‘దిల్‌ కా యాంగిల్‌’ మార్చుకోండి | Lok Sabha: Priyanka Gandhi advice to Prime Minister Modi | Sakshi
Sakshi News home page

‘దిల్‌ కా యాంగిల్‌’ మార్చుకోండి

Jul 29 2026 4:31 AM | Updated on Jul 29 2026 4:31 AM

Lok Sabha: Priyanka Gandhi advice to Prime Minister Modi

ప్రధాని మోదీకి ప్రియాంకా గాంధీ సూచన  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెన్‌ జెడ్‌ తరాన్ని, వారి మనసులను గెలుచుకోవాలనుకుంటే కెమెరా యాంగిల్స్‌ కాకుండా ‘దిల్‌ కా యాంగిల్‌’మార్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా సూచించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల వీపులపై పడే ప్రతి లాఠీ దెబ్బ వారి కంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రతిష్టకే హాని కలిగిస్తుందని తేల్చి చెప్పారు. మంగళవారం లోక్‌సభలో పేపర్‌ లీక్‌ వ్యతిరేక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించి, లాఠీలతో విరుచుకుపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

యువతుల దుస్తులు చింపేసి అవమానించడం, కనికరం లేకుండా కొట్టించడం ఏమిటని మండిపడ్డారు. దేశ యువతపై పెల్లెట్‌ గన్‌లు, ఏకే–47లతో కాల్పులు జరపడం రాక్షసత్వం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వం దృష్టిలో విద్యార్థులు ఉగ్రవాదులా? అని ధ్వజమెత్తారు. ఈ రోజు ఈ ప్రశ్నలను కాంగ్రెస్‌ మాత్రమే కాదు, దేశం మొత్తం అడుగుతోందని అన్నారు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

దేశంలోని యువతను ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అడిగారు. వారి గొంతుకలను అణచివేసే హక్కు ఎవరు ఇచ్చారు? అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులపై పెల్లెట్‌ గన్‌లతో దాడి చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. దేశమంతా ఇదే ప్రశ్న అడుగుతోందని వెల్లడించారు.  

మోదీ సత్య మార్గంలో నడవాలి  
పేపర్‌ లీకేజీలను అరికట్టడానికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను ప్రియాంకా గాంధీ తోసిపుచ్చారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల పనితీరు ఇప్పటికే చాలా పేలవంగా ఉందని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాన్ని నిందించడం, డొల్ల రాజకీయ క్రీడలు ఆడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నేటి కొత్త తరం ఎంతో అవగాహన కలిగి ఉందని, అబద్ధాలను గుర్తించగల అపారమైన సామర్థ్యాన్ని వారికి ఉందని వెల్లడించారు. యువత హృదయాలను గెలుచుకోవాలంటే ప్రధాని మోదీ సత్య మార్గంలో నడవాలని ప్రియాంకా గాంధీ సూచించారు. మోదీ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

‘‘నిజాన్ని అంగీకరించండి, బాధ్యత తీసుకోండి, పటిష్టమైన చర్యలు చేపట్టింది. నిపుణులను సంప్రదించండి. లోపాలకు తావులేని నూతన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయండి. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కలి్పంచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలి. దేశంలో విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విస్తరించాలి. అప్పుడే పిల్లలు ఉజ్వల భవిష్యత్తును కలలు కనగలరు’’అని స్పష్టంచేశారు. విద్యార్థులను బలవంతంగా వీధుల నుంచి తొలగించవచ్చేమో గానీ వారి ప్రశ్నలను మాత్రం తొలగించలేమని ప్రియాంకా గాంధీ తేల్చి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement