అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. జనంతో కిక్కిరిసిన ఓ ఫుడ్ ఫెస్టివల్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారి సహా పలువురు గాయపడ్డారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఫెస్టివల్ ప్రాంగణం భయానక వాతావరణంగా మారింది. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీయడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
Video: Shots heard, people fleeing at Seattle Center in Washington state. Reports of multiple victims.
Livestream: Hawaiian Honey Cones. pic.twitter.com/YGv30969z2— AZ Intel (@AZ_Intel_) July 27, 2026
వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో ఉన్న సియాటెల్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అక్కడ ‘బైట్ ఆఫ్ సియాటెల్’ (Bite of Seattle) ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి వందలాది మంది సందర్శకులు తరలివచ్చారు. వివిధ రకాల ఆహార స్టాళ్లు, సంగీత కార్యక్రమాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది.
అంతా సాధారణంగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వరుసగా కాల్పులు జరగడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కొందరు సమీప ప్రాంతాల్లో దాక్కునేందుకు ప్రయత్నించగా.. మరికొందరు తొక్కిసలాటకు గురయ్యారు.
ఘటన సమయంలో ఎనిమిది రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరికొందరు అంతకంటే ఎక్కువ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. కాల్పుల సమయంలో ఫెస్టివల్ ప్రాంగణంలో భారీ సంఖ్యలో ప్రజలు ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సియాటెల్ అగ్నిమాపక విభాగం వెల్లడించింది. పలువురు గాయపడగా.. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు హార్బర్వ్యూ మెడికల్ సెంటర్ అధికారులు తెలిపారు.
హార్బర్వ్యూ మెడికల్ సెంటర్ ప్రతినిధి సూసన్ గ్రెగ్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చిన బాధితులందరికీ తుపాకీ గాయాలు ఉన్నాయని తెలిపారు. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన బాధితులకు కూడా వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఘటన సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఎస్టాన్ వకోనాబో పరిస్థితిని వివరిస్తూ.. కాల్పులు వినిపించగానే ప్రజలు అన్ని వైపులా పరుగులు తీశారని తెలిపారు. “ప్రజలు ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు కిందపడిపోయారు. చిన్నారుల బండ్లు కూడా పడిపోయాయి. అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది” అని చెప్పారు.
కాల్పుల అనంతరం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సియాటెల్ సెంటర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజలను ఖాళీ చేయించారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి మోనోరైల్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనపై సియాటెల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎవరు? ఎందుకు కాల్పులు జరిపాడు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఓ అనుమానితుడని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Seattle Shooting Suspect @komonews @lookner @CNN @cnnbrk @seattleinfo @seattletimes #seattle #seattleshooting pic.twitter.com/H2CUERXERH
— Tyler Harrison (@TylerHarriledm) July 27, 2026
ఘటనపై ఎఫ్బీఐ సహా పలు భద్రతా సంస్థలు దర్యాప్తులో భాగమయ్యాయి. ఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరిస్తూ.. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జన రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటన అమెరికాలో మరోసారి తుపాకీ హింసపై చర్చకు దారితీసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం సియాటెల్ కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి వివరాలు, కాల్పుల వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.


