బుల్స్ కోలుకుంటాయా... బేర్స్ కుమ్మేస్తాయా?
పశ్చిమాసియా పోరు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు
చల్లారిన క్రూడాయిల్ ధరలతో ఊరట లభించేనా?
ఆశలన్నీ కార్పొరేట్ జూన్ ఆర్థిక ఫలితాలపైనే!
నిఫ్టీకి ‘సూపర్ ఎక్స్పైరీ’ గుబులు!
ఈ వారం ట్రేడింగ్పై నిపుణుల అంచనాలు
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు ఈ వారంల దలాల్ స్ట్రీట్కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ఇరాన్పై సైనిక చర్యను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేయడంతో ముడిచమురు ధరలు 100 డాలర్ల స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లను వెంటాడుతూనే ఉంది.
దీనికి తోడు జులై 28–29 తేదీల్లో జరగనున్న ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన, జూలై 28న (మంగళవారం) వెలువడే దేశీయ ఐఐపీ గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు, కార్పొరేట్ రంగానికి వస్తే ఎల్అండ్టీ, మారుతీ, హెచ్యూఎల్, ఐటీసీ వంటి నిఫ్టీ దిగ్గజాల క్యూ1 ఫలితాలు స్టాక్–ఆధారిత ట్రేడింగ్ను నడిపిస్తాయి. వీటికి తోడు ఒకే రోజున నిఫ్టీ వీక్లీ, నిఫ్టీ మంత్లీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల ’సూపర్ ఎక్స్పైరీ’ రాబోతుండటంతో దలాల్ స్ట్రీట్లో రోలోవర్లు, షార్ట్ కవరింగ్ వల్ల అస్థిరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
కార్పొరేట్ ఫలితాల ప్రకటనలపై కన్ను
నేడు ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ ప్రధానంగా ఐడీఎఫ్సీ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి దిగ్గజాల జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ), ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈఎల్), అదానీ ఎంటర్ప్రైజెస్, ఐఆర్ఎఫ్సీ, ఐటీసీ తదితర కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాలతో పాటు కంపెనీల డిమాండ్ పరిస్థితులు, మార్జిన్లు, మూలధన వ్యయం (క్యాపెక్స్)పై యాజమాన్యాల వ్యాఖ్యలను విశ్లేషకులు నిశితంగా పరిశీలించనున్నారు.
ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలపై దృష్టి
అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాలు జూలై 28–29 తేదీల్లో జరగనున్నాయి. బుధవారం వెలువడే ప్రకటనలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనాలున్నాయి. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడ్ వడ్డీరేట్లను 0.25 శాతం పెంచే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల నిర్ణయం కంటే కూడా ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, భవిష్యత్ ద్రవ్య విధానంపై ఫెడ్ ఇచ్చే సంకేతాలే మార్కెట్ దిశను నిర్దేశిస్తాయని చెబుతున్నారు.
పశ్చిమాసియా పరిణామాలు... క్రూడాయిల్ దరలు ప్రభావం
పశ్చిమాసియాలో శరవేగంగా మారుతున్న పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. వైమానిక క్షిపణి నిల్వలు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరాన్పై భారీ సైనిక చర్య ప్రణాళికలను డోనాల్డ్ ట్రంప్ నిలిపివేసినట్లు వెలువడిన నివేదికలు మార్కెట్లకు కొంత ఊరటనిచ్చాయి. అయితే మిడిల్ ఈస్ట్లో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత తక్షణం పెరిగే ప్రమాదం ఉంది.
మరోవైపు, అమెరికా–ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధరించడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో గురువారం (జూలై 23న) 100 డాలర్లకు చేరిన ముడి చమురు ధరలు, శుక్రవారం ఒక్కరోజే 4% కంటే ఎక్కువ పడిపోయాయి. ముడిచమురు ధరల్లో తీవ్ర ఊగిసలాట, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను పెంచడంతో ఇన్వెస్టర్లు ప్రస్తుతం అప్రమత్తత వైఖరి ప్రదర్శిస్తున్నారు.
మంగళవారం ‘సూపర్ ఎక్స్పైరీ’
మంగళవారం (జూలై 28) ఒకే ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ–50 వీక్లీ ఎక్స్పైరీతో పాటు, నిఫ్టీ–50, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల జూలై నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీలు ఒకేసారి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దలాల్ స్ట్రీట్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత నెల కాంట్రాక్టుల సెటిల్మెంట్లతో పాటు, ట్రేడర్లు తమ పొజిషన్లను తదుపరి నెలకు రోలోవర్ చేసుకునే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ ఒత్తిడి కారణంగా మార్కెట్లో షార్ట్ కవరింగ్ లేదా ఉన్నట్టుండి భారీ విక్రయాలు నెలకొనే అవకాశం ఉంది. కావున ఎక్స్పైరీ రోజున ఇంట్రాడే ట్రేడర్లు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, కఠినమైన స్టాప్లాస్లతో వ్యవహరించడం శ్రేయస్కరం.
నిఫ్టీ టెక్నికల్ అవుట్లుక్
గత నెల రోజులుగా 23,800 – 24,400 పరిధిలోనే ట్రేడైన నిఫ్టీ, ప్రస్తుతం ఆ స్థాయిలను కోల్పోయింది. సాంకేతికంగా ఇది సమీప కాలంలో మార్కెట్ వైఖరికి ప్రతికూల అంశమే. ప్రస్తుతం నిఫ్టీకి 23,600 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 23,100 వరకు దిగివచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ షార్ట్ కవరింగ్ జరిగి మార్కెట్ కోలుకుంటే నిఫ్టీ 24,000 – 24,100 శ్రేణిలో తొలి నిరోధాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. ఆ పైన 24,400 వద్ద మరో బలమైన నిరోధం ఎదురుకావచ్చు.
బేరీష్గానే ఎఫ్ఐఐలు
గత వారంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 7,180 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ. 8,640 కోట్ల మేర ఈక్విటీలను కొనుగోలు చేసి మార్కెట్ పతనాన్ని కొంతవరకు అడ్డుకోగలిగారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలపై స్పష్టత వచ్చే వరకు విదేశీ నిధుల ప్రవాహంలో తీవ్ర అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతవారమంతా నష్టాలే..
దలాల్ స్ట్రీట్ గతవారంలో వరుసగా అయిదు ట్రేడింగ్ సెషన్లలోనూ నష్టాలనే చవిచూసింది. మళ్లీ తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, కంపెనీల మిశ్రమ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. అలాగే డాలర్తో మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్ 2,091 పాయింట్లు (2.68%), నిఫ్టీ 566 పాయింట్లు (2.33%) చొప్పున భారీగా క్షీణించాయి.


