సౌర కుటుంబంలోని శని గ్రహం.. తన అందమైన వలయాల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వలయాలు ఎలా ఏర్పడ్డాయి?, ఎలా మార్పు చెందుతున్నాయి?, భవిష్యత్తులో వాటి పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలు మాత్రం ఎవరివికీ పూర్తిగా అర్థం కావడం పోలేదు. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే సైంటిస్టులు ప్రాక్సిస్ అనే కొత్త మిషన్ను రూపొందిస్తున్నారు.
నాసా ఇంతకుముందు పంపిన కాస్సిని (Cassini) మిషన్ శని గ్రహం గురించి చాలా సమాచారం అందించినప్పటికీ.. వలయాల్లోని కణాలను నేరుగా సేకరించి పరిశీలించలేకపోయింది. అందుకే.. ఇప్పుడు ప్రాక్సిస్ పేరుతో మిషన్ ప్రతిపాదించారు. దీని ద్వారానే తొలిసారిగా వలయాల్లోని కణాలను సేకరించి వాటి గురించి తెలుసుకోనున్నారు.
నిజానికి శని వలయాలు నీటి మంచుతో ఏర్పడినవే. వీటిలో చాలా చిన్న ధూళి కణాల నుంచి పెద్ద రాళ్ల వరకు అనేక రకాల కణాలు ఉంటాయి. కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొంటూ, కలుస్తూ, విడిపోతూ ఉంటాయి. ఈ మార్పులను అర్థం చేసుకోవడం ద్వారా.. వలయాల ఆవిర్భావం, పరిణామం గురించి శాస్త్రవేత్తలు మరింత స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చు.
ప్రాక్సిస్ మిషన్లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ప్రత్యేక రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించనున్నారు. ఈ రోబో వలయాల్లోని చిన్న కణాలను సురక్షితంగా సేకరించి వాటి పరిమాణం, నిర్మాణం, రసాయనిక స్వభావం వంటి అంశాలను అక్కడికక్కడే విశ్లేషిస్తుంది. కాబట్టి సమాచారం తొందరగా లభిస్తుంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. ముందుగా కంప్యూటర్ సిమ్యులేషన్లను నిర్వహించిన తరువాత.. ఇది సక్రమంగా పనిచేస్తుందా.. లేదా.. అని పరీక్షిస్తారు. ఆ తర్వాత నిజమైన నమూనాను తయారు చేయనున్నట్లు సమాచారం. ప్రాక్సిస్ మిషన్ విజవంతమైతే.. శని గ్రహం వలయాల గురించి మాత్రమే కాకుండా యురేనస్, నెప్ట్యూన్ వంటి ఇతర గ్రహాల వలయాల గురించి కూడా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్!


