మన కోసం ఎన్నో త్యాగాలు చేసే, సర్వసం మనకు ధారపోసే కన్నవాళ్లను ఎంతో బాగా చూసుకోవాలని కోరుకుంటారు చాలామంది పిల్లలు. అందుకోసం తమ వంతుగా చేయాల్సిదంతా చేస్తుంటారు బిడ్డలు. అలానే ఈ మహిళ కూడా తన పేరెంట్స్కి గొప్ప అనుభవం ఇవ్వాలని అనుకుంది. అందుకని వాళ్లని ఎప్పటికైన మంచి పర్యాట ప్రదేశానికి తీసుకువెళ్లాలనుకుంది. అనుకున్నట్లుగానే కల నేరవేర్చుకోవడంతో ఆ పట్టరాని సంతోషాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పంచుకుంది.
ఆ మహిళా ప్రియాంక అనే ఎన్నారై. ఆమె ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. తన తల్లిదండ్రులను అమెరికాలోని ప్రసిద్ధ నయగరా జలపాతానికి తీసుకువెళ్లాలని అనుకుంది. ఆ జలపాతాన్ని దగ్గరగా వీక్షించే అనుభవం ఇవ్వాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంది. ఆ డ్రీమ్ నెరవేరడమే గాక తన తల్లిదండ్రులు 'మెయిడ్ ఆఫ్ ది మిస్ట్' బోట్ టూర్లో పాల్గొంటూ ఉధృతంగా పడుతున్న జలపాతాన్ని చూస్తున్న వీడియోని ఇలా సోషల్ మీడియాలో పంచుకుంది.
ఒక చల్లని తుంపర్లు, దట్టమైన పొగమంచు మధ్య అందమైన దృశ్యాన్ని వీక్షించారు. వర్షం నుంచి రక్షించే రెయిన్ పాంచోలు ధరించి ప్రియాంక తల్లిదండ్రులు పడవలో జలపాతం సమీపం వరకు వెళ్తున్న దృశ్యాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె పేరెంట్స్ కనువిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ..ఉప్పొంగిపోయారు. ఆ ప్రకృతి అందాన్ని అంత దగ్గర చూసి సంతోషం, ఆశ్చర్యం కలగలసిన భావాలు వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించాయి వీడియోలో.
ఆమె ఆ వీడియోని పోస్ట్ చేస్తూ..ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశా. పేరెంట్స్ని కచ్చితంగా ఇక్కడ తీసుకురావాలని అనుకున్నా. ఆ కల ఈవేళ నిజమైంది. ఇది అత్యంత హృద్యమైన క్షణం అంటూ క్యాప్షన్ ఇచ్చి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా చాలా బాగుంది మేడం, నిజంగా ఇది హృద్యంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు.


