న్యూఢిల్లీ: లోక్సభలో విద్యా సంస్కరణల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ సభ్యుడైన ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఆమె ‘గోమూత్ర నిపుణుడు’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వి కామకోటి, ఐఐటి మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేసి 2001లో అదే సంస్థలో అధ్యాపకునిగా చేరారు. జనవరి 2022లో ఐఐటి మద్రాస్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్లలో విశేష అనుభవం ఉన్న ఆయన, జాతీయ భద్రతా సలహా మండలి సభ్యునిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏఐ టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడిగా సేవలందించారు.
ఈ వివాదానికి మూలం 2025 జనవరిలో చెన్నైలోని ఒక గోశాలలో జరిగిన ‘మాటు పొంగల్’ వేడుకలు. ఆ కార్యక్రమంలో దేశీయ గోజాతులు, సేంద్రియ వ్యవసాయం, గోమూత్రంలోని ఔషధ గుణాల గురించి ప్రొఫెసర్ కామకోటి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రియాంక గాంధీ ఆయనను విమర్శించారు. కేవలం ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని, దశాబ్దాలుగా విద్యా, సాంకేతిక రంగాలకు ఆయన అందించిన విశేష సేవలను విస్మరించడం సమంజసం కాదని నిపుణులు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన కామకోటి, డీఆర్డీఓ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు అనేక జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
ఇది కూడా చదవండి: షిర్డీలో వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు


