భారతదేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే కార్యక్రమం మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు కలిసి జరుపుకునే పెద్ద వేడుక. మన దేశంలో వివాహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే.. చాలామంది తమ పెళ్లిని జీవితంలో గుర్తుండిపోయేలా ఎంతో ఘనంగా నిర్వహించాలని కోరుకుంటారు. దీనికోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.
ప్రస్తుతం భారతీయ పెళ్లిళ్ల విషయంలో రెండు రకాల ఆలోచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది పెళ్లిని ఎంతో వైభవంగా నిర్వహించాలని భావించి భారీగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. మరికొందరు మాత్రం అవసరానికి మించి ఖర్చు చేయకుండా.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆచరణాత్మకంగా పెళ్లి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
ఇలాంటి పెళ్లి ఖర్చులపై.. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం చర్చకు దారితీసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.20 లక్షల బడ్జెట్ ఎలా ఖర్చైపోతుందో ఆమె వివరించారు.
మీనల్ గోయల్ లెక్కల ప్రకారం.. సాధారణంగా రూ.20 లక్షల బడ్జెట్ ఉన్న ఓ పెళ్లిలో ఎక్కువ మొత్తం ఆహారం, వేదిక, అలంకరణ వంటి వాటికే ఖర్చు అవుతోంది. సుమారు రూ.6 లక్షలు భోజనాల కోసం, రూ.5 లక్షలు పెళ్లి వేదిక కోసం, రూ.3 లక్షలు అలంకరణ కోసం ఖర్చవుతాయని తెలిపారు. ఇక ఫోటోగ్రఫీకి రూ.2 లక్షలు, వినోద కార్యక్రమాలు లేదా డీజే కోసం మరో రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని, మిగిలిన రూ.2 లక్షలు ఇతర చిన్నచిన్న ఖర్చులకు వెళ్తాయని వివరించారు.
అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసినా ఆ వేడుకలు కొన్ని గంటలు మాత్రమే ఉంటాయని మీనల్ గోయల్ చెప్పారు. కేవలం 24 గంటల్లోనే రూ.20 లక్షలు ఖర్చైపోతాయని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు.
పెళ్లిళ్లు చేసుకోవద్దని లేదా వేడుకలను తగ్గించుకోవాలని మీనల్ గోయల్ ఉద్దేశ్యం కాదు. కానీ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ఖర్చు చేయాలని సూచించారు. పెళ్లి అనేది కేవలం ఒక రోజు జరిగే వేడుక మాత్రమే కాదని.. దాని తర్వాత ప్రారంభమయ్యే కొత్త జీవితానికి ఆర్థిక భద్రత కూడా ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
పెళ్లిని ఘనంగా జరుపుకోవడం కంటే, పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా, ప్రశాంతంగా సాగడం ముఖ్యం. ఒక రోజు జరిగే వేడుక కోసం అధికంగా ఖర్చు చేసి ఆర్థిక ఒత్తిడిని తెచ్చుకోవడం కంటే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదని సూచించారు.


