతలో ఇంటిలోని దాసి పాచిన గంజి పారబోయడానికి బయటకు తెచ్చింది. భిక్షువు ఆగి... ‘‘అమ్మా! ఆ గంజి అయినా భిక్షగా వేయండి’’ అన్నాడు.ఆమె ఆ పాచిన గంజిని భిక్షాపాత్రలో పోస్తూ ఆ భిక్షువుకేసి తేరిపార చూసింది.ఆమె ఒళ్ళు జలదరించింది. నేల కంపించింది. నేలమీద పడి నమస్కరించింది. లేచి పరుగు పరుగున ఇంట్లోకి పోయింది.‘‘అయ్యా! ఆ వచ్చిన భిక్షువు మరెవరో కాదు. మన అబ్బాయి గారే’’ అంది. ఆ మాట విని తల్లిదండ్రులు శోకిస్తూ వీధుల్లోకి వచ్చిపడ్డారు. అక్కడ భిక్షువు కనిపించలేదు. వెతుకుతూ వెళ్లారు. ఆ వీధి చివరనున్న తోటలో కూర్చొని ఆ పాచిన భిక్షను పరమాన్నంగా స్వీకరిస్తున్నాడు రాష్ట్రపాలుడు. ‘‘నాయనా! మేము గమనించలేదు. రా! మన ఇంటికి రా! మంచి భోజనం వడ్డిస్తాం’’ అన్నారు. ‘‘గృహస్తులారా! ఈ రోజుకి నా భోజనం ముగిసింది’’ అన్నాడు. మరునాడు రమ్మన్నారు. అంగీకరించాడు. వెళ్ళాడు. ఉన్నతమైన ఆసనంపై బంగారు గిన్నెల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ముందు ఉంచారు. కొన్ని పళ్ళాల నిండా రత్నరాశులు, వజ్రవైడూర్యాలు నింపి ఆ గదిలో ఉంచారు.‘‘నాయనా! మనకి ఏం తక్కువ! ఈ పళ్ళాల్లో కాదు, గదుల నిండా ఇలాంటి ధనరాశి ఉంది. ఇవన్నీ నీకే... రా! ఆ భిక్ష జీవనం వదులు’’ అన్నారు.‘‘మీరు ఆ ధనరాశుల్ని బండ్లకెత్తించి గంగానదిలో కుమ్మరించండి. లేదా... దానం చేయండి. నాకు జ్ఞాన సంపద కావాలి. ధర్మ సంపద కావాలి. శీలసంపద కావాలి. అది తరగని సంపద. అది తథాగతుని దగ్గర తరగనంత ఉంది. మీరూ ఆ ధర్మ మార్గాన్నే నడవండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి’’ అని లేచి వెళ్లిపోయాడు రాష్ట్రపాలుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
మీకు తెలుసా! ఇదీ.. వందేళ్ల వండర్ఫుల్ అరకు కాఫీ!
నురగలు కక్కుతూ నిద్ర మత్తును వదలగొట్టే పానీయం.. మదిని ఉత్తేజపరచే ఔషధం.. అవనిలో దొరికే ఆ అమృతం.. చిక్కటి.. చక్కటి రుచిగల ఉదయాలకు ప్రారంభం! ఈ కాంప్లిమెంట్కి కాఫీనే ఎలిజిబుల్!‘అనుదినమ్మును కాఫీయే అసలు కిక్కు.. కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు.. కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు.. అమృతమన్నది హంబక్కు అయ్యలార.. జై కాఫీ’ అంటూ ‘మిథునం’ సినిమా కోసం జొన్నవిత్తుల కూడా కాఫీ మహిమను కీర్తించారు. ఇలా జనుల జిహ్వన నానుతున్న కాఫీ మన అరకు లోయలోనూ సాగవుతోంది. నిజమే కానీ ఈ ఘుమఘుమల ప్రస్తావన ఇప్పుడెందుకు? జూన్ 30న ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’లో ‘అరకు వ్యాలీ కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన కృషి అభినందనీయం .. అరకు కాఫీని ఆస్వాదించండి’ అని ప్రత్యేకంగా ప్రశంసించినందుకు!టేస్ట్పుల్ ఇమేజ్తో అనేక దేశాలు గ్రోలుతున్న ఈ వండర్ఫుల్ అరకు కాఫీకి వందేళ్లకుపైగా ఘన చరిత్ర ఉంది. 1898లో.. ఓ ఆంగ్లేయ అ«ధికారి.. తూర్పుగోదావరి జిల్లా, పాములేరు లోయలో కాఫీ పంటను వేశారు. 1920 నాటికి విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, జీకే వీథి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీ నగర్, మినుమలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లోనూ కాఫీ తోటల పెంపకాన్ని మొదలుపెట్టారు.స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లా రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను వేసింది. ఆ తోటలను 1985లో అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఆపై గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా ప్రత్యేకంగా కాఫీ తోటల అభివృద్ధి విభాగమొకటి ఏర్పాటైంది. కాఫీ బోర్డు సహకారంతో గిరిజన ప్రాంతాల్లో సుమారు పదివేల ఎకరాల్లో సేంద్రియ (ఆర్గానిక్) పద్ధతిలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించారు. దీనివల్ల పెద్ద ఎత్తున గిరిజనులు పోడు వ్యవసాయం నుంచి కాఫీ సాగు వైపు మళ్లి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.అరకులో కాఫీ తోటలు సరే.. కాఫీ చరిత్రను చాటే కాఫీ మ్యూజియం కూడా ఉంది. 16వ శతాబ్దంలో సూఫీ సన్యాసి బాబా బుడాన్ .. కర్ణాటకలోని చిక్ మగళూరు నుంచి ఏడు కాఫీ గింజలను తెచ్చి తన ఆశ్రమంలో నాటారని కాఫీ బోర్డు వెబ్సైట్లో పేర్కొన్నారు.వాతావరణం అనుకూలం..సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ.. కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. అందుకే పదివేల ఎకరాల్లో మొదలైన కాఫీ సాగు ఇప్పుడు లక్షన్నర ఎకరాలకు పైగా విస్తరించింది. ఇక్కడ పొడవైన సిల్వర్ ఓక్ చెట్లు, టేకు చెట్ల నీడలో.. ఏటవాలు ప్రాంతాల్లో కాఫీ తోటలను పెంచుతున్నారు. ఆ నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం వల్ల ఆ కాఫీకి ప్రత్యేక రుచి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆ తోటలకు నీడ కోసం.. ఓక్ చెట్ల మొదళ్లలో మిరియాలు వేసి.. అవి ఓక్ చెట్ల మీదుగా పాకేలా చేస్తున్నారు. దీనివల్ల మిరియాలు అదనపు పంటగా మారి.. అదనపు ఆదాయాన్నీ వాళ్లు పొందుతున్నారు.అంతర్జాతీయ ఖ్యాతి..ప్రపంచంలో అధికంగా కాఫీ పండించే దేశాల్లో .. మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో మనం ఏడవ స్థానంలో ఉన్నాం. 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. మన దేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుండగా.. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ల నుంచే ఎక్కువ ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో అరబికా రకం కాఫీని సాగు చేస్తున్నారు. ఈ కాఫీని బెంగళూరులో ప్రాసెస్ చేసి జర్మనీ, వియత్నాం, బ్రెజిల్, ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.2007లో ఆదివాసీ రైతులు ఉత్పత్తి చేసిన అరకు కాఫీ.. దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్గా గుర్తింపు పొందింది. ప్యారిస్లో ‘అరకు కాఫీ బ్రాండ్’ పేరుతో ఓ కాఫీ షాప్ తెరిచారు. దీని టేస్ట్ జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లండ్ దేశాలకూ పాకింది. బెస్ట్ కాఫీ బ్రాండ్లకు పేరొందిన బ్రెజిల్, సుమత్రా, కొలంబోలు.. అరకు స్ట్రాంగ్ కాఫీ ముందు లైట్ అయిపోతున్నాయి. తద్వారా అరకు కాఫీకి అంతర్జాతీయ డిమాండ్నే కాదు ఫేమ్నీ పెంచుతున్నాయి. అరకు కాఫీ బేవరేజ్గానే మిగిలిపోలేదు. పలు రకాల పండ్లు, ఫ్లేవర్స్తో కలసి చాకోలెట్స్గానూ చవులూరిస్తోంది.జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అటవీ ఫలసాయం, వ్యవసాయోత్పత్తుల కొనుగోలులో రికార్డు స్థాయిలో గిరిజనులకు మేలు జరిగింది. గిరిజన రైతులకు పెట్టుబడి సాయం, యంత్ర పరికరాలను అందించింది. దీనికితోడు జీసీసీ సైతం గిరిజన రైతుల వ్యవసాయానికి, కాఫీ సాగుకు రుణాలు మంజూరు చేసి, అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా మద్దతు ధరను చెల్లించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంతోపాటు ఆర్గానిక్ సిర్టిఫికేషన్ కోసం ప్రత్యేక చర్యలూ చేపట్టి గిరిజన రైతులను ప్రోత్సహించింది.అవార్డులు.. ప్రశంసలు!గతేడాది సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు బెంగళూరులో నిర్వహించిన ప్రపంచస్థాయి ‘ఫైన్ కప్’ పోటీలో ఏపీ ప్రభుత్వం తరఫున కాఫీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన అరకు కాఫీ ‘ఫైన్ కప్’ అవార్డును దక్కించుకుంది. పెదబయలు మండలం లక్ష్మీపురం పంచాయతీ కప్పల గ్రామానికి చెందిన కిల్లో అశ్విని ఈ ఘనతను సాధించడం విశేషం. ప్రపంచ కాఫీ పోటీల్లో 12 ఏళ్ల తర్వాత మన కాఫీకి అంతర్జాతీయ అవార్డు దక్కింది. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో సోషల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ 2022 ఆగస్టు 9 నుంచి 11 వరకు కోల్కతాలో నిర్వహించిన జాతీయ సదస్సులో 14 రాష్ట్రాలు పాల్గొనగా.. మన కాఫీ మొదటిస్థానంలో నిలవడంతో జాతీయ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో నిర్వహించిన జి–20 సదస్సులోనూ సర్వ్ అయిన అరకు కాఫీకి ప్రపంచ దేశాల ప్రతినిధులు హాట్ ఫేవరెట్స్ అయిపోయారు. గతంలో పారిస్లో ప్రి ఎపిక్యూర్స్ పోటీలో అరకు కాఫీ గోల్డ్ మోడల్ గెల్చుకుంది. – యిర్రింకి ఉమమహేశ్వరరావు, సాక్షి, అమరావతి -
Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో..
థార్లోని ఇసుక దిబ్బల గుండె సవ్వడి విన్నది. అరుణాచల్ప్రదేశ్లోని పర్వతశ్రేణులతో ఆత్మీయ స్నేహం చేసింది. అస్పాంలోని వరద మైదానాలలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న కనీళ్లను చూసింది. కేరళ, గోవా తీరాలలో ఎన్నో కథలు విన్నది. కొద్దిమందికి ప్రయాణం ప్రయాణం కోసం మాత్రమే కాదు. ఆనందమార్గం మాత్రమే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అన్వేషణ. తన అన్వేషణలో అందం నుంచి విధ్వంసం వరకు ప్రకృతికి సంబంధించి ఎన్నో కోణాలను కళ్లారా చూసింది బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఆర్టిస్ట్ ఆరతి కుమార్ రావు....రాజస్థాన్లో ఒక చిన్న గ్రామానికి చెందిన చత్తర్సింగ్ గుక్కెడు నీటి కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమబెంగాల్లో ఒక బ్యారేజ్ నిర్మాణం వల్ల నిర్వాసితుడు అయిన తర్కిల్ భాయి నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు తక్కువేమీ కాదు. సుందర్బన్ప్రాంతానికి చెందిన ఆశిత్ మండల్ వేట మానుకొని వ్యవసాయం వైపు రావడానికి ఎంతో కథ ఉంది. బంగ్లాదేశ్లోని మత్స్యకార్మికుడి పిల్లాడిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేస్తే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడ్చే దృశ్యం ఎప్పటికీ మరవలేనిది.ఒకటా... రెండా ఆరతి కుమార్ ఎన్నెన్ని జీవితాలను చూసింది! ఆ దృశ్యాలు ఊరకే ΄ోలేదు. అక్షరాలై పుస్తకంలోకి ప్రవహించాయి. ఛాయాచిత్రాలై కళ్లకు కట్టాయి. ఒక్కసారి గతంలోకి వెళితే... ‘ఉద్యోగం మానేస్తున్నావట ఎందుకు?’ అనే ప్రశ్నకు ఆరతి కుమార్ నోట వినిపించిన మాట అక్కడ ఉన్నవాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది.‘ప్రకృతి గురించి రాయాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం మానేస్తున్నాను’ అని చెప్పింది ఆమె. యూనివర్శిటీ ఆఫ్ పుణెలో ఎంఎస్సీ, థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్–ఆరిజోనాలో ఎంబీఏ, ఆరిజోనా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన ఆరతి అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఇన్టెల్లో ఉద్యోగం చేసింది. కొంత కాలం తరువాత తనకు ఉద్యోగం కరెక్ట్ కాదు అనుకుంది. సంచారానికే ప్రాధాన్యత ఇచ్చింది.బ్రహ్మపుత్ర నది పరివాహకప్రాంతాలకు సంబంధించిన అనుభవాలను బ్లాగ్లో రాసింది. పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఎన్నోప్రాంతాలు తిరిగిన ఆరతి ‘మార్జిన్ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ పేరుతో రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ప్రకృతి అందాలే కాదు వివిధ రూ΄ాల్లో కొనసాగుతున్న పురా జ్ఞానం వరకు ఎన్నో అంశాల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన అందం నుంచి వైవిధ్యం వరకు, వైవిధ్యం నుంచి వైరుధ్యం వరకు తన ప్రయాణాలలో ఎన్నో విషయాలను తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను అక్షరాలు, ఛాయాచిత్రాలతో ప్రజలకు చేరువ చేస్తోంది ఆరతి కుమార్ రావు.భూమాత మాట్లాడుతోంది విందామా!ఆరతి కుమార్ రావు రాసిన‘మార్జిన్ల్యాండ్స్’ పుస్తకం కాలక్షేప పుస్తకం కాదు. కళ్లు తెరిపించే పుస్తకం. ఇది మనల్ని మనదైన జల సంస్కృతిని, వివిధ సాంస్కృతిక కళారూ΄ాలను పరిచయం చేస్తుంది.– ‘ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం తగినంత సమయాన్ని తప్పకుండా వెచ్చించాలి. దానిలో జీవించాలి. దానితో ఏకం కావాలి’ అంటుంది ఆరతి.– ఈ పుస్తకం ద్వారా మన సంస్కృతిలోని అద్భుతాలను మాత్రమే కాదు తెలిసో తెలియకో మనం అనుసరిస్తున్న హానికరమైన విధానాలు, ప్రకృతి విపత్తుల గురించి తెలియజేస్తుంది.– ‘మన సంప్రదాయ జ్ఞానంలో భూమిని వినండి అనే మాట ఉంది. భూమాత చెప్పే మాటలు వింటే ఏం చేయకూడదో, ఏం చేయాలో తెలుస్తుంది’ అంటుంది ఆరతి కుమార్ రావు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
వర్షాకాలంలోనూ వదలకుండా.. జంపింగ్ జాక్స్!
చెమట పడుతోందని వేసవిలో, ముసురు పట్టిందని వానా కాలంలో, మంచుకురుస్తోందని చలికాలంలోనూ వ్యాయామాన్ని మానకూడదు. ఏ సీజన్కు తగ్గట్టు ఆ తరహా వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవచ్చని ఫిట్నెస్ ట్రైనర్స్, నిపుణులు అంటున్నారు. వ్యాయామాన్ని స్కిప్ చేయడం మంచి అలవాటు కాదని, దీని వల్ల సీజనల్ వ్యాధుల ప్రభావం తట్టుకునే ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందుకే సీజన్కు తగ్గట్టుగా వర్కవుట్ని డిజైన్ చేసుకోవాలని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో సీజన్కు అనుగుణంగా వర్కవుట్ డిజైన్ అనేది ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతోంది. దీంతో ఫిట్నెస్ ఫ్రీక్లకు వెసులుబాటుగా ఉండే ట్రెయినర్లకు డిమాండ్ పెరుగుతోంది. – సాక్షి, సిటీబ్యూరోవర్షాకాలంలో వ్యాయామ ఆసక్తి తగ్గడానికి అధిక తేమ స్థాయిలు, సూర్యకాంతి లేకపోవడం, వాతావరణ పీడనంలో మార్పులు వంటి కారణాలు ఉన్నాయి. వాతావరణ పీడనం పడిపోవడం అనేది మన శరీర ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేసి, అలసట, శక్తి లేకపోవడం వంటి అనుభూతులకు గురిచేస్తాయి. కానీ వర్షాకాలంలో ఫిట్నెస్ను కాపాడుకోవడం మానసిక స్థితిని మెరుగుపరచడంలో మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని అంటున్నారు. దీంతో పలువురు నిపుణులు సింపుల్ వర్కవుట్స్పై సలహాలు, సూచనలు అందిస్తున్నారు...సమయానికి తగినట్లు..– స్పాట్ జాగింగ్ చాలా తక్కువ స్పేస్లో కదలకుండా చేసే జాగింగ్ ఇది. అవుట్డోర్లో జాగింగ్కి సమానమైన ప్రతిఫలాన్ని అందిస్తోంది. చేతులను స్వింగ్ చేయడం వంటి తదితర మార్పు చేర్పుల ద్వారా ఫుల్బాడీకి వర్కవుట్ ఇవ్వొచ్చు. – జంపింగ్ జాక్స్, క్లైంబర్స్, హై నీస్, సిజర్ చాప్స్ వంటివి ఒకే ప్రదేశంలో కదలకుండా చేయవచ్చు. వీటిని మూడు సెట్స్గా విభజించుకుని చేయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.– స్కిప్పింగ్ రోజంతా చురుకుగా ఉంచే అద్భుతమైన మాన్ సూన్ వర్కౌట్. రోప్ స్కిప్పింగ్ లేదా జంపింగ్ అధిక సంఖ్యలో కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది అన్ని సీజన్లలోనూ చేయవచ్చు. – వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఇండోర్ యోగా ఒక గొప్ప మార్గం. వృక్షాసనం వంటి ఆసనాలతో చల్లని వాతావరణంలో ప్రయోజనకరంగా ఉంటుంది.– వ్యాయామాల్లో వైవిధ్యం కోసం డంబెల్స్ లేదా రెసిస్టెన్స్ బ్యాండ్ల వంటి కొన్ని ప్రాథమిక వ్యాయామ పరికరాలను ఉపయోగించవచ్చు. – సాధారణ నీటికి ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీలు, కొబ్బరి నీళ్లను ఉపయోగించడం ద్వారా చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని పొందవచ్చు.– ఆన్లైన్లో లేదా ఫిట్నెస్ యాప్ల ద్వారా అందుబాటులో ఉన్న ఫిట్నెస్ ఇచ్చే డ్యాన్స్ వీడియోలను అనుసరించాలి. – ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంటే స్విమ్మింగ్ ల్యాప్లు లేదా ఆక్వా ఏరోబిక్స్ క్లాస్లలో పాల్గొనాలి.– వర్షాకాలంలో బద్ధకాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ శారీరక శ్రమతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వీలైనంత వరకూ సూర్యరశ్మి శరీరానికి సోకేలా చూసుకోవడం చాలా ముఖ్యం.మార్పు చేర్పులు అవసరం..ఎండలు ఉన్నాయని కొందరు వానలు ఉన్నాయని కొందరు వర్కవుట్కి బద్ధకిస్తుంటారు. కొందరు మాత్రం సీజన్లతో సంబంధం లేకుండా జిమ్స్కు వస్తుంటారు. కనీసం వారానికి 3 నుంచి 4 సార్లు చేసేవారిని సిన్సియర్ అని చెప్పొచ్చు. అదే కరెక్ట్ విధానం కూడా. ఈ సీజన్లో తెల్లవారుఝామున బాగా ముసురుపట్టి ఉన్నప్పుడు ఉదయం లేచిన వెంటనే ఎక్సర్సైజ్ చేయాలనే మూడ్ రాదు. కాబట్టి లేవగానే ఇంట్లోనే కొన్ని స్ట్రెచి్చంగ్ వర్కవుట్స్ చేశాక జిమ్కి రావచ్చు. వాకింగ్, జాగింగ్, యోగా వంటివి అవుట్డోర్లో చేసే అలవాటు వల్ల వానాకాలంలో రెగ్యులారిటీ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్డోర్ వర్కవుట్స్ ఎంచుకోవడం మంచిది. వర్షాకాలం వర్కవుట్స్..ఈ వాతావరణం హెవీ వెయిట్/ రిపిటీషన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి ఎక్కువ టైమ్ కేటాయించాలి. వైరల్ ఫీవర్స్ ఫ్లూ వచ్చేది ఈ సీజన్లోనే కాబట్టి, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ప్రత్యేకమైన వర్కవుట్స్ చేయించాలి. ఈ వాతావరణంలో మజిల్స్ బద్ధకిస్తాయి. కాబట్టి వర్కవుట్కి ముందు వార్మ్ అప్కి కేటాయించే సమయాన్ని కొంత పెంచి చేయిస్తాం. వారానికి 3 నుంచి 4 గంటల పాటు రోజూ 45 నిమిషాలు వ్యాయామం ఈ సీజన్లో చాలా ఉపయుక్తం.– ఎం.వెంకట్, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ లైఫ్స్టైల్ కోచ్ -
హోం బేకర్స్..! ఇంట్లో కిచెన్లోనే బేకరీ ఏర్పాటు..!
ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టతో ముందుకు స్పెషల్ థీమ్స్తో ఔరా అనిపించుకుంటున్న యువత కాస్తంత సృజనాత్మకతకు ఆలోచన తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చు. పలువురు యువత ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కళల పట్ల ఉన్న ఆసక్తికి, ఆలోచనను జత చేసి ఎంట్రప్రెన్యూర్స్గా విజయతీరాలను చేరుకుంటున్నారు. సాధారణంగా బిజినెస్ చేయాలంటే పెట్టుబడి, అనువైన ప్రాంతం దొరకాలి.. అంత కష్టపడి వ్యాపారం చేస్తే, అది సక్సెస్ అవుతుందా అనే అనుమానం ఉంటుంది. అందుకే ఈ తరం యువత సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టతో ముందడుగు వేస్తున్నారు. ఇటీవల హోం బేకర్స్ నడుపుతూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపలు థీమ్స్తో కేక్స్ తయారీ..సాధారణంగా పుట్టినరోజు, పెళ్లి, న్యూఇయర్ ఇలా చాలా సందర్భాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటుంటాం. అయితే ఎప్పుడూ ఒకే రకమైన కేక్ కట్ చేస్తుంటే మజా ఏముంటుందని, కొందరు విభిన్న రకాల కేకులు ఆర్డర్ చేస్తుంటారు. పిల్లల కోసం స్పైడర్మ్యాన్, ఏనుగు, బార్బీ, పెళ్లి రోజు, ఎంగేజ్మెంట్ కోసం ప్రత్యేక థీమ్స్తో కేకులు తయారు చేస్తుంటారు. కస్టమర్లకు నచి్చన థీమ్స్ తయారు చేసేందుకు తాము ఎంతో కష్టపడుతుంటామని చెబుతున్నారు.పూర్తి సహజంగా.. ఎలాంటి రసాయనాలూ లేకుండా పూర్తిగా సహజ పదార్థాలతో తయారుచేయాలనే ఉద్దేశంతో చాలామంది హోం బేకర్స్ను ప్రారంభించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు పరిశుభ్రమైన వాతావారణంలో మన ఇంట్లో తయారు చేసినట్టుగానే కస్టమర్లకు పదార్థాలు తయారు చేసి ఇస్తామని పేర్కొంటున్నారు. చాలా బేకరీల్లో డాల్డాతో తయారుచేస్తారని, అయితే తాము మాత్రం బట్టర్, బ్రౌన్ షుగర్ను వాడతామని హోం బేకరీ నిర్వాహకులు చెబుతున్నారు.ఇంట్లో కిచెన్లోనే..సాధారణంగా బేకరీ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ హోం బేకరీని తక్కువ ఖర్చుతోనే ఇంట్లో కిచెన్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలాగూ ఇంట్లో వంటకాలను చాలా పరిశుభ్రమైన పరిసరాల్లోనే తయారు చేస్తుంటారు. కాబట్టి అక్కడే చిన్న ఓవెన్ వంటి చిన్న చిన్న పరికరాలతో కేకులు, కుకీస్ తయారు చేస్తున్నారు. కేక్స్, కుకీస్తో పాటు మఫిన్స్, చీజ్ కేకులు, డోనట్స్ వంటి ఉత్పత్తులతో చుట్టు పక్కల వారితో ఔరా అనిపించుకుంటున్నారు.సాధికారత కోసం..చాలా మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ హోం బేకర్స్ ప్రారంభిస్తున్నటు చెబుతున్నారు. ఇంట్లో వారి పై ఆధారపడకుండా సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయమే వారిలో కనిపిస్తోంది. తమలో ఉన్న సృజనాత్మకతను నలుగురూ మెచ్చుకుంటే అంతే చాలు అని చెబుతున్నారు.ఇది కూడా సమాజ సేవే..ఆరోగ్యకరమైన పదార్థాలు అందిస్తే కూడా సమాజానికి సేవ చేసినట్టే అనేది నా నమ్మకం. కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా, మన పనులు భిన్నంగా ఉండి, సమాజంలో గుర్తింపు రావాలనేది నా తాపత్రయం. అందులో భాగంగానే హోం బేకర్స్ కాన్సెప్ట్ ఆలోచన వచి్చంది. నా కేక్స్ డిజైన్స్ బాగున్నాయని అందరూ మెచ్చుకుంటుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. – సాయి శ్రీ, ఓవెన్ కుక్ డిలైట్చాలా టేస్టీగా ఉంటాయి..నేను చాలా సార్లు హోం బేకర్స్ నుంచి కేక్స్ ఆర్డర్ చేసుకున్నాను. సాధారణ బేకరీల కన్నా ఇక్కడ చాలా హైజీనిక్తో పాటు రుచికరంగా ఉంటాయి. ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్స్లో ఇస్తుంటారు. తక్కువ ధరలోనే మంచి కేక్స్ వస్తున్నాయి. – మెరుగు శివ ప్రకాశ్ నాయుడుఇవి చదవండి: ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్! -
నాలుక అబద్ధం చెప్పదు..
నీర్ దోసె అంటే నూనె వేయకుండా పెనం మీద నీటిని చల్లి వేసే దోసె. మైసూర్ మసాలా దోసె, రసం ఇడ్లీ, టొమాటో ఉప్మా, ఆనియన్ ఊతప్పం... ఇవన్నీ మనకు తెలిసినవే, ఖోట్టో... ఇది ఇడ్లీ పిండిని పనస ఆకులతో అల్లిన బుట్టలో వేసి ఆవిరి మీద ఉడికించే వంటకం. ఈ దక్షిణాది రుచుల పేరు చెబితే ముంబయి వాసుల నోట్లో నీళ్లూరతాయి. క్రికెట్ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్లు ఈ రుచుల కోసం ముంబయి నగరం, మాతుంగలో ఉన్న మైసూర్ కేఫ్ను విజిట్ చేసేవాళ్లు.స్వాతంత్య్రానికి ముందు 1936 నుంచి ముంబయిలో స్టవ్ వెలిగించిన ఈ కేఫ్కి గవాస్కర్, సచిన్ల కంటే ముందు ఏ ప్రముఖులు క్యూ కట్టారో తెలియదు. కొత్త పెళ్లికొడుకు అనంత్ అంబానీ ఆదివారాలు ఇక్కడే గడిచేవని ఇటీవల తెలిసింది. తన పెళ్లి వేడుకలో ఈ కేఫ్ స్టాల్ కూడా పెట్టించారు. వధువు రాధికా మర్చంట్కు ఈ కేఫ్ నిర్వహకురాలు శాంతెరీ నాయక్ను చూపిస్తూ ‘మీట్ మైసూర్ కేఫ్ ఓనర్’ అని పరిచయం చేశాడు. వధువు ఆ పెద్దావిడపాదాలను తాకి నమస్కరించింది. ఈ వీడియోతో శాంతెరీ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.టూర్లో ‘టేస్ట్’ చూస్తాను..ముంబయి నగరం, మాతుంగ ఏరియాలో కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ దగ్గర ఉంది మైసూర్ కేఫ్. శాంతెరీ నాయక్ మామగారు నాగేశ్ రామ నాయక్ ఈ కేఫ్ను స్థాపించాడు. కర్నాటక నుంచి ముంబయిలో అడుగు పెట్టి ఆహారమే తన కుటుంబానికి అన్నం పెడుతుందని నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు శాంతెరీ నాయక్. ఇప్పుడామె కుమారుడు నరేశ్ నాయక్ సహాయంతో కేఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్’ అనే ప్రజల ప్రశంసలే ఆమె అందుకున్న పురస్కారాలు. వివిధ ప్రదేశాలను పర్యటించడం ఆమె హాబీ. పర్యటనలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఏయే ఆహారాలు అందుబాటులో ఉంటున్నాయి, పర్యాటకులు ఏ రుచులను ఎక్కువ గా ఇష్టపడుతున్నారో గమనిస్తూ, వాటిని రుచి చూస్తానని చె΄్తారామె.కస్టమర్ అభిప్రాయమే తుదితీర్పు..‘‘వంటలను ఇష్టపడడమే నా సక్సెస్ ఫార్ములా. అమ్మకు సహాయం చేసే క్రమంలోనే రుచిగా వండడంలో మెళకువలు తెలిశాయి. అమ్మ వండిన పదార్థాలను ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించే బాధ్యత కూడా నాదే. వాళ్లకు ఏది నచ్చిందో అర్థమయ్యేది. అదే ఫార్ములాను కేఫ్ నిర్వహణలోనూ అనుసరించాను. మన ఉద్యోగులను నమ్మాలి, అంతకంటే ఎక్కువగా కస్టమర్లను నమ్మాలి. రుచి, అభిరుచుల విషయంలో కస్టమర్ల నోటి నుంచి వచ్చిన మాటే వేదవాక్కు. పదార్థాల రుచిని ఆస్వాదించిన నాలుక ఫీడ్ బ్యాక్ విషయంలో అబద్ధం చెప్పదు’’ అంటారు శాంతెరీ నాయక్. డెబ్బైఏళ్ల వయసులో కూడా చురుగ్గా, కేఫ్ నిర్వహణ పట్ల శ్రద్ధగా ఉన్నారామె. వార్థక్యం దేహానికి మాత్రమే, మనసుకు కాదు, పనిచేసే మనస్తత్వానికి కాదని నిరూపిస్తున్నారు శాంతెరీ నాయక్. -
కేవలం వాయుభక్షణతో.. పదివేల ఏళ్లు తపస్సు!
సమస్త లోకాలకు ఆధారభూతమైన ధర్మాన్ని దేవ దానవులు ఎవరూ చూడలేదు. సత్య స్వభావం కలిగిన ధర్మ స్వరూపాన్ని దర్శించడం కోసం దుర్వాసుడు తపస్సు ప్రారంభించాడు.కేవలం వాయుభక్షణతో పదివేల ఏళ్లు తపస్సు కొనసాగించినా, ధర్ముడు కరుణించలేదు. దర్శనమివ్వలేదు. తపస్సు చేసి చేసి దుర్వాసుడు కృశించిపోయాడు. ఆయనకు ధర్ముడి మీద పట్టరాని ఆగ్రహం కలిగింది. కోపం పట్టలేని దుర్వాసుడు ధర్ముడిని శపించాలనుకున్నాడు. అది గ్రహించిన ధర్ముడు వెంటనే దుర్వాసుడి ముందు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. తనతో పాటు సత్యం, బ్రహ్మచర్యం, తపస్సులను; యమ నియమ, దానాలను కూడా వెంటబెట్టుకు వచ్చాడు.సత్యం, బ్రహ్మచర్యం, తపస్సు బ్రాహ్మణుల రూపంలో రాగా, యమం ద్విజుడి రూపంలోను, నియమం ప్రాజ్ఞుడి రూపంలోను, దానం అగ్నిహోత్రుడి రూపంలోను వచ్చాయి. వారికి తోడుగా క్షమ, శాంతి, లజ్జ, అహింస, స్వచ్ఛత స్త్రీల రూపంలోను, బుద్ధి, ప్రజ్ఞ, దయ, శ్రద్ధ, మేధ, సత్కృతి, శాంతి, పంచయజ్ఞాలు, వేదాలు స్వస్వరూపాలతో వచ్చి నిలిచాయి. ఈ విధంగా ధర్ముడు సపరివారంగా దుర్వాసుడి ముందుకు వచ్చాడు.‘మహర్షీ! తపోధనుడివైన నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? కోపం శ్రేయస్సును, తపస్సును నశింపజేస్తుంది. పుణ్యకర్మలను క్షయింపజేస్తుంది. అందువల్ల ప్రయత్నపూర్వకంగా కోపాన్ని విడనాడాలి. దయచేసి శాంతించు! నీ తపోధనం చాలా గొప్పది’ అన్నాడు ధర్ముడు.ధర్ముడు అనునయంగా మాట్లాడటంతో దుర్వాసుడు కొద్ది క్షణాల్లోనే శాంతించాడు.‘మహాత్మా! దివ్యపురుషుడిలా కనిపిస్తున్న నువ్వెవరివి? నీతో వచ్చినవారంతా తేజస్సంపన్నులుగా ఉన్నారు. వారంతా ఎవరు?’ అడిగాడు దుర్వాసుడు. ధర్ముడు తనతో వచ్చిన తన పరివారాన్ని ఒక్కొక్కరినే దుర్వాసుడికి సవివరంగా పరిచయం చేశాడు. ‘అందరిలోనూ వృద్ధురాలిగా కనిపిస్తున్న స్త్రీ నా తల్లి దయ. గొప్ప తపస్విని. నేను ధర్ముడిని, ధర్మ పురుషుణ్ణి’ అని పలికాడు. ‘ఓ ధర్మపురుషా! మంచిది. మీరంతా నా వద్దకు ఎందుకు వచ్చారు? నేను మీకు చేయగల సాయమేమైనా ఉందా?’ ప్రశ్నించాడు దుర్వాసుడు.‘మహర్షీ! శాంతించు. నా మీద ఎందుకు కోప్పడుతున్నావో చెప్పు? నేను నీ పట్ల చేసిన అపచారం ఏమిటి? కారణం చెప్పాలనిపిస్తేనే చెప్పు. ఇందులో నిర్బంధమేమీ లేదు’ అన్నాడు ధర్ముడు. ‘ధర్మపురుషా! నా కోపం నిష్కారణమైనది కాదు. నా కోపానికి తగిన కారణం ఉంది. చెబుతాను, విను! నేను చాలా కష్టపడి దయా శౌచాలతో నా శరీరాన్ని పరిశుద్ధం చేసుకున్నాను. నీ దర్శనం కోసం పదివేల ఏళ్లు అత్యంత కఠోరంగా తపస్సు చేశాను. అయినా, నువ్వు నన్ను కరుణించలేదు. ఇంతకాలం వేచి ఉండేలా చేశావు. నీకు నా మీద దయ లేదు. అందుకే నీ మీద కోపం వచ్చింది. అందుకే నిన్ను శపించాలనుకున్నాను’ కొంచెం కినుకగా పలికాడు దుర్వాసుడు.‘మహర్షీ! దయచేసి శాంతించు. నువ్వు తొందరపడి శపిస్తే, నీ శాపానికి నేను నాశనమైతే, ఈ లోకమంతా నశిస్తుంది. నీ బాధకు మూలకారణాన్ని తొలగిస్తాను. ఇహపరాల్లో నీకు గొప్ప సుఖం కలిగేలా చేస్తాను. లోకంలో ముందు సుఖాన్ని పొందినవాళ్లు తర్వాత దుఃఖాన్ని పొందుతున్నారు. ముందు దుఃఖాన్ని పొందినవాళ్లు తర్వాత సుఖాన్ని పొందుతున్నారు. పాపాత్ములు ఏ శరీరంతో పాపం చేస్తారో, అదే శరీరంతో బాధలు అనుభవిస్తారు. అది వారు చేసిన పాపానికి ఫలం’ అని ధర్ముడు హితబోధ చేశాడు.అంతా విన్నప్పటికీ దుర్వాసుడు కినుక మానలేదు. ‘ధర్మపురుషా! నువ్వెన్ని చెప్పినా, నీ మీద నాకు కోపం తగ్గడంలేదు. అందువల్ల నిన్ను శపించాలనే అనుకుంటున్నాను’ అన్నాడు. ‘ఓ మహర్షీ! నా వల్ల నీకు కోపం వస్తే, దయచేసి క్షమించు. క్షమించకుంటే నన్ను దాసీపుత్రుడిగా చేయి లేదా రారాజుగా చేయి లేదా చండాలుడిగా చేయి. వినయంగా ఉండేవారిపై బ్రాహ్మణులు ప్రసన్నత చూపరు కదా!’ అన్నాడు. దుర్వాసుడు వెంటనే, ‘ధర్మపురుషా! నువ్వు కోరినట్లే రారాజువుగా, దాసీ పుత్రుడిగా, చండాలుడిగా జన్మించు’ అని ఏకకాలంలో మూడు శాపాలనిచ్చి వెళ్లిపోయాడు.దుర్వాసుడి శాపఫలితంగా ధర్మపురుషుడు తర్వాతి కాలంలో పాండురాజుకు ధర్మరాజుగా, దాసీపుత్రుడు విదురుడిగా, విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధించినప్పుడు చండాలుడిగా పుట్టాడు. చివరకు ధర్మపురుషుడు కూడా తాను చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. – సాంఖ్యాయన -
దేహం.. గాలిలో కదిలే దీపం!
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇక్కడ దేనికి, ఎప్పుడు కాలం చెల్లిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక, ఇక్కడ శాశ్వతమైనది ఏది? అని ప్రశ్న వేసుకుంటే ‘అంతాన్ని గురించిన అనిశ్చితియే!’ అనే సమాధానం దొరుకుతుంది. ఆ అనిశ్చితిని మనసులో ఒక వాస్తవంగా స్థాపించుకున్న వ్యక్తికి దుఃఖం దూరమై, ముక్తి దగ్గరౌతుందని విజ్ఞులు చెప్పారు.వేదాంత పరమైన ఈ వాస్తవాన్ని కనుపర్తి అబ్బయా మాత్యుడు, తాను రచించిన ‘కవిరాజ మనోరంజనం’ ప్రథమాశ్వాసంలోని ఒక సన్నివేశంలో పురూరవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా ఒక చక్కటి పద్యంలో చెప్పాడు. తన జనరంజక పాలనను గొప్పగా పొగుడుతున్న నారదుడితో పురూరవుడు ఎందరో రాజులు ఈ పుడమిని ఇంతకు మునుపు గొప్పగా పాలించారు కనుక తనను అంతగా పొగడవలసిన పనిలేదని చెప్పాడు. ఆపై సంభాషణ కొనసాగింపుగా ఇలా అంటాడు..దేహము వాయుసంచలిత దీపిక, పుత్రకళత్ర మిత్ర సందోహము స్వప్నకాలమున దోచెడి సందడి రాజ్యభోగ సన్నాహము జంత్రపుంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాల మీయైహికసౌఖ్య మేమి సుఖమంచు దలంచెదనయ్య నారదా!పద్యం ప్రారంభంలోని ‘దేహము వాయుసంచలిత దీపిక’ అనే మాట లలో సామాన్యము, విశేషము అయిన రెండు భావాలు అవగత మౌతాయి. మానవ దేహం గాలిలో కదులుతున్న దీపం వంటిది. ఎప్పుడైనా ఆరిపోవచ్చు. ఆ కారణంగా దాని భవితవ్యం అనిశ్చితం అని సామాన్యార్థం. విన్నవెంటనే మనసుకు తోచే అర్థం. ఇక రెండవది – మానవ శరీరంలో ఊపిరి అనే వాయువు ప్రసరిస్తున్నంత వరకు దేదీప్యమానంగా వెలిగే దీపం వంటిది ఈ దేహం. ఊపిరి ప్రసరణం ఆగిపోగానే అదీ ఆగిపోతుంది, ఆరి పోతుంది అనే విశేషమైన భావం! ఈరెండు భావాలు కూడా పద్యంలోని సందర్భానికి సొగసును కూర్చేవే!‘భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులతో కూడిన జీవితం, సందడి అంతా కలలో జరిగేదిగానే భావిస్తాను. జీవం లేని మరబొమ్మ చేసే నాట్యం వంటిది రాజ్యభోగం అనీ, ఐంద్రజాలికుడు వెదజల్లే ధనం వంటిది సంపద అనీ సదా భావించి, ఇహలోకంలో సౌఖ్యం లేదనుకోవడంలోనే సుఖముందని నేను భావిస్తాను!’ అనేది పురూరవుడు నారదుడితో చెప్పిన మాటలకు అర్థం. – భట్టు వెంకటరావు -
కోపానికి మహోగ్ర రూపం.. మౌనం!
మనుషులు భిన్న వైరుధ్యాలతో ఉంటారు. ఉన్న వారు, లేనివారు అని మాత్రమే కాదు. మంచి వాళ్లు, చెడ్డవాళ్లు; రూపసులు, కురూపులు; ఇంకా... ఉల్లాసంగా ఉండేవాళ్లు, ఉసూరుమంటూ పడి వుండే వాళ్లు; ఆలోచనాపరులు, ఉద్వేగప్రాణులు; తియ్యగా మాట్లాడేవారు, మాటలసలే రానివాళ్లు, అలాగే ఉత్తి పుణ్యానికి భగ్గుమనేవారు కొందరైతే, కోపమే తెచ్చుకోని వారు మరికొందరు. ఈ జాబితా లోని చివరి వైరుధ్యం గురించే నేను ఈ వారం మాట్లాడబోతున్నది. దీనికి కారణం ఏమిటంటే, నేను ఇట్టే చికాకు పడిపోతాను. మర్యాదస్తుల సమాజం నన్ను ‘షార్ట్ టెంపర్డ్’ అంటుంది. అయితే మీరు నన్ను ఓర్పు లేని, సహనం లేని మనిషి అనవచ్చు. చివరికి కోపధారి అని కూడా.నాలోని వైరుధ్యం ఏమిటంటే... శాంతంగా ఉండేందుకు నేను ప్రయ త్నిస్తున్నానని నాకు అనిపించటంతోనే నేను నా ప్రసన్నతను కోల్పోతూ ఉంటాను. ఎంతగానంటే కోపాన్ని అణచుకోవటం నాకు అలవిమాలిన సవా లుగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంగితజ్ఞానం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా నన్ను రెచ్చగొడుతున్నప్పుడు కొద్ది నిముషాలు మాత్రమే నన్ను నేను నిగ్రహించుకుని ఉండగలను. తర్వాత, హఠాత్తుగా పెను వేగంతో నా చిరునవ్వు మాయమవటం మొదలై, నా మెదడు పదునైన మాటలతో పొంగి పొర్లి దెబ్బకు దెబ్బా తిప్పికొట్టటానికి నేను సిద్ధమౌతాను. ఒక మెరుపుదాడిలా నా కోపం బయటికి బద్ధలౌతుంది.వెసూవియస్ అగ్నిపర్వతంలా అది సత్వర మే చిత్రంగా అంతటా వ్యాప్తి అవుతుంది. అదృష్టవశాత్తూ మరిగి ఉన్న టీ పాత్రలా నేను వేగంగా చల్లబడ తాను. కానీ మళ్లీ లావా లాగా – లేదా, చింది పడిన వేడి నీళ్ల మాదిరిగా – ఆ నష్టం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే నేను కోపం ప్రదర్శించిన వ్యక్తులు గుంభనంగా ఉండిపోతారు. వాళ్లు అంత తేలిగ్గా బద్దలవరు. నిజానికి వాళ్లు అలా బద్దలవటానికి సిద్ధపడేముందు చాలా సమయం తీసుకుంటారు. ఒకసారి బద్దలయ్యాక రోజుల పాటు వారు రగిలి పోతూ ఉంటారు. వెంటనే చల్లారటం ఉండదు.అలాంటి మనిషి నా భార్య నిషా. మా తొలి తగాదా చాలా చిన్నదైన ఒక విషయం మీద జరిగింది. అది ఇలా సాగింది: తన ధ్యాస నాపై ఉండటాన్ని నేను కోరుకుంటానన్న సంగతి నిషాకు బాగా తెలుసు. నేను ఆశించినట్లే తను ఉండేది. సమస్యేమిటంటే... నేను ఆశిస్తున్నట్లు తను ఉంటున్నానన్న గమనింపును నిషా నాలో కలిగించేది. దాంతో ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నాకు తెలిసిపోయింది. అటువంటి సందర్భాలలో నిషా నన్ను ‘కె.టి. బాబా’ అని పిలిచేది. అలా పిలవటంలో ప్రేమా ఉండేది, నవ్వులాటా ఉండేది.ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నా గ్రహింపునకు వచ్చినప్పుడు మొదట నేను జోక్గానే తీసుకున్నాను. కానీ జోకులతో సమస్య ఏమిటంటే మిగతా వారు కూడా వాటిల్లోకి చొరబడతారు. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్, ఇంకా అఫ్తాబ్, మరొక స్నేహితుడు నిషా మాటల్ని పట్టుకుని నాపైకి నవ్వులాటకు వచ్చేవారు. నిమి షాల వ్యవధిలోనే అది అటువైపు ముగ్గురు, ఇటువైపు ఒక్కరు అయ్యేది. ఆ తర్వాత నా మతిస్థిమితం నాపై విజయం సాధించి హాస్యమంతా పాడైపో టానికి ఎంతో సమయం పట్టేది కాదు.నా ఉద్వేగం నా తలలోకి పరుగులు పెట్టేది. నా ముఖం ఎర్రబడేది. నా గొంతు పైకి లేచేది. దురదృష్టవశాత్తూ, ఇలా జరగటం అన్నది రాబోయే ప్రమాదం నుంచి వాళ్లను హెచ్చరించటానికి బదులుగా వాళ్లను మరింతగా నవ్వులాటకు పురిగొల్పేది. ఆ మాటల యుద్ధంలో నేను తలదూర్చేలా నా కోసం వల పన్ని వేడుకగా చూస్తుండేవారు.ఆ ముగ్గురితో నేను గొడవ పడేవాడినని చెప్పటం సరిగ్గా ఉంటుంది. అయితే ప్రవీణ్, ఆఫ్తాబ్ నవ్వుతూ కొట్టి పడేస్తే, నిషా నా కోపాన్ని తను చిన్నతనంగా భావించి బాధపడేది. మీరు కనుక పెళ్లయినవారైతే భార్యలు... భర్తల (అలాంటి) తత్వాన్ని అక్కడ ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తుంది. వాళ్లంతా వెళ్లాక నిషా నాపై తన కోపాన్ని కుమ్మరించింది.‘‘మీరొక పరమ బుద్ధిహీనుడిలా ప్రవర్తించారు.’’ ‘‘నవ్వులాటను తేలిగ్గా తీసుకోలేరా?’’ అని నిషా. ‘‘అదేం తమాషాగా లేదు’’ అని నేను. ‘‘అందరికీ తెలుసు అదంతా తమాషాకేనని. కానీ అది మీ మీద జోక్ కనుక మీకు కోపం వచ్చింది’’ – నిషా. ఇరవై నిముషాల తర్వాత నా కోపం అంతా చల్లారిపోయింది. నేను ప్రశాంతచిత్తుడినై ఉండిపోయాను. కానీ నిషా ఇంకా తన కోపాన్ని లోలోపల అణచుకునే ఉంది.‘‘కాఫీ’’ అని అడిగాను. మౌనం! ‘‘టీ?’’ అన్నాను, అది కాకపోతే ఇది అన్నట్లు. మరింతగా మౌనం! ‘‘ఏంటి నీ బాధ?’’ అని పెద్దగా అరిచాను... ఆమె నాతో మాట్లాడటానికి తిరస్కరిస్తున్నందువల్ల వచ్చిన కోపంతో. అప్పుడు కూడా మౌనం! ‘‘ఛీ పో...’’ అన్నాను. ‘‘నువ్వే ఛీ పో’’ అంటూ అప్పుడు నోరు తెరిచి, మళ్లీ మౌనంగా ఉండిపోయింది. ఇదంతా సర్దుకోడానికి రెండు రోజులు పట్టింది.ఏమైనా, బయటివాళ్లతో వచ్చే తగాదాలు బద్దలయ్యేంతగా గానీ, దీర్ఘ కాలం కొనసాగేంతగా గానీ ఉండవు. ఇట్టే అవి చెలరేగితే చెలరేగి ఉండొచ్చు గాక. నాకిప్పుడు తెలుస్తోంది నా ప్రారంభ ప్రతిస్పందన ఆత్మనిగ్రహం లేని దిగా, సాధారణంగా నా వైపు నుండే తప్పును ఎత్తి చూపించేదిలా ఉంది అని. కానీ ఏం చేయటం, నాకు తెలివి వచ్చేటప్పటికే బాగా అలస్యం అయిపోయింది. తర్వాత నేను చేయగలిగిందంతా నేనే మొదట క్షమాపణలు చెప్పి పరిస్థితిని చక్కబరచుకోవటం. కొన్నిసార్లు అది పని చేస్తుంది కానీ అన్నిసార్లూ కాదు. ఆఫీసులో నా సహోద్యోగులు కొందరు రోజుల తరబడి బిగదీసుకుని ఉండేవారున్నారు.గతవారం, మానవ ప్రవర్తనల్ని విశ్లేషించే ఒక అమెరికన్ ఇచ్చిన వివరణ అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. ‘‘షార్ట్ టెంపర్డ్గా ఉండేవాళ్లకు, అంటే... తేలిగ్గా, తరచు తప్పుగా కోపం తెచ్చుకునేవాళ్లకు మనసులో ఏమీ ఉండదు. అంతా పైకే కనబరిచేస్తారు. తమను ఎగతాళి చెయ్యటాన్ని వారు నవ్వుతూ తీసుకుంటారు. అయితే దాని వల్ల వారు తరచు అన్యాయంగా వెక్కిరింపులు పడవలసి వస్తుంది. దాంతో అదుపు తప్పుతారు. వాళ్ల మాదిరిగా నియంత్రణ కోల్పో వటం మంచిదే. కానీ అందులో మీరు నిజాయితీగా ఉండండి. దారి మళ్లించటానికి, మనసులో ఉన్నది దాచిపెట్టుకోటానికి మాత్రమే నిజమైనది కాని మౌనాన్ని కొనసాగించండి.’’నిషా ఈ మాటల్లోని సమర్థనీయతను అంగీకరించి ఉండేదా అని నా ఆశ్చర్యం. లేదంటే, ఆమె పెద్దగా నవ్వి, ‘‘కె.టి. బాబా ఇదంతా మీరు కల్పించారు కదా? వినటానికైతే బాగుంది’’ అని ఉండేదా? కావచ్చు. అప్పుడైతే అది మానవ ప్రవృత్తిలోని గొప్ప విషయం.– కరణ్ థాపర్, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
మట్టి పరిమళం: ఈ పెర్ఫ్యూమ్తో.. బయట వర్షం పడుతుందేమో అనే అనుభూతి..
వేడి, పొడి వాతావరణంలో ఒక్కసారిగా కురిసే చినుకులతో భూమి నుండి వెలువడే ఆహ్లాదకరమైన సువాసన మనసును సేదతీరుస్తుంది. ఇది మట్టి వెదజల్లే సహజ పరిమళం కావడంతో మన మనసుల్ని సంతోష సాగరంలో విహరింపజేస్తుంది. తొలకరి చినుకులు నేలను తాకినప్పుడు వచ్చే ఈ మట్టి సువాసనను ఆస్వాదించడంలో ఆడ–మగ అనే భేదమేమీ లేదు. అందుకే, ఈ సువాసనలు ఇప్పుడు అత్తరు రూపంలో అందరినీ అల్లుకు పోతున్నాయి.ప్రకృతి నుండి ప్రేరణ పొంది, సురక్షితమైన పదార్థాలతో తయారైన మట్టి అత్తరు పరిమళాలకు వందల సంవత్సరాల నైపుణ్యం గల వారసత్వ కంపెనీలు కూడా ఉన్నాయి. చెమట వాసనను దూరం చేస్తూ విభిన్న శ్రేణి వ్యక్తులను ఆకర్షిస్తుంది. ‘ది సెంట్ ఆఫ్ రైన్’ లేదా ‘పెట్రిచోర్ ఎసెన్షియల్ ఆయిల్’గా ప్రసిద్ధి చెందినవీ ఉన్నాయి. అన్ని దేశాలలోనూ ఈ తరహా సువాసనలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆఫ్లైన్–ఆన్లైన్ మార్కెట్లో వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఈ ఎర్త్ సెంటెడ్ పెర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి.చెక్.. తప్పనిసరి:– మనసును కదిలించే ఈ సువాసనగల అత్తరులో ఆల్కహాల్ వాడకం లేనివి ఎంచుకోవాలి.– అత్తరు లేదా పెర్ఫ్యూమ్ మన చర్మ తత్త్వానికి సరిపడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ముందుగా దూది ఉండతో మణికట్టు, చెవి వెనక భాగాన కొద్దిగా అద్ది/స్ప్రే చేసి, 30 నిమిషాలు ఉండాలి. సరిపడితే రోజూ ఉపయోగించుకోవచ్చు.ప్రయోజనాలు ఏంటంటే?– మట్టి పరిమళం గల సహజ అత్తరు/పెర్ఫ్యూమ్ను వాడి మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ కావచ్చు.– ఏకాగ్రతను మెరుగుపరుచుకోవాలనుకునేవారికి ఉత్తమమైన సాధానాలలో మట్టి పరిమళం ఒకటి లగ్జరీ హోటళ్లు, యోగా అండ్ ఆయుర్వేద రిసార్ట్లలో, అరోమా థెరపీ రిట్రీట్లలో సుగంధ లేపనాల తయారీలోనూ ఈ మట్టి అత్తరును ఉపయోగిస్తుంటారు.– మట్టి పరిమళం స్ప్రే చేసుకొని వెళితే మీ చుట్టూ ఉన్నవారు బయట వర్షం పడుతుందేమో అన్న అనుభూతికి లోనుకాకుండా ఉండలేరు.ఇవి చదవండి: Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్! -
'ఉపవాసం' అంటే.. అసలు అర్థమేంటో తెలుసా!?
ఉపవాసం అంటే పస్తు ఉండటం, నిరాహారంగా ఉండటం అని వాడుక. కానీ ‘ఉప–వాసం’ అనే పదబంధానికి ఆహారంతో సంబంధం కనిపించదు. ‘ఉప’ అంటే ‘సమీపం’, ‘వాసం’ అంటే ‘నివాసం’. కాబట్టి ‘ఉపవాసం’ అంటే దగ్గరగా ఉండటం. దేనికి దగ్గరగా ఉండటం? ఉపవాసం చేసే సాధకుడు దేనికి దగ్గరగా ఉండాలనుకొంటున్నాడో దానికి!ఉదాహరణకు, ఒక భక్తుడు కొంత సమయం పాటు, ఎప్పటికంటే ఎక్కువగా, మనో–వాక్–కాయ–కర్మల ద్వారా తన ఇష్ట దైవానికి సన్నిహితంగా ఉండాలని సాధన చేస్తే, అది ఉపవాస సాధన అవుతుంది. శరీరాన్ని వీలయినంత ఎక్కువ సమయం భగవన్మూర్తికి దగ్గరగా ఉంచుతూ, ఇతర లౌకిక విషయాలకు దూరంగా ఉంచటం శారీరకమైన ఉపవాసం.వాక్కును కొంతకాలం పాటు భగవత్ స్తోత్రాలకూ, భగవద్వి షయమైన చర్చలకూ పరిమితం చేయటం వాక్కుపరమైన ‘ఉపవాసం’. మనసును ఆహార విహారాల లాంటి ఇంద్రియ విషయాల మీదనుంచి కొంతసేపు మళ్ళించి, దైవం మీద నిలిపి ఉంచటం మానసికమైన ఉపవాసం. అలాగే లౌకికమైన పనులకు కొంతకాలం సెలవిచ్చి, ఆ సమ యాన్ని పూజలకూ, ఆరాధనలకూ, అభిషేకాలకూ, వ్రతాలకూ వెచ్చించడం... కర్మల పరంగా దైవానికి సమీపంగా ఉండే ‘ఉపవాసం’.ఈ దేహమూ, ఇంద్రియాలూ, మనస్సు– ఇవే ‘నేను’ అన్న మిధ్యా భావనలో మునిగిపోయి, వీటికి అతీతంగా వెలుగుతుండే ఆత్మజ్యోతి తన అసలు రూపం అని మరిచిపోయిన జీవుడు, కొంతకాలం పాటన్నా దేహేంద్రియ వ్యవహారాలకు దూరంగా, తన స్వ స్వరూపానికి దగ్గరగా వెళ్ళి దానిని గుర్తించేందుకు చేసే సాధన ‘ఉపవాసం’ అని వేదాంతులు వివరణ ఇచ్చారు.మామూలుగా రోజూ తినే ఆహారం మీద నుంచి దృష్టి మళ్ళించేసి, ఒక్కపూట మరేదయినా ఆహారం పుచ్చుకొంటే ఇహానికీ పరానికీ మంచిదన్న భావనతో, దాని మీద దృష్టి పెట్టడం కూడా ‘ఉపవాసమే’. కానీ అది మనో వాక్ కాయ కర్మలన్నిటి ద్వారా, ఆ కొత్త ఆహారానికి ‘సమీపంగా ఉండటం’ మాత్రమే అవుతుంది. – ఎం. మారుతి శాస్త్రి -
గౌరముఖుడి వృత్తాంతం!
కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. వారికి ఎప్పటికీ సంతానం కలగకపోవడంతో సుప్రతీకుడు చిత్రకూట పర్వతంపై ఆశ్రమం ఏర్పరచుకున్న ఆత్రేయ మహర్షిని ఆశ్రయించి, ఆయన అనుగ్రహంతో దుర్జయుడనే పుత్రుణ్ణి పొందాడు.దుర్జయుడు అమిత బలవంతుడు. అపార సేనాసంపత్తితో దిగ్విజయయాత్రకు వెళ్లి, సమస్త భూమండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత అష్టదిక్పాలకులను జయించి, విజయగర్వంతో తన రాజ్యానికి తిరిగి బయలుదేరాడు. దారిలో గౌరముఖుడు అనే మహర్షి ఆశ్రమం కనిపించింది. దుర్జయుడు తన సేనలను వెలుపలే నిలిపి, తానొక్కడే ఆశ్రమంలోకి వెళ్లాడు. గౌరముఖుడికి నమస్కరించి, ఆశీర్వచనం కోరాడు. గౌరముఖుడు రాజైన దుర్జయుడికి ఆశీర్వచనం పలికి, అతడికి, అతడి సైన్యానికి ఆతిథ్యం ఇస్తానన్నాడు. దుర్జయుడు ఆశ్చర్యపోయాడు. తనకు, లక్షలాదిమంది తన సైనికులకు ఈ ఒంటరి ముని ఎలా ఆహారం పెట్టగలడా అని ఆలోచించాడు.ఇంతలో గౌరముఖుడు సంధ్యావందనం ముగించుకుని వస్తానంటూ దగ్గరే ఉన్న గంగానదికి వెళ్లాడు. గంగలో నిలిచి ఆశువుగా శ్రీమన్నారాయణుడిని స్తుతిస్తూ స్తోత్రం పలికాడు. గౌరముఖుడి స్తోత్రం పూర్తి కాగానే, అతడి భక్తిప్రపత్తులకు అమిత ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదాధారిగా ప్రత్యక్షమయ్యాడు. పీతాంబరాలతో దేదీప్యమానంగా మెరిసిపోతున్న స్వామిని చూసి గౌరముఖుడు పులకించిపోయాడు.‘వత్సా! ఏమి కోరిక’ అడిగాడు శ్రీమన్నారాయణుడు.‘స్వామీ! నా ఆశ్రమానికి రాజు దుర్జయుడు, అతడి పరివారం వచ్చారు. వారికి ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చాను. వారందరికీ భోజనం పెట్టగలిగేలా నాకు వరమివ్వు చాలు’ అని కోరాడు గౌరముఖుడు. నారాయణుడు అతడికి ఒక దివ్యమణిని ప్రసాదించి, ‘ఈ మణి నువ్వు కోరినవన్నీ ఇస్తుంది’ అని పలికి అదృశ్యమయ్యాడు.నారాయణుడు ప్రసాదించిన మణితో గౌరముఖుడు తన ఆశ్రమం ఎదుటనే ఇంద్రలోకాన్ని తలపించే మహానగరాన్ని సృష్టించాడు. అందులో రాజు దుర్జయుడికి, అతడి పరివారానికి విలాసవంతమైన విడిది ఏర్పాటు చేశాడు. వారంతా ఆనందంగా ఆ నగరంలోకి ప్రవేశించారు. వారికి సేవలందించడానికి దాసదాసీ జనాన్ని సృష్టించాడు. వారందరికీ షడ్రసోపేతమైన మృష్టాన్న భోజనాన్ని ఏర్పాటు చేశాడు. దుర్జయుడు, అతడి పరివారం సుష్టుగా భోజనం చేసి, వారికి ఏర్పాటు చేసిన విడిది మందిరాల్లో హాయిగా విశ్రమించారు.మర్నాడు ఉదయం అందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానానికి గంగానదికి వెళ్లారు. వారంతా స్నానాలు చేసి తిరిగి వచ్చేసరికి, అంతకుముందు వరకు ఉన్న నగరం లేదు. అందులోని దాసదాసీ జనం ఎవరూ లేరు. కేవలం గౌరముఖుడి ఆశ్రమం మాత్రమే యథాతథంగా ఉంది. దుర్జయుడు, అతడి పరివారం గౌరముఖుడి దివ్యశక్తికి అమితాశ్చర్యం చెందారు.రాజు దుర్జయుడు, అతడి పరివారం గౌరముఖుడి వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరారు. కొంత దూరం సాగాక దుర్జయుడు, అతడి పరివారం అటవీమార్గంలో కొద్దిసేపు విశ్రాంతి కోసం ఆగారు. అప్పుడు దుర్జయుడికి ఒక దురాలోచన వచ్చింది. ఆశ్రమంగా పర్ణశాల తప్ప మరేమీ లేని బడుగు ముని అయిన గౌరముఖుడు తనకు, తన సమస్త పరివారానికి రాజోచితమైన ఆతిథ్యం ఎలా ఇచ్చాడో అతడికి అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. వెంటనే వేగులను పిలిచి, ‘మనందరికీ ఆ ముని గౌరముఖుడు ఎలా ఆతిథ్యం ఇవ్వగలిగాడు? దీని వెనుకనున్న మర్మమేమిటి? ఇందులో ఏదైనా మంత్ర మహిమా ప్రభావం ఉందా? అసలు రహస్యాన్ని తెలుసుకుని రండి’ అని పురమాయించి పంపాడు.రాజాజ్ఞ కావడంతో వేగులు హుటాహుటిన గౌరముఖుడి ఆశ్రమంవైపు బయలుదేరారు. వారు మాటు వేసి గౌరముఖుడి వద్ద ఉన్న మణి మహిమను తెలుసుకున్నారు. తిరిగి వచ్చి, రాజుకు అదే సంగతి చెప్పారు.‘ఒంటరిగా తపస్సు చేసుకునే మునికి ఎందుకు అంతటి దివ్యమణి? అలాంటిది నావంటి రాజు వద్ద ఉండటమే సమంజసం. ఆ మణిని నాకు ఇవ్వగలడేమో కనుక్కుని రండి’ అంటూ దుర్జయుడు తన భటులను పంపాడు. వారు గౌరముఖుడి వద్దకు వెళ్లి, తమ రాజు ఆ మణిని కోరుతున్న సంగతి చెప్పాడు. గౌరముఖుడు ఆ మణిని ఇవ్వడానికి నిరాకరించాడు. భటులు వెనుదిరిగి, ఈ సంగతిని రాజుకు నివేదించారు.గౌరముఖుడు తన కోరికను కాదనడంతో దుర్జయుడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే సైన్యాన్ని తీసుకుని గౌరముఖుడి ఆశ్రమాన్ని ముట్టడించాడు. దుర్జయుడు సైన్యంతో వస్తుండటం చూసి, గౌరముఖుడు మణిని చేతిలోకి తీసుకుని శ్రీమన్నారాయణుడిని స్మరించుకున్నాడు. రాజు వల్ల, అతడి సైన్యం వల్ల ఆపదను పోగొట్టాలని ప్రార్థించాడు. ఒక్కసారిగా మణి నుంచి వేలాదిగా సాయుధ సైనికులు ఉద్భవించారు.వారు దుర్జయుడి సైన్యాన్ని ఎదుర్కొని, చంపిన వాళ్లను చంపి, మిగిలినవాళ్లను తరిమికొట్టారు. కొంత సమయం తర్వాత గౌరముఖుడు యుద్ధరంగానికి వెళ్లి, అక్కడే కూర్చుని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించాడు. ఆయన ప్రత్యక్షమవగానే, దుర్జయుడి ఆగడాన్ని నివారించమని కోరాడు. శ్రీమన్నారాయణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి, దుర్జయుడి శిరసును ఖండించాడు. – సాంఖ్యాయన -
స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం..
కాలేజీ రోజుల్లో కల కనని వారు అంటూ ఉండరు. ఆ కలకు కష్టం, అంకితభావం తోడైతే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో ‘దిగంతర’ నిరూపించింది. అనిరుథ్ శర్మ, రాహుల్ రావత్, తన్వీర్ అహ్మద్ అనే కుర్రవాళ్లు కాలేజీ రోజుల్లో కన్న కలను స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం చేసుకొని తిరుగు లేని విజయాన్ని సాధించారు..‘దిగంతర మొదలైనప్పుడు, ఇప్పటికి తేడా ఏమిటి?’ అనే ప్రశ్నకు వినిపించే జవాబు... ‘దిగంతర’ అంటే అంతరిక్ష వ్యర్థాలను గుర్తించే సంస్థగానే ఎక్కువ గుర్తింపు ఉండేది. తాజా విషయానికి వస్తే... వినియోగదారులకు సేవలు అందించడం మాత్రమే కాకుండా మన దేశ రక్షణ ప్రయోజనాల విషయంలో మౌలిక సదు΄ాయాలను అందించే సంస్థగా అభివృద్ధి చెందింది. ‘అంతరిక్షంలో ఏం జరుగుతుంది?’ అనేది అర్థం చేసుకోవడానికి స్పేస్ డొమైన్ అవేర్నెస్ కంపెనీగా ఎదిగింది.దిగంతరకు సంబంధించిన ఐడియా కాలేజీ రోజుల్లోనే అనిరు«థ్ శర్మ, రాహుల్ రావత్లకు వచ్చింది. బెంగళూరులో శాటిలైట్ క్లబ్ నిర్వహిస్తున్న తన్వీర్ అహ్మద్తో కలిసి ‘దిగంతర’ కలను సాకారం చేసుకున్నారు. విమానయానం, సముద్ర నావిగేషన్కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలు, నియమాలు ఉన్నాయి. అంతరిక్షానికి సంబంధించి అలాంటివి లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘స్పేస్ డొమైన్ అవేర్నెస్’కు ప్రాధాన్యత ఇస్తోంది దిగంతర.దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. స్పేస్ డొమైన్ అవేర్నెస్ వల్ల అంతరిక్షంలో ఏం జరుగుతుందో అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. స్పేస్–మ్యాప్ (స్పేస్ మిషన్ ఎష్యూరెన్స్ ప్లాట్ఫామ్), స్టార్స్(స్పేస్ థ్రెట్ అసెస్మెంట్ అండ్ రెస్సాన్స్ సూట్) అనే రెండు సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేసింది కంపెనీ. అంతరిక్ష ఆధారిత సెన్సర్లు, గ్రౌండ్ ఆధారిత టెలిస్కోపిక్ అబ్జర్వేటరీల కాంబినేషన్ను ఉపయోగిస్తోంది దిగంతర.ఈ అబ్జర్వేటరీలలో మొదటిది లద్దాఖ్లో రానుంది. సెన్సర్ల నుంచి తీసుకున్న డెటా, వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతరత్రా సంస్థల నుంచి సేకరించిన డేటాతో తన సొంత లైబ్రరీలను ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ లైబ్రరీలను ఉపయోగించి విశ్లేషణలు అందించే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తోంది.‘దిగంతర’కు ‘సింగపూర్ స్పేస్ అండ్ టెక్నాలజీ’లాంటి అంతర్జాతీయ కస్టమర్లు ఉన్నారు. మైత్రి(మిషన్ ఫర్ ఆస్ట్రేలియా–ఇండియా టెక్నాలజీ, రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్)లో భాగంగా ఆప్టికల్ సెన్సర్ల సప్లైకు సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన స్పేస్ మెషిన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.స్పేస్ ఆపరేషన్స్, సిచ్యుయేషనల్ అవేర్నెస్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కటింగ్–ఎడ్జ్ టెక్నాలజీతో దూసుకు΄ోతున్న ‘దిగంతర’ అంతరిక్షానికి సంబంధించి అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. ‘వర్క్ హార్డ్ డ్రీమ్ బిగ్’ అనేది ముగ్గురు మిత్రులకు ఇష్టమైన మాట. ఆ మాటకు అర్థం ఏమిటో ‘దిగంతర’ విజయం చెప్పకనే చెబుతోంది.ఇవి చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే? -
ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒక గడప దాటకూడదా?
ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒక గడప దాట కూడదని, అత్తా అల్లుళ్లు ఒకరికొకరు ఎదురు పడకూడదని, కొత్త దంపతులు కలవకూడదనీ అంటారు. ఎందుకంటే..?సాధారణంగా వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులుప్రారంభిస్తారు. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్లయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో ఉంటే, సకాలంలో పనులు జరగవు.వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటిలా కాల్వల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే కష్టం కదా... అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు. అంతేకాకుండా, కొత్త నీరు వచ్చే ఆషాఢంలో ఆ నీరు తాగటం వల్ల రకరకాల రుగ్మతలకు లోను కావచ్చు.అంతేకాదు, ఈ కాలంలో గర్భధారణ జరిగితే పిల్లలు కలిగే నాటికి మంచి ఎండాకాలం... శిశువు పెరగటానికి అంత మంచి వాతావరణం కాదు అని ఆలోచించారు. అందుకే ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి రోజులకు అన్వయించుకుంటే... వ్యవసాయదారుల కుటుంబాలు కాకుండా ఇతరుల విషయంలో ఈ ఇబ్బంది లేదు.ఇవి చదవండి: పబ్లో.. ఫస్ట్ టైమ్! -
ఫుల్కారీ ఎంబ్రాయిడరీలో విభిన్న డిజైన్లు..
మన దేశీయ సంప్రదాయ కళలప్రాముఖ్యత ఎంతటిదో మనకు తెలిసిందే. పంజాబ్ ‘ఫుల్కారీ కళ’కు ప్రసిద్ధి. వారి సంప్రదాయ వేడుకలలో ప్రధానంగా కనిపిస్తుంది. ‘పూల కళ’గా పేరొందిన ఈ వర్క్ దుపట్టాలు, చీరలమీదనే కాదు ఆధునిక డ్రెస్సుల మీద, ఇతర యాక్సెసరీస్లోనూ కనువిందు చేస్తోంది. నక్షత్రాల్లా మెరిసి΄ోతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ కళ పండగల వేళ మరింత ప్రత్యేకతను చాటుతోంది. ఫ్యాషన్ వేదికల మీదా కనువిందు చేస్తోంది.ఒక్కోప్రాంతానికి ఒక్కో విశిష్టత ఉన్నట్టే ఒక్కో కళ కూడా తన ప్రత్యేకతను చూపుతుంటుంది. హిందీలో ‘ఫూల్’ అంటే పువ్వు అని అర్థం. వేదకాలంలోనూ ఈ జానపద కళ మూలాలున్నాయని చెబుతుంటారు. అయితే, 15వ శతాబ్దంలో పంజాబ్లోని మహిళల ద్వారా మొదలైందని తెలుస్తుంది. వివాహాలు ఇతర వేడుకలలో మహిళలు ఫుల్కారీలు ధరించడం, బహుమతులు ఇవ్వడం అక్కడి సంప్రదాయం. ఇది పూర్తిగా గృహసంబంధమైన దేశీయ కళ. ఖద్దరు క్లాత్పైన రంగు రంగుల సిల్క్, కాటన్ దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. రేఖాగణితంలోని జామెట్రీని ఈ డిజైన్లు ΄ోలి ఉంటాయి.ఎవర్గ్రీన్ ఆర్ట్ వర్క్..ఫుల్కారీ కండువాలు, శాలువాలు, దుపట్టాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ నేడు కుర్తాలు, లెహంగాలు, జాకెట్లు, స్టోల్స్, చీరలు, ష్రగ్లు, స్కర్ట్లు, కఫ్తాన్లు, ఫ్యూజన్ అవుట్ఫిట్లు, ΄ాదరక్షలు, బెల్ట్లు, హెయిర్ బ్యాండ్స్, బ్యాగ్లు, ΄ûచ్లు, క్లచ్లు, గొడుగుల డిజైన్లలోనూ.. ఫుల్కారీ కళ కనిపిస్తోంది.విభిన్న డిజైన్లు..ఈ డిజైన్లలో బాగ్, ఛమాస్, నీలక్, చోప్.. వంటి 52 రకాల ఫుల్కారీలు ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని మాత్రమే ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. గతంలో ఈ ఎంబ్రాయిడరీని స్త్రీలు చేతులతో చేసేవారు. ఇప్పుడు యంత్రాలు, ఆధునిక పద్ధతులలో కొత్త వస్తువులను ఉపయోగిస్తున్నారు. ఈ కళ టెక్నిక్స్ని చాలా మంది ఆధునిక డిజైనర్లు గ్లోబల్ మార్కెట్ను చేరుకోవడానికి ఎంచుకుంటున్నారు.యాక్ససరీస్లోనూ ఫుల్కారీ వర్క్ప్రకృతితో ప్రేమ..ఫుల్కారీ మూలాంశాలకు ప్రేరణ ప్రకృతియే. తల్లీకూతుళ్ల అనుబంధం, జంతువులు, పక్షులు, ఉద్యానవనాలు, బంతి, మల్లెలు, నెమలి, ఆవ పూలు... స్త్రీల భావోద్వేగాలకు అద్దం పడుతున్నాయా అన్నట్టు ఈ కళ సృజనాత్మకతకు అద్దం పడుతుంది.సంప్రదాయ రంగులు..ఫుల్కారీ కళలో రంగుల వాడకం చాలా ముఖ్యమైన ΄ాత్ర ΄ోషిస్తుంది. సాంప్రదాయకంగా నాలుగు రంగులు మాత్రమే ఉపయోగిస్తారు. కాబోయే వధువులకు ఎరుపు, రోజువారీ వాడకంలో నీలం, నలుపు, ముదురు షేడ్స్ ఉపయోగిస్తారు. ఉత్సాహాన్ని సూచించడానికి ఎరుపు, శక్తి కోసం నారింజ, సంతానోత్పత్తికి ఆకుపచ్చ రంగును వాడతారు. -
అక్కర్లేని వెంపర్లాట!
ప్రాచీన కాలాన్నీ, ప్రస్తుత కాలాన్నీ పోల్చి చూస్తే, ప్రజల జీవన శైలిలో కనబడే ఒక ముఖ్యమైన వ్యత్యాసం నిరాడంబరత. పాత కాలంలో పెద్దలు నిరాడంబరంగా జీవించమని బోధించేవాళ్ళు. శుకమహర్షి నాటి నుంచీ, రమణ మహర్షి నాటి వరకూ తక్కువ అవసరాలతో, వనరులతో జీవనం సాగించే యోగులనూ, త్యాగులనూ సామాజికులు ఎక్కువ గౌరవించేవాళ్ళు. బాహ్యమైన పటాటోపాలనూ, ఆర్భాటాలనూ, వాక్– ఆభరణ – వస్త్రాడంబరాలను వదివేసి, అంతర్ముఖులై ఆత్మనిగ్రహంలో జీవించే వాళ్ళను ఆదర్శప్రాయులుగా భావించేవాళ్ళు.క్రమంగా ఇది తలకిందులవుతున్నట్టు కనిపిస్తుంది. ఇరవయ్యొకటో శతాబ్దంలో ఎక్కడ చూసినా ఆడంబరాల వెంపర్లాటే! వాడుకకు పనికి రాని పాతిక లక్షల రూపాయల చేతి సంచీలు కొని ధరించేవాళ్ళు ఆదర్శం. సమయం సూచించని యాభై లక్షల రూపాయల చేతి గడియారం ధరించడం మహనీయతకు చిహ్నం.కోట్ల రూపాయలు విలువ చేసే కార్లలో తిరిగే వాళ్ళను మించిన ఘనులు, వ్యక్తిగతమైన పుష్పక విమానాలలో తిరిగే ఆచంట మల్లన్నలు. బిడ్డ వివాహం నాలుగయిదు దశలుగా చేసి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం శ్రేష్ఠత్వానికి లక్షణం. ఎవరి పిచ్చి వారికి ఆనందమని సమర్థించవచ్చు కానీ, సామాన్య దృష్టికి ఇది కేవలం వెర్రితనంగా, ధనోన్మాదంగా కనిపిస్తుంది.ఈ ఆడంబర ప్రియత్వం మునుపు లేదని కూడా అనలేం. కానీ ఇటీవలి దశకాలలో ఇది మరింత వెర్రితలలు వేస్తున్నదనటం నిర్వివాదం. సమాజంలో కూడా ఈ ‘అతి’ని గర్హించే ధోరణికంటే, ఎవరికి చేతయినంత వరకు వాళ్ళు ఈ ఆడంబరాలను అనుకరించడమే జీవిత లక్ష్యమని నమ్మే భావజాలం బలపడుతున్నట్టు కనిపిస్తుంది.ఆడంబరాల మీద వ్యామోహం తీరని దాహం అని తెలిసీ దాని వెంట పరుగెత్తడం ఒక వ్యసనం లాంటిదే. దానివల్ల కలిగే కష్టనష్టాలు కూడా అందరూ ఎరిగినదే. ఎరిగి కూడా ఈ ఆడంబరాల మీది నుంచి దృష్టి మళ్ళించకపోతే ఇహపరాలలో ఉభయభ్రష్టత్వం మిగులుతుందేమో శ్రద్ధగా తర్కించుకోవడం శ్రేయస్కరం. – ఎం. మారుతి శాస్త్రిఇవి చదవండి: ఏది వాస్తవ చరిత్ర? -
ఆ ఉత్తరం ఈ దక్షిణం అన్ని రుచులూ అద్భుతః
మన వంటగదికి పొరుగింటి రుచిని అద్దుదాం. కేరళ కొబ్బరితో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పెరుగుతో పంజాబీ కడీ చేద్దాం. శనగలతో జైసల్మీర్ చనే కూడా ట్రై చేద్దాం. పిల్లలకు అన్ని రుచులూ అలవాటైతే... పై చదువులకు ఏ రాష్ట్రానికి వెళ్లినా సరే... మన ఇంట్లో భోజనం చేసినట్లే ఉంటుంది.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;నీరు– వంద మిల్లీలీటర్లు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా– చిటికెడు.తయారీ..బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీటలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.మిక్సీలో బియ్యంతోపాటు కొబ్బరి తురుము కూడా వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇది ఆపం పిండి ∙బాణలిలో నీటిని పోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి. రాత్రి గ్రైండ్ చేసి పెడితే ఉదయానికి పొంగుతుంది.ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో బాగా కలపాలి.మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి. అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసుకోవచ్చు.ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.ఈ ఆపం అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.నూనె వేయాల్సిన పని లేదు. ఆపం పెనం లేకపోతే దోశె పెనం (ఫ్లాట్గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు.పంజాబీ కడీ..కావలసినవి..– శనగపిండి మిశ్రమం కోసం: శనగపిండి– కప్పు;పెరుగు– 2 కప్పులు;నీరు– 4 కప్పులు;పసుపు– చిటికెడు.– కడీ కోసం: ఆవనూనె లేదా వేరుశనగ నూనె– టేబుల్ స్పూన్;పసుపు – అర టీ స్పూన్;ఇంగువ– పావు టీ స్పూన్;ఆవాలు – టీ స్పూన్;జీలకర్ర – టీ స్పూన్;మెంతులు – అర టీ స్పూన్;లవంగాలు – 3;ఎండుమిర్చి – 2;కరివేపాకు – 3 రెమ్మలు;ఉల్లిపాయ – 1 పెద్దది (తరగాలి);అల్లం– అంగుళం ముక్క (తరగాలి);వెల్లుల్లి– 4 రేకలు (తరగాలి);మిరపొ్పడి– అర టీ స్పూన్;ధనియాల పొడి –2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్;గరం మసాలా– అర టీ స్పూన్;ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు లేదా పచ్చి మామిడి గుజ్జు టేబుల్ స్పూన్;కసూరీ మేథీ (ఎండిన మెంతి ఆకుల పొడి)– 2 టీ స్పూన్.– తడ్కా కోసం: నూనె – టేబుల్ స్పూన్;ఎండుమిర్చి– 2;కశ్మీరీ మిర్చిపౌడర్– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– టేబుల్ స్పూన్తయారీ..ఒక పెద్ద పాత్రలో పెరుగు, శనగపిండి వేసి బాగా కలిసేటట్లు చిలకాలి. అందులో పసుపు వేసి, నీరు పోసి మళ్లీ చిలికి అరగంట సేపు పక్కన ఉంచాలి.స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి వేగనివ్వాలి.అవి వేగిన తర్వాత మిర్చిపౌడర్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి.ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి– పెరుగు మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించిన తర్వాత ఆమ్చూర్ పౌడర్, కసూరీ మేథీ, గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి.బాణలి పెట్టి నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, కశ్మీరీ మిర్చిపౌడర్ వేసి వేగిన తర్వాత ఉడికించిన కడీ మిశ్రమాన్ని పోసి చివరగా కొత్తిమీర చల్లితే పంజాబీ కడీ రెడీ.ఇది అన్నంలోకి బాగుంటుంది. పంజాబీ కడీలో నీరు ఎక్కువగా కలిపి పలుచగా చేసుకుని సూప్లా కూడా తాగుతారు.వర్షాకాలం, చలికాలం ఈ సూప్ తాగుతుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తేలిగ్గా, హాయిగా ఉంటుంది.జైసల్మీరీ చనే..కావలసినవి..ముడి శనగలు – కప్పు;నెయ్యి – టేబుల్ స్పూన్;ఇంగువ – చిటికెడు;జీలకర్ర– అర టీ స్పూన్;జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి – 2 టీ స్పూన్లు;మిరపొ్పడి – టేబుల్ స్పూన్;పసుపు– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పెరుగు– ఒకటిన్నర కప్పులు;శనగపిండి –3 టేబుల్ స్పూన్లు;కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..శనగలను శుభ్రంగా కడిగి ఆరింతలుగా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయం నీటిని వంపేసి మరోసారి కడిగి ప్రెషర్ కుకర్లో వేసి నాలుగు కప్పుల నీటిని పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.దించేసిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక వెడల్పు పాత్రలో శనగపిండి, పెరుగు, పసుపు, మిరపొ్పడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఇంగువ వేయాలి.జీలకర్ర చిటపట పేలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వేసి అడుగుపట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.ప్రెషర్కుకర్లో ఉడికించి సిద్ధంగా ఉంచిన శనగలను నీటితో సహా ఉడుకుతున్న శనగపిండి, పెరుగు మిశ్రమంలో వేసి కలిపి మరో ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ జైసల్మీరీ చనే కర్రీ రోటీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? -
పిల్లలకు బ్రషింగ్ నేర్పడం ఇలా..
పెరిగే పిల్లల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, వాళ్లకు పళ్లు రంధ్రాలు పడటం, పుచ్చుపళ్లు రావడం వంటివి నివారించాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బ్రషింగ్ ప్రక్రియనూ నేర్పాలి..పళ్లపై ఏర్పడే గార తొలగిపోడానికి, అది ఏర్పడకుండా ఉండటానికి పేస్ట్తో రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం నేర్పాలి.పళ్ల మీద గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్ను ఉపయోగించేలా చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి.దానికి వాళ్లు అలా అలవడిపోయి, జీవితాంతం కరెక్ట్గా బ్రషింగ్ చేస్తారు.బ్రష్ మీద బఠాణీ గింజ అంత పేస్ట్ వేస్తే.. దానిని వారు మింగకుండా ఉంటారు.నాలుగేళ్లు దాటాక కూడా వేలు చప్పరించే పిల్లల పళ్లు వంకర టింకరగా రావడం లేదా ఒకేచోట గుంపుగా రావడం జరగవచ్చు. అందుకే ఈ అలవాటు త్వరగా మానేలా జాగ్రత్త తీసుకోవాలి.ఇవి చదవండి: Fashion: స్కర్టే.. సూపర్ స్టయిల్! -
Fashion: స్కర్టే.. సూపర్ స్టయిల్!
అమ్మాయిల సంప్రదాయ అలంకరణలో స్కర్ట్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకేతరహా ఫ్యాబ్రిక్తో స్కర్ట్ సాదాసీదాగా కనిపించేది. దీనికి అదనపు హంగుగా కుచ్చులు జత చేసి, ఒకవైపు నుంచి మరోవైపుకు సెట్ చేస్తే.. వచ్చిన స్టైల్ డ్రేప్డ్ స్కర్ట్. షార్ట్ కుర్తీ, ట్యునిక్, ఖఫ్తాన్ వంటి టాప్స్ ఎంపిక ఏదైనా డ్రేప్డ్ స్కర్ట్కి జత చేస్తే ఆ స్టైల్ అదుర్సే మరి.ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్గా ఆకట్టుకునే డ్రేప్డ్ స్కర్ట్ వెస్ట్రన్ స్టైల్లోనూ యంగ్స్టర్స్ని ఆకట్టుకుంటుంది. ఫ్లోరల్ ప్రింట్లు, ఎంబ్రాయిడరీ వర్క్తో మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుంది.డ్రేప్డ్ స్కర్ట్ అంచులు ఎగుడు దిగుడుగా ఉండటమే దీని ప్రత్యేకత. అందుకే ఎక్కువ భాగం ఈ స్కర్ట్కి ఎంబ్రాయిడరీ వంటి హంగులు అవసరం లేదు. టాప్గా ఎంచుకునే కుర్తీ, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్, ఖఫ్తాన్, ట్యునిక్స్ని ఎంబ్రాయిడరీ లేదా ఫ్లోర ల్ వర్క్తో రిచ్లుక్ని తీసుకురావచ్చు.ప్లెయిన్ శాటిన్, సిల్క్ మెటీరియల్తో విరివిగా కనిపించే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఇండోవెస్ట్రన్ లుక్ని సొంతం చేస్తుంది. అందుకే ఈ స్టైల్ యూత్ని అట్రాక్ట్ చేస్తుంది.టాప్ టు బాటమ్ ఒకే రంగులో ప్లెయిన్గా ఉండే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఫ్యామిలీ గెట్ టు గెదర్ వేడుకలకు ప్రత్యేకంగా నిలిస్తే, పట్టు, ఫ్లోరల్, జరీ వర్క్తో డిజైన్ చేసినవి వివాహ వేడుకలలోనూ గ్రాండ్గా కనిపిస్తాయి.ఇవి చదవండి: Priya Sisters: ఆదాయం కన్నా.. అభిరుచిగానే మిన్న! -
Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా!
పురాణాలు ఇప్పుడు కాలక్షేపం కోసం కాదు. వయసు మళ్లిన వారి కోసం మాత్రమే కాదు. మిలీనియల్స్ నుంచి జెన్ జెడ్ వరకు యువతరం పురాణాలను ఇష్టపడుతోంది. అయితే అది చదువు రూపంలో కాదు. గేమింగ్ రూపంలో. ఇండియన్ మైథలాజికల్ గేమ్స్ను ఆడడానికి గేమర్స్లో 82 శాతం మంది ఇష్టపడుతున్నట్లు చెబుతోంది గేమింగ్ అండ్ ఇంటరాక్టివ్ మీడియా ఫండ్ సంస్థ లుమికై. అర్జునుడి నుంచి కర్ణుడి వరకు రకరకాల పురాణపాత్రలలో ‘ప్లేయర్’ రూపంలో పరకాయ ప్రవేశం చేస్తోంది యువతరం...వెల్కమ్ టు గేమ్ జోన్..అహ్మదాబాద్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని శాన్వీకి గేమింగ్ అంటే బోలెడంత ఇష్టం. ఎక్కువ సమయాన్ని టెక్ట్స్బుక్స్తోనే గడిపే శాన్వీ కాసేపు వీడియో గేమ్స్ ఆడడం ద్వారా రిలాక్స్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డెత్స్ డోర్’ నుంచి ‘మాన్స్టర్ హంటర్’ వరకు ఎన్నో గేమ్స్ ఆడింది. అయితే ఒక ఫ్రెండ్ సలహా ప్రకారం కొన్ని నెలల క్రితం తొలిసారిగా ఇండియన్ మైథలాజికల్ గేమ్ ఆడింది. ఇక అప్పటి నుంచి అలాంటి గేమ్స్ మాత్రమే ఆడుతోంది.‘మైథలాజికల్ గేమ్స్కు ఇతర గేమ్స్కు తేడా ఏమిటో తొలిసారిగా తెలుసుకున్నాను. ఇవి కేవలం కాలక్షేప ఆటలు కావు. పురాణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని పెంచుతాయి’ అంటుంది శాన్వీ. ‘చిన్న పట్టణాలతోపాటు గ్రామీణ ్రపాంతాలలో కూడా స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడంతో గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగింది. మన దేశంలో పెద్ద గేమింగ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. గతంతో ΄ోల్చితే వచ్చిన మార్పు ఏమిటంటే మన సాహిత్యం, సంస్కృతితో ముడిపడి ఉన్న పాత్రలను యువ గేమర్స్ ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్–క్లాస్ టెక్నాలజీతో మనవైన పాత్రలను ఇండియన్ స్టూడియోలు డెవలప్ చేస్తున్నాయి’ అంటుంది ‘విన్జో గేమ్స్’ కో–ఫౌండర్ సౌమ్య సింగ్ రాథోడ్.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మన పురాణాలు, చరిత్ర, సంస్కృతి, జానపద సాహిత్యంలోని పాత్రల ఆధారంగా మరిన్ని గేమ్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ నుంచి రానున్నాయి అంటుంది సౌమ్య. ‘పురాణాలను గేమింగ్తో మిళితం చేయడంతో ప్లేయర్స్ కొత్త రకం అనుభూతికి గురవుతున్నారు. అన్ని వయసుల వారిని ఈ గేమ్స్ ఆకట్టుకుంటున్నాయి’ అంటున్నాడు ‘ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్’ ఫౌండర్ చిన్మయ్ శర్మ. ‘మన పురాణాల్లో దాగున్న ఎన్నో ఇతివృత్తాలు డెవలపర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ పాత్రలు యూత్ను ఆకట్టుకునేలా గేమ్ను డిజైన్ చేస్తున్నారు’ అంటున్నాడు యుగ్ మెటావర్స్ సీయీవో ఉత్కర్ష్ శుక్లా.మైథలాజికల్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఫస్ట్–పర్సన్ షూటర్(ఎఫ్పీఎస్) గేమ్స్. మెయిన్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆడే గేమ్స్.‘టెస్ట్ యువర్ స్కిల్స్ ఇన్ దిస్ ఎపిక్ స్ట్రాటజీ గేమ్’ అంటూ ఆహ్వానించిన ‘కురుక్షేత్ర: అసెన్షన్’ దిల్లీకి చెందిన సజనికి బాగా నచ్చింది. ఈ వీడియో గేమ్లో అర్జునుడు, భీముడు, కర్ణుడులాంటి ఎన్నో పాత్రలు ఉంటాయి.‘మైథలాజికల్ గేమ్స్ మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళతాయి. మన పురాణాలు, జానపదాల ఆధారంగా గేమ్స్ను రూపొందించే అద్భుత అవకాశం ఇప్పుడు గేమ్ డెవలపర్లకు వచ్చింది. దేవ, దానవుల మధ్య యుద్ధానికి సంబంధించి సెకండ్ గేమ్ను రూపొందిస్తున్నాం’ అంటున్నాడు ‘కురుక్షేత్ర’ గేమ్ను రూపొందించిన ‘స్టూడియో సిరా’ కో–ఫౌండర్ అభాస్ షా.‘కురుక్షేత్ర’ను తక్కువ సమయంలో ఆరు లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు.మన దేశంలోనే కాదు ఆగ్నేయాసియా దేశాలలో కూడా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన గేమ్స్ను ఆడడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టాన్ని క్యాష్ చేసుకోవడం అని కాకుండా ఈ గేమ్స్ ద్వారా యువతలో నైతిక విలువలు పాదుకొల్పే, ఆత్మస్థైర్యం పెంచగలిగే ప్రయత్నం చేస్తే భవిష్యత్ కాలంలో వాటికి మరింత ఆదరణ పెరుగుతుంది. రాజీ పడకుండా...నోడింగ్ హెడ్స్ గేమ్స్ కంపెనీ రూపొందించిన ‘రాజీ: యాన్ ఏన్షియెంట్ ఎపిక్’ మనల్ని మన పురాణ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మన దేవాలయాల సౌందర్యం నుంచి ఇతిహాస కళ వరకు ఈ గేమ్లో ప్రతిఫలిస్తుంది. కంపెనీ ్రపారంభం నుంచి మన పురాణాల ఆధారంగా గేమ్ను రూపొందించాలని కల కన్నది పుణేకు చెందిన ‘నోడింగ్ హెడ్స్ గేమ్స్’ కంపెనీ ఫౌండర్ శృతి ఘోష్.‘రాజీ’ రూపంలో తన కలను నిజం చేసుకుంది.‘గ్రీకు ఇతర పురాణాలు సినిమాలు, గేమ్స్ రూపంలో మనల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఆ స్థాయిలో మన పురాణాలు గుర్తింపు పొందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పురాణాల ఆధారంగా రాజీ గేమ్కు రూపకల్పన చేశాం. ఇది ఎంతో మంది డెవలపర్లకు స్ఫూర్తిని ఇచ్చింది. ఎంత చెప్పినా మన పురాణాల్లో నుంచి చెప్పడానికి ఇంకా ఎంతో ఉంటుంది’ అంటుంది శృతి ఘోష్.– శృతి ఘోష్ -
International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా!
యోగా చేయడానికి సౌకర్యవంతమైన ప్రదేశం మాత్రమే కాదు అనువైన దుస్తులు ఉండటం కూడా అవసరం. నవతరం అభిరుచికి తగినట్టు ఇటీవల యోగా వేర్ కొత్తగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా నేతన్నలు చరఖాతో దారం వడికి మగ్గంపై నేసిన కాటన్తో తయారైన యోగా వేర్కి డిమాండ్ పెరుగుతోంది. మేనికి హాయిగొలిపేలా సౌకర్యంగా, వదులుగా ఉండే దుస్తుల డిజైన్లే యోగా వేర్లో కీలకమైన అంశాలు. యోగా డే సందర్భంగా సౌకర్యవంతమైన హంగులను మనమూ సొంతం చేసుకుందాం.– కాటన్ స్మోక్డ్ వెయిస్ట్ క్రాప్ టాప్ బాటమ్గా బ్లాక్ హారమ్ ప్యాంట్ ధరించడంతో క్రీడాకారిణి లుక్ వచ్చేస్తుంది.– ఆర్గానిక్ కాటన్తో డిజైన్ చేసిన ప్రింటెడ్ క్రాప్ టాప్, హారమ్ ప్యాంట్ ఇది.– మిడ్ లెంగ్త్ స్లీవ్స్ కాటన్ టాప్, సైడ్ పాకెట్స్ ఉన్న కాటన్ ప్యాంట్తో యోగా కదలికలలో సౌకర్యంగా ఉంటుంది.– కాటన్ షార్ట్ కుర్తీ లేదా క్రాప్ టాప్స్ని ధోతీ ప్యాంట్తో జత చేస్తే యోగసాధనలో సౌకర్యవంతమైన సంప్రదాయ శైలి కనిపిస్తుంది.– కాటన్ బెల్టెడ్ టాప్కి, పెన్సిల్ కట్ ప్యాంట్ యోగావేర్లో స్మార్ట్ లుక్తో ఆకట్టుకుంటుంది.– యోగా వేర్లో జంప్సూట్ డిజైన్స్ సౌకర్యాన్ని ఇస్తాయి.పర్యావరణ స్పృహ, వ్యక్తిగత శైలి, సౌకర్యం.. వీటిని దృష్టిలో పెట్టుకుని యోగా డ్రెస్ డిజైన్స్ని మెరుగుపరచవచ్చు.యోగా సాధనలో సౌకర్యవంతంగా, పర్యావరణ స్పృహని కలిగించే సంప్రదాయ యోగా డ్రెస్సులను ఎంచుకోవచ్చు. వీటికి ఆధునిక డిజైన్స్నీ కలపవచ్చు.లేత రంగులు, ప్లెయిన్గా ఉండే చేనేత వస్త్రాలు యోగా చేయడానికి సౌకర్యంతోపాటు హుందాతనాన్నీ పరిచయం చేస్తాయి.నడుము దగ్గర కాటన్ బెల్ట్, కాలి మడమల దగ్గర ప్రత్యేకమైన డిజైన్ని జోడించడం ద్వారా యోగా డ్రెస్సులను ఆకర్షణీయంగా మార్చేయవచ్చు.యోగాలో సౌకర్యం చాలా ముఖ్యమైనది. శ్వాసక్రియకు పర్యావరణ అనుకూలమైన దుస్తులను ఎంచుకుంటే ఫ్యాషన్గానే కనిపిస్తాం.శరీర కదలికలకు తగినట్టు డ్రెస్ కూడా ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సహజ రంగులను ఉంచుకోవాలి.స్టైల్గా ఉండాలనుకుంటే హై వెయిస్టెడ్ ప్యాంట్స్, ర్యాప్టాప్ల వంటివి మార్కెట్లో లభిస్తున్నాయి. హైవెయిస్ట్ లెగ్గింగ్స్, క్రాప్టాప్స్, స్పోర్ట్స్ బ్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.హెయిర్ హెడ్ బ్యాండ్స్, సన్నని బ్రాస్లెట్స్, స్టడ్స్ లేదా చెవి ΄ోగులు వంటి తేలికైన ఆభరణాలను ధరించాలి.పార్క్ లేదా యోగా క్లాసులకు వెళ్లేటప్పుడు వెంట ఆర్గానిక్ కాటన్ లేదా రీ సైకిల్ చేసిన బ్యాగ్లో యోగాకు ఉపయోగించే మ్యాట్ను, వాటర్ బాటిల్నూ వెంట తీసుకెళ్లవచ్చు.యోగా ప్రయోజనాన్ని ఆనంద దాయకంగా మార్చుకోవాలంటే మాత్రం మీ అభ్యాసమే ముఖ్యమైనది. -
ఆరోగ్యమే ఆనందం..
అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం అని ఒక సినిమా పాట ఉంది. అదెంత నిజమో ఆరోగ్యమే ఆనందం అనడం కూడా అంతే నిజం. ఇంకా చెప్పాలంటే అందంగా ఉండేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారో లేదో చెప్పలేం కానీ, ఆరోగ్యంగా ఉండేవాళ్లు మాత్రం ఆటోమాటిగ్గానే అందంగా కనిపిస్తారు. అందం మన శరీర ఆకృతి మీద ఆధారపడితే, ఆకృతి అనేది శరీర పోషణ మీద, ఆహారపు అలవాట్లమీద, జీవన శైలి మీదా ఆధారపడి ఉంటుంది. శరీర పోషణ మీద తగిన శ్రద్ధ చూపిస్తూ, క్రమబద్ధం గా వ్యాయామాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా కనిపిస్తారు. అదెలాగో చూద్దాం.ఆహారం విషయంలో... శరీరాకృతి విషయంలో క్రమశిక్షణను పాటిస్తే దీర్ఘకాలం పాటు ఎవరికి వాళ్లు మేలు చేసుకున్న వాళ్ళవుతారు. ముందు నుంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. జబ్బులేమీ జోలికిరావు. మీరు ఏమి తింటున్నారు, ఎలా జీవిస్తున్నారు అన్నదాని మీద మీరు ఎలా కనిపిస్తున్నారు, ఎలా ఫీలవుతున్నారనేది ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా వుంటే ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు.మీ శరీరపు బ్యాటరీని రీఛార్జ్ చేయటానికి, మీ కండరాలలో శక్తిని పెంపొందించటానికి, జబ్బుల్నుంచి దూరంగా ఉండటానికి పెద్దగా కష్టపడిపోవాల్సిన పనేం లేదు. కొద్దిపాటి ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తే చాలు. అవేంటో చూద్దామా?తీసుకునే ఆహారంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవటం, ఎక్సర్సైజుల్ని చేయటానికి సమయాన్ని కేటాయించటం, జీవితపు వొత్తిడిల నుంచి రిలాక్స్ కావటానికి ప్రయత్నించటం వంటివి చాలు.ఆరోగ్యంగా తినాలి..మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి కొవ్వు కూడా అవసరమే. అయితే మనలో చాలామంది శరీరానికి అవసరమైన దానికంటే 30 శాతం కొవ్వును అధికంగా కలిగి ఉంటున్నారని ఒక అంచనా. అలాంటి హెచ్చుతగ్గుల్ని నివారించటం కోసం ఆహారంలో సమతుల్యాన్ని పాటించటం చాలా అవసరం. ఇందుకోసం...– రోజూ మీరు తీసుకునే కాయగూరల్లో, ఆకుకూరల్లో వైవిధ్యాన్ని పాటించాలి.– కాఫీ, టీ వంటి వాటి విషయంలో మితాన్ని పాటించడం.– తాగ గలిగినన్ని మంచినీళ్ళను తాగాలి.– రోజుకు 900 కాలరీల లోపుగల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.ఫిట్నెస్కి ప్రాధాన్యత..శరీరం తగినంత ఫిట్నెస్లో ఉంటే అనారోగ్యం తొందరగా దరిచేరదు. బాడీ అలా ఫిట్నెస్తో ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. ఎక్సర్సైజుల మూలంగా గుండె కండరాలు బలపడతాయి. శరీరంలో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. రక్తంలో కొలెస్టరాల్ తగ్గుతుంది. శరీరం బరువు ఉండాల్సిన రీతిలో ఉంటుంది.ఇవన్నీ టెన్షన్ తగ్గించే అంశాలు. ఎక్సర్సైజులంటే – నడక, సైకిలింగ్, ఈత మొదలైనవి ఏవైనా సరే. దీనిని మాత్రం ్రపోగ్రామును నిదానంగాప్రారంభించాలి. క్రమ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అంతే తప్ప తొందరపడిప్రారంభంలోనే అతిగా చేయకూడదు.పోషకవిలువలు..శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే 13 ముఖ్య విటమిన్లు, 25 ఖనిజ లవణాలు మనం తీసుకునే ఆహారంలో తగు పరిమాణంలోలభించాలి కాబట్టి సమీకృత ఆహారాన్ని తీసుకోవాలి.ధూమపానం, మద్యపానాలకు స్వస్తి.. పొగ తాగేవాళ్ళకు, మద్యం సేవించే వాళ్లకు గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు రావటానికి రెట్టింపు అవకాశాలున్నాయి కాబట్టి ఈ రెండు అలవాట్లూ ఉన్న వాళ్లు వాటిని మానుకోవటం మంచిది.ప్రారంభంలో కొంచెం కష్టం కావచ్చు గాని గట్టిగా సంకల్పించుకుంటే అసంభవం మాత్రం కాదు కదా...మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి..రోజుకి అరగంట కాలాన్ని మనస్సు ప్రశాంత పరచుకోవటానికి కేటాయించాలి. మంచి పుస్తకాన్ని చదవటం, ధ్యానం, సంగీతం వినడం వంటి వాటి ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు, అపజయాల గురించి ఆలోచించకుండా భవిష్యత్తుపట్ల ఆశావహ దృక్పథంతో వర్తమానంలో జీవించాలి.శరీరం చెప్పేది వినాలి.. ఆఖరుగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం చెప్పే దానిని వినాలి. శరీరం ఏ ఇబ్బందికి గురవుతున్నా – అంటే అస్వస్థతలకు గురవుతున్నా మనకు కొన్ని సూచనలను అందిస్తుంది. జ్వరం, నొప్పి, దగ్గు, వాంతులు, విరోచనాలు, ఇలాంటి లక్షణాల ద్వారా శరీరంఅనారోగ్య సూచనలను వెలువరిస్తుంటుంది. అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు శరీరాన్ని కండిషన్లోకి తెచ్చుకోవడం ఎవరికి వారు అనుసరించి తీరాల్సిన కర్తవ్యం. -
సరైన చోటు..?
మనం బస్సులో ఎక్కినప్పుడు కూర్చోవటానికి చోటు ఉందా లేదా అని వెతుక్కుంటాం. అది కూడా వెనక్కి అయితే కుదుపులు ఉంటాయని ముందు వరసల్లోనే కూర్చోవటానికి పోటీ పడతాం. రైల్లో ఎక్కినప్పుడు కూడా సౌకర్యంగా కిటికీ దగ్గర చోటుకు ఇష్టపడతాం. అంతేకాదు... సభలకు, సమావేశాలకు వెళ్ళినప్పుడు బాగా వినటానికి, చూడటానికి బాగుంటుందని ముందు వరుసల్లో చోటు చూసుకుంటాం. చదువుకునే రోజుల్లో విద్యార్థులు ముందు బెంచీల్లో చోటు కోసం ప్రతిరోజూ పోటీ పడుతుంటారు.కొన్ని గంటల సేపు ప్రయాణం చేయటానికే సౌకర్యవంతమైన చోటును చూసుకుంటున్నాం. ఆ కాసేపు అదేదో మన సొంత చోటులా భావిస్తూ అందులోకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. మరి, శాశ్వతమైన చోటు సంపాదించుకోవాలంటే ఎంత ప్రయత్నించాలి? ఆ శాశ్వతమైన చోటు ఎక్కడుంది? దాని నెలా పొందాలి?శాశ్వతుడు, నిత్య సత్యుడు అయిన భగవంతుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. తరతరాలుగా వచ్చే ధన ధాన్యాలు, బంగారం వంటి సంపదలు వదలలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. కష్టాలు కోరకుండానే వచ్చినట్లు, సుఖాలు ఆ సమయానికి అవే వస్తాయి. అందుకోసం ఎంతో విలువైన జీవితాన్ని వృ«థా చేసుకోకూడదంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. ధర్మాన్ని ఆచరించటానికి తగిన మానవ జన్మను పొందటం చాలా కష్టం. ఈ అవకాశాన్ని మనుషులు సార్థకం చేసుకోవాలి.ధర్మాన్ని, సత్యాన్ని శ్రద్ధగా పాటించే వ్యక్తులకు దైవం హృదయంలో చోటు లభిస్తుంది. ఆ పరమ పురుషుని పాద పద్మాలను మన హృదయాలలో నిలుపుకోవాలి. మంచితనం, సత్ప్రవర్తన, సత్సాంగత్యం, భక్తి, పరిపూర్ణ విశ్వాసం వంటి వానితో దైవం హృదయంలో చోటు పొందాలి. అదే నిజమైన పొందవలసిన చోటు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించనిది ఏదీ లేదు. – డా. చెంగల్వ రామలక్ష్మి -
టీనేజర్లపై.. స్మార్ట్ ఫోన్ల ప్రభావం! అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
ఇటీవల పరిస్థితులను గమనిస్తే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సెల్ ఫోన్ వాడనీ వారు లేరేమో. సంవత్సరంలోపు పిల్లలు గుక్కపట్టి ఏడిస్తే కన్నతల్లి దగ్గరకు తీసుకొని పాలు తాగించేది. భయంతో ఏడిస్తే నేనున్నానే భరోసాను నింపుతూ ఎత్తుకుని లాలించేది. గోరుముద్దలు తినిపిస్తూ జోలపుచ్చే ది. కానీ ప్రస్తుతం ఇవేవీ కనిపించడం లేదు. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరు గయ్యాయి. పిల్లవాడు మారం చేస్తేచాలు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏడుపు ఆగిపోతుంది. సెల్ ఫోన్ మన జీవతంలో ఎంత దూరం వరకు వెళ్లిందో గమనిస్తున్నామా అనిపిస్తుంది.ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ఇంటిలో ఏది ఉన్నా లేక పోయినా స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇంటిలో కనీస ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో కానీ స్మార్ట్ ఫోన్ నేడు మానవ జీవతంలో ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అందలమెక్కేసినట్లుగా భావిస్తున్నారు. జనం నాలుగో జనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు మరింత స్మార్ట్ గా జనానికి చేరువైపోయింది.అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి ఫోన్ కి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పాడింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. సెల్ ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతుంది.సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుంచి చిన్నారుల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మ విశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్ లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు.మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలను సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు ఏవైనా సమస్యలతో బాధపడుతూ, ఏడుస్తూ తమ దగ్గరకు వస్తే అవి చిన్నవే కదా అని వదిలివేయకుండా వాటిని పరిశీలించి, పరిష్కరించాలి. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి సెల్ ఫోన్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్లు యూట్యూబ్ గేమ్స్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు.ఇవి పిల్లవాడి భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించాలి. పిల్లల కోసమే మా జీవతం అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తును చేజేతులా పాడు చేసినవారవుతారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాల ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు ముందుగా గుర్తించి దాన్ని పరిష్కారం చేయగలిగితే పిల్లల భవిష్యత్ బంగారంగా మార్చుకోచ్చు.టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం..టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని "శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఐజెన్ కన్సెల్టింగ్ ఫౌండర్" వైద్యురాలు 'జీన్ త్వెంగె' టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు.టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల యుగం పిల్లల్లో మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్ త్వెంగె. ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోనట్లు భావిస్తుండడం వంటి లక్షణాలు గమనించారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల అత్మహత్యలు రెట్టింపయ్యాయి. అని జీన్ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు."అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్" కలిసి జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదో వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇవి చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా.. -
Gaming: గురి తప్పకుండా..
యాక్షన్ రోల్–ప్లేయింగ్ సర్వైవల్ గేమ్ వి రైజింగ్. ఒపెన్ వరల్డ్లో సెట్ చేసిన ఈ గేమ్ను అయిదు బయోమ్లుగా విభజించారు. కొత్తగా ఉనికిలోకి వచ్చిన రక్తపిశాచిని కంట్రోల్ చేయడం ప్లేయర్ పని. దీని కోసం రకరకాల సాధనాలను, ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.అంతేకాదు శత్రువుకు చిక్కని దుర్భేద్యమైన కోటను కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది. సూర్యకాంతి, నీడ, రక్తనమూన... ఇలా ఎన్నో అంశాలు ఈ ఆటలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏ అడుగులో ప్రమాదం, నష్టం పొంచి ఉందో కనిపెట్టే స్పృహ ఆటగాడిలో ఉండాలి. ఆటలో నాన్–ప్లేబుల్ క్యారెక్టర్లు(ఎన్పీసీ) కీలకం.ప్టాట్ ఫామ్స్: విండోస్ప్లేస్టేషన్: 5జానర్స్: సర్వైవల్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: భారత్లోకి ఎయిర్ టాక్సీ.. ధరలు ఎలా ఉంటాయంటే? -
దైవానుభవానికి మార్గం..
దైవత్వం ఒక అనుభవం. దీనిని హృదయంలో ప్రతిబింబింప జేసుకోవాలి. అద్దం కదులుతూ ఉన్నా లేదా దానిని పొగ కప్పివేసినా లేదా వస్తువుల నుండి చాలా దూరంగా ఉన్నా... అద్దం దేనినీ సరిగా ప్రతిబింబింప చేయలేదు. మనస్సు (అద్దం) నిశ్చలంగా (కదలకుండా) ఉండడమే ఏకాగ్రత. అద్దాన్ని కప్పి ఉంచే పొగ (అహం)ను తొలగించాలి. అదే ‘దైవ సాక్షాత్కారం’.జ్ఞానానికి రెండు స్థాయులు ఉన్నాయి. ఒకటి కిందిస్థాయి, మరొకటి పైస్థాయి. ఇంద్రియాలను ఉపయోగించుకొని, హేతుబద్ధంగా విచారించి తెలుసుకొనేది కిందిస్థాయి జ్ఞానం. చాలామంది కిందిస్థాయి జ్ఞానంతోనే జీవితాన్ని గడుపుతున్నారు. దైవానికి సంబంధించిన జ్ఞానమే పైస్థాయికి చెందింది. ఇది సాధారణమైన జ్ఞానాన్ని మించింది. అంటే సర్వోత్కృష్టమైన దన్నమాట. కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు. ఈ విధమైన జ్ఞానాన్ని సద్గురువు మాత్రమే అనుగ్రహిస్తారు.మానవ జన్మ ఉన్నత లక్ష్యం భగవంతునిలో ఐక్యం చెందటమే. మనిషి తన జన్మకు కారణం ఏమిటో మరచిపోయి ‘కామ– కర్మ– అవిద్య’ అనే చక్రంలో చిక్కుకున్నాడు. స్వార్థబుద్ధిని పోనీయక, సొంతలాభం కోసం ఇతరులకు నష్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాంటివారికి ఎన్నటికీ విమోచన ఉండదు. కాబట్టి ఆత్మ వివేక మార్గంలో నడచి, భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇతరుల దోషాలనూ, తన చుట్టూ గల వాతావరణంలోని లోపాలను ఎంచుట మనిషికి గల సాధారణ లక్షణం. ఈ విధంగా తప్పులను ఎంచుటం వలన ఏ ప్రయోజనమూ లేదు. వాస్తవంగా ఈ లక్షణ ం మనిషి మానసిక ప్రశాంతతను భంగపరుస్తుంది. ఇందువలన సమతాస్థితిని పొందలేడు.ఆధ్యాత్మిక మార్గం అనుసరించదలచిన భక్తుడు చిత్తశుద్ధిని పెంపొందించుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితం సాధ్యమవుతుంది. ఇతరుల దోషాలను ఎంచటం మానివేసి, ఎవరికి వారు తమను తాము సరిచేసుకొని అభివృద్ధి అవ్వడానికి ప్రయత్నించాలి. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
Beauty Tips: చర్మ సౌందర్యానికై ఇలా చేస్తే చాలు..
పాలలో బ్రెడ్ ముక్కలు నానవేసి వాటిని మెత్తగా మెదిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మృదువుగా మిలమిలలాడుతుంది.కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేసుకోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ రుద్ది ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ముడతలు లేకుండా తాజాగా కనిపిస్తుంది.పులిపిర్లు రాలిపోయిన తర్వాత ఆ మచ్చలు పోవటానికి తేనె, నిమ్మరసం కలిపి ఆ మచ్చల మీద రాస్తూ ఉండాలి.తులసి ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆపేస్టును కాని రసాన్ని కాని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. క్రమంతప్పకుండా రోజూ చేస్తుంటే మొటిమలు, వాటి మచ్చలు పూర్తిగా పోవడంతో పాటుచర్మం నునుపుదేలుతుంది.తేనెను గోరువెచ్చగా చేసి అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరినతర్వాత కడగాలి. తేనెను ఎప్పుడూ నేరుగామంట మీద వేడి చేయకూడదు. తేనె ఉన్నపాత్రను ఎండలో కాని, వేడి నీటి గిన్నెలోకాని పెట్టి వేడి చేయాలి.ఇవి చదవండి: ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’! -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ఎన్ని చదివాం, ఎన్ని విన్నామనేది కాదు! అసలు..
మనం ఏ విషయాన్ని నిర్ణయించాల్సి వచ్చినా ‘‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ...’’ శాస్త్రమే ప్రమాణం. మనకు బుద్ధికి తోచిన దానితో నిర్ణయం చేయడం సనాతన ధర్మంలో భక్తి అనిపించుకోదు. మనం ఎన్ని చదివాం, ఎన్ని విన్నాం... అని కాదు ఎన్ని ఏ మేరకు పాటిస్తాం అన్నది ప్రధానం. ఈ విషయాన్నే రామాయణంలో సీత ‘ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తనే / తథా హి విపరీతా తే బుద్ధిరాచార వర్జితా..’ అంటూ రావణాసురుడికి బోధ చేస్తుంది.అలా మనం ఏదయినా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకు ప్రమాణం శాస్త్రం. పుట్టుకతో ప్రతివారికీ మూడు రుణాలుంటాయి.. అని శాస్త్రం అంటుంది. అవి రుషి రుణం, దేవరుణం, పితృరుణం. ‘నేనెప్పుడు చేశానండీ ఈ రుణాలు, నేనెలా రుణగ్రస్తుడనయ్యాను’ అన్న ప్రశ్న అన్వయం కాదు. శాస్త్రవాక్కు కనుక అందరికీ ఉంటుంది. వీటిలో ఒక రుణం విషయంలో మాత్రం దానిని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ అవసరం ఉండదు. అది రుషిరుణం. సనాతన ధర్మంలో మనందరం రుణపడి΄ోయింది రుషులకు. మంత్రానికి రుషి ద్రష్ట. వేదమంత్రాలను ధ్యానంతో దర్శించి, విని మనకు స్వరంతో అందించాడు. ఆయన కూడా మనలాగే జీవించినవాడే అయినా రుషి తర్పణం అని... రుషికి వేరు తర్పణం ఉంటుంది.రుషి మన నుంచి ఏ విధమైన ఫలాన్ని ఆశించలేదు, ఏ సత్కారాన్నీ, ఏ బిరుదునూ కోరుకోలేదు. కేవలం మనల్ని ఉద్ధరించడం కోసమని, మనందరికీ కటికచీకటిలో కాంతిరేఖ కనపడాలని, మన జీవితాలు సుసంపన్నం కావాలని, మార్గం చూపించాలని వేదాల ద్వారా అందించి ధర్మానుష్ఠానికి ప్రమాణాన్ని కల్పించాడు. అలాగే ఒకవేళ మనం ఇవన్నీ చదవగలమో లేదో, స్వరంతో మంత్రం చెప్పగలమో లేదో, మంత్రభాష్యాన్ని అర్థం చేసుకోగలమో లేదో, అసలు ఇది అందరికీ అందుబాటులో ఉంటుందో ఉండదో అన్న అనుమానంతో రుషులు పురాణాలను ఇతిహాసాలుగా అందించారు.వ్యాసభగవానుడు 18 పురాణాలను అందించాడు. ‘‘నమో’స్తు తే వ్యాస విశాల–బుద్ధే/ఫుల్లరవిందయత –పత్ర–నేత్ర/యేన త్వయా భారత–తైల–పూర్ణః/ప్రజ్వలితో జ్ఞాన–మయః ప్రదీపః’’ అంటారు. అంతటితో ఆగకుండా ఆయన పరమ దయాళువై వేదాల సారాన్ని అందరూ చదువుకుని అనుష్ఠించడానికి వీలుగా పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు. వేదం చదువుకుంటే ఏది తెలుస్తుందో మహాభారతం చదువుకున్నా అదే తెలుస్తుంది.సూర్యవంశాన్ని అంతటినీ కూడా శ్రీరామాయణం ద్వారా వాల్మీకి మహర్షి వర్ణించాడు. ‘‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే /వేదః ప్రచేతసదాచిత్ సాక్షాత్ రామాయణాత్మనాః’’ వేదములు ప్రతి΄ాదించిన బ్రహ్మము రామచంద్రమూర్తిగా వస్తే ఆ వేదమే రామాయణ కావ్యంగా వచ్చింది. వేదం ఏం చెప్పిందో తెలియనప్పుడు రామాయణం చదువుకుంటే చాలు. మనకు ఆ ప్రయోజనం నెరవేరుతుంది. రాముడు ఏ పరిస్థితుల్లో ఏం చేసాడో, మానవాళికి అదే వేదం విధించిన కర్తవ్యం కూడా. అందుకే ఎవరయినా అత్యంత విశ్వాసంతో ఒక విషయాన్ని తదేక దృష్టితో నమ్మి ఆచరించేవారయితే ‘రుషి సమానులు’ అంటారు. ఆయన ఒక ‘రుషి’ అంటారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బౌద్ధవాణి: మణి–దీపం!
వేసవి ఎండ తీవ్రంగానే ఉంది. కానీ ఆ మామిడి తోటలో చల్లగానే ఉంది. ఆ మామిడితోట వేణువనానికి ఒక మూలన ఉంది. ఆ తోట మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద విశాలమైన అరుగు. ఆ అరుగు దగ్గరకు నెమ్మదిగా, మందహాసంతో నడిచి వచ్చాడు బుద్ధుడు. ఆయన రాకను గమనించాయి తోటలో ఉడతలు. మనిషి అలికిడి తగిలితే ΄ారి΄ోయే ఉడతలు, బుద్ధుణ్ణి చూస్తే దగ్గరకు వచ్చేస్తాయి.అది ఎప్పటినుండో వాటికి అలవాటు. భిక్షా΄ాత్రలోంచి కొన్ని పళ్ళు తీసి అరుగు పైన ఒక పక్కన చల్లాడు. అవి కుచ్చుతోకలు విప్పుకుని, పైకెత్తుకుని వచ్చి, పండ్లు ఏరుకుని తినసాగాయి. కొంత సమయం గడిచింది.సకుల ఉదాయి అనే పరివ్రాజకుడు వచ్చాడు. బుద్ధునికి నమస్కరించి కూర్చున్నాడు. అతను రాగానే కొన్ని ఉడతలు చెట్లెక్కాయి. వాటిని చూసి– ‘‘భగవాన్! మీ కరుణ అమోఘం. ఉడతలు కూడా మిమ్మల్ని మిత్రునిగా భావిస్తాయి. ఇది విచిత్రం. మీ జీవ కారుణ్యానికి మచ్చుతునక. మీకు మరోమారు ప్రణమిల్లుతాను’’ అని వంగి నమస్కరించాడు. ‘‘సకుల ఉదాయీ! వచ్చిన విషయం?’’ అని అడిగాడు బుద్ధుడు. ‘‘మా గురువుగారు నిగంఠ నాధుల వారు నిన్న ‘పరమ సత్యం, పరమ వర్ణం’’ అంటూ ‘‘పరమం’’ గురించి చె΄్పారు. మీ దృష్టిలో పరమ వర్ణం ఏది? అని అడిగాడు. ‘‘ఉదాయీ! పరమం అంటే?’’‘‘మీకు తెలియంది కాదు. దేని కంటే ఉన్నతమైంది మరొకటి ఉండదో... అదే పరమం’’ ‘‘నీకు ఈ లోకం ఎంత తెలుసు. అందులో ఇదే పరమం అని ఎలా నిర్ణయిస్తావు? నూతిలోని కప్పకి నుయ్యే ప్రపంచం. చెరువులోని చేపకి చెరువే ప్రపంచం. ఈ అనంతమైన విశ్వానికి హద్దులు ఎలా గీస్తావు?’’ అని అడిగాడు భగవానుడు. సకుల ఉదాయి మౌనం వహించాడు.‘‘ఉదాయీ! ఒక చీకటి గదిలో ఒక పసుపురంగు కంబళిలో ఒక సానబెట్టిన మణి ఉంది. అది ఆ చీకటిలో ప్రకాశిస్తుంది. అంతలో ఆ గదిలోకి ఒక మిణుగురు పురుగు వచ్చింది. అప్పుడు ఆ మణి వెలుగు ఎక్కువ ప్రకాశంగా ఉంటుందా? మిణుగురు వెలుగా?’’ అని అడిగాడు. ‘‘భగవాన్! మిణుగురు వెలుగే మిగుల ప్రకాశం’’ అన్నాడు ఉదాయి.‘‘ఇందులో ఒక వ్యక్తి నూనె దీపం తెచ్చాడు. అప్పుడు ఏ వెలుగు ప్రకాశం?’’‘‘దీపం వెలుగే భగవాన్!’’ ‘అలా ఉదాయీ! దీపం వెలుగు కంటే నెగడు వెలుగు ప్రకాశం. దాని కంటే వేగుచుక్క వెలుగు, దానికంటే చంద్రుని వెలుగు, దానికంటే సూర్యుని వెలుగు ప్రకాశం.... ఉదాయీ! సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగులు కూడా ఉంటాయి.’’ అన్నాడు. ఉదాయి మనస్సు తేటబడింది. ఆ తేటదనం అతని ముఖంలోంచి తొంగి చూస్తోంది! ఉడతలు కిచకిచ మంటూ బుద్ధుని దగ్గరకు వచ్చాయి. ఆయన ΄ాత్రలో నుంచి మరికొన్ని పళ్ళను వాటిముందు ΄ోశాడు. అవి వాటి పనిలో మునిగి ΄ోయాయి. ‘‘ఉదాయీ! మిణుగురు పురుగు కంటే తక్కువ ప్రకాశించే మణి వెలుగునే ‘పరమం’ అనుకుంటున్నావు? అన్నాడు.‘విజ్ఞానం, విశ్వం, అన్నీ అనంతాలే’ అని గ్రహించాడు. సకుల ఉదాయీ! బుద్ధునికి ప్రణమిల్లాడు! అతని ముఖంలో అనుమాన ఛాయలు తొలిగాయి. సంతోష కాంతులు వెలిగాయి! దోసిలి చాచాడు. బుద్ధుడు కొన్ని పండ్లను అతని దోసిట్లో ΄ోశాడు. ఉదాయి, కొద్దిగా ముందుకు వంగి ఉడతలకు దోసిలి చూ΄ాడు. అవి అతని ముఖం కేసి చూశాయి. ధైర్యంగా దోసిలి లోని పండ్లు అందుకున్నాయి. – డా. బొర్రా గోవర్ధన్ -
ఈ టేస్టీ స్నాక్స్తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..!
క్యాలెండర్ పేజీ తిప్పమంటోంది. జూన్కి స్వాగతం పలకాల్సిందే. కొత్త టైమ్టేబుల్నీ స్వాగతించాల్సిందే. లంచ్ బాక్సు... స్కూల్కి రెడీ అయిపోతుంది. పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఇవిగో వీటిని మన వంటింట్లో ట్రై చేయండి..బ్రెడ్ పొటాటో రోల్..కావలసినవి..బంగాళదుంపలు– 3 (మీడియం సైజువి);క్యారట్ తురుము లేదా పచ్చి బఠాణీలు – అర కప్పు ;మిరప్పొడి– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పసుపు – చిటికెడు;నిమ్మరసం –పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;బ్రెడ్ స్లయిస్లు – 10;వెన్న – టేబుల్ స్పూన్ – 2 టేబుల్ స్పూన్లు;పాలు– అర కప్పు; మొక్కజొన్న పిండి లేదా మైదా లేదా శనగపిండి– 2 టేబుల్ స్పూన్లు (బ్రెడ్ స్లయిస్లను రోల్ చేసి అతికించడానికి).తయారీ..బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్క తీసి చిదిమి ఒకపాత్రలో వేసుకోవాలి.క్యారట్ లేదా బఠాణీలను ఉడికించి పక్కన పెట్టాలి.ఇప్పుడు చిదిమిన బంగాళదుంప గుజ్జులో మిరప్పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం, ఉడికించిన క్యారట్ లేదా బఠాణీలను వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదమాలి.ఉప్పు, కారం సరి చూసుకుని అవసరమైతే మరికొంత చేర్చుకోవచ్చు.ఈ మిశ్రమాన్ని పది సమభాగాలుగా చేయాలి. ఒక్కో భాగాన్ని ఓవల్ షేప్ (దొండకాయ ఆకారం)లో చేయాలి.బ్రెడ్ అంచులు కట్ చేసి తీసేసిన తర్వాత బ్రెడ్ స్లయిస్ని పూరీల పీట మీద పెట్టి రోలర్తో వత్తాలి.ఇలా చేయడం వల్ల గుల్లబారి ఉన్న బ్రెడ్ చపాతీలాగ పలుచగా వస్తుంది.పాలలో బ్రష్ ముంచి ఈ స్లయిస్ల మీద చల్లాలి లేదాపాలలో వేళ్లు ముంచి బ్రెడ్ స్లయిస్ మీద చల్లి తడిపొడిగా ఉండేటట్లు మునివేళ్లతో అద్దాలి.బ్రెడ్ చివర్లు అతికించడం కోసం తీసుకున్న పిండిలో నీరుపోసి గరిట జారుడుగా కలుపుకోవాలి.ఇప్పుడు బ్రెడ్ స్లయిస్ మీద బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి అంచులకు పిండి ద్రవాన్ని అద్దుతూ అతికిస్తే బ్రెడ్రోల్ రెడీ.వీటిని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. బయటే ఉంచినప్పుడు ఒకవేళ కాల్చడం ఆలస్యం అయితే బ్రెడ్ అంచులు ఎండిపోయి రోల్ ఊడిపోతుంది.పెనం వేడి చేసి వెన్న రాసి బ్రెడ్ రోల్స్ను ఒకదాని పక్కన ఒకటిగా అమర్చాలి. దోరగా కాలేకొద్దీ మరొక వైపుకు తిప్పుతూ అన్ని వైపులా కాలేటట్లు చూడాలి.పెనం మీద కాల్చినప్పుడు నూనెలో రోస్ట్ చేసినట్లు రోల్ అంతా సమంగా ఒకే రంగులో ఉండదు. కానీ లోపల మిశ్రమం ఉడికిపోతుంది. రోల్ పై భాగం కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.మొత్తంగా ఒకేరంగులో ఉండాలంటే బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి మరిగించి అందులో నాలుగు రోల్స్ వేసి అవి కాలిన తర్వాత మరికొన్ని వేస్తూ కాల్చుకోవచ్చు.ఇలా చేసినప్పుడు నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే అదనంగా ఉన్న నూనెను పేపర్ పీల్చుకుంటుంది.ఒవెన్లో అయితే... 200 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేసి బేకింగ్ ట్రేలో రోల్స్ను అమర్చి పది నుంచి పన్నెండు నిమిషాల సేపు బేక్ చేయాలి.చీజ్ బాల్స్..కావలసినవి..బంగాళదుంపలు –పావు కేజీ;వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్;ఉప్పు –పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి – అర టీ స్పూన్;మిరియాల పొడి –పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;బ్రెడ్ క్రంబ్స్ – 6 టేబుల్ స్పూన్లు;నూనె – వేయించడానికి తగినంత.స్టఫింగ్ కోసం.. చీజ్ – 100 గ్రాములు;ఎండిన పుదీన – అర టీ స్పూన్ (ఆకులను అరచేతిలో వేసి వేళ్లతో నలిపి పొడి చేయాలి);రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి –పావు టీ స్పూన్;మిరియాల పొడి–పావు టీ స్పూన్, గరం మసాలా పొడి– చిటికెడు.కోటింగ్ కోసం.. కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు;ఎగ్ – ఒకటి (ఎగ్ వేయనట్లయితే మరో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి);బ్రెడ్ క్రంబ్స్– అర కప్పు.తయారీ..బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించి, వేడి తగ్గిన తర్వాత తొక్క తీసి చిదమాలి.అందులో వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, బ్రెడ్ క్రంబ్స్ వేసి సమంగా కలిసేటట్లు చిదిమి ఒకసారి రుచి చూసుకుని అవసరమైతే ఉప్పు, కారం కలుపుకుని మిశ్రమం మొత్తాన్ని బాల్స్ చేసి ఆరిపోకుండా ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలి.స్టఫింగ్ కోసం తీసుకున్న వాటిలో చీజ్ తప్ప మిగిలిన అన్నింటినీ ఒకపాత్రలో వేసి కలపాలి. అందులో చీజ్ ని అర అంగుళం ముక్కలుగా కట్ చేసి వేసిపాత్రను కొద్దిగా కదిలిస్తూ మసాలా పొడులు చీజ్ ముక్కలకు పట్టేలా చేసి వేడి తగలకుండా స్టవ్కు దూరంగా ఉంచాలి.ఇప్పుడు బంగాళదుంప బాల్స్ ఒక్కొక్కటిగా తీసుకుని అరచేతిలో పెట్టి వేళ్లతో చిన్న పూరీలా వత్తి అందులో మసాలా పట్టించిన చీజ్ ఒక ముక్క పెట్టి బంగాళాదుంప మిశ్రమం పూరీ అంచులను మూసేస్తూ బాల్ చేయాలి.ఇలా అన్నింటినీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో కార్న్ఫ్లోర్ వేసి అందులో ఒక్కో బాల్ని వేస్తూ మెల్లగా వేళ్లతో కదిలిస్తూ పిండి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.మరొక ప్లేట్లో బ్రెండ్ క్రంబ్స్ వేసుకుని కార్న్ఫ్లోర్ పట్టించిన బాల్స్ని వేసి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.కోడిగుడ్డు సొనను ఒక గిన్నెలో వేసి గిలక్కొట్టాలి.ఎగ్ వాడనట్లయితే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ను తగినంత నీటితో గరిటజారుడుగా కలుపుకోవాలి.పొడి కార్న్ఫ్లోర్ పట్టించిన బంగాళాదుంప– చీజ్ బాల్స్ని కార్న్ఫ్లోర్ ద్రవం లేదా కోడిగుడ్డు సొనలో ముంచి తీసి పదినిమిషాల సేపు ఆరనివ్వాలి.ఈ లోపు బాణలిలో నూనె వేడి చేయాలి. ఒక్కో బాల్ను జాగ్రత్తగా నూనెలో వేసి మీడియం మంట మీద బాల్ అన్ని వైపులా సమంగా కాలిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.బాల్స్ మీద టిష్యూ పేపర్ని కప్పి ఉంచితే అదనపు ఆయిల్ వదులుతుంది.బంగాళాదుంప– చీజ్ బాల్స్ని టొమాటో సాస్ లేదా కెచప్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: చూపులను కట్టడి చేసేలా! -
మిస్ కేరళ ఫిజిక్గా టైటిల్ తనకు సొంతం!
‘కొన్నిసార్లు మీరు భయపడకుండా వేసే ఒక్క అడుగు జీవన గమనాన్ని మెరుగ్గా మార్చేస్తుంది’ అంటుంది 24 ఏళ్ల అశ్వతి ప్రహ్లాదన్. బాడీ షేమింగ్ను ఎదుర్కొన్న అశ్వతి ఇప్పుడు మిస్ కేరళ ఫిజిక్గా టైటిల్ గెలుచుకుంది.. సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి ఫిట్నెస్ కోచ్గా మారింది. సోషల్ మీడియాలో లక్షమంది ఫాలోవర్లతో బిజీగా ఉంది. ఎగతాళి మాటల నుంచి పట్టిన పట్టుదల ఎందరిలోనో స్ఫూర్తిని కలిగిస్తుంది.‘‘ఒక దశలో నేను బాగా బరువు తగ్గిపోయాను. కారణం కొన్నిరోజులపాటు వేధించిన జ్వరం. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది. సరైన ఆహారం తీసుకోలేక బాగా సన్నబడిపోయాను. కొన్నాళ్లపాటు ఆ సమస్యను జనాల నుంచి సూటిపోటి మాటల ద్వారా ఎదుర్కొన్నాను. ‘ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు? ఇంట్లో వాళ్లు ఫుడ్ పెట్టడం లేదా? గాలికి ఎగిరిపోయేలా ఉన్నావ్?.. లాంటి మాటలను ఎదురుగానే అనేవాళ్లు. చుట్టుపక్కల, బంధువులు రకరకాల సలహాలు ఇచ్చేవారు. దాంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయినా ఉద్యోగానికి వెళ్లాలంటే భయంగా ఉండేది. అమ్మాయిలు లావుగా ఉన్నా, మరీ సన్నగా ఉన్నా ఈ సమాజంలో జనం ఏదో ఒకటి అంటూ బాధించాలనే చూస్తారు. ఇదో పెద్ద మానసిక ఒత్తిడిగా అనిపించేది. ఈ ట్రామా నుంచి ఎలాగైనా బయట పడాలనుకున్నాను. అప్పుడే ఫిట్నెస్లోకి రావాలనుకున్నాను.నన్ను నేను ప్రేమించుకుంటూ..జనాలు ఎగతాళిగా అనే బాడీ షేమింగ్ వ్యాఖ్యలను అసలు పట్టించుకోవడం మానేశాను. నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. నాలా బాధపడేవారికి ఓ రోల్మోడల్గా ఉండాలని జిమ్లో చేరాను. నా జీవనశైలిలో మార్పులు చేసుకున్నాను. సమతుల ఆహారంపై అవగాహన పెంచుకుని, దానిని తీసుకోవడంపై శ్రద్ధ పెట్టాను. ఫలితంగా ఆరోగ్యంలో మార్పు వచ్చింది. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడింది. దీంతో ఫిట్నెస్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ఎంతగా సాధన చేస్తూ వచ్చానంటే బాడీ షేమింగ్ బాధితులకు కేరళ ఫిజిక్ టైటిల్ను అంకితం చేసేవరకు నన్ను నేను మలుచుకోవడంలో ఒక తపస్సే చేశాను.అశ్వతి ప్రహ్లాదన్విమర్శలను పట్టించుకోను..‘ఏమీ చేయని వ్యక్తులే జీవితంలో ఏదైనా సాధించాలని ప్రయత్నించేవారిని నిందిస్తుంటారు. మొదట్లో వారి మాటలకు నేను కూడా ఎదురు సమాధానం చెప్పేదాన్ని. ఇప్పటికి కూడా సోషల్మీడియాలో ఫేక్ అకౌంట్లతో నన్ను నిందించే ప్రయత్నం చేసేవాళ్లున్నారు. టైటిల్ సాధనతో ఇప్పుడు చెడు వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య తగ్గి,పాజిటివ్ కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి.అపోహలు వద్దు..మగవారిలాగా తమ శరీరం కూడా కండలు తిరిగిపోతుందేమోనన్న భయంతో వర్కవుట్ చేయని మహిళలు ఉన్నారు. మరోవైపు వర్కవుట్ చేస్తూ బరువు తగ్గుతూ ఉంటే, ఏదైనా కారణాలతో మధ్యలో జిమ్ ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతామేమోనని అంటూ ఆందోళనపడేవారూ ఉన్నారు. ఇలాంటి అపోహలు మన సమాజంలో చాలా ఉన్నాయి. అలాంటి వారికి చెప్పేది ఏమిటంటే ‘జిమ్లోనూ, ఇంట్లోనూ మంచి జీవనశైలినిపాటించకుండా ఈ దురభి్రపాయాలకు రావద్దు. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గి, కండరాలు ద్రవ్యరాశిని కోల్పోయే అవకాశం ఉంది.కండర నిర్మాణానికి వ్యాయామం ఆరోగ్యకరం. కండరాలను నిర్మించడం అంటే శరీరం అంతా కండరాలుగా మారడం కాదు. ఫిట్నెస్నుప్రాక్టీస్ చేస్తే మానసిక, శారీరిక ఆరోగ్యంతో సహా అన్ని విషయాలు మెరుగుపడతాయి. అందుకని, అపోహలతో ఫిట్నెస్లోకి రావద్దు. మన వెనక జనాలు ఏదో మాట్లాడుతున్నారని వెనకడుగు వేయద్దు. నా విషయంలో అయితే ఈ రంగంలోకి రావడమే మంచి నిర్ణయం అయింది. అందరూ ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. మన శరీరానికి సరైన రీతిలో శిక్షణ ఇస్తే మరిన్ని అద్భుతాలను మనమే చేయచ్చు.నా జీతం మొత్తం..ఏడాదిన్నర క్రితం ఇన్ఫోపార్క్లో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఫిట్నెస్ను కూడా నా జీవితంలో భాగం చేసుకున్నాను. కానీ, పనిలో చాలా ఒత్తిడి ఉండేది. ఒక్కోసారి తొమ్మిది నుంచి పదకొండు గంటలు పనిచేయాల్సి వచ్చేది. ఆ పనుల మధ్య జిమ్కి వెళ్లేందుకు సమయం దొరకడం కష్టమైంది. కుటుంబం నుంచి మద్దతు లభించింది. నా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంది మా అమ్మ.కానీ... వృత్తిని, అభిరుచిని కలపడం చాలా కష్టం అని గ్రహించాను. ఫిట్నెస్లో పోషకాహారం ఖరీదైనది. నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నా అభిరుచిని కొనసాగించగలిగాను. జీతం నా పోషణకు సరిపోయేది. కొన్ని సంప్లిమెంట్ల కోసం స్పాన్సర్లను వెతికాను. కానీ, లభించలేదు. దీంతో నా జీతం మొత్తం నా పౌష్టికాహారం కోసమే కేటాయించే దాన్ని. మరి ప్రయోజనాలు ఏంటి అని ఎవరైనా అడగచ్చు.ఈ రంగంలోకి వచ్చినతర్వాత నేనెవరో నాకు అర్ధమైంది.పాటలుపాడతాను, డ్యాన్స్ చేస్తాను. ఫిట్నెస్ నన్ను ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుతుంది. ఇది విజయంగా భావిస్తున్నాను. అంతేకాదు, నా ఫిట్నెస్ ఇప్పుడు నా ఆదాయ వనరు కూడా. అందుకే, ఉద్యోగాన్ని మానేసి బిజీ ట్రైనర్గా మారిపోయాను’ అంటూ తన ఫిట్నెస్ రహస్యాలను చెబుతుంది అశ్వతి.ఇవి చదవండి: Health: కడుపులోని బిడ్డ జాగ్రత్త! -
లయ తప్పుతున్న గుండె
సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాట.. ‘హార్ట్ ప్రాబ్లమ్’. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనం వెరసి గుండె జబ్బులు ఏటా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం గుండె పోటుతో మరణిస్తున్నారు. దేశంలో ఏటా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 27 శాతం గుండె జబ్బుల వల్లేనని తేలింది. దీంతో ‘గుండె ఘోష’ను ముందే పసిగట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురైతే తాత్సారం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారంతా గుండె జబ్బులేనని నిర్ధారణకు రాకుండా.. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ, ఈసీసీ రాష్ట్రంలో ఏటా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారందరికీ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. 2019–20వ సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కార్డియాలజీ, కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో 59,700 చికిత్సలు జరిగాయి. 2022–23 నాటికి ఈ చికిత్సల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. అలాగే 2023–24లో కూడా ఈ ఏడాది జనవరి నాటికి 84 వేల మందికి ప్రభుత్వం గుండె జబ్బులకు ఉచితంగా చికిత్సలు చేయించింది. ఏటా పెరుగుతున్న గుండె జబ్బులను పరిగణనలోకి తీసుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందించేందుకు ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్(ఈసీసీ) కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో సైతం ఛాతీనొప్పితో వచ్చే బాధితులకు ఈసీజీ తీసి, కార్డియాలజిస్ట్ల సూచనలతో థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్లు చేసి ప్రాణాపాయం నుంచి రక్షిస్తున్నారు. జీవన విధానం మారాలి» 40 ఏళ్లు దాటిన వారు, రిస్క్ ఫ్యాక్టర్స్(బీపీ, షుగర్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు) ఉన్నవారు తరచూ జనరల్ చెకప్ చేయించుకోవాలి.» రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి.» ఆకుకూరలు, చిరుధాన్యాలు, తాజా పళ్లు, కూరగాయలు, గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. » రెడ్ మీట్ తినడం తగ్గించాలి. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.» ధూమపానం, మద్యపానం మానేయాలి.» శరీర బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి.» మానసిక ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం చేస్తుండాలి.మనం మారితేనే గుండె పదిలంగతంలో గుండె జబ్బులు వయసు పైబడిన వారికి లేదా వంశపారంపర్యంగా మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం అన్ని రకాల వయసు వారిలోనూ గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మారిన జీవన విధానమే.అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడికి లోనవ్వడం, శారీరక శ్రమ లేకుండా జీవించడం వంటి విధానాలను మనం వీడాలి. మనం మారినప్పుడే గుండె పదిలంగా ఉంటుంది. అలాగే గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇప్పటికే సమస్యలున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి, కర్నూలు జీజీహెచ్ -
ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
వాతావరణంలో జరిగే కాలాల మార్పుల కారణంగా అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ప్రతీ సంవత్సరం కేవలం మే నెలలో మాత్రమే ఈ పువ్వు పూస్తుందట. మరి అదేంటో చూసేద్దామా!ఆదిలాబాద్, సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామంలో మే పుష్పం వికసించింది. ఏటా మే నెలలో మాత్రమే పూసే ఈ పువ్వు గ్రామానికి చెందిన ఎలుగు రాజలింగం ఇంటి ఆవరణలో మంగళవారం వికసించింది. ఒకేసారి మూడు పువ్వులు పూయడం సంతోషంగా ఉందని రాజలింగం కుటుంబ సభ్యులు తెలిపారు. ఈఏడాది మొత్తం ఐదు పువ్వులు పూశాయని పేర్కొన్నారు. ఈ పూలను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నట్లు వారు తెలిపారు.ఇవి చదవండి: కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..? -
కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..?
కోటి దీపోత్సవంలో దీపాల శిఖలు మిలమిలలాడుతుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుంది! అలాగే చిదిమి దీపం పెట్టుకోవాల్సిన చిన్నారులు ఆటిజమ్తో చిన్నబోకుండా ఆ అమాయకపు ముఖాలపై చిరునవ్వుల మిలమిలలను అలాగే ఉంచడానికి పూనుకుంది ‘పినాకిల్’ సంస్థ. లక్షణాల్ని బట్టి ఒక్కో ఆటిజమ్ చిన్నారికి ఒక్కో థెరపీ అవసరమవుతుంది. అలాంటి ‘కోటి థెరపీ’లను పూర్తి చేసింది ఈ సంస్థ,‘ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్’ (ఏఎస్డీ) అని పిలిచే ఈ రుగ్మత ఉన్న పిల్లలకు జ్ఞానేంద్రియాల నుంచి మెదడుకు సమాచారం చేరడమూ... అక్కణ్ణుంచి తాము స్పందించాల్సిన రీతిలో స్పందించక΄ోవడమనే సమస్య ఉంటుంది. సెన్సెస్(జ్ఞానేంద్రియాల)కు సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని ‘సెన్సోరియల్ సమస్య’గా చెబుతారు. ఆ పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. కళ్లలో కళ్లు కలిపి చూడలేరు. స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకు నేర్చుకున్న ఒకే పదాన్ని పదే పదే అదే ఉచ్చరిస్తూ ఉంటారు. తోటి పిల్లలతో కలవడానికీ, ఆడుకోడానికి పెద్దగా ఆసక్తి చూపరు.అలాంటి పిల్లలకు అవసరమైన చికిత్స (థెరపీలు) అందిస్తోంది పినాకిల్ సంస్థ. లోపాల్ని చక్కదిద్దడానికి అవసరాన్ని బట్టి స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, డాన్స్ థెరపీ... ఇలాంటి అనేక థెరపీలు అందిస్తోంది. లక్షణాలూ, తీవ్రతలను బట్టి ఒక్కో చిన్నారికి నాలుగైదేసి థెరపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కోటి థెరపీలను ఇటీవలే పూర్తి చేసిందీ సంస్థ. తాము ఈ అసిధారా క్రతువు చేపట్టడం వెనక ఓ నేపథ్యముందంటున్నారు ‘పినాకిల్’ వ్యవస్థాపకురాలు శ్రీజారెడ్డి సరిపల్లి.తొలిచూలు పంటగా పుట్టిన పిల్లాడు మొదట్లో అంతా బాగున్నట్టే కనిపించినా... ఏడాదిన్నర గడిచాక కూడా మాటలు రాక΄ోవడం చూసి ఆందోళన పడ్డారు కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంపతులు. డాక్టర్కు చూపిస్తే వినలేక΄ోతున్నాడనీ, బహుశా ఆటిజమ్ కావచ్చని చెప్పారు. చికిత్స కోసం అనేకచోట్ల తిరిగారు. పరిష్కారం దొరకలేదు. వ్యాధి నిర్థారణ సరిగ్గా జరగలేదు.- శ్రీజా రెడ్డి సరిపల్లిపదిహేను రోజులకు అసలు విషయం తెలిసింది. ఆటిజమ్ కాదు, చెవి సమస్య అని తేలింది. అందుకు అవసరమైన శస్త్రచికిత్సలను రెండు చెవులకూ ఒకేసారి చేయించారు. పరిస్థితి పరిష్కారమైందనుకున్నారు. కానీ కేవలం శస్త్రచికిత్స సరి΄ోదు, స్పీచ్ థెరపీ కూడా అవసరమని వైద్యులు చెప్పారు.అన్నీ ఉండి కూడా తమలాంటివారికే ఇంత కష్టంగా ఉంటే, ఏమీ తెలియని వారికి ఇంకెంత కష్టం ఉంటుందన్న ఆలోచన వారిలో రేకెత్తింది. ఆ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న సంస్థే ‘పినాకిల్’. ఆ ఆటిజమ్ సమస్యను ఎదుర్కొనే పిల్లల తల్లిదండ్రుల దుఃఖం తీర్చడానికీ, ఆ పిల్లలు తమ పనులు తామే చేసుకునేలా, దాదాపుగా మిగతా పిల్లల్లాగే ఆడుకునేలా, నడచుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అది!‘‘పినాకిల్ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 70కి పైగా సేవాకేంద్రాలున్నాయి. ఆటిజమ్ పిల్లలకు అవసరమైన రకరకాల థెరపీలను అక్కడ అందిస్తుంటారు. లోపల జరుగుతున్న చికిత్సను తల్లిదండ్రులు బయట ఉండి స్క్రీన్ మీద చూడవచ్చు. కేవలం భారత్లోనే కాదు... యూఎస్ఏ, సింగపూర్, దుబాయ్లలోనూ ఈ సేవలున్నాయి. త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిటేర్స్లోనూ పినాకిల్ సేవలు అందనున్నాయి. ఖర్చు భరించలేనివారికి ‘సేవా’ విభాగం కింద వారు తాము చెల్లించగలిగేంత లేదా కేవలం ఒక్క రూపాయి చెల్లించి సేవలు ΄÷ందవచ్చు. పద్ధెనిమిది భాషల్లో మా హెల్ప్లైన్ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా భాషల్లో సమాచారం తెలుసుకునేలా మా ‘థెరపాటిక్ ఏఐ’ రూ΄÷ందుతోంది. మా హెల్ప్లైన్ 9100 181 181 కు ఏ టైమ్లో ఫోన్ చేసినా ఆటిజమ్ పిల్లల తల్లిదండ్రులకుప్రాథమిక సమాచారం ఎల్లవేళలా అందుతుంది.ఏఐ ఎందుకంటే..?ఇలాంటి ఓ రుగ్మత ఉందని కనుగొన్న నాటినుంచి నేటికి దాదాపు 133 ఏళ్లు. ఇంతటి చరిత్రా, వేర్వేరు థెరపీల నేర్పూ, నైపుణ్యాలు ఒక్కోచోట ఒక్కొక్కరిలో ఇలా పరిమితంగానే దొరుకుతుండవచ్చు. ఆ అంతటినీ సమగ్రంగా సమీకరించడం, ఒక్కచోటే అందేలా క్రోడీకరించడం అవసరం. అది ‘ఏఐ’తోనే సాధ్యం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నాం.’’ అంటూ తమ సేవల గురించి వివరించారు పినాకిల్ సంస్థ ఫౌండర్, చీఫ్ స్ట్రాటజిస్ట్ శ్రీజా సరిపల్లి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే! -
చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే!
కొడితే ‘ఫాంగ్’ జాబ్ కొట్టాలి అనుకుంటోంది యువతరం. ప్రపంచంలోని ఉత్తమ పనితీరు కనబరిచే దిగ్గజ కంపెనీల సంక్షిప్త నామం–ఫాంగ్ (ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫిక్స్, గూగుల్) ‘ఫాంగ్’ కంపెనీలలో ఉద్యోగం చేయాలనే కలను నెరవేర్చుకోవడానికి స్కిల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్లకు హాజరు కావడం నుంచి సీనియర్ ఉద్యోగులతో మాట్లాడడం వరకు ఎంతో కసరత్తు చేస్తున్నారు. కలను నెరవేర్చుకుంటున్నారు.ప్రతిష్ఠాత్మకమైన ఫాంగ్ (ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్) కంపెనీలలో ఉద్యోగం చేయాలని యువతరం బలంగా అనుకోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే... కాంపిటీటివ్ స్పిరిట్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీపై పనిచేసే అవకాశం అనేవి ముఖ్య కారణాలు.‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేయాలనే కలను నెరవేర్చుకోవడానికి తగిన కసరత్తు చేస్తున్నారు. ‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. ‘ఫాంగ్’ రిక్రూటర్స్, ఎం.ఎల్. ఇంజినీర్స్, రిసెర్చర్లు హాజరయ్యే స్కిల్ లెర్నింగ్ కాన్పరెన్స్లకు హాజరవుతున్నారు. ‘ఫాంగ్’ ఇంటర్వ్యూల గురించి అవగాహన చేసుకోవడానికిప్రొఫెషనల్స్తో మాట్లాడుతున్నారు.‘నా ఫ్రెండ్ ఒకరు మోస్ట్ టాలెంటెడ్. అయితే మొదటి ప్రయత్నంలో ఫాంగ్ కంపెనీలలో ఒకదాంట్లో ఎంపిక కాలేదు. అలా అని డిప్రెస్ కాలేదు. ఏ పొరపాట్ల వల్ల తనకు ఉద్యోగం రాలేదో లోతైన విశ్లేషణ చేసుకుంది. ప్రొఫెషనల్స్తో మాట్లాడింది. పొరపాట్లను సరిదిద్దుకొని రెండో ప్రయత్నంలో విజయం సాధించింది’ అంటుంది బెంగళూరుకు చెందిన షాలిని.‘ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నా ఫాంగ్ కల నెరవేరలేదు. మొదట బాధ అనిపించింది. అయితే ఆ బాధలో నుంచి త్వరగా కోలుకున్నాను. మాస్టర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్పై దృష్టి పెట్టాను. మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్–సాల్వింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాను’ అంటున్న శైలిమ శ్రీవాస్తవ రెండవ ప్రయత్నంలో విజయం సాధించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఖుష్బు గుప్తా గూగుల్లో ఉద్యోగం చేయాలనే తన కలను నెరవేర్చుకుంది.సవాళ్లను అధిగమిస్తే విజయం ఎప్పుడూ మనదే అవుతుంది. ‘గూగుల్లో చేరిన కొత్తలో చాలా మిస్టేక్స్ చేసేదాన్ని. అయితే సీనియర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా తప్పులు జరగకుండా జాగ్రత్త పడడం నేర్చుకున్నాను’ అంటుంది ఖష్బు గుప్తా.అమెజాన్ పాపులర్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ను మన దేశంలో లాంచ్ చేసిన బృందంలో లీలా సోమశేఖర్ ఒకరు. అమెజాన్లో పనిచేయాలనేది ఆమె కల. కంటెంట్ ఎడిటర్గా అమెజాన్లో అడుగులు మొదలు పెట్టిన లీల ఆ తరువాత ప్రోగ్రామ్ మేనేజ్మెంట్లోకి వచ్చింది. ‘ఆన్ది–జాబ్ లెర్నింగ్ ఎక్స్పీరియెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్న లీల సక్సెస్ మంత్రకు ఇచ్చే నిర్వచనం... కొత్తగా ఆలోచించడం. చిన్న వయసులోనేపోలియో బారిన పడిన రేఖాపోడ్వాల్కు వీల్ చైర్పై ఆధారపడడం తప్పనిసరి అయింది. అయితే ఏదో సాధించాలనే తపన మాత్రం గట్టిగా ఉండేది. ఆ తపనే ఆమెను అమెజాన్ ఇండియా స్టార్ ఉద్యోగులలో ఒకరిగా చేసింది.‘కలను నెరవేర్చుకోవడానికి అదృష్టం, అల్లావుద్దీన్ అద్భుతదీపంతో పనిలేదు. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆత్మవిశ్వాసం ఉంటే చాలు’ అంటుంది పుణెకు చెందిన రేఖాపోడ్వాల్. సుందర సందేశం..ఇటీవల గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ని యూట్యూబర్ వరుణ్ మయ్యా ‘ఫాంగ్’కు సంబంధించి యువత కల గురించి అడిగినప్పుడు అమీర్ ఖాన్ బ్లాక్బాస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’లోని ఒక సన్నివేశాన్ని గురించి ప్రస్తావించాడు పిచాయ్. ‘ఆ సీన్లో మోటర్ అంటే ఏమిటో వివరించే వెర్షన్ ఉంది. మోటర్ అంటే ఏమిటో అర్థం చేసుకునే వెర్షన్ ఉంది. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారానే నిజమైన విజయం లభిస్తుంది’ అంటాడు సుందర్ పిచాయ్. సినిమా సీన్ విషయానికి వస్తే ‘మెషిన్ అంటే ఏమిటో నిర్వచనం చెప్పండి’ అనిప్రొఫెసర్ అడిగిన దానికి అమీర్ సింపుల్గా చెప్పిన సమాధానం, ‘మెషిన్స్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ బాడీస్ సో కనెక్టెడ్ దట్ రిలేటివ్ మోషన్స్....’ అంటూ మార్కులు బాగా తెచ్చుకునే స్టూడెంట్ చెప్పిన సుదీర్ఘ, సంక్లిష్ట నిర్వచనం... ఒక విషయాన్ని వివరించడానికి, అర్థం చేసుకోడానికి మధ్య ఉండే తేడాను తెలియజేస్తుంది.ధైర్యమే దారి చూపుతుంది..కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన సోనాక్షి పాండే స్వభావరీత్యా సిగ్గరి. ఇంట్రావర్ట్. నలుగురిలో ధైర్యంగా మాట్లాడేది కాదు. డేటాబేస్ గురించి ఒక చర్చాకార్యక్రమంలో టెక్ ఎక్స్పర్ట్ ఒకరు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న, చర్చిస్తు్తన్న యూట్యూబ్ వీడియోను చూసింది పాండే. ఈ వీడియో ఆమె కెరీర్ గమనాన్ని మార్చేసింది. ఈ వీడియోతో ఇన్స్పైర్ అయిన పాండే నలుగురిలో ధైర్యంగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయింది. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి సొల్యూషన్ ఆర్కిటెక్చర్లోకి వచ్చింది. ఇందులో పబ్లిక్ స్పీకింగ్, క్లయింట్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అయిదు సంవత్సరాలు అమెజాన్లో పనిచేసిన తరువాత మైక్రోసాఫ్ట్, గూగుల్కు అప్లై చేసింది. రెజ్యూమ్లోని కీ ఎలిమెంట్స్ వల్ల రెండు దిగ్గజ సంస్థల్లోనూ పాండేకు ఉద్యోగం వచ్చింది. -
Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
‘ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న, నిన్నటి దాంక బిస్సగా ఉండ్య?’ అని పెద్దింటి మనిషిని అడిగాడు తగ్గుబజారు మనిషి. మాటలు వినపడేంత దూరంలోనే యేటి తగ్గున దొడ్డికి కూచ్చోని మాట్లాడుకుంటున్నారిద్దరూ. ప్రొక్లెయినర్తో ఏటి గట్టునున్న కంప ఉన్న కంపచెట్లను పీకించేసరికి వరిమళ్లు నున్నగా కనపడతున్నాయి. చింతట్టు మీంద నుంచి తెల్ల కొంగల గుంపొకటి వరిమళ్లల్లోకి దిగింది. గుడ్ల మాడి ఇంటి బరుగోళ్ళు యేట్లో సల్లగా పనుకొని నెమురేచ్చా ఉండాయి.బీడీ పొగ గాల్లోకి ఊత్తా ‘నిన్న పెత్తల్ల అమాస గదరా.. కేజీ మటన్, సీపు లిక్కర్ తెచ్చుకున్యాడంట, ఒక్కడే తిని తాగి సచ్చినాడు. ఉబ్బరం పట్టకల్యాక నిద్రలోనే గుండె పట్టుకుందంటా. మంచి సావు సచ్చినాడులే ముసిలోడు’ అన్యాడు పెద్దింటి మనిషి. ‘ఎంత సావొచ్చరా వానికి, డెబ్బై ఏళ్ళు వొచ్చినా మనిషి తుమ్మసెక్క ఉన్యట్టు ఉండ్య’ అనుకుంటా ఇద్దరూ ఒకేపారి లేసి యేట్లోకి పోయివచ్చినారు. ‘తొందర పోదాం పారా, ఎత్తేలోపే ఒకసారి సూసోద్దామ’ని ఊళ్ళోకి దావ పట్టినారు. ముసిలోల్లు, సావాసగాళ్లు అందరూ నాగన్నను సూన్నీకి పోతనారు. యాపసెట్టు కొమ్మల మద్దే నుంచి పడ్తన్య ఎండలో నాగన్నను రగ్గు మీంద పండుకోబెట్టినారు. తలాపున ఊదిగడ్లు పట్టుకుని కూచ్చోని ఉంది నడిపి కోడలు. వచ్చినోళ్లకు నీళ్ళు, కాపీ అందించా సేలాకీగా ఉంది సిన్న కోడలు. మొగుని కాళ్ళ కాడ కూచ్చోని ‘మటన్ కూరాకు, మటన్ కూరాకు అని కలవరిచ్చా ఉన్యాడు మూడు దినాల నుంచి. ఉన్నది అంత తిని సచ్చిపోయే గదరా’ అని ఏడుచ్చాంది నాగన్న పెళ్ళాం. నాగన్న మొఖం సచ్చిపోయినాంక గూడా కళతోనే ఉంది. వచ్చినోళ్ళు అందరూ దాని గురించే మాట్టాడుకుంటా పోతనారు. నాగన్న సిన్నకొడుకు మాటికి ఒకసారి ఇంట్లోకి పోయొచ్చా మూతి తుడుసుకుని వాళ్ళ నాయనను తలుసుకుని కుమిలిపోతనాడు. మిగిలిన ఇద్దరు కొడుకులు తలకాయ న్యాలకేసి నిలబన్యారు. మనువళ్లు మిగతా పనులు సూసుకుంటా ఉండారు. ఊరు సర్పంచు సెండుమల్లె దండ నాగన్న మీందేసి ఒక పక్కన నిలబడి ‘ఎట్టి మాలోళ్లకు సెప్పినారా?’ అని పెద్దరికం నిరూపించుకున్యాడు. నాగన్న పెద్దకొడుకు ముందుకొచ్చి ‘మా పిల్లోల్లు సెప్పనీకి పోయినారు సామీ’ అన్యాడు. ఇంతలోనే ఊరి నుంచి కూతురు ఏడ్సుకుంటా వచ్చి వాళ్ళ నాయన మీంద పడింది. పెద్దింటి మనిషి, తగ్గుబజారు మనిషి ఇద్దరూ గూడా నాగన్న మొఖం దిక్కు సూసి ఒక పక్కన నిలబన్యారు.కోపంగా ఇంటికాడ బగ్గి ఆపి దిగినారు నాగన్న మనువళ్లు. యాప సెట్టు మీందున్న కాకులు అరుసుకుంటా పైకి లేసినాయి. శాంచేపు నుంచి గాడిపాట్లో ఉండే బరుగోళ్ళు రెండు కొట్టుకుంటా ఉండాయి. వాళ్ళ నాయన కాడికి వచ్చి ‘ఈరన్న గుంత తియ్యనీకి రాడంట’ అన్యారు. ఆడ ఉన్య అందరూ వచ్చినోళ్ల దిక్కేమొఖం పెట్టినారు. ‘ఏంటికి?’ అని అడిగినాడు నాగన్న పెద్దకొడుకు.‘ఏమో నాయన! ఏం ఏంటికి గుంత తియ్యవు అని అడిగితే ఏం పలకల్యా.’ ‘ఏం వానికి పొగరు ఎక్కిందంటనా’ అన్యాడు పసిడెంట్. ‘లెక్క జాచ్చి ఇయ్యాలేమో లేరా’ అన్యాడు నిలబన్య పెద్దమనిషి. ‘ఆడికి అది గూడా సెప్పినాం మామా, నీ లెక్క నా పుల్లాతుకు సమానమని ఎచ్చులు పోయినాడు.’‘బలసినట్టు ఉందే.. ఎవరు అనుకోని మాట్టాడ్తానాడంట? కాళ్ళు ఇర్సాలేమో’ అని మీసం తిప్పినాడు నాగన్న నడిపి కొడుకు. ‘ఒర్యా నడిపే.. ఇది కొట్టాట టైమ్ కాదు.. వాని అవసరం మనది. నువ్వు మీయన్న పోయి మాట్టాడి రాపోరి’ అన్యారు రొంత మంది. కొడుకులు ఆలోచనలో పన్యారు. ‘ఇంగో ఇద్దరూ పెద్ద మనుషులు గూడా పోరి’ అన్యాడు పసిడెంట్. గుంత తీసే ఈరన్నను తిట్టుకుంటా పోయినారు నలుగురు.‘ఏం వచ్చి సచ్చింది గుంత తీనీకి పోయే.. లెక్కన్నా వచ్చాది. పెద్ద మాంసం తెచ్చుకుందాం’ అంది మంచంలో నెత్తి దూక్కుంటా ఈరన్న పెళ్ళాం. ఇంటి పక్కన ఉన్య కానుగ సెట్టు కింద కూచ్చోని హరిశ్చంద్ర పద్యం పాడుకుంటా తాడు పేన్తా ఉండాడు ఈరన్న. ‘వీళ్ళ బజార్లు బాగుంటాయి ప్పా.. నీట్గా ఉండాయి సూడు.. మన బజార్లు సచ్చినాయి ఎప్పుడూ సూసినా కుళాయి నీళ్ళు పార్త బురద బురద ఉంటాయి’ అన్యాడు నాగన్న కొడుకులతో పాటు వచ్చన్య మొదటి పెద్దమనిషి.ఆయన సెప్పినట్టే రోడ్డుకు రెండేపులా సెట్లు ఏపుగా పెరిగి ఉండాయి. ఎండ భూమి మీందకు దిగకుండా ఉంది. ఇంటి దిక్కే వచ్చన్య నలుగురును సూసి మంచం మీంద నుంచి దిగి నమస్కారం సేసింది ఈరన్న పెళ్ళాం. ఈరన్న ఏం పలకనట్టు కూచ్చున్యాడు. హరిశ్చంద్ర పద్దెం గొంతు పెంచి అందుకున్యాడు. జనం రొంత గుంపు అయినారు. ‘ఈరన్న.. ఓ ఈరన్న’ అని పిల్సినాడు నాగన్న పెద్దకొడుకు. ‘ఎవరోళ్ళు..’ అన్యాడు ఈరన్న. ‘బంద నాగన్న కొడుకులం’ అన్యాడు నాగన్న నడిపి కొడుకు. ‘సెప్పండి సామీ’ అని అరుగు దిగినాడు. ‘సెప్పనీకి ఏం ఉంది ఈరన్న.. నాగన్న సచ్చిపోయినాడు తెల్దా ఏందీ?’ అన్యాడు రెండో పెద్దమనిషి. ‘తెల్సు సామీ!’ ‘మరేందీ ఈరన్న.. పిల్లోల్లు వచ్చే గుంత తియ్యవనీ సెప్పినావంట?’‘అవును తియ్యను సామీ.’‘యేంది ఈరన్న.. ఏం కావాలా సెప్పు? ఐదు వేలు లెక్క.. రెండు కోటర్లు మందు ఇచ్చాం రా.. టైమ్ ఐపోతాందీ’ అన్యాడు నడిపి కొడుకు. ‘నాకు పదివేలు ఇచ్చినా గుంత తీయను’ అని తెగేసి సెప్పినాడు ఈరన్న. ‘ఏం ఎందుకు ఈరన్న.. మా తాత సచ్చిపోయినప్పుడు నువ్వే గదా తీసినావ్? మా పెద్దనాయన సచ్చిపోయినప్పుడు నువ్వే తీసినావ్? మా ఇల్లు నీకే కదా.’ ‘అవ్ వాళ్ళందరివి తీసిన. రేప్పొద్దున మీలో ఎవరు సచ్చినా గుంత తీచ్చా, కానీ ఈ గుంత తియ్యను.’భుజం మీందున్న టువాలా సర్దుకుంటూ ‘యేందిబీ.. మాటలు యాడికో పోతనాయి. రొంత సూసుకొని మాట్టాడు’ అన్యారు పెద్దమనుషులు. ‘సూడు అయ్యా.. నా మాటలు యాటికి పోలా. నేను గుంత తియ్యను. నన్ను యిడ్సిపెట్టండి.’‘ఏమైందో సెప్పమంటే ఇకారాలు పోతనాడు, ఈడు రాకపోతే వేరేవాళ్ళు రారా యేంది. వాళ్ళను పిల్సుకొని పోదాం’ అన్యాడు నడిపి కొడుకు. ‘ఆ... అట్నే పోండి సామీ’ అని తాడు పేనే పనిలో పడ్డాడు ఈరన్న. మెత్తగా ‘పెద్దోళ్ళు వచ్చినారు, పోకూడదా’ అంది ఈరన్న పెళ్ళాం.‘నీ యమ్మ నిన్ను నరికి, ఈన్నే గుంత తీసి పూడుచ్చా అతికేం మాట్టాన్యావంటే’ అని ఒంటి కాలు మీంద పెళ్ళాం పైకి లేసినాడు ఈరన్న. ‘నీ దినం కూడు కుక్కలు తినా. ఏమన్యానని నా మీందకు వచ్చనావు? పోయేకాలం వచ్చిందిలే నీకు. పెద్దోళ్ళతో పెట్టుకుంటనావు’ అని తిట్టుకుంటా మంచంలో మళ్ళా కూచ్చుంది.నలుగురు ఎదురుగా ఉన్య ఇంటి కాడికి పోయి నిలబన్యారు. ‘అయ్యా.. ఆ ఈరన్న గానీ ఇల్లుకు మేము పోయినామంటే.. వాడు తాగి అమ్మనక్కను తిడ్తాడు. వాన్తో మాకు కొట్టాట వొద్దు అయ్యా.. వానికి ఏం కావాలో ఇచ్చి వాణ్ణే పిల్సుకొని పోండి’ అన్యాడు ఈరన్న ఎదిరింటి మనిషి.రొంత దూరంలో నిలబన్య ఈరన్న అన్న కొడుకు కెళ్ళి సూసేసరికి వాడు సేసేది ఏంల్యాక తలకాయ దించుకున్యాడు. సెప్పనీకి సూసినా వాళ్ళ మనుషుల మీంద మాటలతో పెద్దపులి పడినట్టు పన్యాడు ఈరన్న. ఎవ్వరూ గూడా నోరెత్తల్యా. సెవులూ కొట్టుకుంటా వెనక్కి పోయినారు నలుగురూ. ఈరన్న పెళ్ళాం భయపడ్తా మొగుని దగ్గరకొచ్చాంటే సింత నిప్పుల మాదిరి ఉన్య ఈరన్న కళ్ళు సూసి దూరం నిలబడి జరగబోయేది తలుసుకొని బిత్తర సూపులు సూచ్చాందినాగన్న తలకాయ కాడ ఉన్య బియ్యం గ్లాసులో కొత్త ఊదిగడ్లు నుంచి పొగ దట్టంగా లేచ్చా అప్పుడే లేపిన షామియానాను తాకుతాంది. రెండు మూడు కొత్త పూల దండలతో నాగన్న మొఖం యింగా వెలిగిపోతాంది. గాడిపాడు ఖాళీ అయ్యింది. ‘వాడు రాడంట!’ అని నలుగురు తలకాయలు దించుకున్యారు. ‘ఆ నావట్టకు ఏం పోయేకాలం వచ్చిందో సూడు క్కా’ అని పక్కన కూచున్య బండకాడ కూరగాయాల ఆమెతో బంకామె కళ్ళు పెద్దవి సేసి సెప్పింది. ‘వాడు ల్యాకపోతే ఏంది? వేరే వాళ్లు లేరా’ అన్యాడు పసిడెంట్. ‘వాని దెబ్బకు ఎవరూ రాకుండా ఉండారు.’నాగన్న పెళ్ళాం ఏడుపు యాపసెట్టు అంతా అయింది. ఉన్య రెండు మూడు కాకులు గూడా ఎగిరిపోయినాయి. ‘ఎంత సేపు పెడ్తార్రా.. వాణ్ని పిల్సి ఈపు పగలగొట్టకుండా? ఇదే మా ఊర్లో అయ్యింటే బొడ్డాలు పగలగొట్టే వాళ్ళం. పెద్దమనుషులు ఉండారా? మా మామతో పాటు సచ్చినారా’ అన్యాడు సావు సూన్నీకి వచ్చిన సుట్టం.అది యిన్య పెద్ద మనుషుల మొఖంలో నెత్తుర సుక్క ల్యాకుండా పోయింది. దొంగకోళ్ళు పట్టే మాదిరి ఒకరి మొఖం ఒకరు సూసుకుని బెల్లం కొట్టిన రాయిలా నిలబన్యారు. పరువు మీందకు వచ్చేసరికి కోపంగా ఈరన్నను పిల్సుకొని రమ్మని పసిడెంట్ మనిషిని పంపినాడు. విషయం ఊరంతా పాకింది. ఊర్లో యాసావు అంత మంది జనాన్ని సూసిండదు. ఏం అయితాదని జనాలు పనులు పోకుండా కూచ్చున్యారు. తిన్నాల ఉన్నట్టు ఉంది సావు. ఏడ్సి ఏడ్సి నాగన్న పెళ్ళాం సోయి ల్యాకుండా పడిపోయింది.తప్పెటోల్లు రెండు పెగ్గులేసుకొని ఒక మూలకు కూచున్యారు. ఏం సెయ్యాలో తెలీక కొడుకులు గమ్మున నిలబడి ఉండారు. నాగన్నకు నలుగురు కొడుకులు అందరికి సమానంగా భూమి పంచి ఇచ్చి సోడమ్మ దేళంలో పూజారి పని సేచ్చా ఉండ్యా. దేళంకి చందాలు వసూలు చేయడం, దేళం బాగోగులు సూసుకుంటా సంతోషంగా బతుకుతుండ్యా. సోడమ్మ దేళంలో దీపం వెలగని రోజు లేదు.పనికోసం యా రోజు ఒకరికోసం సెయ్యి స్యాసింది ల్యా. అంత వయసులో కూడా ఎద్దులతో ఆరు ఎకరాల భూమి పండిచ్చా ఉన్యాడు. రోజుకు రెండు సెంబుల కాఫీ తాగుతా, నాలుగు కట్టలు వకీలా బీడీలు కాల్చేవోడు. పెళ్ళాంతో యారోజు మాట్టాడింది ల్యా ఎప్పుడూ కొట్టాడ్త ఉండేవాడు. ఊర్లో ఉన్నన్ని రోజులు ఉత్తపైనే ఉండేటోడు సంతకు పోవాల్సి వచ్చే కొత్తపెళ్ళికొడుకు మాదిరి పోయేటోడు నాగన్న.ఎండ ఎక్కువైంది. సేతీకి ఉన్య పారేన్ వాచ్ పదే పదే సూసుకుంటా ఉండాడు పసిడెంట్. ఈరన్న పేనే తాడు భుజానేసుకుని నిమ్మళంగా వచ్చి రోడ్డు మీందనే నిలబన్యాడు. ఈరన్న వొచ్చినాడని గందరగోళం అయింది. ఊరి పెద్దోళ్లనే మల్లెసినా మొగోడు ఎవడాని కొత్తగా వచ్చిన సుట్టాలు ఈరన్న దిక్కు నోరెళ్ళబెట్టి సూచ్చనారు. వొంటి మింద కేజీ కండ గూడా లేదు. తాగి తాగి ఎముకలు బయట పన్యాయి. మూతి మొత్తం తిప్పినా మీసాలే. కళ్ళు ఎండిపోయిన కుందు యేరు మాదిరి ఉండాయి.‘యేరా ఆన్నే రోడ్డు మీంద నిలబన్యావ్? రా ఇట్టా’ అన్యాడు పసిడెంట్. ఈరన్న పసిడెంట్ మాటకు ఎదురుసెప్పల్యాక నీళ్ళు నములుతా ఉండాడు. ‘యేందిరా?’ అని కళ్ళు పెద్దవి సేసినాడు పసిడెంట్. రోడ్డు మీందకు కళ్ళేసి ‘నేను ఆడికి రాను రెడ్డి’ అని సెప్పినాడు. కొత్త ఊరోళ్ళు పసిడెంట్ కెళ్ళి సూసినాడు. పసిడెంట్కు తలకాయ కొట్టేసినట్టు అయింది. పెద్దమనుషులు పసిడెంట్కు సర్ది సెప్పినారు. అందరూ రోడ్డు మీందకు వచ్చినారు. ‘సూచ్చనా సూచ్చనా శానా ఇకారాలు పోతనావ్? యేంది వాయ్ కథ’ అన్యాడు పసిడెంట్. అందరూ తల ఒకమాట ఏసుకున్యారు. ఈరన్న ఏం పలకకుండా నిలబన్యాడు. పీర్ల పండగ గుండం మాదిరి నిప్పులు కక్కుతా ఇద్దరు ముగ్గురు సెయ్యి పైకి లేపినారు.‘లాస్ట్ సారి మర్యాదగ సెప్తనా.. పోయి గుంత తీపో’ అన్యాడు పసిడెంట్. ‘నా గొంతు కోసినా.. నేను గుంత తియ్యను రెడ్డి’ అని పసిడెంట్ కళ్ళల్లోకి సూటిగా సూచ్చా సెప్పినాడు. ఈరన్న దొమ్మ పొగరు ఊరు మొత్తం సూసింది. ఇట్టా కాదని కోటోళ్ల తాత ముందుకు వచ్చి ‘ఒర్యా... నీకు, నాగన్నకు ఏమైనా తకరారు అయిందా?’ అని అడిగినాడు. ఈరన్న అందరి దిక్కు సూచ్చా తలకాయ ఊపినాడు.‘ఓర్నీ పాసుగూలా.. ఈ మాట ముందు సేప్తే పోయేది గదరా. ఏం కొట్టాట అయింది’ అని అడిగినారు. ఈరన్న ఏం మాట్టాడకుండా రోడ్డు వెంబడి నడ్సుకుంటా పోతాంటే జనం ఈరన్న దిక్కు సూచ్చా పోయినారు. పెద్దమనుషులు ఈరన్న పీక మీంద కాలేసి తొక్కేమాదిరి ఉండారు. గాడ్దెంకా దాటి సోడమ్మ దేళం ముందు రోడ్డు కాడ ఆగినాడు ఈరన్న. జనం గూడా ఏం సెప్తాడ అని కాసుకొని ఉండారు. ఈరన్న ఊరి మంది దిక్కు సూచ్చా పదేళ్ళ కింద మాట ఇదని మొదలుపెట్టినాడు.ఆ పొద్దు ఇంగా సరిగ్గా తెల్లవారాల్య. ఊర్లో సారాయి బాలన్నను పోలీసులు పట్టకపోయినాంక సారాయి కోసం జనం అందరూ పక్క ఊరికి పోతాండారు. రెండు రోజుల నుంచి సారాయి ల్యాక న్యాలుకా పీక్తాంటే నేను సోడమ్మ వెనక దావ గుండా సచ్చా బతుకుతా పక్క ఊరికి పోయినా. కాళ్ళకు సెప్పులు లేవు. అడ్డదావాలో ముల్లులు ఉండాయని సోడమ్మ ముందు దావ వెంబడి ఊళ్ళోకి వచ్చాంటే పొద్దున పూజ సేసుకొనికీ వచ్చిన నాగన్న దావన పోతన్య నన్ను సూసి ‘ఒర్యా ఈరన్న.. ఒర్యా’ అని క్యాకేసినాడు. ఎవరోబ్బా ఇంత పొద్దునా అని నేను ఆగి తలకాయ తిప్పి సూసినా. ‘మాల నాకొడాకా యా దావ నుంచి రా నువ్వు పొయ్యేది’ అన్యాడు.‘ఓ నాగన్న... మాటలు మర్యాదగా రానీ’ అన్య కైపు బిస్సన.‘తాగుబోతు నా కొడకా నీకు మార్యాద యేందిరా, మీకు వెనక దావ ఉంది గదరా.. పెద్దరెడ్డి మాదిరి ఎవరూ సూల్లేదని ముందు నుంచి పోతానావ్’ అన్యాడు. నాకు కైపు అంత యిడ్సిపోయి కోపం అరికాళ్ళల్లో నుంచి మెదుడులోకి పాకింది.. ‘నీ యబ్బా కట్టిచ్చినాడా రోడ్డు.. ఇది అందరికీ’ అని సెప్పినా. అంతే కోపంతో ఎగిచ్చి తన్యాడు కాల్తో. నా కొడకా.. మళ్ళా మాట్టాడ్తనావే.. మీ బతుకులెంత? మీరెంత? యాపొద్దు పోంది, ఈ పొద్దు ఇట్టా ఎందుకు పోతనావ్ వాయ్ అని కుతిక మీంద కాలేసినాడు. సాచ్చం ఆ సోడమ్మ తల్లే. ‘మీకు ఒక దావ.. మాకు ఒక దావ ఎందుకు?’ అని అడిగినా. ‘మీరు మేము ఒకటేనా వాయ్. మేము ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారావ్’ అన్యాడు.‘మేము గూడా ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారవ్.. మీ పీనుగ కూడా లేయ్యదు’అని సెప్పినా. ‘అంతా మొగోనివా?’ అన్యాడు. ‘సరే అయితే సెప్తండా సూసుకో.. ఇదే ఆకాశం, ఇదే నేల, ఇదే సోడమ్మ, ఎదురుగా ఉన్య మారెమ్మ మీంద ఒట్టేసి సెప్తనా.. రెండు దావలు పోయి ఒకే దావ వచ్చేగానీ నీ పీనుగకు నేను పికాసి ఎత్తను, పారా ముట్టను’ అని గట్టిగా అర్సి తొడ కొట్టి, మీసం తిప్పినా. ‘పో.. పో వాయ్ సూసినావ్, నీ మూడకాసు మాటలు’ అని నన్ను వెనక దావలోకి మెడకాయ పట్టుకొని గుంజకపోయినాడు’ అని జెప్పి.. సాచ్చం అద్దో ఆ మారెమ్మ తల్లే అని పోతురాజు మాదిరి మారెమ్మ దేళంకెళ్ళి సెయ్యి సూపిచ్చినాడు.జనాలు అందరూ కిక్కురుమనుకుండా సినిమా సూసినట్టు సూసినారు. సోడమ్మ కటాంజన్కు కట్టిన ఎర్ర గుడ్డ గాలికి ఊగుతా ఉంది. పొద్దున్నుంచి దీపం ల్యాక దిగులుగా ఉన్నట్టు ఉంది. సాచ్చం యాడ అడుగుతారో అని సోడమ్మ కళ్ళు మూసుకుని ఏం ఎరగనట్టు వింటా ఉంది. సోడమ్మ వెనక దావాలో నిలబన్య ఈరన్న మనుషులు దీనంగా మొఖం పెట్టినారు.‘మళ్ళా మీకు ఆ దావ ఉంది గదరా.. నువ్వు ఎందుకు ఈ దావలో నడ్సినావ్’ అన్యారు పెద్దమనుషులు. ‘మళ్ళా మీరు అదే పాట పాడ్తారు. నేల అంతా ఒకటే అయినప్పుడు మీకు ఒక దావేంది, మాకు ఒక దావేంది రెడ్డి’ అన్యాడు ఈరన్న ఊగిపోతా. ‘ఇప్పుడు ఏం అంటావ్ రా’ అని పళ్ళు నూరినారు పెద్దమనుషులు. ‘నేను సేప్పేది ఏం లేదు రెడ్డి.. నన్ను యిడ్సిపెడ్తే నా పని నేను సూసుకుంటా!’‘సూడు ఈరన్న అయిపోయిందేందో అయిపోయింది. రా వచ్చి గుంత తీయ్. మా నాయన తరుపున పెద్ద కొడుకుగా నేను నిన్ను క్షమాపన అడుగుతనా’ అన్యాడు నాగన్న పెద్దకొడుకు.‘ఎట్టా అయిపోతాది సామీ.. పది సంవత్సరాల నుంచి గుండెకాయ కాల్తానే ఉంది. ఉప్పు కారం మీకన్నా రొంత ఎక్కువే తిన్యా. కుందరాగు నర్సన్న పెద్దకొడుకు కుందరాగు ఈరన్నను నేను, మాట అంటే పానం లెక్క. మీరు సెప్పినట్టే మా బతుకులా? మీకేమో తారోడ్డులు, మాకేమో మట్టి దావలా? మారాల మారి తీరాల.’అందరూ అర్థంకానట్టు సూచ్చనారు. పసిడెంట్ ముందుకు వచ్చి ‘ఇప్పుడు ఏం కావాలి రా నీకు?’‘అందరికీ ఒకే దావా కావాలా!’ ‘తంతే నాకొడకా యేట్లో పడ్తావ్.. అందరికీ ఒకే దావ యేంది రా.. తలకాయ తిరుగుతుందా?’‘నాకు ఏం తిరగల్యా సామీ.. ఇప్పుడే సక్కగా పనిసేచ్చాంది. మేము గూడా ముందు దావలో నుంచే నడుచ్చాం.’ ‘నడసనియ్యక పోతే..’‘మీ గుంతలు మీరే తవ్వుకోండి.. మీ పీనుగులు మీరే బూర్సుకోండి!’ఈరన్న మనసు అందరికీ అర్థం అయింది. పెద్దమనుషులు అందరూ గుంపు అయి గుస గుసలాడ్త ఈరన్న దిక్కు సంపేమాదిరి సూచ్చాండారు. ఎండ నెత్తి మీందకు వచ్చింది. నాగన్న తలకాయ కాడ ఊదిగడ్లు మారుతానే ఉండాయి. బయట ఊరోళ్ళు పెద్దమనుషుల దిక్కు మనుషుల్లానే సూడకుండా ఉండారు. ఈరన్న దిక్కు వాళ్ళ మనుషులు వచ్చి బలంగా నిలబడి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్యారు. దమ్ములు ఇరిసి నిలబన్య ఈరన్న దిక్కు పెళ్ళాం కళ్ళు ఆర్పకుండా సూచ్చాంది. వాళ్ళళ్ళో వాళ్ళు కొట్టుకుంటా అర్సుకుంటా ఉంటే తాపకొకసారి మీసం తిప్పుతా బుసలు కొడ్తా ఉండాడు ఈరన్న.కొంతమంది ఈరన్న సంగతి సూజ్జామని పంచెలు ఎగ్గొట్టుకోని తిరిగి పోయినారు. సెసేది ఏం ల్యాక పెద్దమనుషులు సల్లు పోయినారు. సోడమ్మ వెనక దావకి కంపసెట్లు అడ్డంగా పెట్టినారు. ఈరన్నను ఎత్తుకుని క్యాకలేసినారు వాళ్ళ మనుషులు. అప్పుడే గుళ్ళో పెట్టిన దీపం వెలుగులో సోడమ్మ నవ్వుతా ఉన్యట్టు ఉంది. ఊళ్ళోదావ గురించి దండోరా యినపడ్తాంటే పికాసీ, పారా తీసుకొని యేటి పడమటి దిక్కు శ్మశానం కెళ్ళి ఈరన్న ఉదయిస్తా పోయినాడు. – సురేంద్ర శీలం -
నయనతార 'చిన్నారి కవల'లను చూశారా!
పిల్లలు నవ్వినా అందమే, ఏడ్చినా అందమే. ఏ కోణంలో చూసినా అందమే అందం! వారి అల్లరి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇలా ఇద్దరు పిల్లల అల్లరి... అందులో కవల పిల్లల అల్లరి... ఎంతో గమ్మత్తుగా వామ్మో అనాల్సిందే!నయనతార తన కవల పిల్లల ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ మురిసిపోతుంటుంది. తాజా విషయానికి వస్తే... తన కవల పిల్లలతో నయన ఆనంద క్షణాలను పట్టించే వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. పిల్లలతో సింపుల్గా ఆటో ప్రయాణం చేసిన నయనతార ఈ ఆటో రైడ్ విజువల్స్ను ఇన్స్టాగ్రామ్లోపోస్ట్ చేసింది.‘సూపర్ స్టార్’గా పేరు తెచ్చుకున్న నయనతార సింపుల్గా ఆటోలో ప్రయాణించడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. పలువురు నెటిజనులు ఈ వీడియోను తమ సోషల్ పేజీలో షేర్ చేస్తున్నారు. మాతృత్వంలోని మధురిమ గురించి తీయటి కామెంట్లు పెడుతున్నారు.ఇవి చదవండి: తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్! -
తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్!
కాన్స్ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్యా రాయ్ లుక్స్కి వెస్ట్రన్ వరల్డ్ అంతా ఫిదా అయిపోయింది. మనకూ కొత్తగా కనిపించింది. అలా ఆమెను తీర్చిదిద్దిన స్టయిలిస్ట్ ఆస్థా శర్మ. ఆమె అంట్రప్రెన్యూర్ కూడా!ఆస్థా స్వస్థలం ఢిల్లీ. ఫ్యాషన్ ప్రపంచంతో అసలు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లది లాయర్ల కుటుంబం. ఆమె తండ్రి.. ఢిల్లీలో పేరుమోసిన అడ్వకేట్. కెరీర్ విషయంలో తన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుని ఇంటర్ అయిపోగానే ‘లా’ ఎంట్రెన్స్ రాసింది. సీట్ వచ్చింది కూడా. కానీ ఆస్థా వాళ్ల నాన్న.. తన కూతురు లాయర్ కాకుండా ఇంకేదైనా రంగంలో స్థిరపడితే బాగుండు అనుకున్నాడు. అదే విషయాన్ని బిడ్డతో చెప్పాడు.. ‘నేను లాయర్ అయ్యాను కాబట్టి.. నువ్వూ కావాలనే మైండ్సెట్తో లా చదవకు. నీకేది ఇష్టమో అదే చెయ్’ అని. అప్పుడు ఆలోచించింది ఆస్థా.. నిజంగా తనకు లా చదవాలని ఉందా? అని! ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు.దాంతో అది వదిలేసి ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్లో చేరింది. అది చదువుతున్నప్పుడే ఆస్థాకు క్రియేటివ్గా ఏదో చేయాలనే తపన మొదలైంది. ఆ శోధనలోనే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెరిగింది. బీఏ అయిపోగానే ‘పర్ల్ అకాడమీ’ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మర్చండైజింగ్ కోర్స్లో జాయిన్ అయింది. కానీ అదేమంత ఇష్టంగా తోచలేదు. అప్పుడే ఒక ఫ్రెండ్ ద్వారా ‘స్టయిలింగ్’ గురించి తెలుసుకుంది.ఫ్యాషన్ మార్కెటింగ్ కోర్స్ పూర్తవగానే స్టయిలింగ్లోకి దిగింది. మ్యాగజైన్ స్టయిలిస్ట్ రిన్ జాజో దగ్గరికి ఇంటర్న్గా వెళ్లింది. అదే సమయంలో మరో స్టయిలిస్ట్ ఆదిత్య వాలియాకూ అసిస్టెంట్గా పని చేయడం మొదలుపెట్టింది. అప్పుడు గ్రహించింది స్టయిలింగ్ అనేది తన కైండ్ ఆఫ్ వర్క్ అని. ఆ ఇంటర్న్షిప్ అయిపోగానే ఆమెకు ఏ్చటp్ఛట’టఆ్చ్డ్చ్చట మ్యాగజైన్లో ఫ్యాషన్ ప్రొడ్యూసర్ కొలువు దొరికింది. అది ఆమెకు పనిలో అనుభవాన్నే కాదు.. ఫ్యాషన్ లోకపు కాంటాక్ట్స్నీ పెంచింది. గొప్ప ఎక్స్పోజర్నిచ్చింది.అది ఒక పంజాబీ సినిమాలోని అగ్రతారలకు స్టయిలింగ్ చేసే చాన్స్ని తెచ్చిపెట్టింది. అంతే మ్యాగజైన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆసా, ఆమె కొలీగ్ మోహిత్ ఇద్దరూ ఆ ప్రాజెక్ట్లో తలమునకలయ్యారు. సక్సెస్ సాధించారు. దానిద్వారా వచ్చిన పెద్దమొత్తాన్ని తీసుకుని ముంబై చేరారు. ‘వార్డ్రోబిస్ట్’ అనే ఫ్యాషన్ స్టార్ట్ప్ పెట్టారు. అది ఆస్థాకు బాలీవుడ్ ఎంట్రెన్స్ని కల్పించింది. ఐశ్వర్యా రాయ్ని పరిచయం చేసింది. తన పనితనాన్ని నిరూపించుకునే అవకాశాన్నిచ్చింది. ఐశ్వర్యా రాయ్ మెచ్చి ఆమెను తన పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకుంది.ఆ వాసి మరింత మంది తారలకు చేరి.. దిశా పాట్నీ, మృణాల్ ఠాకుర్, నోరి ఫతేహీ, విద్యా బాలన్, భూమి పెడ్నేకర్లకూ స్టయిలింగ్ చేసే ఆపర్చునిటీస్ని అందించింది. అంతేకాదు అంట్రప్రెన్యూర్గా ‘ద వెడ్డింగ్ స్టయిల్’ ప్రాజెక్ట్నూ లాంచ్ చేసే దశకు చేర్చింది. ఆస్థా ఇప్పుడు.. బాలీవుడ్ సెలబ్రిటీస్కి ఫేవరెట్ స్టయిలిస్ట్.. బడ్డింగ్ స్టయిలిస్ట్లకు రోల్ మోడల్!స్టయిలిస్ట్ అవడానికి ఫ్యాషన్ పట్ల ప్యాషన్ మాత్రమే సరిపోదు. ఫ్యాషన్ అండ్ డిజైనింగ్లో చదువు, ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్, అంతులేని ఈ పోటీ రంగంలో అలుపెరగని శ్రమ, ఊహకందని సృజన చాలా ఇంపార్టెంట్! అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ మీద అవగాహన, స్టడీ, రీసెర్చ్ తప్పనిసరి! ఇవన్నీ ఉంటేనే స్టయిలింగ్లో మన మార్క్ చూపించగలం.. బెస్ట్ అనిపించుకోగలం! – ఆస్థా శర్మఇవి చదవండి: ఆ పాత్రలో.. మెప్పించడానికి చాలానే కష్టపడింది! -
Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..?
ప్రతిరోజూ ఎండతోపాటుగా.. వర్షాలు, చల్లదనం, వాతవరణంలో ఓకేసారి మార్పుల కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అందులో చర్మం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవచ్చు. ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ అందంగా కనిపంచాలంటే ఈ బ్యూటీ టిప్స్ ట్రై చేయండి..పుచ్చకాయ.. ద్రాక్ష!పుచ్చకాయ, ద్రాక్ష కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డు లోని తెల్లసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్ ప్యాక్ని తరచూ వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి, కాంతిమంతం అవుతుంది.ఆరెంజ్ జ్యూస్..టీ స్పూన్ తేనె, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖచర్మం సేదదీరుతుంది.కొబ్బరిపాలతో..ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్లో ఉంచిన కొబ్బరిపాలలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, చేతులపై అద్ది, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.సోంపుతో..రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టి, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఫ్రిజ్లో ఉంచాలి.ఎండ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దూది ఉండను సోంపు నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగిస్తాయి. దురద, దద్దుర్లు, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా! -
ప్రతిరోజూ ఓ అరగంట నడిచారో.. ఈ సమస్యలిక దూరమే!
మనకు తెలిసిన విషయమే కదా అని తేలిగ్గా తీసిపారేయద్దు. అలాగే బద్ధకించవద్దు. క్రమం తప్పకుండా రోజూ ఓ అరగంట పాటు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. స్లిమ్గా ఉండవచ్చు. డయాబెటిస్, బీపీ వంటి వాటికి దూరంగా ఉండచ్చు.అన్నింటికీ మించి రోజంతా ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉండచ్చు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు నడవడం కాదు... మన నడక ఎలా ఉండాలి... ఎంత దూరం నడవాలి? ఏ సమయంలో నడవాలి... వంటి ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం..!క్రమం తప్పకుండా నడవడం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా, శారీరక వ్యాయామాలు, కార్యకలాపాలు ఆందోళన, నిరాశ, ఒత్తిడి, ఇతర సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయని చెబుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 30 నిమిషాల పాటు చేసే మార్నింగ్ వాక్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.వ్యాయామాలన్నింటిలోనూ అతి తేలికపాటి వ్యాయామం ఏదంటే నడకే అని చెప్పచ్చు. బరువును నియంత్రించడంలో, కేలరీలను కరిగించడంలో వాకింగ్ను మించిన మందే లేదు. క్రమబద్ధమైన నడక వార్థక్య ఛాయలను నివారిస్తుంది. అయితే ఆ నడక ఎలా ఉండాలి... ఎప్పడు చేయాలో చూద్దాం...శక్తిని పెంచుతుంది..మార్నింగ్ వాక్ ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి. అలా ఖాళీ కడుపుతో చేసే మార్నింగ్ వాక్ శక్తి స్థాయిని పెంచుతుంది. శరీరం, మనస్సు సాంత్వన పొంది, కణజాలాలు శక్తిని పొందేలా చేస్తుంది. వాకింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ శక్తి స్థాయులను పెంచడానికి గొప్ప మార్గం. ఇది అలసట తగ్గించి,, ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.గుండెకు బలాన్నిస్తుంది..రోజూ ఉదయాన్నే అరగంటపాడు చురుగ్గా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సాధారణ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని, రక్త΄ోటును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పును ముందుగానే తగ్గించుకోవచ్చు.జీర్ణవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది..జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు ఖాళీ కడుపుతో ఉదయాన్నే నడవడం మంచిది. ఈ అభ్యాసం మీ ఉదర కండరాల సహజ సంకోచాన్ని ్ర΄ోత్సహిస్తుంది.మానసిక బలంరోజూ నడవడం వల్ల మెరుగైన ఆత్మగౌరవం, మెరుగైన మానసిక స్థితి, ఆందోళన సమస్యలతో సహా మీ మానసిక ఆరోగ్యానికి వాకింగ్ గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది. శారీరక శ్రమ మీ శరీరం మానసిక స్థితి ఆత్మగౌరవాన్ని మెరుగుపరిచే ఎండార్ఫిన్ లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.చక్కటి నిద్ర: తెల్లవారుజామున వెలువడే సూర్యరశ్మి సహజంగా మీ సిర్కాడియన్ రిథమ్ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీ దినచర్యకు 30 నిమిషాల మార్నింగ్ వాక్ అలవాటుతో మీ మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. శారీరక శ్రమ మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది.పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాకింగ్ వంటి మితమైన వ్యాయామం, కాలక్రమేణా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే వాయిదా వేయకుండా నడుద్దాం. నడకను పడక ఎక్కనివ్వకుండా చూద్దాం.ఖాళీ కడుపుతో 30 నిమిషాల మార్నింగ్ వాక్ అనే నియమాన్ని అలవాటుగా చేసుకోవటం వల్ల రోజంతా శక్తిని పొందుతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. వార్థక్య లక్షణాలు తొందరగా దరిచేరకుండా ఉంటాయి. దీనిని తేలిగ్గా తీసేయకుండా దిన చర్యలో చేర్చడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. -
ఇన్స్టాగ్రామ్ ‘పీక్’ ఫీచర్ని ఎప్పుడైనా ట్రై చేశారా!
‘పీక్’ అనే కొత్త ఫీచర్ని పరీక్షిస్తోంది ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్. ఈ ఫీచర్ ద్వారా ఒక వ్యూ తరువాత మాయం అయ్యే ఎడిట్ చేయని, అన్ఫిల్టర్, ఇన్–ది–మూమెంట్ ఫొటోలను యూజర్లు స్పీడ్గా క్యాప్చర్, షేర్ చేయవచ్చు. స్నాప్చాట్, బీరియల్ను స్ఫూర్తిగా తీసుకొని ‘పీక్’పై దృష్టి పెట్టింది ఇన్స్టా. ఫొటోలు, వీడియోలను 24 గంటల ΄ాటు చూడడానికి అనుమతించే ఇన్స్టాగ్రామ్లోని ప్రస్తుత ‘స్టోరీస్’ ఫీచర్లా కాకుండా ‘పీక్’ ఫొటోలు సింగిల్ వ్యూలో అదృశ్యం అవుతాయి, ‘లిటిల్ మూమెంట్స్ విత్ ది పీపుల్ యూ లవ్’ అని ‘పీక్’ గురించి చెప్పింది ఇన్స్టాగ్రామ్.గూగుల్ కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్..కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్ వియో, ఇమాజెన్ 3లను గూగుల్ లాంచ్ చేసింది. టెక్స్ట్ ప్రాంప్ట్ల నుంచి వీడియోలను జనరేట్ చేయడానికి వియో ఉపయోగపడుతుంది. ఇమాజెన్ 3 అనేది గూగుల్కు సంబంధించి అత్యంత అధునాతన ‘టెక్ట్స్–టు–ఇమేజ్’ మోడల్. ‘ఇమాజెన్ 3 అనేది టెక్స్›్ట–టు–ఇమేజ్ హైక్వాలిటీ మోడల్.ఫొటోరియలిస్టిక్, లైఫ్లైక్ ఇమేజ్లను సృష్టించే సామర్థ్యం దీని సొంతం’ అంటుంది గూగుల్. మోస్ట్ అడ్వాన్స్డ్ వీడియో మోడల్గా గూగుల్ చెబుతున్న ‘వియో’ వెరైటీ స్టైల్స్లో హై–క్వాలిటీ 1080పి వీడియోలను ్ర΄÷డ్యూస్ చేస్తుంది. ఈ ఏఐ మోడల్ ‘టైమ్ల్యాప్స్’ ‘ఏరియల్ ష్టార్స్’లాంటి సినిమాటిక్ కాన్సెప్ట్లను కూడా అర్థం చేసుకుంటుంది. వీడియో క్రియేటర్లకు ఇది గేమ్–చేంజర్ అవుతుందని ప్రకటించింది గూగుల్.హువావే మేట్ బుక్ 14..సైజ్: 14.2 అంగుళాలు రిజల్యూషన్: 2880్ఠ1920 పిక్సెల్స్బరువు: 1.31 కేజీ మెమోరీ: 16జీబి స్టోరేజ్: 512 జీబి/1టీబిబ్యాటరీ లైఫ్: 19 గంటలు, ఏఐ ఫీచర్స్, ఇన్టెల్ కోర్ ఆల్ట్రా చిప్ఆల్ట్రా హ్యూమన్ రింగ్ ఏయిర్..థిక్: 2.5 ఎంఎంవైడ్: 8.1 ఎంఎం బరువు: 3 గ్రా. కలర్ ఆప్షన్: టైటానియం పీపీజీ ఆప్టికల్ సెన్సర్: హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్, వాటర్ రెసిస్టెంట్,సపోర్ట్స్: 22 వర్కవుట్ మోడ్స్హెచ్ఎండీ టీ21 ట్యాబ్..సైజ్: 10.36 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13రిజల్యూషన్: 1200్ఠ2000 పిక్సెల్స్ కలర్: బ్లాక్ స్టీల్ఇంటర్నల్: 64జీబి 4జీబి ర్యామ్/ 128జీబి 4జీబి ర్యామ్ బ్యాటరీ: 8200 ఎంఏహెచ్, స్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ఇవి చదవండి: గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు! -
గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు!
యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ సుషిమ’ విడుదల అయింది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. సుషిమ ద్వీపాన్ని రక్షించడానికి రంగంలోకి దిగిన ‘సకాయ్’ అనే సమురాయ్ని ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అకీరా కురోసావా సినిమాలు, కామిక్ బుక్ సిరీస్ ‘ఉసాగి యోజింటో’ ప్రేరణతో ఈ గేమ్ను రూపొందించారు.గేమ్ ల్యాండ్స్కేప్, మినిమలిస్టిక్ ఆర్ట్ స్టైల్ను యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘షాడో ఆఫ్ ది కొలోసస్’ ప్రభావంతో చేశారు. గేమ్లోని లొకేషన్లు ‘పర్ఫెక్ట్ ఫొటోగ్రాఫర్స్ డ్రీమ్స్’ అనిపించేలా అందంగా ఉంటాయి. ఇలన్ ఎస్కేరి, షిగేర్ ఉమేలయాషి ఈ గేమ్ సౌండ్ ట్రాక్ను అద్భుతంగా కం΄ోజ్ చేశారు.‘చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాం’ అని మేకర్స్ చెబుతున్నారు.జానర్: యాక్షన్–అడ్వెంచర్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ప్లాట్ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లే స్టేషన్ 5, విండోస్.ఇవి చదవండి: అరుదైన ప్రతిభ.. అక్షత!


