బ్యాంకు ఖాతా తెరవాలన్నా, కొత్తగా జీవిత బీమా పాలసీ తీసుకోవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా వినియోగదారులు ప్రతిసారీ ఆధార్, పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను సమర్పించే రోజులకు కాలం చెల్లనుంది. దేశవ్యాప్తంగా అన్ని ఆర్థిక సేవలకు ఒకే ఒక్క కామన్ కస్టమర్ ఐడీ అందించే సెంట్రల్ నో–యువర్–కస్టమర్ 2.0 (సీకేవైసీ 2.0) వ్యవస్థ వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెబీ, బీమా నియంత్రణ మండలి సంయుక్తంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి.
ప్రస్తుత వ్యవస్థలో లోపాల సవరణకే..
ప్రస్తుత విధానంలో దేశవ్యాప్తంగా సుమారు 120 కోట్ల కస్టమర్ రికార్డులతో కూడిన ఒక కేవైసీ రిజిస్ట్రీ ఉన్నప్పటికీ అందులో డూప్లికేట్ డేటా, అసంపూర్ణ వివరాలు, పాత సమాచారం ఉండటంతో బ్యాంకులు దాన్ని విస్తృతంగా ఉపయోగించలేకపోతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రతి కొత్త ఖాతా తెరిచేటప్పుడు దరఖాస్తులతోపాటు కేవైసీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. కొత్తగా వస్తున్న సీకేవైసీ 2.0 వ్యవస్థ ఈ లోపాలను పూర్తిగా సవరిస్తుంది. ఇకపై ఒక వినియోగదారుడు ఒక ఆర్థిక సంస్థలో తన కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తే ఆ వివరాలు డిజిటల్ రూపంలో కేంద్ర రిజిస్ట్రీలో భద్రంగా ఉంటాయి. భవిష్యత్తులో వేరే బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు, కొత్త బీమా పాలసీ తీసుకునేటప్పుడు మళ్లీ కాగితాలు సమరి్పంచాల్సిన అవసరం ఉండదు.
ఒక్క ఓటీపీతో సురక్షితంగా..
వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత, గోప్యతకు ఈ వ్యవస్థలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఒక ఆర్థిక సంస్థ కస్టమర్ కేవైసీ వివరాలను కేంద్ర రిజిస్ట్రీ నుంచి పొందాలనుకుంటే.. ఆ కస్టమర్ అనుమతి తప్పనిసరి. ఇందుకోసం వినియోగదారుడి మొబైల్ నంబరుకు వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) పంపిస్తారు. కస్టమర్ ఆ ఓటీపీని నమోదు చేసి సమ్మతి తెలిపాకే బ్యాంకులు, బీమా కంపెనీలు కేంద్ర డేటాబేస్ నుంచి ఆ వివరాలను సేకరిస్తాయి.
రెండు దశల్లో అమలు..
తొలి దశ: వచ్చే నెల ప్రారంభం నుంచి దేశంలోని అన్ని బ్యాంకులు, బీమా కంపెనీలలో ఈ సీకేవైసీ 2.0 సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఖాతాల ఓపెనింగ్, అడ్రస్ అప్డేషన్లు దీని ద్వారా వేగంగా ముగుస్తాయి.
రెండో దశ: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, ఇతర క్యాపిటల్ మార్కెట్ భాగస్వాములకు సంబంధించిన రంగాలు ఈ ఏడాది ఆఖరుకల్లా దీని పరిధిలోకి రానున్నాయి.
నమ్మకాన్ని పెంచే కాన్ఫిడెన్స్ స్కోర్..
ఈ సరికొత్త వ్యవస్థలో అత్యంత కీలకమైన మార్పు కాన్ఫిడెన్స్ స్కోర్ను పరిచయం చేయడం. ఈ విధానం ప్రకారం ప్రతి కస్టమర్ రికార్డుకూ ఒక నిర్దిష్ట స్కోర్ కేటాయిస్తారు. ఈ స్కోర్ ఆధారంగా కస్టమర్ సమాచారం ఎంతవరకు కచ్చితమైనదో, గతంలో ఏ ఆర్థిక సంస్థ దానిని ధ్రువీకరించిందో కొత్తగా చేర్చుకొనే బ్యాంకులకు సులభంగా అర్థమవుతుంది. సమాచార భద్రతకు సంబంధించి ఈ విధానం అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే కేంద్ర రిజిస్ట్రీలో భద్రపరిచే డేటా అధునాతన ఎన్క్రిప్షన్ సాంకేతికతతో రక్షిస్తారు. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్లు, సైబర్ నేరగాళ్లు కస్టమర్ల ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడం సాధ్యం కాదు. ఈ డేటాబేస్ పర్యవేక్షణ నిరంతరం సాగడం వల్ల ఆర్థిక మోసాల నియంత్రణకు, భద్రతను పటిష్టం చేయడానికి దోహదపడుతుంది.
సీకేవైసీ నంబర్ ఇలా తెలుసుకోండి..
గతంలో ఏదైనా బ్యాంకులో, మ్యూచువల్ ఫండ్లో కేవైసీ పూర్తి చేసినప్పుడు కేంద్ర రిజిస్ట్రీ 14 అంకెల ప్రత్యేక సీకేవైసీ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయించి ఉంటుంది. దీన్ని తెలుసుకోవాలంటే ప్రభుత్వ అధీకృత డిజిటల్ కేవైసీ వెబ్సైట్లు, ఆర్థిక సేవల యాప్లలోకి వెళ్లి నో యువర్ సీకేవైసీ అనే లింక్పై క్లిక్ చేయాలి. అక్కడ పాన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ను నమోదు చేయాలి. ఆ వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే 14 అంకెల ప్రత్యేక నంబర్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఈ నంబర్ ద్వారానే సీకేవైసీ 2.0 పరిధిలోకి కస్టమర్ వివరాలు నేరుగా బదిలీ అవుతాయి.


