కొచ్చి: 'కుంభమేళా వైరల్ గర్ల్'గా గుర్తింపు పొందిన మోనాలీసా భోస్లే భద్రతపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెను కొచ్చి నగరం నుంచి బలవంతంగా లేదా హైకోర్టు అనుమతి లేకుండా బయటకు తరలించరాదని స్పష్టం చేసింది. జస్టిస్ బేచు కురియన్ థామస్ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎన్సీఎస్టీ) ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో నిబంధనల ప్రకారం మధ్యప్రదేశ్ పోలీసులకు ఆమెను అప్పగించాలన్న ప్రతిపాదనను కోర్టు ఈ సందర్భంగా పరిశీలించింది. అయితే ఆమె మతాంతర వివాహం కారణంగా ప్రాణాపాయం ఉందని, మధ్యప్రదేశ్కు వెళ్తే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని మోనాలీసా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మోనాలిసా భద్రతను దృష్టిలో ఉంచుకుని, తదుపరి విచారణ జరిగే వరకు ఆమెను కొచ్చి సరిహద్దులు దాటించవద్దని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అలాగే, ఆమెకు తగిన పోలీసు రక్షణను కొనసాగించాలని స్పష్టం చేసింది. వివాహం జరిగే సమయానికి ఆమెకు 18 ఏళ్ల మూడు నెలల వయసు ఉందని, ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్ను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారని, దీనిపై ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్ దాఖలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: జైలు నుంచి వస్తూనే తమ్ముడి దగ్గరికి తేజ్!


