వాషింగ్టన్: ఇరాన్పై భారీ సైనిక దాడి చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. పెంటగాన్ వద్ద ఉన్న వాయు రక్షణ ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతాయని సీనియర్ సలహాదారులు హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. శుక్రవారం ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు, సీనియర్ సలహాదారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా సైన్యం వద్ద పేట్రియట్ ఇంటర్సెప్టర్ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయన్న అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా ఇరాన్పై యుద్ధాన్ని మరింత పెంచాలన్న అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్న సమయంలో అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని హెచ్చరించారు.
వాయు రక్షణ ఆయుధ నిల్వలు తగ్గిపోవడమే అమెరికా వరుస రాత్రి దాడులను నిలిపివేయడానికి ప్రధాన కారణమా, లేక ఈ విరామం కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు పశ్చిమాసియాలో పెద్ద యుద్ధం చెలరేగడం, గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇంధన సరఫరా అంతరాయం, శరణార్థుల సంక్షోభం మరింత పెరగడం వంటి అంశాలపై కూడా ట్రంప్, ఆయన సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్పై పెద్ద స్థాయి యుద్ధ చర్యలు చేపట్టడం సాధ్యమేనని, కానీ అలా చేస్తే పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోతాయని జనరల్ డాన్ కేన్ వ్యక్తిగతంగా ట్రంప్కు వివరించారు.
ముగ్గురు అమెరికా సైనికులు మృతితో..
గత వారం జోర్డాన్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అమెరికా వాయు రక్షణ వ్యవస్థను దాటి దాడి చేయడంతో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన ఘటన తర్వాత ఈ చర్చలు జరిగాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
శుక్రవారం అమెరికా బలగాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని, దాడికి రెడీగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించినా, చివరకు భారీ బాంబు దాడులకు ఆయన అనుమతి ఇవ్వలేదు. ఈ వారం ప్రారంభంలో ఆక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత భారీ దాడి చేయించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నాను. నిర్ణయానికి చాలా దగ్గరగా ఉన్నాను. అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం" అని ట్రంప్ చెప్పారు.
ఇరాన్ తీర ప్రాంత రాడార్లు, నౌకలపై దాడి చేసే క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకాదళ వాహనాలు, రవాణా వ్యవస్థలు, పిక్యాక్స్ పర్వతం అడుగున ఉన్న భూగర్భ అణు కేంద్రం వంటి వ్యూహాత్మక లక్ష్యాలపై పలుదశల్లో దాడి చేసే ప్రణాళికలను పెంటగాన్ సిద్ధం చేసింది. అయితే దీర్ఘకాలం దాడులు కొనసాగితే ఇప్పటికే తగ్గిపోయిన క్షిపణి నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని అధికారులు హెచ్చరించారు.
ట్రంప్ సీనియర్ సలహాదారుల్లో పలువురు, జారెడ్ కుష్నర్ సహా, భారీ సైనిక దాడికి బదులుగా నిరంతర దౌత్య చర్చలు, ఆర్థిక ఒత్తిడి కొనసాగించే వ్యూహానికే మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో, అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. దాదాపు రెండు వారాలుగా నిరంతరంగా సాగిన వైమానిక దాడుల తర్వాత అమెరికా సైన్యం తొలిసారి రాత్రి దాడులను నిలిపివేసింది. తాత్కాలిక కాల్పుల విరమణను పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై రాజీ మార్గం కనుగొనేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
అయితే ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతుతో ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని యాన్బు, జిజాన్ ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టు ప్రకటించారు.హోదైదాపై సౌదీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే అరామ్కోకు చెందిన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని వారు తెలిపారు.


