గంటకు 21 మంది మృతి.. రోడ్డు భద్రతపై ఆందోళన! | Road Accidents in India Claimed Over 1 83 Lakh Lives in 2025 | Sakshi
Sakshi News home page

గంటకు 21 మంది మృతి.. రోడ్డు భద్రతపై ఆందోళన!

Jul 26 2026 9:10 PM | Updated on Jul 26 2026 9:15 PM

Road Accidents in India Claimed Over 1 83 Lakh Lives in 2025

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, వేలాది మంది గాయాలతో జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరోసారి గుర్తు చేస్తున్నాయి.

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025లో దేశవ్యాప్తంగా 5,13,563 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంటే.. సగటున ప్రతి గంటకు 59 ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో 1,83,382 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి గంటకు 21 మంది, రోజుకు సగటున 502 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే.. తమిళనాడులో అత్యధికంగా 71,387 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్యలో మాత్రం ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ఒక్క ఏడాదిలోనే 27,550 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీన్నిబట్టి చూస్తే.. రోడ్డు భద్రత విషయంలో వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది.

ఇక గత కొన్నేళ్లతో పోలిస్తే.. పరిస్థితి మరింత దిగజారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023లో దేశంలో 4.8 లక్షలకు పైగా ప్రమాదాలు నమోదవగా, 2024లో ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పుడు 2025లో ఐదు లక్షలకు పైగా ప్రమాదాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం '4E' (Education, Engineering, Enforcement, Emergency Care) వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం, రహదారులు.. వాహనాల నాణ్యతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

అయితే.. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలంటే ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా చాలా అవసరం. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం, హెల్మెట్ లేదా సీటుబెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి నిర్లక్ష్యాలే చాలా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement