వాషింగ్టన్/జెరూసలేం: అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం (ఐసీసీ) జారీ చేసిన అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి (యూఎన్జీఏ)హాజరైతే అరెస్టు చేస్తామంటూ న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్దానీ వ్యాఖ్యలు సమాజంలో ద్వేషాన్ని నూరిపోసేలా ఉన్నాయని ఆరోపించారు. మేయర్గా ఉన్న వ్యక్తి యూదులు, క్రైస్తవులు, ముస్లింలతో సహా పౌరులందరికీ ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
‘ఫాక్స్ న్యూస్’ ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘మమ్దానీ తీరు వల్ల ప్రస్తుతం యూదు అమెరికన్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, సెప్టెంబరు 8న ప్రారంభమయ్యే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి నేను హాజరై, ఇజ్రాయెల్ తరఫున, ఇజ్రాయెల్-అమెరికా భాగస్వామ్యం తరఫున సత్యాన్ని చాటిచెబుతాను’ అని స్పష్టం చేశారు. ఐసీసీ తనపై మోపిన యుద్ధ నేరాల ఆరోపణలను ఆయన ‘న్యాయ ప్రక్రియకే వికృత రూపం’ అని అభివర్ణించారు. ఆ కోర్టుకు ఇజ్రాయెల్ లేదా అమెరికాపై ఎటువంటి అధికార పరిధి లేదని, అది ఒక ‘కంగారూ కోర్టు’ అని కొట్టిపారేశారు.
గాజా యుద్ధంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 2024 నవంబరులో నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్లపై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అంతర్జాతీయ చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలని, ఈ వారెంట్ను తీవ్రంగా పరిగణించాలని మమ్దానీ పేర్కొనగా, నెతన్యాహు అరెస్టు కాకుండా చూస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. గాజాలో నెరపిన మిలిటరీ చర్యలపై వచ్చిన అన్ని ఆరోపణలను, ఐసీసీ పరిధిని ఇజ్రాయెల్ ఇప్పటికే తోసిపుచ్చింది.
ఇది కూడా చదవండి: ఎన్డీఏ పాలనలో విద్యాశాఖ వివాదాలు


