సోషల్ ఖాతాలు, ఈ–మెయిల్స్ యాక్సెస్ను కుటుంబం పొందే వీలుంటుందా?
క్రిప్టోకరెన్సీ వంటి డిజిటల్ వాలెట్ల ‘కీ’తెలియకపోతే పరిస్థితి ఏమిటి?
ఒక ఇంటి పెద్ద మరణిస్తే ఆయన పేరిట ఉండే ఆస్తిపాస్తులు, బంగారం మొదలైన వాటిని వారసులు వీలునామా ప్రకారమో లేదా వాటాల ప్రకారమో పంచుకుంటారు.
మరి అదే మనిషికి చెందిన సోషల్ మీడియా జ్ఞాపకాలు, వ్యక్తిగత ఈ–మెయిల్స్, ఫొటోలు, వీడియోలు మొదలైన డిజిటల్ డేటా, క్రిప్టో కరెన్సీ, యూపీఐ వాలెట్లలోని నగదు వంటి డిజిటల్ కరెన్సీ సంగతేంటి? పాస్వర్డ్ లేదా కీ తెలియకపోయినా వాటిని వారసులు పొందగలరా? చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచినవి..
కంప్యూటర్, మొబైల్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఎల్రక్టానిక్ పద్ధతిలో భద్రపరిచిన లేదా యాజమాన్య హక్కులు కలిగిన విలువైన సమాచారం లేదా డేటా, డబ్బు లేదా క్రిప్టోకరెన్సీలను డిజిటల్ ఆస్తిగా పరిగణిస్తున్నారు. అంటే ఒకరి పేరిట ఆన్లైన్లో ఉండే సామాజిక మాధ్యమ ఖాతాలు, బ్యాంకు ఖాతాలు, ఓటీటీ సబ్స్రి్కప్షన్లు... ఫొటోలు, వీడియోలు, ఈ–మెయిల్స్ వంటి ఫైళ్లు.. యూపీఐ వాలెట్లు, మ్యూచువల్ ఫండ్లు, క్రిప్టో వాలెట్ల వంటివి ఈ కోవలోకి వస్తాయి.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
2024 నాటికి దేశంలో 90 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఒక సగటు వ్యక్తికి కనీసం 6 యాప్లలో ఖాతాలు, 2 బ్యాంక్ ఖాతాలు, 1 యూపీఐ ఐడీ ఉంటోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ నివేదిక ప్రకారం 68% మంది తమ పాస్వర్డ్లను కుటుంబంతో పంచుకోవడంలేదు. ఫలితంగా ఏటా సంభవించే మరణాల్లో ఇలాంటి వారికి చెందిన విలువైన డిజిటల్ ఆస్తులు స్తంభించిపోతున్నాయి. బెంగళూరులో 2022లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మరణించే సమయానికి ఆయన వద్ద రూ. 2 కోట్ల విలువైన బిట్కాయిన్ వాలెట్ ఉండేది. కానీ అందుకు సంబంధించి ‘కీ’తెలియకపోవడం వల్ల ఆయన కుటుంబం కోర్టుకెళ్లినా ‘కీ’లేకుండా వాలెట్ తెరవడం సాధ్యం కాదని కోర్టు తేల్చిచెప్పింది. ముంబైలో 2023లో ఓ మహిళ మరణించగా ఆమె పేరిట ఉన్న యూపీఐ, 3 మ్యూచువల్ ఫండ్ ఖాతాలకు నామినీ లేకపోవడంతో వారసత్వం రుజువు చేసుకోవడానికి ఆ కుటుంబ సభ్యులు 8 నెలలపాటు బ్యాంకుల చుట్టూ తిరిగాల్సి వచ్చింది.
విదేశాలు ఏం చేస్తున్నాయి?
అమెరికాలో 48 రాష్ట్రాలు రివైజ్డ్ యూనిఫామ్ ఫిడ్యూషియరీ యాక్సెస్ టు డిజిటల్ అసెట్స్ యాక్ట్ (ఆర్యుఎప్ఏడీఏఏ) పేరిట ఒక చట్టం తెచ్చాయి. దీని ప్రకారం చనిపోయిన లేదా జీవచ్ఛవంలా మారిన ఒక వ్యక్తి గతంలో రాసిన వీలునామాలో పేర్కొన్న కుటుంబ సభ్యులకు కంపెనీలు డిజిటల్ డేటా అప్పగించాలి. యూరప్లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) కింద డిజిటల్ లెగసీ ఆప్షన్ ఉంది. భారత్లో ఇంకా ప్రత్యేక చట్టం లేనప్పటికీ 2023 ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా కంపెనీలు ఈ తరహా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించాలి. ప్రస్తుతం మెటా, గూగుల్ లెగసీ కాంటాక్ట్, ఇన్ యాక్టివ్ అకౌంట్ మేనేజర్ ఫీచర్లు అందిస్తున్నాయి.
డిజిటల్ డేటాకు భద్రతనిచ్చే 3 అడుగులు
డిజిటల్ వీలునామా
ఒక వ్యక్తికి ఆన్లైన్లో ఉండే రకరకాల ఖాతాల వివరాలను పేర్కొనడంతోపాటు తన తదనంతరం వాటి యాక్సెస్ను ఎవరికి ఇవ్వాలనేది లాయర్ ద్వారా రిజిస్టర్ చేయించుకోవడమే డిజిటల్ వీలునామా.
లెగసీ సెట్టింగ్స్ ఆన్
ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో వారసత్వ సంప్రదింపు ఫీచర్, గూగుల్లో ఇన్ యాక్టివ్ అకౌంట్ మేనేజర్ సెట్టింగ్ను ఆన్లో పెట్టడం ద్వారా ఒక వ్యక్తి డిజిటల్ డేటాను తన తదనంతరం కుటుంబ సభ్యులు పొందేందుకు వీలు కల్పిస్తుంది.
పాస్వర్డ్ మేనేజర్
వన్ పాస్వర్డ్, బిట్ వార్డెన్ లాంటి డిజిటల్ వాల్ట్లలో అన్ని పాస్వర్డ్లు పెట్టి, మాస్టర్ పాస్వర్డ్ను నమ్మకమైన వ్యక్తికి తెలియజేయడం ద్వారా డిజిటల్ డేటాను తమ తదనంతరం కుటుంబ సభ్యులు పొందే అవకాశం కల్పించొచ్చు.


