వాషింగ్టన్: అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం తప్పిపోయిన పెంపుడు కుక్కను ఐదేళ్ల తర్వాత తిరిగి కలుసుకుంది. ఇంటి నుంచి 600 మైళ్లకు పైగా దూరంలో ఉన్న ఇండియానా రాష్ట్రంలోని ఓ ట్రక్ స్టాప్ వెనుక ఆ కుక్క దొరికింది. 2021లో ఇన్మాకులాడా జాక్మన్ కుటుంబం నెబ్రాస్కాలోని లింకన్ పట్టణంలో నివసిస్తున్న సమయంలో వారి పెంపుడు కుక్క ‘‘చాంగ్’’ ఇంటి నుంచి తప్పించుకుంది.
నెలల తరబడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా దాని ఆచూకీ దొరకలేదు. కొన్నాళ్ల తర్వాత ఆ కుటుంబం ‘‘చె చె’’ అనే మరో కుక్కను తెచ్చుకుని పెంచుకుంటోంది. అయినా ‘‘చాంగ్’’ ఎప్పుడో ఒకరోజు తిరిగి వస్తుందనే ఆశను మాత్రం వదులుకోలేదు.
"నేను ఇంకా దాని కోసం వెతికేదాన్ని. మా పాత కాలనీకి వెళ్లి, ఎవరైనా దాన్ని తీసుకుని నడిపిస్తున్నారా, లేక ఎక్కడైనా తిరుగుతోందా అని చూసేవాళ్లం" అని జాక్మన్ స్థానిక మీడియా సంస్థ డబ్ల్యూకేఆర్సీకి తెలిపారు. ఐదేళ్ల తర్వాత జాక్మన్కు ఆమె స్నేహితురాలు సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ పోస్టును పంపింది. లింకన్ పట్టణానికి సుమారు 642 మైళ్ల దూరంలో ఉన్న ఇండియానాలోని ఓ ట్రక్ స్టాప్ వెనుక చాంగ్ కనిపించినట్టు అందులో ఉంది.
వెంటనే జాక్మన్ హెండ్రిక్స్ కౌంటీ జంతు సంరక్షణ కేంద్రాన్ని సంప్రదించి చాంగ్ తమదేనని తెలిపింది. అయితే ఒక సమస్య ఎదురైంది. చాంగ్కు ఎవరో దానికి మైక్రోచిప్ అమర్చారు. జంతు సంరక్షణ కేంద్రం సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త మైక్రోచిప్లో నమోదు అయిన వ్యక్తికి సమాచారం ఇచ్చి, స్పందించేందుకు 3 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గడువులోగా ఎవరూ ముందుకు రాకపోతే చాంగ్ను జాక్మన్కు అప్పగించవచ్చని చెప్పారు.
"మరో వ్యక్తి మమ్మల్ని సంప్రదించకూడదని అక్కడి సిబ్బంది అంతా ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నామని చెప్పారు" అని జాక్మన్ గుర్తుచేసుకున్నారు. 3 రోజుల గడువులో ఎవరూ స్పందించలేదు. దీంతో చాంగ్ను మళ్లీ దత్తత తీసుకునేందుకు జాక్మన్కు అనుమతి లభించింది. ఆమె ఇండియానాకు వెళ్లి చాంగ్ను ఇంటికి తీసుకొచ్చింది.
జంతు సంరక్షణ కేంద్రం విడుదల చేసిన వీడియోలో.. 5 ఏళ్ల తర్వాత యజమానిని చూసిన చాంగ్ తొలుత అయోమయంలో కనిపించింది. కొద్దిసేపటి తర్వాత జాక్మన్ను హత్తుకుంది. ఆ తర్వాత ‘‘చె చె’’ను కూడా కలుసుకుంది. "ఆశను ఎప్పుడూ వదులుకోకండి. ఐదేళ్ల తర్వాత అయినా మేము చాంగ్ను తిరిగి కనుగొన్నాం" అని జాక్మన్ డబ్ల్యూకేఆర్సీకి తెలిపారు.



